[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమకు హిందీ భాష నేర్పిన గురువుల గురించి వివరిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.]
మా కూచిపూడి గ్రామంలో మహర్షి దయానంద సరస్వతి ఆశయాలకు అనుగుణంగా ఆర్య సమాజం నడుపబడుచున్నది. దానికి అనుబంధంగా ఆర్య మహిళా సమాజం కూడా స్థాపించబడి ఈనాటికీ ఇతోధికంగా కృషి చేస్తున్నది. కూచిపూడి లోని ఆర్య సమాజాన్ని కళా ప్రపూర్ణ పండిత గోపదేవ్ గారు స్థాపించారు. వారు అందులోని సభ్యులందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా యజ్ఞోపవీతధారాణ చేయించి, వేదాభ్యాసంతో పాటు, హిందీ, సంస్కృత భాషాలు కూడా నేర్పేవారు. వీటితోపాటు కర్రసాము లాంటి ఆత్మరక్షణ విద్యలెన్నింటి బోధించేవారు. గోపదేవ్ గారి బోధనల ఫలితంగా మా గ్రామం లోనూ, ఇంకనూ అనేక ప్రాతాలలోని వ్యక్తులు ఇప్పటికీ నిత్యాగ్నిహోత్రం తమ ఇళ్ళల్లో నిర్వహించుకుంటున్నారు.
గోపదేవ్ గారి శిష్యరికంలో ఆనాడు ఎందరో గృహిణులు వేదాభ్యాసంతో పాటు హిందీ సంస్కృత భాషలలో ప్రావీణ్యత గడించారు. అలా ప్రావీణ్యత గడించిన గోపదేవ్ గారి శిష్యురాండ్రలో శ్రీమతి యలవర్తి సీతారత్నం గారు ప్రసిద్ధులు. ఆమె ఆర్య మహిళా సమాజ భవనానికి కృషి చేసి దాతల సహకారంతో నిర్మింపజేశారు. తన ఇంట్లో పనులన్నింటినీ ముగించుకుని శిష్యురాండ్రతో కలిసి రోజూ ఆర్య మహిళా సమాజానికి వెళ్లి అగ్నిహోత్రాది కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పటికి గోపదేవ్ గారి మిగతా శిష్యురాండ్రు వృద్ధాప్య కారణలతో సమాజానికి రాలేని పరిస్థితులు ఉండటం వలన సీతారత్నం గారే ఆర్య మహిళా సమాజాన్ని నిర్వహించేవారు, అందరికీ ఆమె అక్కయ్య గారే. అక్కడ కుట్టుమిషన్లే కాక నాలాంటి పుస్తక ప్రియులకు చక్కని గ్రంథాలయం వుండేది. గోపదేవ్ గారు రచించిన వైదికసాహిత్యమైతే లెక్కకు మిక్కిలిగా వుండేది.
నా జీవితంలో మరుపురాని వ్యక్తి శ్రీమతి యలవర్తి సీతారత్నం అక్కయ్య గారు. నేను హైస్కూల్లో చదివేటప్పుడే వేసవి సెలవుల్లో అక్కయ్య గారి దగ్గరకెళ్ళి మిగతా కొందరితోపాటు హిందీ ప్రాథమిక చదవటం మొదలుపెట్టాను. మే, జూన్ శెలవు రోజుల్లోనూ, ఆ తర్వాత ఆగస్టులో పరీక్ష తేదీ వరకు సాయంకాలం పూట స్కూల్ అయింతర్వాత హిందీ క్లాసులకు వెళ్లేదాన్ని. ఆగష్టులో పరీక్షలు జరిగే మాకు, హిందీ రాష్ట్రభాష వరకు కూచిపూడి హైస్కూలే పరీక్ష సెంటర్గా వుండేది. పరీక్షకు కావలసిన పుస్తకాలు తెచ్చి ఇవ్వటం, చదువు చెప్పటం, ఆ తర్వాత పరీక్ష రాయటానికి అప్లికేషన్లు పూర్తి చేసి వాటిని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారికి పంపడం, ఆ తర్వాత హాల్ టిక్కట్లు తెప్పించి పరీక్ష తేదీన హైస్కూల్కు తీసుకెళ్ళి పరీక్షలు రాయించటం, ఉత్తీర్ణులయిన తర్వాత ఆ సర్టిఫికెట్లను సమాజ వార్షికోత్సవంలో పెద్దల చేత ఇప్పించటం ఇవ్వన్నీ అలవోకగా అక్కయ్య గారే చూసుకునేవారు.
