[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన – కస్తూరిరంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు ‘అల్లూరి వేంకటాద్రిస్వామి’ – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 3వ, చివరి భాగము.]


స్వామిగా మారిన వెంకటాద్రి
వెంకటాద్రి సాధిస్తున్న ఈ విజయాలను సన్నిహితంగా గమనిస్తున్న ప్రజలు భక్తికొలదీ ఆయనను వెంకటాద్రిస్వామిగా పిలుచుకోవటం ప్రారంభించారు. సన్నగా బక్కపలచని దేహం, పొడుగూ పొట్టీ కాని కురచ దేహం, చామనచాయ, కుడి చేతిలో తంబుర, ఎడమచేతిలో తాళాలు, కాళ్లకు గజ్జెలు లేకుండా ఆయనను చూసినవారు లేరు. ఆ విధంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారాయన.
సద్యోగమే! ఉద్యోగం లేదు!!
పది రూపాయలైనా కళ్ళ చూడనిదే భోజనం చేయకూడదనే నియమం పెట్టుకొన్నారు. కంచిలో ఇంటింటికి తిరిగి తాను రచించిన కృతులు పాడుకుంటూ, హరికథలు చెప్పుకుంటూ ప్రాచుర్యాన్ని పొందారు. దేశ సంచారం ప్రారంభించి, అనేక వేల రూపాయలు భగవంతుని పేర సేకరించి కాంచీపురంలో దేవీ దేవులకు రెండు పుష్పవనాలు, శ్రీచందనం, శయ్యాగృహంలో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియం మొదలయిన కైంకర్యాలు ఏర్పాటు చేశారు. గోపురాన్నీ, మంటపాన్నీ, ఇంకా కంచి నగరంలో వైష్ణవ దివ్య క్షేత్రాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేయించారు. మహాబలిపురం లోని గుడిని కూడా బాగుచేయించారు. ఆరాధనాది కార్యక్రమాల కోసం, రూ.5,000 పెట్టి మామండూరిలో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పించారు. కంచి వరదరాజ స్వామి కోసం రత్నాలు పొదిగిన వైరముడిని చేయించి, గరుడోత్సవ సమయంలో అలంకరించే ఏర్పాటు చేశారు. అమ్మవారికి స్వామివారికీ నవరత్న కిరీటాలు చేయించారు.
నెరవేర్చిన శ్రీరంగనాథుని కోరిక
శ్రీ వెంకటాద్రి స్వామి ద్వారా తన కోరికను తీర్చుకోవాలని శ్రీరంగనాథస్వామి కూడా ముచ్చట పడ్దారనటానికి ఒక ఉదంతాన్ని సాక్ష్యంగా చెప్తారు. స్వప్నంలో కనిపించి ఎప్పటిదో పాండ్యుల కాలం నాటి పాతబడిన కిరీటం (పాండ్యకుండి) స్థానంలో తనకు ఒక కొత్త కిరీటం చేయించాలనేది శ్రీరంగనాథుడి ఆదేశం. ఏ కష్టం వచ్చినా వరదరాజస్వామికి చెప్పుకోవటం వెంకటాద్రిగారికి అలవాటు. వరదరాజస్వామిని ప్రార్థించి, తనకు కావాల్సినంత మనోబలాన్ని ప్రసాదించమని వేడుకున్నారు.
కిరీటం తయారు చేయటానికి ఆర్థిక వనరుల కోసం మళ్ళీ యత్నాలు మొదలయ్యాయి. మనోబలం కోసమే వరదరాజస్వామిని ప్రార్థించారు వెంకటాద్రిగారు. ఆ మనోబలంతోనే ఆయన ఒక ప్రతిఙ్ఞ చేశారు. ఈ రోజునుండీ కనీసం పది రూపాయలైనా సేకరించకపోతే ఆ పూట భోజనం చేయకూదదని నిర్ణయించుకున్నారు.
తంబుర, తాళాలూ వాయిస్తూ, గజ్జె కట్టి ఆడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఊళ్లు తిరిగి జోలిపట్టి నిధులు సేకరించటం మొదలు పెట్టారు. ఏ రోజైనా 10 రూపాయలు దొరకకపోతే వెంకటాద్రిగారు ఉపవాసం ఉండవలసి వస్తుందని ఆయనను అనుసరించి తిరుగుతున్న వెంకటస్వామినాయుడు, పుదుచ్చేరి అప్పస్వామి నాయుడు ఆ 10 రూపాయలు సర్దేవారట. అనతికాలంలోనే నిధులు సమకూరాయి. కొత్త కిరీటం తయారయ్యింది.
కానీ, స్వామి కోరింది మరకతం పొదిగిన రత్న కిరీటం. మరకతం ఎక్కడా దొరకక మళ్ళీ చింతాక్రాంతుడయారు వెంకటాద్రి. అన్ని పరిష్కారాలూ ఆ దేవదేవుడే చూపిస్తాడని ఆయన నమ్మకం. వరదరాజస్వామిని స్మర్తిస్తూ నిద్రించారు. మళ్ళీ స్వామి కలలో కనిపించి, బంగ్లాదేశంలో మాధవదాసు అనే ఆయన ఇంట మరకతం తన కోసమే ఫలానా చోట వుంది అనటంతో బయల్దేరి బంగ్లాదేశానికి వెళ్ళారు వెంకటాద్రి. పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఆయనకు మాధవదాసు దొరికాడు. తన ఇంట మరకతం ఉందని, దాన్ని తన పూర్వీకులు రహస్య స్థావరంలో దాచి ఉంచారని అంతవరకూ మాధవదాసుకుగానీ, ఆయన కుటుంబానికి గానీ తెలీదు. వెంకటాద్రిగారు అడగంగానే ఆయన మరకతం కోసం ఇంట్లో వెదికారు. భగవంతుడు చెప్పిన ఆధారాల ప్రకారం వెదికితే మరకతం దొరికింది. దాన్ని భక్తిపూర్వకంగా వెంకటాద్రిగారికి సమర్పించి నమస్కరించాడు మాధవదాసు. అదనంగా వెయ్యి రూపాయలు కూడా అందచేశారట. అలా కిరీటం పూర్తి చేయించారు అల్లూరివారు.
