అది కూడా అవసరమే..!!
పని చేయడం అంటే కొందరికి మహా సరదా. లేని పనిని కల్పించుకుని మరీ చేస్తారు ఇలాంటివారు. పని అంటే ఇంటిపనో స్వంతపనో అని కూడా కాదు. ఆఫీసుల్లో కూడా ఇలాంటి లక్షణం వున్నవాళ్లు, వాళ్ళ పని సమర్థవంతంగా చేయడమే గాక, కల్పించుకుని, అవసరమైతే ప్రత్యేకంగా నేర్చుకుని ఇతరుల పని కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. నిజానికి మన సమాజంలో పని ఎగవేతగాళ్లకు లోటు లేదు. ఇలాంటి వాళ్ళు చేయవలసిన పనిలో ఎప్పుడూ సగం పైగా వాయిదాల మీద నడుస్తుంది. పని రాకున్నా వచ్చినట్టు నటిస్తూ, సాగినంత కాలం తాత్సారం చేసుకుంటూ పోతారు. అలాగే లంచాలు వసూలు చేయడానికి కూడా వెనుకాడరు. పని నేర్చుకునే ప్రయత్నమూ చేయరు. చాలా కార్యాలయాల్లో ఇదే తంతు.. పనిచేసేవాడిని సరిగా చెయ్యనియ్యక పోవడం వీరికి వుండే అదనపు అర్హత.
లంచాలకు అనుకూలంగా వుండే కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు వుంటారు. అక్కడ వారి పరిస్థితి అసలు వర్ణించలేము. ఆ దర్పము, దర్జా మరెవ్వరికీ ఉండదు. వాళ్ళ అవసరాన్ని బట్టి కార్యాలయం సమయాలలో పనిలేకుండా అవసరమైతే అర్ధరాత్రి వరకూ పని చేస్తారు. అక్రమ పద్దతిలో డబ్బు సంపాదించడంలోని ఆనందం ఇది. ఇక్కడ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులందరి గురించి చెప్పడం కాదు. తరతరాలుగా పాతుకుపోయివున్న లంచగొండితనంతో సంబంధం ఉన్నవాళ్ళ గురించి.
అక్రమంగా సంపాదించిన దనం ఎవరి దగ్గరా నిల్వదంటారు. ఇది నిజమే, ఎలాంటి సందేహమూ లేదు. లంచగొండి అయిన వ్యక్తిని కష్టపడకుండా చేతిలోకి వచ్చిన సొమ్ము వ్యసనాలకు బానిసలను చేస్తుంది (ఎక్కువ శాతం). కన్ను మిన్ను కానకుండా ఇలాంటి వారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. తాగుడు, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసలై సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడో ఒకచోట పట్టుబడి సర్వం కోల్పోతారు. హాయిగా ఆనందంగా సాగవలసిన జీవితాన్ని నరక ప్రాయం చేసుకుంటారు. కార్యాలయాలలో నిజాయితీగా పని చేసేవారిని ఇలాంటి లంచగొండులు ముప్పు తిప్పలు పెడతారు.
వాళ్ళను సజావుగా పని చేసుకోనివ్వరు, సుఖంగా బ్రతకనివ్వరు. నా దృష్టికి వచ్చిన ఒక ఉదంతం ఇప్పుడు ఇక్కడ మీ ముందుంచడం సబబుగా నాకు తోస్తున్నది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ వుంది. అది రెండు చేతులా లంచం సంపాదించగల సీటు. అందరూ ఆ సీటుకి ఎప్పుడు చేరుకుంటామా అని ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్కు ఖాళీ ఏర్పడింది. అయితే కొద్దికాలంలోనే పదవీ విరమణకు సిద్ధంగా వున్న ఒక పెద్దాయన అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన అవినీతికి వ్యతిరేకి. నూరు శాతం నీతిమంతుడు. ఎవరికైనా ఇవ్వడమే గాని పుచ్చుకోవడం ఇష్టంలేని సజ్జనుడు. ఇది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ తెలుసు. ఆయన గనక వస్తే తమ ఆటలు చెల్లవని ముందే గ్రహించి క్రింది స్థాయి ఉద్యోగులు ఆయన రాకుండా అనేక సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర స్థాయి పెద్దలతో కుమ్మక్కై ఆయనను రాకుండా చేయడానికి పెద్ద పన్నాగమే పన్నారు. ఆ పెద్దాయనకు ఎలాంటి రాజకీయ సహకారమూ లేదు. ముక్కు సూటిగా పోయే మనిషి.
ఈ తంతు నడుస్తున్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ స్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు వున్నారు. ఆయన హయాంలో ఎన్నో సంచలనాలు రికార్డు అయ్యాయి. నేను చెప్పబోయేది అందులో ఒకటి.


