[ఇటీవల ఒక సమావేశంలో చేసిన ప్రసంగం పాఠాన్ని వ్యాసంగా అందిస్తున్నారు శ్రీ పాలకుర్తి రామమూర్తి]
జ్ఞానమనే విభూతిని వక్తృత్వానికి అవసరమైన భాషగా మార్చి సాధకునికి అందించేది వాగ్వాదిని.. ఆమెయే సరస్వతి. ముందుగా ఆ సరస్వతీ మాతకు నమస్కరించి నాలుగు మాటలు మీతో పంచుకుంటాను.
జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుకుంటాము. ధర్మరాజు జీవితమంతా పరీక్షలు ఎదుర్కొంటూ పాఠాలు నేర్చుకోవడంలోనే గతించింది అనుకోవచ్చు. మహాభారతంలో ఇది మహాప్రస్థాన పర్వం.. మహాప్రస్థానం అంటే గొప్పనైన ప్రయాణం.. ఎక్కడి నుండి ఎక్కడికి ఈ ప్రయాణం. అవ్యక్తం నుండి అవ్యక్తం వరకు.. కర్మఫలానుభవం కొరకై అవ్యక్తమైన అపరిమితత్త్వం నుండి పరిమితులతో కూడిన వ్యక్తంగా అవతరించడం పుట్టుక.. కర్మఫలాన్ని అనుభవించాక భౌతిక జీవన పరిమితులను అధిగమించి అవ్యక్తంలో లయం కావడం.. మరణం. గమ్యం గమనం నిర్ణయమయ్యాక జరిగేది పుట్టుక కాగా గమ్యం చేరాక కలిగేది మరణం. మరణానికి పుట్టుకకు మధ్య వ్యాప్తి చెందిన జీవచైతన్యం తన లక్ష్యం కోసం పరితపిస్తుంది. కాగా పుట్టుకకు మరణానికి మధ్య మహాప్రస్థానాన్ని చేరేందుకు అనుగ్రహింపబడిందే జీవితం. దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే సాధన.. సద్వినియోగం చేసుకుంటే మహాప్రస్థానం.. మహాప్రస్థానం అంతిమ లక్ష్యం పరమపదాన్ని చేరడమే..
స్థానం.. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరవలసిన చోటు.. ‘ప్ర’ ప్రకృష్టమయిన లేదా అతిశయమైన లేదా మేలయిన చోటు. అది.. భద్రమైనది.. భవ్యమైనది కూడా. ‘మహా’ అనేది మహత్తుకు సంబంధించినది.. మహత్ అనేది మాయ.. అవ్యక్తం నుండి వ్యక్తమయ్యే పరిణామ క్రమంలో జీవుడు మొదటగా గమించేది మాయనే.. తదుపరి.. అస్థిత్వం లేదా అహంకారం.. తదుపరి పంచభూతాత్మమైన శరీరం.. అలాగే వ్యక్తం నుండి అవ్యక్తానికి సాగే ప్రయాణంలో చివరగా అధిగమించాల్సిందీ మాయనే. “యద్ అక్షరం.. పద భ్రష్ఠం”.. అక్షరమైన స్థానంలో నుండి భ్రష్టమై.. భౌతిక జగత్తులో పడిపోయాము. తిరిగి ఆ స్థానాన్ని చేరేందుకు సాధన చేయాలి.. ఇదీ మానవ జన్మ ప్రయోజనం.
అలాంటి ప్రస్థానం అంత సులువైనది కాదు. అనుక్షణం జాత్యంతరీకరణ జరగవలసిన సాధకుని సాధనలో ఎన్నో అవరోధాలు, ప్రలోభాలు, పరీక్షలు.. వాటిని నిర్వహించుకోవాలి.. సంయమనతతో, సహనంతో అధిగమించాలి.. జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.. ఇదీ మహాభారతంలో మహాప్రస్థాన పర్వం బోధించే ప్రబోధ.
