Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ-6

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 6వ, చివరి భాగము.]

భాగవత కళ

తెరుకుత్తు, కావిడి చిందు, విల్లుపాటు, కురవంజి లాంటి స్థానిక నాట్యప్రక్రియలు మేలట్టూరు భాగవత కళలో చేరాయి. మరాఠాల కారణంగా ఉత్తర భారతదేశపు రీతులు కూడా కొన్ని అక్కడ ప్రవేశించాయి. మేలట్టూరు భిన్నమైన నాట్యప్రక్రియను ఆ విధంగా రూపొందించుకో గలిగింది. తంజావూరులోనే తెలుగు యక్షగానాలు అనేకం తమిళంలోకీ, మరాఠీ లోకీ అనువాదం అయ్యాయి. తెలుగు, తమిళ మరాఠీ భాషల సంగమంగా తంజావూరు నిలిచింది.

త్యాగరాజ స్వామి తాతగారు గిరిరాజ కవి తంజావూరు మరాఠా రాజుల కాలంలో రాజాస్థానంలో ఉండే వారు. తెలుగు యక్షగానాలకు ప్రత్యేకవ్యాప్తిని కలిగించిన వారాయన. మేలట్టూరు వెంకటరామ శాస్త్రిగారు గిరిరాజకవి కన్నా ఒక తరం ముందువాడు కాగా, నారాయణతీర్థుల వారికి ఒక తరం తరువాతి వాడు. మేలట్టూరు వెంకట్రామ శాస్త్రిగారు భాగవతమేళా ప్రక్రియకు చేసిన కృషి గొప్పది. ఆయన 10కి పైగా యక్షగానాలు వ్రాశారు. ఆయనను రామపండితుడని పిలిచేవారు!

తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో ‘రామపండితుల నాటకాలు’ అనే సంకలన గ్రంథం ఉన్నదని ఆరుద్ర పేర్కొన్నారు. నానావిధ నాటకాలు అనే పుస్తకంలో రామపండితుడితోపాటు మరికొందరి నాటకాలు ఉన్నాయన్నారు. పచ్చిమిరియం అడియప్ప భాగవతులు ఈయనకు సమకాలికుడు. ఈ అడియప్ప తండ్రి గోపాలకృష్ణశాస్త్రి చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడే వయోవృద్ధుడిగా ఉన్న నారాయణతీర్థుల వారివద్ద శిష్యుడై ఉంటాడని ఆరుద్రగారు అభిప్రాయపడ్డారు.

మేలట్టూరు భాగవత కళ అభివృద్ధిలో నారాయణతీర్థులవారు, ఆయన శిష్యులు కూడా భాగస్వాములే! భజన సాంప్రదాయాలకు నాట్యాన్ని జోడించి, ఉత్సవ సమయాలలో రథం ఊరేగింపు ముందు నర్తించే పద్ధతిని నారాయణతీర్థుల వారే ప్రారంభించారని చెప్తారు. ఒకవంక భక్తి, వేరొకవంక కళారాధనా రెండూ విడదీయ వీలులేని సమవాయబంధాన్ని కలిగిన రోజులవి. బహుశా మేలట్టూరు కళాకారులకు నారాయణతీర్థులవారి సూచనలు ఎంతగానో ఉపయోగపడి ఉంటాయని భావించవచ్చు.

మేలట్టూరులో ప్రతి సంవత్సరం నృసింహజయంతి నాడు భాగవత మేళా వారోత్సవాలు నిర్వహిస్తారు. 1888లో ఈ వారోత్సవాన్ని నిర్వహించిన దాఖలాలు దొరికాయి. కాబట్టి, 120 ఏళ్లుగా ఈ విధానం ఆచారంగా ఉందని అర్థం అవుతోంది. 1938 నుండీ తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. కంసవథ, సత్యహరిశ్చంద్ర, ప్రహ్లాద చరిత్రం, లాంటి యక్షగాన నాట్య ప్రబంధాల్ని ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. అలరిప్పులు, శబ్దాలు, స్వరజతులు, జతిస్వరాలు నిండిన భాగవత మేళా కళకు అభినయంలో హావభావాల అత్యున్నత వ్యక్తీకరణ, ఎముకలు లేవన్నంతగా శరీరాన్ని తేలికగానూ, వేగంగానూ, లయాన్వితంగానూ కదిలించగలగటం: క్షేప, రేచక, కదలికలు, శృంగారభక్తి, నాటకీకరణ ఇవి భాగవతమేళాలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

కథను మలుపు తిప్పటానికి కొరవంజి, కోణంగి లాంటి పాత్రలు ఉంటాయి. సోది చెప్పే పాత్ర కొరవంజిది కాగా, ఈ యక్షగానాలలో కోణంగిది హాస్య పాత్ర. పొట్టిగా లావుగా చూడగానే నవ్వు పుట్టించే వేషభాషలతో ఒక దరువు ఆడుతూ, పాడుతూ వేదిక పైకి వస్తాడు.

