1
కార్యం
సాధించాలి
‘చిత్త’శుద్ధి ఉండాలేగాని
కార్యం సుసాధ్యం
2
మోసాలకు మూలం
‘హస్త’ లాఘవం
ఎంతమంది
బలౌతున్నారో
3
గ్రంథాలయంలో
ప్రతి గ్రంథ’మూ ల’భించును
చదువుటయే
ఆలస్యం
4
దండిగా
చేపలు కావాలి
‘విశాఖ’పట్నంలో
చేపలకేం కొరత
5
‘ఉత్తర’ దిక్కున
మెరిసె మెరుపులు
దంచి కొట్టింది
వాన
6
గ్రీష్మతాపం
తట్టుకోలేని జనం
‘రోహిణి’లోనే
దంచె జడివాన
7
బండలు
బీటలువారాయి ఎందుకో
‘భరణి’
ఎండలు కదా
8
‘అశ్వని’ని
నిరోధించగలమా?
అది అతి
వేగం అందుకుంటే
9
సింహానికి ఆకలై
దాడి చేస్తే
‘మృగం శిర’స్సు
పగలకుండునా
10
రెండు దేశాల మధ్య
యుద్ధం మొదలైంది
‘ఆరుద్ర’ భూమిలో
ఎన్ని శవాలో
11
నానీల సాహిత్యంలో
పద శ్లేష
‘ఆశ్లేష ‘
అవసరమైనప్పుడు వాడవచ్చా?
12
అక్టోబర్లో
వానలకు ఎదురుచూపులు
‘స్వాతి’చినుకులు
వుంటాయిగా
13
‘జ్యేష్ఠ’
పుత్రుడు
సంసారభారమంతా
అతని నెత్తినే కదా
14
నేను చదువుకుంటాను
‘అనూ రాధ’
అలాగే
చదువుకుందువులే
15
శతధా వివి’ధ
నిష్ఠ’గా ఉండాలి
అప్పుడే
కరోనా సోకకుండేది
16
పాత పాటలు
యెంతో ‘శ్రవణా’నందo
ప్రస్తుతం
పాటలు అర్థం కాని స్థితి
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.