[శ్రీ మెహక్ హైదరాబాదీ అనువదించిన ‘గుల్దస్త’ అనే అనువాద కథా సంకలనం సమీక్షని అందిస్తున్నాము.]


రెండు భాషల సాహిత్యాల నడుమ వంతెన లాంటిది అనువాదం. మూల రచన సూర్యుడి వంటిది. అనువాదం, ఆ సూర్యుడి వెలుతురు లోని వేడిని గ్రహించి, సరళతరం చేసి వెన్నెలలా అందించే జాబిల్లి వంటిది. సూర్యుడు లేని సమయంలో జగతికి వెలుగునిచ్చేది చల్లని వెన్నెలనే. ‘మూలం చదవలేని వారికి’ ఆ భాషలో సాహిత్యాన్ని చదివే వీలు కల్పించేది అనువాదం. అందుకే సాహిత్య ప్రపంచంలో ‘అనువాదం’ ఒక విశిష్టమైన, ఆవశ్యకమైన, సృజనాత్మక ప్రక్రియ. ఈ సృజనాత్మక ప్రక్రియ ఆవశ్యకతను, రెండు భాషల నడుమ, ఒక భాష ప్రాతినిధ్యం వహించే సంస్కృతి, సాంఘిక, మానసిక అంశాలను మరొక భాష వారికి చేరువ చేసి, అవగాహన కలిగించే అద్భుతమైన ప్రక్రియ అనువాదం అన్న సత్యానికి అచ్చమైన ఉదాహరణ – ఉర్దూ భాష నుంచి మెహక్ హైదరాబాదీ అనువదించి అందించిన 22 ఉర్దూ కథల సమాహారం ‘గుల్దస్త’.
విశ్రాంత పాత్రికేయుడైన మెహక్ హైదరాబాదీ తిన్నగా ఉర్దూ నుండి తెలుగులోకి ఈ కథలను అనువదించటం ముదావహం. ఈ సంకలనం లోని 22 కథలు హైదరాబాద్ ముస్లిం రచయితలు, హిందూ జీవన పరిస్థితులు, వారి సామాజిక సమస్యలు, సంప్రదాయాలు, ధార్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాల గురించి రాసిన కథలు.
ఉర్దూ భాషను ఆధునిక సమాజంలో ప్రధానంగా ఇస్లామీయుల భాషగా భావిస్తున్నారు. దేశ విభజన, పాకిస్తాన్ ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించటం వంటి పలు కారణాల వల్ల ‘ఉర్దూ’ ఇస్లామీయుల భాష అన్న అపోహ నెలకొంది. కానీ, నిజానికి ఉర్దూ భారతీయ భాష. భారతదేశంలో జన్మించిన భాష. ఆరంభ దినాలలో ఉర్దూనూ, హిందీని కలిపి వాడేవారు. దీన్ని ‘హైందవి’ అనేవారు. కాలక్రమేణా, ఉర్దూ ‘పర్షియన్’ లిపిని, హిందీ ‘దేవనాగరి’ లిపిని స్వీకరించాయి. దాంతో ‘పర్షియన్’ భాషను రాజభాషగా, ప్రధాన భాషగా ఉపయోగించే సుల్తానులు, సామాన్యులతో సంభాషించేందుకు ఉర్దూను వాడటం ఆరంభించారు. సుల్తానులు ఉర్దూ కన్నా పర్షియన్కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సాహిత్యంలో కూడా 18-19వ శతాబ్దం వరకూ ఉర్దూ కవులకు పెద్ద గౌరవం లభించలేదు. దక్షిణంలో ‘ఉర్దూ’కు ఆదరణ అధికంగా లభించింది. ఉత్తర భారత కవులు ఉర్దూను వాడటం కూడా దక్షిణ భారత కవుల ప్రభావం వల్లనే. కానీ ఉర్దూ అంటే చిన్నచూపు ఉండేది. గాలిబ్ ఉర్దూ గజళ్లు రాసినా, పర్షియన్ గజళ్ళ గురించే గర్వంగా చెప్పుకునేవాడు. ఎందుకంటే ‘ఉర్దూ’ జనం భాషగా, పర్షియన్ సంస్కారవంతుల భాషగా భావించేవారు.