ఈ కథకొక కొసమెరుపు ఉంది. తాను ఇంత శ్రద్ధగా మరకతాన్ని తెస్తే, మాధవదాసు అనే భక్తుడు భక్తితో దాన్ని సమర్పిస్తే, కిరీటాన్ని తయారు చేస్తున్న స్వర్ణకారుడికి మనసులో దుర్బుధ్ధి పుట్టింది. మరకతాన్ని మార్చేసి నకీలీ రాయిని అక్కడ పొదిగాడు. ఇది దైవకార్యం! ‘దేవుడంటే రాయే కదా.. కదలడు, మెదలడు’ అనుకున్నాడు స్వర్ణకారుడు. కానీ, వరదరాజస్వామి వెంకటాద్రిగారి కలలో కనిపించి జరిగిన మోసం గురించి తెలియజేశాడు. వెంటనే వెంకటాద్రి స్వామి స్వర్ణకారుణ్ణి నిలదీశారు. స్వర్ణకారుడు బుకాయించాడు. కానీ, బలిష్టులైన వెంకటాద్రివారి శిష్యుల్ని చూసి వెనకడుగు వేశాడు. అప్పసామి రాజు అనే శిష్యుడు స్వర్ణకారుణ్ణి తనదైన పద్ధతిలో ప్రశ్నించేసరికి స్వర్ణకారుడు నిజం ఒప్పుకున్నాడు.
నిజానికి, అప్పటికి శ్రీరంగనాథుని దర్శనం చేసుకోలేదు వెంకటాద్రిగారు. ఆ విగ్రహం పరిమాణం ఎంతో కొలతలు ఏమిటో ఆయనకు తెలీదు. తనకుగా తానే ఊహకొద్దీ కిరీటాన్ని తయారు చేయించి, దాన్ని పుచ్చుకుని శిష్యుల్ని వెంటబెట్టుకుని శ్రీరంగం బయల్దేరి వెళ్ళారు. ముందుగా తిరుక్కావేరిలో స్నానం చేసి, భక్తి శ్రద్ధలతో రంగనాథుని కోవెలకు వెళ్లారు.
కోవెలవద్ద వెంకటాద్రిగారికి, ఆయన శిష్యులకు ఆలయమర్యాదలతో ఆలయ ప్రముఖులు భట్టర్ స్వామి, ఉత్తమ్ నంబి, స్వాగతం పలికారు. “మీ రాక ముందుగానే మాకు తెలిసింది. మీ కార్యం నిర్విఘ్నంగా నెరవేరటానికి మా సహకారం ఉంటుంది” అంటూ ఆలయం లోపలికి తీసుకువెళ్లారు.
వెంకటాద్రిగారు రంగనాథుని సన్నిథిలో “నిన్ను కోరి యున్నాను రారా” అంటూ పున్నాగవరాళి రాగంలో ఒక కీర్తన పాడారు. తాను వెంట తెచ్చిన కిరీటాన్ని స్వామికి అలంకరించారు. అది కొలతలతో తయారు చేసినంత సరిగ్గా సరిపోయింది. తాను తెచ్చినప్పుడు లేని అందాలతో సొబగులతో పొటమరిస్తూ భక్తశ్రేణికి దర్శనం అయ్యింది.
అమ్మవారి ఆదేశాన్నీ నెరవేర్చి..
ఆముక్తమాల్యద కావ్యంలో ప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవికి అలంకరించే కిరీటం అమ్మవారి కోరిక మీద అల్లూరి వెంకటాద్రివారే చేయించారని చెప్తారు. శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి ఆండాళ్ తల్లిని దర్శించుకున్నప్పుడు, అల్లూరి వారు చేయించిన అమ్మవారి వైరముడి కిరీటం గురించి అక్కడి పూజారులను అడిగాను. పురోహితులు అమ్మవారికి అలంకరించి ఉన్న ఆ కిరీటం వెంకటాద్రి వారు చేయించిందేనంటూ చూపించారు.
అసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొంది దివ్యత్వాన్ని సముపార్జించుకున్న తల్లి గోదాదేవి! ఆండాళ్, కోదై అనే పేర్లతో ఆ తల్లి ప్రసిద్ధం! ఆమె కథని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద పేరుతో ఒక దివ్య ప్రబంధంగా మలిచారు. పన్నిద్దరాళ్వారులలో ఆమె తండ్రి కూడా ఒకరు. ఆయనతో సమానంగా ఒక ఆళ్వార్గా ప్రసిద్ధి పొందిన గోదాదేవి కొలువుతీరిన పుణ్యక్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు.
