[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
కుమారస్వామి తల్లిదండ్రులు
ధర్మరాజు మరొక ప్రశ్న అడిగాడు. “మహర్షీ! కుమారస్వామి రుద్రుడి తేజస్సు వల్ల పుట్టాడని చెప్తారు కదా? ఇప్పుడు మీరు అగ్నిహోత్రుడి తేజస్సు వల్ల పుట్టాడని చెప్పారు. దీన్ని సమన్వయపరచడం ఎలాగో తెలియట్లేదు” అన్నాడు.
మార్కండేయమహర్షి “ధర్మరాజా! పూర్వం శివుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రుడి యందు నిక్షేపించాడు. ఆ వీర్యం వల్లే అగ్నిహోత్రుడు కుమారస్వామిని కన్నాడు. అంతే కాదు వేదార్థాలు తెలిసిన బ్రాహ్మణ పండితులు అగ్నిహోత్రుణ్ని రుద్రుడనే చెప్తారు. అందువల్ల కుమారస్వామి అగ్నిహోత్రుడికి కొడుకు అలాగే శివుడికి కూడా కొడుకే అని చెప్పవచ్చు.
అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి కృత్తికలు అనే పేర్లు కలిగిన ఋషిపత్నుల రూపాలు ధరించి భర్తను కలిసి కనిన పుత్రుడు కనుక ‘కార్తికేయుడు’ అని కూడా అంటారు. స్వాహాదేవి తన భర్త రేతస్సుని స్కందం చేయడం వల్ల కలిగాడు కనుక అతడికి ’స్కందుడు’ అని కూడా పేరు.
ఆ సమయంలో అదే మంచి అవకాశమని అనుకున్న దేవేంద్రుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞప్రకారం సురక్షితంగా తన దగ్గర ఉంచుకుని సంరక్షిస్తున్న దేవసేనని అలంకరించి తీసుకుని రమ్మన్నాడు.
అలంకరించుకుని వచ్చిన దేవసేనని అక్కడికి రప్పించి ఇంద్రుడు కుమారస్వామితో “ఈ సుందరిని బ్రహ్మదేవుడు నీ కోసమే సృష్టించాడు. అన్ని లోకాలకి అతీతమైన ఈ కన్యని వివాహం చేసుకో!” అన్నాడు.
గొప్ప శౌర్యం కలవాడు, దేదీప్యమానంగా వెలుగుతున్న కాంతే ఆకారంగా కలవాడు, శాస్త్రాలు తెలిసివాడు, వైదిక మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా కుమారస్వామి సంతోషంగా దేవసేనని వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో కుమారస్వామి దగ్గరికి తమ భర్తలతో విడిచిపెట్టబడిన మహర్షుల భార్యలు ఆరుగురు దుఃఖపడుతూ వచ్చారు.
కుమారస్వామితో “మంచి ఆలోచన చేయలేని చెడ్డవాళ్లు ఋషిపత్నులమైన మేము అగ్నిహోత్రుడితో కలిసి నిన్ను కన్నామని నీలాపనింద ప్రచారం చేశారు. అందువల్ల మా భర్తలు మమ్మల్ని విడిచిపెట్టారు.
మమ్మల్ని కాపాడడం ఇప్పుడు నీ కర్తవ్యం. మేము పుణ్యలోకాలు పోగొట్టుకుని చాలా బాధలు పడుతున్నాము. ఇకనుంచి నువ్వే మాకు కొడుకువి. తల్లిని ఆదరించినట్టు మమ్మల్ని ఆదరించాలి” అన్నారు.
కుమారస్వామి “మీకు నేను కొడుకుని. మీరు నాకు తల్లులు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. మీకు నేను ప్రీతిని కలిగిస్తాను” అని చెప్పాడు.
తరువాత దేవేంద్రుడితో “ఈ కృత్తికలు నాకు తల్లులు. వీళ్లకి తగిన గౌరవస్థానం కలిగించడం నా ధర్మం” అన్నాడు.
