[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘కంచే చేను మేస్తే??’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
నారాయణ సేట్ వడ్డీ వ్యాపారి.. వారి అర్థాంగి చందాబాయి.. వారికి ముగ్గురు పిల్లలు. ప్రథమాన పుత్రిక చాందిని, తర్వాత కొడుకు రాజాసేట్, చివరన కూతురు మందాకిని.
వారి ఇంటి పనిమనిషి సుమతి.. వయస్సు పద్నాలుగు. సుమతి తండ్రి రామ్లాల్, భార్య గంగ. ఆ దంపతులకు మరో ముగ్గురు ఆడపిల్లలు మల్లిక, మానస, మాధవి.
నారాయణసేట్ గారిది, రామ్లాల్ గారిది, ఒడిస్సాలోని కటక్. రామ్లాల్ సైకిల్ రిక్షాను నడుపుతాడు, వారి తండ్రి గతించారు. తల్లి కౌసల్య. తనకు మనమడు కావాలని పంతం. ఆ కారణంగా తల్లి మాటను కాదనలేక, రామ్లాల్ చేసిన ప్రయత్నఫలం, సుమతి కాక మరో ముగ్గురు ఆడపిల్లలు. భయపడి రామ్లాల్ తల్లికి చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. నారాయణ తన కుటుంబంతో వుండేది చెన్నైలో, అక్కడికి వారు వచ్చి పాతిక సంవత్సరాలు గడిచాయి. బాగా సంపాయించాడు. మంచి ఇల్లు, కారును ఏర్పరచుకొన్నాడు. పెద్దకూతురు చాందిని వివాహం సంవత్సరం క్రిందట చెన్నైలోని తన బంధువుల అబ్బాయి మోతీలాల్తో ఘనంగా జరిపించాడు. మోతీలాల్ తండ్రి శంకర్లాల్, తల్లి ఊర్మిళ. వారిదీ వడ్డీ వ్యాపారమే. శంకర్లాల్ కూడా కటక్ వారే. వారు చెన్నెకి వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచాయి.
రెండు సంవత్సరాల క్రిందట నారాయణసేట్, తన భార్యకు పనిలో సహాయంగా వుండేదానికిగా, రామ్లాల్తో మాట్లాడి అతని పెద్ద కూతురు సుమతిని, చెన్నెకి తీసుకొని వచ్చాడు. ఆనాటి నుంచి సుమతి ఆ యింటి పనిమనిషిగా మారిపోయింది.
నారాయణసేట్ మంచివాడు. కానీ అతని అర్ధాంగి చందాబాయి రాక్షసి. దయాదాక్షిణ్యాలు లేని మనిషి. ఉదయాన్నే ఇల్లు చిమ్మడం, గుడ్డలను సోపు నీళ్ళలో నానపెట్టడం, టీ, టిఫిన్ చేసి అందరికీ అందివ్వడం, గుడ్డలను మిషన్లో వేసి ఉతికి, శుభ్రపడిన తర్వాత వాటిని దండాలమీద ఆరవేయడం, వంట వండడం, అందరికీ భోజనాలు పెట్టి కంచాలు, గిన్నెలు కడగడం, ఆరిన వస్త్రాలను ఇస్త్రీ చేయడం, వాకిట నీళ్ళు చల్లి ఉదయం, సాయంకాలం ముగ్గులు వేయడం.. పూర్తి ఇంటి చాకిరీ సుమతికి అలవాటైనాయి. తొలి రోజుల్లో సుమతికి చాలా కష్టంగా అనిపించేది. రెండు వారాల్లో అన్ని పనులు సుమతి క్రమంగా చందాబాయి చెప్పినట్లు చేసేది. ఆరునెలల్లో పనిలో వేగం, ప్రతిభను సుమతి సంపాదించింది. నారాయణకు సుమతి అంటే ఎంతో అభిమానం. ఆ ఇంట్లో ‘నీవు తిన్నావా’ అని ఆమెను అడిగేది నారాయణ సేట్ ఒక్కడే. మిగతా వారంతా వారివారి అవసరాలకు ఇష్టం వచ్చినట్లు సుమతిని వాడుకొనేవారు. ప్రథమంలో సుమతికి కొంత కష్టంగా వున్నా, రోజులు గడిచేకొద్దీ ఆ ఇంట వ్యక్తుల మనస్తత్వాలకు, వారి వారి అవసరాలను తీర్చడానికి సుమతి అలవాటు పడింది. అందరూ తిన్న తరువాత తాను తినేది.
