[సంచిక కోసం శ్రీమతి డా. రాధ కుసుమ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
సాహితీ క్షేత్రంలో.. డా. రాధ కుసుమ:
కుసుమ.. ఇంటిపేరు వినగానే వెంటనే పాత తరానికి చెందిన, నూట ఇరవై ఐదేళ్లనాటి కీ.శే. కుసుమ ధర్మన్న గుర్తుకు వస్తారు. వీరు తెలుగులో ‘మొదటి దళితకవి’ గా ప్రసిద్ధులు. నేటి తరానికి వీరు అంతగా తెలియకపోవడానికి ప్రధాన కారణం, ప్రభుత్వపరంగా గాని ఇతర సాహితీ సంస్థల ద్వారా గాని ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడమే. సాహిత్య పరంగా, సామజిక సేవల పరంగా ధర్మన్నగారి చరిత్ర మరుగున పడిపొయింది. ఇప్పుడు నేటి తరం కోసం ధర్మన్నగారి సాహిత్యాన్ని వెలుగులోనికి తీసుకురావడానికి శ్రీ ధర్మన్న గారి మనుమరాలు (మనుమడి భార్య) శత విధాల తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరే కవయిత్రి శ్రీమతి డా. రాధ కుసుమ. సాహిత్యపరంగా వీరు కవయిత్రి, సంగీతపరంగా మంచి గాయని. ఈ కవయిత్రి తన సాహితీ ప్రస్థాన విశేషాలని ఇంకా ఏమి చెబుతారో చూద్దామా..
~
* డా. రాధ కుసుమ గారూ నమస్కారం. ‘సంచిక’ అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.
డా. రాధ కుసుమ: నమస్కారం డా. ప్రసాద్ గారూ.
~
ప్రశ్న1. రాధ గారూ, తెలుగు భాష, తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఎప్పుడు ఎలా కలిగింది? వివరంగా చెప్పండి.
జ: నాకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష అంటే అభిమానం. బడిలో తెలుగు మాస్టారు పాఠం వినడం ఎంతో ఇష్టం. అప్పటినుంచి నాకు తెలుగు భాష అంటే అభిమానం. నేను పాఠశాలలో తెలుగు టీచర్గా ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి పాటలు, నాటికలు రాసి వేయించేదాన్ని. అలా నాకు సాహిత్యం పట్ల మక్కువ కలిగింది.
చిన్నప్పటినుంచి కథలు రాయడం, పుస్తకాలు చదవడం, చిన్న చిన్న గేయాలు రాయడం ఎంతో ఇష్టం.
డా. రాధ కుసుమ
ప్రశ్న 2. మీరు చదువుకునే రోజుల్లో, మీకు, మీ సేహితులకు మధ్య తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉండేది?
జ: నాది బాల్య వివాహం కాబట్టి ఎవరితో సాహిత్యపు చర్చలు అనేవి జరిగేవి కావు. నేను మాత్రమే ఒంటరిగా అనేక పుస్తకాలు గ్రంథాలయం నుంచి తెప్పించుకొని చదివేదాన్ని. ఆనాటి గొప్ప కవుల పుస్తకాలన్నీ చదివాను. అలా చదవడం వల్లే కొంత తెలుగు భాష పట్ల ఆసక్తి పొందడం జరిగింది.
ప్రశ్న 3. తెలుగు సాహిత్యంలో మీకు ఏ ప్రక్రియ అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఎందుచేత?
జ: నాకు ఎక్కువగా కవితలు రాయడం చాలా ఇష్టం. కవితలు అయితే మన భావాన్ని అంతా ఒక్కసారిగా రాసి ఆనందాన్ని పొందవచ్చు. కవితలు సుమారు 4 వేల వరకు రాసాను. అన్నింటినీ ముద్రించలేదు. కొన్ని మాత్రమే చేసాను. చాలా కవితల పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి.
