[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]
[రాఘవ తమ్ముడు చిన్నా ఓ అమ్మాయిని ప్రేమించి ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. అది చూసి తల్లి వనజమ్మ కోపగించుకుంటుంది. కొడుకుని నిలదీస్తుంది. తాము ఒకరినొకం ఇష్టపడ్డామనీ, ఆ అమ్మాయికి వాళ్ళ పెద్దలు వేరే పెళ్ళి ప్రయత్నాలు చేస్తుంటే, తప్పక తాము తొందరపడవల్సి వచ్చిందని చెప్తాడు. అయినా వనజమ్మ తేరుకోదు. ఓ రోజు రాఘవకి వాళ్ళ అక్క ఉత్తరం రాస్తుంది. అమ్మ ఆరోగ్యం బాలేదనీ, రాఘవనే కలవరిస్తోందనీ, వెంటనే బయల్దేరి రమ్మని రాస్తుంది. హఠాత్తుగా అమ్మకేమయిందో, అక్కడ తమ్ముడు ఉండి ఏం చేస్తున్నాడో రాఘవకి అర్థం కాదు. వెంటనే సెలవు పెట్టి, ఊరికి బయల్దేరుతాడు. మర్నాడు ఉదయం ఇంటికి చేరుతాడు. అమ్మని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మకి తోడుగా ఉన్న పెద్దక్క జానకిని అసలేం జరిగిందని అడిగితే, చిన్నా ప్రేమ పెళ్ళి, తల్లి ఉద్వేగానికి లోనయిందనీ, తమ్ముడు వేరు కాపురం పెట్టేసరికి దిగులుతో మంచం పట్టిందని చెప్తుంది. తల్లిని పలకరిస్తాడు. ఆమె నీరసంగానే బదులిస్తుంది. మర్నాడు జానకి ఊరికి వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి ఓ రోజు వనజమ్మకు బాగా సీరియస్ అవుతుంది. డాక్టర్ వద్దకు తీసుకువెళ్తే, పరీక్షలు చేసి, షుగర్, బిపి బాగా పెరిగిపోయాయనీ, కిడ్నీలు పాడయ్యాయని చెప్తాడు. ఈ పరిస్థితుల్లో తాను హైదరాబాద్ వెళ్ళడం కుదరదని గ్రహించిన రాఘవ మరో పది రోజులు సెలవు పొడిగించమని ప్రధానాచార్యులకి ఉత్తరం రాస్తాడు. పది రోజుల తర్వాత రాఘవను వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరమనీ, లేకుంటే అతని ఉద్యోగానికి తాను హామీ ఇవ్వలేనని ప్రధానాచార్యులు ప్రత్యుత్తరం రాస్తారు. అయితే వనజమ్మ పరిస్థితి దిగజారి, ఓ రాత్రి నిద్రలోనే కన్నుమూస్తుంది. అక్కలతో పాటు తమ్ముడు చిన్నాకు కూడా విషయం తెలియజేసి అంత్యక్రియలను పూర్తిచేస్తాడు రాఘవ. ఓ రోజు మాధవరెడ్డి గారి అమ్మాయి సురేఖ ఉత్తరం రాస్తుంది. హుస్సేన్సాగర్లో బుద్ధ విగ్రహం వద్ద తాము దిగిన ఫోటోను జత చేస్తూ, తన మనసుని రాఘవ అర్థం చేసుకోలేదని అంటుంది. మళ్ళీ ఎప్పటికైనా తాము కలుస్తామనే ఆశ ఉందని అంటూ ఉత్తరాన్ని ముగిస్తుంది. ఆ ఉత్తరాన్నీ, ఫోటోనూ చించి చెత్తబుట్టలో పడేస్తాడు. ఆ వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రధానాచార్యులకు ఉత్తరం రాస్తాడు. – ఇక చదవండి.]
45. తిరుపతికి మకాం
ఒకరోజు రాఘవను చూడటానికి అతని చిన్నక్క శాంత వచ్చింది. రాఘవ ఆమెకు తాగటానికి మంచినీళ్లు తీసుకొచ్చిచ్చాడు.
కుశలప్రశ్నలయ్యాక అతను మధ్యాహ్న వంట పనులను మొదలుపెడుతుంటే చూసి కలత చెందింది.
