Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కలలు చెప్పిన నిజాలు

[ప్రపంచ జానపద కథలలో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న కథ ‘కలలు చెప్పిన నిజాలు’.]

 

క ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతను చానా మంచోడు. రాజ్యమంతా హాయిగా సుఖశాంతులతో నిండి ఉన్నదని అందరూ చెప్పే మాటలు విని విందులు వినోదాలతో కులాసాగా గడపసాగాడు. ఒకసారి ఆయన నిద్రపోతా వుంటే తెల్లవారుజామున ఒక కల వచ్చింది. అందులో రాజు చుట్టూ కొన్ని నక్కలు భయంకరంగా అరుచుకుంటూ తిరుగుతున్నట్లు కనపడింది. ఆ అరుపులకు, కేకలకు అదిరిపడి నిద్ర లేచాడు. చూస్తే ఇంకేముంది.. కల. నిద్రపోదామని మరలా ప్రయత్నించాడు గానీ మాటిమాటికి ఆ కలనే గుర్తుకు రాసాగింది.

దాంతో పొద్దున్నే పండితులను, మేధావులను, ఆలోచనాపరులను అందరినీ పిలిపించి తనకు వచ్చిన కలకు అర్థం ఏమిటో వివరించమన్నాడు. అందరూ తలా ఒక జవాబు చెప్పారు కానీ రాజుకు ఒక్కటీ నచ్చలేదు. దాంతో ఎవరైతే తనకు సరైన సమాధానం చెబుతారో వాళ్లకు వేయి బంగారు వరహాలు బహుమానంగా ఇస్తానని ఊరు ఊరంతా దండోరా వేయించాడు. అనేకమంది మేము చెబుతామంటే మేము చెబుతామంటూ గుంపులు గుంపులుగా వచ్చారు గానీ ఏ ఒక్కరి సమాధానము రాజుకు సరైనదిగా అనిపించలేదు.

ఆ రాజ్యంలోని ఒక చిన్న పల్లెలో ఒక యువకుడు ఉన్నాడు. వానికి ఈ విషయం తెలిసింది. బహుమతి మీద ఆశ పుట్టింది. తనకు తెలిసిన జవాబు చెబుదామని బయలుదేరాడు. అలా పోతూవుంటే దారిలో ఒకచోట ఒక పెద్ద పాము అడ్డంగా పడుకొని కనపడింది. దాన్ని చూస్తూనే అదిరిపడి వెనక్కి తిరిగాడు. అంతలో ఆ పాము “ఓ మిత్రమా.. ఆగు. భయపడకు. నేను ఎవరినీ ఏమీ చేయనులే. ఇంతకూ ఎక్కడికి వెళుతున్నావు” అని అడిగింది.

ఆ మాటలకు ఆ యువకునికి ధైర్యం వచ్చింది. విషయమంతా వివరించి “ఎలాగైనా సరే.. రాజు కలకు సరైన అర్థం వివరించి బహుమతి దక్కించుకోవాలి” అన్నాడు.

దానికి ఆ పాము “ఓ మిత్రమా.. రాజుకు వచ్చిన కలకు సరయిన సమాధానం నాకు తెలుసు కానీ నీకు ఇచ్చే బహుమతిలో సగం వాటా నాకు ఇస్తానంటే వివరంగా విప్పి చెబుతా” అంది. దానికా యువకుడు “సరే” అన్నాడు.

అప్పుడు ఆ పాము “మిత్రమా.. నక్క పెద్ద జిత్తులమారిది. అడవిలో అన్నింటినీ మోసం చేసి బతుకుతుంటుంది. నమ్మినవారిని నిలువునా ముంచేస్తుంది. అటువంటి నక్కల గుంపు రాజు చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చిందంటే అర్థం రాజ్యంలో మోసగాళ్లు, దొంగలు, నేరస్థులు ఎక్కువైపోయారని. వెంటనే రాజు కఠిన చర్యలు తీసుకొని అటువంటి మోసగాళ్లనంతా బంధించకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది” అని వివరించింది.

