Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-5

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[మేనమామ కూతురు సుమతితో రామ్మూర్తి వివాహం జరిగిపోతుంది. పెద్దలు సంతోషించినా, సుమతికి ఈ పెళ్ళి ఇష్టం లేదని గ్రహిస్తాడు రామ్మూర్తి. కూతురి మనసు తానే పాడు చేశానని బాధపడుతుంది అనసూయ. శోభనం రోజున రామ్మూర్తిని దూరంగా ఉంచుతుంది. తరువాత, పెద్దలు ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా రాజీపడలేకపోతుంది సుమతి. కొడుకు వైవాహిక జీవితం ఇలా అయినందుకు శాంతమ్మ బాధపడుతుంది. అనసూయ చనిపోతుంది, భుజంగరావు నిస్సహాయుడైపోతాడు. భార్య వైద్యానికి, ఒకప్పటి తన వ్యసనాలకి, సుమతి పెళ్ళికి డబ్బంతా ఖర్చయిపోగా, ఆర్థికంగా కూడా క్రుంగిపోతాడు భుజంగరావు. రంగిని, అప్పన్నని వేరే చోట పని చూసుకోమంటే, వాళ్ళు ఒప్పుకోరు. ఉన్న ఎకరం పొలంలోనే కూరగాయలూ, పూల మొక్కలు వేద్దామని, ఆ వచ్చే ఆదాయంతో బ్రతకవచ్చని ధైర్యం చెబుతారు. పొలంలో ఆడుతూ పాడుతూ పనిచేస్తున్న రంగీ, అప్పన్నలను చూసినప్పుడు రామ్మూర్తి పట్ల తన ప్రవర్తనకి బాధపడుతుంది సుమతి. కానీ అంతలోనే తన స్నేహితుల భర్తలు, వాళ్ళ సంపన్న జీవితం గుర్తొచ్చి, రామ్మూర్తిని అసహ్యించుకుంటుంది. అందరినీ పల్లె లోనే ఉంచి, తాను పట్నంలో టీచర్ ఉద్యోగానికి వెళ్ళిపోతాడు రామ్మూర్తి. – ఇక చదవండి.]

అధ్యాయం 9

సుందరం నుండి ఉత్తరం వచ్చింది. తను వస్తున్నట్లు. పెళ్ళికి పిలవనందుకు నిష్ఠూరంగా వ్రాసాడు. సుందరంతో తనకి పరిచయం అయిన సంఘటన తలుచుకుంటున్నాడు రామూర్తి. తను టీచరు ట్రైనింగుకి వెళ్తున్న సమయం. ట్రైనింగు అవబోయే ఊరు తనకి పరిచయం లేని ప్రదేశం. ‘ఎక్కడ ఉండాలి? ఏు చేయాలి? తిండి సంగతేంటి? ఈ సాధక బాధకాలన్నీ ఆలోచించకుండా లేడికి లేచిన వెంటనే ప్రయాణం అన్నట్టు బయలుదేరి వచ్చేసేను,’ రామూర్తి మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తోంది.

“నా పేరు సుందరం. మీరు ఏ ఊరు నుండి వస్తున్నారు?” ఆ ప్రశ్నకి తలెత్తి చూశాడు రామూర్తి. తన ఎదుటి సీటులో కూర్చున్న యువకుని పై నిలిచాయి అతని చూపులు. ఇంచుమించు తన వయస్సే ఉంటుంది అనుకున్నాడు. సుందరం వదనంలో సంస్కారం ఉట్టి పడుతోంది. సంస్కారానికి తగ్గ మంచితనం దానితో పోటీ పడ్తున్నాయి. బాధలన్నీ మరిపింప చేసే అతని మందహాసం మనస్సుకి ఆహ్లాదం కలిగిస్తోంది.

“టీచరు ట్రైనింగుకి విజయనగరం వెళ్తున్నాను.”

రామూర్తి మాట వినగానే సుందరం వదనంలో ఆశ్చర్యంతో పాటు సంతోషం. “నేనూ అక్కడికే.”

