Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-97: కామ్యకవనంలో పాండవులు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సత్యభామతో కలిసి వచ్చిన శ్రీకృష్ణుడు

శరత్కాలం ప్రవేశించి సూర్యోదయ సమయాలు కన్నులపండువుగా శోభిల్లాయి. మబ్బులు తొలగిపోయి బాలభానుడి కిరణాలు విస్తరించాయి. ఆకాశంలో దక్షిణ దిక్కులో అగస్త్యనక్షత్రం కనిపించింది. అగస్త్యుడు గొప్ప నిండుతనం కలిగిన మహర్షి. మొత్తం సముద్రజలాన్ని తన పుడిసిలి పట్టి ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగేసినవాడు.

బెకబెకమని గొడవ చేస్తూ ఆటలాడుకునే కప్పలవల్ల బురదగా మారిన నీళ్లకి నిర్మలత్వాన్ని ప్రసాదించే గురువు అగస్త్యమహర్షి. ఆ శరత్కాలంలో కన్నుల పండువుగా కనిపిస్తున్న సరస్వతీ నదిలో స్నానం చేస్తూ పాండవులు  కొంత కాలం అక్కడ గడిపారు.

తరువాత ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులతోను, ఇంద్రసేనుడు మొదలైన సేవకులతోను కామ్యకవనం చేరుకున్నారు. అక్కడ ఋషులతో గౌరవించబడి అక్కడే ఉండిపోయారు.

అర్జునుడితో స్నేహంగా ఉండే ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి “ధర్మరాజా! ఈ అడవిలో నువ్వు, నీ తమ్ముళ్లు విశ్రాంతిగా ఉన్నారని తెలుసుకుని ఎల్లప్పుడు మీ మేలు కోరే మీ మిత్రుడు, గొప్ప తేజస్వి, పాపరహితుడు, దేవకీసుతుడు శ్రీకృష్ణుడు మిమ్మల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వస్తున్నాడు.

అంతేకాదు అనేకవేల యుగాలు జీవించినవాడు, గొప్ప తపస్సు చేసినవాడు, మహాత్ములయందు వినయవిధేయతలు చూపించేవాడు, మృకండ మహర్షి కొడుకు మార్కండేయుడు ఇప్పుడే నిన్ను చూడ్డానికి వస్తున్నాడు” అని చెప్పాడు.

రథాన్ని ఎక్కి సత్యభామతో కలిసి గొప్ప వైభవంతో ధర్మరాజుని చూడ్డానికి వచ్చాడు శ్రీకృష్ణుడు. రథం మీద ఉన్న శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి మిరుమిట్లు గొలుపుతూ మేఘాల మధ్య ఉన్న దేవేంద్రుడు శచీదేవితో ఉన్నట్లు ప్రకాశించాడు.

ఆ రథం మీద గరుడలాంఛనలతో చెక్కబడిన జెండా ధగధగలాడుతోంది. దానికి శైబ్య, సుగ్రీవ మొదలైన గుర్రాలు కట్టబడి ఉన్నాయి. రత్నకాంతులతో వెలిగిపోతూ వస్తున్న రథచక్రాల శబ్దం మేఘగర్జనలా వినిపిస్తుంటే నెమళ్లు నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి.

శ్రీకృష్ణుడు రథం దిగి ధర్మరాజుకి నమస్కరించాడు. భీముణ్ని, అర్జునుణ్ని, నకులుణ్ని, సహదేవుణ్ని కౌగలించుకున్నాడు. ద్రౌపదిని గౌరవించాడు. ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు శ్రీకృష్ణుణ్ని గౌరవించారు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చి స్వాగత సత్కారాలు చేశాడు.

తరువాత ధర్మరాజు, అతడి తమ్ముళ్లు శ్రీకృష్ణుడి చుట్టూ మూగారు. చాలాకాలం తరువాత కలుసుకోడం వల్ల శ్రీకృష్ణుడు అర్జునుణ్ని ప్రేమతో దగ్గరకి తీసుకున్నాడు.

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “పరమేశ్వరుడు, ఇంకా అనేక దేవతల అనుగ్రహం వల్ల అర్జునుడు అస్త్రలాభం పొంది రావడం నీ భాగ్యం. ఇందుకు నీకు ధర్మాచరణలో ఉన్న నిష్ఠ, నీ తపస్సే కారణం. రాజ్యం మీద కంటే నీకు ధర్మం మీదే ఎక్కువ ఆసక్తి.