నిజామ్ రాష్ట్రంలో కూడా పర్షియన్ భాషకు ఉన్న ప్రాధాన్యం ఉర్దూకు ఉండేది కాదు. ఇరవయ్యవ శతాబ్దం ఆరంభం వరకూ నిజామ్ రాజ్యంలో ఇదే పరిస్థితి. పర్షియన్, ఇంగ్లీష్ భాషల తరువాత స్థానిక భాషలు నేర్చేవారు. పెద్దవారి కుటుంబాలలో మహిళలు పర్షియన్ అనర్గళంగా మాట్లాడేవారు.
ఆరవ నిజామ్ మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో ఉర్దూకు అధికారికంగా ప్రాధాన్యం లభించింది. కానీ పర్షియన్ భాష స్థానంలో పాఠశాలలో ఉర్దూ నేర్పాలన్న ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. 1884లో ఫిబ్రవరి 21న రాజ వ్యవహారాలు ‘ఉర్దూ’లో జరగాలన్న ఆజ్ఞలు జారీ అయ్యాయి. ఇదే సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారిక ఉపన్యాసాన్ని తొలిసారిగా ఉర్దూలో చేశాడు. అలా నెమ్మదిగా ఉర్దూ, పర్షియన్ను తొలగించి, అధికార భాషగా ఎదిగింది. అందుకే ఆ కాలంలో ప్రజలు ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీష్, హిందీలతో పాటు స్థానిక భాషలనూ నేర్చేవారు. అయితే నిజామ్ వ్యతిరేకత ‘ఉర్దూ’ వ్యతిరేకతగా, పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత, ఆ దేశ ‘జాతీయ భాష’ పట్ల వ్యతిరేకతగా వ్యక్తమవటంతో రాను రాను ఉర్దూ భాష ‘ముస్లిం’ల భాష అన్న అపోహ స్థిరపడింది. హిందీ ప్రాధాన్యం పెరిగి, ఒక రకంగా హిందీ, ఉత్తర భారత హిందువుల భాషగా అర్థమయింది. పైగా, మతంతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్థాయిలో వ్యక్తుల నడుమ ఆత్మీయ సంబంధాలు ఉండటంతో, ముస్లిం ఉర్దూ రచయితలకు కూడా హిందూ జీవన విధానం, ఆలోచనా విధానాల పట్ల అవగాహన ఉండేది. అందుకే ఈ కథలు ప్రత్యేకంగా ముస్లిం రచయితలు ఉర్దూలో రాసిన కథలు అని చెప్పకపోతే, హిందూ రచయితల కథలు కావని నమ్మటం కుదరదు.
‘గుల్దస్త’ లోని కథలలో పాత్రలు హిందువుల పేర్లతో ఉన్నాయి కానీ ఇవి ప్రపంచంలోని ఎవరి కథలైనా కావచ్చు. న్యూనతా భావంతో బాధపడుతూ, త్రాగుడులో జీవితాన్ని ముంచి సర్వనాశనం అయిన సాధూరాం కథ ఎవరిదయినా కావచ్చు. వయసుడిగి భవబంధాలు నుంచి తప్పించుకోవాలనుకుంటున్న వ్యక్తి కథ ‘చిరంజీవి’. జీవితంలో అందమైన ఉదయం కోసం ఎదురుచూసే జమున కథ ‘చీకటి తెరలు’. సున్నిత హృదయుడైన చిత్రకారుడి కథ ‘హృదయ చిత్తరువు’. ‘గూట్లో బొమ్మ’ కథలో జీలానీ బానూ ప్రదర్శించిన మహిళ స్థితి, ఏ మతానికి చెందిన మహిళదైనా కావచ్చు. ఈ సంకలనం లోని అద్భుతమైన కథ, అత్యంత ప్రతీకాత్మకమైన కథ ఎవాజ్ సయీద్ రచించిన ‘ఒంటి కొమ్ము మనిషి’ కథ. ఇటీవలి కాలంలో, తమ ప్రేమకు అడ్డు అని భర్తను, పిల్లలను హత్య చేసే ఉదంతాలు తరచూ వినిపిస్తున్నాయి. అలాంటి మహిళ మనస్తత్వానికి అద్దం పడుతుంది కామినీదేవి కథ ‘ఇసుక సంద్రం’. ముఖ్యంగా కామినీదేవి ఆత్మహత్య వెనుక అసలు రహస్యం, దాన్ని ఆమె మనస్సాక్షిగా ప్రజలు తప్పుగా అర్థం చేసుకోడం కథ లోతును, విలువను పెంచుతుంది.