108 దివ్యదేశాలలో ఈ పుణ్య క్షేత్రం కూడా ఒకటి. మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలో ఒక చిన్న పట్టణం శ్రీ విల్లిపుత్తూరు. ఆండాళ్ అవతరించిన పుణ్యస్థలి, పెరియాళ్వార్ నివసించిన ప్రదేశం ఇది. విల్లి అనే వేటగాడి పేరున విల్లిపుత్తూరు ఏర్పడింది. తమిళనాడు ప్రభుత్వ అధికార చిహ్నంలో ఈ దేవాలయం 12 అంతస్తుల ఎత్తయిన గోపురం ఉంటుంది. సుమారు 192 అడుగుల ఎత్తున ఈ గోపురం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మేరు పర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది.
ఈమె అనితరసాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి పాశురాలను రచించింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మింవాడని చరిత్ర. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని మధుర నాయకరాజు తిరుమల నాయకుడు, చొక్కప్ప నాయకుడు అభివృద్ధి చేశారు.
మహిమాన్వితమైన ఈ దివ్యాలయ సువిశాలమైన ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్, ఆండాళ్ పూజామంటపం ఉన్నాయి. ప్రధానాలయ లోపలి ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. గర్భాలయం వెలుపల తులసీవనంలో ఉన్న బావిలోనే అమ్మవారు స్వామికి అర్పించవలసిన మాలను ముందుగా తాను ధరించి, ఈ నూతిలోని నీటిలో తన ముఖారవిందాన్ని చూసుకుని, తరువాత ఆ మాలను స్వామికి సమర్పించేదట. అందుకే ఆముక్తమాల్యద (giver of the worn garland)గా ప్రసిద్ధిపొందారు.
శ్రీరంగనాయకమ్మకు రాజముడి, ఇంకా కొన్ని శాశ్వత కైంకర్యాలు ఏర్పాటు చేశారు వెంకటాద్రిస్వామి. శ్రీరంగం నుండి రంగనాథ స్వామి అరవన ప్రసాదం అంటే తీపి ప్రసాదం తెచ్చి అమ్మవారికి నివేదించేందుకు వెంకటాద్రిగారు అధికారులను నియమించారట. ఒక రోజు ప్రసాదం ఇప్పించకుండానే పూజారి నిద్రపోయాడు. ఆ నేరానికి ఆ బ్రాహ్మణుడు కష్టాల పాలైనట్టు పుష్పాల రామదాసు వివరించారు.
ఆ సమయంలోనే, ఆండాళ్లు స్వప్నంలో కనపడి తనకూ రాజముడి చేయించమని ఆయన్ని ఆదేశించింది! ఆ స్వప్న వృత్తాంతం సన్నిధి అధికారులకు చెప్పి అమ్మవారి విగ్రహం శిరస్సు కొలతలతో ఒమ్మచ్చు చేయించి కిరీటం తయారీకి సన్నద్ధుడౌతున్న సమయంలో గోకుల బృందావనం నుండి రంగాచార్యులు, రాధాకృష్ణులు అనే ఇద్దరు సంపన్న వైష్ణవ భక్తులు శ్రీరంగనాథుని సేవార్ధులై అక్కడకు వచ్చారు. రాజముడి తయారీ ప్రయత్నం గురించి ఆ ఇద్దరికీ తెలియచెప్పారు వెంకటాద్రిస్వామి. దానిని తాము నెరవేర్చ గలమని రంగాచార్యులు, రాధాకృష్ణులు వాగ్దానం చేసి, ఒమ్మచ్చుని వెంటతీసుకువెళ్ళారు.
ఆ తరువాత కొద్ది రోజులకు రాజముడి కోసం రంగాచారి దగ్గరకు మనుషుల్ని పంపారు వెంకటాద్రిస్వామి. అప్పటికే రాజముడి తయారీ పూర్తి అయ్యింది. బృందావనం నగరంలో దాన్ని ఊరేగించి ఆ మనుషులకిచ్చి పంపించారు రంగాచారి. ఆ రాజముడికి షోడశోపచారాలు చేసి అమ్మవారికి ధరింపచేశారు వెంకటాద్రిస్వామి.
మాన్య మిత్రులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి, అల్లూరి వారు చేయించిన అమ్మవారి వైరముడి కిరీటం చూపించమని అడిగితే పురోహితులు అమ్మవారికి అలంకరించినది అదేనని చెప్పారు.
నెల్లూరు శ్రీరంగనాథుని సేవలో..
శ్రీ అల్లూరి వెంకటాద్రి ఒకరిదగ్గర సేవక వృత్తిలో ఉన్నవారు కాదు. స్వంత వ్యాపారాలూ ఉన్నవారు కూడా కాదు. కేవలం ఊంఛ వృత్తిలో ఒక భిక్షకుడిగా ఏరోజు సరిపడిన ఆహారాన్ని ఆరోజు బిక్షగా పొంది జీవిస్తున్న బిక్షకుడు ఆయన. ఆజన్మాంతం అలానే జీవించారు.
కానీ, ఎక్కడా శాసనం వేయించి ఇది తాను నిర్మించినట్టు చాటుకోలేదు. భక్తి కార్యంలో ఒక భాగంగా ఈ కార్యాలను ఆయన చేపట్టారు.
నెల్లూరు శ్రీరంగనాథస్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయించారు. గుడి విమానానికి బంగారు తాపడం చేయించారు.
బహుశా ఒక సంస్థానాధీశుని యావదాస్తీ చాలనంత పెద్ద మొత్తాన్ని వైష్ణవ దేవాలయాల కోసం ఖర్చుచేశాడు.
