[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
దుర్యోధనుణ్ని పాతాళానికి తీసుకెళ్లిన కృత్య
దేవేంద్రుడితో యుద్ధం చేసి ఓడిపోయిన రాక్షసనాయకులు ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు నిరాహారదీక్ష చేస్తున్నాడని తెలుసుకున్నారు. తమ వర్గానికి నాశనం మొదలయిందని బాధ పడ్డారు. శుక్రుడు మొదలైన బ్రాహ్మణుల్ని పిలిచి పాతాళహోమం చేయించారు.
దాన్నుంచి భయంకరమైన అంగవైకల్యం కలిగిన రూపంతో ‘కృత్య’ ఆవిర్భవించింది. నేను చేయవలసిన పనేమిటో చెప్పండి! అంది. అమరణ నిరాహార దీక్ష చేస్తున్న దుర్యోధనుణ్ని పాతాళానికి తీసుకుని రమ్మని చెప్పారు రాక్షస నాయకులు.
కృత్య వెంటనే బయలుదేరి భూలోకానికి వెళ్లి అక్కడ నిరాహార దీక్షలో ఉన్న దుర్యోధనుణ్ని ఎత్తుకుని తీసుకుని వచ్చి రాక్షసులకి అప్పగించింది.
రాక్షసులు దుర్యోధనుణ్ని ప్రేమగా పలకరించి యోగక్షేమాలు అడిగి “నాయనా! దుర్యోధనా! నువ్వు వీరుడివి. మహావీరులతో సేవలందుకుంటున్నావు. భరతవంశాన్ని ఉద్ధరించడానికి పుట్టావు. ఇటువంటి పని ఎందుకు చేస్తున్నావు? పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావు. అందువల్ల నీకు ఈ ప్రపంచంలో అపకీర్తి కలుగుతుంది.
నీవంటి మేధావులు ఇటువంటి పని చేస్తే అందరూ హీనంగా అనుకుంటారు. ధర్మార్థాల్ని, సర్వసౌఖ్యాల్ని నాశనం చేసే ఈ చెడు ఆలోచన నీకు ఎలా కలిగింది? ఈ ఆలోచన వదిలిపెట్టి ధైర్యంతోను, శౌర్యంతోను శత్రువుల్ని నాశనం చెయ్యి.
నువ్వు సాధారణ మనిషివి కాదు. నీకు నీ పూర్వజన్మ వృత్తాంతం చెప్తాము విను. నువ్వు ఎంత గొప్పవాడివో నీకే తెలుస్తుంది! దుర్యోధనా! రాక్షసులం మేమందరం పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేశాము. కోరిన వరాలని ప్రసాదించే ఆ పరమశివుడు మా తపస్సుని మెచ్చుకుని నిన్ను సృష్టించి మాకు అధినేతగా ఇచ్చాడు.
పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి నీ శరీరాన్ని ప్రత్యేక లక్షణాలతో నిర్మించాడు. నీ శరీరంలో శిరస్సు నుంచి బొడ్డు వరకు ఉన్న భాగం వజ్రంతో తయారు చెయ్యబడింది. అస్త్రాలు, శస్త్రాలు నీ శరీరాన్ని ఖండించలేవు.
నువ్వు కారణజన్ముడవై భూలోకంలో పుట్టగానే నీకు సహాయం చెయ్యడానికి అన్ని తెగలకి చెందిన రాక్షసులు క్షత్రియ వంశాల్లో జన్మించారు. వాళ్లందరు గొప్ప పరాక్రమవంతులు. భగదత్తుడు మొదలైనవాళ్లు దివ్యాలైన అస్త్రాలు, శస్త్రాలు ప్రయోగించగలిగిన నేర్పుకలవాళ్లు, శత్రువుల్ని తరిమిగొట్టగలిగినవాళ్లు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మొదలైనవాళ్లు కూడా దేవతల మహిమల్ని పంచుకుని పుట్టిన మహానుభావులే.
కాని రాక్షసప్రభావం ప్రసరించడం వల్ల క్రూరులై ఒకళ్లనొకళ్లు నిందించుకుంటూ అవివేకంగా ప్రవర్తిస్తూ కొడుకులు, మనుమలు, స్నేహితులు, సోదరులు, శిష్యులు, గురువులు, పిన్నలు పెద్దలు అనే విచక్షణ లేకుండా యుద్ధం చేస్తారు.
