Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-4

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సంక్రాతి పండుగ వస్తుంది. సుమతి స్నేహితులతో కల్సి వీధిలో నడుస్తూంటుంది. వాళ్ళల్లో పద్మజ అనే స్నేహితురాలు తనకి తండ్రి కొనిచ్చిన రాళ్ళ నెక్లెసుని చూపిస్తుంది. అది చూసి సుమతి లోలోపల బాధపడుతుంది. పద్మజ వైభవం చూసి, మనసులో తన దుస్థితికి తన మీద తానే జాలిపడుతుంది. సుమతి అన్యమనస్కంగా ఉంటే బావని తలచుకుని ఊహాల్లో ఉందంటూ చమత్కరిస్తారు నేస్తాలు. ఇంతలో ఒక అమ్మాయి, మీ బావతో నీ పెళ్ళికి మీ అమ్మ అంగీకరిస్తుందా అని సుమతిని అడుగుతుంది. తనని బావంటే గిట్టదని, తను అతన్ని చేసుకోనని చెప్తుంది. వాతావరణం గంభీరంగా మారడం చూసి, సరోజ ఏవో కబుర్లు చెప్పి తేలికపరుస్తుంది. ఎవరికిళ్ళకి వాళ్ళు వెళ్తారు. ఇల్లు చేరాకా, బావకీ తనకీ పెళ్ళేంటి అని తల్లిని అడుతుంది. ఏం అనుకోలేదని, నాన్న అనుకున్నంత మాత్రాన అయిపోదని ఆమె అంటుంది. కాలం గడుస్తుంది. రామ్ముర్తి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి, మిషనరీ స్కూల్లో టీచరుగా చేరుతాడు. మేనమామ భుజంగరావు పేకాటలో ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు. రంగ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. సుమతి నిరాశలో కూరుకుపోతుంది. మనోవ్యాధితో అనసూయ మంచం పడుతుంది. తన తప్పుల్ని క్షమింమని శాంతమ్మని వేడుకుంటుంది. శాంతమ్మ ఆమెను క్షమిస్తుంది. సుమతిని రామ్మూర్తికి చేసుకోమని భుజంగరావు, అనసూయ శాంతమ్మని బ్రతిమాలుతారు. సరేనంటుంది. అనసూయ కూతుర్ని పిలిచి తారుమారైన తమ పరిస్థితిని వివరించి, బావని పెళ్ళి చేసుకోమని కోరుతుంది. అదే సమయంలో, శాంతమ్మ కూడా సుమతిని చేసుకోమని రామ్మూర్తిని ఒత్తిడి చేస్తుంది. చివరికి మేనమామ కూడా అడిగేసరికి, అయిష్టంగానే సమ్మతిని తెలియజేస్తాడు రామ్మూర్తి. – ఇక చదవండి.]

అధ్యాయం 7

నుదుటిన బాసికం, కళ్యానం బొట్టు, కళ్ళకి కాటుక, బుగ్గన దిష్టి చుక్కతో పెళ్ళి కొడుకుగా పెళ్ళి పందిర్లో అటు ఇటు తిరుగుతూ మామయ్య భుజంగరావుకి సహాయపడ్తున్నాడు రామూర్తి. పెళ్ళి కళ అతనిలో కొట్టొచ్చినట్టు అగుపడుతోంది.

ఎవ్వరితోనూ, దేనితోనూ సంబంధం లేనట్లు నిర్లిప్తంగా నిరాశగా పెళ్లి కూతురు అలంకరణలో సుమతి ఎటో చూస్తోంది. దానికి కారణం ఆమె ఈ పెళ్ళి మీద అంత సుముఖుత చూపకపోవడమే. మన కన్నా తక్కువ స్థాయి వాళ్ళ జీవితంతో మన జీవితాన్ని సరిపోల్చుకుంటే సంతృప్తి లభిస్తుంది. అలా కాకుండా ఆర్థికంగా మన కన్నా ఎగువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం సరిపోల్చుకుంటే మనకి లభించేది అసంతృప్తే.

సుమతి తన స్నేహితురాళ్ళ జీవితాల్తో తన జీవితాన్ని సరిపోల్చుకోవడం వల్లనే ఆమెలో అశాంతి, అసంతృప్తి. ఒక సుమతి విషయమే కాదు సుమతిలాంటి మనస్తత్వం గల వాళ్ళ జీవితాలు అన్నీ ఇలాగే ఉంటాయి.