వీరి శిష్యుడు అన్నలూరి నారాయణదాసు ‘రత్నఖచిత మకుటాది విభూషణ రంగనాథ కైంకర్య ధురీణ’ అని గురువుని కీర్తించాడు. ఒక అతిసామాన్యుడు తన నిజాయితీతో ఎంతటి ఘనకార్యాన్నయినా సాధించ గలడని నిరూపించగలిగారు శ్రీ వేంకటాద్రిస్వామి. ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఆయన వ్యవహరించ గలగటం వలనే ఈ విజయాలు సాధ్యం అయినాయి.
గొడుగు పట్టిన ఆ దేవదేవుడు
ఆచార్య బిరుదురాజు వారు వేంకటాద్రిస్వామి గురించి ఒక మహిమను చెప్పారు. ఒక రోజు కేవలం 5 రూపాయలే వచ్చిందని భోజనం చేయకుండా ఉండిపోతే, అప్పస్వామిరాజు అనే ఆంతరంగికుడు గొడుగు పట్టగా ఇద్దరూ కలిసి వీధుల్లో హరినామ సంకీర్తన చేస్తూ తిరిగి ఇంకొక ఐదు రూపాయలు సంపాదించాక స్వామిని ఇంటి దగ్గర దిగవిడిచి అప్పస్వామిరాజు వెళ్ళిపోయాడట. ఆ సాయంకాలం అప్పస్వామిరాజు గారింట్లో భజన కోసం వెంకటాద్రి స్వామి వెడితే అప్పటికి నాలుగైదు రోజులుగా రాజుగారు మంచాన ఉన్నాడని తెలిసింది. మరి ఆ వేంకటాద్రి స్వామికి గొడుగు పట్టిందెవరు..? ఊరంతా చూసిన దృశ్యం కదా అది?
ఆయన సంపాదించిన ధనం అంతా ఇలా యాచన ద్వారానే అయినా ‘ధనమదాంధుల ద్వారము దూరక కడు ధన్యుడనై నే నుండెదను’ అంటూ వెంకటాద్రిస్వామి తన ఆతాభిమానాన్ని చాటుకున్నాడు.
“జాలిజెంది జనుల-బేలనైయాచించి, చాల నలసి సొలసితి-నీవేగతి” అని చెప్పుకుంటాడు.
“కాసు చేయని ఖలులకెల్ల, దోసిలొగ్గి వేసారితి” నంటాడు.
“కుచ్చిత మనుజుల కొలువు గొలువబోను/అచ్యుతుని దాస్యసుఖమనుభవించెదను” అని ప్రకటించుకున్నారు.
ఒంగోలు దగ్గర నూనెవారి పాలెంలో గుడికి రథం చేయించటం కోసం ఇనుప ఊచలు, కర్ర దుంగలను ఖరీదు చేసి, మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషనుకు స్వయంగా ఆయనే తెచ్చారట. కానీ, సమయం లేదని దుంగలు ఎక్కించుకోకుండానే రైలు బయలు దేరితే, వేంకటాద్రిస్వామి ఎలా వెళ్లగలవన్నట్టు చూశారని, రైలు అకారణంగా ఆగిపోయి, దుంగలన్నీ ఎక్కించుకున్నాకే కదిలిందనీ, కానీ, ఆలస్యం కాకుండా, సరిగ్గా సమయానికే గమ్యస్థానానికి చేరిందని ఒక కథ ఇందులో అంది..
పుష్పాల రామదాసు గారు తులసి తీర్థం ఇచ్చి ఒక స్త్రీకి పట్టిన బ్రహ్మరాక్షసిని వదిల్చిన వైనాన్ని వ్రాశారు:
కంచిలో వెంకటాద్రిస్వామి ప్రాభవాన్ని చూసి అసూయ చెందిన కొందరు విప్రులు ఒక వేశ్యని ప్రేరేపించి వెంకటాద్రిస్వామిని భ్రష్టుపట్టించే పనిని అమెకు పురమాయించారు. వెంకటాద్రిస్వామి ఆ వేశ్యకు వశం కాలేదు. ఆమే ఆయనకు పరమ శిష్యురాలిగా భక్తురాలిగా మారిపోయింది. మరో విప్రనారాయణుడిగా ఆయన తన ఘనతను చాటుకున్నారు.
పంచసంస్కారాల పునరుద్ధరణ
వరదరాజస్వామి ఒకసారి స్వామివారికి కలలో ఒక అనుభూతిని కలిగించి, పంచసంస్కారాలను వైష్ణవసాంప్రదాయంలో తిరిగి నెలకొల్పాలని ఒక ఆదేశాన్ని ఇచ్చారు.
వైష్ణవ మతం స్వీకరించదలచినవారికీ, వైష్ణవుల పిల్లలకు ఉపనయనం చేయగోరేవారికి ఈ పంచసంస్కారాలను నిర్వహిస్తారు. అన్ని కులాలకూ ముక్తిని పొందే హక్కు ఉందని పేర్కొంటూ, కులభేదాలు లేకుండా ముక్తికి యోగ్యులయ్యేందుకు ఈ పంచసంస్కారాలను చేస్తారు. వైదిక కర్మకాండలలో ఉపనయనానికి ద్విజులకు మాత్రమే అర్హత ఉంది. ఈ పంచ సంస్కారాలు ఉపనయనానికన్నా మించిన యోగ్యమైనవని వైష్ణవులు భావిస్తారు.
అనాదిగా కులతత్వంలో, వర్ణ విబేధాలతో కుమ్ములాటల్లో కొట్టుమిట్టాడుతున్న మన సామాజిక వ్యవస్థలో ఈ పంచసంస్కారాలు సామాజిక ఉన్నతికి తోడ్పడేవిగా భగవంతుడే భావించాడన్నమాట!