పాండవుల మీద దేవతామహిమ కలిగిన ఆయుధాల్ని ప్రయోగించి వాళ్ల సేనల్ని నాశనం చేస్తారు. పాండవులు చుట్టరికం మర్చిపోయి సాహసంతో నీతో యుద్ధం చేసి మరణిస్తారు.
నీ మనస్సులో అర్జునుడి మీద కొంచెం భయం ఉంది. దానికి ఒక ఉపాయం ఆలోచించాం. శ్రీకృష్ణుడి చేత నరకాసురుడు సంహరించబడ్డాడు. అతడి అంశ కర్ణుడిలో ప్రవేశిస్తుంది. కర్ణుడు గొప్ప పరాక్రమంతో శ్రీకృష్ణుణ్ని, అర్జునుణ్ని సంహరిస్తాడు.
ఇంద్రుడు పాండవుల్ని రక్షించడానికి అతడి కవచకుండలాల్ని అపహరిస్తాడు. అంటే కర్ణుడి ముందు అర్జునుడు తక్కువనే ఇంద్రుడి భయమని అర్థమవుతోంది కదా! ఇప్పుడు మేము వివరించి చెప్పేది జాగ్రత్తగా విను. భూలోకంలో కోట్లకొలదీ రాక్షసవీరులు గొప్ప గర్వంతో ‘సంశప్తకులు’ అనే పేరుతో పుట్టారు. వాళ్లు యుద్ధరంగంలో మరణమో, వీరస్వర్గమో తేల్చుకుని పోరాడే వీరులు. వాళ్లే అర్జునుణ్ని ఓడిస్తారు.
మహారాజా! ఎటువంటి ఆటంకాలు లేని భూలోకం నీ పాలనలోకి వస్తుంది. నువ్వు ఏకచ్ఛత్రాధిపతివై ఏలుకుంటావు. నువ్వే మాకందరికి అండ. రాక్షసులకి బాధ కలిగేట్టు నువ్వు బాధపడడం న్యాయం కాదు.
నీ మనస్సులోకి మరొక ఆలోచన రానీయకు. నీకు విజయం కలుగుతుంది” అని చెప్పి దుర్యోధనుణ్ని కౌగలించుకుని ఊరడించి పంపించారు.
రాక్షస నాయకుల ఆజ్ఞప్రకారం కృత్య దుర్యోధనుణ్ని తీసుకుని వెళ్లి తాను తెచ్చిన స్థలంలో విడిచిపెట్టి వచ్చింది. తరువాత దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. జరిగినది కలో నిజమో తెలియక కొంచెంసేపు ఆలోచించుకుని తరువాత నిజమే అని నిర్ణయించుకున్నాడు.
దురాశ వల్ల మనసు చెదిరి యుద్ధంలో పాండవుల్ని జయించాలని ఆశపడ్డాడు. జనమేజయమహారాజా! దుర్యోధనుడు ఆ రాత్రి జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని తన మనస్సులో నిర్ణయించుకున్నాడు.
తెల్లవారిన తరువాత కర్ణుడు వచ్చి “దుర్యోధన మహారాజా! చచ్చిపోయిన తరువాత బలవంతులైన విరోధుల్ని చంపగలమా? ఎక్కడయినా చావులు మంచిని కలిగిస్తాయా? వ్యర్థంగా చస్తానంటే ఎవరయినా మెచ్చుకుంటారా? శరీరంలో ప్రాణాలున్నప్పుడే గెలుపు వలన కలిగే సౌఖ్యాలు అనుభవించగలం. ఇది బాధ పడవలసిన సమయంకాదు. నువ్వు పరాక్రమ ప్రాభవాలతో విలసిల్లవలసిన సమయం” అని ఉత్సాహపరుస్తూ ప్రేమతో కౌగలించుకున్నాడు.
తరువాత మళ్లీ దుర్యోధనుడితో కర్ణుడు “నీ మనస్సులో అర్జునుడి మీద భయం దాగి ఉంది. నేను ఇప్పుడే ఆయుధం మీద శపథం చేసి చెప్తున్నాను. పధ్నాలుగో సంవత్సరంలో భయంకర యుద్ధంలో అర్జునుడిని సంహరిస్తాను!” అన్నాడు.
