[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ద్రౌపదిని మోహించిన సైంధవుడు
పాండవులు అయిదుగురు ఆ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పాండవులు పుణ్యాన్ని సంపాదించుకున్నారు. అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన్న గొప్ప ఋషులు నివసించే ఆశ్రమాలు ఉన్నాయి. అనేక మృగాలు తిరుగుతున్నాయి. ఒకరోజు పాండవులు అయిదుగురు ద్రౌపదిని, పురోహితుడు ధౌమ్యుడిని తృణబిందు ఆశ్రమంలో ఉంచి వేటకోసం అందరు తలొక వైపుకి వెళ్లారు.
సింధుదేశాన్ని పాలించే వీరుడు, పరాక్రమవంతుడుగా గొప్ప పేరు సంపాదించినవాడు సైంధవుడు. సాల్వరాజు కూతుర్ని పెళ్లి చేసుకోడానికి చతురంగ బలాలతో ప్రయాణం చేస్తున్నాడు. అతడు తృణబిందు ఆశ్రమం దగ్గర నిలుచుని ఉన్న ద్రౌపదిని చూశాడు. ఆమె అందాన్ని చూసి సైంధవుడు ఆశ్చర్యపోయాడు.
అమె నుంచి చూపులు మరల్చుకోలేక తన ప్రాణమిత్రుడు ‘కోటికాస్యుడు’ అనే రాజకుమారుణ్ని పిలిచి “స్నేహితుడా! ఆమెని చూసావు కదా! ఈ సౌందర్యవతి ఎవరు? ఒంటరిగా ఈ అరణ్యంలో ఏం చేస్తోంది? ఈ లోకోత్తరసౌందర్యవతి దేవకన్యా? యక్షకన్యా? నాగకన్యా? మానవకన్య మాత్రం కాదు. సుకుమారంగా ఉన్న ఆ కన్య నాకు కావాలి. వెళ్లి మాట్లాడి రా!” అన్నాడు.
కోటికాస్యుడు ద్రౌపది దగ్గరికి వెళ్లి ఆత్మీయత ఉట్టిపడేలా “ఓ సౌందర్యవతీ! భయంకరమైన జంతువులు తిరిగే ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు? నువ్వు వనదేవతవా? దేవేంద్రుడితో కలహించి భూలోకానికి వచ్చిన శచీదేవివా? నిన్ను కన్న అదృష్టవంతుడు ఎవరు? అతడిది ఏ వంశం? నీ భర్త ఎవరు? నీ పేరేమిటి?” అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు.
మళ్లీ అతడే “మా విషయం నీకు తెలియదు కనుక నేనే వివరిస్తాను విను. నేను సురథుడు అనే మహారాజు కొడుకుని. గొప్ప బలవంతుణ్ని. నా పేరు కోటికాస్యుడు. అక్కడ రథం మీద వెలుగుతున్నవాడు త్రిగర్తదేశానికి రాజు క్షేమంకరుడు.
నీ వైపే కోరికతో చూస్తున్నవాడు కళింగదేశానికి అధిపతి. దూరంగా తామ్రకొలను దగ్గర నిలబడి నీ వైపే చుస్తున్నవాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సుబలుడు అనే రాజకుమారుడు. అతడు చాలా భాగ్యవంతుడు.
ఎర్రని గుర్రాలు కట్టబడిన రథాల మీద మణులు పొదిగిన ఆభరణాలు ధరించి వెలుగుతున్న అగ్నిలా ప్రకాశిస్తున్న సౌవీరరాజకుమారులు పన్నెండుమంది కొలుస్తుండగా కూర్చుని ఉన్న జయద్రధుడు నీ వివరాలు తెలుసుకుని రమ్మని పంపించాడు.
అతడి వైభవం చెప్తాను విను. అనేక వేల చతురంగ బలాలు రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలిబలాలు కనిపిస్తున్నాయి కదా వాటి మధ్య ఏనుగు మీద కూర్చుని ఉన్నవాడు సింధు సౌవీర దేశాలకి అధిపతి అయిన జయద్రధుడు” అని వివరించాడు.