సుమతి ఆలోచన్లు వేరేగా ఉన్నాయి. తన ఇష్టాయిష్టాలతో ఎవ్వరికీ సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారు తన కుటుంబ సభ్యులు. తన అభిప్రాయం అడగలేదు. బావను భర్తగా ఎప్పుడూ ఊహించుకోలేదు. అలాంటిది తను అతనితో ఎలా కాపురం చేయగలదు? బావ కూడా తన అభిప్రాయం తెలుసుకోడానికి ప్రయత్నించ లేదు. తన అభీష్టానికి వ్యతిరేకంగా పెద్దల అభిప్రాయాల్తో ఈ పెళ్ళి జరుగుతోంది. అందుకే బావ సుఖపడకూడదు. తనకి ఎలాగూ సుఖం లేదు. అలాంటప్పుడు ఎదుటివాళ్ళు ఎందుకు సుఖపడాలి సుమతిలో ఇదే ధృడమైన ఆలోచన.

ముహూర్తం దగ్గర పడుతోంది. అనసూయమ్మ మంచం మీదుంది. శాంతమ్మ వంట పనిలో నిమగ్నమయింది. డబ్బున్నన్నాళ్ళూ భుజంగరావు చుట్టూ చేరిన వాళ్ళు అతను ఆర్థికంగా చితికిపోగానే ముఖం చాటు వేసారు. ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో పెళ్ళి నిరాడంబరంగా జరుగుతోంది. మూడు ముళ్ళూ పడ్డాక తనకి నమస్కరించడానికి మంచం దగ్గరకు వచ్చిన అల్లుడు, కూతురి మీద అక్షింతలు జల్లి కళ్ళు మూసుకుంది అనసూయ.

పెళ్ళి అయిన తరువాత శాంతమ్మతో మాట్లాడి మిగతా తంతు జరిపించడానికి పురోహితుడ్ని సంప్రదించాడు భుజంగరావు.

“ఏటి రాంబాబూ పెళ్ళి కొడుకు అయి ఉండి అన్ని పన్లూ నీవే సేత్తున్నావా? కుసింత కునుకు తీయనాదా? రాతిరి ఎట్టాగూ కునుకే ఉండద,” ముసి ముసి నవ్వులు నవ్వుతూ అన్నాడు అప్పన్న. కిసక్కున నవ్వింది రంగి.

అయితే రామూర్తి ముఖం మీద ఎటువంటి భావం లేదు.

“ఈ సదువుకున్న అబ్బాయిలంతా ఇట్టాగే ఉంటున్నారు” గొణుక్కుంటూ అచటి నుండి కదిలిపోయాడు అప్పన్న.

పెళ్ళి పందిరిలో పచ్చి మామిడాకుల వాసనతో పాటు వివిధ పరిమళాలు గుబాళిస్తున్నాయి. ముందు రోజు పెళ్ళి జరిగిన గుర్తుగా సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వాటిని సర్దుతోంది శాంతమ్మ. ఇరుగు పొరుగు ఉన్న ముత్తయిదులు వచ్చి శోభనపు గదిని అలంకరిస్తున్నారు.

శోభనానికి ముందు జరగవల్సిన తంతులూ పురోహితుడు పూర్తి చేసిన తరువాత అమ్మలక్కలు సుమతిని గదిలోకి పంపించి “అమ్మాయ్‌! నీ మొగుడు ఇష్ఠ ప్రకారం నడుచుకో!” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోయారు. వారి నవ్వులు సుమతికి వెగటుగా అనిపించాయి. అయిష్టంగానే పాల గ్లాసు పట్టుకుని గదిలోకి అడుగు పెట్టింది.

గదిలోకి అడుగుపెట్టిన సుమతిని గమనించలేదు రామూర్తి. అతని మదినిండా ఆలోచనలు మామయ్య మాటలే గుర్తుకు వస్తున్నాయి. “రామం సుమతి ఇంకా చిన్న పిల్ల. వయస్సు పెరిగిందే కాని దాని మనస్సు పెరగలేదు. దాన్ని నీ అభీష్టానికి అనుకూలంగా మార్చుకో. చిన్నవాడివైనా నా మాట మన్నిస్తావు ..!” పైకుబికి వస్తున్న కన్నీరు ఉత్తరీయంతో తుడుచుకుంటూ అన్నాడు మామయ్య.

