Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ-5

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 5వ భాగము.]

శృంగార తరంగాలు

రాహూరు గ్రామానికి చెందిన వరదరాజ కవి నారాయణతీర్థుల సాహిత్య ధోరణిని విమర్శిస్తూ, తీర్థులవారు అందమైన గోపికలను వదిలేసి తన కృష్ణుని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి వృద్ధమహిళలకు అప్పగించాడని వ్యంగ్యంగా అన్నాడట. ఈ వరదరాజ కవి ‘మదనమాధవము’ కావ్యం వ్రాశాడు. కృష్ణుడి రతికేళీ విలాసాలను కళ్లకు కట్టినట్టు వర్ణించాడీ గ్రంథంలో. తీర్థులవారికి అలా వ్రాసే ధైర్యం లేకపోయిందని ఆయన ఎద్దేవా చేశాడు.

అది విన్న తీర్థులవారు కళ్లనీళ్లు పెట్టుకుని, తాను సన్యాసినని, తనకు అటువంటి శృంగారభావాలు తెలియవనీ, కృష్ణలీలల్లో మానవ సహజమైన నీచ స్రీ పురుష శృంగారాన్ని చొప్పించ లేననీ అన్నాడట.

ఆ రాత్రి రాధతో ఏకాంతంగా గడుపుతూ స్వామి ఆయనకు కలలో కనిపించాడట. ఆ దృశ్యాన్నే ‘మాధవ మే రతిం దేహి’ అనే కీర్తనలో తీర్థులవారు గొప్పగా వర్ణించారని విశ్లేషకులు చెప్తారు. ఈ తరంగం చాలా విచిత్రమైనది.

కంసవధ చేయటానికి కృష్ణుడు మధురకు వచ్చిన సందర్భంలో గూనితో బాధపడుతున్న కుబ్జ అనే పరిచారికను స్పృశించి గొప్ప అందగత్తెగా చేసిన సందర్భంలోది ఈ తరంగం. సుందరిగా మారిన కుబ్జ శ్రీకృష్ణుని దివ్యరూపాన్ని చూసి పరమ కామమోహిత అవుతుంది.

“రిరంసయా తేన సాకం కుబ్జా సా కామమోహితా
పీతాంబరధరం శ్యామం మధురం ప్రాహ మాధవమ్॥”

రిరంస అంటే తీవ్రమైన కామవాంఛకు లోనై తనతో కూడమని, తనకు అథరామృతపాన భాగ్యం, సురత భాగ్యం ఇమ్మని ప్రార్థించినట్టు వ్రాసిన గొప్ప తరంగం ఇది!

మాధవ మే రతిం దేహి-నాథనాథ మాధవ మే రతిం దేహి
మధురాధరబింబ ధన్యేయం-మాననీయా త్వయా నూనమ్॥

దీనజనదయాఘన-దేవకీవరనందన మానినీమానభంజన-మదనమదన
మునిమనోనికేతన-మోహతిమిరనిధన కనకమయపరిధాన-కలితనిఖిలభువన॥

న త్యజామి చేలాంచలం-నాథ తవ సురతిమూలం అతినీలఘనసుందరం-ఆనందలీలం
సత్య మాశాస్మి గోపాలం-సత్యకామాదిగుణజలంభృత్యవర్గపరిపాలం-బలభద్రానుజం బాలమ్॥

తరణికోటికిరణ-తామసగుణనిర్హరణ తారకముక్తాభరణ-దాసపోషణ
దూరితదుర్జనగణ-దోషరహితచరణ నరనారాయణతీర్థ-వర్ణిత- నిజచరణ॥

పై కీర్తన ముగింపులో ‘ఈ నారాయణతీర్థుడెప్పుడూ నీ పాదాలను కీర్తిస్తూనే ఉంటాడ’ని వ్రాసుకున్నారాయన. తన పాత్రలతో తాను పొందే తాదాత్మ్యత తీర్థులవారి ఈ చరణంలో కనిపిస్తుంది.