దక్షిణాదిలో 18వ శతాబ్ది వరకూ భరతనాట్యాన్ని తంజావూరు నాట్యకళగానే వ్యవహరించారు. దేవదాసీ వ్యవస్థలో భరతనాట్య ప్రక్రియ చిక్కుకు పోయిన కాలంలో భక్తినీ, రక్తినీ, సామాజిక చైతన్యాన్నీ రంగరించిన కూచిపూడి మరియూ మేలట్టూరు భాగవత మేళాలు మహిళా కళాకారుల్ని దూరంగా పెట్టారు. ఆధునిక కాలంలో నాట్యకళాకారులుగా స్త్రీలకు నిషేధాన్ని కూచిపూడివారు సడలించినా మేలట్టూరువారు కొనసాగిస్తూనే ఉన్నారు.

మేలట్టూరులోఈ నాట్యకళకు అంకితమై పనిచేస్తున్న రెండు సంస్థలను శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి సందర్శించాము.

శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి భాగవతమేళా నాట్య నాటక సంఘం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. మేలట్టూరు నటరాజన్ గ్రూపుగా ఈ సంస్థని పిలుస్తారు. నటరాజన్, ఆయన సోదరులు కుమార్ ఈ సంస్థకు వ్యాప్తిని తెస్తున్నారు. ఇంక రెండవ సంస్థ శ్రీ ఆర్ మహాలింగం ఆయన కుటుంబీకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మేలట్టూరు భాగవతమేళా నాట్య విద్యా సంఘం’.

నల్లీ సిల్క్స్ వారి సహకారంతో విశాలమైన ప్రాంగణంలో బహిరంగ రంగస్థలిని, అక్కడే ఒక విష్ణ్వాలయాన్ని నిర్మించారు.

వీరంతా మేలట్టూరు వెంకట్రామ శాస్త్రిగారి పది యక్షగానాలు ప్రదర్శిస్తుంటారు. వ్యక్తిగత పురస్కారాలు ఆశించకుండా కళకే అంకితంగా జీవిస్తున్నారు. వీరిలో శ్రీ నటరాజన్, శ్రీ కుమార్, శ్రీ ఆర్ మహలింగం ప్రసిద్ధులు. తమ కళారీతులను వారు మాకు అభినయించి చూపారు. వీళ్ళంతా తమ స్వంత వృత్తి వ్యాపారాలు చేసుకుంటూనే ఒకరి పైన ఆధారపడకుండా పరిరక్షిస్తున్నారు.

తమ మూలాలు తెలుగువే గానీ, మౌలికంగా తాము తమిళులమే నన్నారు శ్రీ కుమార్. కానీ, వయోవృద్ధులైన శ్రీ ఆర్. మహాలింగం తాము తెలుగులో మాట్లాడలేక పోయినప్పటికీ, తాము తెలుగు వారిమేననీ, కూచిపూడి భాగవతుల పరంపరలోని వారిమని ప్రకటించారు.

మేలట్టూరు నృత్యరీతిని పరిశీలించినప్పుడు, కళాకారుడికి విష్ణుభక్తి ప్రధానమైంది. ప్రాణం కన్నా కళకు ప్రాధాన్యత నిచ్చే నిబద్ధత, అంకితభావం చాలా ముఖ్యం. నారసింహపాత్రధారి మహా భక్తుడైతే తప్ప కేవల నటుడిగా ఈ పాత్రను ధరించలేడు. నారసింహ దీక్ష తీసుకుని, 40 రోజులు నియమబద్ధంగా జీవిస్తూ, ముందురోజు ఉపవాసం చేసి పరమ పవిత్రంగా ఈ పాత్రను అభినయిస్తాడు. ప్రహ్లాద చరిత్ర యక్ష గానంలో నరసింహస్వామి స్తంభంలోంచి వెలువడిన దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నరసింహ స్వామి పూని హిరణ్య కశ్యపుడిని నిజంగానే వధిస్తున్నంత భయానక అనుభూతి కలుగుతుంది. హారతులిచ్చి, పూజలు చేసి, పానకాలిచ్చి ఆ పాత్రధారిని శాంతింప చేస్తారు. నారసింహ దీక్ష తీసుకుని, దీక్షా నియమాలు పాటించకపోతే నరసింహుని పాత్రధారికి అపకారం జరుగుతుందని వారి నమ్మకం.

అక్కడ వరదరాజ స్వామి దేవాలయంలో నరసింహుని ముఖాకృతి (మాస్క్)ని భద్రపరిచి, నిత్య పూజలర్పిస్తున్నారు. నృత్య ప్రదర్శన నాడు ఈ ముఖాకృతిని ఊరేగింపుగా తెచ్చి వేదిక పైన ఉంచి పూజిస్తారు. స్తంభాన్ని కొట్టే దృశ్యానికి ముందు నరసింహ పాత్రధారి ముఖానికి ఈ మాస్కుని తొడుగుతారు. ప్రదర్శన అనంతరం మళ్ళీ భక్తిగా దేవాలయానికి చేరుస్తారు. ఇలా ఈ ముఖాకృతిని అనేక తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. వారిని సముచిత రీతిన గుర్తించాల్సిన బాధ్యత అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉంది.

