Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కనకదుర్గ

[శ్రీ రాజేష్ కుమార్ పొన్నాడ రాసిన ‘కనకదుర్గ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

హైదరాబాద్‌లో పేరు మోసిన హాస్పిటల్ పేషెంట్లతో కిటకిటలాడుతోంది. వచ్చిన పేషెంట్లలో చాలా మంది జనరల్ చెక్అప్ కోసం వచ్చినవారే. ఓ.పి. ఫీజు అక్షరాల అయిదు వందల రూపాయలు. డాక్టర్ విజయ్ ఒక పేరున్న కార్డియాలజిస్ట్. ఆయన క్యాబిన్ ముందర కూడా చాలా మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళల్లో ఒక పేషెంటుని కాంపౌండర్ వచ్చి లోపలికి వెళ్ళమన్నాడు. లోపలికి వచ్చిన ఆ పేషెంట్ గురించి వాకబు చేసాడు విజయ్. ఆమె ఇంతకుముందు వేరే ఆసుపత్రిలో చెక్అప్ చేయించుకుందని, ఇవాళ మొట్టమొదటి సారిగా, కొత్తగా తన వద్దకు చెక్అప్ కోసం వచ్చిందని తెలుసుకున్నాడు. అంతా నార్మల్ గానే ఉందని, ఆమెకు కొన్ని మందులు రాసిచ్చాడు. ఎప్పుడూ పేషెంట్ పేరు ముందుగా తెలుసుకునే విజయ్ ఈసారి ఏ కళనున్నాడో పేషెంట్ పేరు అడగలేదు. దాంతో పేరు అడగలేదన్న విషయం గుర్తుకువచ్చి, ఆ పేషెంటుతో “మీ పేరేమిటమ్మా?” అని ఆప్యాయంగా అడిగాడు. ఆమె “కనకదుర్గ సార్” అని అంది. ఆ పేరు విన్న విజయ్ అనుమానంగా పేషెంట్ ఫైలులో ఆమె ఊరు, పేరు చూసాడు. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. దాంతో కాంపౌండర్ వచ్చాడు. అతనికి కనకదుర్గ మెడికల్ ఫైల్ ఇచ్చి “ఈమెకు కావలసిన మందులు ఫ్రీగా ఇవ్వమను. ఓ.పి. ఛార్జ్, టెస్టులకు అయిన ఖర్చు తిరిగి ఇచ్చేయమను. ఈమె ఎప్పుడు వచ్చినా ఈమె దగ్గర డబ్బులు తీసుకోవద్దని నేను చెప్పానని సంబంధిత వ్యక్తులకు, సిబ్బందికి చెప్పు” అని అన్నాడు. విజయ్ మాటలు విన్న కనకదుర్గ ఆశ్చర్యంతో చూస్తోంది. ఆమె “ఎందుకు సార్! నా దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు?” అని అనుమానంగా అడిగింది. దానికి విజయ్ కళ్ళు మూసుకుని “అమ్మా! కనకదుర్గమ్మ తల్లి మా ఇంటి కులదైవం. మీ పేరు కూడా ఆ తల్లి పేరే కదా. అందుకని తీసుకోవడం లేదు. జై భవాని మాత” అని అంటూ ఆమెకు నమస్కరించాడు.

ప్రతి నమస్కారం చేసి ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది కనకదుర్గ.

***

మధ్యాహ్నం లంచ్ చేసాక పేపర్ చదవడం విజయ్ అలవాటు. ఆ రోజు కూడా ఎప్పటిలానే ఆసుపత్రిలో భోజనం చేసాడు. ఆ తరువాత తన దినచర్యలో భాగంగా దినపత్రిక చదవసాగాడు. ఆ పేపరులో ఒక వార్తపై అతని చూపు పడింది. ‘ఒక వ్యక్తికి గుండె సంబంధిత వ్యాధి వచ్చి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఆ వార్త సారాంశం. స్వతహాగా కార్డియాలజిస్ట్ కావడంతో విజయ్ ఆ వ్యక్తికి ఫోన్ చేసాడు. ఆ వ్యక్తి తన వ్యాధికి సంబంధించిన లక్షణాలు అన్నీ చెప్పారు. విజయ్ ఆ వ్యక్తి చెప్పిన వ్యాధి లక్షణాలు అన్నీ విని ఒక బాధ్యత కల వైద్యుడిగా ఆ వ్యక్తికి ధైర్యం చెప్పాడు. అధైర్యపడవద్దని, తనకు తోచిన ధనసహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ తరువాత తన దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమవడానికి సిధ్ధమవసాగాడు. గుండె జబ్బు చేసిన వ్యక్తి పేరు ఏమిటో అడగలేదని గుర్తుకువచ్చి దినపత్రికలో పేరు కోసం వెతికాడు. ఆ వ్యక్తి పేరు ‘కనకదుర్గ’ అని తెలుసుకున్నాడు. ఆశ్చర్యంతో కూడిన కంగారుతో మరోసారి ఆ ఆర్టికల్ చదివాడు. మరల ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తి పేరు ‘కనకదుర్గ’ అని నిర్థారణ చేసుకున్నాడు. దాంతో ఆ కనకదుర్గతో వ్యాధి తగ్గడానికి కావల్సిన మొత్తం డబ్బు తాను పంపిస్తానని భరోసా ఇచ్చాడు. అంతే కాకుండా కనకదుర్గను ట్రీట్ చేస్తున్న డాక్టర్ మొబైల్ నెంబర్ కూడా తీసుకొని ఆ డాక్టరుకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కనకదుర్గను బాగా చూసుకోవాలని ఆ డాక్టరుకు విజ్ఞప్తి చేశాడు. ఆ డాక్టర్ కూడా విజయ్ విన్నపాన్ని ఒప్పుకున్నాడు. ఆ తరువాత విజయ్ మనశ్శాంతిగా తన డ్యూటీకి బయలుదేరాడు.