ఆ యువకుడు సంబరంగా రాజు దగ్గరికి పోయి ఒక్క మాట కూడా పొల్లు పోకుండా పాము చెప్పింది చెప్పినట్టుగా అప్పజెప్పాడు. ఆ మాటలు వింటూనే రాజు చాలా సంబరపడ్డాడు. “సరైన సమయానికి సరైన సమాధానం చెప్పి నా కళ్ళు తెరిపించావు. మరచిపోయిన బాధ్యతను గుర్తు చేశావు” అంటూ మెచ్చుకొని వేయి బంగారు వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు.

ఆ యువకుడు ఆ బంగారు వరహాల మూట తీసుకొని పోతూవుంటే పాము గుర్తుకు వచ్చింది. వచ్చిన బహుమతిలో సగం దానికి ఇవ్వాలి కదా.. కానీ వానికి ఇవ్వబుద్ధి కాలేదు. దాంతో ఆ పాము కంట పడకుండా ఇంకొక దారిలో ఇంటికి చేరుకున్నాడు. ధనాన్ని మొత్తం తానే కొట్టేసి హాయిగా జల్సాగా బతకసాగాడు.

రాజు తన దేశంలోని మోసగాళ్లను, దొంగలను, నేరస్థులను, అవినీతిపరులను పట్టుకొని కారాగారంలో బంధించి కఠినంగా శిక్షించసాగాడు. రాజ్యాన్ని మరలా దారికి తీసుకొని వచ్చాడు.

అలా కొంతకాలం గడిచిపోయింది.

ఒకరోజు రాజు నిద్రపోతా వుంటే మరొక కల వచ్చింది. ఆ కలలో భయంకరంగా ఉన్న ఒక పెద్ద కత్తి సరిగ్గా రాజు తల పైన గది కప్పుకు వేలాడుతూ కనపడింది. రాజు చుట్టూ కొన్ని కత్తులు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ కత్తుల చప్పుళ్ళకు అదిరిపడి నిద్రలేచాడు. మరలా నిద్రపోదామని కళ్ళు మూసుకున్నా మాటిమాటికి ఆ కత్తులే కళ్ళ ముందు కనపడసాగాయి. దాంతో.. ఆ కలకు అర్థం ఏమిటా అని ఆలోచిస్తూ వుంటే అంతకుముందు సరైన సమాధానం చెప్పిన పల్లెటూరి యువకుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే పొద్దున్నే లేచి ఆ పల్లెటూరు యువకున్ని పిలిపించమని మంత్రికి చెప్పాడు.

విషయం తెలిసిన పల్లెటూరి యువకుడు అదిరిపడ్డాడు. ఇంతకుముందు ఆ పాము సాయం చేయబట్టి చెప్పగలిగాడు గానీ ఇప్పుడెట్లా. తిరిగి ఆ పామునే అడుగుదామా అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేశాడు. ఎంత ఆలోచించినా సమాధానం చిక్కలేదు. దాంతో ఇక లాభం లేదనుకొని ఆ పాము వున్న పుట్ట దగ్గరికి చేరుకున్నాడు. “ఓ నాగరాజా.. నన్ను మన్నించు. నేను చేసిన మోసాన్ని మనసులో పెట్టుకోకు. ఎలాగైనా సరే ఈ ఒక్కసారికి గట్టెక్కించు. నువ్వు తప్ప ఎవరు నన్ను కాపాడలేరు” అంటూ వేడుకున్నాడు. కానీ పాము మాత్రం బయటికి రాలేదు. దాంతో అక్కడనుంచి ఒక్క ఇంచు కూడా పక్కకు కదలకుండా పదేపదే ప్రాధేయపడసాగాడు. దాంతో చివరికి ఆ పాము పుట్టలోంచి బయటికి వచ్చింది.