రవీంద్ర భారతిలో ఒక సాహిత్య సమావేశములో కవయిత్రి
ప్రశ్న 4. మీ రచన మొట్టమొదట ఏ పత్రికలో ఎప్పుడు ప్రచురింపబడింది? అప్పటి మీ అనుభూతి చెప్పండి.
జ: గణేష్ పత్రికలో నా మొట్టమొదటి కవిత పడింది. చాలా ఆనందం అనిపించింది. సామాజిక అంశం మీద రాశాను. అప్పట్లో అన్ని పత్రికలకు పంపాలనే అవగాహన తక్కువగా ఉండేది. ఈ కవిత కూడా FB నుండి తీసుకుని పత్రికలో వేసారు. నా ఆనందానికి అవధులు లేవు. చాలా గొప్పగా అందరికి చూపించుకుని చాలా సంతోష పడ్డాను.
ప్రశ్న 5. తెలుగు సాహిత్యంకు సంబంధించి మిమ్ములను ప్రోత్సహించిన గురువు ఎవరైనా ఉన్నారా? కవయిత్రిగా ఇంట్లో మీకు ఎలాంటి ప్రోత్సాహాం లభిస్తున్నది?
జ: అన్ని సమూహాల్లో కవితలు రాయడం జరిగేది. రోజు ఆరు ఏడు కవితలు రాసే అలవాటు ఉండేది.
ఏ అంశమైనా రాయడానికి ప్రయత్నిస్తూ, బాగా రాయాలనే తపన మెండుగా ఉండేది. ఎందుకో కథలు రాయడంలో ఆసక్తి తక్కువగా ఉండి కవితలు రాయడం లోనే ఇష్టం చూపేదాన్ని.
ఇంట్లో చాలా సంతోష పడతారు. మా కోడళ్ళు ఎక్కువగా ఆనందిస్తారు. చదువుతారు. పత్రికల్లో వచ్చిన వార్తలను నాకు సంబంధించి చదువుతారు. మురిసిపోతుంటారు. వాళ్ళ సహకారం ఉండడం వలనే ఈరోజు 800 పైన కవి సమ్మేళనాలు చేయగలిగాను. వాళ్ళు పేరుకే కోడళ్ళు కానీ నన్ను అమ్మలాగా చూసుకుంటారు. నాకెంతో ఇష్టం వాళ్ళంటే. ఇద్దరికీ తండ్రి లేరు. నేనే అన్ని వాళ్ళకి. పెద్ద కోడలు హిందీ భాషలో కవితలు రాస్తూ ఉంటుంది.
కవయిత్రి కళావతి కందగట్ల గారి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రఖ్యాత కవులు నానీలు సృష్టికర్త గోపీ గారు, డాక్టర్ KLV ప్రసాద్ గారు, మైమ్ కళాకారులు కళాధర్ గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ గారు, కళావతి గారు ఇంకా అనేక మంది ప్రముఖులతో కవయిత్రి
ప్రశ్న 6. మీ కవిత్వం మీ కుటుంబీకులు తప్పకుండా చదివి సమీక్షించడం/విమర్శించడం వంటివి చేస్తారా? అసలు మీరు విమర్శలను ఇష్టపడతారా? వివరించండి.
జ: నా కవితలను చదివిన ప్రతిసారి కుటుంబీకులు మెచ్చుకుంటారు. కొన్నిసార్లు విమర్శిస్తారు. సద్విమర్శలను తప్పకుండా స్వీకరించి నా లోపాలను సరిదిద్దుకుంటాను.
కుసుమ ధర్మన్న గారి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కుసుమ ధర్మన్న కళాపీఠం జరిపిన సన్మానం
ప్రశ్న 7. మీరు రచనా వ్యాసంగంలోనికి ప్రవేశించాక, ముద్రణకు నోచుకున్న మీ రచనల గురించి చెప్పండి.
జ: నా మొట్టమొదటి పుస్తకం రాధాకుసుమాలు. ఆ తర్వాత 6 పుస్తకాలు కవితలు, కథలు, పాటలు రూపంలో ప్రచురించాను. ఇంకా చాలా కవితలు ఉన్నాయి. అన్నీ తీయాలనే ఆలోచనలో ఉన్నాను.