***

ఆ మరునాడు ఆదివారం కావడంతో టైం ఎనిమిది అయినా విజయ్ నిద్రపోతూనే ఉన్నాడు. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కడంతో విజయ్ భార్య నళిని తలుపు తీసింది. ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ బయట నిలబడి ఉన్నారు. ఆమె నళినిని చూసి “నమస్తే అమ్మా! మేము ఈ అపార్ట్మెంట్ నూట ఎనిమిదవ ఫ్లాట్లో కొత్తగా అద్దెకు చేరాం. ఇవాళ పదింటికి పాలు పొంగిస్తున్నాం. దయచేసి మీరు తప్పకుండా మీ ఫ్యామిలీతో పాటు రావాలి” అని ఆహ్వానించింది. నళిని నవ్వుతూ “అలాగేనండీ! నేను మిమ్మల్ని నూట ఎనిమిదో నెంబర్ ఫ్లాట్ లో చూసాను. మీ పేరు తెలుసుకోవచ్చా?” అని అడిగింది. ఆమె నవ్వుతూ “కనకదుర్గ” అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో మెలుకువ వచ్చిన విజయ్ “ఎవరు వచ్చింది?” అని నళినిని సందేహంగా అడిగాడు. నళిని జరిగింది అంతా చెప్పింది. “వచ్చిన ఆవిడ పేరేంటి? మళ్ళీ చెప్పు” అని నిద్రమత్తులో అనుమానంగా అడిగాడు విజయ్. నళిని “కనకదుర్గ” అని మళ్ళీ చెప్పింది. అది విన్న విజయ్ “మనం తప్పకుండా పదింటికి వాళ్ళింటికి వెళ్దాం” అని ఆసక్తిగా అన్నాడు. అలా విజయ్, నళిని ఇద్దరూ కనకదుర్గ ఇంటికి వెళ్ళి ఆ అద్దె ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కనకదుర్గ కూడా వాళ్ళిద్దర్నీ సాదరంగా ఆహ్వానించింది. అలా నళిని, విజయ్ ఇద్దరూ ఆరోజు సాయంత్రం దాకా కనకదుర్గ ఇంటిలో గడిపారు. ఇంటికి వెళ్ళేముందు కనకదుర్గ హాట్, స్వీట్లతో కూడిన టిఫిన్ బాక్స్ ఇచ్చింది. మధ్యాహ్నం భోజనం ఆలస్యం కావడంతో విజయ్ “రాత్రి భోజనం చేయను” అని నళినికి చెప్పాడు. దాంతో నళిని కూడా భోజనం మానేసింది. కనకదుర్గ ఇచ్చిన హాట్,స్వీట్లు తింటూ రాత్రి తొమ్మిదింటికి మేడపైన ఇద్దరూ పచార్లు చేయసాగారు. ఇంతలో నళిని “పక్కింటి పిన్నిగారు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను.” అంటూ పైనుంచి కిందికి దిగి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తోచక ఒంటరిగా ఆలోచిస్తున్న విజయ్ డాక్టర్ బుర్రకు గుర్తుకు వచ్చిన వ్యక్తి ‘కనకదుర్గ’. దాంతో అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి.

***

కొన్ని సంవత్సరాల క్రితం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు దగ్గర ఒక మారుమూల గ్రామం నాగులపాలెంలో విజయ్ తల్లిదండ్రులు ఉండేవారు. విజయ్ తండ్రి సొంత ఊరే నాగులపాలెం. విజయ్ వారికి ఒక్కగానొక్క కొడుకు. పదవ తరగతితో చదువు ఆపేసిన విజయ్ తండ్రి, కొడుకుని మాత్రం డాక్టర్ చేయాలని కలలు కనేవాడు. విజయ్ తండ్రి ఒక చిరు వ్యాపారి. తండ్రి ఆలోచనలకు తగ్గట్టుగానే విజయ్ చాలా క్రమశిక్షణగా ఉంటూ చదువుకునేవాడు. విజయ్ తల్లి పేరు గాయత్రి. గాయత్రి సొంత చెల్లెలే కనకదుర్గ. విజయ్‌కి సొంత పిన్ని అవుతుంది. గాయత్రికి ఒక అన్న, అక్క, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అలా గాయత్రి తండ్రి రంగనాథంకు అయిదుగురు సంతానం. రంగనాథం హైదరాబాద్‌లో ఒక బట్టల దుకాణం నడుపుతుండేవాడు. విజయ్‌కు కూడా పిన్ని అంటే చాలా ఇష్టం. గాయత్రి వరుసకు సొంత బావ అయిన మేనమామ కొడుకుని పెళ్ళి చేసుకుని హైదరాబాద్ నుంచి నాగులపాలెం వచ్చి స్థిరపడింది. రంగనాథం హైదరాబాద్‌లో ఉంటూ ఉన్నదాంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేవాడు. విజయ్ కూడా తాత రంగనాథం ఇంట్లో హైదరాబాద్ లోనే పుట్టాడు. విజయ్‌కి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా గాయత్రి భర్త, బిడ్డతో నాగులపాలెం నుంచి హైదరాబాద్ చేరేది.

