[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
అగ్నిగా అంగిరస మహర్షి – అగ్నులు విధాలు
ధర్మరాజు మార్కండేయ మహర్షితో “మహర్షీ! అగ్నిదేవుడు గొప్ప తపస్సు చేయడానికి, అంగిరసమహర్షి అగ్నిగా మారడం, అగ్నులు ఎన్ని విధాలో కూడా చెప్పండి” అని అడిగాడు.
మార్కండేయమహర్షి “ధర్మరాజా! అగ్నిదేవుడు దేవతలమీద కోపంతో హోమద్రవ్యాలు మొయ్యడానికి ఇష్టపడలేదు. అడవికి వెళ్లి భయంకరంగా తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. తపస్సువల్ల అతడి శరీరం బాగా చిక్కిపోయింది.
అప్పుడు అగ్నిదేవుడు బాధపడుతూ “దేవతల మీద కోపంతో ఇలా అడవికి వచ్చాను. నేను మండకపోతే లోక వ్యవహారాలన్నీ స్తంభించి పోతాయి. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ పని జరగడం కోసం నా స్థానంలో మరొకళ్లని నియమించకుండా ఉంటాడా? కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవాలి” అని ఆలోచించాడు.
తన తపస్సు ఆపి తన పదవిని అధిష్ఠించడానికి వెళ్లాడు. అగ్నిదేవుడు వెళ్లే సమయానికి ముందే బ్రహ్మదేవుడు అంగిరస మహర్షిని అగ్నిదేవుడి పదవిలో నియమించాడు.
అంగిరస మహర్షి త్రిలోకాలకి అగ్నిహోత్రుడై గొప్ప ప్రకాశంతో విజృంభిస్తున్నాడు. మహాతేజస్సుతో ఉన్న అంగిరస మహర్షిని చూసి అగ్నిదేవుడు వెనక్కి వెళ్లిపోతున్నాడు.
అంగిరసుడు అగ్నిదేవుణ్ని చూసి అతడి దగ్గరికి వెళ్లాడు. “పాపరహితుడవైన అగ్నిదేవుడా! నువ్వు మూడు లోకాలతో పూజింపబడ్డవాడివి, బ్రహ్మదేవుడితో మొట్టమొదట పదవిలో నియమింపబడినవాడివి. నీ పదవిని నువ్వే చేపట్టడం ధర్మం. నేను నీ పదవిలో ఉండడానికి అర్హుణ్ని కాదు. నీ పదవిని నువ్వు తీసుకో.. కొంచెం కూడా ఆలోచించకు. నీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను” అని చెప్పాడు.
మహర్షి మాటలు విని అగ్నిదేవుడు “మహానుభావా! దయచేసి నా మాటలు వినండి. నా కీర్తి లోకంలో తగ్గిపోయింది. నిన్ను ఇప్పుడు లోకాలన్నీ పూజిస్తున్నాయి. అగ్నిహోత్ర పదవికి నువ్వే అర్హుడివి. ఈ పదవి నాకు సరిపడదు. అలా కాకపోతే నువ్వు మొదట అగ్నిపదవిలో ఉండు. నేను రెండవ అగ్ని అయిన ప్రాజాపత్యం అనే అగ్ని పదవిలో ఉంటాను” అన్నాడు.
అగ్నిదేవుడు చెప్పింది విని అంగిరసమహర్షి “దేవా! నువ్వే ప్రథమాగ్నిహోత్ర పదవిని తీసుకో. నన్ను నీ ప్రియమైన కొడుకుగా ఆదరించు” అన్నాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. ఈ విధంగా అంగిరసుడు అగ్నిహోత్రుడికి మొదటి కొడుకయ్యాడు.
అంగిరసుడికి శివ అనే భార్య వల్ల ఏడుగురు కొడుకులు కలిగారు. 1. బృహత్కీర్తి, 2. బృహజ్జ్యోతి, 3. బృహద్బ్రహ్మ, 4. బృహన్మనసుడు, 5. బృహన్మంత్రుడు, 6. బృహద్భానుడు, 7. బృహస్పతి కలిగారు.