శెలవు రోజుల్లో పెందలకడు 11 గంటల కల్లా భోజనం చేసి, మేమంతా అక్కయ్యగారింటికి వెళ్లేవాళ్లం. ఆ తర్వాత అందరం కలిసి సమాజానికి నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. ఒక తల్లిలాగా వెంట వుండి ఆమె మమ్మల్ని తీసుకెళ్లి తీసుకొచ్చేవారు. ప్రాథమిక నుండి రాష్ట్ర భాషా, ప్రవీణ వరకు అక్కయ్య గారే బోధించేవారు. తమ క్లాసు అయిపోయిన వారు కుట్టుమిషన్ల దగ్గరకెళ్లి నేర్చుకునేవారు. నేను కొద్దిగా కుట్టు మిషన్ పనీ; ఆ తర్వాత ఒక్క పుస్తకం కూడా వదలకుండా గ్రంథాలయం లోని పుస్తకాలన్నీ చదివేదాన్ని. తెల్లని ఖద్దరు చీరెలో, భుజాలనిండా కొంగు కప్పుకుని ఎండగా వున్నప్పుడు ఆ కొంగునే తల మీద కూడా ఆచ్ఛాదన చేసుకుని హుందాగా నడుస్తూ వచ్చేవాళ్లు. అప్లికేషన్ల లాంటివి పోస్టులో పంపాల్సి వచ్చినప్పుడు కూడా అలాగే నడుస్తూ ఎండనపడి పోస్టాఫీసుకు తరచూ ఒక్కరే వెళ్లి వస్తు వుండేవారు. కల్యాణ్, సమాచార్ లాంటి హిందీ మ్యాగజైన్సు తెప్పించి మమ్మల్ని చదవమని ప్రోత్సహించేవారు. అలా రాష్ట్రభాష వరకూ పూర్తయింది. ఆ తర్వాత హిందీ ప్రవేశిక పరీక్షకు చదవటం ప్రారంభించాను. అంతా మాకు ఉచిత శిక్షణే. ఇంకా అక్కయ్య గారు ఊరుకోకుండా మా ఊరి హైస్కూల్ లోని సంస్కృతం మాస్టారిని సాయంకాలాలలో పిలిపించి సంస్కృతం పరీక్షలైన ‘ప్రారంభ’ నుంచి ‘కోవిద’ వరకు పిల్లలకు చెప్పించేవారు, వాటికీ పరీక్ష సెంటరు మా హైస్కూలే,
శ్రీమతి యలవర్తి సీతారత్నం
ప్రవేశిక నుండీ విశారద, రాష్ట్ర భాషా ప్రవీణ పరీక్షలకు పరీక్ష సెంటరుగా తెనాలి లోని తాలూకా హైస్కూలే సమీప ప్రాంతాల వారందరికీ పరీక్షల సెంటర్గా వుంటుంది. మళ్లీ మమ్మల్ని తెనాలి తీసుకెళ్లి పరీక్షలు రాయించి తీసుకొచ్చే బాధ్యత కూడా అక్కయ్య గారిదే. ఆమె ఎంతో తపనతో మాకు ముందే చెప్పి వుంచేవారు. “మీరు పరీక్ష రాసే రూమ్ కున్న వరండాలోని కిటికీ దగ్గరకొచ్చి ఎదురుగా నిలబడతాను. మీరు పరీక్ష పేపరంతా చదివి మీకన్ని ప్రశ్నలు తెలిసి పేపరు తేలిగ్గా వుంటే ఫర్వాలేదని తలకాయ ఊపండి. కష్టంగా వుంటే తల అడ్డంగా ఊపండి, నేను అది గమనించి వెళ్లిపోతాను. మీరంతా పరీక్ష రాసేవరకూ నేను ఏదైనా విశ్రాంతి గదిలో కూర్చుని వుంటాను” అని చెప్పేవారు. అక్కయ్య గారి తృప్తి కోసం నేను ఎప్పుడూ పేపరు తేలిగ్గానే వుందని తల ఊపేదాన్ని. నన్నొక్కదాన్ని కూడా తీసుకెళ్లి తెనాలిలో పరీక్ష వ్రాయించి తీసుకొచ్చిన సందర్భాలు వున్నాయి.