శ్రీమహావిష్ణువు చిహ్నాలైన శంఖ చక్రాలను అగ్నిలో ఉంచి చెరొక భుజంపై వేసుకోవటం మొదటి సంస్కారం దీన్ని తాప అంస్కారం అంటారు. దీనివల్ల ఆ వ్యక్తి వైష్ణవుడైనట్టు భావిస్తారు.
ఊర్థ్య త్రిపుండ్రాలను (నామాలను) నుదుటిపై ధరించటం రెండవ సంస్కారం. ఈ త్రిపుండ్రాలను విష్ణుమూర్తి పాదాలకు చిహ్నంగా భావించి, కరిగించిన నాము (సుద్ద)తో ఈ పుండ్రాలను చిత్రిస్తారు. నాముతో పెట్టినది కాబట్టి మన తెలుగువాళ్లు నామం అన్నారు. పుండ్రధారణను సంపూర్ణ శరణాగతికి చిహ్నంగా వైష్ణవులు భావిస్తారు. నామం పెట్టుకున్నవాడికి ఇంక కులం లేనట్టే భావిస్తారు.
నిత్యం దేవపూజ చేయటాన్ని ‘యజన సంస్కారం’ అంటారు. ఇది మూడవ సంస్కారం.
జన్మనామాన్ని మార్చి, పేరులో ఉండే శర్మ శాస్త్రి, రెడ్డి, చౌద, నాయుడు లాంటి కులనామాలను తొలగించి, విష్ణుపరమైన పేరుని పెట్టుకోవటం నామ సంస్కారం. ఇది నాలుగవ సంస్కారం.
ప్రతీ విష్ణుభక్తుడు తప్పని సరిగా యోగ్యుడైన ఒక వైష్ణవ గురువు దగ్గర మంత్రోపదేశాన్ని స్వీకరించి, ఆ మంత్రాన్నిచ్చిన గురువుకు శిష్యుడిగా మెలగాలి. ఇలా ఐదు సంస్కారాల విధానం ఒకప్పుడు ఆచరణలో ఉండేది. కాలక్రమంలో ఏర్పడిన వివిధ రాజకీయ సామాజిక పరిస్థితుల్లో మరుగున పడిపోయింది. నుదుట నామం ధరించటం కొనసాగిస్తూనే ఉన్నారు కానీ, మిగతా సంస్కారాలను మరిచిపోయారు జనం. ఆ విధానాన్ని పునరుద్ధరించటానికి స్వామి ఆదేశంతో వెంకటాద్రిగారు పూనుకున్నారు.
విదేశీ శక్తుల కారణంగా ఛిన్నాభిన్నమైన సామాజిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రజలను భక్తిమార్గంలోకి మళ్ళింఛి క్రమశిక్షణాయుతమైన, దయ, కరుణ, సర్వమానవ సౌభ్రాతృత్వాలను కలిగి ఉండేలా చేయటం లక్ష్యంగా పనిచేస్తున్న వెంకటాద్రిగారికి ఈ బాధ్యత మనసుకు నచ్చిన కార్యం అయ్యింది.
సనాతనమైన వేదాలు మొదలుకొని పురాణాలు మొదలైన ప్రామాణిక గ్రంథాల ఆమోదం ఈ పంచసంస్కారాలకు ఉన్నట్టుగా వైష్ణవ గురువులు, సిద్ధాంతకర్తలు ప్రవచించేవారని వెంకటాద్రిగారు ప్రజలకు వివరించటం ప్రారంభించారు.
అనంతుడు, గరుడుడు, విష్వక్సేనుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవగణాలు, పితృదేవతాగణాలు, మరుత్గణాలు వీరంతా త్రిపుండ్రధారులేనని, మునులైన వశిష్టుడు, కాశ్యపుడు, యాజ్య్ఞవల్క్యుడు మొదలైన పలువురు చక్రాంకితులేనని కొన్ని ప్రమాణాలను చూపారు. సమాశ్రయణం అని దీన్ని పిలిచారు. కంచి నుండే ఈ ఉద్యమాన్ని ప్రారంభించారాయన.
సన్యాస స్వీకారం
శ్రీ అల్లూరి వెంకటాద్రిస్వామి తన జీవిత చరమాంకంలో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన తంబుర, గజ్జెలు, కరతాళాలు బహూకరించి తన కృషిని కొనసాగించవలసిందిగా కోరారని చెప్తారు.


పూజలందుకుంటున్న శ్రీ అల్లూరి వెంకటాద్రిస్వామి విగ్రహం
వృద్ధాప్యంలో ఆయన శ్రీరంగాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. ప్రతీరోజు, గంధం చెక్కని తన చేతులతో సానమీద అరగదీసి గంధం తీసి స్వామికి సమర్పించేవాడు. శ్రీరంగనాయకి అమ్మవారికి అరవణ ప్రసాదాన్ని పంపించే ఆచారాన్ని వెంకటాద్రిగారే ప్రారంభింపచేశారు. బియ్యం, నెయ్యి, బెల్లం కలిపి చిక్కని అరవణ పాయసం తయారు చేస్తారు.
వెంకటాద్రిస్వామి తన 72వ యేట రక్తక్షినామ సంవత్సరం1864లో శ్రీ రంగనార్తాయణ జియర్ స్వామివారి చేతుల మీదుగా సన్యాసాశ్రమం స్వీకరించారు. కాషాయవస్త్రాలు, త్రిదండం ధరించారు. పూర్వాశ్రమంలోని అల్లూరి వెంకటాద్రి అనే పేరుని త్యజించి, తిరువెంకట రామానుజ జీయర్ నామాన్ని స్వీకరించారు.