“నాకంతా అయోమయంగా ఉంది. ఇన్నాళ్ళూ గ్రామ వాతావరణంలో చదువు సాగించిన నేను కొత్త ప్రదేశంలో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడ్తున్నాను,” రామూర్తి గాఢంగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు. సుందరం రామూర్తిని నిశితంగా పరికిస్తున్నాడు. అతనిలో దాగి ఉన్న భావాలు, సంఘర్షణలు అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘మంచివాడు, తన లాంటి వాడికి తగిన వాడు. ఇతనితో తనకి స్నేహం ఇట్టే కలిసిపోతుంది. తనూ భయపడ్డాడు మొదట. కాని రామూర్తిలాంటి వాళ్ళ సాంగత్యం లభిస్తే ఏు భయం లేదు,’ సుందరం ఆలోచిస్తున్నాడు.

“మీకేం పరవాలేదు. నాకు తెలిసిన ఓ ఆయన తన బంధువులు ఇంట్లో నాకు ఓ గది అద్దెకు ఇప్పించాడు. కావల్సిన వస్తువుల్ని కూడా సమకూర్చుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం ఒక గదిలోనే ఉందాం. డబ్బు కూడా కల్సి వస్తుంది,” సుందరం అన్నాడు. రామూర్తికి అతని సలహా నచ్చింది. ఆ భగవంతుడే తన సమస్యకి పరిష్కారం చూపించాడా అన్నంత ఆనందపడిపోయాడు.

కొద్ది రోజుల్లోనే అరమరికలు లేకుండా వారిద్దరి మధ్యా స్నేహలత దట్టంగా అల్లుకుని గాఢమైన స్నేహంగా చిక్కబడసాగింది. ఇద్దరి అభిరుచులు, భావాలు ఒక్కటే కావడం వల్ల మరింత బలపడిరది. రామూర్తి స్నేహం గురించి ఒక్కొక్క పర్యాయం భావోద్వేగంతో ఆలోచిస్తూ ఉంటాడు.

రక్త సంబంధీకుల మధ్య రాగద్వేషాలు ఉండే అవకాశం ఉంది కాని నిజమైన స్నేహితుల మధ్య ఎలాంటి భేషజాలు అరమరికలు ఉండవు స్నేహ సౌధానికి పరస్పర విశ్వాసమే బలమైన పునాది. నిజమైన స్నేహంలో శరీరాలు వేరయినా, వారి ఆత్మ మాత్రం ఒక్కటే. వారి భావాలు, మాటలు, ఒకటిగానే ఉంటాయి వారి గుండెల్లో. బంధువులు కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని ఎన్నోన్నో విషయాలు స్నేహితులతో పాలుపంచుకోగలం.

స్నేహం అన్నమాట ఎప్పటికీ నిత్య నూతనం. డబ్బుకి విలువ ఇచ్చే నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ పతనం చెందుతున్నప్పటికీ, స్నేహ బంధం మాత్రం పటిష్ఠంగా ఉంటోంది. రక్త సంబంధీకుల మధ్య మాటలు కరువైపోతున్న ప్రస్తుత రోజుల్లో అలసిన హృదయాలకు కాస్త స్వాంతన చేకూర్చేది స్నేహ బంధమే.

స్నేహం స్నేహితుడి తడిసిన కనులను తుడుస్తుంది. చెమరించిన కన్నుల్లో చెదిరిపోని జ్ఞాపకం స్నేహం. ఒడుదొడుకుల్లో, కష్టాల్లో చెదిరిపోని జ్ఞాపకం స్నేహం. ఒడుదొడుకులు ఓదార్పునిచ్చి ఒడ్డున చేర్చే అభయ హస్తం స్నేహం. ప్రతిఫలం ఆశించకుండా తోడై నిలిచేది స్నేహం.

అయితే నేట యాంత్రిక యుగంలో మానవ జీవితం కాలంతోపాటు పోటీ పడ్తూ పరుగులు తీస్తోంది. మనిషికి స్నేహ బంధం ఏడారిలో నీటి చెలమలా కనిసిస్తుంది. సమస్యల్తో సతమతమవుతున్న మనిషికి స్నేహమే కాస్తంత ఉపశమనం ఇస్తుంది.

మన బాధలను పంచుకోడానికి స్నేహం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. బాధలు చుట్టు ముట్టినప్పుడు మనసు కుదుటపడాలంటే భరోసా ఇచ్చే స్నేహ హస్తం అవసరం. మానసికంగా కుంగుబాటుకు లోనై నిరాశా, నిశ్పృహలు ఆవరించినప్పుడు తిరిగి మనలో ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి మంచి స్నేహితుడు కావాలి.