తీర్థులవారి ఇతర రచనలు

నారాయణతీర్థులవారి రచనల్లో భక్తి సిద్ధాంత సంబంధాలు, సాంఖ్య న్యాయ తర్క శాస్రాలకు సంబంధించిన విషయాలు, పూర్వమీమాంస గ్రంథాలతో పాటు యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటిలో పండితులు నిర్థారించిన గ్రంథాలివి:

1. పారిజాతాపహరణం తెలుగు యక్షగానం 2. శాండిల్య భక్తిసూత్ర వ్యాఖ్య 3. భక్త్యధికరణ మాల 4. సాంఖ్యకారికా వ్యాఖ్య, 5.సాంఖ్య తత్త్వకౌముదీ వ్యాఖ్య 6. న్యాయ కుసుమాంజలీ టీక 7. న్యాయ ముక్తావళీ టీక 8. భాట్టభాషా ప్రకాశము 9. యోగ సిద్ధాంత చంద్రిక 10. సిద్ధాంత బిందు లఘు చంద్రిక 11. వేదస్తవ టీక 12. వేదాంత విభావనా టీక 13. హరిభక్తి సుధార్ణవం (సుధోదయం అనీ పిలుస్తారు) 14. సురేశ్వరాచార్య పంచీకరణ వార్తికానికి వ్యాఖ్య.

అయితే, కృష్ణలీలాతరంగణి లాంటి భక్తి వేదాంత ఉపనిషత్సార గ్రంథాలు వ్రాసిన వ్యక్తి పతంజలి యోగ సూత్రాలకు వ్యాఖ్యాన గ్రంథాలు వ్రాశాడంటే కొందరికి నమ్మకం కుదరలేదు. నారాయణతీర్థుల తండ్రి, గురువు స్వస్థలం లాంటి విషయాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉండటాన, ఆ వైరుధ్యాలను చూపించి, ‘యోగ సిద్ధాంత చంద్రిక’ లాంటి గ్రంథాలను ఈ నారాయణతీర్థులు వ్రాయలేదనీ, దాని గ్రంథకర్త వేరే నారాయణతీర్థులనీ భావించేవారు ఉన్నారు. ఈ గ్రంథాల్లో కొన్ని అలభ్యం. కొన్ని అముద్రితం. వాటిని చూసినవారు కూడా అరుదు. కాశీలో కొన్ని, తంజావూరులో కొన్ని ఉన్నాయని చెప్తారు.

శ్రీ కృష్ణలీలాతరంగిణి (సంస్కృతం యక్షగానం), పారిజాతాపహారం (నాట్యనాటకం, తెలుగు), శాండిల్య భక్తి సూత్రవ్యాఖ్య, భక్త్యధికరణమాల, హరిభక్తిసుధార్ణవం,వంటి ఆధ్యాత్మికరచనలెన్నో చేశారు. సాంఖ్యకారికలకు ‘సాంఖ్య చంద్రికా’, ‘సాంఖ్యతత్త్వ కౌముదీ వ్యాఖ్య’ అనే రెండు వ్యాఖ్యానాలు వ్రాశారు. అద్వైత సిద్ధాంతం అర్థం కావటానికి సాంఖ్య సిద్ధాంతాల అధ్యయనం అవసరం అనే భావనతో ఈ వ్యాఖ్యానాలు చేశారాయన.

న్యాయకుసుమాంజలీ టీక, న్యాయముక్తావళి, భాట్టభాషా ప్రకాశం, యోగసూత్రవ్యాఖ్య, సిద్ధాంతబిందుః, లఘుచంద్రికా, వేదస్తవ టీక, వేదాంతవిభావనా టీక, పంచకోశమంజరి మొదలైన గ్రంథాలు వ్రాశారని తెలుస్తోంది. సుబోధిని పేరుతో బ్రహ్మసూత్రాలకు శంకరభాష్యంపై వ్యాఖ్యానం వ్రాశారు.

చిత్తవృత్తి నిరోధ రూపమైన యోగసాధన అద్వైత బ్రహ్మ సాక్షాత్కారానికి దోహదం చేస్తుంద్ది కాబట్టి, యోగ చంద్రిక పేరుతో పతంజలి యోగ సూత్రాలకు భాష్య గ్రంథం వ్రాశారు. డా. ధూళిపాళ రామకృష్ణ “వేరే వ్యాఖ్యాతలెవరూ ప్రస్తావించని యోగ రహస్యాలను తీర్థులిందులో వెల్లడించారు” అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ గ్రంథం మీద తమిళ పండితుల్లో విశేషమైన చర్చ జరిగింది. దానిని వ్రాసిన నారాయణతీర్థులు, మన నారాయణతీర్థులు ఒకరు కారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

కానీ యోగ, తర్క శాస్త్ర గ్రంథాలు ఇంకా అనేకం తీర్థులవారి పేరుతో కనిపించటాన్ని బట్టి యోగ చంద్రిక పైన అనుమానం అనవసరమేనని పండితులు భావిస్తున్నారు.