విజయ్ తండ్రి, భార్యాబిడ్డలను హైదరాబాదులో దింపి రెండు రోజులు అత్తగారింట్లో ఉండి తిరిగి స్వగ్రామం నాగులపాలెం బయలుదేరేవాడు. అప్పుడు కనకదుర్గ, విజయ్ ఇద్దరూ బాగా కలిసిపోయి సొంత తల్లికొడుకుల్లా ఉండేవారు. కనకదుర్గకి తప్ప మిగిలిన అక్కాచెల్లెళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. గాయత్రి చిన్నప్పుడు చదువుకోలేదు. కానీ కనకదుర్గ మాత్రం బాగా చదువుకుని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తోంది. దాంతో విజయ్ చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు కనకదుర్గ దగ్గర చదువు చెప్పించుకునేవాడు. కాస్త రంగు తక్కువ కావడంతో, కట్నం ఇచ్చుకునే స్తోమత ఉన్నా కానీ గాయత్రి తండ్రి రంగనాథం కనకదుర్గ పెళ్ళి చేయలేక నానా అవస్థలు పడుతుండేవాడు. కొంతమంది వచ్చి పెళ్ళి చూపుల పేరుతో కనకదుర్గను చూసినా “అమ్మాయి రంగు తక్కువగా ఉంది” అని పెళ్ళిచూపుల్లోనే పెళ్ళి ప్రపోజల్ రద్దు చేసేవారు. మరికొంతమంది అమ్మాయికి వయసు ఎక్కువగా ఉంది. పిల్లలు పుడతారో లేదో అనే అనుమానంతో పెళ్ళి చూపులకు కూడా వచ్చేవారు కాదు. ఒకసారి పెళ్ళిళ్ళ బ్రోకర్ ఇంటికి వెళ్ళి వస్తుంటే రంగనాథంకు కుక్క కూడా కరిచింది. మరోవైపు విజయ్, కనకదుర్గల మధ్య తల్లి, కొడుకుల బంధం రోజురోజుకు మరింత బలపడసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో “ఇంక కనకదుర్గకు పెళ్ళి కాదు” అనే నిర్ణయానికి వచ్చాడు రంగనాథం.ఆ బాధతో పాటు ఆరోగ్యరీత్యా ‘ఇంకా తాను ఎక్కువ కాలం బ్రతకనేమో’ అనే భయం అతన్ని పీడించసాగింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. కూతుళ్ళని రమ్మని ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరం అందుకున్న అందరూ రంగనాథం చెప్పిన రోజుకి రంగనాథం ఇంటికి వచ్చారు. భోజనాలు అయిన తరువాత రంగనాథం అందరినీ సమావేశపరిచాడు. అందరినీ తీక్షణంగా, గంభీరంగా మొట్టమొదటిసారి చూసాడు. తండ్రిని మొట్టమొదటిసారిగా అలా చూసేసరికి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఏమి చెప్తాడో అని ఆత్రుతగా ఎదురు చూడసాగారు. వాళ్ళ పరిస్థితి చూసిన రంగనాథం తనే ముందుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. “నాకు ఉన్న ఆస్తి నేను ఉంటున్న ఈ ఇల్లు ఒక్కటే. ఈ ఇల్లు నేను కష్టపడి సంపాదించినదే. వంశపారంపర్యంగా, పిత్రార్జితంగా వచ్చిన ఆస్తులు ఏమీ లేవు. చివరి సంతానం కనకదుర్గకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి, ఇంక అవుతుందో లేదో అని అనుమానంగా ఉంది. దానికి పెళ్ళి వయసు అయిపోతోంది కదా. అందుకని ఈ ఇల్లు కనకదుర్గ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాను. ఈ ఇల్లు దాని పేరు మీద ఉందనే విషయం తెలిసిన వారెవరైనా దానిని పెళ్ళి చేసుకుంటారనే ఆశ. ఒక వేళ దానికి జీవితంలో పెళ్ళి కాలేదనుకోండి, ఉండటానికి దానికి ఒక నీడ ఉండాలిగా. ఆ నీడను చూసైనా దానికి అవసాన దశలో ఎవరైనా ఇంత ముద్ద పెడతారు కదా. నేను మిగిలిన సంతానమైన మీ అందరికీ ఏమీ ఇవ్వలేకపోతున్నాను. దయచేసి ఏమీ అనుకోకుండా నన్ను క్షమించండి” అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తండ్రి కన్నీళ్ళు పెట్టుకోవడం మొట్టమొదటిసారిగా చూసేసరికి ఎవరికీ ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. గాయత్రి ముందుకు వచ్చి, “నాన్నా! మాకు ఆస్తులు ఇవ్వలేదని నువ్వేమి అధైర్యపడవద్దు. అన్నయ్యకు సొంత వ్యాపారం పెట్టించావు. తనకు ఒక కుటుంబం ఏర్పడింది. మా అందరికీ పెళ్ళిళ్ళు చేసావు. ఇది చాలు నాన్న మాకు. పెళ్ళి కాలేదని కనకదుర్గకు ఇల్లు రాసిస్తే మాకేమీ అభ్యంతరం లేదు” అని తండ్రిని ఊరడించింది. మిగిలిన వారు కూడా గాయత్రితో ఏకీభవించారు.