అదే విధంగా ఏడుగురు కూతుళ్లు కూడా కలిగారు. 1. భానుమతి, 2. రాగ, 3. సినీవాలి, 4. కుహువు, 5. అర్చిష్మతి, 6. మహిష్మతి, 7. మహామతి.
అంగిరసుడి కుమారుల్లో బృహస్పతికి శంయుడు పుట్టాడు. శంయుడు చాలా గొప్ప గుణాలు కలిగినవాడు. హోమంలో వేల్చే నేతిని మొదట శంయుడికి సమర్పించేవాళ్లు. క్రతువుల్లో అతణ్ని మొదట పూజించేవాళ్లు. వీరుడు అనేవాడికి తేజస్వి అయిన భానుడు పుట్టాడు.
భానుడికి నిశ్చ్యవనుడు పుట్టాడు. అతడికి తేజోవంతుడైన నిష్కృతి పుట్టాడు. అతడు సార్థక నామధేయుడు. నిష్కృతి అంటే విడుదల. అతణ్ని పూజిస్తే అన్ని పాపాలనుంచి విడుదల అవుతారు.
ధర్మరాజా! గొప్పవాడైన నిష్కృతికి రజస్కరుడు పుట్టాడు. అతడికి అపరిమితమైన కాంతిగలవాడు క్రోధుడు పుట్టాడు. క్రోధుడికి రసుడు, అతడికి స్వాహా అనే కన్యక, కాముడు అనే కొడుకు పుట్టారు. కాముడికి అమోఘుడు, అతడికి ఉక్థుండు పుట్టారు.
అంతేకాదు కాశ్యపుడు, వాసిష్ఠుడు, ప్రాణుడు, అంగిరసుడు, చ్యవనుడు అనే అయిదుగురు తేజస్వి అనే కొడుకుని పొందడానికి చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి మహావ్యాహ్రుతి అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు.
ఆ అయిదుగురికి లోకాలు ఆశ్చర్యపడేలా ఒక కొడుకు పుట్టాడు. అతడి తల నిప్పురంగు కలిగి ఉంది. అతడి రెండు చేతులు సూర్యుడిలా వెలిగిపోతూ ఉన్నాయి. కళ్లు బంగారు రంగులో మెరుస్తున్నాయి. అతడి శరీరం నల్లగాను, పిక్కలు బలంగాను ఉన్నాయి. అలా అయిదుగురు తండ్రులకి పుట్టిన అగ్నిదేవుడిని పాంచజన్యుడు అని పిలిచారు.
అతడు పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి శిరస్సు నుంచి బృహద్రథంతరులు పుట్టారు. అతడి మొహం నుంచి విష్ణువు, నాభినుంచి శివుడు, వీర్యం నుంచి ఇంద్రుడు, ప్రాణాల నుంచి వాయువు, అగ్ని పుట్టారు.
చేతులనుంచి దంతాలనుంచి సమస్త భూతాలు ఆవిర్భవించాయి. అంతేకాదు, తపుడు అనే అగ్నిహోత్రుడికి గొప్ప తేజస్సుతో వెలుగుతూన్న పదిహేనుమంది కొడుకులు పుట్టారు. వాళ్లు మోసం చెయ్యడంలో ఆరితేరినవాళ్లు.
ఆ పదిహేనుమంది మూడు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గంలో సుభీముడు, అతిభీముడు, భీముడు, భీమబలుడు, అతిబలుడు అనే అయిదుగురు;
రెండవ వర్గంలో సుమిత్రుడు, మిత్రవంతుడు, మిత్రజ్ఞుడు, మిత్రవర్థనుడు, మిత్రధర్ముడు అనే అయిదుగురు; మూడవ వర్గంలో సురప్రవీరుడు, వీరుడు, సువేషుడు, సువర్చసుడు, సురహంత అనే అయిదుగురు ఉన్నారు.
