[శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాని సమీక్షిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]
ఇలా విడుదల అయ్యీ అవ్వంగానే ఓ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడటం అరుదు. ఈసారి అలా కుదిరింది. పిల్లలతో కలిసి సరదాగా వెళ్ళి వచ్చాను.
‘పైసా వసూల్’ అనే మాట వింటూ ఉంటాము. ఈ సినిమాకి ఆ మాట నూటికి నూరు పాళ్ళు సరిపోతుంది.
ఆలోచన, సమాజం పట్ల వేదన, అవినీతిపరుల పట్ల కోపం, దుఃఖం, నిస్సహాయత, పేద గొప్పల మధ్య ఈ అంతరాల పట్ల ఒక విధమైన బాధ ఇవన్నీ కలుగుతాయి ఈ సినిమా చూస్తూ ఉన్నంత సేపు.
ఎప్పుడైనా బాగ చలిగా ఉన్న రాత్రి వెచ్చగా రగ్గు కప్పుకుని ఒదుక్కుని పడుకున్నప్పుడు ఆలోచన కలుగుతుంటుంది ఒక క్షణం పాటు, వీధుల్లో పడుకున్న భిక్షగాళ్ళు ఎలా గడుపుతుంటారో కద అని.
వర్షం తీవ్రంగా కురిసి వీధులన్నీ జలమయం అయిపొయీ బలమైన చలి గాలులు వీస్తూ ఉన్న క్షణంలో వెచ్చగా టీ త్రాగుతూ, కిటికిలో నుంచి వర్షం ధారలని చూస్తూ పకోడీలు తింటూ ఉన్న క్షణం అనిపిస్తు ఉంటుంది రోడ్డు పక్కన ఉన్న అభాగ్యులు ఎలా గడుపుతు ఉంటారో కద అని.
వనస్థలిపురం నుంచి – దిల్సుఖ్నగర్ వెళ్ళే లోపు, ఎందరు భిక్షగాళ్ళు రోజూ తారసపడతారో లెక్కలేదు. చంటిపిల్లల్ని చంకనేసుకుని, పెన్నులని అమ్ముతున్నట్టు అభినయిస్తూ, పాటలు పాడుతూ, కుంటుతూ, రోదిస్తూ, ఒళ్ళంతా గాయాలని కప్పి ఉంచిన మాసిపోయిన కట్లతో ఇలా రకరకాలుగా కనిపిస్తారు రోజు భిక్షగాళ్ళు.
భిక్షగాళ్ళగూర్చి రోజూ కొంత సేపయినా మనకు తెలియకుండానే మనం ఆలోచిస్తాం కాసేపు రోజు.
ఈ భిక్షగాళ్ళ జీవితాల ఆధారంగా సీరియస్గా సినిమాలు వచ్చినట్టు లేవు. స్లం డాగ్ మిలియనీర్ నేను చూడలేదు.
మనము ఉన్న మానసిక స్థితిని బట్టి అయిదో పదో దానం చేయటమో, చిల్లర లేదని చెప్పేసి మన పని మనం చూసుకోవటమో చేస్తూ ఉంటాము.
ఒక్కో సారి భిక్షగాళ్ళని చూస్తే, ఎప్పుడో విన్నసామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనమో, చాగంటి వారి ప్రవచనమో గుర్తు వచ్చి మనకి కర్మ సిద్ధాంతం గుర్తు వచ్చీ మనం ఉన్న స్థితి పట్ల మనకు ఎంతో ఆనందం కలిగి, అయ్యో ఈ భిక్షగాళ్ళు పూర్వ జన్మలో ఏ పాంపం చేసుకున్నారో కద అనిపిస్తుంది. వీళ్ళకి చేతనయినంత కాడికి దానమో ధర్మమో చేసి వాళ్ళ బాధని తీరిస్తే మన కర్మలో కొద్దో గొప్పో క్షయం అవుతుంది కద అనే భావనలు కూడా కలుగుతాయి.
ఇక పోకిరీ సినిమాలో పూరి జగన్నాద్ ఆలీ పాత్ర ద్వారా భిక్షగాళ్ళని ఇంకో కొత్త కోణంలో చూపించి నవ్వించారు
అలనాడు ఎప్పుడో కృష్ణారెడ్డి గారు బాబూ మోహన్తో ‘అంత ముద్దుంటేయ్యమ్మో’ అని కామెడీ పండించారు.
బాబు మోహన్ తోనే ముత్యాల సుబ్బయ్య గారు అరుగు మీద పడుకునే భిక్షగాడి పాత్ర రూపుదిద్దించి , మామగారైన దాసరి గారి పాత్రకి, భిక్షగాడి పాత్రకి మధ్యలో అద్భుతమైన హాస్యాన్ని పండించారు.
