[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘జీవచ్ఛవాలు..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పిల్లలపై
ప్రేమలేనిదెవరికి!
పిల్లలను ప్రేమించని
తల్లిదండ్రులుంటారా?
అయితే
ప్రేమంటే
గారాబం అవుతుందా?
గారాబాన్ని
ప్రేమగా జమకట్టవచ్చా?
చిక్కంతా –
ఇక్కడే ఉంది సుమా..!
గారాబం
ప్రేమగా భావించే పెద్దలు ..
మితిమీరిన గారాబాన్ని
పిల్లలకు ఆపాదించి,
వాళ్ల అల్లరిని
అనందంగా ప్రేరేపించి
ఆనక – పిల్లలు
పట్టాలు తప్పిన బళ్ళుగా
మారినప్పుడు..
కూతురిని –
అదుపుచేయలేక,
కొడుకు విచిత్ర వేషాలను
నియంత్రించలేక..
బయటికి చెప్పుకోలేక
మూగజీవాలై –
జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న
తల్లిదండ్రులెందరో..!
హద్దులుమీరిన
ప్రేమ – గారాబం..
ఎప్పటికీ ప్రమాదమే సుమా!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.