“శ్రీపద సీమావాప్తి సమాపాదన” అంటూ మహాప్రస్థాన పర్వాన్ని ఆరంభించాడు తిక్కనగారు. శ్రీపదము అంటే.. శ్రీతో కూడిన సమగ్రత.. అది శ్రీకైవల్యమే.. భౌతిక ఆధ్యాత్మిక పరిణతితో కూడిన అభ్యున్నతిని ఆశించడమే. మానవ జీవన ప్రయోజనానికి అంతిమ లక్ష్యమైన బ్రహ్మానందాన్ని పొందడమే.. అనుకోవాలి. పోతనగారు కూడా భాగవతారంభంలో శ్రీకైవల్యాన్ని కోరాడు కాని అతనికి దశమస్కందంలో కాని భగవంతుడు కైవల్యశీని అందించలేదు. శ్రీ అనేది భౌతిక ప్రగతికి.. కైవల్యము అనేది ఆధ్యాత్మిక సుగతికి ప్రతీకలు. కైవల్యం లభించాక శ్రీ అయాచితంగానే లభిస్తుంది.. లేదా దాని అవసరమూ ఉండదు.
భారతంలో ధర్మరాజు జీవన పరమార్థాన్ని సాధించాలనే తపనలో అనుసరించిన మార్గం.. ధర్మపథం. తపన తపస్సుగా మారింది. తపస్సు ఎంత గొప్పదైనా.. దాని లక్ష్యం సరైనది కాకపోతే దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టే ధర్మరాజు తపన మహాప్రస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నది. నిజానికి ధర్మరాజు పుట్టుకలోనే ధర్మం పట్ల నిబద్ధత కనిపిస్తుంది. పాండురాజు మనస్సులో ధర్మంపట్ల నిబద్ధత ఉన్నది కాబట్టే యమధర్మరాజు ద్వారా కుమారుని కనమని కుంతీదేవికి చెపుతాడు.
ధర్మోరక్షతి రక్షితః.. ధర్మం మనలను రక్షిస్తుంది.. ఎప్పుడు? దానిని రక్షించినప్పుడు మాత్రమే.. బలం బలాన్ని గౌరవిస్తుందే కాని బలహీనతను గౌరవించదు. రైతు ఫలసాయాన్ని పొందాలనుకుంటే.. ఎన్నోవ్యయప్రయాసలకు ఓర్వాలి.. పంటను వేయాలి.. దానిని రక్షించాలి. పంటను రక్షిస్తేనే ఫలితాన్ని అనుభవించ గలుగుతాడు. మధ్యలో ఎన్నో కష్టనష్టాలు ఎదురుకావచ్చు.. సహనంతో భరించాలి. నిర్లిప్తత ఆవహించవచ్చు.. అందులోనే ప్రేరణ పొందాలి. అలాగే ధర్మమార్గంలో పరమపదాన్ని చేరాలనుకునే సాధకుడు ఎన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని అధిగమించి ముందుకు సాగితేనే.. అనంతమైన, అఖండమైన బ్రహ్మానందమనే స్థితిని పొంది పరమాత్మలో లయం కాగలుగుతాడు.
జీవన గమనంలో దుఃఖాన్ని పొందే సంఘటనలు అనేకం ఎదురు పడవచ్చు. అయితే వాటిని పరీక్షలుగా భావించి.. ఆత్మబలాన్ని సాధించి దుఃఖాన్ని అధిగమించిన వ్యక్తులను.. దుఃఖాన్ని జయించినవారిగా చెప్పుకుంటాము. అలాంటి మహనీయులలో ధర్మరాజు ఒకరుగా చెప్పుకోవచ్చు.
కృష్ణనిర్యాణం తదుపరి పాండవులు మహాప్రస్థానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారిని అనుగమించేందుకు ద్రౌపది కూడా సన్నద్ధమయింది. ధర్మరాజు, సోదరులూ, ద్రౌపదీ తమకున్నది అర్హులకు దానం చేసారు. ఇక్కడ సనాతన ధార్మికాంశాన్ని చెప్పుకోవాలి. రాజు తన వ్యక్తిగత అవసరాలకై కోశం నుండి వేతనంలాగా తీసుకోవాలే కాని కోశాగారం నుండి ఇచ్ఛానుసారంగా వాడుకునేందుకు హక్కులేదు. అలా పాండవులు ఇన్ని నాళ్ళుగా తాము పొందిన సంపదను మాత్రమే దానధర్మాలు చేసారు.