ఉపనిషత్తులు ప్రతిపాదించే అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే తీర్థులవారి తరంగాలు నడిచాయి. సగుణోపాసన నిర్గుణ బ్రహ్మానుభూతికి కారణమౌతుందనే భావన ఆధారంగా తరంగాల రచన సాగింది. జీవబ్రహ్మైక్య రూపమైన మోక్షసాధనలో విష్ణుభక్తి ఉపకరిస్తుందని ఈ తరంగాలు నిరూపిస్తాయి. చైతన్య మహాప్రభు, మీరాబాయి, రామదాసుల మార్గంలో తీర్థులవారు భగవన్నామ సంకీర్తనా వైశిష్ట్యాన్ని రానున్న ఆధునిక సమాజానికి సరళీకరించబడిన భక్తిమార్గాన్ని సిద్ధంచేసి ఉంచారు.

నారాయణతీర్థుల తరువాత కాలంలో తెలుగు కర్ణాటక సంగీత త్రయం త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ప్రభృతుల కారణంగా వేదికల మీద చేసే సంగీత కచేరీల విధానంలో చాలా మార్పులొచ్చాయి.

అప్పటి వరకూ భజన గోష్ఠులలో పాడటం లేదా నాట్యనాటకాలుగా, ప్రదర్శన యోగ్యంగా మాత్రమే ఉండేవి. నారాయణతీర్థులవారి కీర్తనలు ఆ విధమైన ప్రదర్శనలకు మాత్రమే ఉద్ధేశించినవి. దక్షిణాదిలో మేలట్టూరు భాగవతులు, తెలుగునేలపైన కూచిపూడిభాగవతులు వాటికి విశేష ప్రాధాన్యత తెచ్చారు.

తరంగాలలో తెలుగుదనం

శ్రీకృష్ణలీలాతరంగిణి నృత్యనాటికలా ప్రదర్శించటానికి వీలైన కావ్యం. శబ్దాలంకారాలు, అంత్యప్రాసలు, ప్రాసలు, అనుప్రాసలతోఈ కీర్తనలు అద్భుతమైన సాహిత్య సృష్టి. భక్తి, రాగం, సాహిత్యం మూడూ కలగలిసి, ఆటా, పాటా, మాటల మేలుకలయికగా ఈ కీర్తనలు భాసించాయి. పాటకి ఆట తోడైనప్పుడు ఆ దృశ్యం వర్ణనాతీతం.

తీర్థులవారు కేవల భక్త కవి కాదు. ఆయన భక్తి ప్రబోధానికి ఎంచుకున్న ఈ యక్షగాన విధానం ఆయన తెలుగువాడిగా పుట్టటం వలనే సంక్రమించిన ఒక యోగం. దాన్ని సంస్కృత భాషలో ఆయన రచించటం వలన ఆ తెలుగుదనానికి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. మరాఠీ రాజులు తెలుగులోనే రాయాలని నడుం కట్టారంటే తీర్థులవారి ప్రభావం ఎలాంటిదో ఊహించుకోవచ్చు.

మేలట్టూరులోని తెలుగు కళాకారులు తంజావూరులో ఎంతటి ప్రశస్తిని సాధించారంటే, వారిచేత ప్రదర్శన కోసం స్వయంగా తెలుగు భాషను నేఱ్చుకుని మరాఠారాజులు కూడా యక్షగానాలను తెలుగు కవులతో పోటీలు పడి వ్రాశారు.

కవికి ప్రశస్తి దక్కేది ఆ రచన ప్రదర్శన అయినప్పుడే కదా!

శ్రీకృష్ణలీలా తరంగిణి రచనలో తెలుగు దనం గురించి కూడా కొంత ముచ్చటించుకోవాలి.

“..వెడలె నుగ్రశేనుడు..” అని, ఆ పాత్ర ప్రవేశ కాలంలో పాడే సంప్రదాయాన్ని అనుసరించే తీర్థులవారు ఈ యక్షగాన రచన చేయటం ఆయన తెలుగు వాడేననటానికి ఒక తిరుగులేని సాక్ష్యంగా రజనీగారు భావించారు.