ఈ హఠాత్‌ సంఘటణకి కించత్‌ బాధపడ్డాడు రామూర్తి. “ఛ.. ఛ..! అలా డీలాపడకు మామయ్యా! నాకు తెలియదా ఎలాగ మెలగాలో? లేని పోని సందేహలు, భయాలు నీ మనస్సులోకి రానీకు. నీవు చెప్పినట్టే నడుచుకుంటాను సరేనా?”

మేనల్లుడు భరోసాకి తృప్తిగా తలపంకించాడు భుజంగరావు. ఆలోచన్లలో మునిగి తేలుతున్న రామూర్తి సుమతి రాక గమనించలేదు. తెరిచి ఉన్న కిటికీ రెక్కపై చేయి వేసి బయటకు చూస్తోంది సుమతి. అసలే వెన్నెల రాత్రి శశాంకుని చల్లని కిరణాలు కిటికీలో నుండి చూస్తే అగుపడ్తుంది. ‘వెన్నెల ఎంత బాగుంది? తన మనసే బాగులేదు కాని’ అనుకుంటోంది సుమతి.

తన స్నేహితురాళ్ళ జీవితాలతో తన జీవితం సరిపోల్చుకోడం మాత్రం విడిచిపెట్టలేదు. ఆ తలంపు ఆమె మనస్సుకి బాధే తప్ప మరేమీ మిగల్చలేదు. ఆ బాధ కోపంగా మారుతోంది. ప్రతీకారం రూపు దాలుస్తోంది.

ఆలోచనా ప్రపంచం నుండి బయట పడ్డ రామూర్తి కిటికిలో నుండి చంద్రుడి వెన్నెల వేపు చూస్తున్న సుమతిని చూశాడు. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసు మీద అతని దృష్టి పడిరది.

“సుమతీ!” పిల్చాడు.

అతని వేపు చూసిన ఆమె చూపులు తీక్షణంగా ఉన్నాయి. అతను కలవరపడ్డాడు. “సుమతీ!” మార్దవంగా పలికింది అతని గొంతుక.

“నాకు నీ మీద ఇష్టం లేదు. అయిష్టం లేదు. అయితే భర్త స్థానంలో నిన్ను ఊహించుకోలేకపోతున్నాను. నీవు చేసిన మూడు ముళ్ళతో నా శరీరం నీ ఆధీనమయితే అవచ్చు కాని, నా మనస్సు మాత్రం నీ ఆధీనం కాదు. నా మనస్సు నీ ఆధీనంలో రావాలంటే కొంత సమయం పట్టచ్చు. నన్ను మాత్రం నీవు ఇప్పుడేం ఇబ్బంది పెట్టద్దు. నన్ను తాకవద్దు,” అంది సుమతి. ఆమె కంఠంలోని స్థిరత్వానికి కఠినతకి కలవరపడ్డాడు రామూర్తి.

కేవలం శోభనం అంటే లైంగికానందం, శరీర సుఖం కోసం కాదు. మగ ఆడ పెళ్ళి అనే బంధంతో బంధీలయి మూడు ముళ్ళు పడ్డ వధువు, వరుడు ఏడు అడుగులు నడిచిన తరువాత వారు దంపతలు అని పిలవబడుతారు. ఈ నవ దంపతుల మనసులే కాదు శరీరాలు కూడా శుభముహూర్తంలో కలవాలనే ఈ శోభనం. అదే నవ దంపతులకు మొదటి రాత్రి.

జీవితం సుఖమయం చేసుకోవాలన్నా దుఃఖమయం చేసుకోవాలాన్నా భావి జీవితమంతా ఈ మొదటి రాత్రి మీదే ఆధారపడి ఉంది. అలాంటిది సుమతి అలా మాట్లాడేసరికి రామూర్తి ఉత్సాహం, కోరికలు పాలపొంగులా చల్లారిపోయాయి. నిరుత్సాహం నిస్సత్తువ కలిగాయి. వెను వెంటనే మామయ్యకి తను ఇచ్చిన మాట కూడా గుర్తుకు వచ్చింది. వెంటనే అతనిలో భావాలు మారుతున్నాయి.