టీచరు ట్రైనింగు కాలం చాలా సాఫీగా సాగిపోతోంది. సుందరం సాంగత్యంలోని ట్రైనింగు విద్యార్ధుల మధ్య తన బాధను కొంతవరకూ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రామూర్తి. సుందరానికి, రామూర్తికీ ఇద్దరికీ బాధలున్నాయి. రామూర్తిది ఒక రకమైన బాధయితే సుందరానిది మరో రకమైన బాధ. రామూర్తీ తన బాధను తన హృదయం అడుగు పొరల్లో దాచేసుకుంటే, సుందరం గలగలమని నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ గలగలమని శబ్దం చేస్తూ ప్రవహించే సెలయేరులా సంతోషంతో, కేరింతల్తో, మందహాసంతో కాలం గడిపెస్తూ తన బాధని కొంత వరకైనా మరచిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ రోజు తల్లి నుండి వచ్చిన ఉత్తరాన్ని అపురూపంగా చదువుకుంటూన్నాడు రామూర్తి.

“ఎక్కడ నుండి ఆ ఉత్తరం?” సుందరం అడిగాడు.

“అమ్మ వ్రాసిన ఉత్తరం.”

“అమ్మ వ్రాసిన ఉత్తరం నీకు సంతోషం కలిగిస్తోందా?”

“ఎందుకు కలిగించదు. అమ్మ గురించి నీకు తెలుసో తెలియదో కాని సృష్టిలో అమ్మ ఒక విలక్షణమైన వ్యక్తి మన జన్మకి కారకురాలు ఆమే. సహనానికి మూరు పేరు అమ్మ. ఆమె తన పిల్లలకు నిజమైన మార్గదర్శి. వేదనలో ఆనందాన్ని పంచి ఇస్తుంది. ఆమె చల్లని ఒడిలో మొదలైన తొలి అడుగులో తనబాటును బ్రతుకు బాటలో పొరపాట్లను సరిదిద్దే సమర్థురాలు ఆమె. తన పిల్లలు మంచి మార్గంలో నడిచేందుకు ఆమె పవిత్రమూర్తిగా మారుతుంది. అలాంటి త్యాగమూర్తి ఋణం తీర్చుకోలేము. అమ్మ వలనే పిల్లల జీవితాలు ఆనందమయంగా సాగుతాయి.

అమ్మతో ఉన్న అనుబంధం గొప్పది అన్ని అనుబంధాల కంటే. ఎన్నో ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ తన కుటుంబ అవసారాలు తీరుస్తూనే తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. తన కుటుంబం అంటే అమ్మకి ప్రాణం. ఆమె పిల్లలకి తినిపించిన గోరు ముద్దలు ఎవరు తినిపించగలరు? ఆమె పాడిన లాలి పాటల్లో ఉన్న మాధుర్యానికి కరిగిపోయి నిద్రలోకి జరుకుంటారు పిల్లలు. ఆమె తన కుటుంబ సభ్యుల ఆలనా పాలనా చూసుకోడానికి తహతహలాడుతుంది. అటువంటి అమ్మ నిజంగా దేవతే.”

రామూర్తి తన తల్లి గురించి ఇలా చెప్పుకుపోతున్నాడు. పరిసరాలను మరిచిపోయి. అతను చెప్తున్నది వింటున్న సుందరంలో భావోద్వేగం. ఇన్నాళ్ళ నుండి మనసు అడుగు పొరల్లో దాచుకున్న బాధంతా సుడులు సుడులుగా బయటకు వస్తోంది. దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. ఒక్కసారి బోరున విలపిస్తున్నాడు.

ఈ హఠాత్‌ పరిణామానికి స్తంభించిపోయాడు సుందరం. ఇన్నాళ్ళు గలగలమని పారే సెలయేరులా ఉండే సుందరం, తను అందర్నీ నవ్విచే సుందరం ఇలా డీలా పడి విలపించడం రామూర్తికి ఆశ్చర్యం కలిగించింది.