“ఆ తరువాతా కంస ప్రవేశమూ, దేవకీ ప్రవేశమూ కూడా ఇలానే దరువులతోనే జరుగుతాయి. దేవకి అష్టమ గర్భ శిశువు ద్వారా తనకు మృతి అని అశరీరవాణి చెప్పగా విని కంసుడు దేవకీ వసుదేవులను చంపబోయినప్పుడు వసుదేవుడు కంసుని ప్రార్థించిన కీర్తన

‘హే కంస రాజసుత-హే నరశ్రేష్ఠ॥
హే సత్యసంధకుల-జలధిభవరత్న॥
హే సౌమ్యగుణయుక్త-హితజనాసక్త
కల్యాణవేద్యాం చ-కలితబహుభద్రాం
ముంచ భగినీ మద్య-ముహురధికహృద్యాం
సత్యం వదామి తవ-సత్యసంధోఽస్మి॥
దాస్యామి తజ్జాత-వత్సా ననింద్య
మా సాహసం కర్తు-మర్హసి సదైవ
తన భగిన్యైవ సహ-సుఖమధివసామి
భవనే తవైవ పర-మస్తు శుభ మద్య’
ఇది అచ్చమైన తెలుగు మంజరీ ద్విపద ఛందస్సు”  అని రజనీగారు వ్రాశారు.

“పల్లవిలోనూ, అనుపల్లవిలోనూ చరణాలలోను పాదం మధ్య వర్ణసాజాత్య యతి పాటించబడింది. సంస్కృత కవులూ, వాగ్గేయకారులైన జయదేవాదులు తమ వృత్తాలలోనూ, కీర్తనలలోనూ పాదం మధ్య మాట పూర్తయి తెగిపోయే విరామ యతినే పాటించారు. కానీ, పాదం మొదటి అక్షరంతో వర్ణసామ్యం గల అక్షరం పాదం మధ్య యతిస్థానంలో వచ్చే సంప్రదాయాన్ని నారాయణతీర్థులే పాటించారు. ఇది నన్నయాదులు తెలుగు కావ్యాలలో వాడిన, సంస్కృత వృత్త రచనలో పాటించిన తెనుగు సాంప్రదాయమే. చాలా చోట్ల కీర్తనలలో పాద ద్వితీయాక్షరాలలో ప్రాసను పాటించే ఆంధ్ర కవితా సంప్రదాయాన్ని కూడా తీర్థుల వారు అనుసరించారు..” అన్నారు.

నూజివీడు రాజావారి తెలుగు తరంగాలు

నూజివీటి సంస్థానాధీశులు కవి పండితులు, పరిపాలనాదక్షులు, రాజా మేకా వెంకటాద్రి అప్పారావు బహద్దర్, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యంము, జ్యోతిష్యం, చిత్రకళ, సంగీతాది కళలలో నిష్ణాతుడు.

1893, ఏప్రిల్ 29న నూజివీడులో జన్మించాడు. పెంచిన తండ్రి రాజా రంగయ్యప్పారావు. మెట్రిక్యులేషన్ చదివాడు.

ఇతను తెలుగులో ధుర్యోధనాంతం (1915), ఆంధ్ర వీరలక్ష్మీవిజయం (1927) వంటి నాటకాలు రచించాడు. తన తండ్రి మేకా రంగయ్య అప్పారావు పట్టాభిషేక ఘట్టాన్ని వర్ణిస్తూ, రాజ్యలక్ష్మీ పరిణయం అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. నారాయణతీర్థులవారి శ్రీకృష్ణలీలాతరంగాలను జయదేవుని గీత గోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. షాహనామా పర్షియన్ గ్రంథాన్ని కొంత భాగం తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించాడు.

1937లో విజయవాడలో ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలను వ్యవస్థాపించాడు. విజయవాడ మ్యూజియం ప్రాంగణంలో తండ్రి రాజా రంగయ్యప్పారావు విగ్రహాన్ని, హనుమాన్ జంక్షన్‌లో హనుమంతుని పెద్ద విగ్రహాన్ని నెలకొల్పాడు.