“నువ్వాగు రాఘవా, నేను చేస్తాను.” అంటూ తానుగా కల్పించుకుని పనులు చేస్తూ తమ్ముడి స్థితికి ఎంతగానో బాధపడింది శాంత.
“నువ్వు వెళ్లాకైనా నాకు తప్పదు కదక్కా?” అన్నాడు రాఘవ.
“రాఘవా, నువ్వు మగవాడివి. ఈ పనులన్నీ ఎన్నాళ్లని చెయ్యగలవు? నామాట విని ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోరా.” అంది అభ్యర్థిస్తున్నట్టుగా.
రాఘవ నుండి నవ్వే సమాధానమైంది!
“రాఘవా, ఇక నువ్వు ఎంతో కాలం పెళ్లిని వద్దనలేవు రా. కలకాలం నువ్వు ఇంటిపట్టునే ఉండి నీ పనులు చేసుకోగలవా? ఏదో ఒక ఉద్యోగానికి వెళ్లక తప్పదు. అప్పుడు ఉద్యోగమూ, ఇంటిపనీ అన్నీ నువ్వొక్కడివే చెయ్యటం కష్టమవుతుంది. నీకంటూ ఒక భార్య వస్తే నీకు అండగా ఉంటూ నీ కుటుంబానికి ఆలంబనగా కూడా ఉండగలదు. ఏమంటావు?”
రాఘవ ఏమీ చెప్పకపొయ్యేసరికి, “ఇక నీ సమాధానం నాకక్కర్లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి నీకు ముడిపెట్టేస్తాను, అంతే!” అని కచ్చితంగా చెప్పేసింది.
రాఘవ మౌనంగా ఉండిపొయ్యాడు.
శాంత ఉన్నన్ని రోజులు రాఘవకు కొంత విశ్రాంతి దొరికిందనే చెప్పాలి. కానీ నాలుగురోజులయ్యాక శాంత ఊరికి బయలుదేరి వెళ్లింది.
మళ్లీ రాఘవ తన రొటీన్ పనుల్లో మునిగిపొయ్యాడు.
ఒకరోజు బారెడు పొద్దెక్కినా రాఘవ ఇంటి బయటికి రాకపొయ్యేసరికి పక్కింటి మునిరత్నం వచ్చి తలుపు తట్టాడు. రాఘవ మెల్లగా లేచి వచ్చి తలుపు తీశాడు. రాఘవ నీరసంగా ఉండటమే కాక, ఒళ్లు కాలిపోతున్నట్టుగా కూడా అనిపించటంతో వెంటనే రాఘవను డాక్టరు దగ్గరకు తీసుకెళ్లాడు.
డాక్టరు పరీక్షలన్నీ చేసి టైఫాయిడ్ జ్వరమని తేల్చాడు.
రాఘవ అక్కలకు ఈ విషయం తెలుపుతూ ఉత్తరం రాస్తానని పక్కింటాయన చెప్పినా వద్దని చెప్పేశాడు రాఘవ.
టైఫాయిడ్ జ్వరం రాఘవను బాగానే కృంగదీసింది. ఒక రాత్రి అతనికి కడుపులో బాగా ఆరాటంగా అనిపించింది. పాలు కాచి తాగాలనిపించింది. లేవటానికి ప్రయత్నించాడు. కానీ లేవలేకపొయ్యాడు. బలం చాలటం లేదు. నీరసంగా ఉంది. ఎవరైనా పాలు కాచిస్తే బాగుణ్ణు అనిపించింది. కానీ ఇంట్లో ఎవరున్నారనీ? పక్కింటి పిన్ని పగల్లో అయితే వచ్చి సాయం చెయ్యగలదు కానీ రాత్రుల్లో ఎలా చెయ్యగలదు? తాను త్వరగా కోలుకోవటానికి పళ్ల రసాలు తాగమని డాక్టరు చెప్పాడు. వంటింట్లోకే వెళ్లలేనివాడు బజారుకెళ్లి పళ్లు ఎలా కొనుక్కురాగలడు? నిస్సత్తువగా అలాగే పడుకుండిపొయ్యాడు.
