[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణతీర్థ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 3వ భాగము.]
చైతన్యమహాప్రభు రాజమహేంద్రి రాక
1515లో చైతన్యమహాప్రభు దక్షిణాది యాత్రకు వచ్చినప్పుడు తెలుగు నేలపైన శ్రీకూర్మక్షేత్రం, సింహాచలం, కొవ్వూరు (చైతన్య గౌడ మఠం), మంగళగిరి పానకాల నారసింహ క్షేత్రం, శ్రీ శైలమల్లికార్జున దేవాలయం, అహోబిలం, తిరుమల, శ్రీకాళహస్తి, సందర్శించాడట. గోదావరి తీరంలో ఆయనను రాయరామానంద దర్శించుకుని భగవంతుడి అవతారంగా నమ్మి భక్తుడిగా మారాడు. ఆయనతో పాటు 100 మంది తెలుగు బ్రాహ్మణులు కూడా చైతన్య భక్తులుగా మారారు.
సామూహికంగా కృష్ణనామ సంకీర్తన వలన భక్తిభావం అందరి లోనూ ఒకేసారి ఉవ్వెత్తున పొంగి రావటాన్ని రాయరామానంద గమనించారు. రాధ ఆరాధనలో జీవితాన్ని పావనం చేసుకొమ్మని చైతన్యమహాప్రభువు ఆయనకు ఉద్బోధ చేశారు. రాయరామానంద మంత్రి దాన్ని పాటించాడు. ‘జగన్నాథవల్లభ’ నాటకం, ‘కృష్ణలీల’, ‘రూపసారంగ’, ‘పదకల్పతరు’ లాంటి కావ్యాలు, భజన కీర్తనలు ఒడియా, సంస్కృతం, బెంగాలీ, వ్రజ భాషల్లో ఇంకా అనేక రచనలు చేశారు. ‘టీకపంచకం అనే గ్రంథం కూడా వ్రాశారట.
శ్రీ రాయరామానంద చేరికతో ఒరిస్సాతో పాటు తెలుగునేలపైన కూడా చైతన్యమహాప్రభు ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. తన మంత్రి చైతన్యప్రభు శిష్యుడిగా చేరటంతో ప్రతాపరుద్రదేవుడికి చైతన్య ప్రభువు పట్ల అమితమైన భక్తి ఏర్పడింది. ప్రతాప రుద్రదేవుడి జీవిత చరిత్రలో చైతన్యమహాప్రభువుకు సంబంధించిన అనేక ఘట్టాలున్నాయి. చైతన్యమహాప్రభువు సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడేనని నమ్మిన వాడాయన. నారాయణతీర్థులవారికి గురుస్థానం వహించిన యోగిగా మారటానికి కావలసిన ఆత్మశక్తిని, ఆధ్యాత్మశక్తిని ఈ రాయరామానంద చైతన్య మహాప్రభు నుండి పొందారనటానికి ఈ తార్కాణాలన్నీ తోడ్పడతాయి.
శిష్యుడిగా మారిన ప్రతాపరుద్రదేవుడు
ప్రతాపరుద్ర దేవుడు రాజు కాబట్టి, రాజులు అహంకార పూరితులు కాబట్టి, ఒకదశలో చైతన్యమహాప్రభువు ఆయనకు తన దర్శనం ఇవ్వటానికి నిరాకరించాడట. తన రాజలాంఛనాలన్నీ తీసివేసి, సామాన్యుడిలా కొబ్బరీనెల చీపురు పట్టుకుని జగన్నాథ రథయాత్రకు ముందు భాగాన వీధి ఊడుస్తూ, చైతన్య మహాప్రభు చేసే ఆనంద తాండవాన్ని దగ్గరగా వీక్షించి ప్రతాపరుద్రదేవుడు. తన వ్యక్తిత్వం ద్వారా చైతన్యమహాప్రభు కరుణ పొందాడు.
1534లో పూరీ జగన్నాథుని సన్నిథిలో చైతన్య మహాప్రభు సిద్ధిపొందారు. ఆయన మరణం ప్రతాపరుద్ర దేవుణ్ణి, రామానందనూ బాగా కృంగదీసింది. తమ పాలనా కాలంలో చివరి 6 సంవత్సరాలు అలా పూర్తి నైరాశ్యంలోనే గడిపారా ఇద్దరూ. రాజూ, మంత్రీ ఇద్దరూ నిరాశలో ఉండటంతో పాలనా వ్యవస్థ కుంటుపడి గజపతి వంశం అంతరించటానికి కారణం అయ్యిందని డా||మహతాబ్ ఇంకా కొందరు ఒరిస్సా చరిత్రవేత్తలు వ్రాశారు.
చైతన్య మహాప్రభు సిద్ధిపొందిన ఆరేడేళ్ళకు ఆ దిగులుతో 1540లో ప్రతాపరుద్రదేవుడు మరణించాడు. మంత్రిగా ఉన్న రాయరామానంద కూడా పాలనా వ్యవహారాల్లోంచి పూర్తిగా తప్పుకుని వైరాగ్య భావనతో దిగంబరుడై యతిగా మారి శివరామానందయోగి పేరుతో రాధాకృష్ణ భక్తి ఉద్యమానికి అంకితమయ్యాడు. దేశాటన చేస్తూ, కంచిలోగానీ, కాశీలోగానీ ఉన్న సమయంలో నూనూగు మీసాల యువకుడిగా ఉన్న సన్యాసి నారాయణతీర్థుల పట్ల అనుగ్రహం కలిగి, ఆయనకు సంగీత విద్య ప్రసాదించి ఉండవచ్చునని రజనీగారి అభిప్రాయం. శివరామానంద యోగి నారాయణతీర్థుల కలయిక అనేది దైవప్రేరణ. ఆ మహాయోగి ఆ కుర్రవాణ్ణి దగ్గరకు తీసుకుని ఆశీర్వదించి శిష్యుడిగా చేసుకున్నాడు. ఆయన పేరును శివనారాయణ తీర్థగా మార్చాడు.
నారాయణతీర్థులవారు “రామానంద తీర్థ రమ్య తపఃపలం, రాధాకృష్ణరూప రమణీయం కృష్ణ” అని “గానం కురురే గోపాలం” కీర్తనలో తన గురువు గురించి చెప్పుకున్నారు. ఈయన్నుండి సంగీత విద్యతోపాటు వేదాంత శాస్త్రాన్ని, యోగశాస్త్రాన్ని నేర్చారు. డా. వి. రాఘవన్ ఈ రామానందతీర్థ కవి జీవిత విశేషాలు వ్రాయగా రజనీగారు వాటిని ఉదహరించారు. మద్రాసు సంగీత పరిషత్పత్రికలో ఇవి అచ్చయ్యాయి.