కొందరు మనుష్యులు నా మాటే అందరూ వినాలని నా మాట ప్రకారమే, నా ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని అనుకుంటారు. దానికి ఏదైనా ఆటంకం కలిగినా అసంతృప్తికి లోనవుతారు. అతిగా ప్రవర్తిస్తారు. అటువంటి సందర్భాల్లోనే మనం సహనం వహించాలి. వాదోపవాదాలకి దిగకూడదు.

ఎదుటి వాళ్ళతో సత్ససంబంధాలు నెలకొల్పేందుకు ఎదుటివారు చెప్పింది వినడం ఎంతో అవసరం. ఇతరుల భావాలు తెలుసుకొనేందుకు ఈ అలవాటు అభివృద్ధి చేసుకోవాలి. ఎదుటివారి బాధలు వినాలి. బాంధవ్యం పెంపొందించుకోవాలి.

అన్ని అనర్థాలకు మూలం ఆవేశం. మాటి మాటికీ మనం అలా ప్రవర్తించడం ఎంతో మాత్రం తగదు. ఆవేశం వల్ల మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. మనిషికి శాంతి సహనం ఉండాలి. ఏ ఉపద్రవం వచ్చినా మనం శాంతంగా ఉంటే పరిష్కారం దానంతట అదే అవుతుంది. ఆవేశపడితే సమస్య మరింత జటిలం అవుతుంది.

అంతేకాదు మనం అనుకున్న పని అవకపోతే ఒక విధమైన నిస్తేజం, మనల్ని ఆవరిస్తుంది. నిరాశ మనల్ని నీరసపరుస్తుంది. అటువంటి సమయంలోనే మనకి ఓరిమి, ఆత్మవిశ్వాసం అవసరం. దృఢ సంకల్పం అవసరం వీటితో మనకి ఎదురైన వైఫల్యాలని తొలగించుకోగలం. ఇలా సాగుతున్నాయి రామూర్తి ఆలోచన్లు. బుర్ర దిమ్మగా ఉంది. ఆనందంగా మలుచుకోవల్సిన సమయం ఇలా జరుగుతోంది అని అనుకున్నాడు నిరాశగా.

గడియారం పన్నెండు గంటల సమయం చూపిస్తోంది. అతని మానస వీణ మూగబోయింది. ఆవేదనా ఘడియల్ని అధిగమించి ఆమె వేపు చూశాడు. సుమతి ముఖం మీద అదే స్థిర నిర్ణయం.

“సరే నీ ఇష్ట ప్రకారమే అవనీ. అయితే ఒక్క విషయం మనిద్దరిలో ఏ ఒక్కరూ ఇప్పుడు తలుపు తీసుకుని బయటకు వెళ్తే పెద్దవాళ్ళ మనస్సుల్ని బాధ పెట్టిన వాళ్ళమి అవుతాము. లోకం దృష్టిలో నేను అసమర్థుడ్ని అవుతాను తరువాత నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారం చేసుకో,” ఇలా అంటున్నప్పుడు అతని గొంతుకలో సుడులు సుడులుగా ఆవేదన.

అయితే సుమతి పట్టు సడలలేదు. అదే స్థిరమైన భావం. దుప్పటి క్రింద పరుచుకుని దిండు తలక్రింద పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే రామూర్తి పందిర మంచం మీద కూర్చుని శూన్యంలోకి నిర్లిప్తంగా, నిరాశగా చూస్తూ ఆ రాత్రి సమయాన్ని గడుపుతున్నాడు.

కోళ్ళు కూస్తున్నాయి. తెల్ల వారింది అని సూచనగా. పందిర మంచంపై కునికిపాట్లు పడ్తున్న రామూర్తి తృళ్ళి పడిలేచాడు. సర్దుకుని కూర్చున్నాడు. కళ్ళు మండుతున్నాయి. గుండెలో బాధ అంతకన్నా ఎక్కువ మండుతోంది. సుమతి వేపు చూశాడు. నిర్వికారంగా నిస్త్రాణంగా నిద్రపోతోంది. తలుపు తీసుకుని బైటకు వచ్చాడు.

క్రమంగా ఆకాశంలో వస్తున్న మార్పుల్ని గమనిస్తున్నాడు. తూర్పు దిక్కున వెలుగు రేఖలు అగుపిస్తున్నాయి. ప్రాతః కాల చల్లని గాలులు ఆహ్లాదం కలిగిస్తున్నా ఆ ఆహ్లాదం ఆస్వాదించే స్థితిలో లేదు అతని మనస్సు.