హస్తినాపురం చేరిన దుర్యోధనుడు
ఇటు కర్ణుడు చేసిన శపథం, రాత్రి రాక్షసులు చెప్పిన ఉత్సాహవంతమైన మాటలు తలుచుకుని దుర్యోధనుడు ప్రాయోపవేశం మానడానికి నిశ్చయించుకున్నాడు. మంత్రుల్ని పిలిచి ప్రయాణానికి సిద్ధం చెయ్యమన్నాడు. దుర్యోధన మహారాజు కనిపించగానే చంద్రుడి దర్శనంతో ఉప్పొంగిన సముద్రంలా సైన్యం మొత్తం ఉత్సాహంతో ఉరకలెత్తుతూ బయలుదేరింది.
శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైన తమ్ముళ్లతోను, మంత్రులతోను కలిసి దుర్యోధనుడు హస్తినాపురం చేరి రాచఠీవితో కొలువుతీర్చి ఉన్నాడు.
ఒకరోజు భీష్ముడు దుర్యోధనుడితో “అనుభవజ్ఞులు, గౌరవించదగిన పెద్దలు నీకు మంచి చెప్పి ఘోషయాత్రకి వెళ్లద్దని చెప్పారు. నువ్వు గర్వంతో చెడ్డవాళ్ల మాటలు విని వెళ్లావు. నీ పనికిరాని సాహసం ఎలా అయిందో తెలిసిందిగా! అజాతశత్రుడు, మహానుభావుడైన ధర్మరాజు ఉండడంవల్ల నువ్వు బతికి బయట పడ్డావు. లేకపోతే గంధర్వుడైన చిత్రసేనుడి చెరసాలలో మ్రగ్గుతూ ఉండేవాడివి.
నీకు కర్ణుడంటే చాలా ప్రేమ కదా. నువ్వే చూశావుగా అతడి పరాక్రమం. నీ తమ్ముళ్లు, స్త్రీలు, స్నేహితులు అందరు గంధర్వులకి చిక్కినప్పుడు నువ్వు మహావీరుడు అనుకుంటున్న కర్ణుడు పిరికిపందలా మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోయేడు కదా! నీ ప్రాణమిత్రుడు కర్ణుడు గురించి ఇప్పటికైనా నీకు అర్థమయిందా?
పాండవులు పరాక్రమం కలవాళ్లు. భయంకరమైన శక్తితోపాటు పూజించబడే మంచితనం కలవాళ్లు. వాళ్ల పరాక్రమంలోను, ఆయుధాలు ప్రయోగించడంలోను వాళ్లకున్న నేర్పరితనంలో పదహారో వంతు కూడా లేనివాడు కర్ణుడు.
అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతాడు. గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు పాండవుల పరాక్రమామన్ని, కర్ణుడి పారిపోవడాన్ని నువ్వే చూశావుకదా! నీ వంశాన్ని పాడుచేసుకోకు. నీ సంపదల్ని పోగొట్టుకోకు. పాండవులతో స్నేహంగా ఉండి సుఖంగా ప్రశాంతంగా జీవించు. నీ మేలుకోరి మంచి చెప్తున్నాను” అన్నాడు.
భీష్ముడు చెప్పిన మాటల్ని దుర్యోధనుడు గౌరవించలేదు. కర్ణుణ్నీ, శకునినీ చూసి నవ్వుకుంటూ తమ్ముళ్లతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. భీష్ముడు సిగ్గుపడి తన ఇంటికి వెళ్లిపోయాడు.
దుర్యోధనుడు మళ్లీ అక్కడికే వచ్చి మంత్రులతో “ఇప్పుడు మనం ఏంచెయ్యాలి? ఏం చేస్తే మన కీర్తి పెరుగుతుంది?” అని అడిగాడు.
అతడితో కర్ణుడు “రాజా! నువ్వు ఈ బాధలు లేకుండ ఈ నేలనంతనీ దేవేంద్రుడిలా ఏలుతూ అన్ని సౌఖ్యాలు అనుభవించు” అన్నాడు.
దుర్యోధనుడు కర్ణుడితో “కర్ణా! నీవంటి మహావీరుడు నాకు సహాయంగా ఉండగా నేను పొందలేనిది ఏముంటుంది? నాకు ఒక కోరిక ఉంది. ధర్మరాజు రాజసూయయాగం చేసినప్పటినుంచి నాకు కూడా రాజసూయయాగం చెయ్యాలని ఉంది. కర్ణా! నువ్వే నాతో ఆ యాగం చేయించి పుణ్యం కట్టుకో” అని ప్రార్థించాడు.
