[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన – కస్తూరిరంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు ‘అల్లూరి వేంకటాద్రిస్వామి’ – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 2వ భాగము.]
కంచిలో దివ్యధామాలెన్నో
కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉంది. చరిత్ర యుగంలో తొండైం అందలంగా పిలువబడిన ప్రాంతం ఇది. పట్టు చీరలకు, పవిత్ర క్షేత్రాలకు, దివ్యమూర్తులకు కంచి ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి.
1053 సంవత్సరం చోళులు వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిపారని చెప్తారు. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పదునాలుగు కంచిలోనే ఉన్నాయి. అందులో కొన్ని విష్ణుకంచిలో, మరికొన్ని శివకంచిలో ఉంటాయి. విష్ణుకంచిలో మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది. వరదరాజస్వామి దేవాలయంలో అద్భుత శిల్పసంపదకు విజయనగర పాలకులు కారణం. ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు.
విజయనగర రాజుల తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. బ్రిటీష్ కాలంలో కాంజీవరం అని పిలిచారు. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్ళుకు ఒక హారాన్ని బహుకరించాడట. ‘క్లైవ్’ మకరకండి అని దాన్ని పిలుస్తారు.
ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం, బంగారు తామరతటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన అత్తిచెక్కతో చేయబడిన దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాల కొకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 2019వ సంవత్సరం జూన్ నెలలో ‘అత్తి శ్రీవరదరాజ పెరుమాళ్ళు’ విగ్రహాలను వెలుపలకు తీసి దర్శించటానికి ఏర్పాట్లు చేశారు.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకీ, ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన యుద్ధాలకు కంచి రాజ్యం రణభూమిగా మిగిలింది. మైసూరు హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్లకూ బ్రిటిషర్లకూ మధ్య జరిగిన యుద్ధాలక్కూడా కంచి ఎక్కువగా బలైపోయింది. ఎద్దుల తొక్కిసలాట మధ్య లేగలు నలిగినట్టు కంచి నలిగిపోయింది. 1780 కంచిదగ్గర పొళ్లిలూరు వద్ద జరిగిన ఆంగ్ల కర్ణాటక యుద్ధం కంచిని బాగా ధ్వంసం చేసింది. ప్రజలు చెల్లాచెదురైపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. 1794 వరకూ చెంగల్పట్టు జిల్లా మీద పట్టుకోసం బ్రిటిష్ వాళ్లు బీభత్సాన్ని సృష్టిస్తోనే ఉన్నారు.
ఆనంద సరోవరంలో స్నానం చేసి, “నిను నమ్మి ఉన్నాను సీతమ్మా”, “జయజలధర శ్యామా”, “దేవదేవ శౌరీ మురారీ” అని కీర్తనలు పాడుతూ వరదరాజస్వామి ముందు భక్తిపారవశ్యంతో ఆడారాయన. తాను వచ్చిన ఎరుక ఆ స్వామికి తెలుపుకోవాలి కదా! ఆయన వరుసగా వరదరాజస్తుతి చేస్తూ అలవోకగా కీర్తనలు ఆలపించి ఆడుతుంటే శ్రీదేవీ భూదేవీ సమేతంగా వరదరాజస్వామి వేడుకతో విని ఆనందించిన అనుభూతిని పొందారాయన.
“కంచి నగరముకు కడువేగంబున. యెంచిన యెన్నిక యీడేరెను యని.
