[శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు రచించిన ‘జీవాళి’ పుస్తకం సమీక్షని అందిస్తున్నాము.]


ఇటీవలి కాలంలో తెలుగులో వచ్చిన అద్భుతమయిన పుస్తకం, తప్పకుండా చదివి, దాచుకోవాల్సిన పుస్తకం ఏదైనా వుందా? అనే ప్రశ్నకు, ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు ద్వారం దుర్గాప్రసాదరావు రచించిన ‘జీవాళి’ అని నిస్సందేహంగా, నిస్సంకోచంగా జవాబు చెప్పవచ్చు. విజయనగరానికి చెందిన ఎన్. కె. పబ్లికేషన్స్ ప్రచురించిన, ద్వారం దుర్గా ప్రసాదరావు గారి, సంగీత సాహిత్య జీవనానుభవాల సంకలనం ఈ పుస్తకం.
మూడువందల యాభై పేజీల ఈ పుస్తకం చదవటం ఒక అనుభవం. ఒక్కో పేజీ చదవటం ఆనంద ప్రవాహంలో ఈదులాడటం లాంటిదే. జీవిత చరిత్ర కాని జీవిత చరిత్ర లాంటిదీ రచన. తన జీవితంలో తనకు తెలిసిన గొప్ప వ్యక్తుల గురించి, వారితో తన పరిచయమూ, అనుభవాల గురించి, స్వీయాలోచనలూ, స్వీయాభిప్రాయలను జత చేసి వినిపించిన అక్షర సంగీతం ‘జీవాళి’ పుస్తకం.
‘ఈ పుస్తకం నాలుగు తరాల సంస్కృతికి, సంప్రదాయాలకు వారధిగా ఉంటుందని భావిస్తున్నాను’, అన్న రచయిత భావన అక్షరాల సత్యం.
ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేసిన వ్యక్తులూ, వ్యక్తిత్వాలు, ఆయన పొందుపరచిన సంఘటనలు ఆనందం కలిగిస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి. నిజంగా ఇలాటి వ్యక్తిత్వాలున్న మనుషులు జీవించారా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి వేగవంతమయిన యుగంలో, సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతున్న కాలంలో, మనుషులు మాయా ప్రపంచంలో తప్ప మామూలు ప్రపంచంలో కలవలేని మాయా ఆత్మీయతల జీవన విధానంలో వుంటున్నవారికి ఈ పుస్తకంలో వర్ణించిన విషయాలు అత్యద్భుతం అనిపిస్తాయి. జీవితంలో ఆత్మీయత, భావనల్లోని స్వచ్ఛత, మానవ సంబంధాల్లోని సున్నితమైన భావనలు, ఆధునిక జీవితంలోని సాంకేతిక సౌఖ్యాలివ్వలేని ప్రశాంతత ఆ కాలంలో సర్వ సాధారణమని అర్థం అవుతుంది. మనం ఏం కోల్పోతున్నామో గ్రహింపుకు వస్తుంది. జీవన విధానంలో, మానవ సంబంధాలలోనే కాదు, వ్యక్తుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం వంటి విషయాలలో, ఏదైనా అంశానికి సంబంధించిన తీవ్రమైన భావనలోనూ ఆనాటికీ, ఈనాటికీ ఎంతో మార్పు వచ్చిందని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ పుస్తకంలో మొత్తం 85 జ్ఞాపకాల వ్యాసాలున్నాయి. మొదటి వ్యాసం పుస్తకం పేరును వివరిస్తుంది.
‘జీవాళి’ అన్నది ఒక సాంకేతిక పదం. తంబూర నాదంలో జీవం నింపే తీగకూ, బ్రిడ్జికీ నడుమ వుండే దారాలను జీవాళి అంటారు. సంగీత ప్రాధాన్యం కల జ్ఞాపకాలకు జీవంపోసి, పాఠకుడికి సజీవంగా అందించే ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టటం అత్యంత సమంజసం, ఔచిత్యం.