దేవేంద్రుడు “దక్షప్రజాపతికి కలిగిన కూతుళ్లలో చాలామంది చంద్రుడికి భార్యలయ్యారు. ఆ తారకల్లో రోహిణి పక్కన గొప్ప ప్రకాశం గల అభిజిత్తు అనే నక్షత్రం గర్వంతో తానే సవతులందరికంటే ఎక్కువగా చంద్రుడికి ఇష్టం కలగాలని తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయింది. ఇప్పుడు రోహిణి పక్కన ఉన్న ఆ స్థానం ఖాళీగా ఉంది. అక్కడ ఈ కృత్తికలని నిలపడం మంచిది” అన్నాడు.
ఆ మాటలు విని కుమారస్వామి కృత్తికలకి సాదరంగా వీడ్కోలు చెప్పాడు. ఆ రోజు నుంచి కృత్తికలు అరుగురు నక్షత్రకూటమిగా ఏర్పడి సంతోషంతో ఆకాశంలోకి వెళ్లి అక్కడ రోహిణి పక్కన వెలిగారు. అగ్నిని అధిదేవతగా కలిగి కృత్తిక ప్రసిద్ధికెక్కింది.
తరువాత స్వాహాదేవి కుమారుణ్ని చూసి “కుమారా! నువ్వు నా కొడుకువి. నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను” అంది.
కుమారస్వామి “అమ్మా! నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండి నీ కొడుకునయిన నేను, నీ కోడలు దేవసేన చేసే సపర్యలతో సంతోషంగా ఉండు” అన్నాడు.
తరువాత కుమార మాతృకలు ఏడుగురు ‘హవిష, కాళి, కౌశిక, ఉద్దత, శారిక, ఆర్య, వైధాత్రి అనేవాళ్లు కుమారస్వామి దగ్గరికి వచ్చి “కుమారస్వామీ! సప్తమాతృకలమైన మా ఏడుగురిని మూడు లోకాలకి మాతృకాదేవతలుగా నియమించు. అన్ని లోకాల్లోను ఇంతకు ముందు ఉన్న (బ్రాహ్మి, మాహేశ్వరి మొదలైన) మాతృకలు పరిగణించబడకుండా ఉండాలి. మమ్మల్ని మూడు లోకాలకి మాతలుగా ఆరాధించాలి. మాకు దయతో ఈ వరాన్ని ప్రసాదించు” అన్నారు.
వాళ్ల మాటలకి కుమారస్వామి నవ్వి “పూర్వం ఉన్న మాతృకల పేరు పోవాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు. మీకు మంచి కలిగేట్లు ఏం కావాలో కోరుకోండి తప్పక ఇస్తాను” అన్నాడు.
స్కందమాతలు “మేము అడిగిన వరాన్ని మాత్రమే మాకు అనుగ్రహించు. మేము ఈ లోకంలో ఉన్న పసిబిడ్డలకి ఎప్పుడూ బాధలు కలిగిస్తాం. నీ దయవల్ల వర్థిల్లుతాం. ఈ వరాన్ని మాకు ప్రసాదించు” అన్నారు.
సప్తమాతృకల కోరిక విని కుమారస్వామి “అయ్యో! మీరు పసిబిడ్డలకి హాని చేయాలని అనుకుంటున్నారు. ఇది న్యాయమైన ఆలోచన కాదు. మీరు ఈ కోరిక మాత్రమే తీర్చాలని కోరుకుంటున్నారు. కనుక మీకు ఈ వరాన్ని అనుగ్రహిస్తాను.
కాని మిమ్మల్ని ఆరాధించినా, మీకు నమస్కరించినా మీరు పసిబిడ్డలకి కీడు చెయ్యకూడదు. వాళ్లని దయతో చూడమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.
అమ్మలారా! పదహారేళ్ల వయసు నిండేవరకు మీరు బాల బాలికల్ని ఆవహించి బాధించండి. మిమ్మల్ని కాపాడడానికి నా అంశతో పుట్టిన ఒక మహాపురుషుణ్ని నియమిస్తున్నాను” అని చెప్పి కుమారస్వామి తన శరీరం నుంచి బంగారురంగు శరీరం కలిగిన ఒక పురుషుణ్ని ఉద్భవించేలా చేశాడు.
