అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది..
కలం కాస్త వెనక్కి వెళితే బాగుంటుందని!
అమ్మ చేతి గోరుముద్దలు..
నాన్న వేలు పట్టుకుని రోడ్డుపై నడకలు..
గురువులు బోధించిన పాఠాలు..
కాళ్ళు అందకపోయినా సైకిల్ సీటెక్కి ఊరంతా చక్కర్లు కొట్టడం..
స్నేహితులతో కలిసి చేసిన అల్లరి ఆటపాటలు..
బావుల్లో ఈతలు..
నేస్తాలతో గిల్లికజ్జాలు..
కాకి ఎంగిళ్ళ తీయని పంపకాలు..
వేప చెట్టెక్కి కోతికొమ్మచ్చి ఆటలు..
ఏదైనా అద్భుతం జరిగి..
ఒక్కసారి కాలం వెనక్కి వెళితే..
బాల్యాన్ని తిరిగి చవి చూడగలిగితే.. భలేగా ఉంటుంది!
కాలం మాత్రం ఇదేమీ పట్టనట్లుగా
నిర్దయగా ముందుకు పరిగెడుతుంటుంది!
జరుగుతున్న ‘నేటి రోజు’ని రేపటికి
మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోమంటూ..!!
కాలం..
‘నిన్న’ ఓ జ్ఞాపకం!
‘నేడే’ జీవితం!
‘రేపు’ ఆశల పయనం!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.