రాత్రి పడుకొన్న తరువాత ఒక్కోరోజు తన తల్లితండ్రి, చెల్లెళ్ళు సుమతికి గుర్తుకు వచ్చేవారు. ఆ సమయంలో ఆమె కళ్ళనిండా నీళ్ళు, మనస్సున ఎంతో బాధతో ఏడ్చుకొనేది. కొంతసేపటికి తన్ను తాను సంబాళించుకొని నిద్రపోయేది సుమతి.
ప్రతి నెలా నారాయణసేట్ ఆరవ తేదీన రామ్లాల్కు మూడువేలు పంపేవాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే సుమతిని పిలిచి, “అమ్మా!.. సుమతీ, మీ నాన్నకు డబ్బులు పంపానమ్మా” చెప్పేవాడు. సుమతి సంతోషపడేది.
ఐదువందలు సుమతి చేతికి ఇచ్చేవాడు.
“నీకు ఏదైనా పండు, పూలు కావాలంటే ఈ డబ్బుతో కొనుక్కో. నీవు ఈ ఇంట్లో ఎవరినీ ఏదీ అడవగద్దు. వారు అదో రకమైన మనుషులు. నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు. నేను తెచ్చి నీకు ఇస్తాను.” అనునయంగా చెప్పేవాడు నారాయణ సేట్.
సుమతి ‘సరే’ అన్నట్లు తలాడించేది.
***
సంవత్సరం తర్వాత ఒకనాడు కూతురు సుమతిని చూడాలని రామ్లాల్ చెన్నై వచ్చాడు. నారాయణసేట్ సెంట్రల్ స్టేషనుకు వెళ్ళి రామ్లాల్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కలసి భోంచేశారు.
ఆ రాత్రి రామ్లాల్ సుమతి పడుకొనే గదిలో ఆమె ప్రక్కన పడుకొన్నాడు.
“అమ్మా!.. సుమతీ !.. ఎలా వుందమ్మా నీకు ఇక్కడ? అందరూ నిన్ను బాగానే చూచుకొంటున్నారుగా!” అడిగాడు కూతురిని రామ్లాల్.
“ఆఁ.. అందరూ మంచివారే దాదా!.. నన్ను ప్రేమగా చూచుకొంటున్నారు. నాకు ఎలాంటి బాధలు లేవు దాదా!” చిరునవ్వుతో చెప్పింది సుమతి.
రామ్లాల్ ఆనందంగా నిద్రపోయాడు.
కానీ సుమతికి నిద్రపట్టలేదు. తాను తన తండ్రితో చెప్పింది అబద్ధం. యజమానురాలు చందాబాయికి కోపం అధికం. తోడుగా నోటిదురుసు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, పనిలో ఆలస్యం అయినా, ఆవేశంగా నోరుపారేసుకొనేది. ఇకపోతే చిన్నకూతురు మందాకిని ముమ్మూర్తులా తల్లిపోలిక ‘ఏయ్, రావే, పోవే, నీకు పొగరే’ అని మర్యాద లేకుండా మాట్లాడేది ఆమె. మందాకిని, ఆ తల్లి ముద్దుల కూతురు.
ఆ విషయాలన్నీ తన తండ్రికి చెబితే అతను బాధపడతాడని సుమతి రామ్లాల్ ఏమీ చెప్పలేదు. రామ్లాల్ ముందు చందాబాయి, సుమతి విషయంలో, తన వేగాన్ని తగ్గించింది. తాను ఏదైనా అవకతవకగా నోరు జారితే, ఆ మాటలను రామ్లాల్ వింటే, సుమతిని తనతో తీసుకొని వెళ్ళిపోతాడేమో అనే భయం. ఆ కారణంగా ముద్దుల కూతురు మందాకినికి కూడా జాగ్రత్తలు చెప్పింది. సుమతి మీద రామ్లాల్ ముందు ఎంతో ప్రేమాభిమానాలను చూపింది.
రెండు రోజులు వుండి రామ్లాల్ తన వూరికి బయలుదేరాడు. నారాయణ సేట్ కార్లో అతన్ని స్టేషన్కు తీసుకొని వెళ్ళి రైలు ఎక్కించాడు. ఆ సమయంలో రామ్లాల్ కన్నీటితో..
“సాబ్.. మేరా బచ్చీ (నా బిడ్డ)..” అంటూ ఏదో చెప్పబోయాడు. ఆ మాటల్ని మధ్యలోనే ఆపిన నారాయణసేట్..