యాసీన్ అహ్మద్ కథ ‘కనబడుట లేదు’ నేటి సమాజంలో ఓ వైపు తీవ్రవాదం, మరో వైపు నక్సలిజం ఏ రకంగా కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తున్నాయో, తల్లిదండ్రులకు తీరని వేదనని మిగులుస్తున్నాయో అత్యద్భుతంగా చూపిస్తుందీ. ఫాతిమా తాజ్ కథ ‘జీవన చక్రం’ ఆధునిక ‘మీరా’ లాంటి రాధిక కథ. ఈ కథ చదువుతుంటే రచయిత్రికి హిందూ సమాజంలోని బలహీనతలు, భక్తి ఆ బలహీనతలను ఎలా శక్తిగా మలుస్తుందో చక్కగా తెలుసని అనిపిస్తుంది. “జ్ఞాని, భక్తుడు ఇద్దరూ కళ్ళు మూసుకుని ఉన్నా, వారి హృదయ ద్వారాలు తెరచే ఉంటాయి. జ్ఞానం, భక్తి రెండూ సత్యమే”. అతి చక్కటి వ్యాఖ్య ఇది.
మెహక్ హైదరాబాదీ అనువదించిన ఈ ఉర్దూ కథలు చదువుతుంటే, హిందూ జీవన విధానాన్ని, మనస్తత్త్వాన్ని, వ్యక్తిత్వాన్ని ముస్లిం రచయితలు ఎంత బాగా అర్థం చేసుకున్నారో అనిపిస్తుంది. ఈ కథలలో పరిశీలన, విశ్లేషణ కనిపిస్తుంది తప్ప, ఎక్కడా చులకన, నిరసన, ద్వేష భావనలు కనబడవు. మనిషి సాటి మనిషిని అర్థం చేసుకుని అతని బలహీనతల పట్ల జాలి, విజయాల పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ, ‘ఇదీ అతని జీవితం’ అంటూ ఎలాంటి ‘తీర్పులు’ చెప్పకుండా ప్రదర్శించటం కనిపిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో హిందూ, ముస్లిమ్ అన్న తేడాలు కనబడవనిపిస్తుంది. దేవుడు అందరినీ మనుషులుగానే సృష్టిస్తాడు. మనమే హిందూ, ముస్లీమ్ అన్న తేడాలు సృష్టించుకుంటామన్న సాహిర్ మాటలలో దాగిన నిజం ఈ కథలు చదివితే స్పష్టమవుతుంది.
ఈ కథలు అనువాద కథలు కావు, ఈ రచయిత తెలుగులోనే కథలు రాశారనిపించేటంత చక్కగా అనువదించారు మెహక్ హైదరాబాదీ. ముఖ్యంగా ఆయన పదం, పదం అనువదించకుండా భావాన్ని అవగాహన చేసుకుని తెలుగు భాషలో ఆ భావాన్ని వ్యక్తం చేశారు. ప్రతీ పదాన్ని తెలుగులో అనువదించాలని తపన పడకపోవడం వల్ల రచనకొక ‘ఒరిజినాలిటీ’ వచ్చింది. ఈ కథలు చదివిన తరువాత మరిన్ని కథలు చదవాలన్న ఆసక్తి కలుగుతుంది. ఇందుకు మెహక్ హైదరాబాదీ అభినందనీయులు.
మంచి కథను ఆదరించే ప్రతి ఒక్కరూ, చక్కటి కథలు చదవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదివి, దాచుకోవాల్సిన పుస్తకం ఇది.
***


అనువాదం: మెహక్ హైదరాబాదీ
ప్రచురణ: మెహక్ ప్రచురణలు
పేజీలు: 202
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
ప్రచురణకర్త:
ఫ్లాట్ నంబర్ 105, బ్లాక్ నెం. 5A
సిబిఆర్ ఎస్టేట్స్, మియాపూర్
హైదరాబాద్ 500049.
~
మెహక్ హైదరాబాదీ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-mehak-hyderabadi/