[మారేపల్లి భువనేశ్వరి గారు రచించిన ‘గురుభక్తిని చాటిన దీపకుడు’ అనే రచనని అందిస్తున్నాము.]
గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. ‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువును మించిన దైవం లేదు. అందుకే ప్రతి పదంలో ముందుగా అందరూ పలికేది.
“గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః।
గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః॥”
ఇది అందరికి తెలిసిన శ్లోకమే. కాని మొదటగా ఈ శ్లోకాన్ని వేదధర్ముని శిష్యుడు దీపకుడు పలికారు, ఎందుకు పలికారు, ఏ సందర్భంలో పలికారు అని అనుకున్నట్లైతే..
పూర్వము అంగీరస మహర్షి ఆశ్రమంలో వేదధర్ముడనే మహర్షి ఉండేవారు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందరో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు.
అలా ఈయన వద్ద దీపకుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు.
విద్యాభ్యాసం పూర్తయ్యక శిష్యులంతా గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా దీపకుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువు గారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ శిష్యునికి అప్పగించి వెళతారు.
ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.
ఇదిలా ఉండగా, విద్యపూర్తి చేసిన శిష్యులు ఆశ్రమాన్ని వీడే రోజు రానే వచ్చింది. అందరూ గురువు గారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
దీపకుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు.
గురువు గారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు.
“గురువు గారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, మరో పదిహేను రోజుల్లో తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండిపెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను” అంటాడు.
అది విన్న గురువు గారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు.
దీపకుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచిస్తుండగా. దానికి గురువు గారు “నాయనా, ‘ప్రారబ్ధం భోగతో నస్యేత్’ అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు” అంటారు.
అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, “కాశీలో పాపం చేసినా, పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు. కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు” అంటాడు దీపకుడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు.
కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు దీపకుడు.
జోలె పట్టుకుని భిక్ష ద్వారా వచ్చినది తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు.
ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, దీపకుడినీ తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ దీపకుడుని కొట్టడం, తిట్టడం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా, గురువు గారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు, పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే, అని అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు.
దీపకుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దీపకుని గురుభక్తిని పరీక్షించ తలచారు.
అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి “నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో” అంటాడు. దానికి దీపకుడు “గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?” అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు.
తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి “రోగముతో ఉన్న గురువు గారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మరిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో” అంటాడు.
దానికి దీపకుడు “కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్నుచేరదీసి, భోజనం పెట్టి, నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు” అనేసరికి విష్ణువు వెనుతిరుగుతాడు.
చివరగా ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి “మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు” అంటాడు.
దానికి దీపకుడు సాష్టాంగపడి, “తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది” అంటాడు.
అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి “దీపకా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము” అంటారు.
దానికి ఆనందించిన దీపకుడు “మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువు గారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి” అంటాడు.
ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదించారు.
ప్రతివారికి మొదటి గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత విద్యనభ్యసింపజేసిన గురువు. ఈ గురువులో దైవత్వాన్ని చూడాలన్న భారతీయ సంప్రదాయం ఎంతో గొప్పది. పెద్దలను, గురువులను, మహాత్ములను దర్శించినపుడు మనం రెండు చేతులులను జోడించి నమస్కరిస్తాం. ఆ నమస్కారానికి అత్యున్నమైన అర్థముంది. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయమని దాని భావనం. మన సంస్కారానికి ప్రతిగా గురువు అభయముద్రను ప్రసాదిస్తాడు. అదే గురవు అనుగ్రహం. అది వుంటే జీవితం చరితార్థమైనట్లే. అంతకంటే జీవితంలో కోరదగిందేమిలేదు.
గురుసేవతో త్రిమూర్తుల దర్శనం చేసుకుని మోక్షాన్ని పొందిన ధన్యుడు దీపకుడు.
అందుకే గురువుల సేవతో సాధించలేనిది అంటూ ఏమీ లేదు.
గురుదేవోభవ!