Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-115: సౌవీరకుమారుల్ని చంపిన అర్జునుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సౌవీరకుమారుల్ని చంపిన అర్జునుడు

ర్జునుడు కోపంతో గాండీవం నుంచి వచ్చిన బల్లేలతో సౌవీరకుమారుల ఆయుధాల్ని విరిచి తరువాత వాళ్లని కూడ సంహరించాడు (సౌవీరకుమారులు: అంగారకుడు, కుంజరుడు, సృంజయుడు, సుప్తకుడు, శత్రుంజయుడు, సుప్రబుద్ధుడు, శుభంకరుడు, భ్రమంకరుడు, శూరుడు, రథి, గుహకుడు, బలాడ్యుడు). యుద్ధప్రదేశమంతా పీనుగుపెంటలతో నిండిపోయింది.

అందమైన భుజకీర్తులు, రాజలాంఛనాలైన ఆభరణాలతో కూడిన చేతులు, కాళ్ల ముక్కలు; ధనస్సుల అమ్ములపొదుల ముక్కలు, ఇరుసులు, నొగలు, చక్రాలు, జెండాలు, మూడు ముల్లులున్న అంకుశాల ముక్కలు, రోకళ్లు, అడ్డకత్తులు, ఈటెలు ఎక్కడ చూసినా పోగులుగా పడి ఉన్నాయి.

అర్జునుడు సౌవీరసైన్యాన్ని చెండాడుతుంటే జయద్రథుడు ద్రౌపదిని తన రథం నుంచి కిందకి దింపి రథం తోలుకుని వేగంగా పారిపోయాడు. ధర్మరాజు ధౌమ్యుణ్ని, ద్రౌపదిని తన రథం మీద ఎక్కించుకున్నాడు.

సైంధవుడు పారిపోయిన విషయం తెలుసుకుని అర్జునుడు భీముడి దగ్గరికి వచ్చి  “భీమా! ఈ సౌవీరుల రాజు జయద్రథుడు సిగ్గులేకుండా యుద్ధాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అమాయకులైన సైన్యాన్ని చంపడం ఇంక ఆపు. మనం అతడినే వెంబడించి అతడి ప్రాణాలు తియ్యాలి” అని చెప్పాడు.

ధర్మరాజుతో అర్జునుడు “ధర్మరాజా! ద్రౌపదిని, ధౌమ్యుణ్ని తీసుకుని మీరు, నకులసహదేవులు వెళ్లిపొండి. నేను భీముడు జయద్రథుణ్ని సంహరించి వస్తాము. దేవతలు అడ్డుపడినా అతణ్ని విడిచిపెట్టం” అన్నాడు.

అతడి మాటలకి ధర్మరాజు “ఎంత దుర్మార్గుడైనా జయద్రథుడు ధృతరాష్ట్రుడి కూతురు దుస్సలకి భర్త. మనం దుస్సలని చూసి అతడి మొదటి అపరాధాన్ని క్షమించాలి. ధృతరాష్ట్రుడి రాణి గాంధారి బాధపడుతుందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని ద్రౌపది భీమార్జులతో “జయద్రథుడు పాపాత్ముడు. వాడి పట్ల దయ చూపించకూడదు. అతణ్ని చంపి నాకు ఇష్టాన్ని కలుగచేయండి” అని చెప్పింది.

ధర్మరాజు ధౌమ్యుడు, ద్రౌపది, నకులసహదేవులతో కలిసి ఆశ్రమానికి వెళ్లిపోయాడు.

భీమార్జునులు తమ రథాలమీద వేగంగా ప్రయాణం చేసి జయద్రథుణ్ని కలుసుకున్నారు. అర్జునుడు దూరం నుంచే బాణాలు వేసి జయద్రథుడి రథానికి కట్టిన గుర్రాల్ని నేల కూల్చాడు. భయపడి రథం నుంచి కిందకి దిగి ఆయుధాలు వదిలిపెట్టి నిట్టూరుస్తూ జయద్రథుడు పారిపోయాడు.

అతణ్ని చూసి నవ్వుతూ భీమార్జునులు “ఇంకెక్కడికి పోతావురా పిరికిపందా! ఈ పరాక్రమం చూసుకునేనా అంత అహంకారంతో మాట్లాడావు?” అంటూ అతణ్ని సమీపిస్తున్నారు. వాళ్లని చూసి భయంతో జయద్రథుడు పొదల్లో దాక్కున్నాడు.

భీముడు పళ్లు పటపట కొరుకుతూ రథం మీదనుంచి కిందకి దూకాడు. భీముడి పిడిగుద్దులతో మొహం గంట్లుపడి ముక్కునుంచి నెత్తురు కారింది. భీముడు అతణ్ని వదలకుండా స్పృహ తప్పేవరకు కొడుతూనే ఉన్నాడు.

