[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]
[తన దగ్గరున్న డబ్బంత వడ్డీకి తిప్పి మోసపోతాడు రాఘవ. పై ఆదాయం మొత్తం పోతుంది. ఇల్లు అమ్మిన సొమ్ములో కేవలం పదిహేనువేల రూపాయలే మిగులుతాయి. ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంటే, తాను మళ్ళీ ఉద్యోగం చేస్తాననీ, తన పోస్టు ఉందేమో కరెస్పాండెంట్ని అడగమంటుంది నీరజ. మొదట వద్దన్నా, నీరజ పట్టుదలని గ్రహించి, అడుగుతాడు. కానీ ఖాళీ లేదంటాడు కరస్పాండెంట్. నీరజ నిరుత్సాహ పడుతుంది. రాఘవ దగ్గర అప్పు తీసుకున్నవాళ్ళల్లో మీరయ్య ఒకడు. మీరయ్య నిజాయితీపరుడే అయినా, అతనూ కష్టాల్లో ఉండడంతో రాఘవ అప్పు తీర్చలేకపోతాడు. ఈలోపు ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక దినపత్రికను ప్రారంభిస్తాడు. మీరయ్య ఆ పత్రికలో విలేకరిగా చేరుతూ, రాఘవకూ అక్కడ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. కొన్నాళ్ళు గడిచాకా, తన బాకీ తీర్చమని రాఘవ అడిగితే, తాను తీర్చలేననీ, కావాలంటే, తన ఆవుని తీసుకెళ్ళి పాల వ్యాపారం చేసుకోమని చెప్తాడు మీరయ్య. ఈలోపు నీరజ రెండో సారి గర్భం దాలుస్తుంది. ఓ రోజు చిన్నక్క రాఘవని చూడడానికి వచ్చి, అతని పరిస్థితి చూసి బాధపడుతుంది. పీలేరుకు వచ్చేసి అక్కడే ఏదో ఒక బతుకుతెరువు చూసుకోమంటుంది. నీరజతో సంప్రదించి, పీలేరు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు రాఘవ. మీరయ్య ఆవుని తీసుకుంటానని చెప్తాడు. ముందుగా వాళ్ళని వెళ్ళి పీలేరులో ఇల్లు తీసుకోమని, తాను ఓ మనిషి చేత ఆవుని పంపిస్తాననీ చెప్తాడు మీరయ్య. అనుకున్నట్టే, పీలేరుకి మారిపోతారు రాఘవవాళ్ళు. మీరయ్య ఆవుని పంపిస్తాడు. చిన్నక్కకు తెల్సిన ఓ వ్యక్తి నుంచి పాలు ఎలా పితకాలో నేర్చుకుంటాడు రాఘవ. ఆవుకి లక్ష్మి అని పేరు పెట్టి పాల వ్యాపారం మొదలుపెడతాడు, నీరజకు ఆడపిల్ల పుడుతుంది. – ఇక చదవండి.]
50. హితోక్తులు
వారం రోజులయ్యాక మరదల్ని తమ్ముడి ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టి వెళ్లింది శాంత.
ఓ మంచి రోజున తోబుట్టువులు, బంధువులు, ఇరుగుపొరుగు వాళ్ల సమక్షంలో కూతురికి ‘విమల’ అని పేరు పెట్టారు ఆ దంపతులు. బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకోసాగారు.
ఇప్పుడు రాఘవ దినచర్య మారిపోయింది. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత ఆవును వెంటబెట్టుకుని ఊరి బయటున్న బీళ్లల్లోకి మేపుకు తీసుకెళ్లొస్తున్నాడు. మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చి ఆవుకు కుడితి తాగిపిస్తాడు. తర్వాత దాన్ని కట్టేసి తాను భోజనం చేసి నడుము వాలుస్తాడు. సాయంత్రం ఆవు దగ్గరికెళ్లి ఇంత గడ్డి దాని ముందు పడేసి పాలు పితుకుతాడు.
ఇప్పుడు రాఘవకు పాలు పితకటం బాగానే ఒంటబట్టింది. ఆ పాలను డిపోకు తీసుకెళ్లి పోసొస్తాడు.