కొడుకు మానసిక స్థితిని గమనించిన శాంతమ్మ మొదటి రాత్రి కొడుకు జీవితాన్ని అశాంతి పాలు చేయడం ఆమెను బాధకి గురి చేసింది. కొడుకు ముఖం చూస్తేనే తెలుస్తోంది. వాడెంత అశాంతితో దహించుకుపోతున్నాడో అని. తను కొడుకు జీవితాన్ని నాశనం చేయలేదు కదా! పదే పదే పర్యాయములు అనుకుంటూ మనస్సులో మదన పడుతోంది శాంతమ్మ. మళ్ళీ ఆమె ఆలోచన్లలో మరో కోణం. సుమతి చిన్నపిల్ల. మంకుపట్టు ఎక్కువ. కొద్ది రోజులు ఓపిక పడ్తే తన తప్పు తనే తెలుసుకుంటుంది. పరిస్థితులు చక్కబడ్తాయి. ఇలా తన మనస్సుని తానే సమాధాన పరుచుకునేది.

శాంతమ్మ ద్వారా విషయం తెలుసుకున్న భుజంగరావు, అనసూయమ్మ ఇద్దరూ చాలా బాధపడ్డారు. అనసూయమ్మ మరింత కుమిలిపోతోంది. తన కూతురు ఇలా తయారవడానికి తనే కారకురాలు. కూతురు మనస్సులో పెద్ద పెద్ద ఆశలు కల్పించింది. డాక్టరికో, ఇంజనీరుకో, పెద్ద ఆస్తిపరుడుకో కూతుర్నిచి పెళ్ళి చేద్దామనుకుంది. అప్పుడు తమ ఆర్థిక పరిస్థితులు బాగానే ఉండేవి. ఆ భావాలే కూతురి మనస్సులో మొలకెత్తి పెరిగి పెద్దవై శాఖోపశాఖలుగా చీలి పెద్ద వటవృక్షంలా తయారయ్యాయి.

వయస్సుతో పాటే సుమతిలో ఆ భావాలు వెళ్ళు నాటుకున్నాయి. చివరికి ఇంటి పరిస్థితులు ఇలా తయారయ్యే సరికి పరిస్థితుల్తో రాజీపడలేక పోతోంది. అంతేకాదు చిన్నప్పటి నుండి తను మేనల్లుడ్ని ఈసడించేది. చులకనగా చూసేది. నానా చాకిరీ చేయించేది. అవమానపరిచేది. ఇవన్నీ సుమతి చూసేది.

తన ప్రవర్తన రామం యడల ఎలా ఉండేదో గమనించేది సుమతి. దానికి కూడా బావంటే గౌరవం లేదు. చులకన, హ్యేయభావం. అలాంటి సమయంలో బావతో తన పెళ్ళి జరగడం జీర్ణించుకోలేక పోతోంది. పరిస్థితుల్తో రాజీపడలేక పోతోంది. కూతురు జీవితం ఇలా తయారవడానికి తనే కారకురాలు అని కుమిలిపోతున్న అనసూయమ్మ గాఢంగా నిట్టూర్పు విడిచింది.

ఇవతల భుజంగరావు పరిస్థితి అలాగే ఉంది. తను కూడా మేనల్లుడి యడ అమానుషంగా ప్రవర్తించేవాడు. కొట్టేవాడు, తిట్టేవాడు. అవమానపరిచేవాడు. హీనంగా చూసేవాడు. వీటి అన్నిటి ప్రభావం సుమతి మీద పడింది, ఇలా ఆలోచిస్తూ కుమిలిపోతున్నాడు.

కొంత సంబాళించుకుని అనసూయమ్మను ఓదార్చాడు. మేనల్లుడు దగ్గర, శాంతమ్మ దగ్గర బాధపడ్డాడు.

“అన్నయ్యా! పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కాలమే అన్ని సమస్యలకీ పరిష్కారం చూపుతుంది,” శాంతమ్మ అంది.

కాని ఏం మాట్లాడకుండా మౌనం దాల్చాడు రామూర్తి.

