Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-106: కుమారస్వామి అవతారము

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

కేశితో ఇంద్రుడు యుద్ధము

మార్కండేయ మహర్షి చెప్పింది విని ధర్మరాజు “మహర్షీ! కుమారస్వామి అగ్నిహోత్రుడికీ, కృత్తికలకీ, శివుడికీ ఎలా కొడుకయ్యాడో వివరంగా చెప్పండి” అని ప్రార్థించాడు.

మార్కండేయ మహర్షి “ధర్మరాజా! పూర్వకాలం రాక్షసులతో యుద్ధం చేసి దేవేంద్రుడు ఓడిపోయాడు. దేవతలందరు కలిసికట్టుగా ఎంత పోరాడినా వాళ్లు జయించలేకపోయారు.

దేవేంద్రుడు ఏకాంతంగా కూర్చుని రాక్షసుల్ని ఎలా ఓడించలా అని ఆలోచించాడు. అతడు ‘మానసం’ అనే కొండపైకి వెళ్లి ఒక చోట కూర్చుని ఆలోచిస్తున్నాడు.

ఇంతలో “నన్ను ఒక దుర్మార్గుడైన రాక్షసుడు బంధించి తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఎవరేనా ఈ రాక్షసుడి బారి నుంచి రక్షించండి” అని దీనంగా ఏడుస్తున్న ఒక స్త్రీ గొంతు వినిపించింది. “ఇదిగో ఇప్పుడే వచ్చి కాపాడుతాను” అంటూ ఇంద్రుడు వేగంగా ఆ ఏడుపు వినిపించిన వైపుకి వెళ్లాడు.

ఇంద్రుడు వెళ్లి ఆ రాక్షసుణ్ని చూశాడు. అతడు నల్లటి మబ్బులా ఉన్న శరీరంతో గదని పట్టుకుని భయంకరంగా కనిపించాడు. ‘కేశి’ అనే పేరు కలిగిన రాక్షసుడు ఒక అందమైన స్త్రీని పట్టుకుని ఆకాశ మార్గంలో పరుగెడుతున్నాడు.

దేవేంద్రుడు “ఆమెని విడిచిపెట్టు! లేకపోతే నా వజ్రాయుధంతో నీ ప్రాణాలు తీస్తాను” అని రాక్షసుడి దగ్గరికి వచ్చాడు. కేశి కోపంతో దేవేంద్రుణ్ని ఎదిరించి తన గదని ప్రయోగించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో అతడి గదని ముక్కలు ముక్కలుగా చేసాడు. రాక్షసుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి దేవేంద్రుడి మీదకి విసిరాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొండని ముక్కలు చేశాడు.

కేశి తన దగ్గర ఆయుధాలు లేక ఆ స్త్రీని వదిలిపెట్టి పారిపోయాడు. దేవేంద్రుడు ఆమె దగ్గరికి వెళ్లి “నువ్వు ఎవరు? అతడికి ఎలా దొరికావు?” అని అడిగాడు.

ఆమె “మహాశయా! నేను అరిష్టనేమి అనే ప్రజాపతి కూతుర్ని. నా పేరు ‘దేవసేన’. నేను, మా అక్క ‘దైత్యసేన’ మా నాన్నగారి అనుమతి తీసుకుని చెలికత్తెలతో కలిసి ఈ మానసపర్వతం మీద విహరిస్తున్నాం. ఈ రాక్షసుడు మా దగ్గరికి వచ్చి వికారపు చేష్టలు చేసేవాడు.

అతడి చేష్టలు అక్కకి నచ్చేవి. అతడు ఆమెని వశం చేసుకుని తీసుకుని వెళ్లిపోయాడు. అంతటితో ఆగక నా కోసం వచ్చి నన్ను కూడా తీసుకుని వెళ్లిపోతుంటే కేకలు వేశాను. మీరు వచ్చి నన్ను కాపాడారు” అని చెప్పింది దేవసేన.

అది విని ఇంద్రుడు “దేవసేనా! నువ్వు నాకు చెల్లెలివి అవుతావు. మీ అమ్మగారు, మా అమ్మగారు దక్షప్రజాపతి కూతుళ్లు. నీకు ఇష్టమైన వరం కోరుకో! ఇస్తాను” అన్నాడు.