వేగవతికి తా వేకువజని_ షజ్జనమాడివడులుగట్టుకొని. వూర్థ్వఫుండ్రముల్వొప్పుగదీర్చుక
హస్తి గిరీశుని యాత్మ నిలుపుకొని – సన్నిధిలోజసెక్రన్నన నప్పుడు
విమానంబుగని వినుతులొనర్చుక-బలివీఠంబును పక్కి ధ్వజంబును
ప్రణమిల్లుచు తా ప్రదక్షణముగా-వలగొనివచ్చియు వనజనాభుని
దేవియైన పెరుందేవీతల్లి యా-కమలజననియు కమ్మవిల్తుని-కన్న తల్లియు కమలనివాసియు
లోకమాత లోకోప కారియౌ- ఆశ్రితపోషియు హరియురవాసియు
నగుమోము తల్లిని నానావిధముల-ప్రస్తుతించితా ప్రణుతులు జేయుచు-
నందాశ్రువులక్షిగవలను జారగసొక్కుచు సాష్టాంగంబుగ దండము లిడుచును
దర్శించుకొని ప్రేమతో బొగడెను పెరుందేవిని”
పుష్పాల రామదాసుగారు కంచిలో అల్లూరివారి దినచర్యని ఈ ద్విపదలో పేర్కొన్నారు. వేగవతిలో స్నానం చేసి, ఊర్ధ్వపుండ్రాలు ధరించి, ఆ దేవదేవుని మనసాస్మరిస్తూ, విమానానికి వినతు లొనరుస్తూ, బలిపీఠానికి, పక్కనే ఉన్న గరుడధ్వజానికి ప్రణమిల్లుతూ, స్వామిదేవేరి లోకమాత, హరియురవాసి పెరిందేవిని అనేక కీర్తనలతో స్తుతిస్తూ, సాష్టాంగంబుగ దండము లిడుచూ ఆయన జీవించారట.
క్రమేణా వెంకటాద్రి వారి భక్తిని, వారి మహిమను గుర్తించిన పూజారులు, ఆలయపాలకులు ఆయనను గౌరవించసాగారు. అక్కడ జరిగే నిత్యపూజలు, నైవేద్యాల తయారీ, భక్తి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు, ఆగమ సాంప్రదాయాలలో లోపాలను సవరించి ఆలయ మర్యాదలను పునరుద్ధరింప చేశారాయన.
ఆయన చేసిన సూచనలు, చేపట్టిన మార్పులు సర్వజనామోదం పొందటంతో స్వామి అక్కడకు తననెందుకు పంపారో వెంకటాద్రికి అప్పుడు అర్థం అయ్యింది. ఎవ్వరు చెపితే వింటారో, ఎవ్వరికి చెప్పే అర్హతలున్నాయో వారినే ఎంపిక చేసి ఆ వెంకటేశ్వరుడు పంపారు.. అని భక్తులు భావించసాగారు.
“విషగరుశయనిుని విభవంబులను.కొనియామచుతన కో ర్కెలుదీరగ
తీర్థప్రసాదము తీసిలభించుక- నెప్పటట్లు తా నేగిభాగవత
మాళిగల నుతామధూకరమును- భుక్తి జేసుకొని ఫ్రురముపల్లెలను
తిరిగితిరిగి ద్రవ్యం బులు జేర్చియు-కాంచీనగరము గలుగుస్థళంబులు
జీర్ణోద్ధారణ జేశివడుగులకు వేదపాఠశాలలు వేయించి
వడుగులందరికి వస్త్రంబులును- ద్వాదశిదిననున తదియ్యారాధన
మాణిక్యవరదుసకు మంచిగంధమును-చక్కగగాచిన చిక్కనిపాలును
కమ్మనిపరిమెళ తమ్మలంబును- శాశ్వితంబుగా జరుగగజేశి
దీప్యప్రకాశ దివ్యదేశమును-వరదు నాజ్ఞచే వైభవంబుగా-
గోపురమంటప కొలను లాదిగా.పటుతరంబుగా బాగుపరచియు
నిత్యారాధన నిరాటంకముగ-జరుపగదలచి శాశ్విత౦బుగ
మహాలక్ష్మీమను మాముడూరులో అయిదు వేలకును అరిధి క్రియముగకొని విడిపించెను”
శ్రీ వెంకటాద్రి కంచి వరదరాజ దేవాలయ ప్రవేశం చేసిన తరువాత ఆలయ విధానంలో భక్తికి ప్రాధాన్యత పెరిగింది, ముష్కరుల దాడులకు గురైన ఆలయ జీర్ణోద్ధరణ, అస్తవ్యస్తమైన పౌరజీవనాన్ని సరిచేయటం, శాంతిని నెలకొల్పటం తక్షణ కార్యాలుగా ఆయన భావించారు. సమస్త ప్రజలూ భక్తిమార్గాన నడిస్తేనే కార్యం సానుకూల్పడుతుందని గుర్తించారు. భక్తి ప్రచారానికి ప్రాధాన్యత నిచ్చారు.