ద్రౌపది తత్తరపడి “కోటికాస్యా! ఈ అరణ్యంలో ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న నా దగ్గరికి నువ్వు ఇలా రావడం సమంజసం కాదు. నేను ధర్మపరురాలిని, కొడుకులు గలదాన్ని. సామాన్య స్త్రీగా అనుకుని అధికంగా మాట్లాడడం మంచిది కాదు. దానవీరుడిగా పేరుపొందిన శిబిచక్రవర్తి వంశంలో పుట్టిన సురథుడి కొడుకువి నువ్వు. నీ గురించి నాకు తెలుసు.
ఇంక నా గురించి చెప్తాను విను. నేను పాంచాలదేశపు రాజు ద్రుపదుడి కూతుర్ని. నన్ను కృష్ణ అని పిలుస్తారు. పాండురాజు కొడుకులు ధర్మరాజు, భీముడు అర్జునుడు, నకులుడు, సహదేవులకి ధర్మపత్నిని. వీరులైన పాండవులు నన్ను ఈ అరణ్యంలో ఉంచి ధర్మరాజు తూర్పు దిక్కుకి, భీముడు దక్షిణ దిక్కుకి, అర్జునుడు పడమటి దిక్కుకి, నకులసహదేవులు ఉత్తర దిక్కుకి వేటకి వెళ్లారు.
రాజుల్లో గొప్పవాళ్లు, పుణ్యాత్ములు, పరాక్రమం కలిగిన పాండవులు కొద్దిసేపటిలో తిరిగి వస్తారు. మీరు కొంచెం సేపు ఆశ్రమానికి దగ్గరలో ఉండండి. పాండవులు వచ్చి మీకు అతిథి మర్యాదలు చేస్తారు” అని చెప్పి ద్రౌపది భయపడుతూ పర్ణకుటీరంలోకి వెళ్లిపోయింది.
కోటికాస్యుడు తిరిగి వెళ్లి ఆమె పాండవుల ధర్మపత్ని అని చెప్పాడు. దుర్మార్గుడైన సైంధవుడు ద్రౌపదిని బలవంతంగా తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు. కొంతమంది సేవకులతో వెళ్లి ద్రౌపదిని పలకరించి “పాండవులు క్షేమంగా ఉన్నారా?” అని అడిగాడు. ద్రౌపది అతణ్ని కూర్చోమని చెప్పి భోజనం చేసి పాండవులు వచ్చి ఇచ్చే అతిథిమర్యాదలు స్వీకరించి వెళ్లమని చెప్పింది.
జయద్రథుడు అమె మాటలు విని “నువ్వు చేసిన అతిథిమర్యాదలు చాలు. నువ్వు వచ్చి రథం ఎక్కి నన్ను ధన్యుణ్ని చెయ్యి. రాజ్యాన్ని పోగొట్టుకుని తోటివాళ్లు వెక్కిరిస్తూ ఉంటే అడవుల్లో పడి కష్టాలు పడుతున్న పాండవుల్ని సేవించడం నీ తెలివి తక్కువ.
నేను సమస్తమైన సింధు సౌవీర రాజ్యాల్ని ఏలుకునే మహారాజుని. నన్ను నువ్వు ఏలుకున్నావంటే భోగభాగ్యాలన్నింటినీ తృప్తిగా అనుభవించవచ్చు” అన్నాడు.
ద్రౌపది కోపంతో రగిలిపోయింది. పాండవుల రాకకోసం చూస్తూ “ధృతరాష్ట్రుడి కుమార్తె దుస్సల కౌరవ పాండవులకి సోదరి కదా! దుస్సల నీ భార్య అయినప్పుడు నువ్వు నాకు సోదరుడివే అవుతావు. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ధర్మాన్ని వదిలిపెట్టి వ్యతిరేక మార్గంలో వెళ్లకూడదు” అంది.
ఆమె మాటలు విని “ద్రౌపదీ! సాధారణ మనుష్యుల ధర్మం వేరు. రాజధర్మం వేరు. రాజులకి స్వేచ్ఛ ఉంది. వావివరుసలు చూడక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు ఆనందాన్ని పొందవచ్చు.
స్త్రీలు అందరు అనుభవించ తగినవాళ్లే కాని, ఒకళ్ల సొత్తు అని చెప్పకూడదు. ఒకళ్లకి చెందిన సొత్తు అనడానికి హద్దు ఏమున్నది?” అన్నాడు.