ఆ రోజు సాయంత్రం పాలు పితుకుదామని పొదుగు దగ్గర కూర్చోగానే అటుఇటు కదిలింది ఆవు. అయినా పాలు పితకటానికి ప్రయత్నించాడు. అది స్థిరంగా అయితే ఉండలేదు. దాంతో ఆ రోజు ఆవు తక్కువ పాలిచ్చింది.
ఈ విషయాన్ని పాల వ్యాపారికి చెబితే, అదింక పాలు క్రమంగా తగ్గించేస్తుందని చెప్పాడు. అలాగే జరిగింది.
ఈలోపు షామియానా షాపు పెట్టుకునేందుకు అద్దె అంగడి కోసం వెతకసాగాడు రాఘవ. మెయిన్ సెంటర్లో అయితే అస్సలు అంగడి దొరకటం కష్టమైంది. పైగా అడ్వాన్సు, అద్దె ఎక్కువగానే చెబుతున్నారు.
అయినా పట్టు వదలకుండా షాపు కోసం వెతుకుతూనే ఉన్నాడు.
ఆ రోజు ఆవును మేపుకు తీసుకెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చాడు రాఘవ. ఆవును కుడితి ముందు వదిలిపెట్టి గూటం దగ్గరకెళ్లి శుభ్రం చేస్తున్నాడు.
ఆవు వెనకనే ఎప్పుడొచ్చిందో కానీ రాఘవ మీదికి తన ముందరి కాళ్లను అమాంతం వేసింది. దాంతో అతను నేలపై పడిపొయ్యాడు. వెంటనే లేచి ఆవు అలా చేసినందుకు దాన్ని రెండు దెబ్బలు వేశాడు. మరొకసారీ ఇలాగే చేసింది.
ఈ విషయాన్ని పాల వ్యాపారికి చెప్తే, అది కట్టుకు వచ్చిందనీ, ఎవరైనా ఎద్దును పెట్టుకున్న వాళ్ల దగ్గరికి తీసుకెళ్లి దాటించమని చెప్పాడు. లేదూ పశువులాసుపత్రికి తీసుకెళ్తే డాక్టరు ఆవుకు సూది వేస్తాడని చెప్పాడు.
రాఘవ మరునాడు ఆవును వెంటబెట్టుకుని పశువులాసుపత్రికి వెళ్లి సూది వెయ్యించాడు.
ఆ తర్వాత అది మళ్లీ ఎప్పుడూ రాఘవ మీదికి కాళ్లను వెయ్యలేదు.
రోజులు గడిచేకొద్దీ అది మెల్లమెల్లగా నెలలు నిండి చూలు ఆవుగా మారసాగింది.
ఆదాయం లేక, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని రాఘవ దంపతులు చాలా కష్టపడసాగారు.
అలాంటి రోజులలో.. తిరుచానూరు (తిరుపతి) లో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్లు ఊరంతా అంటించారు. చివరిరోజున పంచమీ తీర్థం.
“ఏమండీ తిరుచానూరు పంచమికి వెళ్లాలని నాకెప్పటి నుండో కోరిక. ఈసారి మనమనంతా కలిసి పంచమీ తీర్థానికి వెళ్దామండీ. తీర్థంలో మునిగితే మన కష్టాలన్నీ తీరి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందేమో చూద్దామండీ. అలాగే మనం అద్దెకున్న ఇంటివాళ్లను కూడా కలిసొద్దామండీ.” అంది ఎంతో ఆశగా నీరజ. కాదనలేకపొయ్యాడు రాఘవ.
పంచమీ తీర్థం రోజున ఆవును పాలవ్యాపారికి అప్పగించి భార్యాబిడ్డల్ని వెంటబెట్టుకుని తిరుపతికి వెళ్లాడు రాఘవ.
వేలాదిమంది భక్తుల రద్దీలో రాఘవ కుటుంబ సమేతంగా తీర్థంలో(కోనేట్లో) మునిగారు కానీ అమ్మవారి దర్శనం చేసుకోవటం కష్టతరమైంది. చివరికి రాత్రి ఏడు గంటలకు అమ్మవారి దర్శనం లభించింది.