రాయరామానంద రాజకీయ పరంగానే కాదు, సంగీత సాహిత్యాలలో కూడా దిట్ట. నారాయణ కవి రచించిన “సంగీత సారణి”లో గుండక్రియ రాగంలో రామానంద వ్రాసిన ‘క్షుద్రగీత”ను ఉదహరించారని చెప్తారు. ‘జయతు రుద్రగజేశ ముదితం, రామానంద కవిరాయ కవిగీతమ్’ అని అంత్యముద్ర ఉంటుందని రజనీగారు వ్రాశారు. తననూ, తన ప్రభువు ప్రతాపరుద్రదేవుడినీ కలిపి చెప్పుకున్నా రిందులో!
రాయరామానంద మంత్రిగా ఉన్నప్పుడే నారాయణతీర్థులకు ఆయన పరిచయం అయ్యారా? అనే సందేహం రజనీగారికీ ఉంది. “ఇదంతా రాజమహేంద్రి- ప్రాంతంలోనే జరిగి ఉండవచ్చు” అంటూ, రజనీగారు “పరిశోధకులు ఎంతవరకూ అంగీకరిస్తారో? అనే ప్రశ్నార్థకం తోనే ఈ సమన్వయం చేశారు. తెలుగు భాషతో అనుబంధం ఉన్న ఆ ఇద్దరినీ విధి కలిపిందని భావించవచ్చు. అదికంచిలో జరిగినా కాశీలో జరిగినా గురు శిష్యుల కలయికే ప్రధానం! ఆ గురుశిష్యుల మధ్య వయసులో 60 యేళ్ళకన్నా ఎక్కువే వ్యత్యాసం ఉండవచ్చు. అద్వైత ధర్మాలను, కృష్ణభక్తితత్త్వాన్ని ఆయన నుండే నారాయణతీర్థులు గ్రహించారనేది సందేహాతీతం.
ఓఢ్ర గజపతుల చరిత్రలో రాయరామానంద పాత్ర కీలకం. చైతన్యప్రభువు నిరాకరించినా ప్రతాపరుద్రదేవుడికి ఆ ప్రభువు దర్శన భాగ్యం కలిగించి, శిష్యుడిగా చేసినవాడు రాయరామానందుడే! పూర్వగురువులు పునాదులు వేస్తే, నారాయణతీర్థులనే ఒక సుందర భవనాన్ని ఈ రామానంద యోగి నిర్మించాడు. దిశ, దశలు నారాయణతీర్థుల వారికి రాయరామానందుని ద్వారా స్పష్టమయ్యాయి.
గురువుకు దృష్టి తెప్పించిన ఘటన
నారాయణతీర్థులవారు భక్తిపారవశ్యంతో తరంగాలను గానం చేస్తుంటే, శ్రీ కృష్ణపరమాత్ముడు స్వయంగా వచ్చి వినేవాడని, ఆయన గానంతో పాటుగా తాను కూడా ఆడేవాడనటానికి తార్కాణంగా అనేక వృత్తాంతాలను చెప్తారు.
గురుకులంలో వేదాంత శాస్త్రం అభ్యసించే రోజుల్లో గురువు ఒక కుటీరంలోనూ, దూరంగా నారాయణతీర్థులు వేరొక కుటీరంలోనూ ఉండేవారు. నారాయణతీర్థులు పాడుతున్నప్పుడల్లా ఆయన కుటీరం అద్వితీయమైన వెలుగులు పరిమళాలు విరజిల్లటాన్ని గురువు గమనించాడు. కుటీరంలో ఏం జరుగుతోందో చూడాలని ప్రయత్నించిన గురువుకు కళ్ళు పోయాయని ఒక కథ ప్రచారంలో ఉంది. మర్నాడు నారాయణతీర్థులవారు ఆయనను లేపి ఉపచర్యలు చేసి సంగతి గ్రహించారు. గురువు కోసం తాను కృష్ణుని ప్రార్థిస్తూ “గానం కురురే గోపాలం-బ్రహ్మానందం మురళీలోలం” కీర్తన పాడారు. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడని గురువుకు కృష్ణదర్శన భాగ్యం కలిగించ వలసిందిగా తీర్థులవారు ప్రార్థించారనీ, పోయిన చూపు తిరిగి వచ్చిందని చెప్తారు. ఆ గురువు ఎవరో తెలీదు.
“స్వయం వ్యక్తం పరం తత్త్వం హరిం త్వా మివ లోకయామః॥” అంటూ గానం చేసిన నారాయణతీర్థులవారు భగవంతుని సేవలో ధన్యత నొంది సంతృప్తి కొద్దీ జీవించారే తప్ప లౌకిక వాసనలు ఏవీ ఆయనకు అంటలేదని స్పష్టం అవుతుంది.
“వయం ధన్యా వయం ధన్యా వయం ధన్యా దేవ వసుధాతలే॥“ అంటూ తన జన్మధన్యతను, సంతృప్తినీ వ్యక్తపరిచారాయన!
తిరుపతి సంఘటన:
శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువును సందర్శించి శ్రీముఖ చైత్ర శుద్ధ తదియ ఆదివారం 10వ తరంగ రచన ప్రారంభిస్తుండగా ఆయనకు మళ్ళీ కడుపునొప్పి వచ్చింది. ఆహారం తీసుకున్నాక జీర్ణం అయ్యే క్రమంలో వచ్చే ఈ నొప్పిని పరిణామశూల అంటారు. తీర్థులవారి పరిణామశూల చిరకాలంగా ఉన్నదే! అది తిరగబెట్టినప్పుడల్లా ఆయన ఏదో ఒక నృసింహ క్షేత్రానికి వచ్చి స్వామిని కీర్తించి, నొప్పిని తగ్గించుకునేవారు. అలాగని నారసింహ క్షేత్రాలను వరుసగా తీర్థులవారు సందర్శించింది కేవలం కడుపునొప్పి బాపుకునేవారు. కడుపునొప్పి కోసం కాదు, అంతకు మించిన ఆధ్యాత్మిక ప్రయోజనం ఏదైనా ఉండవచ్చు. అది మన స్థాయికి అందేది కాకపోవచ్చు. చివరిగా తిరుపతి చేరి శ్రీవారిని సందర్శించుకున్నారు.
తిరుపతిలో ఓ విశేష సంఘటన జరిగింది. వైష్ణవ ముద్ర ధరించి ప్రసాదం తింటూ ఒక పిల్లవాడు కన్పించాడు. ఆ పిల్లవాడు గుడి లోపలికి వెళ్లి పదేపదే ప్రసాదం తెచ్చుకుని తింటూండటాన్ని గమనించి తీర్థులవారు అతని దగ్గరకు వెళ్లారు. తను తింటున్న దాంట్లోంచి ప్రసాదం కొంచెం తీసి తీర్థులవారికి పెట్టబోయాడా పిల్లవాడు. తీర్థులవారు ఆ ఎంగిలి ప్రసాదాన్ని నిరాకరించారు.