ఆర్య మహిళా సమాజ రజతోత్సవ సంచికను ప్రచురించారు. అందరూ తమ రచనల తెలుగులో వ్రాసి పంపారు. నేను మాత్రం ‘కబ్ ఖిలేగా? కబ్ ఖిలేగా’ అంటూ ఆర్ష సంస్కృతి మీద హిందీలో కవిత రాశాను. దానికి మా అక్కయ్య గారు ఎంతో మురిసిపోయారు. సంచిక ఆవిష్కరణ వార్షికోత్సవ సందర్భంగా జరిగింది. ఆ సభకు వచ్చిన అతిథులతో నాకు ప్రత్యేకంగా ఖద్దరు శాలువా కప్పి, మా అక్కయ్య గారు సత్కరింపజేశారు. ఆ సంచిక ప్రచురణ కోసం మా అక్కయ్య గారు ఎంతో శ్రమించారు. ఊరిలోని దాతల దగ్గరకు ఆర్థిక సహాయం కోసం మా పిల్లల్ని కూడా వెంట తీసుకొని వెళ్లారు అప్పుడు నేను మా గ్రామపు ఎక్కువ భాగం చూసి, చాలా మంది వ్యక్తులను చూశాను. మాలో ఎవరైనా చదువు మధ్యలో ఆపేస్తే అక్కయ్య గారు తెగ బాధపడి పోయేవారు. మరలా హిందీ క్లాసులకు రమ్మని కబురు చేసేవారు. అప్పటికీ రాకపోతే తానే స్వయంగా వారింటికి వెళ్లి తల్లిదండ్రులకూ పిల్లలకూ నచ్చజెప్పి మరలా తరగతులకు వచ్చేటట్లు చేసేవారు. నా విషయంలో అలాగే జరిగింది. సంతానం లేని అక్కయ్య గారికి మేమే కన్నబిడ్డలం. అక్కయ్య గారి భర్త కూడా ఏనాడూ, మమ్మల్ని ఎవర్నీ ఒక్క మాట అని ఎరుగరు. వారి ఇంట్లో అందరం స్వేచ్ఛగా తిరిగేవాళ్లం. వందల మంది విద్యార్థులకు జాతీయ భాష హిందీలో తర్ఫీదు ఇచ్చి, వారికి జీవనోపాధి కల్గించిన ధన్యురాలు అక్కయ్యగారు.
వారి ఇంటి పెరట్లో ఆ రోజుల్లోనే కాలీఫ్లవర్ పూలు పూస్తే ఎంతో సంతోషంగా మమ్మలనందినీ పిలిచి చూపించారు. అప్పటి ఒక భిన్న సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. కాలీఫ్లవర్ మొక్కల్లో ఒక చిన్న, బలహీనమైన మొక్కకి కూడా ఒక చిన్న పూవు పూపింది. అక్కయ్య గారి స్నేహితురాలు, ఒక రకంగా గురుతుల్యులు అయిన తులసి అక్కయ్య గారు కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు. ఆ మొక్కను చూసి “అమ్మాయి సీతారత్నం! ప్రకృతి చిత్రం చూడు. చిన్న మొక్కకు కూడా చిన్న పూవు పూసింది. మనుషుల కెందుకు ఆ అదృష్టం వుండదో” అంటూ కూడా కనుకొలకల్లో నీరు పెట్టుకున్నారు. ఆ మాటలు విన్న సీతారత్నం అక్కయ్య గారికే కాక మాకు కూడా ఆమెకి ఒక్క నలుసైనా వుంటే బాగుండేది అనిపించింది. తులసక్కయ్య గారు మంచి తెలివితేటలు గలిగిన స్త్రీమూర్తి. ఒకటి రెండు చిన్న పుస్తకాలు కూడా వ్రాశారు.
రాష్ట్ర భాషా ప్రవీణ పరీక్షలు కూడా వ్రాసి పూర్తి చేశాను. ఉపాధ్యాయ శిక్షణ కోర్సు అయిన ‘హిందీ ప్రచారక్’ కోసం కాలేజీ కెళ్లాలి. మాకు సమీపంలో ఉన్న తెనాలిలోని ‘హిందీ మహావిద్యాలయ’ లో చేరి ఏడాది పాటు చదవాలి. అక్కయ్య నన్ను బాగా ప్రోత్సహించారు. నాకు కూడా బాగా కోరికగా వున్నది. అక్కయ్య గారే తెనాలి కూడా వెళ్లి మాట్లాడి కాలేజీలో సీటు ఖరారు చేసుకొచ్చారు. మరలా అక్కయ్య గారే తీసుకెళ్లి కాలేజీలో చేర్చి హాస్టల్లో గూడా చేర్పించి వచ్చారు. మా కుటుంబ సభ్యులతో పాటు ఆమె కూడా తెనాలి వచ్చినపుడు నా దగ్గరకు వచ్చి యోగ క్షేమాలు కనుక్కునేవారు. ఆ ప్రచారక్ కూడా పూర్తి చేసి ఇంటికొచ్చాను, తదనంతర కాలంలో కూడా మా దంపతులతో అక్కయ్య గారు చాలా సన్నిహితంగా వుండేవారు. నేను ఉద్యోగ జీవితంలో వుండగా వారెప్పుడైనా ఉత్తరాలు వ్రాసేవారు. వాటిని నేను పదిలంగా దాచుకున్నాను.
మా కూచిపూడి గ్రామంలో ఎంతోమంది హిందీ ఉపాధ్యాయులయ్యారంటే అది మా సీతారత్నం అక్కయ్య గారి చలవే. వారు చిరస్మరణీయులు. ప్రస్తుతం మా మధ్య వారు లేకపోయినా నాలాంటి వారి మనసుల్లో ఎంతో ఇష్టంగా మెదులుతునే వుంటారు. ఎవరు కనిపించిన వెంటనే రెండు చేతులెత్తి నమస్కారం పెట్టటం నాకు ఆమె నేర్పించిన సంస్కారమే. ఆమెకు అనేక నమస్సులు.
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి.
వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.