విశ్రాంత జీవితం గడుపుతున్న శ్రీ ఆలూరి హరనాథ్ రావు (శర్మ)
ఇప్పటివరకూ పెద్దాయనగా ప్రస్తావిస్తున్న వ్యక్తి పేరు శ్రీ హరనాథ్ రావు. ప్రజల, పేదల పక్షపాతి ఈయన. జీవితమంతా వంటరి పోరాటం చేస్తూ విజయుడైనవాడు. ఈయన తన బాధను, తాను ఎదుర్కొంటున్న సమస్యను చక్కగా తెలుగులో ఉత్తరం రాసి, ముఖ్యమంత్రి రామారావు గారికి పోస్ట్ చేశారు. ఆ ఉత్తరం వల్ల ఆయనకు ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందని ఆయన ఆ పని చేయలేదు. మదిలో మెదిలిన ఒక ఆలోచనకు ఆయన కార్యరూపంలో పెట్టాడంతే! అయితే ముఖ్యమంత్రి గారినుండి స్పందన అంత త్వరగా వస్తుందని ఆయన అసలు ఊహించలేదు. ఆయనను ఆశ్చర్యపరుస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి హరనాథ్ రావుగారికి పిలుపు వచ్చింది. వారి సూచన మేరకు ఒక ఆదివారం ఆయన అబిడ్స్ లోని ఎన్.టి.ఆర్. నివాస గృహానికి వెళ్లారు. ఆయనను ఆశ్చర్య పరుస్తూ అప్పటికే అక్కడ సంబంధిత మంత్రిగారు, డైరెక్టరు, ఇతర చిన్న పెద్ద అధికారులు అక్కడ వున్నారు. కేవలం హరనాథ్ రావు గారి కోసమే ఆదివారం ఆ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఒక్క మంత్రిగారు తప్ప అక్కడవున్న అధికారగణం అంతా హరనాథ్ రావు గారి బదిలీకి (ఆయన కోరుకున్న చోటికి) వ్యతిరేకంగా వివరణలు ఇవ్వడం మొదలు పెట్టారు. అంతా గమనించిన ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని, “ముఖ్యమంత్రిగా నేను చెబుతున్నాను, ఆయన కోరుకున్నచోట పోస్టింగ్ ఇచ్చి, అక్కడే పదవీ విరమణ చేసే అవకాశం ఆయనకు ఇవ్వండి” అనగానే, మరో మాట రాకుండా ఎవరి స్థాయిలో పనులు వాళ్ళు పూర్తి చేసి పోస్టింగ్ ఆర్డర్ హరనాథ్ రావుగారి చేతిలో పెట్టారు. బహుశః ఇలాంటి నిర్ణయాలు అరుదుగా వింటాం. సందర్భాన్ని ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ముఖ్యమంత్రిగా అవినీతి నిర్మూలనకు ప్రారంభ దశలో తారక రామారావు గారు తనదైన శైలిలో కృషి చేశారు.


యువకుడిగా శ్రీ హరనాథ్ రావు గారు
ఐతే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోతున్నది ఒక నీతిమంతుడైన ఉద్యోగి గురించి.
ఇలాంటి ఉద్యోగులు బహు అరుదుగా మనకు కన్పిస్తారు. 2005లో నేను పదోన్నతి మీద జనగాం ప్రభుత్వ ఆస్పత్రినుండి కరీంనగర్ ఆసుపత్రికి బదిలీ అయ్యాను అక్కడ మా జీతాలు, ఇంక్రిమెంట్లు వగైరా చూసే సీనియర్ అసిస్టెంట్ నాగభూషణం నాకు పరిచయం అయ్యాడు. అతను కూడా సాహిత్యాభిలాషి కావడం మూలాన అనుకుంటాను అతి తొందరగా దగ్గరయ్యాడు. ఆఫీసు పని చాలా శ్రద్దగా చేసేవాడు. ముఖ్యంగా సంవత్సరానికొకసారి లభించే ఇంక్రిమెంట్ విషయంలో మనం గుర్తు చేయకుండానే ఆతను ఆ పని పూర్తిచేసి సమాచారం అందించేవాడు. ఏ పని పెండింగ్ పెట్టేవాడు కాదు. నా ఒక్కడి విషయంలో మాత్రమే కాదు, సిబ్బంది ఎవరికైనా ఆతను అలాంటి సేవలే అందించేవాడు. నేను గతంలో పనిచేసిన ఆసుపత్రులలో (మహబూబాబాద్ & జనగాం) ఇలాంటి సేవలు నాకు అందలేదు. ఆ రకంగా ఆతను అందరి ప్రశంసలు మూటగట్టుకున్నాడు. నా పెన్షన్ పేపర్లు కూడా నాగభూషణమే తయారుచేసి పెట్టాడు.


సన్మానం అందుకుంటున్న శ్రీ నాగభూషణం (ప్రస్తుతం సిరిసిల్లా ఆసుపత్రిలో అకౌంట్స్ – ఆఫీసరుగా పనిచేస్తున్నారు)
అలాంటి నాగభూషణం, ఒకరోజున వచ్చి నా దగ్గర కూర్చుని పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకున్న తర్వాత “సార్, బాగా అలసిపోతున్నాను. ఆఫీసు పని, బయటి పని, ఇంటి పని – అసలు విశ్రాంతి దొరకడంలేదు సార్” అన్నాడు.