ఈ పరిస్థితిలో అమ్మ ఉంటే బాగుణ్ణనిపించింది. అమ్మ తోడు లేకపోవటం అతనికి బాగా తెలిసొచ్చింది. మరి భవిష్యత్తులో తనకిలాంటి పరిస్థితి ఎదురైతే తనకెవరు సాయం చేస్తారు? అమ్మ, అక్కలు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు కొంతవరకూ సహాయపడగలరు కానీ, శాశ్వతంగా చెయ్యలేరు. డబ్బిచ్చి పనిమనిషిని పెట్టుకున్నా ఆమె ఇంటిపనులు చేసి వెళ్లిపోతుంది. అంతేకానీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోదు.
తనతోపాటే ఉంటూ, తనకేం కావాలో సమకూర్చి పెడుతూ, కంటికి రెప్పలా చూసుకోగలిగింది ఒక్క జీవిత భాగస్వామి మాత్రమే. రాత్రయినా పగలైనా ఎప్పుడూ తనకు అండగా ఉంటూ తనను ప్రాణాధికంగా చూసుకోగలిగింది కట్టుకున్న భార్య మాత్రమే. ఇంకెవరూ చెయ్యలేరు.
ఆలోచించేకొద్దీ రాఘవకు సత్యం అవగతం కాసాగింది. మనోధైర్యం తెచ్చుకుని అనారోగ్యం నుండి బయటపడేందుకు ప్రయత్నించసాగాడు.
టైఫాయిడ్ జ్వరం నుండి అతను క్రమంగా కోలుకోసాగాడు.
పదిరోజుల ఖాయలా తర్వాత మెల్లమెల్లగా లేచి తిరగసాగాడు. మళ్లీ బలం పుంజుకున్నాడు.
అనుకున్నట్టే కొద్దిరోజుల్లోనే రాఘవకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చింది శాంత.
అమ్మాయి పేరు నీరజ అనీ, డిగ్రీ వరకూ చదువుకుందనీ, ఆ అమ్మాయిని వెళ్లి చూశాననీ, చాలా చక్కగా ఉందనీ, వాళ్లది మంచి కుటుంబమనీ, వాళ్ల నాన్న ఏదో డిపార్టుమెంటులో గుమాస్తాగా పనిచేస్తున్నాడనీ వివరాలు చెప్పి ఆ అమ్మాయి ఫోటో, వివరాలు ఇచ్చి వెళ్లింది.
రాఘవకు కూడా ఆ అమ్మాయి నచ్చింది. అతను నచ్చిందని చెప్పటమే తరువాయి తర్వాతి పనులన్నీ చకచకా జరిగిపొయ్యాయి.
అలా 1995లో, జూన్ నెలలో ఓ శుభ ముహూర్తాన, బంధుమిత్ర సపరివార సహృదయుల అంక్షింతల ఆశీస్సులతో రాఘవ ఓ ఇంటివాడయ్యాడు.
నీరజ ఆ ఇంట అడుగుపెట్టి చురుకుగా ఇంటి పనులన్నీ చకచకా చెయ్యసాగింది.
భార్య వచ్చాక ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు రాఘవ.
అయితే చిత్తూరులో చిన్నా చితకా ఉద్యోగాలే దొరుకుతాయి. తక్కువ జీతం, ఎక్కువ పని. ఇదివరకు ఈ పరిస్థితి తనకు అనుభవమే. అలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యలేకనే ఆనాడు తాను కన్యాకుమారికి పారిపొయ్యాడు.
కానీ ఇప్పుడు తనకు భార్యకూడా తోడయ్యింది. రేపు పిల్లలు పుడితే మరింత భారమూ, ఖర్చులూ పెరుగుతాయి. కనుక తను మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నించాలి. అది ఈ చిత్తూరులో వీలుకాదు. బయట ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రాఘవ.
వెంటనే తనకేదైనా ప్రైవేటు సంస్థల్లో మంచి ఉద్యోగం చూడమని తెలిసిన మిత్రులకు ఉత్తరాలు రాశాడు రాఘవ.
ఒకవేళ ఉద్యోగమొచ్చి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించటం కష్టమౌతుందని భావించాడు. అందుకేం చేస్తే బాగుంటుందో ఆలోచించాడు.
ఎటూ బయటి ఊళ్లకు వెళుతున్నాం కనుక ఇప్పుడున్న ఇంటిని అమ్మి ఆ వచ్చిన డబ్బును అక్కలకూ, తమ్ముడికీ భాగాలు పంచి తన భాగానికొచ్చిన డబ్బును బ్యాంకులో దాచుకుంటే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాడు.