కొంత కాలం గడిచింది. ఇంతలో కనకదుర్గకు ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగి. దాంతో రంగనాథం కాబోయే అల్లుడు ఏమి అడిగితే అది కాదనకుండా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలా కాస్త లేటయినా కనకదుర్గకు మంచి సంబంధం కుదిరి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన మరునాటి సంవత్సరం కనకదుర్గ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు ‘రాహుల్’ అని నామకరణం చేశారు. కాలక్రమేణా రంగనాథం భార్య ఆరోగ్యం క్షీణించసాగింది. అలా ఒకరోజు రంగనాథం భార్య కూడా మరణించింది. భార్య చనిపోయాక జరిగే కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తరువాత రంగనాథం కొడుకుని, కూతుళ్ళని మళ్ళీ సమావేశపరిచాడు.

ఈసారి తండ్రి ఏమి చెప్తాడా అని అందరూ ఎదురు చూడసాగారు. అప్పుడు రంగనాథం కన్నీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ “అమ్మా కనకదుర్గ! ఇలా రా” అని పిలిచాడు. ఆందోళనగా కనకదుర్గ ముందుకు వచ్చి “ఏమిటి నాన్నా?” అని అడిగింది. దానికి రంగనాథం “తల్లీ, నీకు పెళ్ళి అవుతుందో లేదో అనే బెంగతో, పెళ్ళి కాకపోతే నువ్వు ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతావో అని, నా స్వార్జితం అయిన ఉన్న ఒక్క ఇల్లు నీ పేరు మీద రాసాను. భగవంతుని దయ వలన ఇప్పుడు నీకు కూడా పెళ్ళి అయి నీకు ఒక కుటుంబం ఏర్పడింది. కాబట్టి ఇల్లు మళ్ళీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకని నువ్వు నాకు ఒక మాటివ్వాలి. నా తదనంతరం ఆ ఇంటిని అమ్మి వచ్చిన డబ్బును నీ తోడబుట్టిన అందరికీ సమానంగా పంచుతానని అందరిముందూ నాకు మాటివ్వు” అని అన్నాడు. కనకదుర్గ ఏ మాత్రం ఆలోచించకుండా “నువ్వు చెప్పినట్లే చేస్తానని నీకు మాట ఇస్తున్నాను నాన్నా” అని తండ్రి చేతీలో చెయ్యి వేసి చెప్పింది. ఇది జరిగిన కొంత కాలానికి రంగనాథం కాలం చేసాడు. కర్మకాండలు అయిపోయిన తరువాత ఒక రోజు చూసుకుని అంతా కలుసుకున్నారు. అప్పుడు గాయత్రి ఇంటి ప్రస్తావన తెచ్చింది. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులో తన వాటా ఇస్తే తన కొడుకు చదువుకు ఉపయోగపడుతుందని అంది. దానికి కనకదుర్గ “ఆ ఇల్లు నాన్న స్వార్జితం. ఆయన నా పేరున రిజిస్ట్రేషన్ చేసారు. దాని మీద సర్వహక్కులు కూడా నావే” అని గర్వంగా అంది. అప్పుడు మిగిలిన అందరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గాయత్రి కూడా “నువ్వు నాన్నకు ఇచ్చిన మాట పరిస్థితి ఏమిటి?” అని ఆందోళనగా ప్రశ్నించింది. దాంతో గాయత్రి “నోటు మాటకేగాని, నోటి మాటకు విలువ లేదు అక్కయ్య” అని వెటకారంగా నవ్వింది. అది విన్న గాయత్రి, కనకదుర్గ నవ్వుకు, నోటి మాటకు బాధపడింది. అదే సమయానికి విజయ్ చదువుకు అత్యవసరంగా డబ్బు కావాల్సిరావడంతో ఏమి చేయాలో పాలుపోక ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితుల్లో మనసులో బాధతో “నేను చెప్పేది నేను చెప్పాను, తరువాత నీ ఇష్టం” అని అంది. అప్పటి నుంచి గాయత్రికి, కనకదుర్గకు మాటలు లేవు. ఒకరినొకరు ఉత్తరాలు రాసుకోవడం కూడా మానేసారు. ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్లు మాత్రమే ఉండేవి. ఎవరో ఒకరిద్దరు డబ్బున్న వారి దగ్గర మాత్రమే సెల్ ఫోన్ ఉండేది. కనకదుర్గ అత్తగారింట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. గాయత్రికి ఫోన్ లేక పక్కింటి వాళ్ళ ల్యాండ్ ఫోన్‌లో తనకు వచ్చే ఇన్‌కమింగ్ ఫోన్లు మాట్లాడేది. ఇంత జరిగినా సరే గాయత్రి, కనకదుర్గతో మాట్లాడటానికి పబ్లిక్ ఫోన్ బూత్ ద్వారా ప్రయత్నం చేసింది. కానీ గాయత్రితో మాట్లాడటానికి కనకదుర్గ ఇష్టపడలేదు. అలా ఇద్దరి మధ్య దూరం కాలంతో పాటు సాగుతోంది. మరోవైపు విజయ్ తన పిన్ని కనకదుర్గ మీద బెంగ పెట్టుకున్నాడు. తన తల్లి అయిన గాయత్రికి తెలియకుండా కనకదుర్గకు ఉత్తరం రాసాడు. కానీ ఆ ఉత్తరానికి కనకదుర్గ సమాధానం ఇవ్వలేదు. అలా కాలక్రమేణా గాయత్రికి, కనకదుర్గకు సంబంధం పూర్తిగా తెగిపోయింది. విజయ్ కూడా ఆ తరువాత తన చదువుల్లో బాగా బిజీ అయిపోయాడు. అప్పుడప్పుడు కనకదుర్గ గురించి ఆలోచించసాగాడు. ఆ తరువాత కొంత కాలానికి విజయ్ పెళ్ళి చేసుకున్నాడు.