కొన్నేళ్ళ క్రితం మదర్ సెంటిమెంట్ సినిమా ‘భిక్షగాడు’లో సాక్షాత్తు ఒక హీరో (విజయ్ ఆంథొని) భిక్షగాడి పాత్రలో నటించి ఒక సంచలనం సృష్టించారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే మొన్న శుక్రవారం విడుదల అయిన ‘కుబేరా’ ఒకటీ ఒకెత్తు.
ఇది ఒక అద్భుతమైన సినిమా అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా గూర్చి చాలా మంది చాలా రివ్యూలలో తమ అమూల్యమైన అభిప్రాయాలని వెలిబుచ్చారు. నాగార్జున, ధనుష్, రశ్మిక మందన్నా, వీరి గూర్చి నేను కొత్తగా చెప్పవలసింది ఏమి లేదు.
ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన నాలుగు మాటలు ఇక్కడ మీతో చెబుతాను.
చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి నటించిన ‘ఛాలెంజ్’ చిత్రంలో ఒక కోటీశ్వరుడికి, ఒక నిరుద్యోగికి మధ్య ఒక ఘర్షణ జరుగుతుంది. అది ఆ రోజుల్లో ఒక సంచలనం.
ఇక్కడ అనుకోకుండా ఒక భిక్షగాడికి, ఒక అపర కుబేరుడికి మధ్య ఘర్షణ మొదలవుతుంది.
ఆ అపర కుబేరుడు అలాంటి ఇలాంటి వాడు కాదు. అంతర్జాతీయ స్థాయిలో అపర కుబేరులలో ఒకడిగా ఉంటాడు. అతను అనుకుంటే ప్రభుత్వాధికారుల, రాజకీయనేతల భవిష్యత్తుని తిరగరాయగలడు. తన వ్యాపార సామ్రాజ్యం నిలబడటానికి వందలాది మంది సామాన్యులు, బలైనా అతనికి పట్టదు. తనూ, తన వ్యాపారం అంతే. ఇతని మీదకి ఇతని తండ్రి కొంచెం దయామయుడు. కానీ దొందూ దొందే. విలనిజం స్థాయిలో కాస్తా తేడా. తండ్రి కాస్త మంచి మాటలు చెబుతాడు, దేవుడిని నమ్ముతాడు. కొడుకుకి అది కూడా లేదు – సాక్షాత్తు రాక్షసాంశ.
అసలు ఇలాంటి ఆలోచన రావటమే వింత అయితే దాన్ని చక్కగా కథగా వ్రాసుకుని, పాన్ ఇండియా లెవల్లో స్టార్లని పెట్టి తీయాలని ఆలోచన రావటమే వింత మాత్రమే కాదు. ఒక సాహసం. సాహసం కాదు దుస్సాహసం.
ఈ కథకై నాగార్జునని విలన్ షేడ్స్ ఉండే పాత్రకి ఒప్పించటం ఒక సాహసం.
ఆద్యంతం దరిద్రంగా కనిపించే భిక్షగాడి పాత్రలో ధనుష్ని అనుకుని అతన్ని ఒప్పించటం ఇంకా సాహసం.
ఇవన్నీ అటుంచి, ఇంత వరకు పెద్ద సినిమా తీసిన అనుభవం లేని శేఖర్ కమ్ముల నిర్మాతలని ఒప్పించి ఇంత భారీ బడ్జెట్ సినిమాని తీయాలని అనుకోవటం ఇంకొక పెద్ద సాహసం.
విజయం సాహసవంతులని వరిస్తుంది అన్న నానుడి ఉండనే ఉంది కద. అదే జరిగింది.
అద్భుతం జరిగే వరకు ఎవరికైన చెప్పినా నమ్మరు, అది జరిగాక ఇక ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. నిజంగా ఈ సినిమా ఒక అద్భుతం.
ఎవరి కారణాలు ఏమిటో తెలియదు కానీ, ఈ సినిమాని పని కట్టుకుని విమర్శించే వారిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.
“అంబానీని పోలి ఉండే పాత్రని రూపుదిద్దారు” ఇది ఒక విమర్శ. విలన్ అన్నాక ఏదో ఒక దిక్కుమాలిన వ్యాపారం చేయాలి కద, అందుకే పెట్రోల్ రిఫైనరి వ్యాపారం చేస్తూ ఉంటాడు. అంబాని అని ఆయన ఎక్కడా పేర్కొన లేదు కనీసం అలాంటి పేరు స్ఫురించేలాగా కూడా పేరు పెట్టలేదు. అంబానిని విమర్శించినాడు అని అనుకునే వారికి అలా ఎందుకు అనిపించిందో?