ద్రౌపది కోపంతో ఈ దుష్టుడు మంచిమాటలకి లొంగడు, కఠినంగానే మాట్లాడాలి అనుకుని “రాజుల్లో పుట్టిన నీచుడా! జయద్రథా! పాండవులు పరాక్రమవంతులని లోకానికి తెలుసు. ఏ కళంకము లేని కీర్తిని పొందిన పాండవుల్ని లెక్కచేయకుండా నన్ను అవమానిస్తున్నావు. అహంకారంతో మాట్లాడావంటే నువ్వు దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావు.
కుంతికొడుకుల్లో ఉత్తమమైనవాడు ధర్మాత్ముడు, గొప్ప పరాక్రమం కలిగిన ధర్మరాజుని నువ్వు ఎదిరించడం.. హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న అడవిలో తిరుగుతూ కోపంతో ఎర్రటి కళ్లతో ఉన్న మత్తేభానికి అంకుశం చూపించినట్టు ఉంటుంది.
భీముడితో తలపడడమంటే గుహలో నిద్రించే సింహం జూలులో ఉన్న వెంట్రుకల్ని పట్టి ఊగించడానికి చేసే సాహసంలా ఉంటుంది. గాండీవాన్ని ధరించిన అర్జునుడికి కోపం తెప్పిస్తే బతిక బట్టకట్టే అవకాశమే ఉండదు. క్రూరమైన బాణాల్ని అగ్నిలా గుప్పించే అర్జునుడి బారి నుంచి తప్పించుకోవడం అసాధ్యం.
నకులసహదేవులతో పెట్టుకుంటే వేగంగా నిప్పులు కక్కుతూ భయంకరమైన విషాన్ని కక్కుతూ కాటువేయడానికి నాలుకలు చాస్తూ మీదకి ఉరికే పాములజంటని పాదాలతో తొక్కినట్టే.
యుద్ధంలో రాక్షసులుగాని, దేవతలుగాని పాండవుల్ని ఓడించలేరు. వాళ్లకి కీడు చెయ్యాలని అనుకోవడం అవివేకం. నీకు ఆయువు తీరింది. ఇంక చావు తప్పదు. విధి నుంచి తప్పించుకోలేవు. అందుకే పాండవుల ధర్మపత్నినైన నా మీద చెడుస్వభావం చూపించావు” అంది ద్రౌపది.
ఆమె మాటలు విని జయద్రథుడు నవ్వుతూ “పాండవుల సంగతి మాకు చాలాకాలం నుంచి తెలుసు. ఇప్పుడు నువ్వు వాళ్ల పరక్రమాల గురించి వర్ణించి భయపెట్టక్కర్లేదు. మేము పిరికివాళ్లం కాదు. సౌవీరుల వంశంలో పుట్టిన పరాక్రమవంతులం. గొప్ప స్వభావం కలిగిన మమ్మల్ని ఇతర రాజుల్ని అనుకున్నట్టుగా అనుకోకు.
అన్ని మాటలు అనవసరం. అదిగో నా బంగారు రథం. దాన్ని ఎక్కు. లేదా కనిపిస్తున్న ఆ గొప్ప ఏనుగుని ఎక్కు. ఆత్మప్రశంసలు మాని నా అనుగ్రహాన్ని అందుకో” అన్నాడు.
అతడి మాటలు విని ద్రౌపది “జయద్రథా! నేను వీరుల ఇంట్లో పుట్టిన ఆడవడుచుని. వీరులకి ధర్మపత్నిని. నీకు నేనెలా కనిపించినా ఫరవాలేదు. నీకు చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు.
యదువంశానికి సింహంలాంటి శ్రీకృష్ణుడు నాకు సోదరుడు. సాటిలేని వృష్టి, కేకయ సేనా సమూహలతో పాంచజన్యమనే శంఖధ్వనితో ముల్లోకాలు దద్దరిల్లేట్టుగా వేగంగా నడిచే గుర్రాలు కట్టబడిన రథమెక్కి వస్తాడు. నిన్నెదిరించి నీ బలపౌరుషాలు పోగొట్టినప్పుడు కాని, నీకు దిక్కుందో లేదో తెలుస్తుంది.
నువ్వు చేసిన తప్పులకి పశ్చాత్తాపం చెందే సమయం వస్తోంది. అర్జునుడు వేగంగా వస్తాడు. అర్జునుడి బాణవర్షంలో మునిగి ఉక్కిరిబిక్కిరై ప్రాణ భయంతో పారిపోతావు.