“ఇలా అతిగా తింటే కడుపులో నొప్పి వస్తుంది నాయనా!.. జాగ్రత్త” అని హెచ్చరించారా బాలుణ్ణి. వెంటనే ఆ పిల్లవాడు బిగ్గరగా నవ్వి, “ఈ ప్రసాదాన్ని నువ్వు తినకపోతే నీకు కడుపునొప్పి వస్తుంది నాయనా” అన్నాడు. అంతే! మరుక్షణమే తీర్థులవారికి తట్టుకో లేనంత కడుపునొప్పి మొదలయ్యింది!
తీర్థులవారు కడుపునొప్పితో మెలికలు తిరుగుతుంటే, ఆ పిల్లవాడు చప్పట్లు కొడుతూ, ఆనందంగా నృత్యం చేశాడట.
ఆ నృత్యంలోని దైవీమయమైన లయని, గోవిందనామాన్నిగమనించారు తీర్థులవారు. అలా తన పొరబాటును కూడా గుర్తించారు. ఆ బాలకుడు సాక్షాత్తూ భగవంతుడే అని అర్థం అయ్యిందాయనకి. దేవుడు స్వయంగా తన చేతులతో ఇచ్చిన ప్రసాదాన్ని భుజించ లేకపోయిన తన దురదృష్టానికి తనని తనే నిందించుకున్నారాయన.
“బాలగోపాల మా ముద్ధర/ కృష్ణ పరమకల్యాణ గుణాకర॥
నీరదనీలకళేబర కృష్ణ/నిరుపమకౌస్తుభ కంధర॥”
అంటూ స్వామిని స్తుతించారు. ఆయన కడుపునొప్పి తగ్గిపోయింది. ఈ ‘బాలగోపాల మాముద్ధర’ కీర్తన తెలియని సంగీత వేత్తలుండరు. అంత ప్రసిద్ధి పొందిన తరంగం ఇది.
నామసిద్ధాంత ప్రవక్త భోదేంద్ర సరస్వతి
తిరుపతి నుండి దక్షిణానికి బయలుదేరిన నారాయణతీర్థులవారు నామసిద్ధాంత ప్రవక్త బోధేంద్రసరస్వతి దర్శనం కోసం తంజావూరు దగ్గిర గోవిందాపురం వచ్చారు. కుంభకోణం నుండి 7 కి.మీ. దూరంలో గోవిందాపురం గ్రామం ఉంది.
తంజావూరు మంత్రి, సంగీత సాహిత్యవేత్త, అప్పయ్యదీక్షితులవారికి సన్నిహితులు, ప్రసిద్ధ సంగీత సిద్ధాంతకర్త వేంకటమఖి తండ్రి శ్రీ గోవింద దీక్షితులవారి పేరున వెలసిన అగ్రహార గ్రామం ఇది. ఈ కథాకాలానికి గోవింద దీక్షితులవారు బహుశా సజీవులే కావచ్చు. 1534 నుండీ చెవ్వప్ప నాయకుడికీ, 1584 నుండీ రఘునాథ నాయకుడికీ ఆయన మంత్రిగా పనిచేశారు.
తంజావూరు సాంస్కృతిక వైభవానికి బీజావాపన చేసిన వాడు గోవింద దీక్షితులు. ఈయన కన్నడిగుడని కొందరు, తెలుగువాడని కొందరూ భావిస్తారు. ఆ మహానుభావుడి పేరున వెలసిన గుడి గోపురాలు, గ్రామాలు, నగర వీధులు, సత్రాలు, చెరువులు ఎన్నో తంజావూరు, కుంభకోణం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.
కంచికామకోటి పీఠం ఆ రోజుల్లో కుంభకోణం కేంద్రంగా పనిచేసేది. దాని 59వ అధిపతి శ్రీ నామ బోధేంద్ర స్వామి ఈ ఊరు మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు రామనామం పదేపదే వినిపించసాగింది. ఇది భగవంతుడి పిలుపుగా బావించి ఆయన అక్కడ సజీవ సమాధి చెందారు. తెలుగువారికి రాఘవేంద్రస్వామి సజీవసమాధి చెందిన మంత్రాలయం లాగే, బోధేంద్ర సజీవ సమాధి చెందిన ఈ గోవిందాపురాన్ని తమిళులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ కార్యదీక్షలో ఉన్నవారికి బోధేంద్రుల వారు కర్తవ్యప్రబోధం చేస్తారని ప్రతీతి.
“సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం” సదాశివుడితో ఆరంభించి జగద్గురువు ఆదిశంకరాచార్య నుండి గురుదేవులవరకూ గురుపరంపరకు నమస్కారం అని గురుధ్యాన్నం చేస్తారిక్కడ.
భగవన్నామ బోధేంద్ర సరస్వతి (1638–1692) కంచికామకోటి మఠానికి 59వ పీఠాధిపతి. తెన్ పెన్నై అని పిలవబడే దక్షిణ పినాకిని నదీతీరంలో గోవిందాపురం గ్రామం మనసుకు నచ్చి అక్కడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి ఎక్కువ కాలం అక్కడే గడిపేవారు. అప్పట్లో మఠం ముఖ్య కేంద్రం కుంభకోణంలో ఉండేది. 1770 ప్రాంతాల్లో హైదర్ ఆలీ సైన్యం ఈ ప్రాంతంలో కవాతు చేసినప్పుడు కుంభకోణం నుండి ఈ మఠాన్ని కాంచీపురానికి తరలించారు.
గోవిందాపురం నుండి బోధేంద్రస్వామి కుంభకోణంలో కన్నా ఈ గోవిందాపురంలో ఎక్కువగా ఉంటూ, ఇక్కడి నుండే నామ సాంఫ్రదాయ ప్రచారం చేసేవారు. బోధేంద్రుడు పరమ రామభక్తుడు. కామకోటి మఠానికి ఆయన అధిపతి. కంచిలోని మండన మిశ్ర అగ్రహారంలో ఆయన జన్మించారు. తండ్రి కేశవ పాండురంగ. “కలియుగంలో మోక్షసాధన పొందాలంటే ఒకే ఒక మార్గం భక్తి” అని నమ్మి భగవన్నామ సిద్ధాంతం ప్రచారం చేశారాయన.
భగవంతునికి అనేక పేర్లను వెదికి తీసి, ‘నామామృతరసాయనం’, ‘నామామృతరసోదయం’ అనే గ్రంథాలు వ్రాశారు. ఆ నామాల్ని సంకీర్తన చేయటం ద్వారా మోక్షాన్ని పొందవచ్చనేది ఆయన ప్రబోధం. ఆయన తన సిద్ధాంతాన్ని నామ సిద్ధాంతం అన్నారు. కాలక్రమంలో ఈ నామసిద్ధాంతమే భజన సాంప్రదాయానికి మాతృక అయ్యింది.
