Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనిషిగా ఉండమనే కవితల సంపుటి ‘కథ మరిచిన మనిషి’

[డా. అగరం వసంత్ గారి ‘కథ మరిచిన మనిషి’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

బ్రతకడం కష్టమైపోయిన మానవ జీవితాల గురించి, రాత్రికి పగలుకీ తేడా లేని జీవితాల గురించి, ఆ జీవితాల్లోని చీకటి గురించి వాస్తవాలు చెబుతూనే, ప్రశ్నించాల్సిన దాన్ని నిస్సందేహంగా ప్రశ్నిస్తాడు కవి. మనిషి జీవితంలో, సమాజంలో రావల్సిన మార్పుల గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతాడు. సహజమైన జీవద్భాషలో అతడు రాసిన కవిత్వం పాఠకులను కలవరపెడుతుంది. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఆలోచింపచేస్తుంది. స్పందింపజేస్తుంది.” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు ప్రముఖ కవి, కథా రచయిత శ్రీ పలమనేరు బాలాజీ.

~

డా. అగరం వసంత్ ప్రవృత్తి రీత్యా కవి, కథకుడు, నవలా రచయిత, సంపాదకుడు. వైద్యుడిగా తీరిక లేని వృత్తిలో ఉంటూనే, తను నమ్మిన విలువల కోసం, తన సిద్ధాంతాల కోసం సాహిత్యాన్ని సాధనంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇది వారి తొలి కవితా సంపుటి. ఇందులో 51 కవితలున్నాయి.

విషయసూచికని పరిశీలిస్తే, పలు రకాల అంశాల మీద వైవిధ్యభరితమైన కవితలల్లినట్టు అర్థమవుతుంది. ఏదో ఒక అంశానికి పరిమితం కాకుండా పలు రకాల అంశాలను తీసుకుని అత్యంత సరళమైన భాషలలో పదాలను పొందికగా పేర్చి, హృదయాన్ని తాకేలా భావాలను వెలిబుచ్చారు. ‘హోసురు పరస’ అనే కవితలో తమ ప్రాంతంలో జరిగే వేడుకలను అందరికీ తెలిసేలా గొప్పగా రాశారు. ‘అతడు’ అనే కవితలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితాన్ని కళ్ళకు కట్టారు. ‘ముందుకు పోదాం’ కవిత శ్రీశ్రీ గారి ‘మరో ప్రపంచం’ కవితని గుర్తు చేస్తుంది. ‘కల’ అనే కవితలో “వాడి కలల్ని../వీడి కలల్ని../నువ్వు నమ్మడం కాదు”; “సాధనతో వేదన తొలగించుకోవాలి/నీ కల నిజం చేసుకోవాలి” అంటూ స్ఫూర్తి నింపుతారు.

ఈ క్రింది లక్షణాల ఆధారంగా వారి మరి కొన్ని కవితల గురించి ముచ్చటించుకుందాం.

~

భావుకత:

సహజంగా కవులు భావుకులై ఉంటారు. గంభీర అంశాలపై కవితలు రాసినా ఎక్కడో ఓ చోట – భావుకత్వం నిండిన అద్భుతమైన పంక్తులు తారసపడతాయి. ‘కవితా కదలిరా!’ అనే కవితలో “ఎండ కాలం వాన కాలం చలి కాలం/మేలురాక మేలుతలపులు మేలుకొలుపు/ కనువెలుగు కనుమరుగు/ఇదే కదా జీవితం!” అంటారు. ఒకలా చూస్తే భావుకతా, మరోలా చూస్తే, తాత్త్వికతా గోచరిస్తాయి ఈ పంక్తులలో.

తనని చేరుకోమని ప్రియురాలిని ఆహ్వానించే, ‘నీ నవ్వులో పువ్వునై’, ‘పల్లవి’ అనే కవితల్లో అచ్చతెలుగు భావుకుడు, ప్రేమికుడు కనబడతారు.