దేవసేన “మహానుభావా! మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను గారాబం చేసి నాకు పేరుప్రతిష్ఠలు పొందిన గొప్ప పరాక్రమవంతుడు భర్త అవుతాడు అని చెప్పాడు. ఆయన మాటలు నిజం చెయ్యమని కోరుకుంటున్నాను.

దేవతల్లోను, రాక్షసుల్లోను పరాక్రమవంతులైన వాళ్లని ఓడించగలిగేవాడు భయంకరమైన శత్రువుల్ని సంహరించగలిగేవాడు, మూడు లోకాల్ని రక్షించగలిగేవాడు, నీకు ఆప్తమిత్రుడు నాకు భర్తగా కావాలి. ఈ కోరిక తీర్చి నన్ను ధన్యురాల్ని చెయ్యి” అని కోరుకుంది.

దేవసేన కోరిక విని దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు “ఈమెకి భర్తగా ఎవరు వస్తారు. ఈ లగ్నం రౌద్రమనే లగ్నం. ఈ రోజు తిథి అమావాస్య. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉంటారు. అంతేకాదు, ఇప్పుడు సూర్యోదయ సమయం. ఈ ప్రభాతకాలంలో సూర్యుడి కిరణాలతో ఎర్రగా ఉండే మబ్బులు ప్రతిబింబించి సముద్రం కూడా ఎరుపురంగు కలిగి కనిపిస్తోంది.

సముద్రం దేవదానవ యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. సూర్యోదయ సమయంలో భృగుమహర్షి, అంగిరసమహర్షి మొదలైన మహర్షులు యజ్ఞకుండాల్లో వేల్చిన హోమద్రవ్యాలతో అగ్నిహోత్రుడు సూర్యమండలం ప్రవేశిస్తున్నాడు.

ఇది సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు కలిసిన రౌద్రముహూర్తం. కనుక సూర్యుడు చంద్రుడు, అగ్నిహోత్రుల తేజస్సుతో పుట్టినవాడు దేవసేనకి భర్త అవుతాడు” అని నిర్ణయించుకున్నాడు.

దేవసేనని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి “దేవా! నువ్వు దయకలవాడివి. ఈమెకి తగిన భర్తని ప్రసాదించు” అని అడిగాడు.

బ్రహ్మ దేవేంద్రుడితో “ఇంద్రా! ఈమెకి గొప్ప వీరుడు మూడు లోకాల్ని కాపాడగలిగిన సామర్థ్యం కలవాడు భర్తగా వస్తాడు. దేవసైన్యానికి అతడే సేనాపతి అవుతాడు. ఇదంతా తొందరలోనే జరుగుతుంది” అని చెప్పాడు. ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.

వశిష్ఠుడు మొదలైన మహర్షులు ఏడుగురు అమావాస్య హోమం చెయ్యడం మొదలుపెట్టారు. దేవతలందరు తమ హవిస్సులు తమ వంతులు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

సపర్షులు ‘ఆహవనీయం’ అనే పేరుతో అగ్నిహోత్రుణ్ని ఆహ్వానించారు. అగ్నిహోత్రుడు మహర్షులు సమర్పించిన హోమద్రవ్యాలు తీసుకుని వాటిని దేవతలకి వంతుల ప్రకారం అందిస్తున్నాడు.

మునిపత్నుల్ని కోరుకున్న అగ్నిహోత్రుడు

అమావాస్యహోమం చేస్తున్న సమయంలో సప్తర్షుర్షుల భార్యలందరూ అలంకరించుకుని శుచిగా తమ భర్తలకి సేవ చేస్తున్నారు. సప్తర్షుల భార్యల సౌందర్యాన్ని చూసి అగ్నిహోత్రుడి మనస్సు చలించింది.

ఇంద్రియనిగ్రహం పోగొట్టుకుని వాళ్లని ముట్టుకోవాలని అనుకుని గార్హపత్యకుండంలో ప్రవేశించాడు. మహర్షుల భార్యల్ని తన జ్వాలలతో మృదువుగా తాకాడు.

అతడి కోరిక పెరిగింది. ఆ సమయానికి అమావాస్య హోమం పూర్తయింది. అతడికి సప్తర్షుల భార్యలు కనిపించారు. అగ్నిహోత్రుడు అడవికి వెళ్లి తన శరీరాన్ని వదిలెయ్యాలని అనుకున్నాడు.

అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి విషయాన్ని అర్థం చేసుకుంది. సప్తర్షుల్లో ఒకడైన అంగిరసమహర్షి భార్య ’శివ’ రూపంలో వచ్చి అగ్నిహోత్రుడి కోరిక తీర్చింది. తరువాత ఆడగరుడపక్షి రూపంలో ఆకాశానికి ఎగిరి శ్వేతపర్వతం చేరుకుని రెల్లుగడ్డి చుట్టుకుని ఉన్న ఒక బంగారు కుండలో తన భర్త వీర్యాన్ని పెట్టింది.

స్వాహాదేవి అదే విధంగా వశిష్ఠమహర్షి భార్య అరుంధతి రూపం తప్ప అందరి మహర్షుల భార్యల రూపాల్ని ధరించి అగ్నిహోత్రుడికి సంతోషం కలిగించింది.

కుమారస్వామి జననము

ఆరుసార్లు దాచి ఉంచిన వీర్యం నుంచి సూర్యుడితో సమానమైనవాడు, ఆరు ముఖాలు, పొడవైన పన్నెండు చేతులు కలవాడు ఆకాశానికి భూమికి మధ్య ఉన్న ప్రదేశమంతా ప్రకాశిస్తూ గొప్ప పరాక్రమవంతుడైన కుమారస్వామి పుట్టాడు.

శుక్లపక్షంలో పాడ్యమిరోజు వీర్యం సేకరించడం, విదియనాడు గర్భం కనిపించడం, తదియరోజుకి దేహం మాత్రం ఆవిర్భవించడం జరిగి చతుర్థినాటికి సంపూర్ణమైన ఆకృతిని పొందాడు. పంచమిరోజు లేచి నిలబడి ఆ కొండలో దాచి ఉంచిన వింటిని, పరమేశ్వరుడు త్రిపురాల్ని కాల్చిన కోదండాన్ని తీసుకుని అల్లెతాటిని మోగించాడు.

ఆ ధ్వనికి కోపగించిన ఐరావత సుప్రతీకాలు అనే రెండు దిగ్గజాలు కుమారుడి మీదకి విజృంభించాయి. ఆ రెండు దిగ్గజాల్ని తన రెండు చేతులతో అదిమిపెట్టాడు. పుట్టుకతో వచ్చిన శక్తి అనే ఆయుధాన్ని ధరించాడు. వినోదం కోసం ఒక చేత్తో కోడిని పట్టుకున్నాడు. రెండు చేతులతో పట్టుకుని శంఖాన్ని పూరించాడు. రెండు చేతులతో ఆకాశాన్ని చరిచాడు. రెండు చేతులు నోట్లో పెట్టుకుని పసివాడిలా బొటనవేళ్లు చప్పరించాడు. ఒక బాణం పట్టుకుని క్రౌంచ పర్వతాన్ని బద్దలుకొట్టాడు.

శక్తి ఆయుధంతో శ్వేతపర్వత శిఖరాన్ని విరగగొట్టాడు. తరువాత తన ఆరుముఖాలతో సింహనాదం చేశాడు. ప్రళయకాలంలో శివగణాధిపతి భైరవుడు చేసిన భయంకరమైన నాదంలా వినిపించింది. కులపర్వతాలు చలించాయి. దిక్కులు బ్రద్దలయ్యాయి. భూమండలం గిరగిర తిరగసాగింది. దేవతలు తొట్రుపడ్డారు. సముద్రాలు పొంగాయి. సూర్యుడి రథ గుర్రాలు భ్రమతో అటు ఇటు నాలుగు వైపులకి తిరగడం మొదలు పెట్టాయి. ఈ ఉపద్రవాల్ని ఉపశమించేలా చేసి మహర్షులు లోకకళ్యాణం జరగడం కోసం శాంతిహోమాలు చేశారు.

‘చైత్రరథం’ అనే పేరుగల అడవిలో నివసించే ప్రజలు ఋషుల భార్యలకి అగ్నిదేవుడి వల్ల కలిగిన కుమారుడే ఈ ఉపద్రవాలు కలగడానికి కారణం అని చెప్పుకున్నారు. ఆ మాటలు విని అరుగురు మహర్షులూ తమ భార్యల్ని వదిలిపెట్టేశారు.

అది తెలుసుకున్న అగ్నిదేవుడి భార్య “అయ్యా! నా మాటలు వినమని ప్రార్థిస్తున్నాను. ఈ బాలుడు నాకు, నా భర్త అగ్నిదేవుడికి పుట్టిన కుమారుడు. ఈ బాలుడికి మీ భార్యలకి సంబంధం లేదు. మీరు మీ భార్యల్ని వదిలిపెట్టడం మంచిది కాదు” అని చెప్పింది.