“చెప్పు మిత్రమా.. ఏమైంది. ఎందుకు ఇలా మరలా నా కోసం వచ్చి సతాయిస్తున్నావు” అంది. అప్పుడు ఆ యువకుడు జరిగిందంతా వివరించి ఆ కలకు అర్థం చెప్పమన్నాడు. పాము కాసేపు ఆలోచించి “సరే చెబుతా.. కానీ ఇంతకుముందు సగం బహుమతి ఇవ్వలేదు కాబట్టి ఈసారి బహుమతి మొత్తం నాకే ఇచ్చేయాలి. సరేనా” అంది. ఆ యువకుడు అలాగేనంటూ తల ఊపాడు.

పాము కాసేపు ఆలోచించి “మిత్రమా.. కత్తి అనేది యుద్ధంలో వాడే ఆయుధం. సరిగ్గా అది గది పైకప్పు మీద వేలాడుతూ ఉందంటే అతి త్వరలో ఏ దేశమో మీ రాజ్యం మీదికి దాడి చేయబోతుందని అర్థం. వెంటనే యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి. లేకుంటే ఓటమి తప్పదు” అని వివరించింది.

ఆ యువకుడు సంబరంగా రాజు దగ్గరికి పోయి పాము చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా అప్పజెప్పాడు. ఆ సమాధానానికి రాజు చానా సంబరపడి “ఓ యువకుడా.. సరియైన సమయానికి సరియైన సమాధానం చెప్పి దారి చూపించావు. రాజ్యాన్ని కాపాడావు” అంటూ మెచ్చుకొని ఐదు వేల బంగారు వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు.

ఆ యువకుడు ఆ వరహాలు తీసుకొని ఇంటికి పోతూవుంటే పాము మతికి వచ్చింది. ఆ బహుమతి అంతా దానికే ఇవ్వాలంటే వాని మనసు అస్సలు ఒప్పుకోలేదు. దాంతో ఒక కత్తి తీసుకొని పుట్ట దగ్గరికి చేరుకున్నాడు. పాము ఆ యువకున్ని చూసి “ఏం మిత్రమా.. నా కోసం బహుమతి మొత్తం తీసుకొచ్చావా” అని అడిగింది. దాని మాటలకు యువకుడు కోపంగా “అసలు నీవు బ్రతికుంటే కదా బహుమతి మొత్తం తీసుకోవడానికి. ఇప్పటికిప్పుడే నిన్ను సక్కగా పైకి పంపిస్తా చూడు” అంటూ కత్తి తీసుకొని ఎగిరి దాని మీదికి దుకాడు. పాము అదిరిపడి పక్కకు జరిగింది. కత్తి తగిలి దాని తోక చివరి భాగం ఎగిరి పక్కకు పడింది. రెండో దెబ్బ పడక ముందే పాము సర్రున పక్కనున్న పొదల్లోకి దూరి కనపడకుండా పారిపోయింది. ఆ యువకుడు కత్తి తీసుకొని ఆవేశంగా కనపడిన పొదలన్ని నరుక్కుంటూ ఆ పాము కోసం వెతికాడు. పుట్టనంతా నాశనం చేశాడు. కానీ పాము మాత్రం ఎక్కడా కనపడలేదు. దాంతో ఆ బంగారు వరహాల మూట తీసుకొని ఊరికి వెళ్ళిపోయాడు.

రాజు సైనికులనంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్తవారిని సైన్యంలో చేర్చుకున్నాడు. కోట గోడలన్నీ పటిష్టం చేసుకున్నాడు. కొత్త ఆయుధాలు సమకూర్చుకున్నాడు. గూఢాచారులను ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మని చుట్టూ ఉన్న దేశాలకు పంపించాడు. కుడివైపున ఉన్న ఒక రాజు రహస్యంగా తన మీదకు దాడి చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసింది. అతను దాడి చేయకముందే తానే దాడి చేసి ఆ రాజును తరిమికొట్టాడు. ఆ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. అట్లా కొంత కాలం గడిచిపోయింది. రాజ్యంలో గొడవలన్నీ తగ్గిపోయాయి. యుద్ధ భయాలు తొలగిపోయాయి. అంతా ప్రశాంతంగా మారిపోయింది.