వెంకటాద్రి స్వామివారు సన్యసించిన చిత్రం
సన్యసించిన తరువాత వారి దివ్య ప్రబోధాలను, వారి హరినామ సంకీర్తనలను విని తరించటానికి భక్తజనం తండోపతండాలుగా రాసాగారు. సామాన్య జనంతో సమానంగా రాజులు, మహరాజులు, జమీందారులు, కొందరు బ్రిటిష్ అధికారులు కూడా వచ్చి రామానుజ జియ్యర్ స్వామిని సేవించి వెళ్ళేవారు. అలా వచ్చినవారిలో లార్డ్ ఫ్రాన్సిస్ నేపియర్ కూడా ఉన్నాడు.
శిష్యుడిగా మారిన గవర్నర్ నేపియర్
నేపియర్ అనే ఆంగ్లేయుడు 1866-1872 మధ్యకాలంలో మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్గా పనిచేశాడు. అద్భుతమైన సంస్కరణలు అమలు చేసిన వ్యక్తిగా మంచి పేరున్న అధికారి ఆయన.
ఈ నేపియర్ దొర బ్రిటన్ మాజీ మంత్రి. కొత్తగా మద్రాసు గవర్నర్గా వచ్చాడు. ఆయన వస్తూనే గంజామ్ కరువు పరిస్థితుల్ని చక్కదిద్దవలసి వచ్చింది. త్రిచి పర్యటనకు వచ్చాడు. అప్పటికే ఎన్నో సామాజిక పరిస్థితుల్ని పరిష్కరించిన అనుభవం ఉన్న అల్లూరి వెంకటాద్రిగారి గురించి విని ఉండటంతో ఆయన సన్యసించిన సంగతి తెలిసి దర్శనార్థం వచ్చాడు. కరువు పరిస్థితుల గురించి నేపియర్ దొర స్వామికి ఏకరువు పెట్టి, పరిష్కారం సూచించవలసిందిగా కోరాడట.
పరిష్కరించటానికి తగిన మనోబలాన్ని ఆ అధికారికి ప్రసాదించమని శ్రీరంగనాథుని ప్రార్థించి, దిశానిర్దేశం చేశారు స్వామి. స్వామి సూచించిన మార్గాన పనిచేశాడు నేపియర్.
కాన్స్టాంటినోపుల్ నుండి ప్రముఖ సంఘసేవకి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారిని పిలిపించి క్షుధార్తులు వ్యాధిపీడితులకు సేవలందించేందుకు ఆమె సహాయం తీసుకున్నాడు.


పెన్నా నదిమీద ఆనకట్టను త్వరితగతిని పూర్తి చేయించాడు. గంజాంలో రుషికుల్య ఆనకట్టను, ముళ్లపెరియార్ ఆనకట్టను కూడా నిర్మింపచేసి, కరువు రూపుమాసేలా చేశాడు.
అల్లూరి వెంకటాద్రిస్వామి శిష్యపరంపర
మాంబళం శ్రీ ఆదినారాయణదాస్, అన్నలూరు శ్రీ నారాయణదాసు, శ్రీ రామచంద్రయ్య దాసు, శ్రీ థానాల దేవరాజస్వామి, శ్రీ పుష్పాల రామదాస్, వరకవి నరసింహదాస్, శ్రీ తులసీదాస్, శ్రీ కందా రామానుజదాస్, మైలాయ్ శ్రీ నారాయణదాస్, పుడువాయ్ శ్రీనారాయణ దాస్, దేవేంద్రపురమ్ శ్రీనారాయణదాస్, కంచి శ్రీ మనవలదాస్, శ్రీ కట్టా రామదాస్, శ్రీ కంది శ్రీనారాయణదాస్, చెన్నై శ్రీ నరసయ్యదాస్, శ్రీనివాసపురం శ్రీ వేణుగోపాల్ దాస్.
తుది ఘడియలు
1877లో రంగనాథుడు కలలో కనిపించి వెంకటాద్రిస్వామి మరణ సమయం ఆసన్నమైన విషయాన్ని తెలియజేశాడట. ఆయన చెప్పిన సమయానికి భక్తకోటి భజనలు చేస్తూ, హరినామ సంకీర్తనలు గానం చేస్తుండగా, అష్టాక్షర మంత్రం పఠిస్తూ, ఆయన కైవల్య పథం చేరారు. ఆయన శిరస్సు నుండి ప్రకాశవంతమైన జ్యోతి వెలుగులీనుతో వచ్చి, రంగనాథుని పాదపద్మాలను చేరి లీనమయ్యింది.
ఆలయ అధికారులే ఆయన భౌతిక దేహానికి విధియుక్తంగా అంత్యక్రియలను నిర్వహించారు. శ్రీరంగం కావేరీ తీరంలో (అళవంధార్ పడిత్తురై) అల్లూరి వెంకటాద్రి బృందావనంలో వెంకటాద్రి వారి సమాధి నెలకొల్పారు. దానివద్ద ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక మందిరం నిర్మించారు. ప్రతీ యేడాది మార్చి నెలలో (మాసిమాసం సప్తమి తిథి) అల్లూరి వెంకటాద్రి తీర్థ మహోత్సవం నిర్వహిస్తారు.