ద్వైత సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ, న్యాయ శాస్త్రీయ అంశాల పరిచయాన్ని అందిస్తూ, ‘న్యాయ కుసుమాంజలీ’ టీక, ‘న్యాయముక్తావళి’ టీకలను రచించారు. భట్టభాషాప్రకాశః అనే పూర్వమీమాంస గ్రంథం వ్రాశారు. శంకరుడి బ్రహ్మసూత్రాల భాషానికి సుబోధినీ పేరుతో వివరణ వ్యాఖ్య వ్రాశారు. వీరి బ్రహ్మ విద్యా తరంగిణి గ్రంథానికి అప్పయ్య దీక్షితుల వంశీకులైన త్యాగరాజ మఖి వ్యాఖ్యానం వ్రాశారని చెప్తారు.

సురేశ్వరాచార్య వ్రాసిన పంచీకరణ వార్తికకు వివరణ దీపిక పేరుతో తెలుగులో వ్యాఖ్యానం వ్రాశారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నాయని, పారిజాతాపహారం తంజావూరు సరస్వతీమహల్లో ఉందనీ చెప్తారు.

హరిభక్తి సుధార్ణవం కూడా యక్షగానపద్ధతిలో వ్రాసిన సంస్కృత గ్రంథమే! పూర్వ మీమాంస సిద్ధాంతాల మీద భట్ట భాషా ప్రకాశం మొదలైన గ్రంథాలను ఆయన వ్రాసినట్టు చెప్తారు. శాండిల్య భక్తి సూత్రాలలో “శ్రీరామ గోవింద సుతీర్థపాద కృపావిశేషా దుపలభ్య బోధం, శ్రీవాసుదేవాదధిగత్య సర్వ శస్త్రాణి వక్తుం కిమహి స్పృహా నః” అనే వాక్యం ఆధారంగా తీర్థులవారు రామగోవిందుడనే గురువు దగ్గర వేదాంత శాస్త్రాలు అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది.

తులజా ప్రభువు భద్రపరచిన వ్రాతప్రతుల వలన 17,18 శతాబ్దాల సంకీర్తనాచార్యుల విశేషాలు తెలుసుకునే వీలు కలిగింది.

తిల్లైస్థానం నరసింహ భాగవతార్, నల్లూరు వెంకట సుబ్బయ్య ఆచార్య వరహూరు బ్రహ్మశ్రీ గురుస్వామి శాస్త్రి, వరహూరు బ్రహ్మశ్రీ కల్యాణ సుందరం, శ్రీకంఠశాస్త్రి ప్రభృతులు తీర్థులవారి కృషిని పదిలపరచేందుకు విశేష కృషి చేశారు.

తీర్థులవారు భగవాన్ వేదవ్యాసుని అనుసరించే తరంగాలను రచించారు. ముఖ్యంగా 10వ స్కంథం 58 అధ్యాయాలమీద ఆయన ఎక్కువ దృష్టిపెట్టారు. కృష్ణావతార మహిమను చాటటం ఆయన లక్ష్యం. బాల లీల, రాసలీల, కంస సంహారం, ద్వారక నిర్మాణం, రుక్మిణీ ఇతర రాణులతో కృష్ణుని వివాహం కృష్ణలీలాతరంగిణిలో ముఖ్య అంశాలు. కృష్ణుడు కోరుకున్నట్టే రుక్మిణీ కళ్యాణంతో కృతిని ముగించాడని భక్తుల నమ్మకం.

ఆయన గోపాలమేవ దైవతం సదా అంటూ గానం చేస్తుంటే మురళి వాయిస్తూ కృష్ణుడు స్వయంగా వచ్చి నాట్యం చేసేవాడని ప్రతీతి. వరాహూరు ఆనై భాగవతార్, పంజు భాగవతార్, గోపాల భాగవతార్, తిరువాయూర్ శొంఠి వెంకటరామయ్య (త్యాగరాజులవారి గురువు), పంతులు భాగవతార్ ప్రభృతులు నారాయణతీర్థులవారి తరంగాలను, ఆయన జీవిత విశేషాలను ప్రచారంలోకి తెచ్చిన తొలి భాగవతార్లు.

శుకమహర్షి పరీక్షిత్ మహరాజుకు భాగవత కథను వినిపిస్తున్నప్పుడు చెప్తాడు, రస రాగమయమైన రాసలీలలను సమగ్రంగా అవగాహన చేసుకోనిదే పరమాత్మను చేరటం సాధ్యపడదని! జయదేవుడు, నారాయణతీర్థులు రాసలీలలకు ఆధ్యాత్మికశక్తి సమకూర్చారు.

“అనురాగము లేని నీ మనసున సుజ్ఞానము రాదు” అంటారు త్యాగరాజులవారు.

“అనేకజన్మ సహస్ర తపసా పరితోషిత ఆవిర్భూత స భగవాన్ తాసామ్ గోప్యాం సుజన్మాని” అని గోపికల గురించి ఆయన ఒక నిర్వచనాన్ని ఇస్తారు. అనేక వేల జన్మల తపస్సు పుణ్యం వలన ఒక గోపికగా జన్మించే అదృష్టం, పరమాత్ముడితో సన్నిహితంగా కలిగే భాగ్యం దక్కుతాయని దీని భావం.