ఒకరోజు రాత్రి రాజు నిద్రపోతా వుంటే మరొక కల వచ్చింది. అందులో బాగా బలంగా పుష్టిగా ఉన్న ఒక ఎద్దు హాయిగా మేత మేస్తూ తిరుగుతూ వుంటే లేగదూడలు ఎగిరి గంతులు వేస్తూ కనపడ్డాయి. వాటి మెడలోని చిన్న మువ్వల గంటల మధురమైన చప్పులకి రాజు ప్రశాంతంగా చిరునవ్వుతో నిద్ర లేచాడు. కళ్ళ ముందు ఆ కల మాటిమాటికి మతికి రాసాగింది. వెంటనే మంత్రిని పిలిచి “పో.. పోయి ఆ పల్లెటూరి యువకున్ని పిలుచుకొని రాపో. ఈ కలకు సరియైన సమాధానం అతను తప్ప ఎవరూ చెప్పలేరు” అన్నాడు. మంత్రి వెంటనే ఆ యువకునికి కబురు పంపించాడు.

యువకునికి ఏం చేయాలో తోచలేదు. ఎంత ఆలోచించినా రాజుకు వచ్చిన కలకు జవాబు తట్టలేదు. నాగుపామును అడుగుదామా అంటే ఇప్పటికే ఒకసారి మోసం చేశాడు. రెండవసారి ఏకంగా చంపబోయాడు. ఏ మొహం పెట్టుకొని దాని దగ్గరికి పోవాలి అనుకున్నాడు. కానీ రాజుకు ముక్కు మీద కోపం. జవాబు చెప్పకపోతే చంపినా చంపుతాడు. దాంతో ఏదైతే అదైందని తిరిగి నాగుపాము ఉన్న చోటుకే వెళ్ళాడు. “ఓ నాగరాజా.. ఎక్కడున్నావ్. మాటమీద నిలబడని ద్రోహిని మరలా నీ సాయం కోరి వచ్చాను. బిడ్డ చేసే తప్పుల్ని తండ్రి మన్నించినట్లు నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి సాయం చెయ్యి. లేకపోతే ఇక్కడినుంచి ఒక్క ఇంచు కూడా పక్కకు కదలను. అన్నం ముట్టను” అంటూ ఆ పుట్ట దగ్గరే తిండీ నీళ్లు మానేసి రెండు రోజులు కూర్చున్నాడు.

దాంతో చివరికి ఆ నాగుపాము వచ్చి “చెప్పు మిత్రమా.. ఏంటి నీ సమస్య. ఎందుకు మరలా మరలా వచ్చి విసిగిస్తున్నావు” అని అడిగింది. అప్పుడు ఆ యువకుడు రాజుకు వచ్చిన కలంతా వివరించి “ఓ నాగరాజా.. ఈ కలకు అర్థం ఏమిటో తెలియజేయి. ఈసారి నాకు వచ్చే బహుమతి మొత్తం నీకే తెచ్చిస్తా. నన్ను నమ్ము. నన్ను కన్న తల్లి మీద, విద్యాబుద్ధులు చెప్పిన గురువు మీద, అన్నం పెడుతున్న ఊరు మీద.. ఒట్టేసి చెబుతున్నా. ఈసారి పొరపాటున కూడా మోసం చేయను” అన్నాడు.

నాగరాజు కాసేపు ఆలోచించి “మిత్రమా.. ఎద్దు వ్యవసాయానికి గుర్తు. అది బలంగా పుష్టిగా ఉందంటే ఆ దేశమంతా పాడిపంటలతో నిండి కళకళలాడుతూ ఉన్నట్లు. లేగ దూడలు ఆనందంతో గంతులు వేస్తున్నాయి అంటే దేశంలోని ప్రజలందరూ చేతినిండా పనితో, ఇంటినిండా ధాన్యంతో, మనసు నిండా ఆనందంతో, హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లు” అని వివరించింది.

ఆ యువకుడు సంబరంగా రాజు దగ్గరికి పోయి ఉన్నది ఉన్నట్లు ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా అప్పజెప్పాడు. ఆ మాటలకు రాజు చాలా సంబరపడ్డాడు. “శభాష్.. నీలాగా కలలకు సరైన అర్థం వివరించి చెప్పగల సమర్థుడు మన రాజ్యంలో మరొకడు లేడు” అంటూ మెచ్చుకొని ఈసారి ఏకంగా పదివేల బంగారు వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు.