దక్షిణ భారతాన నామసిద్ధాంతాన్ని స్థాపించి, భగవన్నామాన్ని వ్యాప్తి చేసి, భగవన్నామ బోధేంద్రులుగా ఆయన ప్రసిద్ధి పొందారని, భజన సంప్రదాయానికి ఆయనే ఆద్యులు అయ్యారని కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి వ్రాశారు.
ఈశ్వర నామ సంవత్సరంలో తులా నెల కృష్ణపక్ష అష్టమి రోజున ఆయన సజీవసమాధి అయ్యారు. కంచి పరమాచార్యుల వారే, స్వయంగా శోధించి, నామ బోధేంద్రులవారి సమాధిని కనుగొన్నారు. ఒక చోట సమాధి గుర్తులు కనిపించి, అక్కడ తవ్వమని శిష్యులకు జగద్గురు శ్రీ పరమాచార్య సూచించారు. అలా తవ్వుతుండగా, ఆయన కళ్ళ ముందు ఒక సన్యాసి విశ్వరూపంతో సాక్షాత్కరించారు. భూమి నుండి ఆకాశం దాకా వ్యాపించినట్టుగా నిలబడి ఉన్నారా మహానుభావుడు. కాషాయం కట్టి, నుదుట విభూతితో, మెడలో రుద్రాక్షలతో, చేతిలో కమండలంతో వేలమంది బ్రాహ్మణులు వేదం చదువుతుండగా, ఋషులు మునులకు శ్రీరుద్రభాష్యం చెబుతూ కనబడ్డారాయన.
“చూస్తూండగానే, నాకు గట్టిగా “తవ్వకు.. తవ్వకు” అని వినిపించింది. తరువాత వారి రూపం చిన్నగా మారిపోయింది, వారు అంతర్థానమయ్యారు. ఎవరో “సదాశివం! సదాశివం!” అనడం వినబడింది. తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదు” అని ‘కంచి పరమాచార్య వైభవం’ గ్రంథంలో ఫిబ్రవరి 22, 2017న పరమాచార్యులవారు పేర్కొన్నట్టు ఉంది.
గోవిందాపురంలోని ఈ స్థలమే ఆత్మబోధేంద్రుల ముక్తి స్థలం అని నిర్ధారించుకుని, 1927 జనవరి 17న అక్కడ ఒక శివలింగం ప్రతిష్టించి ఆత్మబోధేంద్రులకు ఒక బృందావనం నిర్మించారు శ్రీ పరమాచార్య. విల్లుపురం దగ్గర్లోని వడవంబలంలో ప్రతి సంవత్సరం నామబోధేంద్ర స్వామి ఆరాధన నిర్వహిస్తున్నారు.
బోధేంద్రుల గురించి కరాకర్ణిగా విని ఆయనను కలుసుకోవాలని ఆశతో నారాయణతీర్థులవారు గోవిందాపురం వచ్చారు. కానీ, అప్పటికే ఆయన సిద్ధిపొందినట్టు తెలిసి నిరాశ చెందారు.
నిర్వేదంలో ఉన్న ఆయనను ఊరడించి, నామసిద్ధాంత ప్రచార బాధ్యత స్వీకరించవలసిందిగా బోధేంద్రుల వారి ఆదేశం నారాయణతీర్థుల మనోనేత్రానికి దృశ్యమానం అయ్యింది. గురుదేవుడు కరుణించాడని భావించారు.
“It is Sri Bodhendra Saraswati tha was living at Govindapuram a village about 7 miles east of Kumbakonam. He was a great Advocate of Sri Bhagawan Nama Siddhanta and has written several works about Namasiddhanta. Two of the said books have been printed and we are arranging to send copies of the same to you. There is a Mutt at Marudanalluru, a village 3 miles South of Kumbakonam called SrI Sadguru Swami Mutt established by Sri Sadguru Swamy, a lineal disciple of Sri Bodhendra. All the works of Sri Bodhendra are found in the Mutt. Most of them are unpublished, and are on palm leaves. They are now being copied so that they may not be lost to the world” అని శ్రీ కంచి పరమాచార్య 1944లో నూజివీడు జమీందారు శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దర్ వారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.
1906లో రాజా రంగయ్యప్పారావుగారికి రాజా బిరుదు వచ్చింది. వీరి కుమార్తెని నరసరావుపేట జమీందారుకి ఇచ్చారు. ఈయన దత్తపుత్రుడు వెంకటాద్రి అప్పారావు బహద్దరు. ఈయన కుమారుడు రాజా రంగయ్యప్పారావు గారు నూజివీడు శాసనసభ్యులుగా కొంతకాలం విద్య, సాంస్కృతిక శాఖామాత్యులుగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు.
శ్రీ వెంకటాద్రి అప్పారావు నారాయణతీర్థుల తరంగాల్ని చాలా అందమైన తెలుగులో గేయాలరూపంలో చేసిన అనువాద గ్రంథానికి కంచిపరమాచార్యవారి ముందుమాటలలో ఈ లేఖ ప్రచురించారు.
నామసిద్ధాంతం వైపు ఆకర్షణ
దేవుడికన్నా దేవుడి నామం శక్తివంతమైనదని, ముక్తికి దగ్గరిదారిని తెలుపుతుందనీ నామ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన బోధేంద్ర స్వామిని స్వయంగా దర్శించుకోలేకపోయినా ఆయన సిద్ధాంతాన్ని అందుకోవాలనే ఆదేశం ఏదో ఆయన మనసును ప్రేరేపించసాగింది.
‘రామ, కృష్ణ, గోవింద అని పలకటం ప్రయాగలోని త్రివేణీ సంగమంలో మునిగిన దానికన్నా పుణ్యప్రదం..’ అని ప్రబోధించిన బోధేంద్రుని వాక్కుల్నే ఒక ప్రబోధంగా భావించారు నారాయణతీర్థ. అదొక దివ్యప్రేరణ.
మహాత్ములు ముఖాముఖీ ఎదురూబొదురుగా కూర్చుని సంభాషించుకోవలసిన అవసరం ఉండదేమో.. సశరీరులుగా భౌతికమైన మాటలతోనో చేతలతోనో ప్రేరేపించాల్సిన అవసరం బ్రహ్మైక్యం చెందినవారికి ఉండదు. దివ్యమైన తేజస్సుతోనే తాము ఎంచుకున్న మనుషులకు ఎంచుకున్న ప్రేరణని అందిస్తుంటారు.
స్వామి కలలో కనిపించి చెప్పారనటం ఇటువంటి ప్రేరణే! అదొక దివ్యమైన ఆదేశం లాంటిది. ఆ ఆదేశాన్ని పాటించటం వలన ధర్మం నిలబడుతుంది. అదే ఙ్ఞానబోధ చేస్తుంది. కృష్ణనామ ప్రచారం చెయ్యాలని బోధేంద్రులు సజీవులుగా లేకపోయినా తీర్థులవారికి ప్రేరణ కలిగించారు. తీర్థులవారు ఆ సందేశానికి ప్రేరితులయ్యారు.