“రాసక్రీడా మహోత్సవారంభ సంభ్రమచేతాః ఆత్మతత్త్వమ్ ఉపాదిశన్ నాత్మాః”

రాసలీల ప్రాంరంభ సమారంభంలోనే పరమాత్మ గోపికలకు ఆత్మ తత్వోపదేశం చేయటం గమనించవలసిన విషయం. స్త్రీపురుషుల కామవిషయకంగా చూసేవారికి బోధపడే అంశం కాదిది అని ముందే హెచ్చరించారు తీర్థులవారు. పరమాత్ముడి లీలలను అర్థం చేసుకోగల జన్మసంస్కారం కలవారికే అది అవగతం కాగలదు.

కనీసం 34 రాగాలలో తన తరంగాలకు ఆయన బాణీలు కట్టారు. ఆట, త్రిపుట, ఆది, రూపక, ధృవ, చాపు, జంప, విళంబ, ఏక మొదలైన తాళాలలో ఈ నృత్య నాట్య పదాలను సమకూర్చారు. 7, 9 తరంగాలలో గోపికల తరంగాలను భూపాలం, దేశాక్షి, మలహరి వసంతం, దేవగాంధారి రాగాలలో ధృవం, అట తాళాలలో అలగు, లఘు, ధృతగతి, మధ్యమగతి, మంధరగతి, పతాకం, ధృపతాకం, సూకరం, కటకా, చిలీముఖం, శూల నాట్య లక్షణాలతో వీటిని రూపొందించారాయన.

సుబోధినీ-బ్రహ్మసూత్రాలకు శంకరభాష్యం, సురేశ్వరాచార్య పంచీకరణ వార్తికలకు వివరణ దీపిక (తెలుగు), హరిభక్తి సుధార్ణవం (నృత్య రూపకం) ఈయన రచనలలో ముఖ్యమైనవి.

శాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్యానం, యోగ సిద్ధాంత చంద్రిక గ్రంథాలు నారాయణతీర్థుల విరచితంగా దొరుకుతున్నాయి. కానీ అవాటి గ్రంథకర్తలు ఈ నారాయణతీర్థులు ఒకరేనా అనే విషయమై పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు.

రాముడు, నరసింహుడు, వెంకటేశ్వరస్వామి, వరదరాజస్వామి, దక్షిణామూర్తి దేవతా స్తుతులు చేశాడు.

నిర్గుణ పరబ్రహ్మాన్ని చేరుకోవటానికి శ్రవణం, కీర్తనం ఉత్తమ మార్గాలుగా ఆయన ఈ తరంగాల రచన చేశారు.

లలితమైన సంస్కృత పదాలతో 17 రకాల చందస్సులలో వీతిని రూపొందించారాయన. ఛాందోగ్య, బృహదారణ్యక, ముండక, తైత్తిరీయ, సామవేద, ఈశావాశ్యోపనిషత్తుల్లో రాసలీలల విశేషాలు ఈ రచనకు ఎంతగానో తోడ్పడ్దాయి.

తిరుపూన్-తురుత్తిలో జీవసమాధి:

నారాయణతీర్థులవారి మరణం విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. గురువాఙ్ఞ మేరకు కృష్ణభక్తి తత్త్వాన్ని ప్రచారం చేస్తూ తీర్థులవారు దేశం యావత్తూ తిరిగారు. జీవితంలో ఎక్కువ భాగం తంజావూరు రాజ్యంలో గడిపారు. చివరికి అక్కడే సజీవసమాధి చెందారని అక్కడివారి నమ్మకం. నారాయణతీర్థులవారు తరంగాలను పాడుతూ పోతుంటే శ్రీకృష్ణుడు వాటికి తగ్గట్టుగా గజ్జెలు తొడుక్కొని నాట్యం చేస్తూ వెనక్కవెనక్కి పోసాగాడనీ, అలా పోయిపోయి కృష్ణుడు కాశీనగరంలో గంగానదిలో ఫడ్డాడనీ, తీర్థులవారు కూడా గంగలోనే దుమికి భగవంతుడిలో ఐక్యమయ్యాడనీ జనమంచి శేషాద్రిశర్మగారు వ్రాశారు.

వరుగూరు వెంకటేశ్వరస్వామి విశ్వరూప సందర్శనం జరిగాక తీర్థులవారు సజీవసమాధి అయ్యారని వరుగూరు ప్రజల నమ్మకం.

నారాయణతీర్థులవారిది కాలవశాన జరిగిన సహజమరణం కాదనీ, ఆయన జన సమూహం అందరూ చూస్తుండగా సమాధి చెందారని నమ్ముతారు. “ఆయన సుమారు 1580 ప్రాంతాన జన్మించి, 1614 లోపుగానే దక్షిణాది వెళ్లి అక్కడ దాదాపు 1680 వరకూ జీవించి ఉన్నట్లు చెప్పవచ్చును” అని రజనీకాంతరావుగారు ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర గ్రంథంలో వ్రాశారు.