అంబాని బయోపిక్ (గ్రఫీ) తీసిన మణిరత్నం అంబానీ అనేక లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని చట్టంలో లొసుగులు ఆధారంగా చేసుకుని ఎదిగాడు అని బాహటంగా తీశారు కద సినిమా. ఇక్కడ అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు.
‘విలన్ తండ్రి వెంకటేశ్వర స్వామి భక్తుడూ’ ఇది ఒక విమర్శ. రావణుడు, హిరణ్యకశిపుడు అసురులే కద వాళ్ళు దైవ భక్తులే కద. అనేక మంది రాక్షసులు మనకు పురాణాలలో దైవ భక్తులే కద.
‘వజ్రాల కిరీటం చేయిస్తానని మొక్కుకున్నాడు’ ఇది ఒక విమర్శ. విలన్కి కూడా వాడి కోరికలు వాడికి ఉంటాయి కద. అవి ధర్మబద్ధమైనది అయితేనే దేవుడు కరుణిస్తాడు కద. ఇక్కడ పీక తెగి చచ్చాడు కద వాడి కొడుకు. ఇక వజ్రాల కిరీటం ప్రసక్తి లేదు కద?
‘ఇక మసీదులో రాత్రి పూట అన్నదానం ఎక్కడైనా ఉంటుందా?’. నిజమే నవ్వి వదిలేయాలి కాని దానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఆ సీన్ని ఏదైనా దేవాలయంలోనో, ఏదైనా ధనికుల పెళ్ళి ఇంటి ముంగిట పేదలకి అన్నదానం వద్దనో అని తీసి ఉంటే బాగుండేది.
ఇంతకి మించి ఈ సినిమాలో హిందూ మతాన్ని విమర్శించింది ఏమీ లేదు, అంబానీని విమర్శించింది ఏమీ లేదు.
ఇక ‘శేఖర్ కమ్ములని కమ్యూనిస్టు పూనాడు’ అనే విమర్శ ఒకటి వచ్చింది.
‘అందరికీ పంట పండించాను, దొంగలు పడి దోచుకోకుండా కాపాడుకోండి’ ఇది దత్తావతారం అయిన భగవాన్ వెంకయ్య స్వామి మాట.
భగవంతుడు అందరికీ అన్నీ సమానంగా ఇచ్చాడు. కొందరు స్వార్థపరులు ఇతరుల సంపదలని దోచుకోవటం అన్నది ఆది నుంచి ఉన్నదే. వాళ్ళని రాక్షసులు అన్నారు, వాళ్ళని అంతమొందించటానికి దేవుడు అనేక అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు కద.
అందరికీ అన్ని వనరులూ సమానంగా ఇచ్చిన దేవుడు నా దృష్టిలో పెద్ద కమ్యూనిస్టు. ఆ వనరులని స్వార్థంతో దోచుకునే దొంగలందరూ రాక్షసులే అప్పటికీ ఇప్పటికీ.
దశరధ మహారాజు గారి పాలనలో కానీ, రామరాజ్యం అని మనం కలలుగనే రాజ్యంలో గానీ భిక్షకులు ఉండరు. వాల్మీకి రామాయణంలో దశరధ మహారాజు గారి రాజ్యం గూర్చి వర్ణన చదివిన ఎవరికైనా మది పులకరిస్తుంది. ఇది కద ధర్మం అంటే ఇలా కదా మానవులు హాయిగా ఉండాలి అని అనిపిస్తుంది.
అలా కలలు కనే అధికారం ఎవరికైనా ఉంది. వారు కమ్యూనిస్టులే కానక్కరలేదు. అంటే ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలి అని కలలు కనే వాళ్ళు కమ్యూనిస్టులు మాత్రమే అని మనం మనకు తెలియకుండానే ఒక భావజాలాన్ని ప్రచారం చేసుకుంటున్నామా?
ఇంటెగ్రల్ హ్యూమనిజం (సమగ్ర మానవతావాదం) దర్శించిన మహానుభావుడు దీన దయాళ్ ఉపాధ్యాయని కమ్యూనిస్టు అంటారా ఏమిటి?
ప్రతి మానవుడు సుఖంగా ఉండాలి, ప్రతి మానవుడు సంతోషంగా ఉండాలి అన్న కల అందరిదీ. ఇది కమ్యూనిస్టుల సొత్తేమీ కాదు.
నా వరకి నాకు ఈ సినిమా నచ్చింది.
నటులలో నాగార్జున నటనకి ఎక్కువ మార్కులు వేస్తాను. ఆ పాత్రలో ఉన్న వేరియేషన్స్ అలాంటివి. కాస్త ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది. సిన్సియర్ ఆఫీసర్. అవినీతి అధికారుల వల్ల జైలు పాలవుతాడు, మనసు చంపుకుని విలన్ల దయా దాక్షిణ్యాల మీద బయటపడతాడు, వారి వద్దనే ఊడిగం చేయాల్సి వస్తుంది. ఆ సంఘర్షణని చక్కగా పండించాడు. మనసుకి నెమ్మది లేదు. ఆ విషయంలో మేకప్ కూడా చాలా చక్కగా కుదిరింది.
