[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘జయహో జనని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. ]
నిన్న ఈ వేళకు
ప్రేమతో మాట్లాడింది
నేడు ఇందాకే
కాలి బూడిదైంది
ఈ చితాభస్మంలో
ఇప్పుడు అమ్మను
ఎక్కడ వెతుక్కోవాలి
నిన్నటి వరకు
ఎన్నో పర్యాయాలు
దగ్గరకు తీసుకొని
ముద్దుగా స్పర్శించింది
ఈ ప్రపంచంలో
అంతటి మృదుస్పర్శ
ఎవరి నుండి పొందాలి
గతాన్ని తలుచుకుంటే
దుఃఖం ప్రవాహమై
కట్టలు తెంచుకొని
పొంగి పొర్లుతుంది
ఏదీ ఆ సాటి రాదు
ఇప్పుడు ఎవర్ని
అమ్మా అని పిలువాలి
ఆ చేతి చలువకే
వికసించిన పూలున్నాయి
స్పందించే కుసుమాలు
స్తంభించి పోయాయి
పార్థివ దేహంపై పడి
సుమ బాలలు పడిపడి
మౌనంగా రోధిస్తున్నాయి
మృతి లేనిది
అమ్మా అనే పదం
ఐనా కూడా మృత్యువు
అమ్మను మరిచిపోలేదు