[మణి గారు రచించిన ‘మైదానం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మచ్చిక చేయని అందమయిన మైదానం,
అదుపు అలుపు లేకుండా పరిగెడుతోంది!
దానిని, తరుముకుంటూ,
పూల పుప్పొడి అంతా విరజిమ్ముతూ,
పిల్ల గాలి తెమ్మెరలు!
సంభ్రమంతో నిలబడి చూస్తున్న నన్ను,
“రా! రా!..” అంటూ పిలిచాయి.
“ఎక్కడ కని ఆ పరుగు?” అడిగాను.
“ఎక్కడకని ఏమీ లేదు! తెలియని దారులలో
ఎరుక తెలియని అగమ్యం కోసం! ..చాలా వేడుక..! ..రా!”
గట్టిగా నవ్వుతూ అంది మైదానం.
దాని నవ్వు అంతా ప్రతిధ్వనించింది.
“భయం లేదూ?” అన్నాను.
“మనుషులు ఎక్కువ మచ్చిక అవుతారు.
అన్నీ భయాలే మరి.” అంది నవ్వుతూనే.
నన్ను మృదువుగా, తాకింది ఒక తెమ్మెర
“భయం దేనికి?” అంటూ, పలకరిస్తూ.
పిల్ల గాలిని వాటేసుకున్న పూల పుప్పొడులు,
ముసి ముసి నవ్వులు నవ్వుతూ,
“వీళ్ళకేమి అర్ధమవుతాయని
మన పాటలు ఆటలు!
అన్నిటికీ, అర్థాలు వెతుకుతారు!
అనంతం లోకి తీసుకువెళ్ళే,
మన అగమ్య ప్రయాణాలు
వాళ్ళకి అర్ధం కావులే! పద, ..పరిగెత్తు!
..పట్టుకుందాం, ..మైదానాన్ని” అంటూ,
ఆ తెమ్మెరని గిలిగింతలు పెట్టి,
నా నుంచి, లాక్కు వెళ్ళిపోయాయి.
అదుపు అలుపూ లేకుండా,
పరుగులు పెడుతూ మైదానం!
..దాని వెనుకే పిల్ల గాలి తెమ్మెరలు!
‘ఏమిటీ ధైర్యం?..’ అనుకుంటూనే,
వాటి పరుగుల కేసి, ఆశగా చూస్తూ నిలబడ్డాను.
“అగమ్యాన్ని వెతుక్కుంటూ, అనంతంలోకి
పరుగులు పెట్టడం, దానిలో కరిగిపోవడం బాగుంటుంది.”
నాతో, నేను అన్నాను.
నా మాటలకి నాలో ఒక విద్యుత్ స్పందన,
..ఒళ్ళు పులకరింపచేస్తూ. ..
పరిగెడుతున్న మైదానం, పిల్లగాలి,
ఒకసారి వెనకకి తిరిగి,
నన్ను కదలనివ్వని సంకెళ్ళని
గట్టిగా పట్టుకొని వున్న, నా కేసి చూసి,
జాలిగా నవ్వి, ముందుకు కదలిపోయాయి.