వేదవేదాంగాలు తెలిసినవాడివి, అనేక యజ్ఞాలు చేసినవాడివి, విలువిద్యలో ఆరితేరినవాడివి, భూమినంతటిని పరిపాలించగల రాజధర్మం కలిగినవాడివి కనుక నీకు ఇహంలోను, పరంలోను శుభం జరుగుతోంది.

ఇంద్రియనిగ్రహము, సత్యసంధత, ధైర్యసాహసాలు, ఎల్లప్పుడు తృప్తి కలిగి ఉండడం, అంతరేంద్రియ నిగ్రహము కలిగినవాడివి. సహజంగా మంచి గుణాలు కలిగినవాడివి కనుక నీకు ధనం మీద ఆపేక్ష లేదు. దురాశ కూడా లేని ధర్మరాజా! నువ్వు సార్థక నామధేయుడివి.

నువ్వు మూడు లోకాల్లోను ఆరాధించ తగినంత గొప్పదనం కలవాడివి. ఆనాడు నిండు కొలువులో జూదం అనే వంకతో దుర్యోధనుడు ఎంతటి దుర్మార్గాలకి తలపెట్టినా నువ్వు కనుక సహించావు. చలించని మనోధైర్యంతో ఉండే సహనము, క్షమాగుణము నీకొక్కడికే చెల్లింది. నీవంటి వాడు లోకంలో ఉండనే ఉండడు.

ధర్మరాజా! నీకు కోపం కలిగి ఉంటే, శత్రువులందరు ఆ క్షణంలోనే నాశనమై ఉండేవాళ్లు. నీకు హింస ఇష్టం ఉండదు కనుక, రక్షించబడ్డారు. సముద్రాలవంటి నీ తమ్ముళ్లు నీ ఆజ్ఞకి కట్టుబడి ఉన్నారు. అవకాశం దొరికినప్పుడు వాళ్ల భుజపరాక్రమాలతో ప్రళయకాలంలో యముడిలా విజృంభించి శత్రువుల్ని నాశనం చెయ్యగలరు.

అంధక, వృష్టి, భోజ, కుకుర వంశాలకి చెందిన రాజులందరు నీమీద బంధుప్రేమ, స్నేహము, పూజ్యభావము కలిగి ఉన్నారు. దురాశతో నిండి కళ్లు కనిపించకుండా ఉన్న ధృతరాష్ట్రులు, ఈ రాజులందరిని ఎదిరించి పోరాడలేరు.

ధర్మరాజా! నువ్వు అనుకుంటే చెయ్యలేని పని ఏదీ లేదు. నాలుగు సముద్రాల పర్యంతం అవరించబడి ఉన్న ఈ సామ్రాజ్యానికి నువ్వే సార్వభౌముడివి.”

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు సంతోషంతో “దేవా! అనుకున్న ప్రకారం మేము చెయ్యవలసిన అరణ్యవాసం ఇంక ఎంతో కాలం లేదు. మిగిలిన అరణ్యవాస కాలాన్ని, ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్న తరువాత మేము మా పరాక్రమాన్ని చూపించడం మంచిది.

అలా చేస్తే మమ్మల్ని లోకం నిందించదు కదా! ఇదంతా నిర్వహించే భారం నీదే. మేము నీ భక్తులం, నిన్నే శరణు కోరుకుని ఉన్నాం. మాకు మంచి తప్పకుండా జరుగుతుంది” అన్నాడు.

శ్రీకృష్ణుడు దగ్గరలో నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి “ద్రౌపదీ! నీ అయిదుగురు కొడుకులూ యాదవకుమారులతో కలిసి సంతోషంగా ఉన్నారు. ఏనుగు ఎక్కడం, గుర్రపుస్వారీలతో పాటు అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్లకి ప్రద్యుమ్నుడు దివ్యాస్త్రాలు ఇచ్చాడు.

సుభద్ర తన కొడుకుమీద కంటే నీ కొడుకుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తోంది. పాండవులందరు ఉజ్జ్వలమైన ప్రకాశంతో వెలిగే కాలం దగ్గరపడుతోంది. నువ్వు ప్రశాంతంగా ఉండు” అని చెప్పాడు.