భీమసేనుడు రావడం కళ్లారా చూస్తేగాని నీ మిడిసిపాటు తగ్గదు. ఇతర స్త్రీలని అవమానించినట్టు నన్ను అవమానించకు. పరమపవిత్రమైన నా పాతివ్రత్యము నన్ను కాపాడుతుంది” అని చెప్పింది.
కాని సైంధవుడి చూపుల్లో ఉన్న క్రూరత్వాన్ని చూసి భయంతో తమ పురోహితుడు ధౌమ్యుణ్ని పేరు పెట్టి గట్టిగా పిలిచింది.
ద్రౌపదిని అపహరించిన సైంధవుడు
ద్రౌపది కేక విని ధౌమ్యుడు పరుగెత్తుకుని వచ్చాడు. కాని ఆ సమయానికే ద్రౌపదిని బంధించి రథం మీద పెట్టుకుని వెళ్లిపోతున్నాడు. అతడి అనుచరులు అతణ్ని వెంబడించారు. ద్రౌపది పురోహితుడు ధౌమ్యుడికి నమస్కరించింది.
ధౌమ్యుడు సైంధవుడితో “సైంధవా! నీవంటి రాజవంశంలో పుట్టినవాడికి ఇటువంటి పాపపు పని చెయ్యడం తగినపని కాదు. నా మాట విను. ఈ ద్రౌపది పుణ్యాత్మురాలు. పతివ్రతా శిరోమణి. వెంటనే ఆమెని వదిలిపెట్టు. పాండవులు తప్పకుండా నీ ప్రాణాన్ని, మానాన్ని తీసేస్తారు. ఈ పాపం నిన్ను వదిలిపెట్టదు” అని గట్టిగా అరుస్తూ ధౌమ్యుడు అతడి రథం వెనక పరుగెత్తాడు.
పాండవులు వేట పూర్తిచేసుకుని అందరు ఒకచోట కలిసి వస్తున్నారు. ధర్మరాజు తమ్ముళ్లతో “సోదరులారా! ఎన్నో అపశకునాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మనకి శత్రువుల వల్ల అవమానము, యుద్ధము కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మనస్సులో ఏదో బాధ రగులుతోంది. ఆలోచనలు అనేక విధాలుగా పోతున్నాయి.
ధ్రుతరాష్ట్రుడి కొడుకులు దుష్టబుద్ధి కలవాళ్లు. ద్రౌపదిని ఒంటరిగా విడిచిపెట్టి వచ్చాము. సమయం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. మనం ఆశ్రమానికి తొందరగా వెళ్లాలి. ఎటువంటి ఆపద కలగబోతోందో” అన్నాడు.
వెంటనే పాండవులు తమ రథాలు తోలుకుని వేగంగా ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో ద్రౌపది దాసి నేల మీద పడి దొల్లుతూ గట్టిగా ఏడుస్తోంది. ధర్మరాజు సారథి ఇంద్రసేనుడు రథం మీదనుంచి దూకి దాసి దగ్గరికి వెళ్లి “ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఎవరు అపకారం చేశారు” అని అడిగాడు.
సైంధవుడు ద్రౌపదిని బలాత్కారంగా రథం మీద తీసుకుని వెళ్లిపోయాడని చెప్పి ఇంకా గట్టిగా ఏడుస్తోంది. ఇంద్రసేనుడు దాసిని ఒదారుస్తూ “వాడు ఎక్కడికి వెళ్లగలడు? ఆకాశంలో ఎగిరిపోతున్నా వాడిని పాండవులు వదిలిపెట్టరు. ధాత్రేయికా! ఏడవకు. పరాక్రమవంతులైన పాండవులు జయద్రథుణ్ని చంపి ద్రౌపదిని విడిపించుకుని వస్తారు” అని ఊరడించాడు.
ధాత్రేయిక “ఇంద్రసేనా! జయద్రథుడు ఇప్పుడే కొన్ని నిముషాల క్రితమే వెళ్లాడు. అతడు దురంగా వెళ్లకుండానే మీరు రథాలనెక్కి యుద్ధసన్నాహంతో వెళ్లండి.