అధ్యాయం 8

జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిలబడ్డమే జీవితం. అనేక సమస్యలు, ఒత్తిళ్ళు చికాకు పరుస్తున్న సమయంలో నిరాశ, నిశ్పృహలకు లోను కాకుండా నిట్టూర్పులతో కాలం వెళ్ళ బుచ్చకుండా ముందుకు సాగడంలోనే ఆనందం ఉంది. అందులోనే లక్ష్య సాధన మార్గం ఉంది అనుకుంటాడు రామూర్తి.

ఆశలు, మమకారాలు, కోరికలు, ఆనందాలు, ఆవేదనలు, ఆవేశాలు, అసూయ, ఈర్ష్య, అవమానం, ఆక్రందనలు ఇటువంటి భావ మనోవికారాలు, భావోద్వేగాల సమూహమే మనిషి జీవితం. అంతే కాదు మనం చేసిన కర్మల ఫలితాల్ని మనం అనుభవించక తప్పదు. మంచి పనులు చేస్తే మంచి కర్మల ఫలితాలు లభిస్తాయి. చెడు కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు అనుభవించక తప్పదు. కర్మ సిద్ధాంతం మీద నమ్మకమున్న భుజంగరావు ఈ అనర్థాలన్నింటికి కారణం తను చేసిన కుకర్మల ఫలితమే అని అనుకుంటాడు.

ఏదయితేనేమి కష్టాల కడలిలో అతని కుటుంబ నావ కొట్టుకు పోతోంది. సమస్యల సుడిగుండాలు చుట్టుముడ్తున్నాయి. ఆ నావ ఎటు కొట్టుకు పోతుందో తెలియని అగవ్యగోచరమైన పరిస్థితి గోరు చుట్టుకి రోకటి పోటులా చక్కబడని కూతురి కాపురం అనసూయమ్మ మరణం సుమతి పెళ్ళికి, అనసూయమ్మ శ్రాద్ధ కర్మలకి చేసిన అప్పులు తలకి భారమవుతున్నాయి.

రామూర్తి సుమతిని, తల్లిని తీసుకు వస్తే తను కొంచెం పెద్దిల్లు అద్దెకు తీసుకుందామనుకున్నాడు. తల్లి చనిపోయిన తరువాత అయినా సుమతిలో మార్పు వస్తుందనుకున్నాడు కాని మరికొంత సమయం పట్టచ్చు అనుకున్నాడు. కాలమే సమస్యకి పరిష్కారం చూపుతుందని అతని భావన.

ఇక భార్య చనిపోయిన తరువాత ఒంటరయిన మామయ్యను వదిలి పెట్టిరాదు తన తల్లి. అందుకే ఇప్పుడున్న గదిలోనే కాలక్షేపం చేసేవచ్చు అని అనుకున్నాడు.

అయితే భుజంగరావు ఆలోచన్లు వేరేగా ఉన్నాయి. భర్త దగ్గర ఉంటే సుమతి మనస్సు ఏదో ఒక రోజున మారచ్చు. అందుకే సుమతి రామం దగ్గర ఉండటమే మంచిది. వాళ్ళకి పెద్ద దిక్కుగా శాంతమ్మను పంపాలి. తను ఒక్కడూ ఎలాగో అలాగ జీవితం గడిపెయ్యగలడు. పై పెచ్చు ఉన్న ఊరు కూడా. తన జీవితానికి ఏు పరవాలేదు.

ఇక శాంతమ్మ ఆలోచన్లు మరో విధంగా ఉన్నాయి. ఇంటి ఇల్లాలు మరణం తన అన్నదమ్ముడ్ని మరింత కృంగదీస్తోంది. ఇలాంటి సమయంలో అనతిలో ఆత్మస్థైర్యం నింపడానికి ధైర్యంగా – స్థిరంగా నిలబడడానికి ఎవరో ఒకరు అతని వెన్నంట ఉండాలి. అందుకే అన్నయ్యని కనిపెట్టుకుని ఉండాలి. తను కొన్నాళ్ళు కొడుకు కోడలకి తను అడ్డంకిగా ఉండకూడదు. కొన్నాళ్ళు కలిసి ఉంటే వాళ్ళ మనస్సులు మారచ్చు. పరిస్థితులు చక్కబడచ్చు.