పాండవులకి మార్కండేయమహర్షి చెప్పిన విశేషాలు

కర్మవిశేషాలు

శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతున్న సమయంలో గొప్ప తపస్సంపన్నుడైన మార్కండేయమహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చిన మహర్షికి శ్రీకృష్ణుడు, పాండవులు ఎదురుగా వెళ్లి అహ్వానించి, అతిథి సత్కారాలు చేసి అర్చించారు. మార్కండేయమహర్షి అందరి క్షేమం గురించి అడిగి తెలుసుకున్నాడు.

అందరూ కూర్చున్నాక పాండవుల మంచిని కోరుకునే శ్రీకృష్ణుడు “మార్కండేయమహర్షీ! ఇక్కడ నేను, పాండవులు, ఇక్కడే ఉంటున్న గొప్ప మహర్షులు మీ మాటలు వినాలని ఉవ్విళ్లూరుతున్నాం. మీ మాటలు లోకంలో ఉన్న ప్రజలందరూ గౌరవించతగినవి.

దేవతల, రాజుల, బ్రాహ్మణుల చరిత్రల్ని, భూలోకంలో మహాపతివ్రతలుగ కీర్తి పొందిన సతీమణుల మహిమల్ని మాకు వివరంగా తెలియ చెయ్యండి. మాకు వినాలని కోరికగా ఉంది” అన్నాడు.

ఆ సమయంలో నారదమహర్షి కూడా అక్కడికి వచ్చాడు. అందరూ ఆ మహర్షికి ఎదురుగా వెళ్లి తగిన మర్యాదలతో స్వాగతించి నమస్కరించారు. నారదమహర్షి మార్కండేయమహర్షితో శ్రీకృష్ణుడు, పాండవులు సంతోషించేటట్లుగా పుణ్య కథలు చెప్పమని చెప్పి తన పని మీద వెళ్లిపోయాడు.

ధర్మరాజు “మహర్షీ! మేము దీక్షతో ధర్మం తప్పకుండా ఆచరిస్తున్నా ఇన్ని కష్టాలు పడుతున్నాము.. ధృతరాష్ట్రుడి కొడుకులు ఎప్పుడూ పాపపు పనులే చేస్తున్నా గొప్ప సుఖాలు అనుభవిస్తున్నారు. ఈ విషయం నన్ను కలవర పెడుతోంది. నా ధర్మసందేహాన్ని మీరే తీర్చాలి.

మనిషి ఈ భూలోకంలో ఇప్పుడు చేసే కర్మఫలం ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తాడా? పరలోకంలో అనుభవిస్తాడా? లేక ఇహంలోను, పరంలోను కూడా అనుభవిస్తాడా?

సృష్టికర్త అయిన పరమేశ్వరుడిని చూడని మనిషికి కర్మఫలం చేరకుండా ఉంటుందా? మరణించిన తరువాత శరీరంతోపాటే చేసిన కర్మ కూడా తొలిగిపోతుందా? మహానుభావా! ఈ విషయాల్ని తెలియచెయ్యండి! ఈ విషయాన్ని చెప్పగల సమర్థులు మీరే!” అని మహర్షిని ప్రశంసిస్తూ అడిగాడు.

గొప్ప జ్ఞానం కలిగిన మార్కండేయమహర్షి “ధర్మరాజా! పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టిన సమయంలో మనుషుల శరీరాలు నిర్మలంగా ఉన్నాయి. వాళ్లు పుణ్యాత్ములుగా ఉన్నారు. గొప్ప బలం కలిగి ఎప్పుడూ నిజాన్నే పలికేవాళ్లు.

వాళ్ల కోరికలు తీరేవి. గొప్ప జ్ఞానంతో దేవతలు తిరిగే దారుల్లో తిరగ గలిగేవాళ్లు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాల్ని పొందగలిగేవాళ్లు. అన్ని ధర్మాలు తెలుసుకోగలిగారు. అసూయవంటి దుర్గుణాలు ఉండేవి కాదు.

వేలకొద్దీ కొడుకులు, కూతుళ్లు ఊండి, వేలకొద్దీ సంవత్సరాలు జీవించేవాళ్లు. కాలం గడుస్తున్నకొద్దీ మనుషుల్లో కామం, క్రోధం, మొదలైన దుర్గుణాలు ప్రవేశించాయి. వాళ్ల ప్రవర్తనలో మాయ కనిపించి దేవతలు వాళ్లని విడిచిపెట్టేశారు.

తరువాత వాళ్లు బలంలేని శరీరాలతోను, తగ్గిపోయిన ఆయుర్దాయంతోను, దరిద్రులై ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితాన్ని పొందుతూ, అనేక జబ్బులతో పీడింపబడడం మొదలైంది.