సామాజిక సమస్యలపై స్పందన:

న్యాయస్థానాల్లో సకాలంలో న్యాయం జరగకపోవడం వల్ల నాయకులలోనూ, అధికారులలోనూ, సామాన్య జనంలోనూ ఉన్న అవినీతిపరులు తప్పించుకుపోతున్నారంటూ, అటువంటి వారికి తప్పనిసరిగా శిక్ష పడాలని ‘శిక్ష’ అనే కవితలో అభిలషిస్తారు. అవినీతిపరులు ఎంతటివారో ‘ఘనులు’ అనే చిన్న కవితలో ఏడు పదాలలో చెప్తారు. ఏ సమస్యలపై పోరాడాలో ‘ఆకలి మంటలు’ కవితలో స్పష్టంగా చెప్తారు.

అణగారిన వర్గాల ఎదుగుదలకు పోరాటం:

చీమల్ని చెట్టెక్కించాలి’ ప్రతీకాత్మక కవిత. పీడితతాడిత వర్గాల ప్రజలు చీమలని, చెట్టు అధికారమనీ సూచిస్తారు కవి. ‘నేను దళితుడను’ కవితలో ఎవరిదీ ధ్వంస రచన అని ప్రశ్నిస్తారు.

పెడ ధోరణులను ప్రశ్నించే తత్త్వం:

అంటరానితనాన్ని ఇంకా పాటిస్తున్న వారికి చురకలా గుచ్చుకుంటుంది ‘ఆమడ దూరం’ కవిత. అసమానతలు, వివక్షలను అమలు చేస్తున్నవారికి చెంపపెట్టు ఈ కవిత. శాసన సభలు జరుగుతున్న తీరుని ‘సభల ప్రయోజనం’ అనే కవితలో ఎండగడతారు. ‘అసలు దృశ్యం’ కవితలో ప్రస్తుతం దేశంలో అన్నీ విదేశీ వస్తువులు/విదేశీ భావనలే అని చెబుతూ, “కాసేపుంటే కవిత కూడా తానూ విదేశీనంటుందేమో” అని వాపోతారు.

భాషకు పట్టం కట్టడం:

తెలుగు భాషని కాపాడుకోడం కోసం బాల్యం నుంచే పిల్లలకి తెలుగు ఎలా నేర్పాలో ‘అక్షరమాల’ అనే కవితలో గొప్పగా చెప్పారు. “తెలుగు చదవకుంటే/తెలివి పెరగదు అంతే/తెలివి పెరగకుంటే/బండి నడవదంతే/బతుకు బండి నడవదంతే/నీ జీవితమిక అంతే/అక్షరాలే మార్పు/అక్షరాలే కూర్పు/తెలుగు అక్షరాల నేర్పు నేర్పు/నేర్పు నేర్పు నీ బిడ్డలకు తెలుగు అక్షరాల నేర్పు” అంటారు.

తెలుగు వెలుగు’ అనే కవితలో భాష గొప్పతనాన్ని ఘనంగా చాటారు. తెలుగు భాషని కాపాడుకోడం కోసం ఉద్యమించడానికి యువతని ఆహ్వానిస్తారు ‘కదలిరా తమ్ముడా’ కవితలో.

కుటుంబ బంధాలు:

కుటుంబం ఏర్పడేది వివాహంతో. అలాంటి పెళ్ళిని ‘పెండ్లి’ అనే కవితలో మనోహరంగా వర్ణించారు. “పెండ్లి అంటే/గాలి మేడ కాదు/పెండ్లి అంటే/బతుకు బంధం” అంటారు. “ఇద్దరు ఒకరే/ఇద్దరికీ ఒకరే” అంటూ భార్యాభర్తలు వేరు కాదంటారు. ‘అమ్మ’ అనే కవితలో మాతృమూర్తి ప్రేమని, గొప్పదనాన్ని వెల్లడిస్తారు.

బాల్యం:

బాల్యం లోని ఆనందాలని ‘ఆటలు ఆటలు’ కవితలో హృద్యంగా వ్యక్తీకరించారు. “ఆటలు పంచిన ఆనందాలు/ఆటలు పంచిన ఆప్యాయతలు/ఆటలు నేర్పిన అనుభూతులు/ఎన్నో ఎన్నో అవి ఎన్నెన్నో” అంటారు. ఈ కవితలో ప్రస్తావించిన ఆటలు ఒక్కసారైనా ఆడుకోవాలని పిల్లలకే కాదు, పెద్దలకీ అనిపిస్తుంది.