భూగర్భంలో ఒక గదిని నిర్మింపచేసుకుని తాను అందులోకి ప్రవేశించి సమాధిస్థితిలో కూర్చున్నారని, ఆయన ఆదేశించిన సమయానికి సమాధిని మూసివేశారని చెప్తారు. వారి సజీవసమాధి ఎక్కడ జరిగిందనే విషయంలో సందిగ్ధత ఉంది.

వరుగూరుకు దగ్గరలోనే తిరుపూ్న్-తురుత్తి అనే గ్రామంలో ఆయన జీవసమాధి ఉందని కొందరు చెప్తారు. తీర్థులవారు వరాహూరులో మూడేళ్లే ఉన్నాడని, అక్కడినుండి తిరుపూన్-తురుత్తికి వెళ్లిపోయాడనీ మరొక వాదన ఉంది.

నారాయణతీర్థులవారు తన చరమకాలంలో తిరుపూన్-తురుత్తి చేరారని కొందరు చెప్తారు. అక్కడ ఒక మామిడిచెట్టు నీడన ధ్యాననిష్ఠలో ఉండి ఆ మామిడిచెట్టుకు దగ్గరలోనే వారు జీవసమాధి అయ్యారు.

అదొక అసాధారణమైన మామిడిచెట్టనీ, దానికొమ్మలన్నీ తీర్థులవారి సమాధి వైపే తిరిగి గొడుగు పట్టినట్టుగా ఉంటాయనీ చెప్తారు. ఆ చెట్టు కాయలు మామూలు మామిడికాయలా కాక భిన్నంగా ఉంటాయని, దాని టెంకలు పలుచగా బిళ్ళల్లా ఉంటాయని, అవి ఎక్కడనాటినా మొలకెత్తవని కూడా చెప్తారు.

2018లో నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. దీర్ఘాసి విజయభాస్కర్, చరిత్రవేత్త డా. ఈమని శివనాగిరెడ్డిగారు, నేనూ వరుగూరు వెళ్లినప్పుడు ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్ గారు ఎంతో ఆదరంతో మమ్మల్ని గౌరవించారు. వెంటబెట్టుకుని మమ్మల్ని వెంకటేశ్వర కోయిలతోపాటు అక్కడకు నాలుగిళ్ళ అవతల ఉన్న మరో ప్రాచీన శివాలయం దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ శివలింగం ఉన్నదే నారాయణతీర్థుల సమాధి అని ఆయన చెప్పారు.

తమిళ సౌరమానం ప్రకారం మాసినెల శుక్లపక్షం, కృత్తికా నక్షత్రం నాడు ఆయన సిద్ధిపొందారు. మన చాంద్రమానం ప్రకారం మాఘ శుద్ధ అష్టమీ గురువారం అవుతుంది. తీర్థులవారు తిరుపూంతురుత్తిలోనే సమాధి అయ్యారని తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి పేర్కొన్నారు.

“కామదా కామినామేషా ముముక్షూణాం చ మోక్షదా
శృణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలా తరంగిణీ॥”

అంటూ శ్రీకృష్ణలీలాతరంగిణి ముగింపులో వ్రాసిన శ్లోకంలో పరమాత్మ అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు తీర్థులవారు.

“భక్తిని వేదశాస్త్రచయ భాసురశక్తిని, దివ్యయోగ సం
యుక్తిని, నాట్య చిద్రస మహోదయ రక్తిని, నాంధ్రభూమి సం
సక్తిని, దేశ దేశములఁజాటి యుదారమహర్షి మూర్తియై
ముక్తినిఁబొందెఁ దీర్థు డవిముక్తపదంబున పట్టభద్రుఁడై”

అని తీర్థులవారు ముక్తిని పొందటం గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు వర్ణిస్తారు. వరుగూరు (తిరుక్కట్టుపల్లి) వెంకటేశ పెరుమాళ్లు కోవెలలో ఆయన చిత్రపఠాల్ని గోడలకు అమర్చారు. ఆయన యోగనిష్ఠలో ఉన్న చిత్రం, ఆయనకు ఒక శ్వేతవరాహం వరుగూరు వరకూ వెంట వచ్చిన చిత్రం అక్కడ ఉన్నాయి. అక్కడి ప్రజలు నారాయణతీర్థులు తమగ్రామం లోనే సిద్ధి పొందారని నమ్ముతారు.

ఆరాధనోత్సవాలు:

‘కలౌ సంకీర్త్యా కేశవమ్’ అనేది ఆర్యోక్తి. కలియుగంలో మోక్షసాధనకు దగ్గరి మార్గం భగవన్నామస్మరణే నని దీని తాత్పర్యం. తీర్థులవారి ఆరాధనోత్సవాలు గోవిందనామస్మరణతో మోక్షదాయికం అని భక్తుల నమ్మకం.

కాజలో శ్రీ నారాయణతీర్థుల ట్రస్ట్ వారు తీర్థులవారి ఆరాధనోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. గురుపూజ, సుప్రభాతసేవ, సహస్రనామార్చన, వేదమంత్రాలు, తరంగాలను పాడటం ఈ ఉత్సవంలో ప్రధానాంశాలు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భజన బృందాలు ఇక్కడ తరంగ కీర్తనలను భక్తితో ఆలపిస్తారు.