“అలబోధేంద్ర సరస్వతీ ప్రముఖులౌ నాచార్యులున్ శిష్యులై
కొలువం బేర్చి సమస్త శాస్త్రముల వాకోవాక్య సిద్ధాంతముల్
సలుపన్ దక్షుడు తీవ్రభక్తికలనార్చా ప్రీత గోవిందుఁడై
విలసన్నామజపై కదీక్షితుఁడు తృప్తింబొంది యుండెన్ గడున్”
అని విశ్వనాథవారు బోధేంద్రులవారి ప్రేరణ గురించి వ్రాశారు.
నారాయణతీర్థుల వారు తిరుపతి నుండి తంజావూరు చేరటం, అక్కడ నుండి గోవిందాపురం వెళ్ళటం ఇవన్నీ దైవప్రేరణలే! ఇక్కడి నుండి ఆయన గమ్యం ఎటు? అది ఆయనకూ తెలీదు. తాను అనుకుని రాలేదు. అనుకొని పోలేడు కూడా! దైవాదేశం కోసం ఆయన అంతరాత్మ ఎదురుచూస్తోంది.
శ్రీ చైతన్యమహాప్రభు సంప్రదాయంలో నామజపమే ముఖ్యమైంది. నామాన్ని పదేపదే ఉచ్చరిస్తే ఆ దేవుడిని పదేపదే కొలిచినట్టే ననేది నామసిద్ధాంతం. ఈ విధంగా నామజపం వలన నామికి నామానికి తేడా లేకుండా పోతుంది. ‘నామ నామినో రభేదః’ దేవుడూ, దేవుడి పేరూ ఒకటే అని కదా ఆర్యోక్తి. పరోక్షంగా ఈ సిద్ధాంతం శబ్దం యొక్క శాశ్వతత్త్వాన్ని నిరూపిస్తోంది.
నామానికి పత్యేక స్టానం ఇచ్చి “భగవత్స్యరూపం ఏవ నామ:” అంటుంది నామసిద్ధాంతం. ఈ క్రమంలో నామమే ఒక అవతారం అయ్యింది. ఆ అవతారాన్నే “వర్ణావతారం” అన్నారు. “అవతారాంతరవత్ పరమేశ్వరస్య వర్ణరూపేణావతారోఽయమ్” అని దీని నిర్వచనం.
నిజానికి 14 వర్ణాలుగా పరమేశ్వరుడే అవతరించాడని ఆ వర్ణాలనే మాహేశ్వర సూత్రాలంటారు. వర్ణం భగవంతుడి అవతారం అనే సిద్ధాంతం పాణిని కాలం నుంచీ అంటే, సుమారుగా 3000 యేళ్ళనుండీ ఉంది. ఈ కథాకాలానికి అది ఒక ఆకృతి తీసుకుని వర్ణమే అవతారం అనటం ద్వారా బహుశా దేవుడి పేరుతో జరుగుతున్న మత యుద్ధాలకు ఒకముగింపు పలకాలనే ప్రయత్నం లాంటిదేదో ఉండి ఉంటుంది నారాయణతీర్థులు ఆ ప్రయత్నానికి ఒక ఉపకరణం కావాలనేదే బోధేంద్రుల అంతర్వాణి ప్రబోధం కావచ్చు.
ఆయన ఏ తంజావూరు ప్రభువు ఆశ్రయం కోసమో అక్కడకు చేరలేదు. ఏ ప్రభువూ ఆయన రావాలని ఆహ్వానించలేదు.
శైవ వైష్ణవ భేదాలు తారాస్థాయిలో ఉన్న తమిళనాడులో పాలకులు పరమ వైష్ణవులుగా ముద్ర వేసుకుని వ్యవహరిస్తున్న ఆ సమయంలో విష్ణుభక్తులకు రాధాకృష్ణతత్వాన్ని పరిచయం చేసి ప్రేమని భక్తికన్నా గొప్పదైన అంశంగా ప్రబోధించే బాధ్యత ఏదో ఆయనకు అందబోతోంది. విష్ణుభక్తి పేరున పాలనాధికారాన్ని చెలాయిస్తోన్న రామానుజానుయాయుల దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి ఒక ఉపకరణంగా మారబోయే పరిస్థితులు ఆయన కళ్ళకు కట్టసాగాయి. ఏ దిశా కనిపించని స్థితిలో ఆయన గోవిందాపురం నుండే తన గమనాన్ని ప్రారంభించి గమ్యాన్ని వెదకసాగారు.
నడుకావేరి వృత్తాంతం
శ్రీ బోధేంద్రసరస్వతి ప్రేరణతో గోవిందనామస్మరణ చేస్తూ తీర్థులవారు నడుకావేరి అనే ఊరు చేరారు. ఆ ఊరిలో వినాయకుడి గుడి ఉంది. తీర్థులవారు ఆ రాత్రి ఆ గుళ్లో విశ్రమించారు. కానీ, అంతలోనే ఆయనకు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. తిరుపతి సంఘటనని గుర్తు చేసుకుని, గోవిందుని స్తుతిస్తూ ఒక కీర్తనను చెప్పారు:
“క్షేమం కురు సతతం గోపాల-మమ క్షేమం కురు సతతమ్॥
కామం తవపాద-కమలే భ్రమరీభవతు శ్రీ
మన్మమ మానసం-మధుసూదన॥
అక్షీణకరుణానిధే ఆనందఘన-ప్రక్షీణదోషతతే
శిక్షితాసురగణ-రక్షితనిజజన కుక్షిస్థితానేక-కోటిలోకావన॥
ప్రహ్లాదభయవిదూర పరమయోగి-పురీ-విమల కమలాలోల
నిజనారాయణతీర్థ-నిత్యానందబాల॥”
అలా గోవిందనామస్మరణతో నొప్పిని అప్పటికి ఉపశమింప చేసుకున్నా రాయన. నామజపం ప్రాధాన్యత అలా ఆయన అనుభవంలోకి అప్పటికప్పుడే వచ్చింది. సద్యఃఫలితాలను చూపే దగ్గరి దారిగా నామజపాన్నిఆయన భావించారు. కానీ, అప్పుడప్పుడూ నొప్పి తిరగబెడ్తోనే ఉంది. మర్నాడు బయలుదేరి మరొకసారి తిరుపతి వెళ్ళాలనుకున్నారు. ఆ రాత్రికి గణేశ దేవాలయంలో విశ్రమించారు. అక్కడ కలలో వినాయకుడు కనిపించాడు. “నువ్వు తిరుపతి రానవసరం లేదు. తెల్లవారి నిద్రలేస్తూనే ఏ జంతువు నీకు కనిపిస్తుందో దాన్ని అనుసరిస్తూ వెళ్లు. నీకు సత్వర శాశ్వత ఉపశమనం కలిగించే స్థలాన్ని చూపిస్తుంది” అని చెప్పాడట.