తీర్థులవారి తరంగాలకు ఆయన చేసిన తెలుగు అనువాదం చాలా హృద్యంగా ఉంటుంది.

“కరుణింపుము శరణంటిని/హరి! దీనశరణ్యా
కరిరాజును కృపగాచిన/కరుణాబ్ధివగణ్యా
విధిగానొదవెను నా కదె/వికటాసురభరమున్
మధుసూదన! తొలగింపుము మత్ పాపనికరమున్”

అనే అనువాదం ‘శరణంభవ కరుణాలయ’ తరంగానికి చేసినదని తేలికగా అర్థం అవుతుంది. అదే రాగతాళాలలో పాడుకోదగినదిగా ఉంటుంది.

“శ్రీరమణీకుచకుంకుమ పంకవిలిప్త విశాల భుజాంతర! వారిజలోచన! వల్లవయువతీ జార! సదాతే మంగళం” అనే చరణానికి “శ్రీ రుక్మిణి మేని కుంకుమ దనరారు చెలువౌవక్షమునకు మంగళం/వారిజాక్షుడవై వల్లవ యువతుల గోరు నీ లీలలకు మంగళం” ఇలా చాలా జాగ్రత్తగా అనువాదం చేయటాన్ని గమనించవచ్చు.

“పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం
వారంవారం వందనం మస్తుతే-వారిజదలనయన గోపాల” అనే తరంగాన్ని

“తీర్చవో నాకోరికన్ గోపాల! తీర్చవో నాకోరికన్!
అర్చింతు మఱిమఱి ఆప్తి వందనము లుంచి అల తమ్మికనులఁగాంచవో? గోపాల!”

అని అనువదిస్తారు.

“గోపికలనలరించు గోవిందుఁగనరే/శ్రీపతిని మోదమున సేవింతు మనరే” అనటంలో ఆయనలోని వాగ్గేయకార సత్త్వం ప్రస్ఫుటమౌతుంది. శ్రీ వెంకటాద్రి అప్పారావు గారు చేసిన ఈ అనువాదాన్ని వారి పుత్రుడు, మాజీమంత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, పూర్వ శాసనసభ్యులు శ్రీ ఎం. ఆర్. అప్పారావుగారు ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించారు.

మేలట్టూరు ప్రశస్తి

సంగీత, సాహిత్య, నృత్యాది కళలకుపోషణ కలిగిన కాలం చరిత్రలో ప్రసిద్ధిని పొందుతుంది. ఆ రాజ్యం సుభిక్షం అవుతుంది. సంగీత సాహిత్య నృత్యాది కళలకు రసజ్ఞులు సమృద్ధిగా ఉన్నకాలం సంపన్నవంతం అవుతుంది. సంగీత, సాహిత్య, నృత్యాది కళాకారులు ప్రతిభావంతంగా ఉన్న యుగమే స్వర్ణయుగం. ఆ నేల సిరిసంపదలతో, శాంతిభద్రతలతో, ఆరోగ్యభాగ్యాలతో, నాగరకతతో రాజిల్లుతుంది.

‘అభ్యాసేన న లభ్యన్తే చత్వారః సహజగుణాః’ – సంగీతం, కవిత్వం, దాతృత్వం అనే గుణం, యుద్ధవీరత్వం అనే నాలుగూ సహజ గుణాలుగా ఉండాలి గానీ తెచ్చిపెట్టుకుంటే వచ్చేవికాదని పెద్దలు చెప్తారు.