***

విజయ్ అలా గతంలోని ఆలోచనల నుంచి వర్తమానంలోకి వచ్చాడు. గతంలో విషయాలు అన్నీ అతనికి భారంగా అనిపించాయి. ఇంతలో నళిని పిలవడంతో మేడపై నుంచి కిందకి దిగి వచ్చాడు. ఆ మరునాడు సోమవారం. కాఫీ కప్పుతో “గుడ్ మార్నింగ్” చెప్పింది నళిని. విజయ్ ప్రతి గుడ్ మార్నింగ్ చెప్పి “ఏమిటి విశేషాలు?” అని కాఫీ కప్పు తీసుకున్నాడు. “వచ్చే ఆదివారం మీ నాన్నగారి ఆబ్దికం. ఈసారి మామగారికి ఇష్టమైన ఆదివారం రోజున వచ్చింది. పురోహితుడిని పిలుద్దామా?” అని అంది. విజయ్ ఆలోచిస్తూ “ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా! ఏ పంతులుగారు అందుబాటులో లేరు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను. అందుకే పోయిన సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా మదర్ థెరిస్సా అనాథ వృద్ధాశ్రమానికి ఒకరోజు భోజన ఖర్చు ఇద్దాం” అని అన్నాడు. అది విన్న నళిని “అత్తయ్యగారికి కూడా ఒక మాట చెప్పండి” అని సలహా ఇచ్చింది. విజయ్ ఆలోచిస్తూ ఫోన్ పే ద్వారా మదర్ థెరిస్సా అనాథ వృద్ధాశ్రమానికి రెండు వేల రూపాయలు బదిలీ చేసాడు. ఆ తరువాత ఆశ్రమం కోఆర్డినేటర్ మల్లేశ్వరరావుకు వచ్చే ఆదివారం గురించి వివరాలు చెప్పాడు. అన్ని వివరాలు నోట్ చేసుకున్నాడు కోఆర్డినేటర్. విజయ్ తల్లికి ఆదివారం ఆబ్దికం విషయం చెప్పాడు. అలా చూస్తుండగానే ‘ఆ వచ్చే ఆదివారం’ వచ్చేసింది. ఈ ఆదివారం మాత్రం పొద్దున్నే నిద్ర లేచాడు విజయ్. స్నానాదులు కానిచ్చి, దేవుని పూజ ముగించాడు. ఇంతలో మదర్ థెరిస్సా ఆశ్రమం నుండి మల్లేశ్వరరావు విజయ్‌కు ఫోన్ చేసాడు. “‌సార్! ఇవాళ మీ నాన్నగారి పుణ్యతిథి కదా! మేము ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసాము. మీరు మధ్యాహ్న భోజనానికి తప్పకుండా రావాలి” అని చెప్పాడు. అది విన్న విజయ్ “సార్! నేను ఇచ్చింది ఆశ్రమంలోని అవసరార్థులు తింటారని, వారు తిన్నాక నా తండ్రి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుందని. నేను కూడా వచ్చి తింటే, నేను చేసిన దానాన్ని నేనే స్వీకరించినట్లుగా ఉంటుంది. నేను రానులే సార్. మీరే కార్యక్రమాన్ని జరిపించండి. ధన్యవాదములు” అని ఫోన్‌లో వీడ్కోలు తీసుకున్నాడు. ఆ తరువాత తన హాస్పిటల్ పనుల్లో ఆదివారం అయినా పేషంట్స్ ఎక్కువగా ఉండటంతో బాగా బిజీ అయ్యాడు. ఆ రోజు రాత్రి హాస్పిటల్ నుంచి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునేసరికి సమయం పది దాటింది. ఇంతలో ఏదో వాట్సప్ మెసేజ్ రావడంతో ఫోన్ చూసుకున్నాడు.