తదుపరి, ధర్మరాజు పరీక్షిత్తును హస్తినాపురానికి, వజ్రుడు అనబడే కృష్ణుని మునిమనుమని ఇంద్రప్రస్థానికి పట్టాభిషిక్తులుగా చేసి సంబంధిత కోశాలను వారికి అప్పగించాడు. వజ్రునికి ఇంద్రప్రస్థాన్ని అప్పగించడం.. కృష్ణుని పట్ల వారి కృతజ్ఞతగా చెప్పుకోవచ్చు. సుభద్రను ఈ రెండు రాజ్యాల అధిపతులకు పెద్దదిక్కుగా నియమించాడు. రాజ్యపాలనా బాధ్యతను ధృతరాష్ట్రుని కుమారుడైన యుయుత్సునికి అప్పగించాడు. పౌరోహిత్య బాధ్యతలను ధౌమ్యునికి, రక్షణ బాధ్యతను కృపాచార్యులకు అప్పగించి మహాప్రస్థానానికి బయలుదేరాడు.
ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.. సన్యసించాలి అనే వారికి ఈ బంధాలు ఏమిటి? అంటే.. సన్యాసం.. పాలకుల ఆశ్రమ ధర్మనిర్వహణలో భాగం.. అలాగే బాధ్యతా నిర్వహణ కూడా ధర్మనిర్వహణలో భాగమే.. అరాచకమైతే ప్రజలు ఇక్కట్లు పొందుతారు. తాను శాశ్వతం కాదు.. కాని వ్యవస్థ శాశ్వతమైనది. రాజ్యపాలన ఒక వ్యవస్థీకృతమైనది. దాని క్రమతను భంగపరచ కూడదు. అందుకే అర్హత ప్రాతిపదికగా బాధ్యతల పంపిణీ.
ఇక్కడ ధర్మరాజు రాజనీతిని పరిశీలించాలి. కృష్ణుని సంతతియైన వజ్రునికి ఇంద్రప్రస్థ పట్టణాన్ని అప్పగించడం వల్ల యాదవులకు న్యాయం చేశాడు. సుభద్రను పెద్దదిక్కుగా ప్రకటించడం వల్ల రెండు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం లేకుండా చేసాడు. యుయుత్సుడు రాజకుటుంబీకుడు, వయసురీత్యా పెద్దవాడు.. అనుభవజ్ఞుడు.. సత్ప్రవర్తన వల్ల ప్రజలలో పలుకుబడి కలిగిన వాడు.. కావడం వల్ల, కాలాంతరంలో పరీక్షిత్తుకు తన అనుభవ రాహిత్యం వల్ల ప్రజల నుండి లేదా యుయుత్సుని నుండి ఏ విధమైన తిరుగుబాటు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. సమర్ధులైన ధౌమ్యుని, కృపాచార్యులను పరీక్షిత్తుకు బాసటగా నియమించడం వల్ల రాజ్యపాలన శాంతియుతంగా సాగుతుంది. యాజమాన్య నిర్వహణకు సంబంధించి రెండవ తరాన్ని సమర్థవంతంగా తయారుచేయడం.. అర్హులుకు తదనుగుణమైన బాధ్యతలు అప్పగించడం.. అధికార బదలాయింపునకు అవసరం.. అదే చేసాడు, ధర్మరాజు. దానివల్ల అధికార బదలాయింపు, రాజ్యపాలన సజావుగా సాగిపోతుంది..
తన నాయకత్వ బాధ్యతలను తరువాతి తరానికి అప్పగించిన ధర్మరాజు, తమ్ములు, ద్రౌపదితో సహా సన్యసించేందుకు సిద్ధమయ్యాడు. పరేంగితావగాహనా బుద్ధి అంటాడు, తిక్కన. ఇతరుల మనసెరిగి ప్రవర్తించడం.. దానినే పాండిత్యము అంటారు. అక్షరజ్ఞానం కాదది.. ఆచరణజ్ఞానము. దానిని పొందినవాడు, ధర్మరాజు.