తీర్థులవారు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోగానే ఆయనకు ఒక తెల్లని వరాహం కనిపించింది. తీర్థులవారు ఆ వరాహాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. అది 5-6 మైళ్ల దూరం వెళ్లి ఒక చోట ఆగిపోయింది. వరాహం ఆగిన చోటే ఒక కొత్తకథ మొదలయ్యింది. వరుగూరులో కొత్త జీవితం
“చేరెను వరాహపురి, చే/కూరెను బో, వ్యాధిశాంతి, కూడిన తద్గ్రా
మారూఢ ద్విజసంఘము/తారుగ జనుదెంచి స్వాగతము పచరింపన్”
(విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం)
అది భూపతి రాజపురం అనే అగ్రహారం. కావేరీనది ఒడ్డున ఉన్న గ్రామం. ఇక్కడే తాను స్థిరనివాసంగా ఉండాలనేది గోవిందుని ఆదేశంగా భావించారు తీర్థులవారు. అక్కడే వారం రోజులపాటు నిరాహారంగా ధ్యాన్నమగ్నుడై కూర్చున్నారాయన. ఆ సంగతి ఊరువారికి తెలిసింది. ఒక మహాపురుషుడు తమ గ్రామానికి రానున్నాడని యోగులు సిద్ధులు ముందుగానే చెప్పటంతో వాళ్లు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారా సమయానికి.
“నారాయణతీర్థుల వా/రా రీతిని మూడు వత్సరమ్ముల వఱకున్
వారాహపురి వసించిరి/చేరిరి తిరువుంతురుత్తి సిద్ధిఁగనుటకై”
అని వ్రాశారు శ్రీ విశ్వనాథ. కూడమురుత్తి నదీ తీరాన వరుగూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఆయన కడుపునొప్పి అదృశ్యం అయిపోయింది. తన వ్యాధి అదృశ్యమైన ఆచోటు తన ఆర్తిని బాపే దివ్యస్థలంగా ఆయనకు అనిపించింది. ఆ కోవెలలోనే ఆగిపోయారాయన.
లీలాశుకుడు
జయదేవుడికీ, నారాయణతీర్థులవారికీ మధ్య కాలంలో వెలువడిన మరో మహా గ్రంథం శ్రీకృష్ణలీలా తరంగిణి. దీనికర్త లీలాశుకుడుగా ప్రసిద్ధుడైన బిల్వమంగళస్వామి. బిల్వమంగళుడనే పేరుతో చాలామంది ప్రసిద్ధులైన ఆచార్యులు ఉన్నారని చెప్తారు. మొదటి బిళ్వమంగళ ఆచార్య కేరళలోని నడువిల్ మధోమ్ ప్రాంతానికి చెందినవాడని, 8వ శతాబ్ది వాడని, ఆయన సమాధి తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం దగ్గర ఉన్నదనీ చెప్తారు.
రెండవ బిల్వమంగళ స్వామి 14వ శతాబ్దిలో త్రిస్సూరుకు చెందినవాడు. ఈ రెండవస్వామి భారతదేశవ్యాప్తంగా ప్రసిద్ధుడు. ఈయనను తెలుగువారు, బెంగాలీలు, ఒరియావారు తమతమ ప్రాంతాలవాడుగా చెప్పుకుంటారు. ఈయన వ్రాసిన శ్రీకృష్ణకర్ణామృతంలోని సంస్కృత శ్లోకాలు గానానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి ఉపయోగించే రచనలుగా ప్రసిద్ధిపొందాయి. శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకొని పోవటంలో ఈ కావ్యం ఎంతగానో తోడ్పడింది.
“కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం,
సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!” అంటూ శ్రీకృష్ణుని రూపాన్ని కళ్లకు కట్టించిన మహానుభావుడు లీలాశుకుడుగా ప్రసిద్ధుడైన బిల్వమంగళాచార్య. గోకులంలో ఆడుకునే బాలగోపాలునిగా, గోపకాంతలకు ఆరాధ్యుడైన లోకోత్తర శృంగార పురుషుడిగా ఈ కావ్యంలో శ్రీకృష్ణుని చిత్రించా రాయన.
దేశవ్యాప్తంగా లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతం విశేషంగా వ్యాప్తి నొందింది. ఈ కావ్యం కారణంగానే ప్రతి రాష్ట్రం వారు ఆయన్ని తమవాడుగా భావించినట్టే, తెలుగువారు కూడా ఆయన్ని కృష్ణాజిల్లా శ్రీకాకుళం ప్రాంతం వాడని చెప్తారు. ఈ నాటికీ కూచిపూడి కళాకారులకు లీలాశుకుని రచనలు ఆలంబనగానే ఉన్నాయి.
సిద్ధేంద్రయోగి
ఇంక సిద్ధేంద్రయోగి కథకు వస్తే, తీర్థులవారికి రాయచోటి బడగలనాటి కన్నడిశాఖ సిద్ధప్ప శిష్యుడనీ. వారిద్వారా సన్యాసం స్వీకరించి, సిద్ధేంద్రయోగిగా ప్రసిద్ధు డయ్యాడని కొందరు చెప్తారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళం, కూచిపూడిలలో సిద్ధప్ప ఆయనకు శిష్యుడుకాగా, కూచిపూడిలోనే తీర్థులవారు అతనికి సన్యాసం ఇచ్చి సిద్ధేంద్రయోగిని చేశారని మరో కథనం ప్రచారంలో ఉంది.
కాశీలో తీర్థులవారు విద్య నభ్యసించే కాలంలో సిద్ధేంద్రయోగి ప్రదర్శించిన భామాకలాపం చూసి నారాయణతీర్థులు ప్రభావితులై ఆ మార్గాన కృష్ణలీలాతరంగణి వ్రాయాలని నిర్ణయించుకున్నారని ఇంకో కథనంకూడా ఉంది. ఈ కథనం ప్రకారం సిధ్ధేంద్రయోగే గురువు, నారాయణతీర్థ శిష్యుడూ అయ్యారు. ఇలా తీర్థులవారి జీవిత చరిత్ర రకరకాల కథనాలతో నిజాలకు అందనంత దూరంగా ఉంది.
“వర్ణితం శివరామతీర్థపదామ్బుజ భ్రమరేణ”,
“ధీరశివనారాయణానందతీర్థయతి-గూఢపరమార్థ మతికరుణం త్వాం నౌమి”
“శివరామానందతీర్థసుఘటితం-స్థూలాదిక మితి హరిగురుకృపయా”
అని తన గురువు శివరామతీర్థనీ, “శివరామానందతీర్థ సిద్ధానందదాయకం” అని గురువుతోపాటు, తన శిష్యుడు సిద్ధేంద్రయోగిని కూడా ఆయన స్మరించటం చూస్తే, ఆయన గురుభక్తి, శిష్య వాత్సల్యం రెండూ ద్యోతకం అవుతాయి. శిష్యుడికి తనకన్నా ముందే భగవద్దర్శనం కావటం అనే సంతోషం ఆయన మాటల్లో ధ్వనిస్తుంది. అంతేకాదు, సిద్ధేంద్రయోగి నారాయణతీర్థులవారి శిష్యుడేనని కూడా రూఢీ అయ్యింది.