మహర్షులు ఆమె మాటల్ని అంగీకరించలేదు. విశ్వామిత్రుడు అనే మహర్షి ఆ బాలుడి దగ్గరికి వెళ్లి జాతకర్మలు చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న దేవతలు దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి “అగ్నికొడుకు గొప్ప పరాక్రమం కలవాడు. అహంకారంతో ఉన్నాడు. నిన్ను కూడా వదిలిపెట్టక పోవచ్చు. నీ పదవిని ఆక్రమించాలి అనుకుని నీ మీద దండెత్తి వస్తాడేమో.. నువ్వే వెళ్లి అతణ్ని సంహరిస్తే నీ ఇంద్రపదవి శాశ్వతంగా ఉంటుంది. మేము కూడా సుఖంగా ఉంటాం” అని చెప్పారు.

దేవేంద్రుడు సప్తమాతృకల్ని పిలిచి అగ్నికుమారుణ్ని చంపమని అజ్ఞాపించాడు. సప్తమాతృకలు దేవేంద్రుడు చెప్పినట్టు కుమారుడి దగ్గరికి వెళ్లారు. అతడి తేజస్సు చూసి భయంతో అతడికి నమస్కరించి లోకమాతలైన తమని తల్లిగా స్వీకరించమని వేడుకున్నారు. కుమారుడు అందుకు అంగీకరించారు.

అగ్నిహోత్రుడు కూడా అక్కడికి వచ్చి కుమారుణ్ని సంరక్షిస్తూ అతడితో పూజలందుకుంటున్నాడు. సప్తమాతృకలు కోపగించడంతో వారి కోపం నుంచి లోహితాస్య అనే స్త్రీ పుట్టి కుమారుడికి తల్లిస్థానంలో ఉండి గారాబంగా పెంచుతోంది. అన్ని భూతగణాలు కలిసి వచ్చి కుమారుడి చుట్టూ చేరారు. ఆ విషయం తెలిసిన దేవేంద్రుడికి కోపం వచ్చింది.

కుమారుడితో దేవేంద్రుడు యుద్ధము

తన శక్తిసామర్థ్యాలు గొప్పవన్న గర్వంతో దేవతా సైన్యాన్నితీసుకుని వజ్రాయుధం ధరించి కుమారస్వామి మీదకి దండెత్తి వచ్చాడు. దేవతలందరు మెరుస్తున్న ఆయుధాలు ధరించి దేవేంద్రుణ్ని అనుసరించారు. కుమారస్వామి కోపంతో నవ్వాడు.

అతడి ముఖాలనుంచి అగ్నిజ్వాలలు వచ్చి దేవతలందరిని కాల్చివేస్తున్నాయి. దేవతలు భయంతో “మహానుభావా! మేము మీకు సేవకులం. మమ్మల్ని కాపాడు” అని వేడుకున్నారు. కుమారస్వామి కరుణించాడు.

దేవేంద్రుడికి దేవతల మీద కోపం వచ్చింది. తన వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదకి ప్రయోగించాడు. అది కుమారస్వామి శరీరంలో కుడి భాగానికి తగిలింది. ఆ భాగం నుంచి బంగారు రంగు శరీరంతో శక్తి అనే ఆయుధాన్ని ధరించిన విశాఖుడు అనే ఒక పురుషుడు ఉద్భవించాడు. అతడితోపాటు అనేకమంది బాలికలు ఉద్భవించారు.

ఆ వింతని చూసి దేవేంద్రుడు తను కూడా కుమారస్వామిని శరణువేడుకున్నాడు. అది చూసి దేవతలందరూ సంతోషంతో కుమారస్వామి దేవేంద్రుల చుట్టూ చేరిపోయారు” అని చెప్పాడు మార్కండేయమహర్షి.

ఇంకా ఇలా చెప్పాడు “ఎత్తైన భుజాలు కలవాడు, కవచాన్ని ధరించినవాడు, దేదీప్యమానంగా వెలుగుతున్న ముఖంతో మణులు పొదిగిన కిరీటము, ఎర్రని వస్త్రాలు ధరించి నిండు యౌవనంలో ఉన్నాడు.