ఈ విషయాలను తెలుపుతూ అక్కలకు ఉత్తరాలు రాశాడు.
అతను బాగుపడితే తమకు అంతే చాలనీ, ఆ ఇల్లును అమ్మగా వచ్చిన డబ్బులో తమకెలాంటి భాగమూ అక్కర్లేదని రాఘవ అక్కలూ, తమ్ముడు చిన్నా ఆ ఇంటిపై తమకున్న హక్కును వదులుకుంటున్నట్టుగా డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు.
వాళ్ల నిర్ణయం రాఘవకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
వెంటనే తెలిసినవాళ్లందరికీ తాను ఇల్లును అమ్మనున్నట్టుగా తెలిపాడు. ఒకళ్లిద్దరు కొనుగోలుదారులొచ్చి తక్కువ రేటుకు బేరమాడారు. ఎంత తామై ఇంటిని అమ్మేందుకు సిద్దపడ్డా మరీ అంత చీపుగా అమ్మేటందుకు ఇష్టపడలేదు రాఘవ. మంచి ధర కోసం ఎదురుచూడసాగాడు.
ఈలోపు తిరుపతిలోని ఒక మిత్రుడు, ఓ కాన్వెంట్ స్కూల్లో రాఘవకొక టీచరు ఉద్యోగం చూశానని, అతణ్ణి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం రాశాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఉత్తరం రాఘవ దంపతులకు ఎంతగానో ఊరటనిచ్చింది.
కానీ, ఇంటికి సరైన బేరం రాక, చేతిలో చాలినంత డబ్బు లేక, తిరుపతి లాంటి పట్టణంలో కాపురం ఎలా పెట్టాలో తెలియక ఆదుర్దాపడసాగాడు రాఘవ.
నీరజ బాగా ఆలోచించిన మీదట, “ఏమండీ, ప్రస్తుతం మన దగ్గరున్న బంగారు నగలతో పెద్దగా పనేమీ లేదు. వీటిని బ్యాంకులో తనఖా పెట్టి కొంత డబ్బు లోనుగా తీసుకుందాం. చేతిలో డబ్బుంటే మనకు భయం ఉండదు. ఈలోపు ఈ ఇంటికి మంచి ధర పలికి అమ్ముడుపోతే, బ్యాంకు లోను తీర్చేద్దాం. ఏమంటారు?” అంటూ రాఘవకు సలహా ఇచ్చింది. ఆ సలహా రాఘవకు బాగానే నచ్చింది. కానీ భార్య నగలను తనఖా పెట్టటం అతనికి ఇష్టం లేదు. అది భార్యకు వాళ్ల పుట్టింటి వాళ్లిచ్చింది.
“వద్దు నీరజా, అది మీ అమ్మానాన్నలు నీకిచ్చిన బంగారం. వాటిని తీసుకోవటం నాకిష్టం లేదు. నీ దగ్గరే ఉంచు.”
“నేనైనా బీరువాలోనేగా ఉంచాలి. అక్కడుంటే ఏం ప్రయోజనం. అదే బ్యాంకులో పెడితే మనకు అప్పూ పుడుతుంది, నగలూ సేఫ్గా ఉంటాయి. నా మాట కాదనకండి.” అంటూ భర్తను బలవంతం చేసి నగలను బ్యాంకులో పెట్టి అప్పు పెట్టించింది.
ఆపైన రాఘవ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా తామిరువురూ తిరుపతికి వస్తున్నట్టు మిత్రునికి తెలుపుతూ, తమ కోసం ఓ అద్దె ఇంటిని చూడమని ఉత్తరం రాశాడు.
46. తీపి కబురు
రాఘవ దంపతులు తిరుపతిలో కాపురం పెట్టారు. అతనికి విక్టరీ కాన్వెంటులో 1 నుండి 5 తరగతులకు పాఠాలు చెప్పమని చెప్పారు. నెలకు జీతం 650 రూపాయలుగా నిర్ణయంచారు. కాన్వెంటుకు దగ్గరగా 300 రూపాయల అద్దెలో ఓ ఇల్లును తీసుకున్నారు. బ్యాంకులో తీసుకున్న డబ్బు చేతిలో ఉన్నందున ధైర్యంగా కాపురం మొదలుపెట్టారు.
