[డా. సి. భవానీదేవి రచించిన ‘కలం యోధుడు శ్రీ కోటంరాజు రామారావు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.]


ఇది, భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన వ్యాసాలు, మరియు సంపాదకీయాల ద్వారా దేశ ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ప్రముఖ పాత్రికేయుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ కోటంరాజు రామారావుగారి జీవిత చరిత్ర. ఈయన ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం నడిపిన ‘నేషనల్ హెరాల్డ్’ అనే ఆంగ్లపత్రికకి ప్రధాన సంపాదకుడిగా, నిస్వార్థంగా పనిచేసిన ఉత్తమ పాత్రికేయుడు. అనేక ఆంగ్ల దినపత్రికలలో పనిచేసిన తెలుగువాడు. శ్రీమతి భవానీదేవి గారు కోటంరాజు వారి ఆడపడుచు. శ్రీ కోటంరాజు రామారావుగారు ఆమెకు పెదత్రండ్రి వరస. ఆమె తన తండ్రిగారి కోరికపై శ్రీ రామారావు గారి జీవిత చరిత్ర రాశారు.
పాత్రికేయుడిగా మనగలగాలంటే ఓర్పు కావాలనీ, ఎక్కువ శ్రమ పడాలనీ, వృత్తిని వీరోచిత కార్యంలా భావించాలనీ తలచేవారు శ్రీ రామారావుగారు. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమికొట్టే యుద్ధంలో వారు జర్నలిజం వృత్తిని సాధనంగా ఎంచుకున్నారు. పలు సందర్భాల్లో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, ఇందిరాగాంధీ, బీ.ఆర్. అంబేద్కర్, డా. రాంమనోహర్ లోహియా రామారావుగారికి వార్తాపత్రికలపట్ల గల అంకితభావాన్నీ, నిబద్ధతనీ శ్లాఘించారు.
1897లో ప్రకాశం జిల్లా చీరాలలో జన్మించారు శ్రీ రామారావుగారు. తండ్రి శ్రీ నారాయణరావు పంతులుగారు తెలుగు, సంస్కృత పండితులు. తల్లి వెంకాయమ్మ గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహిళ. అలా తల్లిదండ్రుల నుండి పాండిత్యం, త్యాగనిరతి వారసత్వంగా అందుకున్నారు. ఆ శక్తి వారి వ్యక్తిత్వాన్ని ఉదాత్త మరియు ఉత్తమ ప్రస్థానం వైపు నడిపించింది. వీరి అన్నగారు శ్రీ పున్నయ్య నడిపే ‘హ్యుమానిటీ’ అనే ఆంగ్ల పక్షపత్రికలో, అన్నగారికి సహాయంగా ఉంటూ విద్యార్థి దశ నుంచే పాత్రికేయ కృషిని ప్రారంభించారు. రామారావు గారు ఈ వృత్తిని ఒక పవిత్ర దీక్షగా స్వీకరించారు. జర్నలిస్టు వర్గానికి ఒక ప్రామాణికతను ఏర్పరిచారు.
‘నేషనల్ హెరాల్డ్’లో ప్రధానంగా పనిచేసినా, ఆయన మొత్తం పాత్రికేయ ప్రస్థానం 41 సంవత్సరాలు. ‘ది న్యూస్ టైం’, ‘ది లీడర్’, ‘ది పయోనీర్’ వంటి 25 ఇంగ్లీష్ పత్రికలలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఎక్కడ పని చేసినా ఆయా పత్రికలలో తాజా వార్తల్ని, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సేకరించి అందించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వారు రాసిన సంపాదకీయాలు ప్రభుత్వ వ్యతిరేక రచనలు అన్న అభియోగంతో వారిని బ్రిటిష్ ప్రభుత్వం, లక్నో జిల్లా జైలులో ఆరు నెలలు నిర్బంధించింది.
