[‘కోడెమొక్కుల స్వీకర్త.. వేములవాడ రాజన్న!’ అనే భక్తి కవితని అందిస్తున్నారు శ్రీ గొర్రెపాటి శ్రీను.]
శివనామ సంకీర్తన సదా శుభప్రదం!
‘శివ.. శివ..’ అంటూ స్మరిస్తుంటే
సర్వ బాధలు మటుమాయమై
సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయి!
మహాశివుడు కొలువై ఉండి
దక్షిణ కాశీగా పేరెన్నిక గన్న
తెలంగాణలో వెలసిన దివ్యక్షేత్రం వేములవాడ!
చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం
ఈ క్షేత్రంలో స్వామిని ‘రాజన్న’గా పిలుస్తారు!
వృత్తాసురుని సంహరించిన ఇంద్రుడు
బ్రహ్మహత్యా దోషం నివారించుకోవడానికి
వేములవాడ రాజన్నని దర్శించుకున్నాడని
దోషనివారణ పొందాడని
మహాశివుడి కరుణ అనంతమని చెబుతారు!
కోర్కెలు తీరిన భక్తులు కోడెగిత్తలని
స్వామికి బహుమతిగా అందిస్తారు!
మహాశివరాత్రి నాడు జరిగే వేడుకలు
విద్యుత్ కాంతుల నడుమ శివపార్వతుల కళ్యాణ వైభవం
జగత్ప్రసిద్ధం!
అలౌకికమైన ఆనందకారకం రాజన్న సందర్శనం!
Imge Credit: Internet
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.