కవయిత్రి పుస్తకాలు కొన్ని
నా పుస్తకాల కన్నా కూడా మా సమూహంలో రాసిన కవితలను ఎక్కువగా ముద్రించాను. ఈ మధ్యనే కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక వారు ‘కవిసమ్మేళన నిర్వహణ ప్రపూర్ణ’ అనే బిరుదు ఇవ్వడం జరిగింది.
ప్రశ్న 8. ఈమధ్య ఎక్కడ ‘కవిసమ్మేళనం’ మాట విన్నా అక్కడ మీ పేరు (నిర్వాహణ) కనిపిస్తున్నది. మీరు అంత శ్రమ తీసుకోవడం వెనుక ప్రత్యేకత ఏమైనా ఉందా? ఇప్పటివరకూ మీ ఆధ్వర్యంలో ఎన్ని కవిసమ్మేళనాలు నిర్వహించారు?
జ: కవి సమ్మేళనం అంటే నాకు చాలా ఇష్టం. అందరూ చదివే కవితలు వినడం, వాటి గురించి రెండు మాటలు మాట్లాడటం అంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకు. కవులందరూ కూడా తమ కవితల్లో ఏదో ఒక సందేశం పెట్టి చదువుతూ ఉంటారు. అవన్నీ వింటుంటే చాలా ఉత్సాహం కలుగుతుంది నాకు.
ఈరోజు వరకు 805 కవి సమ్మేళనాలు చేశాను.
తెలుగు భాష చైతన్య సమితి కార్యక్రమం త్యాగరాయ గాన సభ హైదరాబాద్ లో జరిగింది. ఆ సందర్భంలో కవయిత్రి
ప్రశ్న 9. మీరు కవిసమ్మేళనానికి ఆహ్వానించే కవయిత్రుల/కవుల రచనలు పరిశీలించి ఆమోదిస్తారా? లేక వారికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చేస్తారా?
జ: వేదిక వద్దకు వచ్చేవరకు నాకు వాళ్ళు ఏం రాశారో కూడా తెలీదు. వాళ్ళు చదివిన తర్వాత నేను దాని గురించి రెండు మాటలు మాట్లాడుతాను. కాకపోతే వివాదాస్పదమైన కవితలు రాయొద్దని ముందే చెప్తాను. వాళ్లకి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రాయాలని సూచించడం జరుగుతుంది..
ప్రశ్న 10. కరోనా విజృంభణ తర్వాత మనకు అనేక అంతర్జాల పత్రికలు అందుబాటులోనికి వచ్చాయి కదా! వీటిపై మీ అభిప్రాయం ఏమిటి? సూటిగా సెలవీయండి.
జ: అలా రాయడం మంచి పరిణామమే కదా. కరోనా ఎందరో కవులను ఏకం చేసింది. నాకు కూడా అంతర్జాల మాసపత్రిక ఉంది. దాని పేరు ‘కుసుమ జయభేరి’. ఒక సగటు మనిషికి కావలసిన సాహిత్యం అందిస్తున్నాను. ఎందరికో ప్రోత్సాహం అందజేస్తున్నాను.
మా తాతగారు ఆ రోజుల్లో ‘జయభేరి’ పత్రిక స్థాపించారు. అందుకనే నేను ‘కుసుమ జయభేరి’ అని పత్రికకు పేరు పెట్టాను.
ప్రశ్న 11. ‘కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక’ లో కూడా మీ పాత్ర వున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ వేదిక ప్రధాన ఆశయాలు ఏమిటి? ఈ వేదిక ద్వారా మీరు సాధించిన విజయాలు ఏమిటి?