ఈ పదిహేనుమంది యజ్ఞాలు చేసేవాళ్లని బాధపెట్టి వాళ్లనుంచి యజ్ఞఫలాల్ని దొంగిలించేవాళ్లు. వాళ్లని అదుపులో పెట్టడానికి అగ్నికి సంస్కారం చేయవలసి వచ్చింది.
అగ్నుల్ని పక్షుల ఆకారంలో పేర్చడం వల్ల వాటి గొప్పవైన రెక్కల తాకిడి వల్ల, బ్రాహ్మణులు మంత్రాల్ని పెద్దగా చదవడంవల్ల, ఆ పదిహేనుమందిని భయపెట్టడంవల్ల యజ్ఞశాలని చేరలేదు. తపుడు యజ్ఞహర్తలైన పదిహేనుమందినే కాకుండా యజ్ఞభోక్తలైన అయిదుగురు కొడుకుల్ని కూడా కన్నాడు.
మొదటివాడు ‘వైశ్వానరుడు’ బ్రాహ్మణులతో మేఘుడితోపాటు పూజించబడేవాడు. నాలుగు నెలల నోముల్లో అర్చించబడేవాడు. రెండవ కొడుకు పేరు ‘విశ్వపతి’ సమస్త సృష్టికి ప్రభువు. మూడవవాడి పేరు ‘విశ్వకుడు’ విశ్వానికి అంతర్యామి. నాలుగవవాడు ‘విశ్వభుక్కు’. భూతాలు తినడానికి అవసరమైన ఆహారాన్ని వండేవాడు. అయిదవవాడు ‘గోపతి’ అన్ని ధర్మకార్యాలకి కారణమైనవాడు.
‘భానుడు’ అనే పేరుగల అగ్నికి భార్య (సోమపుత్రి) బృహద్భాస యందు బుధుడు, మన్యుమంతుడు, ధృతిమంతుడు, అగ్రయణుడు, అగ్ని, సోముడు అనే పేర్లతో ఆరుగురు కొడుకులు, ‘నిశ’ అనే కూతురు కలిగారు.
పురందరుడు అన్ని తపస్సుల ఫలితాలు పొందడం కోసం ‘మనువు’ అనే పేరుగల కొడుకుని కన్నాడు. ఆ మనువు భానువహ్ని కుమార్తె నిశని పెళ్లి చేసుకున్నాడు. ఆ మనువుకే ప్రాజాపత్యుడు అనే గౌరవప్రదమైన పేరు ఏర్పడింది. అతడిని బ్రాహ్మణోత్తములు పూజించారు. ఈ విధంగా అనేక అగ్నులు ధర్మకార్యాలకి కారణమయ్యారు.
దక్షిణాగ్ని మొదలైనవి గాలి తాకిడికి ఒకదానితో మరొకటి కలిసిపోయినప్పుడు, బయట ఉన్న స్త్రీలు ముట్టుకోడం వల్ల ఏర్పడిన దోషాల్నిపోగొట్టడానికి, పురుడు వల్ల, మరణం వల్ల ఏర్పడే మైల వల్ల కలిగే దోషాల్ని పోగొట్టడానికి ‘అష్టకపాలేష్టి’ ఎనిమిది మట్టి పాత్రల్లో అగ్నికి సంస్కారం చేసి చెయ్యవలసిన క్రతువు చెయ్యవలసి వస్తుంది” అని చెప్పాడు మార్కండేయ మహర్షి.
కొంచెం ఆగి మళ్లీ చెప్తున్నాడు మార్కండేయ మహర్షి “అపుడు” అనే అగ్ని అతిలోక సౌందర్యవతి అయిన పడతి యందు ఆశ్చర్యం కలిగించే పేరు కలిగిన ‘అగ్ని’ని కొడుకుగా పొందాడు.