కాంచీపురం, తేనంబాకమ్ జంటనగరాల్లాంటివి. తేనంబాకంలో బ్రహ్మపురీశ్వర దేవాలయం ఉంది. దాని విమానాన్ని గజ భృష్ట విమానం అంటారు. ఈ విమానం వెనుక బ్రహ్మతీర్థం ఉంది. దాని ఒడ్డున ఒక గదిలో వెంకటాద్రి నివసించేవారు. ఆ గదిని ఇప్పటికీ వెంకటాద్రి గది అనే వ్యవహరిస్తున్నారు.
దేవాలయాల జీర్ణోద్ధరణ
“తుంబురు తాళము చేత ధరియించి వేడుక మీఱ గంభీరముగా కాళ్లగజ్జలు ఘలుఘలుఘలుఘల్లని మ్రోయగ, పరమ భక్తులను గూడి వేడుకను భజన చేసి పరవశము జెందుచు” అంటూ తన హరికథాగాన విధానం గురించి చెప్పుకున్నారు వెంకటాద్రి.
వరదరాజస్వామి పుష్పకైంకర్యానికి పూలతోట పెంచాలని తన ఆట పాటల్ని ఉపయోగించుకొని వీధులలో బిచ్చమెత్తుతూ కంచిలో ఆయన ధనసంపాదన ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి తాను రచించిన కృతులు పాడుకుంటూ, హరికథలు చెప్పుకుంటూ ప్రాచుర్యాన్ని పొందాడు.స్వామి కైంకర్యాలు ఏర్పరచటమే ఆయన లక్ష్యం.
అనేక వేల రూపాయలు భగవంతుని పేర సేకరించి కాంచీపురంలో దేవీ దేవులకు రెండు పుష్పవనాలు, శ్రీచందనం, శయ్యా గృహంలో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియం మొదలయిన కైంకర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మంటపాన్నీ, ఇంకా కంచి నగరంలో వైష్ణవ దివ్య క్షేత్రాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేయించాడు. మహాబలిపురం లోని గుడిని కూడా బాగుచేయించాడు. ఆరాధన, ఇతర కైంకర్యాల కోసం, రూ.5,000 పెట్టి మామండూరులో ఒక స్థలాన్ని కొని సమర్పించాడు. 200 సంవత్సరాల క్రితం 5000 అంటే తక్కువ మొత్తమేమీ కాదు! ఈ కథనాల వెనుక దైవీసందేశం ఉంది. భగవంతుదే తనకు కావలసింది సమర్థుడైన భక్తుణ్ణి ఎంచుకుని ప్రేరణ ఇచ్చి నెరవేర్ప చేసుకుంటాడనటానికి అల్లూరివాఉ చేపట్తిన కార్యాలే సాక్షి! ఇదంతా 1828-3ల నాటి సంగతి. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్ళు దాటాయి.
శ్రీరంగనాథుని ఆదేశాలతోనే..
శ్రీరంగం రంగనాథ స్వామి ఒకరోజు ఆయనకు కలలో కనిపించాడు. పాండియకుండె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయించమనే సందేశం ఆయనకు ఆ కలలో స్వామి ద్వారా అందింది. మన్మథనామ సంవత్సరం వైశాఖమాసం నవమి రోజున రంగనాథుడికి కిరీటధారణ చేయించారు. అక్కడితో ఆగలేదు, ఇదే అదనుగా రంగనాథుడికి రెండు వజ్రకిరీటాలు, ఒక మకర కంఠికూడా చేయించా రాయన.
తిరుప్పళాతురై అనే గ్రామాన్ని ఆ గ్రామ జమీందారు నుండి కొనుగోలు చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి కప్పాలు కట్టుకోలేక జమీందార్లు తమ జమీందారీని నిలుపుకోవటం కోసం కొన్ని గ్రామాలను అమ్మకానికి పెట్టేవారు. వెంకటాద్రిస్వామివారు అలా కొనుగోలు చేసిన వారిలో ఒక్క వూరు జమీందార్లు కూడా ఉన్నారు.