జ: కాప్రా మల్కాజిగిరి కవుల వేదికలో నేను అడ్మిన్గా ఉన్నాను. పెద్దలు రాజేంద్రప్రసాద్ గారితో, దీపక్ న్యాతీ గారితో, మౌనశ్రీ మల్లిక్ గారితో మాట్లాడటం జరిగింది. అంతా కాప్రా వాస్తవ్యులే. మన నివాస ప్రాంతంలో కూడా అనేక మంది కవులు ఉన్నారు, వారందరినీ ఏకం చేసి ఒక సమూహాన్ని ఏర్పాటు చేద్దామని మాట్లాడుకోవడం జరిగింది. అందువలనే ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎస్ రావు పుట్టినరోజు వేడుకలు, బతుకమ్మ సంబరాలు, కవి సమ్మేళనాలు, ఇలా సాహిత్య కార్యక్రమాలు అనేకం చేసాము.
నన్నయ్య విశ్వవిద్యాలయంలో కుసుమ ధర్మన్న అవార్డు అక్కడ ఆచార్యులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ గారికి అందజేయడం జరిగింది. వైస్ చాన్సలర్ గారి సమక్షంలో.
ప్రశ్న 12. ‘కుసుమ ధర్మన్న కళా పీఠం’ గురించి వివరణ ఇవ్వండి.
జ: మా వారు కుసుమ కిచులు బాబు గారు. వారి తాతగారు కుసుమ ధర్మన్న గారు. ఆ విధంగా నేను వారికి మనమరాలిని అవుతాను. ఆయన మొట్టమొదటి దళిత కవి. వైతాళికుడు స్వాతంత్ర్య యోధుడు.
శ్రీ కుసుమ ధర్మన్న, చిత్రం: బి.బాపూజీ,హైదరాబాద్
అంబేద్కర్ ను దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. గాంధీ గారి శిష్యుడు. ఒక సమయంలో గాంధీ గారిని కూడా తన జాతి కోసం వ్యతిరేకించినటువంటివాడు. తన వాడకే వచ్చి సహపంక్తి భోజనాలు చేయాలని కోరినవాడు. అంబేద్కర్ను కూడా తన ఇంటికి రప్పించినటువంటివాడు.
ఆయుర్వేద వైద్యుడు. ఉచితంగా ప్రజలకు సేవ చేసినటువంటివాడు. మద్యపాన నిషేధకుడు. అనేక పుస్తకాలను రాశారు. మొట్టమొదటి దళితులకు బ్యాంకు ఏర్పాటు చేశారు. ధర్మన్న గారికి ప్రభుత్వం నుండి సముచితమైన గౌరవం లభించలేదని నా ఉద్దేశం.
వారి సొంత ఊరు అయినటువంటి రాజమహేంద్రవరంలో నేటికీ కనీసం వారి విగ్రహం కూడా లేదు. అందుకోసమే నేను వారి పేరు మీద ఈ సంస్థను స్థాపించాను.
తోచిన రీతిలో సహాయ సహకారాలు అందజేస్తున్నాను. సాహిత్యం అభివృద్ధి పరచాలని ఆశిస్తున్నాను.
అంటరానితనం నిర్మూలనకు కంకణం కట్టి ఉద్యమ కెరటమై గోదావరి నది ఒడ్డున ఉప్పెనవలే ధ్వజమెత్తిన తొలి దళిత కవిత వైతాళికుడు. ఆయనే మా తాతగారు.
అస్పృశ్యత విధానంలో నలిగిపోతున్న బలహీన బడుగు వర్గ హరిజనులకు వెలుగు దారి చూపి వారిని సన్మార్గంలో పెట్టడానికి ఎంతో కృషి చేసి వారికోసం దళిత బ్యాంకును స్థాపించి వారిలోని ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి శుచీ శుభ్రతను నేర్పి మంచి మార్గంలో పయనింప చేయడానికి వారికోసం జ్ఞాన దీపాన్ని వెలిగించిన వారు కుసుమ ధర్మన్న గారు. మద్యపాన నిషేధాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి దాని వల్ల కలిగే పరిణామాలను వివరించి తాగుడు మానేటట్లుగా చేశారు. తాను స్వయంగా గాంధీజీ అనుచరుడుగా ఉన్నప్పటికీ తన జాతి కోసం గాంధీజీని తన ఇంటికి రప్పించుకున్నవారు. అంబేద్కర్ మార్గాన్ని దక్షిణాదిన ప్రవేశింపజేసిన వారిలో ప్రముఖులు.