వారి ఉద్యోగపర్వంలో పాఠకులకు అద్భుతం అనిపించే అనేక సాహసాలు చేసిన సందర్భాలు ఈ జీవిత చరిత్రలో ఉన్నాయి. అవి చదివేవారి మనసుల్లో దేశం పట్ల ప్రతి పౌరుని యొక్క బాధ్యతను గుర్తుచేస్తాయి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో పాత్రికేయ పాత్రలో ఒక వీర సైనికుడిలా తన కలంతో బాధ్యత నిర్వహించిన పోరాట యోధుడు రామారావుగారు. వీరు స్వాతంత్ర్య సమర చరిత్రను, తన పాత్రికేయ ప్రస్థానాన్ని కలిపి ‘ది పెన్ యాజ్ మై స్వోర్డ్’ అనే రచన చేశారు. 1961లో రామారావు గారి మరణానంతరం ప్రచురించబడిన ఈ రచనకు జవహర్లాల్ నెహ్రూ గారు ముందుమాట రాసి వారిని గౌరవించారు. వీరు రాజ్యసభ సభ్యుడిగా దాదాపు మూడు సంవత్సరాలు పని చేశారు.
పాత్రికేయ వృత్తికి గౌరవ ప్రతిష్ఠలు తెచ్చి నాటినుండి నేటి వరకు జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా నిలబడిన మహోన్నతుడు శ్రీ కోటంరాజు రామారావుగారు. తాను నమ్మిన ఆదర్శం కోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన రామారావుగారు ధన్యజీవి. దేశం పట్ల వారి సేవానిరతి అనుపమానమైనది. ఈ లఘు గ్రంధాన్ని వయోధిక పాత్రికేయ సంఘం వారి ఆధ్వర్యంలో, అనుభవజ్ఞులైన సీనియర్ పాత్రికేయ ప్రముఖులు శ్రీ కె.రామచంద్రమూర్తి, శ్రీ దాసు కేశవరావు, శ్రీ వల్లీశ్వర్, శ్రీ ఉడయవర్లు వంటి ఉద్ధండులైన వారి చేత ఆవిష్కరింప చేయడం ఎంతో సముచితంగా ఉంది. విశిష్ట అతిధిగా శ్రీ మామిడి హరికృష్ణ, సంచాలకులు, తె.రా.ప్ర భాషా సాంస్కృతిక శాఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రేక్షకుల సమక్షంలో రవీంద్రభారతిలో 2023, సెప్టెంబర్ నెల,15వ తేదీన జరిగింది.
శ్రీ రామారావుగారి జీవన ప్రస్థానాన్ని గురించి శ్రమపడి విషయ సేకరణ చేసి క్లుప్తమైన, పఠనీయమైన జీవితచరిత్రగా మలచిన విదుషీమణి, బహు గ్రంథకర్త, ప్రముఖ కవయిత్రి డాక్టర్ సి భవానీదేవి గారు అభినందనీయులు.
వార్తాపత్రికలు వివిధ పార్టీల యాజమాన్యాల చేతుల్లో ఆయాపార్టీల కరపత్రాలుగా ఉండడం సర్వసాధారణం అయిన రోజులివి. ఉత్తమ విలువలు కలిగిన పాత్రికేయ వృత్తిని ఎన్నుకొని, ఆ వృత్తికే వన్నె తెచ్చిన శ్రీ కోటంరాజు రామారావుగారి జీవిత చరిత్ర జర్నలిస్టులందరికీ గీతోపదేశం లాంటిది. వారంతా రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని, వీలయినంతవరకూ తమ వృత్తికి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నించడం దేశభక్తి కాగలదు.
నేడు తమ తమ దృక్కోణాలతో, వివిధ దినపత్రికలు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఏది యథార్ధమో, ఏది అసత్యమో తెలీక దిక్కుతోచని దీనావస్థలో ఉన్న మనవంటి సామాన్య పాఠకులకి, ఈ పుస్తకం చదివడం మనసుకు గొప్ప ఊరటనిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది.