“సుందరం.. సుందరం, ఏుటిది? ఎందుకిలా ఏడుస్తున్నావు. నీ మనస్సుకి కష్టం కలిగించే ప్రస్తావన నేను తెచ్చానా?” సుందరం తలను తన ఒడిలో ఉంచుకుని ఓదార్పు మాటల్లో అన్నాడు రామూర్తి.

“నన్ను ఏడవనీ.. బాగా ఏడవనీ. ఇన్నాళ్ళూ నా మనస్సులో గూడు కట్టుకున్న బాధంతా ఇలా నా కన్నీటి రూపంలో ప్రవహించనీ. అలాగయినా మనస్సు తేలిక పడుతుంది,” వెక్కిళ్ళ మధ్య అన్నాడు. మరి మాట్లాడకుండా రామూర్తి అతని తల నిమురుతూ అలా ఉండిపోయాడు.

కొంత తడవ ఏడ్చిన తరువాత సుందరం మనస్సు తేలిక పడింది. ఇది సహజమైన స్వాభావిక ప్రక్రియ. అందులోనూ మనకి ఆత్మీయుల ఓదార్పు లభిస్తే మరింత దుఃఖం నుండి ఊరట కలిగి మనస్సు తేలిక పడుతుంది. ఆ స్నేహ హస్తం తగలగానే ఓదార్పు లభిస్తుంది.

లేచి కూర్చున్నాడు సుందరం. కన్నీళ్ళు తుడుచుకున్నాడు. రామూర్తి గ్లాసుతో మంచి నీళ్ళు తీసుకువచ్చాడు. మంచి నీళ్ళు త్రాగిన తరువాత కొంత దుఃఖం నుండి ఉపశమనం లభించింది సుందరానికి.

“రామూర్తీ! నీవు చాలా అదృష్టవంతుడివిరా. అమ్మ ప్రేమ గురించి అంత గొప్పగా నీవు చెప్తూ ఉంటే ఆ మాతృమూర్తి ప్రేమకి నోచుకోని అభాగ్యుడును అనుకున్నాను. అమ్మ ప్రేమలో అంత గొప్పదనం ఉందన్న విషయం ఇప్పుడే నీ మాటల ద్వారా తెలిసింది. ఏదయితేనేు నీవు నా కన్నా ఎంతో అదృష్టవంతుడివి” అన్నాడు.

“ఇన్ని రోజులు మనం కలిసి ఉంటున్నా ఎప్పుడూ ఆనందంగా – సంతోషంగా ఉండేవాడివి కాని ఇలా ఎప్పుడూ భావోద్వేగానికి లోనవలేదు నీవు. ఈ రోజు ఎందుకిలా డీలా పడ్డావో తెలియదు. నీ వ్యక్తిగత విషయాలు గురించి కూడా నాకు తెలియదు. నా విషయాలు నీకు చెప్పేనే కాని నీ విషయాలు నేను అడగలేదు. ఆ అవసరం కూడా రాలేదు” రామూర్తి అన్నాడు.

“రామూర్తీ! మనస్సు వస్త్రం లాంటిది. వస్త్రాన్ని నీటిలో తడిపి తీస్తే బరువుగా ఉంటుంది. నీటిని పిండి వేస్తే వస్త్రం తేలిక అవుతుంది. అలాగే మనస్సు బాధ అనే నీటితో తడిపిపోయి బరువెక్కినప్పుడు ఉపశమనం లభిస్తే ఆ బాధ అనే బరువు దిగిపోతుంది,” సుందరం అన్నాడు.

సుందరం నోటి వెంబడి ఇటువంటి బరువైన మాటలు రావడం రామూర్తికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే ఎప్పుడూ హుషారుగా సంతోషంగా అగుపడ్తాడు సుందరం.

రామూర్తే ఒక్క పర్యాయం డీలాపడి ఆలోచన్లలో గడిపేవాడు. ట్రైనింగు సమయంలో ఆలోచించడానికి కూడా అవకాశం లేనంత వ్రాత పని ఉన్నా తీరిగ్గా ఉన్న సమయంలో జరిగిపోయిన, జరుగుతున్న విషయాలు ఆలోచించడంలో అతని మనస్సు బాధతో నిండిపోయేది. అలాంటి సమయంలో అతను ఏకాంతం కోరుకునేవాడు. అలాంటి సయమంలో సుందరం చూసినప్పుడు “ఒరే రామూ! ఏుటి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన్లు నాతో పంచుకోవచ్చు కదా!” అని అడిగాడు.