మదర్ థెరిస్సా ఆశ్రమం నుండి మల్లేశ్వరరావు వీడియో పంపాడు. ఆ వీడియో కింద “సార్! ఇవాళ మీ నాన్నగారి పుణ్యతిథి కదా! మేము ఆయన పేరుతో ఈరోజు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేసాము. మీరు కూడా చూస్తారని వీడియోలు, ఫోటోలు పంపిస్తున్నాను” అని రాసాడు. విజయ్ నిద్రమత్తులోనే ఆ వీడియోలు, ఫోటోలు చూసాడు. ఆ తరువాత కళ్ళు మూసుకుని మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు. కాని అతనికి ఆ వీడియో మెదడులో తొలచసాగింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అనుమానంతో కంగారుగా వెంటనే లేచి నిద్రమత్తు వదిలించుకుని ఆ వీడియోని మళ్ళీ చూడసాగాడు. పాజ్ చేసి, జూమ్ చేసి మరీ అనుమానంగా ఆ వ్యక్తిని మళ్ళీ చూసాడు. ఆమె అతనికి కనకదుర్గ లాగా అనిపించింది. అయినా నమ్మశక్యం కాలేదు అతనికి. మళ్ళీ మళ్ళీ చూసాడు. కంగారుగా అప్పుడే మల్లేశ్వరరావుకి ఫోన్ చేసాడు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. అలానే కంగారుతో కూడిన అనుమానంతో నిద్రకు ప్రయత్నించాడు. కానీ టెన్షన్ వల్ల నిద్ర పట్టలేదు. అలా ఆ రాత్రి విజయ్ భారంగా గడిపాడు. ఆ మరునాడు ఉదయం ఎనిమిదింటికి మళ్ళీ మల్లేశ్వరరావుకి ఫోన్ చేసాడు విజయ్. ఈసారి మల్లేశ్వరరావు ఫోన్ లిఫ్ట్ చేసాడు. అతనికి విజయ్ తనకున్న అనుమానాన్ని వివరించాడు.

మల్లేశ్వరరావు “ఉన్నపళంగా మీరు ఇప్పుడే మన ఆశ్రమానికి రండి. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకుందాం” అని అన్నాడు. దాంతో విజయ్ అప్పటికప్పుడు ఆశ్రమానికి బయలుదేరాడు. విజయ్ ఆ వీడియోని మల్లేశ్వరరావుకు చూపించాడు. ఆ వీడియోలో విజయ్ చూపించిన మహిళను గుర్తుపట్టిన మల్లేశ్వరరావు ఆమె దగ్గరకు విజయ్‌ను తీసుకెళ్ళాడు. విజయ్ ఆమెను చూసి షాక్ అయ్యాడు. ఆమె విజయ్ పిన్ని కనకదుర్గనే. ఆమె దగ్గరకు వెళ్ళి “పిన్నీ! నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి?” అని బాధతో అడిగాడు. అతని కళ్ళవెంట కన్నీళ్ళు కారసాగాయి. ఆమె అమాయకంగా విజయ్‌ను చూస్తూ “ఏయ్! ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావ్?” అని అడిగింది. అది విన్న విజయ్ కంగారుగా “పిన్నీ! నేను విజయ్ గాడిని. గుర్తుపట్టలేదా? రాహుల్ ఎక్కడున్నాడు?” అని ఏడుస్తూనే అడిగాడు. దాంతో ఆమె “రాహుల్ ఎవరు బాబు?” అని అంది. ఇదంతా గమనిస్తున్న మల్లేశ్వరరావు విజయ్ ను ఓదార్చసాగాడు.

“విజయ్ గారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, అయినా మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్నాను” అని అన్నాడు మల్లేశ్వరరావు. విజయ్ కన్నీళ్ళు తుడుచుకుంటూ “మల్లేశ్వరరావు గారు! ఈ‌మె నా సొంత పిన్ని. మా అమ్మకు సొంత చెల్లెలు. ఈమెను ఇక్కడికి ఎవరు చేర్చారు?” అని ఆత్రుతగా అడిగాడు. మల్లేశ్వరరావు రిజిస్టర్ బుక్ చూసి “ఈమె గురించిన వివరాలు లేవు సార్! కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈమెను రైల్వే పోలీస్ సిబ్బంది చూసారు. ఒకేచోట కూర్చుంటూ, పడుకుంటూ రెండు రోజులుగా ఉందిట. దాంతో అనుమానం వచ్చి పోలీసులు ఈమెను వాకబు చేశారు. కానీ ఈమె ఏమి అడిగినా “తెలియదు‌” అని సమాధానం చెప్పింది. పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉంది. అంటే ఈమెకు మతి భ్రమించింది. గతం గుర్తులేదు. దాంతో పోలీసువారు ఈమెను మాకు అప్పగించారు. అప్పటినుంచి ఈమె మా దగ్గరే ఉంటోంది” అని వివరించాడు. అది విన్న విజయ్‌కి ఏమి మాట్లాడాలో తెలియలేదు.