“రామ్లాల్!.. సుమతి, తేరా బేటీ నహీ, మేరా!.. మై వుస్కో బత్తన్ సే దేఖ్ లూంగా!..(రామ్లాల్.. సుమతి నీ కూతురే కాదు, నా కూతురు, నేను ఆమెను జాగ్రత్తగా చూచుకొంటాను)” అన్నాడు.
నమస్కరించి రామ్లాల్ రైలు ఎక్కాడు. రైలు కదిలింది. నారాయణసేట్ తన ఆఫీస్కు వెళ్ళాడు.
మరో సంవత్సర కాలం ప్రశాంతంగా జరిగిపోయింది. సుమతి చిన్న చిన్న సమస్యలను సహనంతో జీర్ణించుకొనేది.
***
పెద్దకూతురు చాందిని ప్రసవానికి తల్లిగారి ఇంటికి వచ్చింది. నవమాసాలు నిండాయి. రాత్రి పదిగంటలకు చాందినీకి నెప్పులు ప్రారంభం అయినాయి.
నారాయణ సేట్ జనని ఎనభై సంవత్సరాల వృద్ధురాలు మంచంలో ఉంది. ఆమెకు సహాయంగా సుమతిని వుంచి, మిగతా అందరూ హాస్పిటల్కు వెళ్ళిపోయారు.
ఆ రాత్రి చాందినికి ప్రసవం జరుగలేదు. నొప్పితో ఏడుస్తూ అరుస్తూ వుంది చాందిని.
తల్లితండ్రికి తమ్ముడు చెల్లికి ఆవేదన. అందరూ హాస్పిటల్లోనే వున్నారు. కటక్ నుండి చందాబాయి అన్న కొడుకు మేనల్లుడు దిలీప్ సేట్ వారి ఇంటికి వచ్చాడు. సుమతిని, ముసలమ్మను చూచాడు. సుమతి పెట్టిన భోజనం తిని హాస్పిటల్కు వెళ్ళాడు. ప్రీతిగా అందరిని పలుకరించాడు. తన చిన్న కూతురు మందాకిని కాబోయే భర్త అని చందాబాయి దిలీప్ను ఎంతో ఆదరాభిమానాలతో చూచింది.
చాందినికి డెలివరీ కాలేదు. అందరూ విచారంగా అక్కడే వున్నారు. కొంతసేపు ఉండి దిలీప్ సింగ్ నారాయణ సేట్ ఇంటికి బయలుదేరాడు.
రాగానే, తలుపు తెరిచిన సుమతి అతనికి గుర్తుకు వచ్చింది. సమయం రాత్రి ఏడుగంటలు. బార్ను చూచాడు, లోన ప్రవేశించాడు. విస్కీ ఆర్డర్ చేశాడు. జీడిపప్పుతో మూడు పెగ్గులు సేవించాడు. అతని మస్తిష్కం నిండా సుమతి. బిల్ పే చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరి తలుపు తట్టాడు.
సుమతి తలుపు తెరిచింది.
దిలీప్ సేట్ నవ్వుతూ సుమతి ముఖంలోకి చూచాడు.
“అన్నం పెడతావా సుమతీ!” చిరునవ్వుతో అడిగాడు.
“చిన్నమ్మగారికి ఇంకా కాన్పు కాలేదా సార్!..” అడిగింది సుమతి.
“లేదు సుమతీ!..” తీని లాగాడు దిలీప్.
ఆ స్వరంతో అతను మందు సేవించాడని సుమతి గ్రహించింది. తన ఊర్లో ఉండగా తన తండ్రి రామ్లాల్ సాయంత్రం సమయంలో మందును ఇంటికి తెచ్చుకొని పద్ధతిగా సేవించేవాడు. ఆ కారణం, ఆ వాసనను సుమతి గ్రహించింది.
“రండి సార్!.. భోజనం వడ్డిస్తాను” చెప్పి డైనింగ్ టేబుల్ వైపుకు వెళ్ళింది సుమతి.
దిలీప్ సేట్ తూలుతూ డైనింగ్ టేబుల్ను సమీపించి కూర్చున్నాడు.
ఆలూ పరోటా ప్లేట్లో వుంచి అతని ముందుంచింది సుమతి.
దిలీప్ సేట్ తినడం ప్రారంభించాడు. కొంత తిన్నాడు. అతని దృష్టి తిండిమీద లేదు. సుమతి పైన ఉంది.