ఆ మహనీయుడిపట్ల గౌరవ సూచకంగా శ్రీరంగ ఆలయ అధికారులు ఈనాటికి ఆయన వర్థంతి రోజున రంగనాథ, రంగనాయకి తాయార్ దేవతామూర్తులకు పాండ్యకుండి వజ్రకిరీటాలను ధరింపచేసి. నమ్పెరుమాళ్లు (శ్రీరంగనాథుడు) మాలతో అలంకరింపచేసి, తీర్థ ప్రసాదాలను తీసుకుని ఏనుగు, ఛత్రం పతాకాలతో సహా సమాధి వద్దకు తీసుకువచ్చి కొద్దిసేపు ఉంచి మళ్లీ తీసుకువెళ్లే ఆచారాన్ని పాటిస్తున్నారు. గత 143 యేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతో వస్తోందని అక్కడి అర్చకులు తెలియజేశారు.
1937 నుండీ ప్రతీయేటా అల్లూరి వెంకటాద్రి స్వామి ఆరాధనోత్సవాలను విధిగా నిర్వహిస్తున్నారు. ఆయన వ్రాసిన వేలాది సంకీర్తనలను పాడి వాగ్గేయకారుడైన ఆ పరమభాగవతోత్తముడికి నివాళులర్పిస్తున్నారు. 2006 నుండీ చెన్నైలోని శ్రీ అల్లూరి వెంకటాద్రిస్వామి మఠంలోనూ, ‘సుమై తంగి రమా’ కోవెలలోనూ, ఈ ఆరాధనోత్సవాలను జరుగుతున్నాయి.
సప్తరత్న కీర్తనలు
- భజనామృత పరమానంద భాగవత శాంత చరణా రేణుం నిరంతరం వహామ్యహం హరి నిజ..
- అగణిత మహిమాద్భుతలీల సదాకర్షిత రాజసాది శక్యాత్మక ప్రపంచ పరిపాల అనంత పర్యంక శయన నమో నమస్తే నమస్తే
- మాధవ హృది ఖేలిని మధురిపు సమదన వదన మధుపే జయ
- బాల సరస మురళీ సుధారస భావ మధుర లహరి విహార గో..
- జటాధర శంకర దేవదేవ
- ఆలావదెన్నాలొ శివమే ఉన్ అదియార్క్ అదియార్క్ అదియార్క్ అదియనాయి మీలాద
- సుందర నందకుమార సురుచిర నవ తులసీ హారా
ఈ ఏడు కీర్తనల్నీ సప్తరత్న కీర్తనలంటారు. శ్రీ వెంకటాద్రిస్వామి ఆయన పుణ్యతిథి రోజున సప్తరత్న కీర్తనలు ఆలపిస్తారు. స్వామి భజనగోష్ఠి జరుగుతుంది. తిరువరసుగానూ, శ్రీమత్ పరమహంస తిరువేంగడ రామానుజ జియరుగానూ ప్రసిద్ధులైన శ్రీ అల్లూరి వెంకటాద్రి స్వామి సన్యాసాశ్రమం స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఆ తిథినాడు తీర్థ మహోత్సవం కూడా నిర్వహిస్తారు.
శ్రీ వెంకటాద్రిస్వామివారు వ్రాసిన కీర్తనలను పాడుతూ భజనలు చేస్తారు. కావేరీ జలాలతో వెంకటాద్రి విగ్రహానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం మార్చి 12న శ్రీరంగం రంగనాథస్వామికి మరకతం పొదిగిన కిరీటం, వజ్రపు మకర కుండలాలు సహా అల్లూరి వెంకటాద్రిస్వామివారు చేయించిన ఆభరణాలన్నింటినీ అలంకరిస్తారు.
హరికీర్తన సాహిత్యం
శ్రీ వేంకటాద్రిస్వామి హరినామ కీర్తనలు’ పేరుతో 1955లో వావిళ్లవారి పుస్తకం వెలువడింది. 170కి పైగా కీర్తనలు ఇందులో ఉన్నాయి. అందులో ఆయన జీవిత చరిత్ర కూడా సంక్షిప్తంగా ఉంది. 1972లో ఆర్. వెంకటేశ్వర్ సంకలనం చేసిన ‘శ్రీ వేంకటాద్రిస్వామి కీర్తనలు’ పుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం 2009లో డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్ ఓపెన్ లైబ్రరిలో (ఓఎల్.5402127M) ఉంచింది. 1930 లలో ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా తమిళంలో వెలువడింది.
‘ఇంచుకైన దయరాద-యిభరాజవరద’,
‘సజల జలదగాత్రా-సరసిజ నేత్రా-నిజమని నీపదభజన జేసెదు వరద’,
‘ఇంత పంత మేల నాతో నిందిరా రమణా’,
‘దుద్దుపెట్టి నీవు దూరాన యుండక –పద్దులీడేర్చు నీపాల బడితినిక’
‘ముద్దుపదములందు మువ్వలు గదలగ’ లాంటి చరణాలు ఆయన సాహితీ వైదుష్యాన్ని తెలియచేస్తాయి.
‘ధనమదాంధుల చేరువ జేరక కడు ధన్యుడ నయ్యేదెన్నటికో..” లాంటి పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కోసం ఆయన ఎన్ని అవమానాలు భరించి ఉంటారో ననిపిస్తుంది.
“నెంజిలిపడనేల, నిరతము శ్రీపతి మంజులమగు దివ్య మంత్రరాజముగల్గ” అనే అనుపల్లవిలో ‘నెంజిలి’ అంటే ఆందోళన. నీల జీమూతవర్ణం అనేది రంగుల్లో తేడాలను గుర్తించటానికి ఉపయోగపడే ప్రయోగం.