చిత్తూరులోని ఇల్లు త్వరగా అమ్ముడవుతుందనుకున్న రాఘవ నమ్మకం, రోజులు గడిచేకొద్దీ క్షీణించసాగింది.
ఓరోజు రాఘవ, భార్యతో ఇలా అన్నాడు: “నీరజా, చూస్తుంటే మనిల్లు అమ్ముడుపోవటం ఆలస్యమయ్యేలా వుంది. ఇక్కడ నా జీతమేమో మన కాపురానికి బొత్తిగా సరిపోవటం లేదు. దాంతో మన దగ్గరున్న డబ్బును అవసరాలకొద్దీ వాడేస్తున్నాము. ఇలా అయితే ముందు ముందు ఇబ్బంది కలుగుతుందేమో అనిపిస్తోంది. అందుకని పై ఆదాయం కోసం సాయంత్రం పూట నేను ఇంటి దగ్గర ట్యూషన్స్ చెబితే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నాను.”
నీరజ కొంతసేపు ఆలోచించిన తర్వాత.. “ఏమండీ, మనం కొత్తగా పెళ్లయిన దంపతులం. మనకింకా ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. పిల్లలూ ఇంకా పుట్టలేదు. ఇప్పట్నుండే ట్యూషన్లు అవీ ఇవీ అంటూ.. క్షణం తీరిక లేకుండా అధిక భారాన్ని నెత్తినేసుకుంటే జీవితాన్ని ఇంకేం ఆనందంగా గడపగలం. కనీసం పిల్లలు పుట్టేంతవరకైనా హాయిగా, సంతోషంగా ఉందామండీ. లేకపోతే జీవితం ఏ రుచీపచీ లేకుండా చప్పగా ఉంటుంది..” అంటూ చెప్పుకొచ్చింది.
భార్య చెప్పిన విషయం సమంజసంగానే తోచింది రాఘవకు. ఆమెకు జీవితం పట్ల చక్కటి అవగాహన ఉంది. బాధ్యతగానూ ఆలోచిస్తోంది. అంతకు మునుపు తిరుపతిలో కాపురం పెట్టేందుకు చేతిలో చాలినంత డబ్బు లేదని సంశయిస్తుంటే, నగల్ని బ్యాంకులో తనఖా పెట్టే ఆలోచన చెప్పి సమస్యను పరిష్కరించింది. ఇలాంటి తెలివిగల భార్య దొరికినందుకు ఎంతగానో సంతోషించాడు రాఘవ. అప్పటికి ట్యూషన్స్ చెప్పే ఆలోచనను విరమించుకున్నాడు.
ఓ రోజు సాయంత్రం.. రాఘవ స్కూలు నుండి ఇంటికి రాగానే ‘ఏదైనా గుడికి వెళ్లొద్దామని’ కోరింది నీరజ. ఇద్దరూ తయారై గోవిందరాజ స్వామి గుడికి వెళ్లారు. ఆ రోజు భక్తుల తాకిడి తక్కువగానే ఉంది. దర్శనం కూడా త్వరగానే జరిగింది.
ఇద్దరూ స్వామిని కనులారా దర్శించుకున్నారు. సంతృప్తిగా బయటికొచ్చి ప్రశాంతంగా ఓ చోట కూర్చున్నారు.
కొబ్బరికాయను ముక్కలు చెయ్యటానికి నేలకేసి కొడుతోంది నీరజ. భార్యను వాత్సల్యంతో చూశాడు రాఘవ. గొంతును మెల్లగా సవరించుకున్నాడు.
“నీరజా, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నావు?” అని ప్రేమగా అడిగాడు.
భర్తకు బదులివ్వకుండా తన పనిలో లీనమైంది నీరజ.
“చెప్పవా?” అని మళ్లీ మురిపెంగా భార్యను ప్రశ్నించాడు.
“ఊ..” అంటూ కళ్లు పైకెత్తి ప్రశ్నార్థకంగా ఏంటన్నట్టుగా భర్త వైపు చూసింది.
“నువ్వు.. దేవుణ్ణి.. ఏం.. కోరుకున్నావు?”