అస్త్రశస్త్రాలు సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధంగా పెట్టుకోండి. కవచాలు ధరించి దివ్యబాణాలు ప్రయోగించి శత్రువుల్ని సంహరించండి. జయద్రథుడితో అపవిత్రం కాకమునుపే ద్రౌపదిని విడిపించుకుని రండి!” అని ఏడుస్తూ ప్రార్థించింది.
సైంధవుడితో పాండవుల యుద్ధం
ధాత్రేయిక చెప్పిన మాటలు విని పాండవులు అయిదుగురు ఆమెని ఓదార్చారు. వెంటనే యుద్ధానికి సిద్ధమై కోపంతో బుసలు కొడుతున్న మహాసర్పాల్లా సైంథవుణ్నివెంబడించారు.
అతడి సైన్యం వెంట కేకలువేస్తూ బాధపడుతూ పరుగులు పెడుతున్న ధౌమ్యుణ్ని చూసి నమస్కరించి “మీరింక బాధపడకండి, నెమ్మదిగా రండి” అని చెప్పి సింహనాదాలు చేస్తూ సైంధవుడి సైన్యాన్ని చేరుకున్నారు.
సైంధవుడు వాళ్ల రథాలని గుర్తుపట్టి “ద్రౌపదీ! ఆ రథాల మీద వస్తున్న అయిదుగురూ నీ భర్తలే కదా! వాళ్ల గురించి వివరంగా చెప్పు. నేను వాళ్ల గురించి తెలుసుకోవాలి కదా!” అన్నాడు.
ద్రౌపది కోపంతో “పాండవుల గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నీకు గత్యంతరం ఏముంది? దురంహంకారంతో చెడు నడవడికతో ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. ఇది నీ స్వయంకృతాపరాథం అనుభవించక తప్పదు. నువ్వు ప్రార్థించావు కనుక చెప్తున్నాను.
ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్లతో వచ్చాడు. ఇంక నాకు ఏ భయమూ లేదు. దగ్గరలో రథం మీద కనిపిస్తున్న సన్నని గుండ్రని శరీరం కలవాడు, అచ్చమైన బంగారు రంగుతో మిలమిలలాడే శరీరకాంతి కలవాడు, అప్పుడే వికసించిన పద్మాలవంటి అందమైన వాలుకన్నులు కలవాడు, దేదీప్యమానమైన వర్చస్సుతో వెలుగుతున్నవాడు, పుణ్య నడవడిక కలిగిన మహానుభావుడు, ఎదురులేని పరాక్రమం కలవాడు, అతిలోక ప్రతిభ ప్రదర్శించే ధర్మరాజు అతడే!
ధర్మరాజు కురువంశంలో గొప్పవాడు. అతడు అజాతశత్రువు. తనను ఆశ్రయించి శరణువేడినవాళ్లని శత్రువైనా సరే కాపాడగల స్వభావం కలవాడు. ఇప్పటికైన మించిపోయింది లేదు. ఆ మహానుభావుణ్ని శరణు వేడుకో” అంది.
“అదిగో ఆ రథం చూడు గొప్ప వేగం కలిగిన గుర్రాల్ని కట్టి ఏపుగా ఎదిగిన సాలవృక్షంలా కనిపిస్తున్నవాడు; స్పష్టమైన బొమముడితో, పెదవిని కొరుకుతున్న దంతాలతో భయంకరంగా కనిపిస్తున్నవాడు భీమసేనుడు.
యుద్ధాల్లో భయంకరుడు అనే సార్థక నామధేయం కలవాడు. భీమసేనుడి పరాక్రమం మానవులకి ఉండే పరాక్రమం కాదు. అతడికి అతడే సాటి. ఎక్కడా అతడికి ఎదురు ఉండదు. ఆశ్చర్యం కలిగించే అతడి పరాక్రమం చూసి యుద్ధంలో అతణ్ని ఎదిరించడానికి రాజులు భయపడతారు.
ఆ మహావీరుడు ఆగ్రహిస్తే ప్రళయకాలంలో అగ్నిహోత్రుడిలా విజృంభిస్తాడు. ధర్మరాజుకి ఇష్టమైన తమ్ముడు, అనువైన శిష్యుడు మంచిప్రవర్తన కలిగినవాడు.