అతడు పుడుతూనే ఆకలి బాధతో తల తిరిగి నేల మీద పడిపోయాడు. కుమారస్వామి అతడికి తెలివి తెప్పించాడు. స్కందావస్మారం అనే పేరు కలిగిన పిశాచంగా మాతృకలకి అంగరక్షకుడయ్యాడు.
ఇంకా శకుని తల్లి వినత, రాక్షసుల తల్లి దితి, ఆవుల తల్లి సురభి, కుక్కల తల్లి సరమ, చెట్ల తల్లి కరంజ (కానుగ), పాముల తల్లి కద్రువ, కుమారస్వామి దాది లోహితాస్య, మాతృకలతో కలిసి గర్భాలకి చేటు చేస్తూ, పసిపాపలకి బాధ కలిగిస్తూ ఉంటారు. మనుషులు వాళ్లని శాంతింప చెయ్యడానికి బలులు, కానుకలు, ముడుపులు, తర్పణాలు చెల్లించినప్పుడు తృప్తిపడి పసిపిల్లలకి ఆయువు, ఆరోగ్యం, సుఖం ఇస్తారు. పదహారేళ్లు దాటిన తరువాత కూడా మనుషుల్ని పట్టి పీడించే పిశాచాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి కూడా చెప్తాను సావధనంగా విను.
నిద్రలో మైమరిచి ఉన్నప్పుడు గాని, మేలుకుని ఉన్నప్పుడుగాని దేవతల గుంపుల్ని చూస్తే అది దేవతా పిశాచం అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనిషి ఎక్కువగా మాట్లాడతాడు.
కూర్చున్నప్పుడు కాని, పడుకున్నప్పుడు కాని భ్రమపడి మరణించినవాళ్ల రూపాల్ని చూసి మనస్సు చలిస్తే అది పితరులకి సంబంధించిన పిశాచము.
మనిషి భ్రమలో ఉండి పాటలు పాడే దేవతల్ని చూస్తే అది గంధర్వులకి చెందిన గ్రహం అని తెలుసుకోవాలి. కాలం తెచ్చే మార్పులవల్ల బాధపడితే అది యక్షగ్రహం వల్ల కలిగిన పీడ అని గుర్తించాలి. వాత పైత్య ప్రకోపం వల్ల వెర్రి తలకెక్కితే అది కూడా ఏదో ఒక గ్రహం వల్లనే అని తెలుసుకోవాలి.
సావధానంగా విను. మనిషికి డభ్బై సంవత్సరాల వయసు వచ్చే వరకు గ్రహాల వల్ల ఏవేవో జాడ్యాలు కలుగుతాయి. ఆ తరువాత గ్రహాలు పీడించ వలసిన అవసరం లేదు. ఎందుకంటే ముసలితనమే అన్ని జాడ్యాల్ని సంక్రమింపచేస్తుంది. ధర్మరాజా! ఇందులో ఒక కిటుకు ఉంది. ఈ గ్రహబాధలు, పిశాచపీడలు బలహీనమైన మనస్సు కలవాళ్లకే హాని కలిగిస్తాయి.
నీతి, నియమము, నిష్ఠ కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్లని గ్రహాల వల్ల భయం ఉండదు. ఇంకొక విశేషం చెప్తాను విను. గ్రహపీడలకి ఇంద్రియ నిగ్రహం ఒక్కటే విరుగుడు అని అనుకోకు. పరమశివుడియందు గాఢమైన భక్తి ఉంటే చాలు. శివభక్తి అన్ని రకాల పిశాచ పీడలకి సులువైన విరుగుడు” అని చెప్పాడు.