దైవత్వం:

మాటకు మనసుకు’ కవితలో “ఏ దేవుడికి ఉంది తామంతా ఒక్కటే అన్న భావన?” అని ప్రశ్నిస్తారు. ‘సత్యం’ అనే కవితలో “జీవి జీవిలో దేవుడున్నాడు/నీలోని దేవుణ్ణి తెలుసుకోవయ్య” అంటారు.

దేశభక్తి:

మన దేశమెంత గొప్పదో – మనుషుల్లో లోపాలున్నా, పురోగతి వైపు సాగుతున్న వైనాన్ని ‘నా దేశం’ కవితలోనూ, ‘నా భారతం’ కవితలోనూ చెప్తారు. సైనికులలో దేశభక్తి నరనరాలలో ఎలా జీర్ణించుకుపోయి ఉంటుందో, ‘వీర సైనికుడా’ అనే కవితలో గొప్పగా చెప్పారు. “భారతీయత ఆత్మగ/దేశభక్తి ఊపిరిగ/ఉక్కు పిడికిలి బిగించి/ఉరుమై ఉరిమి/యుద్ధ మేఘమై గర్జించి/అగ్నిలా మారి శత్రువును/దహిస్తుంటే../నీ వీర విహారం చూసి/శత్రుమూకల గుండెలు పగిలి/మంచుకొండ ముద్దలు పిగిలి/భారతమాత పాదాలు తడుముతుంటే/వీరతిలకమై వెలిగినావు” అంటారు.

మనిషితనం:

ఎలాగోలా బ్రతకడం కాదు, అసలు ఎలా జీవించాలో ‘జీవితం’ అనే కవితలో చెప్పారు. “నీకు అర్థం తెలుసా/జీవితానికి అర్థం/జీవించడం అని తెలుసా/అర్థవంతమైన జీవితం/నీది అవ్వాలని/తెలుసా తెలుసా/” అని అడుగుతారు. బ్రతుకుకి అర్థం తెలియడంతో పాటు అర్థవంతమైన బతుకు అవ్వాలని చెబుతున్నారు.

ఎరుక ఉన్న మనిషి’ ఉండడం ఎంత అవసరమో చెప్తారు. ఎరుక అంటే ఏమిటో అబ్బురపడేలా చెప్తారు. “ఎరుక అంటే/అంతర బాహ్య శుద్ధి” అంటారు. “తన పని తాను చేయడం అసలైన ఎరుక” అంటారు.

మనిషిలా ఉండడం అంత అవసరమో ‘మేలుకొలుపు’ అనే కవితలో నొక్కి చెప్తారు.

కథ మరిచిన మనిషి’ కవితలో – ఆ మనిషి మరిచిపోయినది తన మూలాలను! మూలాలను మరిస్తే ఏమవుతుందో చెప్పి, ఎందుకు మరవకూడదో వివరిస్తారు. పుస్తకం శీర్షికగా ఉండదగ్గ గొప్ప కవిత!

~

ఈ కవితల ద్వారా డా. అగరం వసంత్ గారు మంచిగా ఉండమని, మనిషిగా ఉండమని సూచిస్తున్నారు. మనిషిని మనీషిగా మార్చడమే కదా సాహిత్యం ప్రయోజనం! అందుకు తన రచనల ద్వారా తన వంతు కృషి చేస్తున్న వసంత్ గారికి అభినందనలు.

***

కథ మరిచిన మనిషి (కవిత్వం)
రచన: అగరం వసంత్‌
ప్రచురణ: కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, హోసూరు
పేజీలు: 138
ధర: ₹ 200/-
ప్రతులకు:
డా. ఎన్. వసంత్,
బస్తి యువక బృందం,
2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు,
హోసూరు, కృష్ణగిరి జిల్లా,
తమిళనాడు – 635109
ఫోన్‌: 94883 30209

 

డా. అగరం వసంత్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-agaram-vasanth/

Exit mobile version