కర్ణుడు “దుర్యోధనా! పూర్వం ధర్మరాజు రాజసూయయాగం చేసి ఉండచ్చు. అది గొప్ప పనికాదు. ఇప్పుడు నువ్వు కూడా చేయగలవు. లోకంలో ఉన్న రాజులందరు నీకు సామంతులే కదా? నీకు అంత కోరికగా ఉంటే ఆ యాగమేదో ఇప్పుడే మొదలుపెట్టు.
రాజులందర్ని పిలవడానికి దూతల్ని పంపించు. బ్రాహ్మణుల్ని ఆహ్వానించు. గొప్పగా ఉండేలా యాగశాలని నిర్మించు. యూపస్తంభాలు సమకూర్చుకో. అన్నసంతర్పణకి తినుబండారాలు, పిండివంటలు చెయ్యడానికి అవసరమైన పదార్థాలు తెప్పించు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవేంద్ర వైభవంతో యాగాన్ని పూర్తి చెయ్యి” అన్నాడు.
కర్ణుడి మాటలకి దుర్యోధనుడు సంతోషపడ్డాడు. పురోహితుణ్ని పిలిపించి ఎక్కువ దక్షిణలతోను, శాస్త్రోక్తంగాను రాజసూయయాగాన్ని జరిపించమని చెప్పాడు. పురోహితుడు పండితులైన బ్రాహ్మణులతో సంప్రదించాడు.
దుర్యోధనుడితో “మహారాజా! పాండవులు శత్రువులు కదా! శత్రురాజులందర్నీ శత్రుశేషం లేకుండా జయించకుండా రాజసూయయాగం చెయ్యడం శాస్త్రసమ్మతం కాదు. పాండవుల్ని యుద్ధంలో జయించిన తరువాతే నీకు ఈ యజ్ఞం చెయ్యడానికి అర్హత కలుగుతుంది.
కనుక ప్రస్తుతానికి నువ్వు వేరే యజ్ఞం చెయ్యడం మంచిది. రాజసూయయాగం వంటిదే ‘వైష్ణవయాగం’ ఒకటి ఉంది. దాన్ని పూర్వం వాసుదేవుడు చేశాడు. దాన్ని చెయ్యడానికి నీకు ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది నీకు తగినయజ్ఞం” అని చెప్పాడు.
పురోహితుడు చెప్పిన మాటలు దుర్యోధనుడికి బాగానే ఉన్నాయని అనిపించింది. కర్ణుడు, శకుని కూడా అలా చెయ్యడం బాగుందన్నారు. యజ్ఞం చెయ్యడానికి అవసరమైన సన్నాహాల్లో మునిగిపోయాడు.
దుర్యోధనుడి వైష్ణవయాగం
తాను చేస్తున్న యజ్ఞం గురించి దుర్యోధనుడు తల్లితండ్రులు ధృతరాష్ట్రుడు గాంధారికి, పెద్దలు భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపుడు మొదలైన వాళ్లకి చెప్పాడు. వాళ్ల అనుమతితో యజ్ఞ సన్నాహలు చేశాడు.
హస్తినాపురానికి దగ్గరలో ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకుని యజ్ఞానికి అవసరమైన అందమైన ఇళ్లు అక్కడ నిర్మించమన్నాడు. యజ్ఞానికి కావలసిన వస్తుసామగ్రిని, ఉపకరణాల్ని సమకూర్చుకున్నాడు. ఒక శుభ ముహూర్తంలో బ్రాహ్మణోత్తముల సాయంతో శాస్త్రాల్లో చెప్పినట్టు క్రమశిక్షణ పాటిస్తూ గొప్ప తేజస్సుతో వెలుగుతున్నాడు.
దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం అన్ని దేశాల రాజుల్ని, పవిత్రులైన బ్రాహ్మణోత్తముల్ని ఆహ్వానించడానికి సంతోషంగా రాయబారులు వెళ్లారు. దుశ్శాసనుడు ఒక దూతని పిలిచి ద్వైతవనంలో నివసిస్తున్న పాండవుల్ని, పాండవుల ఆశ్రమంలో నివసిస్తున్న బ్రాహ్మణుల్ని యజ్ఞానికి రమ్మని చెప్పి రమ్మన్నాడు.
దూత ద్వైతవనానికి వెళ్లి ధర్మరాజుతో “రాజుల్లో గొప్పవాడవైన ధర్మరాజా! కౌరవుల వీరుడైన దుర్యోధనుడు తన శౌర్యానికి, ప్రాభవానికి తగినట్టుగా గొప్ప యజ్ఞం చెయ్యబోతున్నాడు. ఆ యజ్ఞానికి అవసరమైన సంభారాలు. వస్తు సామగ్రి మొత్తం సమకూర్చబడ్డాయి.