సంకీర్తనాచార్యులు అన్నమయ్య, ప్రజాపథం వైపు సంగీతాన్ని మలుపు తిప్పిన నారాయణతీర్థులు, మేళకర్త రాగ చక్ర సంయోజన కర్త, చతుర్దండి ప్రకాశిక కర్త అయిన వేంకటమఖి, పురందరదాసు, పద రచన కర్త క్షేత్రయ్య, కర్ణాటక సంగీతాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన త్యాగయ్య, తూము నర్సింహదాసు, శ్యామశాస్త్రి త్రయం, ముత్తుస్వామి దీక్షితార్, మేలట్టూరు వెంకటరామశాస్త్రి, మహావైద్యనాథ అయ్యర్ వీరంతా తంజావూరు భూమికగా ఒక శతాబ్ది కాలవ్యవధిలో కర్ణాటక సంగీతానికి ప్రసిద్ధి తెచ్చిన తెలుగు ప్రముఖులు. వీళ్ళ కార్యక్షేత్రం తంజావూరు రాజ్యం. తెలుగు భాషా సంస్కృతుల పురావైభవాన్ని నిలిపిన ఘనులుగా తెలుగువారికి ప్రాతఃస్మరణీయులు. భక్తి ప్రధానంగా సాగిన సాహితీ సృష్టి వీరిది. పుణ్యప్రదము, ముక్తిప్రదం కూడా!

తంజావూరు, మధుర రాజ్యాలలో గిరిరాజకవి, సోమకవి, శొంఠి వెంకట రమణయ్య, శివక్కోఝుండు దేశిక్, పల్లవి దొరైస్వామి అయ్యర్, తోడి సీతారామయ్య, వీణ కాళహస్త్రి శాస్త్రి, శంకరాభరణం నరసయ్య ప్రభృతులు తెలుగు వాగ్గేయకారుల్లో ప్రముఖులు. రంగాజమ్మ, ముద్దుపళని లాంటి కవయిత్రులు కూడా ఉన్నారు. వీరి రచనలు రక్తి ప్రధానంగా సాగినవి. అందుకు వీరికి రాజాశ్రయ ప్రాధాన్యతే కారణం. వేంకటమఖి, క్షేత్రయ్య, అమృతభూతయ్య, మేలట్టూరు కాశీనాథయ్య, వాసుదేవకవి ప్రభృతులు రాజాశ్రయం పొందినా, ఆ కొలువులో తామరాకుమీద నీటి బిందువులా జీవించిన భక్తాగ్రేశ్వరులు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, మహావైద్యనాథ అయ్యర్, సుబ్బరామ దీక్షితులు, వీణ కుప్పియర్, తిరువోత్రియూర్, త్యాగ అయ్యర్ ప్రభృతులున్నారు. రాజాదరణే ధ్యేయంగా ఉన్నవారికీ, అది అవసరం లేనివారికి వారి కళాసృష్టిలో తేడాని విఙ్ఞులు స్పష్టంగా గమనించ వచ్చు.

నారాయణతీర్థ ప్రభావం వల్లే తాను ప్రహ్లాద భక్తి విజయము, నావికా చరితము వ్రాసినట్లు త్యాగరాజస్వామి చెప్పుకున్నారు.

“నారాయణతీర్థులవారికి కూడా స్వంత మేళా ఉండేదని దానికి తానే గురుత్వమూ, నాయకత్వమూ వహించినట్లు కూడా తోస్తుంది..” అని బాలాంత్రపు రజనీకాంతరావు గారు వ్రాశారు. అయితే, ఈ మేళా భుక్తి కోసం కాదని, భక్తి ప్రచారం కోసమేనని గ్రహించాలి. పోషకులకన్నా ప్రేక్షకులు ముఖ్యం భక్తి ప్రచారకులకు.

తంజావూరు రాజ్యాన్ని మొదట చోళుళులు(క్రీ.శ. 850-1300), తరువాత నాయక రాజులు(1535-1675), ఆ తరువాత మరాఠారాజులు (1674-1855) చివరగా బ్రిటిష్ దొరలు పాలించారు. చోళ, నాయక, మరాఠాల కాలంలో తంజావూరు రాజ్యం కళలకు కాణాచిగా ఒక వెలుగు వెలిగింది. ఉత్తరాది నుండి కన్నా దక్షిణాదినుండి, ముఖ్యంగా తెలుగు నేలమీద నుండి వివిధ కళలకు సంబంధించిన ప్రతిభావంతులైన కళాకారులు తంజావూరుకు వలసపోయి అక్కడ ప్రసిద్ధులుగా రాణించారు. వారి వలన ఆయా కళలు సజీవం అయ్యాయి కూడా!