రాగాన్ని కూర్చటం, పాటని కట్టటం, దానిని కమ్మగా పాడటం లేదా వివిధ వాయిద్యాల సహకారంతో ప్రదర్శించటం అనే మూడు కళల సమాహారం సంగీతం. అది సాధనం వలనే సమకూరే విద్య.
బిల్వమంగళుడనే పేరుతో చాలామంది ప్రసిద్ధులైన ఆచార్యులు ఉన్నారు. మొదటి బిళ్వమంగళ ఆచార్య కేరళలోని నడువిల్ మధోమ్ ప్రాంతానికి చెందినవాడు, 8వ శతాబ్ది నాటివాడు. ఆయన సమాధి తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం దగ్గర ఉంది.
రెండవ బిల్వమంగళ ఆచార్యులు 14వ శతాబ్దిలో త్రిస్సూరుకు చెందినవాడు. ఈ రెండవస్వామి భారత దేశవ్యాప్తంగా ప్రసిద్ధుడు. ఈయనను తెలుగువారు, బెంగాలీలు, ఒరియావారు తమతమ ప్రాంతాల వాడుగా చెప్పుకుంటారు. శ్రీకృష్ణకర్ణామృతం కావ్యాన్ని లీలాశుకుడి పేరుతో ఈ బిల్వమంగళుడే వ్రాశాడని ప్రతీతి.
శ్రీకృష్ణకర్ణామృతంలోని శ్లోకాలు గానానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి అనువుగా ఉంటాయి. శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకొనిపోవటంలో ఈ కావ్యం ఎంతగానో తోడ్పడింది.
“కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!” అంటూ శ్రీకృష్ణుని రూపాన్ని కళ్లకు కట్టించిన మహానుభావుడు- లీలాశుకుడుగా ప్రసిద్ధుడైన బిల్వమంగళ ఆచార్య.
గోకులంలో ఆడుకునే బాలగోపాలునిగానూ, గోపకాంతలకు ఆరాధ్యుడైన లోకోత్తర శృంగార పురుషుడిగానూ ఈ కావ్యంలో శ్రీకృష్ణుని చిత్రించాడాయన. ఈ కావ్యం కారణంగానే ప్రతి రాష్ట్రం వారు ఆయన్ని తమవాడుగా భావించారు. తెలుగువారు ఇతన్ని కృష్ణాజిల్లా శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవాడన్నారు.
1515 ప్రాంతాల్లో శ్రీ చైతన్య మహాప్రభువు ఆంధ్రదేశయాత్రలో కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామం కూడా వచ్చాడట. ఆ సమయంలో అక్కడి కళాకారులు శ్రీకృష్ణకర్ణామృత గానం విని ఆనంద భరితుడై దానికి నకలుప్రతి రాయించుకుని తనతో తీసుకువెళ్ళి వంగదేశంలో దానికి ప్రాచుర్యం తెచ్చారని ‘చైతన్యచరితామృతం’ లో ఉంది. ఇది చారిత్రాత్మకమైన విషయం. అప్పటికి కూచిపూడిలో లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ప్రదర్శించేవారని దీని ఆధారంగా ఒక నిర్ణయం చేయవచ్చు. సిద్ధేంద్రుడికి ముందే భాగవత కళ కూచిపూడిలో ప్రసిద్ధి పొందిందనేది ఒక చారిత్రక సత్యం.
తన చింతామణి నాటకంలో కనిపించే బిల్వమంగళుడి కథ ఈ లీలాశుకుడిదేననీ, ఆయనే శ్రీ కృష్ణకర్ణామృతకర్త అనీ, తన తండ్రి చెప్పిన లీలాశుకుడి కధ తనకు ప్రేరణ అని చింతామణి నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావు గారు వ్రాశారు.
“క్రీ.శ. 1500 సంవత్సరం ప్రాంతం నుండీ కూచిపూడిలో యక్షగాన ప్రదర్శనలను కులవృత్తిగా అవలంభించిన బ్రాహ్మణ కుటుంబా లుండేవని విస్సా అప్పారావుగారు క్షేత్రయ్య పదములు గ్రంథ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. అతను అవలంభించిన సంప్రదాయాలనుబట్టి 17వ శతాబ్ద ప్రారంభంలో ఉండినవాడని తెలుస్తుందని రజనీ కాంతరావుగారు ఆంధ్రవాగ్గేయకారుల చరిత్రలో వ్రాశారు.
బందావారు సిద్ధేంద్రుడు 1350-1450 మధ్యకాలంలో జీవించాడన్నారు.
పి యస్ ఆర్ అప్పారావుగారు 14-15 శతాబ్దాలకాలానికి చెందినవాడని అభిప్రాయపడ్డారు.
బాలాంత్రపు రజనీకాంతారావుగారు 1400 సంవత్సర ప్రాంతంలో సిద్ధేంద్రయోగి కూచిపూడి గ్రామంలో నాటకరంగాన్ని స్థాపించాడని వ్రాశారు.
రుక్మిణీ అరండేల్ గారు 17-18వశతాబ్దినాటివాడని అన్నారు.
విస్సా అప్పారావుగారు 17వ శతాబ్దివాడన్నారు. ఇంకొందరు 11వ శతాబ్ది వాడన్నారు.
“క్రీ.శ. 1302 ప్లవనామ సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమినాడు భాగవతుల ప్రభాకరశర్మ త్రిపురసుందరి దంపతులకు జన్మించాడని, తల్లిదండ్రులు ఆయనకు పెట్టినపేరు కృష్ణశాస్త్రి అనీ కూచిపూడి పెద్దలను ఉటంకిస్తూ నండూరి పార్థసారథిగారు వ్రాశారు.
సిద్ధేంద్రయోగి జీవితం గురించి అనేక కథనాలున్నాయి. పసుమర్తి ఆదినారాయణ గారు వ్రాసిన కథనం ప్రకారం సిద్ధేంద్రయోగి పూర్వాశ్రమంలో చింతా సిద్ధయ్య. కూచిపూడి గ్రామస్థుడు. ఉపనయనం చేసినా చదువు వంటబట్టక పోతే, తల్లిదండ్రులు పశుకాపరిగా మార్చారు. కొంతకాలానికి భాగవతులవారి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఒకరోజు అకస్మాత్తుగా చదువుకోవాలని కోరిక గలిగి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి గురువును వెదుక్కొంటూ బయల్దేరాడు. కాశీలో గురువు ఆదరణ ఆశీస్సులు లభించాయి. సర్వ విద్యాపారంగతు డయ్యాడు. గురువాఙ్ఞతో ఇంటికి బయల్దేరాడు. దారిలో కృష్ణదాటి ఇంటికి చేరే ప్రయత్నంలో నది ఉవ్వెత్తుగా పరవళ్లు తొక్కుతూ వరదలెత్తింది. నదిమధ్యలో చిక్కుకుపోయిన సిద్ధయ్య ప్రాణాలతో బయటపడితే సన్యాసం స్వీకరిస్తానని మొక్కుకున్నాడు. కళ్లు తెరిచి చూసే సరికి ఒడ్డున ఉన్నాడు. అలా సిద్ధేంద్రయోగిగా మారాడాయన.