తరువాత మార్కండేయ మహర్షి ధర్మరాజుతో “కుమారస్వామి గ్రహాల్ని నియమించే సమయంలో అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి కుమారస్వామి దగ్గరికి వచ్చి “కుమారా! నేను దక్షప్రజాపతి కూతుర్ని. మా తండ్రి నన్ను చిన్నతనంలో అగ్నిహోత్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అగ్నిహోత్రుడికి నామీద ఎటువంటి ప్రేమ లేదు. నాకు నా భర్తకు ఎప్పుడూ ఎడబాటు లేకుండా ఉండేలా అవినాభావ సంబధం ఉండేలా చెయ్యి” అని అడిగింది.
కుమారస్వామి స్వాహాదేవితో “అమ్మా! యజ్ఞాలు చేసేటప్పుడు బ్రాహ్మణోత్తములు అగ్నిలో హోమద్రవ్యాలు స్వాహా అనే శబ్దంతో కలిసిన మంత్రాల్ని ఉచ్చరిస్తూ వేస్తారు. అలా చెయ్యడం వల్ల నీకూ నీ భర్త అయిన అగ్నిహోత్రుడికి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది” అని చెప్పాడు.
అదే సమయంలో బ్రహ్మదేవుడు ఋషులతో కలిసి వచ్చి కుమారస్వామిని అభినందించాడు. అక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడిని చూసి బ్రహ్మదేవుడు కుమారస్వామితో “పుణ్యాత్ముడా! ఈ మహానుభావుడు పరమేశ్వరుడు. మూడు కళ్లు కలిగిన దేవుడు. మూడు పట్టణాల్ని నాశనం చేసిన పరాక్రమశాలి. ఈమె హిమాలయ పర్వత పుత్రిక పార్వతీదేవి. ఈ పార్వతీపరమేశ్వరులే నీ తల్లిదండ్రులు.
నీ తల్లిదండ్రుల్ని ఆరాధించడం నీ పవిత్ర కర్తవ్యం. అన్ని జగాలకి తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులు తమ యోగశక్తి యొక్క గొప్పతనంతో అగ్నిహోత్రుడిలోను అతడి భార్యలోను ఆవేశించి విశ్వకళ్యాణం కోసం నిన్ను కొడుకుగా కన్నారు” అని చెప్పాడు.
బ్రహ్మదేవుడు చెప్పింది విని కుమారస్వామి ఆనందంతోను, భక్తితోను అన్నిలోకాలకి తల్లిదండ్రులయిన పార్వతీపరమేశ్వరుల్ని భక్తితో సేవించాడు.
దేవేంద్రుడు తన వాహనమైన వెల్లయేనుగు ఐరావతానికి అలంకారమైన రెండు గంటలు కుమారస్వామికి బహుమానంగా ఇచ్చాడు. కుమారస్వామి ఒక గంట తను తీసుకుని మరొకటి విశాఖుడికి ఇచ్చాడు.
భద్రవటం చేరిన ఈశ్వరుడు
పరమేశ్వరుడు కుమారస్వామిని కౌగలించుకుని తల నిమిరి వాసన చూసి పార్వతీ సమేతంగా కుమారస్వామితో కలిసి వేయిసింహాలు కలిగిన తన రథాన్ని ఎక్కి ఆనంద తన్మయత్వంతో పుణ్యక్షేత్రం భద్రవటం చేరుకున్నాడు
“ధర్మరాజా! పరమేశ్వరుడు భద్రవటక్షేత్రం చేరేటప్పుడు ఎలా ఉన్నాడో చెప్తాను విను. వేయిసింహాలు కలిగిన రథం మీద పరమశివుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. శివుడికి ముందు అనేకమంది యక్ష పరివారంతో కలిసి గొప్పదైన పుష్పక విమానం మీద కుబేరుడు; వెనుక భాగంలో ఐరావతమనే తెల్ల ఏనుగుమీద గొప్ప వైభవంతో ఇంద్రుడు కూర్చుని ఉన్నారు.
కుడివైపు అమోఘుడనే గొప్ప యక్షనాయకుడు నడిచాడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు తమ ఆయుధాలతో కలిశారు. ఎడమ భాగంలో భయంకరమైన వ్యాధులతోను, మృత్యుదేవతతోను చుట్టుకొనబడిన యముడు నడిచాడు.