లేచి బేసిన్లో చేయి కడుక్కొని, తను వచ్చినప్పుడల్లా పడుకొనే తన బావమరిది రాజాసేట్ గదికి వెళ్ళిపోయాడు. టీవీ ఆన్ చేశాడు. కుర్చీలో కూలబడ్డాడు.
సుమతి తినేసి, ముసలమ్మకు ఇవ్వవలసిన పాలను, మందును ఇచ్చి తనకు వారు మిద్దెమెట్ల క్రింద కేటాయించిన (ల్యాండింగ్ స్లాబ్ క్రింద) గదిలో ప్రవేశించి పడుకొంది. నిద్రపట్టలేదు. డెలివరీ కాని చాందిని గురించి ఆలోచిస్తూ.. ‘అయ్యా సామీ!.. రామయ సామీ!.. చాందినీ అమ్మకు కాన్పు తేలికగా అయ్యేటట్టు చూడు సామీ!..’ చేతులు జోడించి శ్రీరామచంద్రమూర్తిని వేడుకొంది.
దీపక్ సేట్ లేచి మెట్లమీదికి వచ్చి.. “ఏయ్!.. సుమతీ, ఓ బాటిల్ మంచినీళ్ళు ఫ్రిడ్జ్ లోనివి తీసుకురా!..” చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు.
ఇరవై నాలుగు గంటలు కావస్తున్నా చాందినికి కానుపు కానందున స్పెషల్ రూముకు తీసుకొని నారాయణ కుటుంబం అంతా హాస్పిటల్లోనే వుండిపోయారు.
సుమతి లేచి ఫ్రిడ్జ్ని సమీపించి కూల్ వాటర్ బాటిల్తో దిలీప్ సేట్ గదిని సమీపించి, మూసి వున్న తలుపును తట్టింది.
“లాక్ చేయలేదు. లోనికిరా సుమతీ!..” అన్నాడు ముద్దముద్దగా (తాగినవారి భాష)
తలుపు తెరిచి సుమతి గదిలో ప్రవేశించింది. తన చేతిలోని వాటర్ బాటిల్ను టీపాయ్పై వుంచి వెనుతిరిగింది.
“సుమతీ!.. కూర్చో!..” కుర్చీలో కూర్చొని యున్న దిలీప్ సేట్ చిరునవ్వుతో చెప్పాడు. “లేదు సార్!.. నిద్ర వస్తూ వుంది. వెళ్ళి పడుకొంటాను” అంది సుమతి.
దిలీప్ సేట్ వేగంగా లేచాడు. గది ద్వారాన్ని బంధించాడు. సుమతి ఆశ్చర్యపోయింది.
“సార్!.. ఎందుకు సార్ గడియ బిగించారు!.. నేను బయటికి, గది నుండి పోవాలిగా!” దీనంగా అడిగింది సుమతి.
దీపక్ సేట్ త్రాగి వున్నందు వలన, మాటల్లో తడబాటు. సుమతి చేతిని పట్టుకొని బలవంతంగా లాగి మంచంపై తోశాడు. వంగి ఆమె ముఖానికి దగ్గరగా అతని ముఖాన్ని చేర్చబోయిన దీపక్ లాల్ని, సుమతి తన కాలితో జోరుగా తన్నింది. దీపక్ సేట్ నేలకూలాడు. సుమతి వేగంగా మంచంపై నుండి లేచి తలుపు తెరుచుకొని ఇంట్లోనుంచి వీధిలోకి పరుగెత్తింది. ఆమె ఉద్దేశం హాస్పిటల్కి వెళ్ళాలని.
పెట్రోలింగ్ పనిలో వీధిలో తిరుగుతున్న పోలీస్ శేఖర్ – పరుగెత్తుతున్న సుమతిని ఆపి ఆమెను స్టేషన్కు తీసుకెళ్ళాడు. శేఖర్ త్రాగి వున్నాడు. దీపాల కాంతిలో సుమతి అందచందాలు ఎంతో గొప్పగా కనిపించాయి. సుమతి ఏడుస్తూ గత గంటలో దీపక్ సింగ్ తనపై చేయబోయిన అత్యాచారాన్ని గురించి శేఖర్ పోలీస్కి చెప్పింది. అది చలికాలం. స్టేషన్లో మరో ఇరువురు పోలీసులు వున్నారు. చలి కారణంగా వారు మఫ్లర్స్ తలకు బిగించి కుర్చీలో ముడుచుకొని కూర్చొని నిద్రపోతున్నారు. వారి స్థితిని చూచిన శేఖర్.. నవ్వుకొన్నాడు.