“ఏమీ లేదు.”

“నా దగ్గర అబద్ధం అడకు. మీ మామయ్య కూతురు తలంపుకు వచ్చి ఉంటుంది. విరహాగ్నిలో దహించుకుపోతూ పగటి కలలు కంటున్నావు. నాకు తెలియక అడుగుతున్నాను మీ మరదలకి ఓ ప్రేమలేఖ వ్రాయచ్చు కదా! అలా వ్రాస్తే ఎంత మజాగా ఉంటుందో తెలుసా? నీకు వ్రాయడం రాకపోతే నా సహాయం తీసుకో,” గల గల నవ్వుతూ అన్నాడు సుందరం.

సుందరం మాటలకి రామూర్తి వదనం వివర్ణమయ్యేది. తన భావాల్ని బయటకు బహిర్గతమవకుండా జాగ్రత్తపడేవాడు. అయినా సుందరం పసిగట్టేసేవాడు. సుందరం మాటలకి తనూ నవ్వే వాడుకాని ఆ నవ్వులో కృత్రిమతే.

“ఏంటిరా నాయనా ఆ నవ్వు. వెయ్యి లంకణాలు చేసిన వాడి నవ్వులా ఉంది.”

“ఒరే సుందరం! నన్ను ప్రశాంతంగా వదిలెయ్యి. నీకు పుణ్యం ఉంటుంది. ఈ సమయంలో నా మనస్సు ఏకాంతాన్ని కోరుకుంటోంది,” ప్రాధేయపడ్తున్నట్టు అనేవాడు రామూర్తి.

“ఏంటో నీ మనస్తత్వం నాకు అర్థం కావటం లేదు” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. అలా తనని ఆట పట్టించిన సుందరం అలా డీలాపడి విలపించడం రామూర్తికి నిజంగా విస్మయాన్నే కలిగించింది.

“నీ బాధను నాతో పంచుకోవచ్చు కదా! అలాగైనా మనస్సు తేలిక పడుతుంది,” రామూర్తి అన్నాడు.

“ఏదో రోజు నా గురించి నీకు చెబుదామనుకున్నాను. ఆ సందర్భం ఇలా వస్తుందని మాత్రం అనుకోలేదు,” అన్న సుందరం రామూర్తికి తన గురించి చెప్తున్నాడు.

అధ్యాయం 10

సుందరం జీవితం గురించి చెప్పుకునే ముందు బాల్యం గురించి చెప్పుకోవాలి. మనిషి జీవితంలో – అత్యంత మధురమైన దశ బాల్యం. అమ్మ ఒడిలో సేద తీర్చుకునే రోజులు, తల్లి జోల పాటల్లో, తినిపించే గోరు మద్దుల్లో, ముద్దు మురిపాల్లో, ఆడుకునే ఆటల్లో, పాడుకునే పాటల్లో రోజులు ఆనందంగా గడిచిపోతాయి. అయితే అందరి బాల్యాలూ సుఖవంతంగా ఉండవు. తల్లి ప్రేమకు దూరమైన వారి బాల్యాలు నికృష్టంగా, బాధకరంగా ఉంటాయి.

మనిషి జీవితంలో బాల్యం ఒక కలలాంటిది. అయితే ఇప్పుడు మాత్రం బాల్యం కన్నీటి కల సుందరానికి. బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అంటే మనిషి తనని తాను తెలుసుకోవడం. మనకి సాధారణంగా బాధకలిగినప్పుడే బాల్యం గుర్తుకు వస్తుంది.

పిల్లల మనస్సు కల్లాకపటం ఎరుగనిది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఆట పాటల్తో గడిచిపోయే సమయం. అరవిరిసిన పువ్వులా, స్వచ్ఛంగా బాల్యంలో మాత్రమే మనం నవ్వుగలుగుతాం. అరమరికలు లేకుండా బాల్యంలో మాత్రమే జీవించగలం. ఆ సమయంలో పిల్లల మనస్తత్వాన్ని అమాయకత్వాన్ని లాలిత్యాన్ని సున్నితత్వాన్ని నిష్కలంక స్నేహ మాధుర్యాలను బాల్యం గుర్తు చేస్తుంది.