మొదటి వ్యాసాలలో విజయనగరం సంగీత చరిత్రను వివరిస్తూ ద్వారంవారు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల గురించి చక్కగా వివరించారు. ఆనాటి వారి విద్యను, పాండిత్యాన్నీ, పోటీ తత్త్వాన్నీ, పట్టుదలలనూ మనసుకు హత్తుకునేట్టు చెప్పారు. ముఖ్యంగా ఆనాటి సామాజిక జీవనం, ఈనాటి ఆధునిక అభ్యుదయ విద్యాధిక సమాజంలో ఉన్న సంకుచితాలు, ద్వేషాలకతీతంగా సామరస్య పూర్వకంగా ఉన్నదని అతి చక్కగా చెప్పారు.
‘నిమ్నకులాలని పిలువబడ్డ శూద్రులు వెనుకబడిన వర్గాలని నిర్ణయించేవారు ఆధునికులు మాత్రమే. పోస్ట్ రిజర్వేషన్ భారతంలో అగ్ర, నిమ్నవర్గాల వారందరూ ఏదో విధంగా (ఒక్క తెలివితేటలలో తప్ప) వెనుకబడిన వర్గంగా గుర్తింపుకై తహతహలాడుతున్నారు. వారిని వారు వెనుకబడినవారమని భావించుకోరు’.
ఆనాడు వెనుకబడినవారం అని ఒప్పుకోని ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, ఈనాడు వెనుకబడినవారమని గుర్తింపు పొందేందుకు ఉద్యమాలు చేసే మనస్తత్వంతో పోలిస్తే మన సమాజం ఏ స్థాయిలో,ఏవైపు రూపాంతరం చెందుతున్నదో ఊహకందుతుంది. ఇలాంటి సంఘటనలనేకం ఈ పుస్తకంలో. ఆ కాలంలో ఎంత స్వాభావికంగా ఎవరికివారు తమతమ కర్తవ్యాలు నిర్వహిస్తూ, తమ ధర్మాన్ని పాటిస్తూ, ఎలాంటి విద్వేషాలూ, ద్వేషాలూ లేకుండా పరస్పర గౌరవంతో, సహకారంతో, అత్యంత ఆత్మీయంగా, మానసిక బాంధవ్యంతో జీవితాలు సాగించేవారో తెలుపుతాయి, ఆకాలం నాటి వ్యక్తుల జీవిత చరిత్రలు, జ్ఞాపకాలు. మరి, ఈనాటి సమాజంలో ఎలా మొలిచాయీ విద్వేషాల అడ్డుగోడలు?
ఇదీ, ఇలాంటి పుస్తకాల ప్రాధాన్యం. ఇలాంటి జ్ఞాపకాల పుస్తకాలు చరిత్రగా పరిగణనకు గురికాని అసలు చరిత్ర చెప్తాయి. సామాజిక శాస్త్రవేత్తల శాస్త్రానికి అందని అసలు సామాజిక చరిత్రను పాఠకులముందు సజీవంగా నిలుపుతాయి. పాఠకుడిలో ఎనలేని ఆలోచనలు కలిగిస్తాయి.
మరో సందర్భంలో, ‘మహదైశ్వైర్యాలు మాయమై పోయాయి. మాన మర్యాదలు మిగిలాయి’ అంటారు.
మారుతున్న సమాజం వల్ల లలితకళలలో వచ్చిన మార్పులను వివరిస్తూ, “జమీందారీ వ్యవస్థ మారిపోయి ప్రజాస్వామికతత్వం ఒంటబట్టిన మధ్యతరగతి వర్గాలు సంగీత నృత్య కళలలోకి కుతుంబసమేతంగా ప్రవేశించాయి. కచేరీల రాజసం కూడా అంతరించింది. దాని స్థానం మహిళల ఆధిక్యం ఆక్రమించుకుంది. పురుషపుంగవ విద్వాంసులు తెల్ల ఖద్దరు, నూలువస్త్రాల వ్రతం పడితే, మహిళావిద్వన్మణులు కంచిపట్టులు, వజ్రాల మెరుపులు, భావావేశాలతో తానాలు, పల్లవుల చిత్రాతిచిత్రప్రస్తారాలతో, వసంతాలను కోయిలలూ, వనాలనూ మయూరాలు ఏలినట్లు కచేరీలను తమ సహజ లావణ్యంతో, లాఘవంతో నిర్వహిస్తున్నారు” అంటారు. (పేజీ నం. 69)
ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన మహిళలు, పురుషుల పేర్లు, ఎందుకని వారు ఇతరుల కన్నా ప్రత్యేకంగా నిలుస్తారో వివరించిన తీరు, మామూలు విశ్లేషకులు, పండితులు వివరించలేరు. సంగీతంలో నాదాత్మ అనుభవాన్నీ, అలౌకికానుభూతిని చెంది తాదాత్య్మ్యం చెందిన వారే అంత సూక్ష్మంగా, అంత తక్కువ పదాలలో ఎంతో భావాన్ని పొందుపరచి వివరించగలరు.