దాంతో మల్లేశ్వరరావు “ఈమెను ఇక్కడికి తీసుకువచ్చిన తరువాత పోలీసువారు సిసి కెమెరాలో చూసారు. అప్పుడు తెలిసింది ఏమిటంటే ఎవరో ఒక వ్యక్తి తలకి టోపి పెట్టుకుని, ముఖానికి మాస్క్ ధరించి ఈమెను ప్లాట్‌ఫారం మీద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఈమె చేతిలో ఒక ప్లాట్‌ఫారం టికెట్ దొరికింది” అని తనకు తెలిసిన విషయాన్ని వివరించి చెప్పాడు. అది విన్న విజయ్ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మల్లికార్జునరావుతో “సార్! ఈమె నాకు పిన్ని మాత్రమే కాదు. నాకు మరో తల్లి. నన్ను చిన్నప్పుడు గారాబంగా చూసింది. ఈమెను రైల్వేస్టేషన్లో వదిలేసింది ఈమె కుమారుడు రాహుల్ అయ్యుంటాడు. మీరు అనుమతిస్తే నేను ఈమెను నాతో మా ఇంటికి తీసుకెళ్తాను” అని అభ్యర్థించాడు. దానికి మల్లేశ్వరరావు ఆలోచిస్తూ “సార్! ఈమెను మీతో పంపడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మన ఆశ్రమం రూల్స్ ప్రకారం ఎవరినైనా ఆశ్రమం నుండి తిరిగి పంపించాలి అంటే, వారిని చేర్పించిన వారికే అప్పగించాలి. కానీ ఈమెను చేర్పించినవారు పోలీసులు కాబట్టి తిరిగి వారికే అప్పగించలేం. ఈ పరిస్థితుల్లో మీరు ఒక పని చేయండి. ఈమె మీకు పిన్ని అని చెప్పగలిగే వారిని ఎవరినైనా సాక్షిగా తీసుకురండి. వారి సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకుని ఈమెను మీతో పంపిస్తాము” అని అన్నాడు.

దానికి విజయ్ “సరే సార్” అని నళినికి ఫోన్ చేసాడు. నళినికి విషయం అంతా చెప్పాడు. నళిని ఆలోచిస్తూ “ఏం చేద్దాం?” అని అడిగింది. విజయ్ స్థిరంగా “అమ్మను తీసుకుని నువ్వు ఆశ్రమానికి రా” అని చెప్పాడు. అది విన్న నళిని ఆశ్చర్యపోయి “అత్తయ్య వస్తుందా?” అని అనుమానంగా అడిగింది. విజయ్ నమ్మకంగా “వస్తుంది. ఇక్కడ జరిగిన విషయం మొత్తం అమ్మకు చెప్పు.” అని గట్టిగా చెప్పాడు. దాంతో నళిని “సరే ప్రయత్నిస్తాను” అని ఫోన్ కట్ చేసి గాయత్రికి విషయం మొత్తం చెప్పింది. అది విన్న గాయత్రి షాక్ అయ్యింది. బాధతో “వెంటనే ఆశ్రమం వెళ్ళి కనకదుర్గను తీసుకొద్దాం. పోదాం పద” అని నళినిని లేవదీసింది. అలా గాయత్రి, నళిని ఇద్దరూ కలిసి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఆశ్రమంలో విజయ్ వీళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తున్నాడు. దాంతో వచ్చిన ఆ ఇద్దరికీ కనకదుర్గను చూపించాడు. ఆమెను అలాంటి స్థితిలో చూసిన గాయత్రి నిర్ఘాంతపోయింది. ఏడుస్తూనే కనకదుర్గకు తనను తాను గుర్తు చేయసాగింది.

ఆమెను చూసిన కనకదుర్గ “ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావ్?” అని అమాయకంగా అడిగింది. ఇదంతా చూస్తున్న విజయ్ అప్రయత్నంగా ఏడ్చేసాడు. అలా కన్నీళ్ళతోనే మల్లేశ్వరరావు దగ్గరకు వెళ్ళి “సార్! ఈమె మా అమ్మ గాయత్రి మీకు తెలుసు కదా! ఈమె చెప్తుంది మా పిన్ని గురించి” అని ఆవేదనతో అన్నాడు.ఆ మాటలు విన్న గాయత్రి “మల్లేశ్వరరావు గారు! ఈమె నా సొంత చెల్లెలు కనకదుర్గ. కారణం ఏమిటో తెలియదు కానీ ఈమె మతిస్థిమితం కోల్పోయింది. ఎవరినీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. నేను రాగానే ఈమెకు మంచి శాలువా కప్పి ఉంచారు. చలికి కాబోలు. కానీ నేను మీరు నమ్మటానికి మీకో విషయం చెప్తాను. ఈమెకు కుడిచెయ్యి మణికట్టు కింద ‘డాక్టర్ లిల్లీ ఎంబిబిఎస్, ఐఎఎస్’ అని రాసుంటుంది, కావాలంటే చూడండి” అని ఆవేశంగా అంటుంది.