మూడు లోకాల వ్యవహారాల్ని అగ్ని దీక్షతో నిర్వహిస్తున్నాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలకి యజ్ఞాల్లో సమర్పించబడే హోమద్రవ్యాల్ని మోసుకెళ్లి ప్రేమతో వాళ్లకి ఇస్తున్నాడు.
ఎప్పుడూ ఆపకుండా జరిగే ఈ పనిని చాలాకాలం చెయ్యడం వల్ల అలిసిపోయి, అధర్వుడు అనే వాడితో “అధర్వా! నాకు బలం తగ్గిపోయింది. నువ్వు హోమద్రవ్యాలు మోసుకుని వెళ్లి దేవతలకి ఇయ్యి!” అని చెప్పాడు.
తరువాత అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. దేవతలు అగ్ని ఎక్కడ దాక్కున్నాడో వెతకడం మొదలుపెట్టారు. సముద్రంలో తిరిగే చేపలు అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో దేవతలకి చెప్పేశాయి.
అగ్నిదేవుడు చేపల మీద కోపంతో “ప్రజలు మిమ్మల్ని దయ చూపించకుండా చంపేస్తారు!” అని శపించాడు.
దేవతల్లో ముఖ్యులైనవాళ్లు అపుణ్ని తమకి హోమద్రవ్యాలు అందించమని అనేక విధాలుగా ప్రార్థించారు. అగ్ని అందుకు అంగీకరించక విసిగిపోయి తన దేహాన్ని వదిలిపెట్టేసి భూమిలోకి ప్రవేశించాడు.
అగ్ని విడిచిపెట్టిన కళేబరం నుంచి అనేక పదార్థాలు పుట్టుకొచ్చాయి. చీము రసి నుంచి గంధకము; ఎముకల నుంచి దేవదారు చెట్లు; కఫం నుంచి కర్పూరము; పిత్తంనుంచి నవరత్నాల్లో గొప్పదైన పచ్చ; వాతం నుంచి పాషాణశిల; గోళ్లనుంచి కాకిబంగారం; నరాలు రక్తనాళాల నుంచి పగడము ఏర్పడ్డాయి.
అగ్నిహోత్రుడు భూగర్భంలోనే ఉండి గొప్ప తపస్సు చేశాడు. భృగుడు మొదలైన మహర్షులు అతడి తపస్సుకి మెచ్చుకుని అతణ్ని ఆశీర్వదించారు. అంతటితో అగ్నిహోత్రుడు భూగర్భం నుంచి బయటికి వచ్చాడు.
కాని అతడు మహర్షుల తేజస్సుని చూసి మళ్లీ సముద్రంలోకి వెళ్లి దాక్కున్నాడు. ధర్మరాజా! తరువాత మహర్షులు అగ్నిని వదిలిపెట్టి తాము చేయవలసిన ధర్మాలకోసం అధర్వుణ్ని పూజించడం మొదలుపెట్టారు.
అధర్వుడు అనే అగ్నియొక్క కాంతిని, ఋషులు అతడికి చేస్తున్న గౌరవమర్యాదల్ని, అతడి ద్వారా దేవతలు హోమద్రవ్యాల్ని పొందడాన్ని చూసి ఓర్వలేక అగ్నిహోత్రుడు అన్ని భూతాలు చూస్తుండగా సముద్రం నుంచి బయటికి వచ్చి మళ్లీ హోమద్రవ్యాల్ని అందించడానికి ఒప్పుకుని లోకాలన్నింటికి మేలు కలిగించాడు.
ఈ విధంగా అగ్ని వంశంలో చెప్పుకోదగ్గవాళ్లు ఎందరో ఉన్నారు. అగ్నుల్లో వేరు వేరుగా ఎంతమంది ప్రసిద్దికెక్కినా అందరిలో ప్రజ్వరిల్లిన తేజస్సు ఒక్కటే!” అని మార్కండేయమహర్షి అగ్నుల గురించి వివరంగా చెప్పాడు.