మరో సందర్భంలో పద్యానికి, పాటకూ ద్వారం వారు ఇచ్చిన నిర్వచనాలు అత్యంత సున్నితం, సంపూర్ణం, అద్భుతం.
‘పద్యం మాటా కాదూ, పాటా కాదూ. అందమైన అక్షరాలు అభిప్రాయాలూ కవచాలు తొడుక్కుని ఖడ్గాలు పట్టుకుని కవాతు చేస్తుంటే, పదాలు పద్యాలౌతాయి. పాటలు జోలలు, పాటలు దీవనలు. పాటలు ప్రేమరహస్యాలు. విరహాలూ, వేదనలూ. ఎడబాటుల్లో తోడు నీడలు. మనసులు కలిపే మంగళసూత్రాలు. పాటకు మెదడు పదం.ఇంద్రియాలు అక్షరాలు-రాగం మనస్సు’ (పేజీ నం.79)
‘పాటకు మెదడు పదం. ఇంద్రియాలు అక్శరాలు-రాగం మనస్సు’. ఈ ఒక్క వాక్యం మీద ఒక గ్రంథమే రాయవచ్చు.
ఇలా పలు విషయాలు చెప్తూ, వ్యక్తిత్వాల గురించి, వారి కళానైపుణ్యాలను వివరిస్తూ, తన జీవితకథనూ టూకీగా చెప్పారు ద్వారం దుర్గా ప్రసాదరావుగారు. తన జీవితానుభవాలు వివరిస్తూ ఆయన చెప్పిన అనేకాంశాలు ఆసక్తికరంగా వుండటమే కాదు, ఆలోచనాత్మకంగా కూడా వుంటాయి.
‘ప్రతిభ-ప్రావీణ్యం-సృజన-టాలంటు’ అన్న చాప్టరు కేవలం రెండు పేజీల నిడివి కలదే అయినా, ఈ రెండుపేజీల్లో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన విశ్లేషణలు అక్షరలక్షలు చేస్తాయి. ఆధునిక సమాజంలో, ముఖ్యంగా కళా సృజనలో చొరబడిన దిగజారుడుతనానికి, వ్యాపార ధోరణులకు కారణాన్ని ఎత్తి చూపిస్తాయి. విద్య అప్లైడ్ ఆర్ట్స్ గా మారటం, అసలు విద్య కన్నా, ఎక్కువ గౌరవం, ఉపాధి పొందటం వంటి విషయాలు అందరూ తర్కించవలసిన విశ్లేషణలు.
‘కళను అప్లైడ్ ఆర్ట్ గా వాడుక చేసి సామూహిక శ్రమతోనో, యాంత్రికంగానో ఇండస్ట్రీలలో ప్రయోగించి, వ్యాపార వస్తువుగా మార్కెట్ (విపణి)లో ప్రవేశ పెట్టటం వల్ల కోట్లాది ప్రజలు ఆ కొద్ది ఆనందానికే తృప్తిపడి తక్కువైనా తగిన మూల్యం చెల్లిస్తారు కనుక వ్యాపారికి ఇదే వేరేరకమైన లో-గ్రేడ్ సృజన. ఈ సృజన, ఈ ఉత్పత్తి సంస్థలూ, ఈ విపణీ అనంతమైన శక్తి, యుక్తులతో అవసరాలనీ, సహజాలనీ భ్రమ కల్పించే స్ట్రాటజీలు కలిగి ఉంటాయి’
‘హిట్టింగ్ ది నెయిల్ ఆన్ ది హెడ్’ అంటే ఇదే!