యజ్ఞం చూడడానికి నిన్ను, నీ తమ్ముళ్లని, నీతో ఉన్న బ్రాహ్మణోత్తముల్ని ఆహ్వానించడానికి దుర్యోధనసార్వభౌముడు నన్ను ప్రత్యేకంగా మీ వద్దకి పంపించాడు. దయచేసి యజ్ఞానికి రండి!” అన్నాడు.
ధర్మరాజు దూత చెప్పినది విని “మహానుభావుడు దుర్యోధనుడు గొప్ప యజ్ఞం చెయ్యాలని, అన్ని సన్నాహలు చేసుకుని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఈ యజ్ఞం చెయ్యడం వల్ల మా కురువంశం పావనమవుతుంది.
కాని, మా సమాధానం శ్రద్ధగా విను. మేము చేసిన శపథాన్ని నెరవేర్చడానికి ముందే అంటే అరణ్యవాసం, అజ్ఞతవాసం పూర్తవడానికి ముందే యజ్ఞం చూడడానికి రావడం ఉచితంకాదు. ఈ విషయాన్ని మీ రాజుకి వివరంగా చెప్పమని వేడుతున్నాను” అన్నాడు.
ధర్మరాజు చెప్పగానే భీముడు జోక్యం చేసుకుని “దూతా! నేను చెప్పే మాటలు సావధానంగా విను ఈ రోజుకి పదమూడవ సంవత్సరం పూర్తవగానే మా అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత పాండవుల అన్నగారు ధర్మనందనుడు పిలవకుండానే తాను చేసే యుద్ధ యజ్ఞంలో ధృతరాష్ట్రుడి నూరుమంది కొడుకుల్ని యజ్ఞపశువులుగా చేసి తన శస్త్రాలనే అగ్నిలో వెయ్యడానికి వస్తాడు. ఆ యుద్ధయజ్ఞం జరిగేటప్పుడు మేము వస్తాము. అంతవరకు అక్కడికి రావడం జరగదు అని భయపడకుండా దుర్యోధనుడికి చెప్పు” అని గర్జించాడు.
దూత తిరిగి వెళ్లి ధర్మరాజు సౌమ్యంగా చెప్పిన మాటలు, భీముడు కఠినంగా చెప్పిన మాటలు ధృతరాష్ట్రుడి కొడుకులకి వివరంగా చెప్పాడు.
తరువాత దుర్యోధనుడి ఆదేశం ప్రకారం భూమిలో ఉన్న రాజులు, ప్రజలు, ఋషులు అందరు యజ్ఞం చూడ్డానికి వచ్చారు. ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్లని సన్మానం చెయ్యడానికి, అర్హతని బట్టి దానాలు ఇవ్వడం ధృతరాష్ట్రుడు విదురుడికి అప్పగించాడు.
ఆ యాగానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు కలిగాయి. బ్రాహ్మణులకి దక్షిణలు, వస్త్రాలు, ఆభరణాలు పుష్కలంగా దొరికాయి. ప్రజలు అన్నపానాలతో తృప్తి పొందారు. శాస్త్రంలో చెప్పినట్టు యజ్ఞ విధులు ఏ లోపాలు లేకుండా సక్రమంగా సమయానికి జరిగాయి. వైష్ణవ యాగం శాస్త్ర ప్రకారం జరగడం వల్ల ప్రాయశ్చిత్తం అక్కర్లేకుండా అయిపోయింది.
యజ్ఞం పూర్తయ్యాక పవిత్రస్నానం చేసి దుర్యోధనుడు బ్రాహ్మణులకి బంగారు నాణేలు, రత్నమాణిక్యాలు ఇచ్చి పూజించాడు. యజ్ఞానికి వచ్చిన రాజులందరిని గౌరవించి అనేక మర్యాదలు చేసి వాళ్ల దేశాలకి సగౌరవంగా పంపించాడు.
యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన ప్రజలు దుర్యోధనుణ్ని “దుర్యోధనా! నువ్వు గొప్ప పుణ్యాత్ముడివి. ఏ లోటూ లేకుండా భూమి మీద ఉన్న ప్రజలందరు సంతోషపడేలా ఇంత గొప్ప యజ్ఞాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరూ చెయ్యలేదు.