వెంపటి సత్యనారాయణగారు వ్రాసిన కథనం ప్రకారం, ‘చింతా శ్రీధరుడనే కుర్రవాడు చదువు కోసం కాశీ వెళ్లి, దివిసీమకు తిరిగివస్తూ అస్సాములో కొన్నేళ్లు ఉండిపోయాడు అక్కడ కొన్ని నాట్యప్రక్రియల్ని బాగా నేర్చుకుని, యతిగా మారి స్వస్థలాని కొచ్చాడు. ఆ ప్రజల్ని ఆస్తికులుగా మార్చటం కోసం భగవంతుడి కథల్ని తీసుకుని దేశి నాట్యరీతుల్లో నృత్యరూపకాలుగా రూపొందించి ప్రదర్శింప చేసేవాడు. భక్తి ప్రచారానికి సంగీత నాట్య సాహిత్యాలు ఉత్తమ మార్గాలుగా గుర్తించాడు. ఆంధ్ర, తమిళ భూభాగాల్లో భక్తి ఉద్యమాల అవతరణకు ఈయన ప్రధాన కారకుడు అని వివరించారు.
బందాకనకలింగేశ్వర రావుగారు మరో ఆసక్తికర కథనం వ్రాశారు. సిద్ధప్ప ఎవరిబిడ్డో తెలియదు. చిన్ననాడే ఓ పసిబిడ్దనిచ్చి వివాహం చేశారు. శ్రీకాకుళంలోని నారాయణతీర్థులవారి మఠంలో ఆశ్రయం పొందాడు. కృష్ణభక్తితో ఉండేవాడు. దేవాలయ నృత్యాలను ఆసక్తితో చూసేవాడు. కృష్ణభక్తిని చూసి మఠం వారు అతన్ని ఉడిపి పంపారు. ఉడిపిలో అతను సర్వ విద్యలూ నేర్చాడు. నాట్య ప్రదర్శనకు అనువైన రూపం, కముముక్కుల తీరు, దేహసౌష్టవం కలిగినవాడు కావటంతో గురువులు అతన్ని ఆ శాస్త్రంలో మంచి శిక్షణ నిప్పించారు.
తానే భగవానుని ప్రియసతినని, అతడే లోకాలకన్నింటికీ పతి అని, క్షణకాలం కూడా ప్రాణేశ్వరుని వియోగం సహించజాలని సత్యభామ తానే ననే భావనలో సిద్ధేంద్రయోగి ఉండేవాడు.
దేశం నలుమూలలా రాధాతత్త్వం వ్యాపిస్తుంటే సిద్ధేంద్రయోగి రాధ స్థానంలో సత్యభామని తెచ్చి భక్తి ఉద్యమంలో మరో మలుపుకు కారణమయ్యాడు. భక్తితో తాను వ్రాసిన ఆ నృత్య రూపకానికి భామాకలాపం అనే పేరు పెట్టాడు. తానే గానం చేస్తూ, నృత్యం చేస్తూ ప్రజలలో కృష్ణతత్త్వాన్ని వ్యాప్తి చేయటం ధ్యేయంగా పెట్టుకున్నాడు.
ఈ నృత్యాన్ని తమకు నేర్పించమని అనేకమంది దేవదాసీలు వచ్చి అడిగినా ఆయన అంగీకరించలేదు. యోగ్యత కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన మగపిల్లల్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ కలాపం దైవారాధన విధానం అని, నీతిదూరం కాదని, ఈ విద్యనేర్చినవారు పరమ భాగవతులుగా కీర్తి పొందుతారని, మోక్షదాయకమని నచ్చజెప్పాడు. ఆజన్మాంతం నాట్యానికే అంకితమై జీవిస్తానని వాళ్లతో ప్రమాణం చేయించుకుని విద్య నేర్పించాడు. ఈ ప్రతిఙ్ఞ చేసిన గుర్తుగా ఒక్కో విద్యార్థి నడుముకు గంట కట్టించి కుచేలుడని పేరుతో వీళ్లని పిలవాలని సూచించాడు. త్రికాల సంధ్యావందనం ఆచరించాలని నిర్దేశించాడు. నాట్యానికొక నిర్దిష్ట పాఠ్యక్రమాన్ని ఏర్పరచాడు.
తంజావూరు పాలకుడు అచ్యుతప్పనాయకుడి కాలంలో వర్థిల్లిన కళలు విజయరాఘవ నాయకుడి కాలానికి పతనావస్థలో ఉన్నాయి. నర్తకీమణులు సౌశీల్యాన్ని కోల్పోవటం కళ్ళారా చూశాడు సిద్ధేంద్రయోగి. ఆ రాజ్యంలో ఉండకూడదని నిశ్చయించుకుని దివిసీమకు వచ్చేశాడు. స్త్రీలకు నాట్యకళ నేర్పకూడదని, నేర్పితే ప్రతీ రాజ్యంలోనూ విజయరాఘవ నాయకుడి వంటి భోగలాలసులే పుడతారని, రాజులిచ్చే కాసులకు ఆశపడి, వారి రాసలీలల్ని శ్రీకృష్ణలీలలతో పోల్చి వ్రాస్తారని ఆయన స్త్రీలకు నాట్యాన్ని నేర్పరాదని నిశ్చయించుకున్నట్టు శ్రీ చింతలపాటి లక్ష్మీనరసింహ శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చూస్తే, సిద్ధేంద్రయోగి తంజావూరు విడిచి వచ్చింది ఈ నలబై యేళ్ళకాలంలోనే కావచ్చు. సిద్ధేంద్రుడిలానే క్షేత్రయ్య కూడా తంజావూరుని విడిచాడని చింతలపాటివారి భావన.
విజయరాఘవ నాయకుడు 1673వరకూ జీవించాడు. ఇంచుమించు 40 యేళ్లు పాలించాడు. తంజావూరు నాయక ప్రభువుల్లో ఆఖరివాడు. తననితాను మన్నారుదేవుడి అవతారంగా భావించుకుని, తననే దేవుడిగా పూజించాలని ఆదేశించాడు కూడా! ఈతని అకృత్యాల గురించి తెలుగుధీర అనే నవలలోనూ, హరహర మహాదేవ అప్పయ్యదీక్షితుల వారి నవలలోనూ వివరంగా వ్రాశాను.
(సశేషం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.