ఓ కొబ్బరి ముక్కను భర్త చేతికిస్తూ..”ఏం కోరుకుంటాను. మీలాంటి భర్తే ఏడేడు జన్మలకూ కావాలని కోరుకున్నాను.” అంది నవ్వుతూ. ఎంతగానో మురిసిపొయ్యాడు రాఘవ.
కానీ, కావాలనే.. “నాలాంటివాడా, నేనా?” అని కోపం నటిస్తూ అడిగాడు.
“అయ్యో రామా, అన్నీ పెడార్థాలే. మిమ్మల్నే నాకు ఏడేడు జన్మలకూ భర్తగా ఇవ్వమని కోరుకున్నాను, చాలా!”
రాఘవ లోలోపలే నవ్వుకుని.. “అయితే ఒకే భార్యతో ఈ జన్మలోనే కాక వచ్చే ఆరు జన్మల్లోనూ నేను ఏగాలన్నమాట!” అన్నాడు గడుసుగా భార్యను ఉడికిస్తున్నట్టుగా.
“ఎందుకూ ఈ జన్మకే ఇంకో భార్యను చేసుకోండి, నాకేం అభ్యంతరం?” అంది తనూ నవ్వేస్తూ.
“హమ్మయ్య ఆ వెసులుబాటుంటే చాలు నాకు!” అన్నాడు స్థిమితపడుతున్నట్టుగా.
“నాకు అభ్యంతరం లేదన్నాను కానీ, నా కొడుకొచ్చాడంటే, వాడికి అభ్యంతరం ఉండొచ్చుగా. మీరా పనిచేస్తే వాడు చూస్తూ ఊరుకోడు. మిమ్మల్ని నిలదీసి ప్రశ్నిస్తాడు, జాగ్రత్త!” అంది భర్తవైపు వేలును చూపిస్తూ.
“నీ కొడుకా? వాడెప్పుడొస్తాడు?” అయోమయంగా అడిగాడు రాఘవ.
“ఇంకో ఆరునెలల్లో..” అని చెప్పి సిగ్గుతో తల దించుకుంది నీరజ.
అప్పటికి గానీ అసలు విషయం బోధపడలేదు రాఘవకు.
“నిజంగానా?” అంటూ పరిసరాలు మర్చిపోయి చప్పున భార్య చేతిని అందుకొని ముద్దుపెట్టుకున్నాడు.
“అయ్యో రామా, ఇదేం పనీ.. నలుగురూ తిరిగే చోట..” అంటూ చప్పున తన చేతిని వెనక్కు తీసుకుంది.
“నీరూ.. ఎంత మంచి వార్త చెప్పావు..” అంటూ తమకంగా భార్య పక్కకు జరిగాడు.
వస్తున్న ముప్పును గ్రహించి..”ఇంటికి వెళదాం పదండి!” అంటూ పైకి లేచింది నీరజ.
“ఎన్నో నెల? అదయినా చెప్పు!” నవ్వుతూ తనూ పైకి లేచాడు రాఘవ.
“మూడు..” అంటూ గుడి బయటికి దారి దీసింది నీరజ. అనుసరించాడు రాఘవ.
మరునాడు ఆ శుభవార్తను తెలుపుతూ.. అత్తగారికీ, అక్కయ్యలకూ ఉత్తరాలు రాశాడు.
‘ఈ విషయం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందంటూ’.. అక్కయ్యలు ప్రత్యుత్తరాలు రాశారు.
మూడవరోజున అత్తామామలు కూతుర్ని చూడటానికి స్వీట్లూ, పండ్లూ తీసుకుని దిగబడ్డారు. కూతుర్ని చూసి వాళ్లెంతగానో మురిసిపొయ్యారు. అల్లుడింకా డాక్టరు దగ్గరకెళ్లి విషయాన్ని నిర్దారించుకోలేదని తెలుసుకుని, కూతుర్ని డాక్టరమ్మ దగ్గరకు తీసుకెళ్లింది నీరజ వాళ్లమ్మ. రాఘవ కూడా వాళ్ల వెంట వెళ్లాడు.
డాక్టరమ్మ అన్ని వివరాలూ అడిగి తెలుసుకుని, పరీక్షించి విషయాన్ని నిర్ధారించింది.
సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాక కూతురికి ఎన్నెన్నో సూచనలు, సలహాలు ఇచ్చింది నీరజ వాళ్లమ్మ.