వరుగూరులో తరంగిణీ మహోత్సవాల పేరుతో వెంకటరమణ పెరుమళ్ళ సన్నిధిలో ప్రతీ యేడాదీ తరంగాలను ఆడి, పాడి అనేక నాట్య నాటక బృందాలు 10 రోజులపాటు ప్రదర్శనలిస్తుంటారు. ఉట్టికొట్టే సన్నివేశం కూడా ఉంటుంది.

తిరుపూన్-తురుత్తి గ్రామంలో గత 300 యేళ్లుగా మాసి శుక్ల అష్టమి రోజున తీర్థులవారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. 1965లో ఒక ఆరాధనా సంఘం ఏర్పడింది. తరంగాల గానం, సంగీత కచ్చేరీలు, ప్రసంగాలు, భజనలు, ఊంఛవృత్తి వగైరా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ విశ్వనాథ భాగవతార్ లాంటి ప్రసిద్ధులు, చుట్టుపక్కల ధనికులు కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కూడమురుత్తి అనే కావేరి ఉపనది ఒడ్డున తిరుపూంతురుత్తి గ్రామం ఉంది.

1986లో తిరుపూన్-తురుత్తి శ్రీనారాయణతీర్థ స్వామిగల్ ట్రస్ట్ పేరుతో చెన్నైలో ఒక కమిటీ ఏర్పడింది. నారదగానసభ కార్యదర్శి కృష్ణస్వామి, శ్రీ యన్ వి సుబ్రహ్మణ్యన్, తిరుపూంతురుత్తి శ్రీ వి. వెంకటేశన్, డా. కె. జె. యేసుదాసు ప్రభృతులు సభ్యులుగా ఉన్నారు.

గాయకులు కె. జె. యేసుదాసు తీర్థులవారిపైన చెన్నై దూరదర్సన్ కోసం 13 భాగాల డాక్యుమెంటరీని నిర్మించారు.

తిరుపూన్-తురుత్తి జీవసమాధి దగ్గర ఈ కమిటీవారు నామసంకీర్తనా మణిమండపం నిర్మించారు. తిరుపూన్-తురుత్తిలో భూస్వామి శ్రీ విశ్వగీత్ సిమ్ గాదేరావ్ సాహిబ్ భూరి విరాళంతో ఈ మణిమండప నిర్మాణం సాధ్యం అయ్యింది. 2002లో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖవారు ఈ మణిమండపం మొదటి అంతస్థు నిర్మాణాన్ని పూర్తి చేశారు.

చివరిగా ఒక సంగతి..!

తంజావూరులో దక్షిణాంధ్రయుగం ఒక స్వర్ణయుగంగా నడుస్తున్న 16,17 శతాబ్దాల కాలంలో తెలుగు నేలమీద భాషా సంస్కృతులకు క్షీణ, కల్లోల యుగాలు నడిచాయి. ఆ కాలంలో ఆంధ్రప్రాంతంలో సాహిత్య కృషి జరగలేదని కాదు. హంసవింశతి లాంటి సామాజిక విజ్ఞాన సర్వస్వాలే వెలిశాయి. కానీ, కవులు, కళాకారులు అనేకమంది తంజావూరుకు వరుస కట్టిన మాట వాస్తవం.

ఒక్కొక్కరూ ఒక్కో ప్రయోజనం ఆశించి తంజావూరు చేరారు. వారిలో కొందరిది పొట్టకూటి ప్రయత్నం కాగా, ప్రేక్షకాదరణ, పాఠకాదరణ కోరి ఎక్కువమంది అక్కడకు చేరారు. ఆ కాలంలో ఆంధ్రప్రాంతంలో రాజాదరణ మాత్రమే కాదు సాహిత్యాది కళలకు ప్రజాదరణ కూడా లేదు. నేటి కాలం లాగే ఉంది నాటి పరిస్థితి.

దక్షిణాంధ్రయుగంలో పోతన, శ్రీనాథుడు లాంటి కవులు లేరు కాబట్టి అది క్షీణయుగం అని ఖండవల్లి లక్ష్మీరంజనం గారి లాంటి పెద్దలు కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, అంతకు మించిన తెలుగు బిడ్డలు అనేకమంది అక్కడ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. అప్పయ్య దీక్షితులు, క్షేత్రయ్య, నారాయణతీర్థులు, త్యాగయ్యలతో ఏ కవుల్ని మనం సరిపోల్చగలం?

దక్షిణాంధ్ర యుగంలో ప్రబలిన వేశ్యాలోల సాహిత్యానికి భిన్నమైన సాహిత్యాన్ని సృష్టించి, భక్తిమార్గాన నడిపించి మనుషుల్ని తాత్విక ఉన్నతులుగా తీర్చిదిద్దిన మేధావులు వీళ్లంతా! సమాజ ధర్మం ఎరిగిన ఇలాంటి కవులు అవసరం అనే పరిస్థితి తంజావూరులో ఏర్పడిన నేపథ్యంలో నారాయణతీర్థులవారి చరిత్రను మనం అవలోకించవలసి ఉంది.