“భయపడకు. వర్షం ప్రారంభమయింది. వింటున్నావుగా ఉరుములు. కనుక ఈ రాత్రికి నీవు క్షేమంగా నేను చూపిన గదిలో పడుకో. నేను నిన్ను రేపు వుదయం మీ సేటుకు అప్పగిస్తాను. భయపడకు. బాధపడకు. నాతోరా!..” ముందుకు నడిచాడు శేఖర్.
అతని మాటలను నమ్మిన సుమతి అతని వెనకాల నడిచింది. ప్రక్క గదిలోనికి తీసుకొని వెళ్ళాడు.
“ఈ గదిలో ఆ చాపను పరుచుకొని నీవు హాయిగా నిద్రపో, నేను హాల్లో పడుకొంటాను” చెప్పి శేఖర్ హాలువైపుకు నడిచాడు. సుమతి గోడ మూలవున్న చాపను తీసుకొని నేలపరుచుకొని పడుకొంది.
శేఖర్ కుర్చీలో కూర్చున్నాడు. అతని కళ్ళముందు సుమతి రూపం. మస్తిష్కంలో దుష్ప్రభావం. మనస్సున వికారమైన ఆలోచన. వర్షం కురుస్తూ ఉంది. వురుములు మెరుపులు చలిగాలి.. అరగంట గడిచింది.
దీపాలు ఆరిపోయాయి.
శేఖర్ లేచి.. సుమతి వున్న గదిలో ప్రవేశించాడు. చాపపై ఆమె ప్రక్కన పడుకొన్నాడు. భయంతో నిద్రపోని సుమతి తన ప్రక్కన ఎవరో పడుకున్నారని గ్రహించింది. చలికి వణుకుతూ ఉంది.
శేఖర్ ఆమెను దగ్గరికి తీసుకొన్నాడు. సుమతి అతని కబంద హస్తాల్లో పూర్తిగా నలిగిపోయింది. శేఖర్ వాంఛ తీరింది. శరీరం చల్లబడింది. లేచి హాల్లోకి వెళ్ళాడు. సుమతి ఏడుస్తూ చాపను కరుచుకొంది.
సమయం రాత్రి మూడుగంటల ప్రాంతం..
శేఖర్ అన్న రాంజీ సబ్ ఇన్స్పెక్టర్. అతను పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ ఆ స్టేషనులోకి వచ్చాడు. అది అతని కంట్రోల్లోకి చేరింది. వర్షం తగ్గింది. విద్యుత్ దీపాలు వెలిగాయి.
రాంజీ స్టేషనులో ప్రవేశించడం, శేఖర్ గదినుండి బయటికి రావడం, కరెంట్ వచ్చి దీపాలు వెలగడం, ఒకేసారి జరిగాయి. అన్న రాంజీని చూచి శేఖర్ బిత్తరపోయాడు. రాంజీ అతన్ని సమీపించాడు.
ప్రక్కగది నుండి ఏడుపు వినిపించింది. ఆత్రంగా ఆ గదిలో ప్రవేశించాడు రాంజీ. ఏడుస్తూ తలవంచుకొని వున్న సుమతిని చూచాడు రాంజీ. అతనికి విషయం అర్థం అయింది. హాల్లోకి వచ్చాడు. నిశితంగా తమ్ముడు ముఖంలోకి తీక్షణంగా చూచాడు. శేఖర్ భయంతో తలదించుకొన్నాడు.
తమ్ముడిని సమీపించి.. “ఎవరు ఆ అమ్మాయి?” అని అడిగాడు
“పెట్రోలింగ్ చేసేటప్పుడు రోడ్లో కనిపించింది.” మెల్లగా చెప్పాడు శేఖర్.
“తప్పు చేశావు కదూ!” అడిగాడు రాంజీ.
రాంజీ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అబద్దం అంటే అతనికి అసహ్యం. తప్పుచేసిన వాడు ఎవడైనా సరే, పక్షపాతం లేకుండా శిక్షించే తత్వం అతనిది. ఒకసారి అబద్ధం చెప్పినందుకు శేఖర్ని చితకబాదాడు. ఆ కారణంగా ‘అవును’ అన్నట్లు తలాడించాడు శేఖర్.
కొన్ని నిముషాలు శేఖర్ ముఖంలోకి తీక్షణంగా చూచాడు. మెల్లగా.. “ఛీ!.. నీదీ ఒక బ్రతుకేనారా!” ముఖాన్ని చిట్లించి అన్నాడు.