సుమతి ఆలోచన్లు మరో విధంగా ఉన్నాయి. ఎంత సర్ది చెప్పుకోచూచినా తను పరిస్థితులకనుగుణంగా తన జీవన సరళిని మలుచుకోలేకపోతోంది. తను బావ మీద ఏర్పరుచుకున్న భావాల్లో మార్పు రావాలంటే కొంత సమయం పట్టాలి. జీవితంలో దేనిని నయినా భరించవచ్చుకాని లేమిని మాత్రం భరించలేము. అందులోనూ ఒకానొక సమయంలో ఎంతో బాగా బతికిన తన కుటుంబం ఇలా చితికిపోవడం, తను కన్న కలలు ఇలా నీటి బుడగల్లా టప్పుమని పేలిపోవడం తను తట్టుకోలేకపోతోంది. దీనికి కాలమే దివ్య ఔషదం. కాలంతోపాటే మనిషి జీవితంలో మార్పు వస్తుందేమో? ఆ ఆశ తనకుంది.

ఇలా ఎవరి ఆలోచన్లు వాళ్ళవి. వాళ్ళ ఆలోచనలలో పొంతన అనేది లేదు. పొలం అంతా చేసిన అప్పులకి వడ్డీ రూపంలో పోగా, ఒక ఎకరం పొలం ఉండడానికి ఇల్లు మాత్రమే మిగిలాయి. “పొలమే పోయిన తరువాత మీరు కూడా అనవసరమే. మీరు మరొకరి దగ్గర పనికి చేరండి” రంగితోనూ, అప్పన్నతోనూ అన్నాడు భుజంగరావు.

“అట్టాగంటారేటయ్యా! ఇప్పటి వరకూ మీ ఉప్పు తిని బతికిన బతుకులు మావి. మిమ్మలనే కనిపెట్టుకుంటామయ్యా! అలా దిగులు పడమాకండయ్యా! ఆ ఎకరం పొలం ఉన్నాది కదా! దానిలో కూరగాయ మొక్కలూ, పాదులు వేసి కూరగాయలు పండిద్దామయ్యా! పూల మొక్కలు పెంచుదాం. పూలు అమ్ముదాం. కూరగాయలమ్ముదాం,” అన్నాడు అప్పన్న. “అట్టాగే సేద్దామయ్యా! మా మావ మంచి సలహా ఇచ్చాడయ్యా!” అంది రంగి.

“మీ ఇష్టం” అన్నాడు భుజంగరావు.

అప్పన్న, రంగీ పూల మొక్కలకి గొప్పులు తవ్వి, కూరగాయ పాదులకి గొప్పులుతో పాటు పందిర్లకి ఎక్కించి, ఎరువు వేసి ఉషారుగా ఉత్సాహంగా పని చేస్తుంటే సుమతి మనస్సులో ఏదో తెలియని బాధ, అలజడి.

‘వీళ్ళకి ఏు కోరికలుండవా? వీళ్ళూ మనుష్యులే కదా. అతి సామాన్య జీవితం గడుపుతున్న వీళ్ళకి ఏ సమస్యలూ ఉండవా? సమస్యలుంటే ఇంత ఉత్సాహంగా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు.

తను ఎందుకు అలా ఉండలేకపోతోంది. రంగికి ఏ ఆభరణాలూ లేవు. మెడలో పసుపు తాడు, చేతికి మట్టి గాజులు మాత్రమే. నుదుటిన రూపాయి కాసంత బొట్టుతో రంగి ముఖం వెలిగిపోతోంది. తను వాళ్ళలా ఎందుకు అంత సంతోషంతో ఉండలేకపోతోంది.

తనలో ఈ అసంతృప్తికి కారణం, కోరికలు. ఈ కోరికలు అనంతమైనవి. ఆ కోరికలకి అంతే అనేది ఉండనే ఉండదు. ఈ కోరికలు మనిషి మనుసులో తిష్ఠ వేసుకుంటే మనిషికి శాంతి అనేది ఉండనే ఉండదు,’ ఇలా ఆలోచిస్తూ రంగి, అప్పన్న వేపు చూసింది. ఇద్దరూ పరాచికాలు ఆడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. గొప్పులు తవ్వి పాళీ కడ్తున్నారు.

