జనారణ్యాలన్నీ నిర్మానుష్యమై
నిశ్శబ్ద నిశీధిని తలపిస్తున్నాయి
కంటికి కనిపించని శత్రువు
ఆకస్మికంగా దాడిచేస్తుందనే భయంతో
నాలుగు గోడల నడుమ
తనను తానే బంధించుకున్న విచిత్రమైన దుస్థితి
ప్రకృతిని చెరబట్టిన నీచమానవుని దురహంకారానికి
ప్రకృతిమాత ఆగ్రహించిన వైనం
విశ్వమానవుడు భీతితో బిక్కుబిక్కుమంటూ
బహుభారంగా చీకటి జీవితాన్ని ఆస్వాదిస్తోంటే
అనాగరిక అడవి బిడ్డలు
మూగజీవాలు,క్రూరమృగాలు,సాధుజంతువులు, పశుపక్ష్యాదులు
నగర జీవనాన్నినిర్భయంగా…ఆనందంగా
ఆస్వాదిస్తోన్న కమనీయ దృశ్యం!
ఓ మనిషీ!
ఇకనైనా నువ్వు మనిషిగా జీవించకు
ప్రకృతిని ప్రేమిస్తూ
ప్రకృతిని ఆరాధిస్తూ
మృగంలా జీవించు!
మానవజాతిని మేలు గొల్పుతూ
మృగసంతతి నగరవీధులలో నడయాడుతోన్న అద్భుత దృశ్యం!
ఆధునిక మానవుడికి కనువిందు చేస్తూ
కనువిప్పు కలిగిస్తోన్న సుమనోహర చలనచిత్రమే కదా!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.