పిల్లలకి కావల్సింది బాల్యంలో సాంత్వన. అది ఒక అపూరూపమయిన సాంత్వన అయి ఉండాలి. ఎడారిలో ప్రయాణిస్తున్న మనిషికి ఒయాసిస్‌ కనిపిస్తే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటిదే బాల్యం.

బాల్యం గురించి ఇంతగా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే సుందరానికి ఇటువంటి మధురమైన బాల్యం దక్కలేదు. తల్లి ప్రేమకి కొంతమంది బాల్యాలు నోచుకోవు.

చాలా బాధాకరమైన బాల్యమే సుందరానిది. పుట్టిన రెండు సంవత్సరాలికే తల్లికి దూరమయ్యాడు. ఆమె ప్రేమానురాగాలు ముద్దు మురిపాలు, పాడిన జోల పాటలు, తినిపించిన గోరు ముద్దలు, బాధ కలిగినప్పుడు లభించే స్వాంతనకు అన్నిటికీ దూరమయ్యాడు.

తల్లి చనిపోయిన సంవత్సరం అవగానే తండ్రి తిరిగి పెళ్ళి చేసుకున్నాడుట. తల్లి చావు అతనికి తెలియదు. తండ్రి తిరిగి పెళ్ళి చేసుకోవడం ఇవేవీ సుందరానికి తెలియదు. అవి అతనికి ఊహరాని రోజులు. ఊహ వచ్చిన తరువాత తల్లి తమ్ముడ్ని ఏు అనకుండా తనని ఒక్కడినే చిత్రహింసలకి గురి చేయడం చూసి తనని ఒకలా తమ్ముడ్ని మరోలా చూడడం గమనించి ఈవిడ తన తల్లి కాదు మారటి తల్లి అని తెలిసింది. తనకి ఊహ తెలిసినప్పటి నుండి తిట్లు తినేవాడు, దెబ్బలు తినేవాడు, ఈసడింపులుతో అతని జీవితం గడిచిపోతోంది.

“ఎంత మారుటి తల్లి అయినా, ఎంత స్వంత కొడుకు కాకపోయినా ఇలా పాపం పసివాడ్ని చిత్రహింసలకి గురి చేస్తుందా? ఈవిడా ఓ ఆడదేనా?” ఇరుగు పొరుగు వాళ్ళు అనేవారు. దిన దిన గండం దీర్ఘాష్యులా సుందరం జీవితం గడిచిపోతోంది. అతని తండ్రి అయితే ఇంటి విషయాలు ఏవీ పట్టించుకునేవాడు కాదు.

సుందరానికి మారుటి తల్లి సరిగా తిండి పెట్టేదికాదు. కర్రతో బాదేది. ఏడుపు వినబకుండా నోట్లో గుడ్డలు కుక్కేది. ఒక్కొక్కసారి శరీరం మీద వాతలు పెట్టేది. బాధ భరించలేక విలవిల్లాడేవాడు సుందరం. తన కొడుకుని సరిగా చూసుకునే మారుటి తల్లి సుందరం ఎడల ఇలా ప్రవర్తించడం సుందరం తట్టుకోలేకపోయేవాడు.

తన కన్నీళ్ళను తుడిచి కష్టాల నుండి తనకి విముక్తి కలిగించే వాళ్ళు ఎవ్వరూ లేరా? అని వాపోయేవాడు సుందరం. మా అమ్మాయితోనే బంధం తెగిపోయిందని సుందరం అమ్మ తరుపువాళ్ళు రావడమే మానుకున్నారు. ‘ఇలాంటి జీవితం నేను భరించలేను,’ అని అనుకునేవాడు సుందరం ఒక్కొక్క పర్యాయం.

నాలుగు గోడల మధ్యా బంధించి తలుపులేసి పిల్లిని కొట్టడానికి ప్రయత్నిస్తే పిల్లి కూడా పులిలా గాండ్రిస్తూ తిరగబడ్తుంది. సుందరం పరిస్థితి అలాగే అయింది. మారుటి తల్లి వాతపెట్తున్న సమయంలో బాధ తట్టుకోలేక వెంటనే ఆమె చేతిలో ఉన్న ఇనపకడ్డీ తీసుకుని తిరిగి ఆమె చేతి మీద వాత పెట్టాడు.