వేదాల్ని, దేవుణ్ని నిర్లక్ష్యం చేసి పాపకార్యాలు చేస్తూ మరణించిన తరువాత పశువులుగాను, పక్షులుగాను పుట్టడం మొదలుపెట్టారు. నరకంలో నిప్పులో వేగుతూ పుడుతూ చస్తూ మళ్లీ పుడుతూ సంసారచక్రంలో చిక్కుకుని బ్రతకడం మొదలుపెట్టారు.

ఇలా జననమరణాల వలయంలో చిక్కుకుని పుణ్యాలు, పాపాలు వదిలి పెట్టకుండా చెయ్యడం వల్ల చనిపోయిన తరువాత కూడా వాళ్లు చేసిన కర్మ నీడలా వాళ్ల వెంట నడిచి వెళ్లి, సుఖాలు మరిచిపోవడం, దుఃఖాలవల్ల కలిగే కష్టాల్ని కలుగచేసి శరీరాన్ని పొందేవాళ్లకి మళ్లీ మళ్లీ జన్మల్ని కలిగిస్తూనే ఉంటుంది.

ధర్మరాజా! నేను చెప్పేదాన్ని శ్రద్ధగా విను. మనుషులు తాము చేసిన పుణ్య పాపాల ఫలితాన్ని ఏ విధంగానైనా సరే అనుభవించక తప్పదు. శరీరం నశించిపోతుంది కాని, కర్మలు ఎప్పటికీ నశించవు.

ఈ భూలోకంలో కొందరు సుఖాలు అనుభవిస్తారు. కొందరికి పరలోకంలో సుఖం దొరుకుతుంది. కొందరికి ఇహపరలోకాల్లో మంచి జరుగుతుంది. కొందరికి ఇహంలోను, పరలోకంలోను కూడా సుఖం దక్కదు.

దాన్ని గురించి వివరంగా చెప్తాను విను. ఎక్కువ సంపదలు పొంది, పుణ్యం పొందే మార్గం వైపు పోకుండా లోభ, మోహాలకి లొంగి విషయసుఖాల్ని అనుభవించాలని మనసులో ఎప్పుడూ అనుకునేవాళ్లు పరలోక సుఖాలు పొందలేరు. వాళ్లకి ఇహలోక సుఖాలే మంచివిగా కనబడుతాయి.

నియమ నిష్ఠలతో ఉపవాసవ్రతాలు, వేదాధ్యయనం, తీర్థయాత్రలు మొదలైన పుణ్యకార్యాలు చేయడంవల్ల, ఈ లోకంలో అనుభవం దుఃఖమయమని, నిజమైన సుఖాలే అనుభవించాలన్న ఆలోచన కలగడం వల్ల ఎప్పుడూ పుణ్యాన్నే చేసేవాళ్లకి పరలోకంలో గొప్పసౌఖ్యాన్ని పొందే వీలు కలుగుతుంది.

ధర్మరాజా! ధర్మాన్ని ఆచరించి; ధర్మమార్గాన్ని అనుసరించి; ధనాన్ని, కీర్తిని ఆర్జించి; ధర్మబద్ధంగా వివాహం చేసుకుని సంతానాన్ని పొంది; మంచి పనులు చేసి; అభినందించదగిన యజ్ఞాలు చేసిన మంచివాళ్లు భూలోకంలోను పరలోకంలోను కూడా సుఖాలు పొందుతారు.

నిజాన్ని చెప్పక, ఇంద్రియ నిగ్రహం పాటించక, పరిశుభ్రత కలిగి ఉండక, చేయకూడని పనులు చేస్తూ నాస్తికులై తిరిగేవాళ్లు ఇహపరలోకాలకి రెండింటికీ పనికిరాకుండా చెడు నడవడికతో దుఃఖాన్ని అనుభవిస్తూ నశిస్తారు. మహారాజా! మీరు దేవతల అంశలతో ఈ భూలోకంలో జన్మించారు. దేవతల అనుగ్రహంతో వాళ్లకి మేలు చెయ్యడం కోసం మీరు పుట్టారు. ఇంక మీరు గొప్పదైన మీ పరాక్రమంతో శత్రువులందరినీ జయించి భూభారాన్ని తగ్గిస్తారు. అనేక యజ్ఞాలు చేసి దివ్యత్వాన్ని పొందుతారు.”

Exit mobile version