[డా. సి. భవానీదేవి రచించిన ‘మాటే గాయం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒక్కోసారి అనిపిస్తుంటుంది
ఆ పరిచయం ఎందుకయిందోనని
మనదనుకున్న స్నేహం
దూరమయితే ఎంత వేదనో!
మట్టిలో పుట్టిన మనిషికి
మట్టిని ప్రేమించే మనుషులంటే
మహా మమకారం
అమ్మా నాన్న.. బంధుగణం
సహోద్యోగులు
అన్నీ అందరికీ సహజానురాగాలే
అంతకు మించిన అనుబంధం
అల్లుకుంటే
అది మరో కంటిచుక్క
మనసన్నది శరీరమంతా అల్లుకుంటుంది కదా
మాట వినని మనసు వ్యాపకత్వాన్ని అరికట్టేది ఏదీ లేదు
ఒక బంధం కలవటం యాదృచ్ఛికం కాదు
జారిపోవటం నరకయాతనే
మిత్రమా
ప్రతి మాటా గాయంగా రగులుతున్నప్పుడు
ఇంక గాయాలను చేర్చుకోకు
పేర్చుకున్న మమతానురాగాలను
గుప్పెడు మనసులో
గుప్తంగా దాచుకొని
చివరి శ్వాస దాకా భద్రపరుచుకో
లావాలా ప్రవహించే మనసును
లాలించటం నేర్చుకో
ఆ వేడిలో దగ్ధం మాత్రం
కావద్దు సుమా!