నిజానికి భక్తి సంప్రదాయాన్ని వైష్ణవులు ప్రచారంలోకి తెచ్చినట్టు కనిపించినా, తేవారాల ద్వారా దక్షిణాదిలో భక్తి సాంప్రదాయాన్ని ప్రారంభించింది తిరుఙ్ఞాన సంబందార్, అప్పార్, సుందరమూర్తి స్వామి వీళ్లే! 7-8 శతాబ్దాలకు చెందిన భక్త కవులు వీళ్లు.

సంకీర్తనల ద్వారా కైవల్యాన్ని పొందవచ్చనే విధానానికి వీళ్లు ఆద్యులు. నంబియాందర్ నంబి అనే భక్తుడు ఈ తేవారాలను సంకలనం చేశాడు. ఈ తేవారాలను ఆలపించే గాయకుల్ని ఒధువార్లంటారు. శివాలయాలలో తేవారాలను విధిగా పాడే నియమం ఏర్పాటు చేసినవాడు 10వ శతాబ్దికి చెందిన రాజరాజ చోళుడు. బృహదీశ్వరాలయంలో 48మంది ఒధువార్లను నియమించి జీతబత్యాలను ఏర్పాటు చేసినట్లు శాసనాధారం. ఐదో యేటనే తేవారాలను కట్టి పాడిన మహాభక్తుడు తిరుజ్ఞానసంబంధార్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో వాగ్గేయకారుడైనవాడుగా ప్రసిద్ధి పొందాడు.

బృహదీశ్వరాలయంలో ఆలయ నృత్యాల కోసం తొలిగా నర్తకీమణులను రాజరాజ చోళుడు నియమించాడు. ఆలయ నృత్యాల్ని తమిళంలో ‘థేలీ చేరి పెన్నుగాల్’ అంటారు. బృహదీశ్వరాలయంలో నియామకం అయిన నర్తకీమణులు కాలం చేస్తే వారి వారసులకు ఆ స్థానంలో ఉద్యోగం కల్పించేలా శాసనం కూడా చేశాడాయన.

తంజావూరు నాయక రాజుల్లో రెండవ వాడైన అచ్యుతప్ప నాయకుడు 1564 నుండీ 1614 వరకూ పాలించాడు. సంగీత సాహిత్య నాట్యాది కళలకు విశేషమైన, శాశ్వత సేవలు చేసిన ప్రముఖుడు. ఆయన తెలుగు నేలమీద నుండి 500 మంది యక్షగాన కళాకారులను రప్పించి, ప్రస్తుతం మేలట్టూరుగా పిలవబడుతున్న గ్రామాన్ని అగ్రహారంగా వారికి దానం ఇచ్చాడు. మేలట్టూరు అగ్రహారం అవతరణ షుమారుగా 1570లలో జరిగిందనుకోవచ్చు.

తెలుగు నేలపైన మహమ్మదీయ పాలనలో తెలుగు కళలకు ఆదరణ లేకపోవటంతో ఈ కళాకారులకు తంజావూరు పునరావాసం కల్పించింది. తంజావూరు, మేలట్టూరు, శాలీయమంగళం, తేపేరుమనల్లూరు, శూలమంగళం, ఊతుకాడు ప్రాంతాల్లో ఈ తెలుగు కళాకారులు స్థిరపడ్డారు. వాళ్లకు ఆశ్రయాన్ని, భూమినీ ఇచ్చి పోషించాడు అచ్యుతప్పనాయక.

తెలుగునేలమీద ఉండగా చేయలేని అనేక ప్రయోగాలను శాంతియుత జీవితం కుదరటంతో తంజావూరులో చేయగలిగారు. ఆ కళలకు ప్రాచుర్యాన్నిసాధించగలిగారు. అలా మేలట్టూరులో తెలుగు కళాకారుల భాగవతమేళా స్థిరపడింది. యక్షగాన ప్రక్రియకు, భాగవత కళలకు మేలట్టూరు పెట్టింది పేరుగా చరిత్రలో నిలిచింది.