అందరినీ వీడ్కొని కట్టుబట్టలు మాత్రమే ధరించిన పాండవులు, ద్రౌపది మహాప్రస్థానానికి బయలుదేరారు. కొంతదూరం నడిచాక వారి వెంట ఒక కుక్క అనుసరించి వచ్చింది. నిజానికి భారతమే కుక్కతో ఆరంభమయి కుక్కతో అంతమవుతుంది. కుక్క విశ్వాసానికి ప్రతీకగా చెపుతారు. దత్తాత్రేయులవారిని అనుసరిస్తూ ఎప్పుడూ నాలుగు కుక్కలు ఉండేవట. ఆ నాలుగూ నాలుగు వేదాలకు ప్రతీకలుగా చెపుతారు. మార్గమధ్యంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు.. అప్పటికింకా గాండీవంపై మమకారాన్ని విడనాడని అర్జునుడు గాండీవాన్ని తనతో తీసుకు వెళుతున్నాడు. మమకారాలను విడవకుండా ప్రస్థానం పరిపూర్ణం కాదని, ఆ గాండీవాన్ని సముద్రంలో పడవేయమన్నాడు, అగ్ని. అహంకార మమకారాదులు జాత్యంతరీకరణలో అవరోధాలుగా నిలుస్తాయి. జాతి అంటే స్థాయి.
పాండవులు తమ ప్రయాణాన్ని తూర్పుగా ఆరంభించి, దక్షిణం వైపు తిరిగి, దక్షిణం నుండి పశ్చిమదిశకు.. చేరుకున్నారు. తూర్పు ఆహవనీయాగ్నికి, దక్షిణం దక్షిణాగ్నికి, పశ్చిమం గార్హపత్యాగ్నికి ప్రతీకలుగా చెప్పుకోవాలి. అంటే కర్మపరిత్యాగం చేసి ఆ బంధనాలనూ త్రెంచుకున్నారు. తదుపరి ఉత్తరానికి తిరిగి హిమాలయాలను అధిరోహించి సాగుతున్నారు. కొంతదూరం వెళ్ళాక ద్రౌపది, మరికొంత దూరంలో సహదేవుడు, ఆపై నకులుడు, తదుపరి అర్జునుడు చివరగా భీముడూ పడిపోయారు.
చెట్టు తన సంతానాన్ని ప్రేమగా చక్కగా పెంచుతుంది. కాయ పండుగా మారాక తనంతట తానే దానిని విడిచేస్తుంది. అలా బంధాలను వదిలివేసుకోవాలి. దానికి వ్యక్తిలో ఆత్మసంస్కారం జరగాలి. దానికి సాధన కావాలి. అందరూ పడిపోతున్నా.. ధర్మరాజు కనీసం వెనిక్కి తిరిగికూడా చూడలేదు. బావిలో నుండి చేదతో నీళ్ళు తోడుతుంటాము.. తాడు తెగుతుంది.. ఆ బొక్కెనను బావిలో పడకుండా ఆపగలమా.. అలాగే.. కాలం తీరాక శరీరం పడిపోయే వారిని ఆపలేము అంటూ కాలాన్ని గూర్చి చక్కగా చెప్పాడు, తిక్కనగారు. అలాగే ముందుకు సాగాడు, ధర్మరాజు. త్రికరణ శుద్ధిగా, ఆత్మబలంతో సాధనను కొనసాగించిన ధర్మరాజు ముందు ఇంద్రుడు ప్రత్యక్షమై, తిరిగి అతనికి పరీక్ష పెట్టాడు.
ధర్మరాజా! నీ భక్తి, శ్రద్ధలు, సాధన, ధర్మదీక్ష కారణాలుగా నీవు సశరీరంగా స్వర్గానికి వచ్చేందుకు అర్హతను పొందావు. అదిగో రథము.. దానిని అధిరోహించి స్వర్గానికి రమ్మంటాడు, ఇంద్రుడు. సశరీరంగా స్వర్గాన్ని చేరే అర్హతను సాధించినా, తన వారి పట్ల బంధాలు త్రెంచుకోలేక పోయాడు, ధర్మరాజు.. అందుకే.. నా సోదరులు, భార్య ద్రౌపది వారంతా వస్తేనే తానూ వస్తానంటాడు. ధర్మరాజా! వారంతా దేహాలను విడిచి, దివ్యశరీరులై అమర్త్యలోకానికి చేరారని చెపుతాడు, ఇంద్రుడు. అమర్త్యలోకం అంటే మర్త్యులు లేని లోకం. మర్త్యులు అంటే.. మృత్యువును సమీపించే వారని అర్థం. దానితో తనవారు పడిపోయారని తెలిసినా ఉపేక్షాభావనతో ఉన్నాడు, ధర్మరాజు. ఉపేక్షాభావన అంటే.. కారణమేదయినా, ఫలితమేదయినా.. తన మనసుకు సంతోష దుఃఖ భావనలను తగలకుండా సాధన చేయడమే.. కాని నిర్లిప్తంగా ఉండిపోవడం కాదు. ఉపేక్ష.. బాధ్యతానిర్వహణకు దారి చూపుతుంది.. నిర్లిప్తత.. బాధ్యతా రాహిత్యాన్ని తెలుపుతుంది.