అర్జునుడు భీముడితో “ఇంక చాలు ఆపు! ఇంకా కొడితే చచ్చిపోతాడు. అజాతశత్రువయిన ధర్మరాజు మాటలు గుర్తు చేసుకుని వీణ్ని వదిలెయ్యి” అన్నాడు.

భీముడు “ధర్మరాజు ఎప్పుడూ జాలి చూపించమనే చెప్తాడు. ఆయనకి లౌక్యం తెలియదు. జాలి చూపించడం వల్ల పనికి భంగం కలుగుతుందని ఆలోచించడు. నువ్వు కూడా అలాంటివాడివే. ఈ జయద్రథుణ్ని జాలి చూపించకూడదు” అన్నాడు.

సైంధవుణ్ని బంధించిన భీముడు

భీమసేనుడు జయద్రథుడి తల గొరిగి అయిదు శిఖలు ఉండేట్లుగా చేశాడు. అతడి రాజవేషం తీసేసి “నీచుడా! ఈ రోజునుంచి అన్ని సభల్లోను పాండవదాసుణ్నని చెప్పుకో” అని శాసించాడు.

జయద్రథుడు అందుకు అంగీకరించాడు. భీమార్జునులు సైంధవుడిని చేతులు వెనక్కి కట్టి తమ రథం మీద పెట్టుకుని వచ్చి ధర్మరాజు సమక్షంలో దించారు.

“ఇతడే జయద్రథుడు, పాండవదాసుడు” అని చెప్పారు. ధర్మరాజు “ఇతడు పాండవదాసుడు కనుక విడిచిపెట్టండి” అని చెప్పాడు.

ద్రౌపది జయద్రథుణ్ని పరిహాసం చేస్తూ “ఈ పాపాత్ముడు మీకు దాసుడు కనుక బంధవిముక్తుణ్ని చెయ్యండి” అని చెప్పింది. పాండవులు సైంధవుణ్ని విడిచిపెట్టారు.

అతడు ధర్మరాజుకి, ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులకి నమస్కరించాడు. ధర్మరాజు సైంధవుడితో “ఎటువంటి దుర్మార్గుడైనా ఇటువంటి పని చేస్తాడా? నువ్వు అల్పుడివి, ధైర్యవిహీనుడివి. నిన్ను ఏమని నిందించను? ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యకు. మంచి బుద్ధితో ఉండు. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్లిపో!” అన్నాడు.

సైంధవుడు సిగ్గుతో తలవంచుకుని అక్కడనుంచి బయలుదేరి గంగానది సముద్రం కలిసే ప్రదేశానికి వెళ్లి శివుణ్ని గురించి నిష్ఠతో తపస్సు చేశాడు. జయద్రథుడి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వరాన్ని కోరుకోమన్నాడు.

జయద్రథుడు శివుడికి నమస్కరించి “దేవా! పంచపాండవుల్ని వాళ్ల సేనలతో సహా నేను యుద్ధంలో జయించగలిగేలా వరం కావాలి!” అని ప్రార్థించాడు.

పరమేశ్వరుడు “జయద్రథా! నువ్వు పంచపాండవుల్ని వాళ్ల సైన్యంతో సహా జయించాలని కోరుకుంటున్నావు. ఇది సాధ్యంకాని కోరిక. ఎందుకంటే దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా యుద్ధంలో పాండవుల్ని జయించలేరు. ఇంక నీకు ఎలా సాధ్యపడుతుంది? అయినా నువ్వు గొప్ప తపస్సు చేసి నన్ను మెప్పించావు.

కనుక, నేను నీ కోరిక తప్పకుండా తీర్చాలి. ఏదో విధంగా తీరుస్తాను. అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని యుద్ధంలో ఒకరోజు మాత్రమే జయించేట్లు నీకు వరమిస్తున్నాను.

పాండవులు గొప్ప వీరులు వాళ్లల్లో నలుగుర్ని జయించగలవు. ఇది చాలు నీకు. అర్జునుడంటావా! అతడిని లోకాలన్నీ ఒక్కటై ఎదిరించినా గెలవలేవు. అంత గొప్ప పరాక్రమవంతుడు. నా అనుగ్రహం వల్లే అర్జునుడికి అంత మహిమ కలిగింది.

అంతేకాదు, అతడి ఇష్టసఖుడు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు. సమస్త అస్త్రాల, శస్త్రాల ఆంతర్యాల పరిజ్ఞానం కలవాడు కనుక అతడిని జయించడం ఎవరికీ సాధ్యం కాదు” అని చెప్పి పరమేశ్వరుడు అంతర్థానమయ్యాడు.

జయద్రథుడు తన దేశానికి వెళ్లిపోయాడు. అని వైశంపాయనమహర్షి జనమేజయమహారాజుకి భారతకథని వినిపించాడు.

Exit mobile version