సర్వ సద్గుణసంపన్నుడైన కుమారస్వామి దగ్గరికి శరీరాన్ని ధరించి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీసమేతంగా ఉన్న కుమారస్వామిని ఋషులు, దేవతలు ఆశ్చర్యంతోను ఆనందంతోను చూశారు.

ఆరవరోజు ఋషులు కుమారస్వామిని భక్తితో పూజించి “కుమారా! ఆరు రోజులకే జగత్తులన్నీ జయించావు కనుక నువ్వు ఇంద్రపదవి అలంకరించి మమ్మల్ని కాపాడు” అని వేడుకున్నారు. “ఇంద్రపదవిలో ఉన్నవాడు తన బలశక్తితో దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షిస్తూ పరిపాలించడం, సూర్య చంద్రులు స్థిరంగా ఉండేట్లు చూడడం చెయ్యవలసిన పనులు” అన్నారు.

దేవతల మాటలు విని ఇంద్రుడు “కుమారస్వామీ! దేవతలు చెప్పినట్టు నువ్వు ఇంద్ర పదవిని అధిష్టిస్తే నేను నీకు సేవకుడిగా ఉంటాను. నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను. నువ్వు పరాక్రమంలో నా కంటే చాలా గొప్పవాడివి కనుక ఇంద్రపదవికి అర్హుడివి.

నేను దేవేంద్రపదవిలో ఇంక ఉండను. ఎందుకంటే నీ తేజస్సు బలపరాక్రమాలు చూసి కొంతమంది దేవతలు నువ్వే దేవేంద్రపదవికి అర్హుడవని చెప్పి నిన్ను ప్రలోభపెట్టగలరు. అప్పుడు నీకు నాకు మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది.

అందువల్ల నీకు, నాకు, దేవతలకి మంచి జరిగేలా ఈ దేవలోక రాజ్యాన్ని నీకు సమర్పిస్తున్నాను. నన్ను, నాతో ఉండే దేవతల్ని దయతో పాలించు” అన్నాడు.

దేవేంద్రుడి మాటలు విని కుమారస్వామి “దేవేంద్రా! చెప్పుడు మాటలు వినడం వల్ల నీకు, నాకు మధ్య ఎప్పుడూ శత్రుత్వం ఏర్పడదు. నువ్వు మనసులో ఎటువంటి అనుమానము పెట్టుకోకు. నువ్వు గొప్ప తేజస్సు, బలపరాక్రమాలు, అనుభవము కలవాడివి. నీ దేవలోకాన్ని నువ్వే ఏలుకో. నేను నీకు బంధువుగ ఉండి సహాయం చేస్తాను. ఇప్పుడు నేను చెయ్యవలసిన పని ఏదేనా ఉంటే చెప్పు” అన్నాడు.

దేవేంద్రుడు “నా మేలు కోరి నువ్వు చెప్పినట్టు నేను ఇంద్రపదవిలో ఉంటాను. నువ్వు దేవసైన్యానికి నాయకుడిగా ఉండి సర్వసేనాపతివై గొప్పదైన నీ ప్రభావంతో లోకంలో ఉన్న భయాన్ని పోగొట్టు” అన్నాడు. దేవేంద్రుడి మాటలు విని కుమారస్వామి అంగీకరించాడు.

దేవేంద్రుడు వెంటనే దేవతలతోను, మహర్షులతోను కలిసి కుమారస్వామిని సర్వసైన్యాధిపతిగా అభిషేకించాడు. దేవర్షులు కుమారస్వామిని జయజయ ధ్వానాలతో ఆశీర్వదించారు.

దేవతలు సింహనాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కిన్నరలు, గంధర్వులు పాటలు పాడారు. దేవకన్యలు నాట్యం చేశారు. కల్పవృక్షాలు పూలవర్షం కురిపించాయి. తలమీద నవరత్నాలు పొదగబడిన కిరీటము, అనేక ఆభరణాలు అలంకరించారు. అతడి శిరస్సుమీద శరత్కాలంలో ప్రకాశించే చంద్రబింబంలా తెల్లటి గొడుగు ప్రకాశించింది.

కుమారస్వామి దగ్గరికి సిద్ధగణాలు సేవిస్తూ ఉండగా పరమేశ్వరుడు పార్వతీసమేతంగా షణ్ముఖుణ్ని చూడడానికి వచ్చాడు. విశ్వకర్మతో చేయించిన బంగారు పూలదండని ఇచ్చి కౌగలించుకున్నాడు” అని చెప్పాడు మార్కండేయమహర్షి.

Exit mobile version