సంస్కృతంలో ‘దండి’ అన్న మహాకవి ఉన్నాడు. ఆయన రాసిన ‘దశకుమార చరిత్రమ్’ సంస్కృతంలోకి ప్రసిద్ధ కావ్యాలలో ఒకటి. ‘దండినః పదతాలిత్యం’ అని పేరు. దానిని తెలుగులోకి అనువదించి తన గురువైన తిక్కనకు అంకితమిచ్చాడు కేతన. ‘ఆంధ్ర భాషా భూషణము’ అనే వ్యాకరణ గ్రంథాన్ని వ్రాసినాడు. తెలుగు వ్యాకరణ శాస్త్రాల్లో అదే మొదటిది. ‘విజ్ఞానేశ్వరము’ అనే గ్రంథంలో హిందూ ధర్మ శాస్త్రాన్ని, యాజ్ఞవల్క్యస్మృతిని అనువాదముగా తెలుగువారి కందించినాడు.
‘దశకుమార చరిత్రము’ కథా కావ్యం. అనేక పాత్రలు ఇందులో కేతన చిత్రీకరించినాడు. ఇందులో పది మంది నాయకులుంటారు. వాళ్ళంతా అగ్రజాతులకు చెందినవారే. కానీ కథలో వారికి సాయం చేసే వారిలో అన్ని కులాల వాళ్ళుంటారు. వారు సద్గుణ సంపన్నులు. అట్లా సమాజంలోని సమతౌల్యతను పాటించినాడు కేతన. భరతుని నాట్యశాస్త్రమును బట్టి, అద్భుతరసమును, దాని స్థాయీ భావమైన విస్మయమును చక్కగా పండించినాడు. కావ్యములో అద్భుతజనకాలకైన అలౌకిక సన్నివేశాలున్నా, పాఠకునికి అపనమ్మకాన్ని కల్గించవు (suspension of reader’s disbelief).
కేతన వర్ణనలు మనోహరంగా ఉంటాయి. అపహరవర్మ కథలో సూర్యోదయాన్ని “ప్రాచీన శైలాగ్ర భాగస్థమగు నశోకంబున జిగురు జొంపమనగ” అని వర్ణిస్తాడు. మంత్రగుప్తుని కథలో జైన సన్యాసి దీనావస్థను “తెల్లని వాలుగడ్డమును దీర్ఘ జటాళియు..” అని, బ్రహ్మ రాక్షసుని వర్ణిస్తూ, “పేరిన కోర వెంట్రుకలు.. మీసల నూనిన రక్త పంకముల్” అంటాడు. రాక్షసుల నెప్పుడూ మనం చూడకపోయినా, మనకొక రూపం కళ్ళ ముందుకొస్తుంది. అయినా మన సమాజంలో కూడా రాక్షసులు లేరా ఏమిటి? అయితే ‘డీసెంట్’గా ఉంటారు!
ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడూ కావ్యహేతువులని ముమ్ముటుడన్నాడు. కానీ జగన్నాధ పండితులు ప్రతిభ ఒక్కటి చాలన్నారు. కేతనలో ప్రతిభ అని భావుకతలో, ఉదాత్తతలో కనిపిస్తుంది. రాజవాహనుడు, అవంతీసుందరీల సమాగమను.. “లోలతా డోలమాన విలోచనులును/మన్మథాదీన పరతంత్ర మానసులును/నగుచు నే కాసనాసీను లైరి తగవ/ధూవరులు సౌఖ్య రసము దోయి వలె” ఆయన కవితాశక్తికి గీటురాయి. తిక్కనను గురించి “సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనిన వీ/డను నాలుకకు దొడవైనవాడు” అంటాడు. “దీన జనతానిధానంబు తిక్కశౌరి” అని వర్ణిస్తాడు.
సంభాషణా చతురరకు ఈ పద్యం మచ్చు తునక. “మీరరుగుడు మీరేగుడు/మీరు చనుడు మీరు పొండు మీ మీ పనులొ/ప్పారగ సలుపుడు నావుడు/బోరన నయ్యింద్రజాలపుంబ్రజవోయెన్.” అలా తన కావ్యాన్ని సుసంపన్నం చేసిన కేతన ధన్యుడు. వీలు చేసుకొని ‘దశకుమార చరిత్ర’ చదవండి మరి!
డా. హరిశివకుమార్ గారికి కృతజ్ఞతలతో..
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.