ప్రక్క గదిలోనికి పోయి సుమతిని ఓదార్చాడు. ఆమె కథను తెలిసికొన్నాడు. ఆమెను తనతో తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. శేఖర్ ఆశ్చర్యపోయాడు.
***
రాంజీ సుమతిని వారి తల్లి శాంతికి పరిచయం చేశాడు. “చాలా బాధలో వుంది. అమ్మా.. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూచుకో. శేఖర్ తలుచుకొంటే ఆమె ఈ ఇంటి కోడలవుతుందమ్మా!.. ధైర్యం చెప్పు. ప్రేమగా చూడమ్మా!” అన్నాడు.
సుమతి వైపు చూచి “సుమతీ!.. ఇది నీ ఇల్లే అనుకో. ఆమె మా అమ్మ. నీకూ అమ్మలాంటిదే. స్నానం చేసి, అమ్మ ఇచ్చిన బట్ట కట్టుకొని టిఫిన్ తిను. నీవు దేనికి భయపడవద్దు. నీకు ఆనందం కలిగేలా నేను చేస్తాను. నీ వాళ్ళను పిలిపిస్తాను. అమ్మ చెప్పినట్లు విను.” అనునయంగా చెప్పాడు రాంజీ.
శాంతమ్మ చెప్పగా.. సుమతి రెస్టు రూముకు వెళ్ళింది. అప్పుడు, రాంజీ.. శేఖర్ చేసిన నిర్వాకాన్ని తల్లికి తెలియజేశాడు. ఆ కథ విన్న తరువాత శాంతికి సుమతి మీద ఎంతో అభిమానం కలిగింది. ‘శేఖర్ తలుచుకొంటే ఆమె ఈ ఇంటి కోడలవుతుందమ్మా!..’ అన్న రాంజీ మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. తన చీరా రవికను సుమతికి ఇచ్చింది. దగ్గర కూర్చొని ప్రీతిగా టిఫిన్ తినిపించింది. సుమతి మనస్సుకు కొంత ఉపశమనం కలిగింది.
“అమ్మా!.. నిద్ర వస్తూ ఉంది” చెప్పింది సుమతి.
శాంతమ్మ, సుమతిని తన గదిలోనికి తీసుకుని వెళ్ళి మంచంపై పడుకోబెట్టింది.
మరుసటి రోజు సాయంత్రం ఆరుగంటలకు శేఖర్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రాంజీ ఇంట్లో లేడు.
కొడుకును తల్లి ఆదరంగా పలకరించింది. తల్లి కదా, బిడ్డలు ఎలాంటి తప్పు చేసినా, క్షమించగల మహత్తర మనస్తత్వం కలిగినవారు ఒక తల్లి మాత్రమే. రాంజీ చెప్పిన విషయాన్ని అదే సుమతిని గురించి ఆ తల్లి శాంతి శేఖర్ను ఏమీ అడగలేదు. ప్రీతిగా భోజనం పెట్టింది. శేఖర్ కడుపునిండా తిని తన గదిలోకి వెళ్ళి పడుకొన్నాడు.
శాంతి గదిలో వున్న సుమతి శేఖర్ని చూచింది. అంతవరకూ ప్రశాంతంగా వున్న ఆమె మనస్సున కలవరం ప్రారంభమయింది. మంచం దిగలేదు. అన్నానికి పిలిచిన శాంతికి “ఆకలిగా లేదమ్మా!..” అని జవాబు చెప్పి పడుకొంది.
రాత్రి పదిగంటలకు రాంజీ ఇంటికి వచ్చాడు. వాకిట్లో వున్న శేఖర్ షూస్ని చూచి, తమ్ముడు ఇంటికి వచ్చాడని గ్రహించాడు. కానీ అతన్ని గురించి తల్లిని అడగలేదు.
భోజనం పెడుతూ శాంతి రాంజీకి శేఖర్ వచ్చాడని చెప్పింది. రాంజీ మౌనంగా తలాడించాడు.
శాంతి భోజనం చేసి.. ‘రేపు అన్నదమ్ముల మధ్యన ఏం జరుగబోతుందో!..’ అనే ఆలోచనతో పడుకొంది.
సుమతి ఐదు గంటలకు లేచి కాలకృత్యాలు స్నానం ముగించి, వంట గదిలోనికి వెళ్ళిపోయింది. శాంతమ్మకు వంట పనిలో సాయం చేయసాగింది.