తన జీవిత కథ చెప్తూ మధ్య మధ్యన సంగీత శాస్త్రాన్ని వివరించే ‘సంగీతం-విభేదము అనుసంధానము’, ‘స్వరాల రుచులు’, ‘వయొలిన్ వాద్యం నిర్మాణ విశేషాలు’ లాంటి అధ్యాయాలను పొందుపరుస్తూ, హఠాత్తుగా అత్యద్భుతమైన వ్యక్తిత్వాలను పరిచయంచేస్తూ, నడుమ నడుమ అత్యంత లోతైన ఆలోచనలను వ్యక్తపరుస్తూ సాగే ఈ పుస్తకాన్ని చదవటం ఒక రోలర్ కోస్టర్ ప్రయాణం లాంటిది. ఉక్కిరిబిక్కిరౌతాము. సంభ్రమాశ్చర్యాలకు గురౌతాము. ఆనందాంబుధిలో మునిగితేలతాము. అంతలోనే గతించిన అద్భుతమైన కాలం తలపుకు వచ్చి విషాదానికి గురవుతాము. అయినా ప్రయాణం మానము. ఒక పేజీ తరువాత మరో పేజీ చదువుతూ, రచయిత అక్షరాల ద్వారా చిత్రించిన దృశ్యాలను చూస్తూ, అనుభూతులతో తాదాత్మ్యం చెందుతూ సైన్స్ ఫిక్షన్ రచయితలు ఊహించే టైమ్ మెషీన్లో ముందుకూ వెనుకకూ ప్రయాణిస్తూన్నట్టు, ప్రతి పేజీ తిప్పుతూంటే తరువాత పెజీలో ఏ అద్భుతమయిన మణిమాణిక్యాల్లాంటి విషయాలున్నాయో అన్న ఉత్కంఠతో ముందుకు సాగుతూ మరపురాని అనుభూతిని పొందుతామీ పుస్తకాన్ని పఠిస్తూ.
నిజానికి ఈ పుస్తకం ఒక జీవిత చరిత్ర, జ్ఞాపకాల సమాహారం, శాస్త్రీయ సంగీత పాఠం, సామాజిక చిత్రణ, మినీ విజ్ఞాన సర్వస్వం, ఉత్తమ వ్యక్తుల పరిచయ పుస్తకం, సామాజిక విశ్లేషణ, సంగీత శాస్త్ర పరిచయ పుస్తకం, ఇలా అనేకానేక పుస్తకాలన్నీ తనలో పొందుపరచుకున్న ‘జీవాళి’ పుస్తకం తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక వరం.
ఈ పుస్తక తయారీ ఆలోచన చేసి, ద్వారం దుర్గా ప్రసాదరావుగారు ఈ పుస్తకం రాసేందుకు కారణం అవటమే కాక, పుస్తకాన్ని అందంగా ముద్రించి అందచేసిన ప్రచురణకర్త, పుస్తక సంపాదకుడు ఎన్. కె. బాబుకు అభినందనలు, ధన్యవాదాలు.
తెలుగు చదవగలిగే ప్రతి ఒక్కరు కొని, చదివి, దాచుకోవాల్సిన పుస్తకం ‘జీవాళి’.
***


రచన: ద్వారం దుర్గా ప్రసాదరావు
ప్రచురణ: ఎన్. కె. ఎన్.కె. పబ్లికేషన్స్, విజయనగరం.
సంపాదకులు: ఎన్. కె. బాబు
సహ సంపాదకులు: మోదుగుల రవికృష్ణ
పేజీలు: 354
వెల: ₹ 600
ప్రతులకు:
ఎన్.కె. పబ్లికేషన్స్,
24-8-1, సమీరా రెసిడెన్సీ,
విజయనగరం 535002
Ph: 9440343479
~
ప్రచురణకర్త శ్రీ ఎన్. కె. బాబు, రచయిత శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గార్ల ప్రత్యేక ఇంటర్వ్యూ లింక్:
https://sanchika.com/special-interview-with-nkb-and-ddprao/