***


రచన: డా. సి. భవానీదేవి
పేజీలు: 125
వెల: ₹ 100/-
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్ ప్రై.లి.
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట
విజయవాడ – 520 004.
ఫోన్: 0866-2436643
emescovja@gmail.com
sahithi.vja@gmail.com
ఆన్లైన్లో
https://logilitelugubooks.com/book/kalam-yodudu-sri-kotamraju-rama-rao-dr-c-bhavani-devi

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
6 Comments
పుట్టి నాగలక్ష్మి
‘కలం యోధుడు – శ్రీకోటంరాజు రామారావు’లఘుగ్రంథాన్ని వారి ఆడపడుచు శీమతి సి( కోటంరాజు) భవానీదేవి రాయడం ముదావహం. ఒక పాత్రికేయుడిగానే గాక గొప్ప



దేశభక్తుడిగా కూడా పేరు పొందడం చాలా విశేషం.వీరు నెహ్రూ కుటుంబానికి చెందిన ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక సంపాదకుడుగా పని చేయడం,వీరికి ప్రముఖ జాతీయ నాయకులతో పరిచయాలుండడం తెలుగు వారిగా మనం గర్వించి, గౌరవించవలసిన అంశాలు. భవానీదేవి గారు తమ తండ్రి గారి కోరికపై గ్రంథరచన చేయటం ప్రశంసనీయం.ఈ కాలపు పాత్రికేయులకు భగవద్గీత వంటి ఈ గ్రంథ రచయిత్రి భవానీదేవి గారికి, పుస్తక పరిచయం చేసిన గౌరీలక్ష్మి గారికి, ప్రచురించిన సంచిక వారికి అభినందనలు.
అల్లూరి Gouri Lakshmi
Thanku Nagalakshmi
భవాని
ధన్యవాదాలు గౌరి
రామారావుగారిని మాతండ్రిగారు ప్రముఖ న్యాయవాది వల్లూరి వెంకటేశ్వర్లు గారి ఇంటిలో కలిశారు.మాట్లాడారు.ప్రభావితమయ్యారు.
ఆరోజు ఇంటికి వచ్చినాకు ఈ పని చేయమని చెప్పారు.బంధువు కావటం యాదృచ్ఛికం. నేను ముగ్గురి జీవిత చరిత్రలు రాశాను. అందరు వారి వారి రంగాలలో మహనీయులే
సమీక్ష ప్రచురించిన సంచిక వారికి కృతఙ్ఞురాలిని
Durga pakalapati
ఒక గొప్ప దేశభక్తి గల సాహితీవేత్తగురించి తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది.ప్రస్తుత సమాజం లో ఈ రచన ఆదర్శనీయం.రచయిత్రి భవానీ గారికి,చక్కటి సమీక్ష వ్రాసిన గౌరీ లక్ష్మి గారికి ధన్యవాదాలు.
Trinadha Rudraraju
The current generation is ignorant of the achievements made by great individuals through selfless industry during and after independence, notably Telugu individuals. The portrait of Sri Kotamraju Ramarao, a stalwart in journalism who has been a pride as he has held the high seat in print media and the National Herald in particular, can be found in Kalam Yodhudu, a biography by Dr. C. Bhavanidevi. As stated in our national leaders’ comments, his talent and personality speak for themselves. I congratulate Bhavanidevi Garu for her work and as well as Gouri Lakshmi garu for excellent review.
Lalitha Goteti
కోటంరాజు రామారావు గారి గురించి
భవానీ గారు తెలియజేయడం ఎంతో ఆనందించాల్సిన విషయం. వారికృషి శ్లాఘనీయం. గౌరిలక్ష్మి గారు ఇచ్చిన సమీక్ష
చాలా విలువైనది. ఇరువురికి ధన్యవాదాలు.
గోటేటిలలితాశేఖర్.