ధనుష్ నటన సూపర్. అతనిది ఒకటే షేడ్. వేరియేషన్స్ లేవు, అందువల్ల ఆ పాత్రలో చాలెంజీ లేదు అంటాను నేను – పేదరికం, దైన్యం, అజ్ఞానం, నిరక్షరాశ్యత, పశుపక్ష్యాదుల పట్ల సాటి భిక్షగాళ్ళ పట్ల ప్రేమ. ఇవి ఆ పాత్ర లక్షణాలు. ఎవరైనా చేయగలరు. అందరూ అతను మాత్రమే చేయగలడు అని ఎందుకంటున్నారో నాకు అర్థం కాలేదు.
కార్తి, సూర్యా, విక్రం, కమల్ హాసన్, తెలుగు నటులు సత్యదేవ్ కంచెర్ల, శివాజీ (మన మంగపతి), జేడీ చక్రవర్తి (ఇప్పటికి హెల్తీగా ఉన్నాడు అవకాశాలు ఇస్తే చేస్తాడు), ఫహద్ ఫాజిల్ – ఇలా ఎవరైనా చేయగలరు ఈ పాత్రని. ఇక్కడ ధనుష్ని కించపరచడం నా ఉద్దేశం కాదు.
ఈ సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని, ధనుష్ని తీసుకున్నారు తప్పనిచ్చి అందరూ పొగుడుతున్నంత లోతు లేదు ఆ పాత్రలో (నటనకి అవకాశం పరంగా). ఒక స్టార్ హీరో భిక్షగాడిగా కొనా మొదలు నటించాల్సి రావటం, చెత్తలో దొర్లాల్సి రావటం ఇవన్నీ ఛాలెంజెస్సే.
దేవిశ్రీ ఉన్నప్పటికి పాటలు హిట్ అవ్వాల్సిన స్థాయిలో లేకపోవటం చిత్రమే.
చిత్ర సీమనే చిత్రాతి చిత్రం కద.
మొత్తం మీద ఈ సినిమాకి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు.
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ దేశం గర్వించదగ్గ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా నిపుణుడు. వీరు రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ అధినేత. వివేకానంద్ గారు రూపుదిద్దిన ‘పేపర్లెస్ ఫ్లూయెన్సీ’ అనే మోడ్యూల్ అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా పై స్థాయిల్లో ఉన్న అనేకమంది ప్రముఖులు, సెలెబ్రిటీలు వీరి పేపర్ లెస్ ఫ్లూయెన్సీ కోర్స్ ద్వారా విజయ శిఖరాలకి చేరుకున్నారు. ఇప్పటిదాకా యాభై వేలమందిపైగా ప్రొఫెషనల్స్ మరియు సెలెబ్రిటీలు ఈ శిక్షణా తీసుకుని ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ’ని అమలు చేయబోయే ముందు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకి వీరిని ప్రత్యేకంగా అహ్వానించి వీరి సలహాలు సూచనలు స్వీకరించటం జరిగింది.
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. పేపర్ లెస్ ఫ్లూయెసీ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్మెంట్, ఇంటర్యూ స్కిల్స్, హెచ్చార్డీ స్కిల్స్ తదితర అనేక శిక్షణా తరగతులు వీరు నిర్వహిస్తూ ఉంటారు. వీరి బోధనలు విని మంత్రముగ్ధులు అవని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. తన శిక్షణా కార్యక్రమంలో ‘న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్’ మరియు ‘పవర్ ఆఫ్ సబ్కాన్షస్ మైండ్’ అనే ప్రభావవంతమైన సూత్రాలతో వీరు తమ బోధనని రక్తి కట్టిస్తారు.
టీనేజీ పిల్లలకి ‘గోల్ సెట్టింగ్’ అనే ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టి వీరు అనేక మంది పిల్లలని విజయపథంలో నడిపిస్తున్నారు.
వీరి కార్యక్రమాలని యూట్యూబ్లో చూడవచ్చు. వీరు స్వతహాగా రచయిత. సినీ విశ్లేషకులు కూడా. వీరు వ్రాసిన ఇంగ్లీష్ పుస్తకం ‘సాఫ్ట్ స్కిల్స్ టు ఏస్ ఇంటర్వ్యూస్’ అమెజాన్లో లభ్యం అవుతుంది.
ప్రతి శనివారం సాయంత్రం జూమ్ ప్లాట్ఫాం ద్వారా వీరు లైవ్లో పేపర్లెస్ ఫ్లూయెన్సీ గూర్చి ఉచిత అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తారు.