అర్జునుణ్ని చూడు. అతడు మహావదాన్యుడు, ఇంద్రియనిగ్రహం కలవాడు, స్వచ్ఛమైన వర్చస్సు కలవాడు, ఎవరికి జయించడానికి విలుకానివాడు, దేవేంద్రుడికి కుమారుడు. కోరికలు, కోపతాపాలు కలిగినా ధర్మమార్గాన్ని తప్పనివాడు.
అడుగో ఆ పుణ్యాత్ముడు లోకానికి మంచి కలిగించే నీతి వివరాలు తెలిసినవాడు, విజ్ఞానంతో కూడిన వినయం కలవాడు, దీనులైన ప్రజల్ని కాపాడి ధ్యైర్యం కలిగించేవాడు, యుద్ధం చెయ్యడంలో గడుసుతనాన్ని ప్రదర్శించేవాడు, బంధువులకి ఇష్టుడు, పరోపకారం చేసేవాడు, సాటిలేని సౌందర్యం కలిగినవాడు, పాండవుల్లో రత్నం వంటివాడు, భూలోకంలో పేరుప్రతిష్ఠలు పొందినవాడు నకులుడు.
ఇంక సహదేవుణ్ని గురించి చెప్పాలంటే అతడు మానవమాత్రుడు కాదు. అతిలోక తేజస్వి, దేవతలతో సమానమైనవాడు.. గొప్ప పరాక్రమము, గురిచూసి ఆయుధాలు ప్రయోగించగల లక్ష్యము కలవాడు.
బుద్ధికుశలత కలిగిన మేధావి. పొంకంగా తూచి తూచి మాట్లాడే స్వభావం కలవాడు. ధర్మనిర్వహణ కలిగిన సమర్థుడు. పాండవులు అనురాగంతో చూసుకునే తమ్ముడు. అతడే సహదేవుడు.
కుంతీదేవికి సహదేవుడి మీద ప్రేమ ఎక్కువ. ఈ మహాత్ముడు సత్యసంధుడు. భూమి కంపించినా, అగ్ని చల్లబడినా కూదా ధర్మనిష్ఠ వదిలిపెట్టడు. పాండవుల్ని ఎవరూ జయించలేరు.
నీ సైన్యం పాండవులకి చిక్కితే సముద్రం మధ్యలో మొసళ్లకి చిక్కి బద్దలయ్యే నౌకలా నాశనం అయిపోతుంది. నువ్వు కూడా ప్రాణాన్ని, గౌరవాన్ని పోగొట్టుకుంటావు” అని ద్రౌపది సైంధవుణ్ని హెచ్చరించింది.
అప్పటికే సైంధవుడు పాండవుల సైన్యాన్ని చుట్టుముట్టి బాణాలు ప్రయోగించాడు. జయద్రథుడు సైన్యాన్ని వెళ్లిపోవద్దని హెచ్చరిస్తూ, కదలకండి, చుట్టుముట్టండి, ధైర్యంతో నిలబడండి, వేగంగా గుచ్చండి, ఐకమత్యంతో పోరాడండి అని ప్రోత్సహిస్తూ రణరంగంలోకి వచ్చాడు. త్రిగర్త, శిబి, సింధు సేనలతో కలిసి సైంధవుడు విజృంభించాడు.
భీముడు రణరంగంలో యథేచ్ఛగా తిరుగుతూ ఏనుగుల్ని, రథాలతో సహా సారథుల్ని, గుర్రాల్ని, కాల్బలాల్నీ గదా కౌశలంతో నేలమట్టం చేశాడు. ధర్మరాజు విలువిద్య ప్రావీణ్యంతో నూరుమంది సౌవీర రథయోధుల్ని చంపాడు.
నకులుడు యుద్ధభూమి మొత్తం శత్రువుల తలకాయలతో నిండిపోయేలా చేశాడు. సహదేవుడు అశ్వికుల్ని సంహరించి వీరవిహారం చేశాడు.
సముద్రంలా ఉన్న సింధు సైన్యాన్ని అర్జునుడు మందరపర్వతంలా తిరుగుతూ కుదిపేశాడు. అర్జునుడు రెండు చేతులతో వేగంగా బాణాలు వదులుతుంటే తిప్పుతున్న కొరివిలా కనిపించింది.
యుద్ధభూమి భీభత్సంగా తయారయింది. భీకరంగా జరుగుతున్న యుద్ధంలో భీమసేనుడు కోటికాస్యుణ్ని చంపాడు.