అన్ని సముద్రాలతో కలిసి వరుణుడు అక్కడ నిలబడ్డాడు. శూల, పట్టిస, గద, ముసలకం మొదలైన పరమేశ్వరుడి ఆయుధాలు ప్రత్యక్షంగా కనిపించే ఆకారాలు పొంది ప్రకాశిస్తూ నడిచాయి. పరమేశ్వరుడికి సంబంధించిన వస్తువులన్నీ పాలుపంచుకున్నాయి.
చంద్రుడు పరమశివుడికి దగ్గరగా నిలబడి వెల్ల గొడుగు పట్టుకున్నాడు. వాయుదేవుడు, అగ్నిహోత్రుడు చామరలతో విసురుతున్నారు. విద్య, సావిత్రి, గాంధారి, కేశిని అనే దేవతా స్త్రీలు పార్వతీదేవిని సేవిస్తూ నడుస్తున్నారు.
ముక్కంటికి అనుగు నెచ్చెలి అయిన పింగళుడు అనే యక్షుడు ఎద్దుబొమ్మ కలిగిన జెండాని ఎత్తి పట్టుకుని ముందు నడిచాడు. కన్నులపండువుగా ఊరేగింపుగా పరమేశ్వరుడు భద్రవటక్షేత్రాన్ని చేరాడు.
తన కొడుకు కుమారస్వామితో “కుమారా! ఏడవ విభాగమయిన మారుత సేవావిభాగానికి (స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం అనే ఏడు అంగాలతో కలిసి ఉండేది రాజ్యాంగం. ఏడవ రాజ్యాంగంలో బలం మరుత్తులు అంటే గాలులు) నాయకుడుగా ఉండు! అవసరమయినప్పుడు దేవతలకి సహాయంగా ఉండు. ఎప్పుడూ నా మీద భక్తిని వదలకు” అని చెప్పి పరమేశ్వరుడు కుమారస్వామిని కౌగలించుకుని ఆశీర్వదించి వెళ్లిపోయాడు” అని చెప్పాడు మార్కండేయమహర్షి.
మహిషాసురుణ్ని చంపిన కుమారస్వామి
మార్కండేయమహర్షి మళ్లీ ధర్మరాజుతో “పుణ్యాత్ముడవైన ధర్మరాజా! అప్పుడు అపశకునాలు కనిపించాయి. దిక్కుల్లో అగ్నిజ్వాలలు కనిపించాయి. భూగోళం గిరగిరా తిరిగింది. ఆకాశం ఉరిమింది. కొండలు వణికాయి. ప్రపంచమంతా భయంకరమైన చీకటి ఆవహించింది. దేవతలు భయపడ్డారు. అంతలోనే దేవతల నాయకులపైకి అస్త్రశస్త్రాలతో గొప్ప పరాక్రమవంతులైన రాక్షసుల సైన్యం చతురంగ బలాలతో దండెత్తి వచ్చారు. ఆ సేనకి మహిషుడు అనే నాయకుడు ఉన్నాడు.
ఆ సైన్యం దేవతల సైన్యం మీదకి చుట్టు ముట్టి అనేక బాణాలు, గదలు, కత్తులు, రోకళ్లు, ఇనుప గుదియలు, శతఘ్నులు మొదలైన ఆయుధాలతో ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని, కాల్బలాల్ని నాశనం చేశాయి. దేవతలు భయపడి పారిపోయారు.
పారిపోతున్న దేవతల్ని చూసి దేవేంద్రుడు “దేవతలారా! మీరు భయపడి పారిపోవడం మంచిది కాదు. మీతో పాటు నేను కూడా కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు మీకు భయమెందుకు? ఆత్మగౌరవంతో మీ శక్తిసామర్థ్యంతో వాహనాలు మహాస్త్రాలు సరిదిద్దుకుని దుర్మార్గులైన రాక్షసుల్ని సంహరించండి. రణరంగంలో ధైర్యంగా నిలబడి పోరాడండి. విజయం మీకే కలుగుతుంది” అని చెప్పాడు. దేవేంద్రుడి ప్రోత్సాహంతో దేవతలు తమ అస్త్రాలు తీసుకుని సింహనాదం చేస్తూ రాక్షసుల్ని ఎదుర్కున్నారు.