రాంజీ ఆరుగంటలకు లేచి రెడీ అయినాడు. శేఖర్ మాట్లాడడానికి హాల్లో కూర్చొని దిన పత్రికను చూడసాగాడు. ఏడున్నరకు శేఖర్ తన గదినుండి బయటికి వచ్చి బాత్ రూములో దూరాడు.
ఇడ్లీ, సాంబార్, చట్నీలను శాంతమ్మ డైనింగ్ టేబుల్ పైకి చేర్చింది. సుమతిని టిఫిన్ తినమని చెప్పింది. నాలుగు ఇడ్లీలను సాంబార్, చెట్నీని ప్లేటులో వుంచుకొని సుమతి శాంతమ్మ గదిలోనికి వెళ్ళిపోయింది. శేఖర్ స్నానం ముగించి, తన గదిలోనికి వెళ్ళి డ్రస్ చేసుకొని హాల్లోకి వచ్చాడు.
“అమ్మా!.. టిఫిన్!..” అడిగాడు.
పూజ రూములో ఉన్న శాంతమ్మ, దీపారాధన, ఫలనివేదన సర్వేశ్వరులకు చేసి, చేతులు జోడించి.. ‘తండ్రీ!.. అన్నాదమ్ముల మధ్యన ఎలాంటి వాదోపవాదాలు, అభిప్రాయబేధాలు. తగాదా జరుగకుండా చూడు తండ్రీ’ అని వేడుకొని హాల్లోకి వచ్చింది.
డైనింగ్ టేబుల్ మీద రెండు ప్లేట్లలో ఇడ్లీలు వుంచి, సాంబార్, చట్నీని చిన్న గిన్నెలో పోసి, ఆ ప్లేట్ల ప్రక్కన వుంచింది. పేర్లు పెట్టి ఇరువురు కొడుకులను పిలిచింది. వారు డైనింగ్ టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చున్నారు.
“అమ్మా!.. నీవు కూర్చొని తినమ్మా!” అన్నాడు రాంజీ.
శాంతి చిన్న కొడుకు ప్రక్కన కూర్చుంది.
మౌనంగా ముగ్గురు టిఫిన్ తిన్నారు.
అందరికంటే ముందు వేగంగా శేఖర్ తిని బేసిన్లో చేయి కడుక్కొని..
“అమ్మా!.. నేను డ్యూటీకి వెళుతున్నాను” చెప్పాడు.
శాంతమ్మ రాంజీ ముఖంలోకి చూచింది. చిరునవ్వు నవ్వాడు రాంజీ.
“శేఖర్!.. ఆగు.. సోఫాలో కూర్చో!..” అన్నాడు రాంజీ.
రాంజీవైపు తీక్షణంగా చూచిన శేఖర్ సోఫాలో కూర్చున్నాడు. అతనికి ఎదురు సోఫాలో రాంజీ కూర్చున్నాడు. అతని ప్రక్కన తల్లి శాంతమ్మ కూర్చొని అతని ముఖంలోకి చూచింది.
“శేఖర్!..”
తలను పైకెత్తి రాంజీ ముఖంలోకి క్షణంసేపు చూచి తలను దించుకొన్నాడు శేఖర్.
“చూడూ!.. నీవు చేసిన ఘనకార్యాన్ని గురించి నేను అమ్మకు చెప్పాను. ఇప్పుడు నీ ముందు రెండు ఆప్షన్స్ పెడుతున్నాను. ఒకటి.. నీవు మంచి మనస్సుతో ఆ అమ్మాయి సుమతిని వివాహం చేసుకోవడం. రెండవది నీ తప్పును అంగీకరించి నేరస్థుడిగా జైలు పాలుకావడం.. నా గురించి నీకు బాగా తెలుసు. మన తండ్రి కీర్తిశేషులు ధర్మారావు ఎస్.పి గారికి రాష్ట్రంలో ఎంతో గొప్ప పేరు. మనం వారి వారసులం. మనం మన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలి. నేను నడుస్తున్నాను. ధర్మ రక్షణ విషయంలో స్వపర బేధాలు ఆ తండ్రికి లేవు. నాకు లేవు. నీకు నాకు వయస్సు వ్యత్యాసం ఆరు సంవత్సరాలు. ఒక అన్నగా నీ మేలు కోరడం నా ధర్మం. ఆ సదుద్దేశంతో నీకు రెండు ఆప్షన్స్ తెలియజేశాను. నీకు ఏది సమ్మతమో ఇప్పుడు చెప్పాలి!” రాంజీ శేఖర్ ముఖంలోకి చూచాడు.