ఆ యువకుడు ఆ వరహాలు తీసుకొని వచ్చిన దారిలో తిరిగి వెళ్ళకుండా మరొక దారిలో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న బంగారమంతా మూటగట్టుకుని, ఆ పదివేల వరహాలతో కలిపి నాగుపాము దగ్గరికి చేరుకున్నాడు. ఆ మొత్తం దాని ముందు పెట్టి “ఓ నాగరాజా.. నిన్ను రెండుసార్లు మోసం చేసి నీ ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నం చేశాను. అయినాసరే అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు. తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. ఇదిగో ముందే చెప్పినట్లు బహుమతి మొత్తం నీకే ఇస్తున్నా. అంతే కాదు ఇంతకుముందు మోసం చేసి ఇవ్వకుండా వెళ్లిపోయిన సొమ్ము కూడా తెచ్చాను. అన్నీ తీసుకో. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను మన్నించు” అన్నాడు కళ్ళనీళ్ళతో.

ఆ మాటలకు నాగరాజు చిరునవ్వుతో “బాధపడకు మిత్రమా.. ఇందులో నీ తప్పేం లేదు. మన చుట్టూ వున్న సమాజం ఎట్లా ఉంటుందో మనమూ అట్లాగే ఉంటాం. అట్లాగే అలోచిస్తాం. అట్లాగే ప్రవర్తిస్తాం. దాని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.

నీకు మొదటిసారి వచ్చిన కల గుర్తుంది కదా.. రాజ్యమంతా మోసాలతో, అబద్ధాలతో, దొంగతనాలతో, నేరస్థులతో, నక్కజిత్తులతో నిండి ఉంది. ఆ సమయంలో నీవు కూడా మోసగానిలాగే ప్రవర్తించావు. నన్ను మోసం చేశావు.

రెండోసారి కల గుర్తుంది కదా.. రాజ్యమంతా గొడవలతో, యుద్ధాలతో, హత్యలతో, భయంకరంగా ఉంది. ఆ సమయంలో నీవు కూడా ఆవేశంతో క్రూరంగా హంతకునిలా ప్రవర్తించావు. నన్ను చంపడానికి చూశావు. నా తోక కూడా నరికేశావు.

మూడవసారి కల గుర్తుంది కదా.. దేశమంతా పచ్చగా, ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా, ధర్మంగా, న్యాయంగా ఉంది. అందుకే నీవు కూడా నీ తప్పు తెలుసుకున్నావు. న్యాయంగా నాకు రావలసిన వాటాను అడగకుండానే తీసుకువచ్చావు. ఇప్పుడు నీ మనసంతా ధర్మం న్యాయంతో నిండి ఉంది. క్షమించమని అడుగుతున్నావు.

మిత్రమా.. బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఎవరైనా సరే మన చుట్టూ ఉండే సమాజ ప్రభావం నుంచి తప్పించుకోలేరు. అందరూ ఎలా ప్రవర్తిస్తే మనమూ అలాగే సొంత ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ నిజమైన తెలివితేటలు గల వ్యక్తి అందరిలో తానూ ఒకరిలా కలిసిపోడు. ఏది న్యాయం ఏది అన్యాయం.. ఏది మంచి ఏది చెడు అని స్వయంగా అలోచించి గుర్తిస్తాడు. ఊరందరూ ఒక దారిలో నడిచినా తాను మాత్రం నిజం వైపే నిలబడతాడు. ధర్మం కోసమే పోరాడతాడు. ఇకపై నీవు కూడా అలాగే అందరిలో ఒకరిలా అసమర్థునిలా మిగిలిపోక సొంత వ్యక్తిత్వంతో నిలబడు. అలాగే ఈ ధనాన్నంతా తీసుకపోయి పదిమందికి సాయం చేస్తూ కలకాలం నిజాయితీగా బతుకు” అంటూ దీవించింది.

Exit mobile version