మర్నాడు ఊరికెళ్తున్నప్పుడు కూడా కూతురికి ఏవేవో హెచ్చరికలు చేస్తూనే ఉంది. అన్నింటికీ తలూపింది నీరజ.
నీరజ తల్లి కాబోతున్నందుకు రాఘవ ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఆ రోజుటి నుండి భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, ఏ పనీ చెయ్యనియ్యకుండా అడ్డుపడుతూ మురిపెంగా చూసుకోసాగాడు.
“ఇదిగో చూడండీ, ఇంటి పనులన్నింటినీ నిదానంగానే అయినా నన్నే చెయ్యమంది అమ్మ. కానీ, నన్ను ఏ పనులూ చెయ్యనివ్వకుండా మీరిలాగే అడ్డుపడుతుంటే నాకు సుఖప్రసవం కాక, సిజేరియన్ చెయ్యాల్సి వస్తుందని డాక్టరమ్మ కూడా హెచ్యరించింది. తర్వాత మీ ఇష్టం.”
పరిస్థితిని అర్థం చేసుకుని, భార్య చేస్తున్న పనులకు అడ్డు పడకుండా, బరువైన పనుల్ని మాత్రమే తను చెయ్యసాగాడు.
ఒకరోజు రాఘవ స్కూలు నుండి వస్తూ వస్తూ ఒక టీపొడి ప్యాకెట్టును కొనుక్కొచ్చాడు. ‘అది మార్కెట్లోకి కొత్తగా వచ్చిందనీ, స్కూల్లో చాలామంది వాడి బాగుందని చెప్పటంతో తెచ్చాననీ’ భార్యతో చెప్పాడు.
నీరజ ఆసక్తిగా దాన్ని తీసుకుని అటుఇటు తిప్పి చూసింది. ప్యాకెట్టును వాసన చూసింది. వంటింట్లోకెళ్లి టీ పెట్టటం మొదలుపెట్టింది. రాఘవ బట్టల్ని మార్చుకుని బాత్రూమ్లోకెళ్లి మొహం కడుక్కున్నాడు. తువ్వాలుతో తుడుచుకుంటూ విశ్రాంతిగా టి.వి. ముందు కూర్చుని చానల్స్ను తిప్పుతూ ఏది ఆసక్తిగా అనిపిస్తే దాన్ని చూడసాగాడు. ఈలోపు నీరజ బాత్రూమ్ వైపుకు వెళ్లిన విషయం గమనించలేదతను.
అంతలో.. నీరజ బాత్రూమ్లో జారి కిందపడ్డ శబ్దమూ, ఆ వెంటనే ఆమె కెవ్వుమని అరిచిన అరుపూ వినిపించింది. గబుక్కున లేచి బాత్రూమ్ దగ్గరికి పరుగెత్తాడు రాఘవ. బాత్రూమ్లో భార్య వెల్లకిలా పడిపోయి ఉంది. ఆమె కాళ్ల దగ్గర రక్తం కనిపించేసరికి భయపడిపొయ్యాడు.
భార్యను చేత్తో తడుతూ.. “నీరజా.. నీరజా..” అని గాబరాపడుతూ పిలిచాడు. ఆమె స్పృహలో లేకపొయ్యేసరికి బయటికి పరుగెత్తి పక్కింటి లలితమ్మను పిలుచుకొచ్చాడు. ఇద్దరూ నీరజను పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. “వెంటనే వెళ్లి ఆటో మాట్లాడుకు రండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి” అంది లలితమ్మ.
బయటికి పరుగెత్తి ఓ ఆటోను పిలుచుకొచ్చాడు రాఘవ. గబగబ తయారై డాక్టరమ్మ దగ్గరకు తీసుకెళ్లారు రాఘవ, లలితమ్మలు. నీరజను పరీక్షించిన డాక్టరమ్మ.. “పేషెంటుకు గర్భస్రావమైంది. ప్రాణానికి ముప్పేమీ లేదు.” అంటూ చెప్పి కొన్ని మందులు, మాత్రలూ రాసిచ్చింది.
ఇంటికి తీసుకొచ్చినా నీరజ ఏడుస్తూనే ఉంది. రాఘవ ఎంతగా సముదాయించినా ఆమె మామూలు స్థితికి రాలేకపొయ్యింది.
(ఇంకా ఉంది)
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).