విషనాగు కరచినా విషం ఎక్కలేదు
ఒకరోజు బ్రహ్మతీర్థం దగ్గర పూలు కోస్తుంటే ఒక పాము వెంకటాద్రిని కాటువేసిందట. ఆయన ఆ కాటుని పట్టించుకోకుండా నడుచుకుంటూ వరదరాజస్వామి ఆలయానికి వచ్చి అమ్మవారికి పూలు సమర్పించి, “కాపాడరా నన్ను” అంటూ కమాస్ రాగంలో ఒక కీర్తన ఆలపించి ధ్వజస్తంభం దగ్గర స్పృహతప్పి పడిపోయారు. అందరూ చుట్టూ మూగారు. చేతనరహిత స్థితిలో పడిఉన్నారు వెంకటాద్రి. శరీరంలో నల్లగా మారి, చల్లబడి, బిగుసుకుపోతోంది. వెంకటాద్రి ఇంక లేరనే భయంతో ఘొల్లుమన్నారు భక్తజనం..
వెంకటాద్రివారు వ్రాసి పాడిన కీర్తనలు అక్కడున్న అందరికీ నోటికి వచ్చు. అమ్మవారిని అయ్యవారినీ ప్రార్థిస్తూ ఆ కీర్తనలను ఆలపించ సాగారంతా! కొద్దిసేపటికి నిద్రలోంచి లేచినట్టు లేచారు వెంకటాద్రి. ఆయన కాలిపైన పాముకాటు గాయం మాయమైంది. ఏమీ ఎరగనట్టే వెళ్ళి అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని, వరదరాజ తీర్థ ప్రసాదాలనూ స్వీకరించారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. తిరిగి తన గాన సుధార్ణవన్ని పంచుతూ ఆడిపాడటం ప్రారంభించారాయన.
ట్రిప్లికేన్ నివాసం
శ్రీ పి. సాంబమూర్తి ‘సౌత్ ఇండియన్ మ్యూజిక్’ పరిశోథనాగ్రంథంలో వీరికి సంబంధించిన కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువందల సంవత్సరాల జ్ఞాపక సంచికలో ఈయన నివాసం ‘ట్రిప్లికేన్’ అని వుంది. ట్రిప్లికేన్లో ఆయన్ ఓ ఇల్లు కట్టుకునో, అద్దెకు తీసుకునే ఉన్నాడని కాదు. ట్రిప్లికేన్ లోని పార్థసారథి దేవాలయ ప్రాంగణమే ఆయన నివాసం. కంచి తరువాత ఆయన ఎక్కువకాలం నివసించిం దక్కడే! బహుశా ఈ సంచిక అచ్చయ్యేటప్పటికి పార్థసారథి కోవెల కేంద్రంగా కొన్ని దైవకార్యాలు నెరవేరుస్తూండి ఉంటారాయన.
ట్రిప్లికేన్ లోని పార్థసారథి దేవాలయం
కంచి వరదరాజ స్వామి ఆదేశాన్ని పొంది, రత్నాలు పొదిగిన వైరముడిని చేయించి, గరుడోత్సవ సమయంలో అలంకరించే ఏర్పాటు చేశారు. అమ్మవారికి స్వామివారికీ నవరత్న కిరీటాలు చేయించే పనిలోనే నిమగ్నమయ్యారు శ్రీ వెంకటాద్రిస్వామి. నిద్ర లేస్తూనే బయలుదేరి, బంగారాన్ని, రత్నాలనూ సేకరించే పనిలో పడ్డారు. కానీ, తన బోటి సామాన్యులకు అది సులభసాధ్యం అయ్యేలా లేదని త్వరగానే గ్రహించాడు. మార్గాంతరం తోచక పార్థసారథి దేవాలయాన్ని దర్శించుకోవటం కోసం ట్రిప్లికేన్ వెళ్ళారు.