అది విన్న మల్లేశ్వరరావు ఆశ్చర్యంతో కనకదుర్గ కుడిచెయ్యి గమనించాడు. గాయత్రి చెప్పినట్లే ఉండటంతో మల్లేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యంతో “మేడమ్ గారు! మీరు చెప్పినట్లే ఉంది. ఈమె డాక్టరా? లేక కలెక్టరా? లేక రెండూనా?” అని అడిగాడు‌.గాయత్రి కన్నీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ “మా నాన్న ‘కనకదుర్గ’ అని పెట్టిన దేవత పేరు ఈ కనకదుర్గకు నచ్చలేదు. అందుకే తనకు తానుగా ‘లిల్లీ’ అని పేరు మార్చుకుంది. ఎప్పటికైనా డాక్టర్ కావాలని లిల్లీ కోరిక. అందుకని మా నాన్నకు చదివించే స్తోమత లేకపోయినా డాక్టర్ కావాలని ఇంటర్ బైపిసిలో చేరింది. చేరాక ‘డాక్టర్ లిల్లీ ఎంబిబిఎస్’ అని పచ్చబొట్టు పొడిపించుకుంది. కానీ ఆ తరువాత ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు రాక డిగ్రీలో చేరింది. డిగ్రీలో చేరాక ఐఎఎస్ అధికారిణి అవ్వాలని ప్రిపేర్ అయ్యేది. అప్పుడు ‘ఐఎఎస్’ అనే అక్షరాలు కూడా పచ్చపొడిపించుకుంది. చివరికి ‘డాక్టర్ లిల్లీ ఎంబిబిఎస్, ఐఎఎస్’ అనే అక్షరాలు చేతి మీద స్థిరపడ్డాయి. అలా డిగ్రీ పూర్తి అయ్యాక ఐఎఎస్ పరీక్ష రాసినా కూడా అందులో కూడా సెలెక్ట్ కాలేదు. ఆ పచ్చబొట్టు మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. ఈమెను నేను నాతో మా ఇంటికి తీసుకెళ్తాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని అడిగింది.

దాంతో మల్లేశ్వరరావు ఒప్పుకున్నాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి కనకదుర్గ అలియాస్ లిల్లీని గాయత్రికి అప్పగించాడు. అదే సమయంలో కనకదుర్గను తమ వద్ద చేర్చిన పోలీసులకు సమాచారం అందించాడు. విజయ్ తన తల్లి, పిన్ని, భార్యతో ఇంటికి చేరాడు‌. ఆ రోజు రాత్రి భోజన సమయంలో మారాం చేస్తున్న కనకదుర్గను, గాయత్రి బుజ్జగించి బలవంతంగా భోజనం పెట్టి, తన గదిలో తన పక్కనే పడుకోబెట్టుకొని నిద్రపుచ్చింది. కనకదుర్గ పడుకున్న తరువాత గాయత్రి భోజనం చేయసాగింది. అప్పుడు గాయత్రి దగ్గరకు విజయ్ వచ్చి కూర్చున్నాడు. “అమ్మా! పిన్నిని ఇంటికి తీసుకురావడానికి నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు. పాత విషయాలు మనసులో పెట్టుకుంటావని అనుకున్నాను” అని సందేహంగా అన్నాడు.

దానికి గాయత్రి నవ్వుతూ “నేను నిన్ను కని, పెంచిన తల్లినిరా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? గొడవలు వేరు, అభిప్రాయ భేదాలు వేరు. నేను పాత విషయాలను అభిప్రాయ భేదాలుగా మాత్రమే చూసాను. ఒక గొడవగా చూడలేదు. మేమిద్దరం తోబుట్టువులమే కదా. తనకు పురిటి స్నానం నేనే చేయించాను. మతిస్థిమితం కోల్పోయిన తనను అలా చూసేసరికి మనసులో ఒకటే ఆవేదన. దాంతో కళ్ళ వెంట నీళ్ళు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని, పాశాన్ని ఏ డబ్బు, ఆస్తులు విడదీయలేవు. ఇక నుంచి నువ్వు నీ పిన్ని విషయంలో నిశ్చింతగా ఉండు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు తన బాధ్యత నాదే” అని అంది.ఆ మాటలకి విజయ్ తల్లి చేతిలో చెయ్యి వేసి సంతృప్తిగా ధన్యవాదాలు చెప్పాడు.

Exit mobile version