‘గట్టి మనసు’, ‘మోడిచేయటం’, ‘వలరాజుకాక’ లాంటి చక్కని తెలుగు పదప్రయోగాలు ఈయన కీర్తనల్లో కనిపిస్తాయి.
“చందురుగేరుమోమందముతో నీ మందహాసము గనుగొందు రారా”
“దండిపాతకముల నెల్ల మెండుగాను జేసినట్టి దుండగీడనైన నా నెండ యెవరు లెరు తండ్రి”
“నీకే మరులుకుంటిరా నిగమగోచరా”
“ఘోర భవాంబుధి గొబ్బున దాటెడు నెరుపు గని మనవే ఓ మనసా!”
“రంగుగ దాసుల రక్షించెడు శ్రీ రంగని మఱచిన దొంగ జనములు”
“కుదురుగ గూర్చుండి-గోవింద యనగనే”
“ఒప్పులకుప్ప రారా, నే జెసిన తప్పులెన్నకు ధీరా”
“పాంచాలి పరులచే బాధల బడగానె అంచితముగ నీ వక్షయ మనలేద?”
“అంతరంగ భక్తమానసంతరంగమందు నేకాంతుడై యున్నవాడు-రంతులేలపోరే మీరు” ఇలాంటి జాను తెనుగు పదాలు చదువుతుంటే మనసు పులకరిస్తుంది.
‘ఇంచుకైన యాది లేదా?’అనే ప్రయోగాన్ని 150 ఏళ్లక్రితం తమిళ దేశంలోనే జీవితం అంతా గడిపిన వ్యక్తి చేయటం విశేషమే!
“అవ్వచద్దిరొట్టె యానబాలు వెన్న, యారగింతువు రంగ మేలుకో” అనే చరణంలో. ఆనబాలు అంటే, నీళ్ళు ఇగిరేంత చిక్కగా కాచిన పాలు అని అర్థం. అలా కాచిన పాలను పెరుమాళ్లుకు నైవేద్యం పెట్టే ఆచారాన్ని వెంకటాద్రివారే ప్రారంభించారని పైన మనం చెప్పుకున్నాం. వాటిని ఆయన ఆనబాలు అన్నారు.
అవ్వ, చద్ది, రొట్టే అనేవి మూడు వేర్వేరు వంటకాలు. అవ్వ అంటే అవ్వం అనే ప్రసాదం. చద్ది అంటే చలిది అన్నం. తాలింపు పెట్టకుండా చల్ల లేదా పెరుగు కలిపిన అన్నం. రొట్టె అంటే పెద్ద పరిమాణంలో వేసిన దిబ్బరొట్టె లాంటి ప్రసాదం. ఈ మూడింటినీ కలిపి అవ్వ చద్ది రొట్టె అని ఆయన వ్యవహరించి ఉండవచ్చు.
కంచిలో ఒక అవ్వ ఉన్నదని, ఆ అవ్వ బువ్వ పెడ్తుందనీ ‘కంచికి పోయావా కృష్ణమ్మా! ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా’ అనే జానపద గీతంలో ఒక చరణం ఉంది. ఆ అవ్వ (మూలపుటమ్మ) కంచిలోని అమ్మవారే! ఆమెకు పెట్టే ప్రసాదమే అవ్వచద్ది ప్రసాదం కావచ్చు.
‘నామస్మరణ సేయుడీ జనులార-హరినామ స్మరణ’ ఇలాంటి వీరి కీర్తనలు చదువుకోవటానికి కూడా మనోహరంగా ఉంటాయి.


శ్రీ అల్లూరి వెంకటాద్రి కీర్తనలు పేరుతో ఆయన శిష్యపరంపరకు చెందిన శ్రీ పుష్పాల రామదాసు ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో వావిళ్లవారి ప్రతిలో లేని కీర్తనలు, కొన్ని కందపద్యాలు కూడా ఉన్నాయి. అందులో వేంకటాద్రిస్వామి రేఖా చిత్రం కూడా అంది. శ్రీమదాంధ్ర భక్త విజయము అనే గ్రంథంలో వేంకటాద్రిస్వామి జీవిత చరిత్ర కొంత ఉంది. వావిళ్ల ప్రతికి అదనంగా ఆయన ప్రదర్శించిన కొన్ని మహిమలు ఇందులో ఉన్నాయి.
ఆయనను కేవల మహాభక్తుడిగానే చూడటం వలన ఆయన సంగీత సాహిత్య జీవితాలు మరుగున పడిపోయాయి. ఆయన సామాజిక సంస్కరణలు, ఆర్తజనులకు చేసిన సేవలు వెలుగులోకి రాకుండా పోయాయి. ప్రధానంగా ఆయన కంచి పరిసర ప్రాంతాలలో ఛిన్నాభిన్నమైన సామాజికవ్యవస్థను సరిదిద్ది, జనజీవితాన్ని తిరిగి చిగురింపచేసిన చరిత్ర పూర్తిగా కనుమరుగై పోయింది. మానవాళిని క్రమశిక్షణయుత మార్గంలో, శాంతికాముకులుగా, సమభావనతో మెలిగేలా చేయటమే మతం ప్రయోజనం అయితే, అల్లూరి వెంకటాద్రిస్వామి అది సాధించటానికే కంచి చేరారని మనకు అర్థం అవుతుంది.
ఆయన 1877 వరకూ జీవించే ఉన్నారు. అంతకు రెండుమూడేళ్ల వరకూ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన్ని తెలుగు సాహితీవేత్తలు, సంగీతవేత్తలు అంత త్వరగా ఎలా మరిచిపోయారో ఆశ్చర్యమే!
(సమాప్తం)

డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.