తమిళంలో కలువపువ్వును ‘అల్లి’ అంటారు. కలువపూవులు అధికంగా ఉన్న పుష్కరిణి కాబట్టి ‘తిరు అల్లిక్కేణి’ అని ఈ క్షేత్రాన్ని పిలిచారు. ఇంగ్లీషువాళ్లు తిరువల్లికేణిని ట్రిప్లికేన్ అని మార్చేశారు.
ఈ స్వామిని అర్చించిన తరువాతే శ్రీమద్రామానుజులవారు స్వామి వరప్రసాదంగా జన్మించారని ప్రతీతి. ఆ స్వామి మహత్తు అంతటిది. అల్లూరివారు పార్థసారథిని ఆశ్రయించారు, దేవాలయం ఎదుట కైరవిణి (తెల్లమల్లెపువ్వు) పుష్కరిణిలో స్నానం చేశాడు. ‘పార్థసారథి పదభజన చేయవే మనసా’ అని కీర్తన పాడుతూ స్వామి ముందు నాట్యం చేశారు.
“పరకాల మహాయోగి భక్తిసార పరిస్తుత:|తిరువల్లిక్కేణి నగరే పంచదేవాశ్చ వాసతే” అంటూ స్తుతించారు. కిరీటం కావాలనేది స్వామి కోరిక. అది నెరవేరేలా చూసుకునే బాధ్యత ఆయనదే. తాను నిమిత్త మాత్రుణ్ణి అనుకున్నాడు. గుడి పూజారి చోళసింహపురం శేషాచార్య ఆయనను ఆదరించి గౌరవించి, తన ఆందోళనకు కారణం అడిగాడు. జరిగిందంతా వివరించారు అల్లూరివారు.
అంతే! గుడి మూసేవరకూ వేచి ఉండమని కోరి, వెంకటాద్రిస్వామిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి, తన వంతుగా తొలి చందా 500 రూపాయలు అందించారు పూజారిగారు.
ఆ రోజుల్లో మద్రాసులో కెల్లా ధనికుడైన షరీఫ్ వెంకటసామినాయుడు, అప్పాసామిరాజు, మణవాళ్ నాయుడు వెంటనే స్పందించి ఇతోధికంగా సహకరించారు. కంచికి చెందిన వెంకటరంగం పిళ్ళె అనే భక్తుడు 9.5 తులాల ‘మేలిమిబంగారం’ ఇచ్చాడు. వార్త దేవాలయ పాలకవర్గానికి తెలిసింది. కమిటీ అధిపతి జమీందారు మరుదాముత్తు ముదలియారుగారు 1000 రూపాయలు, దుబాషీగా ఉన్న పచ్చయప్ప ముదలియారు 1500, గొప్ప దాతగా ప్రసిద్ధి పొందిన ఆరంగ పిళ్ళె 2000 రూపాయలూ ఇచ్చారు. ఒకరిని చూసి ఒకరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శక్తికొలదీ అందించసాగారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా కిరీటం తయారీకి ధనం సమకూరింది. ఆ సొమ్ముతో నమూనా కిరీటం ఒమ్మచ్చు చేయించి అది స్వామి విగ్రహానికి సరిపోతుందో లేదో చూడటం కోసం కాలినడకన శ్రీరంగం బయలుదేరారు.