అక్కడ నుండి.. తాము అద్దెకున్న ఇంటికి వెళ్లారు. ఆ దంపతులు వీళ్లను సాదరంగా ఆహ్వానించారు. ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే వెళ్లమని బలవంతం చేశారు. సరేననక తప్పలేదు రాఘవకు.
భోజనాలయ్యాక మాట్లాడుతూ కూర్చున్నారు.
అప్పుడు ఆ ఇంటి యజమాని.. “నేనొక మాట అంటాను వింటావా నాయనా! ఎవురెవరో, ఎక్కడెక్కడి నుండో తిరప్తికొచ్చి ఏదో ఒక పని చేసుకోని బతకతా ఉంటే, నువ్వు ఈ తిరప్తిలో బతకలేనని చెప్పి వెళ్లిపోయినావే.. అదే మాకు నచ్చలేదు. ఎందుకు నువ్విక్కడ బతకలేకపోయినావు? ఇప్పుడు పీలేరులో ఒక ఆవును పెట్టుకోని పాల వ్యాపారం చేస్తున్నావని చెప్తున్నావు. అదే పాల వ్యాపారం ఇక్కడెందుకు చెయ్యకూడదు? ఆ ఆవుతోపాటు ఇంకో ఎనుమును(బర్రె)ను కొనుక్కో, నేను నీకు డబ్బు సహాయం చేస్తాను. చిక్కని పాలు పోస్తానని నాలుగిండ్లు కుదుర్చుకో, నువ్వూ నీ భార్యా కష్టపడండి. తర్వాత నువ్వూ నీ కుటుంబమూ ఎందుకు బతకలేరో నేనూ చూస్తాను.” అన్నాడు ధైర్యమిస్తున్నట్టుగా.
ఆలోచనలో పడ్డాడు రాఘవ. ఆ ఆలోచన బాగానే ఉన్నట్టు తోచింది నీరజకు.
“నువ్వు వచ్చి మా ఇంట్లోనే అద్దెకుండు. నువ్వొస్తానంటే చెప్పు, ఇప్పుడు కాపురమున్న వాళ్లను ఖాళీ చెయ్యిస్తాను. ఎదురుగా ముండ్ల చెట్లతో ఉన్న స్థలాన్ని శుభ్రం చెయ్యిస్తా. అక్కడ జీవాల్ని కట్టేసుకో.”
“అది ఎవరిదో ఏమో వచ్చి గొడవ చేస్తారేమో?”
“ఇప్పటిదాకా అది మాదీ అంటూ ఎవరూ వచ్చి అడిగిన పాపాన పోలేదు. అట్లే ఎవురైనా ఆ స్థలం మాది అని వచ్చినారంటే, వాళ్లు ఇల్లు కట్టే సమయానికి ఖాళీ చేసేస్తామని చెప్తాం.” అంటూ భరోసా ఇచ్చాడు ఇంటి యజమాని.
ఆ రాత్రంతా బాగా ఆలోచించి తిరుపతికి రావటానికే మొగ్గు చూపించారు రాఘవ దంపతులు. ఆ విషయాన్ని ఇంటి యజమానికి కూడా చెప్పారు.
వాళ్ల నిర్ణయానికి ఎంతగానో సంతోషించారు వాళ్లు. ఇంకో నెల రోజుల్లో ఇప్పుడు అద్దెకున్నవాళ్లను ఖాళీ చెయ్యించి కబురు చేస్తాననీ, అప్పుడొచ్చి తమ ఇంట్లో చేరమని చెప్పారు.
మరునాడు పీలేరుకు తిరుగు ప్రయాణమై వెళ్లారు.
చిన్నక్కకు తమ భవిష్యత్తు ప్రణాళికను తెలిపి, తాము తిరుపతికి వెళ్లే విషయాన్ని నిర్ధారించారు. ఆమె సంతోషించి ఎన్నో హెచ్చరికలు చేసింది.