దళిత ఉద్యమ జయభేరి మ్రోగించిన పోరాట కవన యోధుడు. రోజురోజుకు కృషించిపోతున్న రోగగ్రస్థ సమాజానికి మెరుగైన వైద్యం అందించిన అరుదైన వైద్య విద్వాన్ కుసుమ ధర్మన్న. ఆనాటి దేశ రాజకీయాలపై పదునైన పదజాలంతో కవిత్వాన్ని శక్తివంతమైన అస్త్రాలుగా సంధించిన సాహస వీరుడు. అందరూ తెల్లదొరతనం పోవాలి అని ఘోషిస్తే దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని పసిగట్టి 1921 లోనే ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అంటూ గళమెత్తి చాటినవాడు.
ఉద్యమంలో భాగంగా ‘జయభేరి’ పత్రికను స్థాపించి దళితుల గుండెచప్పుడును జనానికి వినిపించిన వాడు. ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించి నిమ్న జాతులందరినీ ఏకం చేసినవాడు.
వారు రాసిన రచనలు ఆనాటి సామాజిక పరిస్థితికి నిలువుటద్దం. కుల వ్యవస్థను మత వ్యవస్థలోని మాలిన్యాన్ని కడిగేసి, మనోనూన్యతతో బాధపడేటువంటి హరిజన గిరిజనులను రక్షించే దిశలో ఆయన సాగారు. అతి చిన్న వయసులోనే మరణించారు.
ప్రశ్న 13. మీరు పొందిన అవార్డులు, సన్మానాల గురించి వివరించండి.
జ: ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటప్పుడు నాకు లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఇంకా అనేక సంస్థల నుండి, తెలంగాణ ప్రభుత్వం నుండి అనేక అవార్డులు వచ్చాయి. సాహిత్యంలో ఇప్పటివరకు చాలా అవార్డులు వచ్చాయి.
బిక్కి కృష్ణ అవార్డు అందుకుంటూ
పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకులూరి ఇనాక్ గారి నుండి అవార్డు పొందేటప్పుడు
ఇనాక్ గారు, ఇంకా ఎందరో మహానుభావుల చేతుల మీదుగా సన్మానం
ప్రశ్న 14. ఇప్పుడు తెలుగులో ఉత్సాహంగా కవిత్వం రాస్తున్న లేలేత కవులకు కవయిత్రులకు మీరిచ్చే సలహా?
జ: ముందుగా తెలుగు భాష పట్ల అభిమానం ఉండాలి. రాయాలి అనే కాంక్ష ఉండాలి. రాసినప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని పొందడానికి మనసు ఉండాలి.
రాస్తూ ఉంటే మనకు తెలియని ఆనందం కలుగుతుంది. అది చాలు కవిత్వం పట్ల ఆసక్తి పెంచుకొని ఆత్మానందం పొందగలగాలి. కేవలం అవార్డుల కోసం ఆత్రపడటం అనేది మంచి పద్ధతి కాదు. కవిత్వీకరిస్తూ రాస్తే సంతోషం వేరుగా ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే అంశాలను రాస్తే తద్వారా ఎంతో మంది ప్రేరితమవుతారు. కవులు నలుగురికి ఆదర్శంగా ఉండాలి.
చెప్పేది ఏదైనా ముందుగా మనం పాటించాలి. అప్పుడే కవితలు రాయాలి.
~
* ‘సంచిక’ వార, మాస పత్రికల తరఫున మీకు కృతజ్ఞతలు.
జ: ధన్యవాదాలండీ.
డా. రాధ కుసుమ +91 99892 41319
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.