పల్లెలు పట్టణాలు కడచి శ్రీరంగం సమీపాన లాల్ గుడి చేరి ఒక సత్రంలో ఉన్నారు. లాల్ గుడి దొంగలకిరవు. కనుక స్వామి జాగరూకులై విశ్రమించినారు. నడిరేయి దొంగలు తిరువాభరణం దొంగిలించడానికి సత్రంపై రాళ్ళు రువ్వసాగారు. వెంకటాద్రిస్వామి శ్రీరంగనాధస్వామిని వేడుకున్నారు. రంగనాథుడు ఒక రాకుమారుడిలా గుర్రం మీద కూర్చిని, ఆయుధధారులైన వీరభటులతో దివిటీలతో ఆ సత్రానికి విడిది చేసే నెపంతో వచ్చారు. వాళ్లని చూసి దొంగలు భయపడి పారిపోయారు. వెంకటాద్రిస్వామి “శ్రీరంగడే మీ రూపంలో వచ్చి అభయం ప్రసాదించాడు” అన్నారు. ఆ రాజకుమారుడు అభయం ఇస్తూ, “మా భటులు మీ ఒమ్మచ్చు కావలి కాస్తారు, మీరు హాయిగా పడుకోండి” అన్నారట. వెంకటాద్రిస్వామి ఆయన వెంటనున్న భక్తులు హాయిగా నిద్రపోయారు. తెల్లవారాక వారికి కృతఙ్ణతలు చెప్పబోతే రాకుమారుడుగానీ, ఆయన భటులు గానీ ఏ ఒక్కరూ కనిపించలేదు. స్వామి వారి ఆభరణం పదిలంగా ఉంది.
ఇది రంగని మహిమేనని గుర్తించారు వెంకటాద్రి. ఆ రాజకుమారుడి పాదసేవ చేయలేకపోయానని అని బిగ్గరగా విలపించారట!
రాత్రికి కంచి చేరిన తరువాత వెంకటాద్రిస్వామి భట్టర్ కోయిల్, కందాడై అణ్ణన్ మొదలైనవారికి తాము తెచ్చిన ముడి ఒమ్మచ్చు చూపించారు. తెల్లవారి దానిని వరదుని శిరాన ఉంచగా కొలతప్రకారం సరిపోయింది.
కానీ, స్వామి కోరింది మరకతం పొదిగిన రత్న కిరీటం. మరకతం ఎక్కడా దొరకక మళ్ళీ చింతాక్రాంతుడయారు వెంకటాద్రిస్వామి. అన్ని పరిష్కారాలూ ఆ దేవదేవుడే చూపిస్తాడని భారం స్వామి మీదే వేశారాయన. వరదరాజస్వామిని స్మర్తిస్తూ నిద్రించాడు. మళ్ళీ స్వామి కలలో కనిపించి, బంగ్లాదేశంలో మాధవదాసు అనే ఆయన ఇంట మరకతం తన కోసమే వుంది అనటంతో బయల్దేరి బంగ్లాదేశానికి వెళ్ళారు వెంకటాద్రిస్వామి. పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఆయనకు మాధవదాసు దొరికాడు. అడగంగానే ఆయన మరకతం ఇచ్చి నమస్కరించాడు. దాన్ని తెచ్చి కిరీటం పూర్తి చేయించారు అల్లూరివారు.
కిరీటం పూర్తయిన సంగతి మద్రాసు నగరం అంతా మార్మోగిపోయింది. అల్లూరి వెంకటాద్రిస్వామి పేరు ప్రతిష్ఠలు ఇనుమడించాయి. దైవకార్యంలో భక్తులు భాగస్వాములు కావాలనే లక్ష్యం నెరవేరింది.
మద్రాసు వీధుల్లో ఊరేగిస్తూ కంచివరకూ భక్తజనసందోహం మేళతాళాలతో బ్రహ్మరథం పట్టి, ఒక యాత్రగా వెళ్లి కిరీటాన్ని కంచికి చేర్చారు. 1858 వైశాఖ పౌర్ణమి నాడు గరుడసేవ సందర్భంగా మరకతం పొదిగిన రత్న కిరీటాన్ని వరదరాజస్వామికి అలంకరించారు. స్వామి ముందు ఆనందనాట్యం చేస్తూ, “నిగమ గోచర స్వామీ”, పక్షివాహనా నన్ను” కీర్తనలు పాడి ఆడి స్వామిని ప్రవశింపచేశారు వెంకటాద్రిస్వామి. ఈనాటికీ స్వామివారికి అలంకారంగా వెంకటాద్రి కిరీటాన్ని భక్తులు తన్మయంగా సందర్శించుకుంటున్నారు.