మరో రెండు నెలలకు రాఘవ కుటుంబం తిరుపతికి వెళ్లి చేరింది.
పాలవ్యాపారి ద్వారా లక్ష్మి(ఆవు) ని తిరుపతికి తీసుకొచ్చే ఏర్పాటు చేశాడు రాఘవ. ఆవు వచ్చే సమయానికి ఇంటి ముందరి ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసి ఉంచాడు ఇంటి యజమాని. తర్వాత ఓ చక్కటి బర్రెను రాఘవ కోసం కొన్నాడు.
రాఘవ దంపతులిద్దరూ కష్టపడి పనిచెయ్యసాగారు.
ఆ రెండు పశువులతో ప్రారంభమైన పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందసాగింది.
అనతి కాలంలోనే రెండు కాస్తా ఇరవై బర్రెల దాకా పెరిగింది.
అవిలాల దగ్గర సొంతంగా కొంత స్థలం కొన్నారు. అక్కడ పెద్ద షెడ్డును నిర్మిచి, నీటి వసతిని ఏర్పాటు చేసుకుని, ఇంకా కావలసిన సౌకర్యాలను ఏర్పరచి తన పాడి పరిశ్రమను అక్కడికి మార్చాడు రాఘవ.
వాటిని చూసుకోవటానికి ఇప్పుడు నలుగురు మనుషులు అతని దగ్గర పనిచేస్తున్నారు.
పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్లయ్యారు. కొడుకు భరత్ చెన్నైలో బి.టెక్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కూతురు విమల ఈ మధ్యే డిగ్రీని పూర్తిచేసింది. బ్యాంకులో ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటోంది.
51. ముగింపు
“ఏమండీ.. ఎంతసేపు పిలిచినా పలకరేం?” అంటూ రాఘవయ్య భార్య నీరజ అతని దగ్గరికొచ్చింది.
“ఆ..ఆ.. ఏమన్నావు?” అంటూ గత జ్ఞాపకాల నుండి బయటికొచ్చాడు రాఘవయ్య.
“నేనేమీ అనలేదు. ఓసారి ఇలా రండి.” అంటూ గదిలోకి దారి తీసింది నీరజ.
రాఘవయ్య భార్య వెనకే గదిలోకి వెళ్లాడు.
“ఆ అటక మీదున్న పెట్టెను కిందికి దించండి.” అంది.
స్టూలు మీదికెక్కి అటకమీదున్న పెట్టెను తీసి భార్య చేతికి అందించాడు.
ఆమె మంచంపై కూర్చుని ఆ పెట్టెను తెరిచింది.
బట్టల అడుగున ఉన్న ఒక చిన్న మూటను తీసి అందులో నుండి కొన్ని నగలను బయట పెట్టింది.
“ఇవి మా అమ్మ నాకిచ్చినవి. దీన్ని నా కూతురుకిచ్చే సమయం వచ్చింది.” అంది మురిపెంగా.
ఆశ్చర్యంగా భార్య ముఖంలోకి చూశాడు రాఘవయ్య.
“ఏంటలా చూస్తున్నారు? మొన్న మనింటికొచ్చిన ఐరాల మామ, కుప్పం దగ్గర ఒక మంచి సంబంధం గురించి చెప్పాడు. మీరు వాళ్ల వివరాలూ, అబ్బాయి విషయాలూ కనుక్కోవాలి. అన్నీ కుదిరితే ఈ మార్చిలోనే అమ్మాయికి పెళ్లి చేసేద్దాం, ఏమంటారు?” అంటూ భర్తను అడిగింది.
“అలాగే.” అంటూ తన సమ్మతిని తెలిపాడు రాఘవయ్య.
“అలాగే అంటే సరిపోదు! రేపే మీరు కుప్పం బయలుదేరి వెళ్లాలి!!” అంది వంటగదిలోకి వెళుతూ..
మరునాడు తాను చెయ్యబోయే కుప్పం ప్రయాణం గురించి ఆలోచించసాగాడు రాఘవయ్య.
(సమాప్తం)
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).