[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘మహాత్మా.. మళ్ళీ జన్మించు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆనాడు శత్రువుతో పోరాడటానికి
కుల మతాల కతీతమైన
ఐక్యతా భావన..!
జాతీయతా స్ఫూర్తి..!!
భారతమ్మ ముద్దుబిడ్డలుగా
ఏకాత్మతా స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని
అలుపెరగని పోరాట పటిమతో
తెల్లదొరల గుండెల్లో నిద్రపోయాము!
శాంతి అహింసల ఆయుధాలతో
బ్రిటిషు ముష్కరులకు
నిదుర లేకుండా చేసిన ఘన చరిత్ర –
మన జాతి సంపదగా నిక్షిప్తమై
‘గతమెంతో ఘనకీర్తి’ నానుడిని
ఓ జ్ఞాపకంగానే మిగిల్చివేసింది!
దేశభక్తిని శ్వాసగా..
స్వాతంత్ర్య కాంక్ష ఊపిరిగా..
ప్రజల సంక్షేమం కోసమే
బ్రతికిన జాతి నేతలు..
పోరాడి గెలిచిన యోధులు..
నైతిక విలువల త్యాగధనులు..
నడయాడిన ఈ నేలపై
స్వార్థపరత్వం.. దొంగతనాలు.. దోపిడీలు
స్వైర విహారం చేస్తున్నాయి..!
కుట్రలు.. కుత్సితాలు
మానభంగాలు.. మారణహోమాలు
నిత్యకృత్యమై పోయాయి ఇక్కడ!
బాపూ..!
నువ్వు కలలు గన్న సమతాభావన..
శాంతి సామరస్యాల జీవన సరళి..
జాతి జనులందరి ఐక్యతా ధోరణి..
నేతి బీరకాయ చందాన అలరారుతోంది!
కులాలుగా మతాలుగా
విభిన్న రకాల జాతులుగా
మమ్మల్ని విడదీసి పాలన చేస్తూ
పలురకాల తాయిలాలతో ఊరిస్తూ
అధికారమే పరమావధిగా పాలన చేసే
దుష్ట సంస్కృతికి తిరదీశారు పాలకులు!
ఒకనాడు..
పేద ధనిక వర్గాలుగా విభజించబడిన జాతి..
కులాలుగా మతాలుగా జాతులుగా
రూపాంతరం చెంది..
సభ్య సమాజం నుండి వెలివేయబడింది!
అధికారం కోసం..
రాజకీయ నేతలు ఆడే వికృత క్రీడలో
పావులుగా మారిపోయి, ఊపిరాడక
ఉక్కపోతతో అలమటిస్తున్నాము!
ఈ నల్ల దొరల నీచ నికృష్ట పాలన నుండి..
మాకు విముక్తిని కలిగించు!!
ఓ మహాత్మా..
మళ్ళీ జన్మించు!!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.