శ్రీరంగం రంగనాథ స్వామి ఒకరోజు ఆయనకు కలలో కనిపించాడు. పాండియకుండె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయించమనే సందేశం ఆయనకు ఆ కలలో స్వామిద్వారా అందింది. మన్మథనామ సంవత్సరం వైశాఖమాసం నవమి రోజున రంగనాథుడికి కిరీటధారణ చేయించారు. అక్కడితో ఆగలేదు, ఇదే అదనుగా రంగనాథుడికి రెండు వజ్రకిరీటాలు, ఒక మకర కంఠి కూడా చేయించారాయన.
తిరుప్పరాయిత్తురై రాజగోపాలస్వామి దేవాలయం
తిరుప్పరైత్తురై గ్రామం తిరుచిరాపల్లికి 16 కి.మీ దూరంలో శ్రీరంగం తాలూకాలో ఉంది. కావేరీనదికి దక్షిణ తీరంలో ‘త్రిచీ-కరూర్ హైవే’ ఈ గ్రామం మీంచి వెడ్తుంది. పరాయ్ అనే పవిత్రవృక్షాలు (sand paper trees) ఇక్కడ ఎక్కువగా పెరిగేవి. అందుకని ఈ ఊరుని “తిరుపరాయితురాయి” అని పిలిచారు. ఇక్కడ చోళుల కాలం నాటి శివాలయం ఉంది. ఈ గ్రామంలో 23.55 ఎకరాల బంజరు భూమిని, 2 ఎకరాల సాగుభూమిని కొనుగోలు చేసి, శ్రీరంగనాథ స్వామికి అర్పించినట్టు ధ్వజస్తంభం మీద శాసనం ఉన్నదట.
ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి కప్పాలు కట్టుకోలేక జమీందార్లు తమ జమీందారీని నిలుపుకోవటం కోసం కొన్ని గ్రామాలను అమ్ముకునే వారు. అలా కొనుగోలు చేసిన వారిలో ఒక్క వూరు జమీందార్లు కూడా ఉన్నారా రోజుల్లో! అలా తమిళనాడులో తిరుప్పళాతురై, దానిని రాజగోపాలస్వామి వారికి నిత్య నైవేద్యాల కోసం సమర్పించారు.
తరువాత 150 యేళ్ల క్రితం ఇక్కడ ఆ శివాలయం సమీపంలోనే రాజగోపాలస్వామి దేవాలయాన్ని నిర్మించారు.
సుందరరాజస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ
మదురై నగరానికి సమీపంలో, వైగై నదీ తీరంలో ‘తిరుమలిరున్ చోళై’ అనే చిన్న పట్టణం ఉంది. అక్కడ సుందరరాజ పెరుమాళ్ దేవాలయం చాలా ప్రసిద్ధి. ప్రతీ ఏడాదీ చైత్రమాసంలో అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది విష్ణుభక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో స్వామిని అర్చించుకుంటారు.
14వ శతాబ్ది నాటి పాండ్యరాజులు పునర్నిర్మించిన పురాతన దేవాలయంగా ఈ సుందరరాజస్వామి పెరుమాల్ కోవెలను భావిస్తారు. ఈ స్వామిపైన కనీసం 100 పాశురాలున్నాయని చెప్తారు. ఈ స్వామినే అఝగర్ అని అళగిరి అనీ పిలుస్తారు. విష్ణుభక్తులకు పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలలో ‘తిరుమలిరున్చోళై’ ఒకటి. దీని రాజగోపురం ఎత్తు తక్కువదే అయినా, విశాలమైనదిగా శిల్పకళాసౌందర్యంతో రాజిల్లుతూ ఉంటుంది.
సుందర రాజ పెరుమాల్ ఒకరోజు అల్లూరి వెంకటాద్రివారి కలలో కనిపించి ఇచ్చిన ఆదేశం మేరకు ఆ దేవాలయానికి ఒక గాలిగోపురాన్ని నిర్మింపచేశారాయన!
