ఆన్షిలు:
పెద్ద చదువులు చదివి తమను ఉద్ధరింతురని
వేలు ఖర్చుచేసి చదివింతురు తమ బిడ్డలను,
తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేయరాదు
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
పిల్లల భవిష్యత్తు కోరి పొదుపుచేయుదురు పెద్దలు
అవగాహనలేని పిల్లలు ఖర్చులకు వెనుకాడరు …
తల్లిదండ్రుల త్యాగము తెలుసుకో నీవు బుద్ధెరిగి
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
పొదుపు మాట వినిన పిసినారి అందురు కదా!
పొదుపులేని ఇంట పెరుగును అప్పుల పంట..
పొదుపు విలువ తెలిసి మసలుకో మానవా…
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
సుఖము మరిగి దండిగా అప్పు చేయుటేలా ..
సౌఖ్యమెరిగి బ్రతుకును బయటికీడ్చుటేలా ..
ఆర్థిక క్రమశిక్షణ లేక ఆరిపోవు బ్రతుకులు కొన్ని
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
గొప్పలకుపోయి బ్రతుకును కుప్పకూల్చకోయి
ఉన్నదానితోనే తృప్తిపడి హాయిగా బ్రతకవలెనోయి!
తళుకుబెళుకుల బ్రతుకు తాత్కాలికమని తెలుసుకో
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
పెద్దవాళ్ళసంపదతో నీకెప్పుడూ పోలిక పనికిరాదు,
చిన్నవాళ్ళ పోలికలతో నిన్నునీవు ఘనపరుచుకో
అత్యాశతో బ్రతుకు అల్లకల్లోల మయిపోవు కదా… !
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము.. !!
కష్టపడి స్వయముగా సంపదను పెంచుకొనవచ్చును
తృప్తిగా వారు జీవితమును కొనసాగించవచ్చును
శక్తికి మించిన ఆశలు చెడుదారులకు రహదారులు
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము … !!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.