వసువులు, రుద్రులు కూడా యుద్ధంలో పాలుపంచుకున్నారు. దేవతలు ప్రయోగించిన బాణాగ్నులతో అశ్వికదళం వెనక్కి పారిపోయింది. రథాలన్నీ కార్చిచ్చులో కాలిపోయిన కట్టెల్లా కాలిపోయాయి. గర్వంతో మిడిసిపడుతున్న రాక్షసుల తలలు కొండలమీదనుంచి ఎగిరిపడుతున్న రాళ్లల్లా రాలి కింద పడ్డాయి.
రాక్షసులు రణరంగంలో నిల్వలేక వెనక్కి పారిపోడం మొదలుపెట్టారు. మహిషాసురుడు రాక్షసుల్ని ప్రోత్సహిస్తూనే ఒక పెద్ద కొండని పెకలించి దేవతల మీదకి విసిరాడు. దానితో పదివేలమంది గొప్ప పరాక్రమం కలిగిన దేవతలు మరణించారు.
దేవేంద్రుడి వంటి యోధులు కూడా మహిసారుణ్ని చూసి భయపడ్డారు. శివుడు కుమారస్వామితో “కుమారా! మహిషాసురుడి సాహసం చూశావు కదా! ఈ నీచుడికి ఆయువు తీరింది. ఈ దుర్మార్గుణ్ని వెంటనే సంహరించు” అన్నాడు.
ప్రళయకాలంలో లోకాల్ని మాడ్చివేసేంత తేజస్సుతో ఎర్రటి మణులు పొదిగిన ఆభరణాలు ధరించి, ఎర్రని కొత్త దుస్తులు ధరించి కోపంతో ఎర్రబడ్డ కళ్లతో రథాన్ని అధిరోహించాడు. కుమారస్వామిని చూసి దేవతలు ఉత్సాహంతో రణరంగంలో ధైర్యంగా నిలబడ్డారు. కుమారస్వామి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించి మహిసారుణ్ని సంహరించాడు.
తరువాత అదే ఆయుధంతో రాక్షసులందర్నీ సంహరించాడు. దేవతలు సంతోషంతో నాట్యం చేస్తూ కుమారస్వామిని పొగిడారు.
దేవేంద్రుడు కుమారస్వామితో “ఈ మహిషాసురుడు బ్రహ్మదేవుడి వల్ల వరం పొంది దేవతల్ని అనేక విధాలుగా బాధిస్తున్నాడు. మహిషాసురుణ్ని అతడి అనుచరుల్ని సంహరించి మాకు ఎంతో ఉపకారం చేశావు. మేము మీకు సేవకులం ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే కాపాడు” అని ప్రార్థించారు.
శివుడు కుమారస్వామిని అభినందించి దేవేంద్రుడు మొదలైన నాయకులతో “మీరు నన్ను ఎలా పూజ్యభావంతో కలిసిన అనురాగంతో చూస్తున్నారో అలాగే కుమారస్వామిని కూడా గౌరవించండి” అని ఆజ్ఞాపించాడు. తరువాత పరమేశ్వరుడు భద్రవటానికి, దేవతలు తమ నివాసాలకి వెళ్లిపోయారు.
మహిషాసురుణ్ని చంపిన కుమారస్వామి శౌర్యపరాక్రమాల్ని గురించి మార్కండేయమహర్షి పాండవులకి వినిపించాడు. పాండవులు అమితమైన శ్రద్ధతోను, భక్తితోను మార్కండేయ మహర్షి చెప్పిన కథలు విని ఆయన్ని పూజించారు.
ఆ సమయంలో శ్రీకృష్ణుడి ఇల్లాలు సత్యభామ, పాండవుల భార్య ద్రౌపది కబుర్లలో పడ్డారు.