వాళ్ళు అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అదే తనకి సమాధానం దొరకని ప్రశ్న. తను బావ దగ్గర ఎందుకు సుఖపడలేక పోతోంది? బావను ఎందుకు సుఖపెట్టలేకపోతోంది. ఇలా ఆత్మ విమర్శ చేసుకుంటోంది సుమతి. బావ తన ప్రవర్తనకి, తీరుకి ఎంత బాధపడుతున్నాడో? బావ మనస్సు ఎంత గిలగిల్లాడిపోతోందో? తనూ సుఖపడలేకపోతోంది కట్టుకున్న భర్తని సుఖ పెట్టలేకపోతోంది. బాధ ఆవేదనతో వచ్చిన కన్నీరుని తుడుచుకుంటూ ఆలోచిస్తోంది. పశ్చత్తాపంతో ఆమె మనస్సు దహించుకుపోతోంది.

అయితే ఆ బాధ క్షణ కాలమే. మరుక్షణమే ఆమె భావాలన్నీ మారిపోయాయి. ఆమె కళ్ళెదుట స్నేహితురాండ్ర రూపాలు అగుపించాయి. వారి సుఖమైన జీవితాలు అగుపించాయి. వాళ్ళ జీవితాలు కూడా మేడి పండు లాంటివే. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. దూరపు కొండలు నునుపు అని అనుకోలేకపోతోంది సుమతి.

తిరిగి ఆమె మనస్సులో పాత భావాలే. సమాజం మీద కసి, తన జీవితం మీద కసి. తన జీవితం ఇలా తయారవడానికి కారణమయిన విధి మీద కసి. జీవితం ఇలా తయారవడానికి కారకులయిన వారి మీద పగ, ద్వేషం. పరిస్థితుల మీద హ్యేయం. తన మీద తనకే అసహ్యం. భగవంతుని మీద అసహ్యం. తన మెళ్ళో తాళి కట్టిన భర్త మీద అసహ్యం.

ఇంటిలో ఇంటెడు బండ చాకిరీ చేస్తూ బండబారిన బ్రతుకు బ్రతుకుతున్న మేనత్త శాంతమ్మ మీద అసహ్యం. ఉన్న ఆస్తినంతా హారితి కర్పూరంలా హరింప చేసిన కుటుంబాన్ని నడిరోడ్డు మీదకిడ్చిన, ఈ దుస్థితికి కారకుడయిన కన్న తండ్రి మీద మరింత అసహ్యం.

సుమతి మనస్సులో ఇంత తొందరగా మార్పు వస్తుందన్నది కల్ల అనుకున్న రామూర్తి. తన పట్నానికి వెళుతున్న సమయంలో సుమతితో చెప్పి వెళ్ళడానికి వచ్చాడు. అయితే అతను ఆశించిన వీడ్కోలు మాత్రం లభించలేదు. ఆనిశ్చత వాతావరణంలో రెండు గుండెలు కొట్టుకున్న శబ్దం తప్ప ఆమె సమాధానం మాత్రం శూన్యం. ఇలాంటి సమయాల్ని ఎన్నో అనుభవించిన మూగగా బాధనంతా తన గుండెల్లో దాచుకుంటూ వెనుదిరిగాడు.

కొడుకు ముఖ కవళికలు పరికించిన శాంతమ్మ మనస్సు విలవిల్లాడిరది. రోదించింది. కొద్ది సేపు తనే ఇలా డీలా పడ్తే కొడుకు మరింత కృంగిపోతాడు అని అనుకున్న ఆ తల్లి కొడుకుని ఓదార్చడానికి ప్రయత్నించింది.

“రామూ! సుమతి ఇంకా మనస్సు పరిపక్వత లేని చిన్న పిల్లరా! కొన్నాళ్ళుపోయిన తరువాత పరిస్థితులు అర్ధం చేసుకుంటుంది. నీవు దూరంగా ఉంటే సుమతిలో మార్పు తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నిరాశపడకు” శాంతమ్మ కొడుకుతో అంది.

తల్లి ఓదార్పు మాటలకి అతని మనస్సు సంతోష తరంగాలతో ఉవ్వెత్తున ఉప్పొంగి పోలేదు. ఇలాంటి ఓదార్పు మాటలు పలు సందర్భాల్లో విని విని వాటికి అలవాటు పడిపోయాడు. ఇలాంటివేవీ అతనికి కొత్తేమీ కాదు. ‘కొంతమంది జీవితాల్తో భగవంతుడు ఆటలాడిస్తాడు’, అనుకునేవాడు రామూర్తి.

(ఇంకా ఉంది)

Exit mobile version