అప్పుడు తెలిసింది మారుటి తల్లికి బాధ ఎలా ఉంటుందో అని. లబోదిబో అని అరుస్తోంది. తండ్రికి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు అని అనుకున్న సుందరం ఇల్లు వదిలి పరుగు తీసాడు. పరుగు తీసి తీసి అలసిపోయాడు. దాహం ఒక వేపు. ఆకలి మరో వేపు. నిస్సత్తువ. బస్సు ఆగింది. బస్సులో ప్రవేశించి సొమ్మసిల్లి పడిపోయాడు. బస్సులో వాళ్ళు కంగారుపడ్డారు. సుందరానికి తెలివి వచ్చిన తరువాత తన వాళ్ళ గురించి అడిగారు. సుందరం తనకి ఎవరూ లేరు అనాథను అని చెప్పాడు. జాలి గల ఓ పెద్దాయన సుందరాన్ని ప్రేమ సమాజం మేనేజరు దయా సాగర్‌కి అప్పగించాడు. దయా సాగర్‌ ఆ అప్పగించిన ఆయనకి స్నేహితుడు. మేనేజరు దయా సాగర్‌ పేరుకు తగ్గట్టు దయకి సాగరుడే.

దయా సాగర్‌ సుందరం దెబ్బలకి వైద్యం చేయించాడు. ‘ఎవరి పిల్లవాడో ఏంటో? ఎవరైనా వస్తే అప్పజెప్పవచ్చు, లేకపోతే ఇక్కడే ఉంటాడు, అందరితో పాటూ’ అని అనుకున్నాడు. సుందరం చాలా తెలివైన వాడు కాబట్టి ప్రేమ సమాజంలో అందరి కన్నా మొదట ఉండేవాడు. అందుకే దయా సాగర్‌కి సుందరం అంటే అభిమానం. సుందరం తాలూకా వాళ్ళు కూడా ఎవ్వరూ రాలేదు. ప్రేమ సమాజంలోనే అతని జీవితం గడిచిపోతోంది.

మేనేజరు అనుమతి తీసుకుని ట్యూషన్లు చెప్పేవాడు. అలా వచ్చిన డబ్బును పోస్టాఫీసులో దాచుకునేవాడు. ప్రేమ సమాజంలో చదువులో వెనకబడిన పిల్లలకి కూడా చదువు చెప్పేవాడు. అందుచేతే మేనేజరు కూడా సుందరం బయట ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదిస్తున్నా ఏం అభ్యంతరం చెప్పలేదు. సుందరం ఒక వేపు తన చదువు సాగిస్తూనే బయట ట్యూషన్లు చెప్పేవాడు.

***

తన గురించి చెప్పడం ఆపు చేశాడు సుందరం. ‘ఇంత విషాదం సుందరంలో దాగి ఉందా? అలా ఎప్పుడూ అగుపడడే. ఆ విషాదాన్ని తన గుండెల్లో దాచుకుని ఇలా సంతోషంగా ఎలా ఉండ గలుగుతున్నాడు? అతని జీవితం దగ్గర తన జీవితమే కాస్తంత మెరుగ్గా ఉంది,’ అని అనుకున్నాడు రామూర్తి.

“నీ జీవితంలో ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు, ఇన్ని మలుపులు ఉన్నాయని నేను అనుకోలేదు,” సుందరంతో అన్నాడు. సుందరం గాఢంగా నిట్టూర్పు విడిచాడు. అతని నిట్టూర్పు చూడ్డం రామూర్తికి అదే మొదటిసారి.

“చూశావు కదా నా బాల్యం పిడికిల వేళ్ళ సందులోంచి జారిన ఇసుకలా ఎలా జారిపోయిందో? అర చేతికి అంటిన మట్టిలా మిగిలిపోయింది. కాల చక్రం మనిషి జీవితాన్ని తనతో నడిపిస్తూనే ఉంది. ఆ కాలంతో పాటే మన జీవితంలో వచ్చిన మార్పుల్ని ఆస్వాదించడమే మన పని,” అన్నాడు సుందరం.

***

‘సుందరం తన పెళ్ళి శుభలేఖ ఇయ్యడానికి వస్తున్నట్లు తెలియజేసిన తరువాత అతని గురించి ఇంతగా ఆలోచించవల్సి వచ్చింది,’ రామూర్తి అనుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version