ధర్మరాజప్పుడు.. నా తమ్ములు భార్య.. సరే వారు మరణించి ఉచితలోకాలకు వెళ్ళారు.. ఇదిగో.. ఇన్నినాళ్ళుగా సశరీరంగా నన్ననుసరించి వస్తున్న ఈ కుక్కను నాతో పాటుగా స్వర్గంలోనికి అనుమతించమని ఇంద్రుని వేడుకుంటాడు. కుక్కకు స్వర్గలోక ప్రవేశం లేదంటాడు, ఇంద్రుడు. ఇక్కడ ‘అవసథం’ అనే పదాన్ని వాడారు తిక్కన. అవసథం అంటే ‘బస’ లేదా ‘మజిలీ’. స్వర్గం సాధకులకు ఒక మజిలీ మాత్రమే కాని శాశ్వత ఆనందదాయిని యైన పరమపదము కాదు అనే భావాన్ని చెప్పేందుకే అవసథం అనే పదాన్ని వాడాడు తిక్కనగారు. ధర్మంపట్ల నిబద్ధత కలిగిన ధర్మరాజు, దేవా! జన్మ వల్ల కుక్కకు అర్హత లేదని ప్రవేశం నిషేధించడం సమంజసమా? నాతో పాటుగా సశరీరంగా ఇక్కడిదాకా వచ్చిన కుక్క నేను సాధించినట్లుగానే అర్హతను సాధించినట్లే కదా. అందువల్ల కుక్కను స్వర్గంలోకి అనుమతిస్తేనే గాని తాను స్వర్గానికి రానని ఒకవేళ అలా కాదంటే.. ఇక్కడే నిన్నే అధిష్ఠాన దేవతగా చేసుకొని తపస్సు చేస్తూ జీవితం గడిపేస్తానని చెపుతాడు. ధర్మరాజు తపిస్తే.. మళ్ళీ ఇంద్రుడే ప్రత్యక్షం కావలసి వస్తుంది.. కాని పరీక్ష పరీక్షయే కదా.. ఇంద్రుడెన్ని ప్రలోభాలకు గురిచేసినా, బెదిరించినా కుక్కను అనుమతించకుంటే తాను స్వర్గంలోకి రానని ధర్మరాజు భీష్మించుకొని కూర్చుంటాడు.
ఒక నాయకునికి లేదా పాలకునికి భృత్య రక్షణ, పోషణ కర్తవ్యాలు. వాటిని విస్మరించడం.. పాతకానికి దారితీస్తుంది. పాపము వేరు.. పాతకము వేరు. ఉదాసీన భావనతో ఆచరణీయ కర్మలను ఆచరించకపోవడం పాపము.. తెలిసీ దురుద్దేశంతో పాపకర్మలను ఆచరించడం పాతకము. దుఃఖానుభవం లేదా పశ్చాత్తాపంచేత పోయేది పాపము.. తీవ్రవేదనా భరిత జీవితాన్ని అనుభవించితే కాని పోనిది పాతకము.