“ఒరే!.. చిన్నోడా!.. నీవు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకొనేదానికి ఒప్పుకోరా!..” ప్రాధేయపూర్వకంగా చెప్పింది ఆ తల్లి.
“నేను నా నిర్ణయాన్ని సాయంత్రం చెబుతానమ్మా!” సోఫా నుండి లేచి శేఖర్ వేగంగా బయటికి వెళ్ళి బులెట్పై కూర్చొని ఆఫీసు వైపుకు బయలుదేరాడు.
శాంతమ్మ దీనంగా రాంజీ ముఖంలోకి చూచింది.
“అమ్మా!.. నీవెందుకమ్మా బాధపడతావు. సాయంత్రం చెబుతానన్నాడుగా!.. ఏం చెబుతాడో చూద్దాం!.. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూచుకో. బాధపడకు. నేను ఆఫీసుకు వెళ్ళి వస్తానమ్మా..” సొఫా నుండి లేచి రాంజీ పోర్టికోలో వున్న తన జీప్లో కూర్చొని ఆఫీసుకు బయలుదేరాడు.
ఆశ్రునయనాలతో శాంతమ్మ తలదించుకొంది.
రాత్రి ఎనిమిది గంటలకు రాంజీ ఇంటికి వచ్చాడు. కానీ శేఖర్ ఇంటికి రాలేదు. రాంజీ, శాంతమ్మలు అతని కోసం వరండాలో కూర్చొని ఎదురుచూస్తున్నారు.
గంట పన్నెండు..
శేఖర్ తప్పతాగి, మరో కానిస్టేబుల్ బులెట్ని నడపగా వెనుక కూర్చొని వచ్చి పోర్టికోలో దిగాడు.
ఆ కానిస్టేబుల్ రాంజీని సమీపించి.. “గుడ్ ఈవెనింగ్ సార్!.. ఏదో బాధలో, చెబుతున్నా వినకుండా శేఖర్ విపరీతంగా త్రాగాడు. అతని బాధ ఏమితో కనుక్కోండి. అతన్ని ఏమీ అనకండి. బహుశా లవ్ ఫెయిల్యూర్ ఏమో!..” మెల్లగా చెప్పి రాంజీకి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
తూలుతూ పోయి శేఖర్ సొఫాలో పడిపోయాడు.
“అమ్మా!.. వాడిని చూచావుగా!.. నీకేం అర్థం అయింది?” అడిగాడు రాంజీ.
“వాడికి ఆ పిల్లను పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని అర్థం అయింది!..” దీనంగా చెప్పింది.
“కదా!.. అయితే నేను ఎస్.పి ధర్మారావు కొడుకుగా ఏం చేయాలి! అమ్మా.. నీవే చెప్పు” విచారంగా అడిగాడు రాంజీ.
“నీ ఇష్టంరా!..” దీనంగా చెప్పింది ఆ తల్లి.
“అమ్మా!.. పోలీస్ అంటే పబ్లిక్ రక్షకుడు, హితుడు. సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలను కాపాడవలసిన వాడు. చిన్నప్పుడు నీవు మాకు చెప్పేదానివి కంచె చేను మేస్తే..!? దానికి రక్షకుడెవరని?.. వీడు నీ చిన్నకొడుకు ధర్మాన్ని తప్పాడు. కనుక వీడిని అరెస్ట్ చేసి జైల్లో వేయక తప్పదమ్మా!” వేగంగా తన జీప్ను సమీపించి బేడీలు తీసుకొని, శేఖర్ను సమీపించి అతని చేతులకు సంకెళ్ళు తగిలించి భుజాన వేసుకొని జీప్ వెనుక సీట్లో పడేశాడు.
“అమ్మా!.. రేపు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, రప్పించి, వారి బిడ్డను వారికి అప్పగిస్తానమ్మా!.. ఈ రాత్రి ఈ ద్రోహిని జైల్లో పడేసి వస్తానమ్మా. బాధపడకు. తప్పుకు పరిష్కారం శిక్ష” జీప్లో కూర్చొని స్టార్ట్ చేసి వేగంగా వీధిలో ప్రవేశించాడు రాంజీ.
శాంతమ్మ నయనాల్లో కన్నీరు.
‘ఒక బిడ్డ రాముడు. మరొకడు రావణుడు. ఇద్దరూ నా బిడ్డలే!?’ విచారంగా అనుకొంది శాంతమ్మ.
సమాప్తి
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.