‘దూసి’ దివ్యదేశం అయ్యింది
కంచిలోని దివ్య దేశాలలో శిధిలావస్థలో ఉన్నవాటిని పునరుద్ధరించటం ఒక ధ్యేయంగా పెట్టుకున్నారాయన. విలక్కోలి పెరుమాళ్ సన్నిధి మండపాన్ని, ఆ దేవాలయ రాజగోపురాన్ని తిరిగి నిర్మింపచేసింది అల్లూరి వెంకటాద్రిసామి వారే! వాటిలో శిధిలావస్థలో ఉన్న క్షేత్రం దూసి. కంచి నగరానికి 10 కి.మీ. దూరంలో ఉంది. ఒకప్పుడు దీన్ని శఠకోపపురం అని పిలిచేవారు.
దూసి అంటే తమిళంలో దుమ్ము అని! ఈ దుమ్ము ఎక్కడిది? బ్రిటిషర్లు, ఫ్రెంచివారు, ఆర్కాట్ నవాబులు, మైసూరు సుల్తానుల మధ్య జరిగిన ఆ యుద్ధాలతో ఏ సంబంధమూ లేని అమాయక ప్రజలు ఆ ఊళ్లో సర్వమూ కోల్పోయారు. బ్రిటీష్ వారు, ఫ్రెంచివారు కలబడి ఒకరినొకరు తెగనరుక్కున యుద్ధాల కారణంగా గుర్రాల గిట్టల వలన రేగిన దుమ్ములో ఆ ఊరు కూరుకుపోయింది. శఠకోపపురం కాస్తా దుమ్ముగా మారిపోయింది. ఆ ఊరుపేరే దుమ్ము (దూసి) అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఊరు వల్లకాడు అయ్యింది. ప్రజలు అనాథ లయ్యారు. ఆదుకునేవాడే లేని స్థితి.
శ్రీ వెంకటాద్రి స్వామి ఆ వూరు వెళ్ళారు. ప్రాణావశేషంగా మిగిలి ఉన్న ఆ ప్రజలను ఊరడిల్ల చేశారు. దిక్కులేనివారికి దేవుడే దిక్కు అని భగవన్నామ స్మరణ చేయించారు. హరినామ సంకీర్తనలు పాడి వారి మనసులకు శాంతిని ప్రసాదించారు.
అక్కడ ప్రత్యేకంగా ఆదాయం వచ్చే కొన్ని భూములను 5,000 రూపాయలకు కొని, తోటలు వేసి, పంటలు పండించే బాధ్యత ఊరి జనానికి అప్పగించారు. తద్వారా ఆ ఊరి రైతులకు, శ్రామికులకు ఉపాధి దొరికింది. దాని మీద వచ్చే ఆదాయంతో ఒక వేదపాఠశాల నెలకొల్పి నిర్వహించటం ప్రారంభించారు. దూసిని దివ్యదేశంగా మార్చేశారాయన
పల్లవ రాజుల కలంలో 1500 యేళ్ల క్రితం ఆ ఊరుని చతుర్వేది మంగళం అని పిలిచేవారట. వేద వేదాంగ శాస్త్రవిదులకు పుట్టినిల్లుగా ఆ ఊరికి ఆ రోజుల్లో ప్రసిద్ధి ఉండేది.
పల్లవుల కాలం నాటిదే అక్కడ వైకుంఠవాస పెరుమాళ్ దేవాలయం ఉంది. కీ. శ. 734 నాటి రెండవ నందివర్మ కాలం నాటి గుడిగా దాన్ని భావిస్తారు. పల్లవమల్లుడు దీన్ని నిర్మించాడట. శ్రీదేవీ భూదేవీ సహిత వైకుంఠవాసుని దివ్య మందిరం ఇది. లక్ష్మీదేవిని ఇక్కడ సంతానవల్లిగా భావిస్తారు. నమ్మాళ్వారు, తిరుమంగై ఆళ్వార్ల మందిరాలు కూడా ఈ కోవెలలో ఉన్నాయి.
ఈ ఊరికి దగ్గర్లోనే వేదాంతాచార్య, కవితార్కిక సింహ, సర్వతంత్ర స్వతంత్ర అపర రామానుజ స్వరూపులు శ్రీ వేదాంత దేశికులవారి జన్మస్థలం ‘తూప్పిల్’ కూడా ఉంది.
(సశేషం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.