రాయల అనంతర యుగంలో వైష్ణవ భక్తి దూకుడుగా పరమత అసహనాన్ని ప్రదర్శించిన సమయం అది. దాని నివారణకు తీర్థులవారి ఆవశ్యకత అక్కడ ఎంతైనా ఏర్పడింది. నిస్సందేహంగా అది దైవ ప్రేరణే! కడుపునొప్పి అనేది ఒక వంక మాత్రమే! లేదా ఉత్సాహవంతులైన కవుల సృష్టి అయి ఉండాలి.

శివకేశవులు సమానమే అనే అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పుకుంటూనే మా శివుడు ఒకింత ఎక్కువ అనీ, మా విష్ణువు కొంచెం అధికుడనీ వాదిస్తూ మతపరంగా ఘర్షణ పరిస్థితులు ఏర్పడిన ఆ కాలంలో, నారాయణతీర్థులవారు దేవుడికన్నా దేవుడి నామం గొప్పదనే సిద్ధాంత పరివ్యాప్తి కోసం తంజావూరు వెళ్ళారు. బోధేంద్ర సరస్వతి బోధనలు ఆయనకు మార్గదర్శనం చేశాయి. రాయరామానందుల రాధాకృష్ణ తత్త్వం ఆయన్ని కార్యోన్ముఖుణ్ణి చేసింది. దాని ఫలితమే కృష్ణలీలాతరంగిణి. దాన్ని ఏ ఊళ్ళొ వ్రాశాడు? ఎలా వ్రాశాడు? లాంటి చర్చలకన్నా ఆయన ఏ ప్రయోజనం ఆశించి వ్రాశాడన్నది ముఖ్యం.

సంగీత సాహిత్య, నాట్య, నాటక కళలతో జనరంజకంగా రాధాకృష్ణ తత్వాన్ని ప్రజలకు ఎక్కించాలనే తలంపుతోనే తంజావూరు వెళ్ళారు. భగవంతుడే ఆయనను అక్కడకు తన దూతగా పంపించాడని భావించాలి.

ఆయనకు ప్రజలతోనే పని. రాజులు ధనికులతో నిమిత్తం లేకుండా భక్తిమార్గాన్ని తీర్థులవారు మరో మలుపు తిప్పారు. అదే జరిగి ఉండకపోతే దక్షిణాదిలో మతకల్లోలాలు ఉధృతమై ఉండేవి. సామాజిక ప్రగతి కుంటుపడి ఉండేది.

పరమ మాహేశ్వరులు అప్పయ్యదీక్షితులవారు, వారికి 50 యేళ్ళ తరువాతి వారైన పరమ భాగవతులు నారాయణతీర్థులవారు ఈ ఇద్దరు తెలుగు బిడ్డలూ తమిళ నేలపైన తమ మహిమాన్విత వ్యక్తిత్వం ద్వారా ప్రజలకు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించి, శైవ వైష్ణవ విరోధాలను మాన్పి, శాంతిని నెలకొల్పారు. ఆ ఇద్దరు మహనీయులు శాంతి దూతలు.

తన అద్వైత సిద్ధాంతం ద్వారా ఆదిశంకరాచార్యులవారు ఇందుకు తొలి కారకులైతే, పరమత సహనానికి, అసలైన భక్తి భావనకు అప్పయ్య దీక్షితులు, నారాయణతీర్థులు మలి ప్రేరకులుగా నిలిచారు.

తనను శివనారాయణతీర్థులుగా సంభావించుకుని, దశావతారాల పట్టికలో కృష్ణుడు లేకుండా బలరాముణ్ణి చేర్చి. ఈ అవతారాలన్ని కృష్ణుడివే నంటూ, తన రాధాకృష్ణ తత్వ్వాన్ని శివకేశవ భావజాలానికి అతీతమైనదిగా ఆయన నిరూపించారు. ఇది సామాజిక ప్రయోజనం ఆశించి చేసిన ఒక ఘనకార్యం. తమిళనాట ఆనాడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దీన్నిబట్టి ఒక ఊహ చేయవచ్చు. శివనారాయణతీర్థులవారి ఆవశ్యకత ఏమిటో కూడా దీనిద్వారా మనకు బోధపడ్తుంది.

తెలుగువారికే ఈ అర్హత ఎందుకంటే, కన్నడిగుల వీరశైవం, తమిళుల వీరవైష్ణవాల మధ్య సమన్వయానికి స్మార్తుడైన తెలుగువాడే తగినవాడు కాబట్టి! తెలుగుమూర్తులు అప్పయ్యదీక్షితులవారు, నారాయణతీర్థులవారు తమ అవతార ధర్మాల్ని నెరవేర్చి శాంతిని నెలకొల్పారు. ఆనాటి చారిత్రక, సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తంజావూరులో 60-70 యేళ్ళపాటు నారాయణతీర్థులవారు నిర్వహించిన భక్తి కార్యాచరణ గురించిన అధ్యయనం జరగాలి. ఈ రచన ఆశించే ప్రయోజనం ఇదే!

“కలికల్మషనాశనం కామితఫలనిదానం
నారాయణీయచరితం నారాయణతీర్థ గీతం”

(సమాప్తం)

Exit mobile version