మేళం అంటే సమూహం. ఒక గ్రూపు, ఒక బృందం అని! మేళాల ఊరు-మేలట్టూరు అయ్యింది. ఉన్నతాపురం, అచ్యుతాపురం, అచ్యుతాబ్ది ఉత్తమాండునాపురం.. ఇవన్నీ మేలట్టూరు పేర్లు. కంచి నుండి వరదరాజ స్వామి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ గుడికట్టారు. ఉన్నతాపుర వరదరాజ స్వామి దేవాలయంగా ఇది ప్రసిద్ధం.

నాట్య బృందాన్ని చిన్నమేళం అంటారు. భాగవత మేళం అనేది నాట్య కళాకారులు, గాయక కళాకారులు, వాయిద్య కళాకారుల సమ్మేళనం. జానపద కళల బృందాలు కూడా ఉండేవి. వాటిని అక్కడ నైయమి మేళం అంటారు.

భరతనాట్య ప్రక్రియలో మేలట్టూరుకు చెందిన తెలుగువారు దార్శనికతను ప్రదర్శించారని తమిళ పరిశోధకులు కూడా ప్రశంసిస్తారు. అలరిప్పు, శబ్దం, తిల్లాన, స్వరజతి ఇవి మేలట్టూరులో తెలుగువారి కారణంగా అభివృద్ధి చెందాయి. మేలట్టురు కాశీనాథయ్యగారిని భరతం కాశీనాథయ్య అని పిలిచేవాళ్లు. భరతనాట్యానికి ఆయన చేసిన సేవకు అది గుర్తింపు. తొమ్మిది అలరిప్పుల్ని సృష్టించారాయన. మండూక దశవరత శబ్దాలు ప్రసిద్ధి పొందాయి. తంజావూరు ఆస్థాన నర్తకీమణులు, ఆలయ కళాకారులు ఎందరో ఆయన శిష్యులు. ఆయన శిష్యుడు వీరభద్రయ్యగారు అభినయ పరమైన స్వరజతుల సృష్టికర్త. శ్యామశాస్త్రిగారు సృష్టించిన స్వరజతి సంగీత బాణీలకు ఉపయోగపడితే, వీరభద్రయ్యగారి స్వరజతి నాట్యాభినయానికి ఉపయోగించేది. వీరభద్రయ్యగారు అనేక తిల్లానాలక్కూడా సృష్టికర్త. ఆయన కేవల అభినయ కళలోనే కాదు అనేక కీర్తనలను వ్రాసి పాడిన వాగ్గేయ కారుడు కూడా!

భరతం కాశీనాథయ్య గారి మరో శిష్యుడు పంచనాథయ్య భాగవతార్ శాలీయమంగళంలో భాగవత కళను నిర్వహించేవాడు. మేలట్టూరులో లాగానే శాలీయమంగళంలో కూడా యక్షగాన భాగవత ప్రదర్శనలకు ప్రసిద్ధ మేళాలుండేవి. తెరుకుత్తు, కావిడి చిందు, విల్లుపాటు, కురవంజి లాంటి స్థానిక నాట్యప్రక్రియలు మేలట్టూరు భాగవత కళలో చేరాయి. మరాఠాల కారణంగా ఉత్తర భారత దేశపు రీతులు కూడా కొన్ని అక్కడ ప్రవేశించాయి. మేలట్టూరు భిన్నమైన నాట్యప్రక్రియను ఆ విధంగా రూపొందించుకో గలిగింది.

తంజావూరులోనే తెలుగు యక్షగానాలు అనేకం తమిళంలోకీ, మరాఠీ లోకీ అనువాదం అయ్యాయి. తెలుగు, తమిళ మరాఠీ భాషల సంగమంగా ఆనాడు తంజావూరు నిలిచింది.

(సశేషం)

Exit mobile version