అప్పుడు ధర్మరాజు యొక్క పుణ్యచరిత్రకు, నిర్మలమైన మేధకు, సర్వభూతదయకు ముగ్ధుడైన యమధర్మరాజు తన కుక్క రూపాన్ని విడిచి ధర్మరాజు ముందు ప్రత్యక్షమై అతని ధర్మనిరతిని ప్రస్తుతించడం కనిపిస్తుంది, ఈ పర్వంలో. ఇది ధర్మరాజు సమదర్శనకు అద్దం పడుతుంది. “శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః” అంటుంది గీత. అన్ని ఉపాధులలో ఉండే ఆత్మను సమంగా దర్శించడం యోగ లక్షణం. ఈ పర్వం ద్వారా సమవర్తన సాధ్యపడదు సమదర్శనను సాధించాలి అనే సత్యాన్ని మానవ జాతికి బోధిస్తున్నది, మహాభారతం.
ఇది బాహిరంగా కనిపించే పార్శ్వం కాగా ఆధ్యాత్మికంగా ధర్మరాజు యొక్క యోగ సాధనలో పరిపక్వతను గూడా గుర్తించాలి. ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు వరసగా పడిపోయినా.. ఆ బంధనాలకు అతీతంగా స్పందించ గలిగిన మానసిక సన్నద్ధతను పొందిన ధర్మరాజు ఒక యోగిగా.. సాధనలో ఒక్కొక్క స్థాయిని దాటి ముందుకు సాగినట్లుగా చెప్పుకోవాలి. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపురము, అనాహతం, విశుద్ధి చక్రాలను అధిగమించిన ధర్మరాజు, కుక్కకై జరిగిన పరీక్షలో నెగ్గడం ద్వారా ఆజ్ఞాచక్రాన్ని చేరుకున్నట్లుగా భావించాలి. స్వర్గమనేది అమరత్వాన్ని ఇస్తుందే కాని మోక్షాన్ని ఇవ్వదు. జన్మరహిత స్థితి కావాలంటే స్వర్గం కాదు.. లక్ష్యం. స్వర్గం చేరినా సంచిత పుణ్యం ఖర్చయ్యాక భూలోకమే కర్మస్థానం కాబట్టి తిరిగి భూలోకంలో జన్మించాలి. ఆత్మసందర్శనానికి అర్హతను సాధిస్తే.. ఆత్మ తత్త్వం తనంతట తానే ఆత్మయోగికి సాక్షాత్కరిస్తుంది.
ధర్మరాజు స్వర్గానికైతే చేరాడు కాని ముందుగా ‘మదీయ పక్షప్రాప్తుల’ను చూడాలని భావించాడు. కోరకుండానే ధర్మరక్షణ భావనతో కురుక్షేత్ర యుద్ధంలో ఆదరణతో సహాయపడేందుకు వచ్చిన బాంధవులు.. పక్షప్రాప్తులు అంటారు, నన్నయ గారు.. ‘శాత్రవ క్షాత్రతేజంలో ధర్మరాజు జన్మించాడ’ని అంటారు. మా అయిదుగురికి తోడుగా కర్ణుడూ ఉన్నట్లయితే ఇంద్రుడిని కూడా జయించేవారమని ధర్మరాజు పలకడం స్వర్గారోహణ పర్వంలో కనిపిస్తుంది. అలాగే దుర్యోధనుని చూచి ‘రాజాధముడు’ అని సంబోధించడమూ కనిపిస్తుంది.. దీనికి కారణం అతనిలో ఇంకా పోనటువంటి మమత అనబడే వాసనలు.
అందుకే అంతటి ధర్మపరుడైనా.. ధర్మరాజు ఆజ్ఞాచక్రం వరకు చేరాడే కాని సహస్రారాన్ని చేరలేదని పెద్దలు చెపుతారు. అంటే.. స్వర్గానికే పరిమితమయ్యాడు.
పాలకుర్తి రామమూర్తి సింగరేణి కాలరీస్లో పని చేసి ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా పదవీ విరమణ చేశారు. ‘భారతీ స్తవము’, ‘వేద సంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యము’, ‘శ్రీ సరస్వతీ సన్నిధానము’, ‘గంగావతరణం’ వంటి సంప్రదాయ పద్య కావ్యాలతో పాటుగా ‘వ్యక్తిత్వం విజయపథం’ వంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఎన్నో వ్యాసాలు వ్రాశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్గా వ్యవహరిస్తున్నారు. 25 టెలీఫిల్మ్లలో పాల్గొన్నారు. యువతరానికి మేధోపరమైన, భావోద్వేగ నైపుణ్యాలను అందించడంలో ఆసక్తి.