Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవచం

[శ్రీ శింగరాజు శ్రీనివాసరావు రచించిన ‘కవచం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

క్కడ రెప్పలు మూయని కనుపాపలు
బిత్తర చూపులతో బిక్కుబిక్కుమంటున్నాయి
మారణాయుధాలు వెదజల్లిన కారుమబ్బుల కౌగిలిలో
అస్తిత్వంతో సూరీడు చీకటిలో మ్రగ్గుతున్నాడు

ఎటుచూసినా రక్తపు కడలిలో తేలుతున్న మాంసఖండాలే
మానం చెదిరి ప్రాణం దక్కని మగువల పార్థివదేహాలే
మతకార్చిచ్చు రగిలించిన హోమగుండాలే

బడుగులు, బలహీనులు చేస్తున్న ఆక్రందనలు
ప్రపంచపటాన్ని కుదిపేస్తున్నా అధికారం నిద్రపోతున్నది
రాజకీయం మౌనం వహించి కొంగజపం చేస్తున్నది

ఎంతకాలమిలా పిరికితనపు కుంపట్ల మీద
మానవత్వపు గుగ్గిళ్ళను వండుకుతిని బ్రతకడం
వెన్నెముక లేని వానపాముల్లా తప్పించుకు పోవడం కాదు
మిణుగురులు నిప్పుకణికలై అగ్నిహోత్రం వెలిగించాలి

మతమౌఢ్యాలను, దురాచారాలను రూపుమాపే దిశగా
మనసులో ఆలోచనలు పురుడు పోసుకోవాలి
కలాలే విదిలిస్తారో, కాళ్ళనే కదిలిస్తారో
ఏకత్రాటిపై వచ్చి ఈ దుర్మార్గాన్ని ఉరితీయండి

మణిపూర్, బంగ్లాదేశ్ వంటి దేశాలలోనే కాదు
ధరణి మీద ఎక్కడ ఉన్మాదం విజృంభించినా
మతరహిత మానవత్వం కవచమై వారిని కాపాడాలి..
ఈ వికృతక్రీడను శృంఖలబద్ధం చేయాలి..
మనుషులంతా ఒక్కటై నవశకానికి నాంది పలకాలి.

Exit mobile version