పూర్వకాలంలో ఐశ్వర్యంతో తులతూగిన హరిశ్చంద్రుడు అనుష్ఠానంలో ఉన్న నేర్పుతో రాజసూయయాగాన్ని వైభవంగా చేశాడని విన్నాము. ఈ మధ్య కురువంశస్థుడైన ధర్మరాజు రాజసూయ యాగాన్ని చెయ్యడం కళ్లారా చూశాము.
వైభవంలో ఆ రెండు యజ్ఞాలు నువ్వు చేసిన వైష్ణవ యజ్ఞానికి సాటి రావు. ఫూర్వం రఘువు, యయాతి, భరతుడు మొదలైన రాజులు ఈ యజ్ఞం చెయ్యడం వల్లే ప్రపంచంలో గొప్ప కీర్తితో ప్రకాశించారు. అందువల్లనే వాళ్లకి శాశ్వత స్వర్గసౌఖ్యాలు కలిగాయి” అని కొందరు అన్నారు.
కాని, కొంతమంది ధర్మరాజు చేసిన యాగంతో పోలికే లేదని మనస్సులో అనుకున్నారు. దుర్యోధనుడు తమ్ముళ్లు, మంత్రులు చుట్టాలు ఎంతోమంది తనను సేవిస్తుండగా హస్తినాపురంలో సంతోషంగా ఉన్నాడు.
పౌరుల జయజయధ్వానాలతో దిక్కులు ప్రతిధ్వనించాయి. పుణ్యస్త్రీలు అక్షతలు చల్లారు. వందిమాగధులు ప్రశంసించారు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు నివసించే భవనానికి వెళ్లి తల్లితండ్రులు గాంధారి ధ్రుతరాష్ట్రులకి, గురువులు కృపాచార్యులు, ద్రోణాచార్యులవారికి, పితామహుడైన భీష్ముడికి నమస్కారం చేశాడు. సంతోషంగా బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు.
కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి “నువ్వు వైష్ణవ యాగాన్ని అనుకున్నట్టుగా, శాస్త్రోక్తంగా, ఎటువంటి ప్రాయిశ్చిత్తాలు అక్కరలేకుండా వైభవంగా చేశావు. ఎంతో అదృష్టవంతుడివి. ఇంక యుద్ధరంగంలో పాండవులని జయించి రాజసూయయాగం కూడా చెయ్యి.
యుద్ధంలో పాండవుల్ని జయించలేనేమో అని మనస్సులో బాధపడకు. నేను రణరంగంలో దేవేంద్రుడి కొడుకు అర్జునుణ్ని సంహరించ గలను. అంతవరకు నేను నా కాళ్ల గోళ్లు కడుక్కోనని శపథం చేస్తన్నాను” అని కర్ణుడు శపథం చేశాడు.
దుర్యోధనుడు కర్ణుణ్ని కౌగలించుకుని “కర్ణా! నాకు నీ సహాయంతో ఆ పాండవుల్ని జయించడం పెద్ద పని కాదు” అని చెప్పి తమ్ముళ్లతో సంతోషంగా గడిపాడు.
ద్వైతవనంలో ధర్మరాజు కర్ణుడి ప్రతిజ్ఞ విని భయపడ్డాడు. కర్ణుడి సహజకుండలాల్ని, ఛేదించడానికి వీలుకాని కవచాన్ని, అతడి పరాక్రమాన్ని తలుచుకుని ధర్మరాజు నిద్రపోలేక పోయాడు. హస్తినాపురంలో దుర్యోధనుడు శకుని, కర్ణుడు చెప్పిన మాటలు వింటూ రాచకార్యాలు నడుపుతున్నాడు.
భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులతోను, బ్రాహ్మణులతోను భక్తి కలిగి ఉంటున్నాడు. తనకు సంక్రమించిన సంపదల్ని అనుభవిస్తూ, సహచరులకి పంచిపెడుతూ త్యాగం భోగం కలిపి బతుకుతూ అందరి అనురాగాన్ని పొందుతున్నాడు” అని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి సర్పయాగ సమయంలో వివరించి చెప్పాడు.
వైశంపాయనుడితో జనమేజయుడు “మహర్షీ! పాండవులు ఎదురులేని పరాక్రమం కలవాళ్లు. వాళ్లు దుర్యోధనుణ్ని బంధాలనుంచి విడిపించాక ఎలా ఉన్నారు. వాళ్లు గౌరవించతగినవాళ్లు. వాళ్ల చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తమ జీవితాల్ని ఇంకా ఎలా తీర్చిదిద్దుకున్నారో దయతో వివరించండి” అని అడిగాడు.