అప్పుడు నేను “నువ్వు కష్టపడుతున్నావ్, సంతోషం. డబ్బుబాగా సంపాదించుకుంటున్నావు, స్వాగతించ వలసిన విషయమే … అంతా బాగానే వుంది గానీ.. పిల్లలకు, నీ శ్రీమతికి రోజులో ఎంత సమయం కేటాయిస్తున్నావు?” అని అడిగాను. దానికి అతను నుదిటిమీద చేయి పెట్టుకుని “అయ్యో.. ఎక్కడిది సర్, అసలు వీలు కావడం లేదు” అన్నాడు.
అప్పుడు నేను మళ్ళీ కలుగజేసుకుని “ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా నువ్వు సుఖపడలేనప్పుడు, నీ పిల్లల్ని సుఖపెట్టలేనప్పుడు ప్రయోజనం ఏమిటీ?” అన్నాను.
“నిజమే సార్, ఇలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు” అన్నాడు.
అప్పుడు నేను మళ్ళీ “చూడు నాగభూషణం, నువ్వు కష్టపడుతున్నావ్, సరే మరి నీతో గడపాలని నీ భార్య, పిల్లలూ ఆశించరా?” అన్నాను.
“నిజమే సర్ వాళ్లకు నేను అన్యాయం చేస్తున్నాను” అన్నాడు.
“అనుకుంటే సరిపోదు, ఇకనుండైనా వారానికి ఒక్కరోజైనా కుటుంబం కోసం కేటాయించు. ఆ రోజు కరీంనగర్లో వుండకు, వేరే ప్రాంతానికి పిల్లలిని తీసుకుపోయి అక్కడ ఆనందంగా గడుపు” అన్నాను. అప్పుడు ఆతను రెండు చేతులు జోడించి “మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్. ఇక నుండి మీ సలహా పాటిస్తాను సర్” అని వెళ్ళిపోయాడు
తర్వాత నెల రోజులకు నాగభూషణం నవ్వుతూ ప్రవేశించి “మీ సలహా ఇప్పుడు తు.చ. తప్పకుండా పాటిస్తున్నాను సర్. ప్రతి ఆదివారం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అందరం ఆనందంగా వున్నాం” అన్నాడు.
“చాలా సంతోషం నాగభూషణం, మనిషికి కష్టంతో పాటు సుఖం కూడా కావాలి. లేకుంటే లేనిపోని సమస్యలు, చికాకులు మొదలవుతాయి. అలాగే స్త్రీ ఒక్కసారి నిరుత్సాహానికి లోనై మనసు మార్చుకుంటే, ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. అలా ఎన్నో సంసారాలు విచ్ఛిన్నం అయిపోవడం నేను చూసాను” అని ఒక పెద్ద ఉపన్యాసం దంచేసాను. ఒక మంచి వ్యక్తిని సన్మార్గం వైపు నడిపించానన్న తృప్తి నాకు మిగిలింది.
ఎప్పుడైనా అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడు, నీతిపరులైన హరనాథ్ రావు గారి గురించి తప్పకుండా ఉదాహరించడం నాకు అలవాటైపోయింది. ఎక్కువశాతం అవినీతి పరులమధ్య బ్రతుకుతున్న మనం, నీతిపరులైన కొద్దీ మందిని తరచుగా స్మరించుకోవడం అవసరమే అనిపిస్తుంది నాకు. అలాగే నీతిగా కష్టపడేవాళ్ళని సుఖపడాలని కూడా చెప్పాలనిపిస్తుంది. అది కూడా అవసరమే కదా మరి…!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
22 Comments
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా.
sagar
చాలామంచి విషయం వివరించారు సర్. నిజంగ ముఖ్యమంత్రిలాంటి వ్యక్తి ఒక ఉద్యోగి వ్రాసిన ఉత్తరానికి స్పందించడం ఆహ్వానించతగిన పరిణామం. దురదృష్టవశాత్తు ఇప్పుడు పరిస్దితులు మారాయి. అదీ వేరే విషయం.హరనాద్ రావులాంటి వారికి అడ్డుపుల్లలు వేసేందుకు ఎవరైనా సిద్దంగా ఉంటారు అనడంలో సందేహమేలేదు. ఇక నాగభూషణంగారి జీవితాన్ని మరోలా మలుపు తిప్పిన మీ సలహా అధ్భుతం. మీకు ధన్యవాదములు సర్
పుట్టి. నాగలక్ష్మి
ఇద్దరు మంచి వ్యక్తుల గురించి తెలియజేశారు.. సంతోషంగా అనిపించింది.. ధన్యవాదాలు డాక్టర్ గారూ!
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
శ్యామ్ కుమార్ చాగల్
డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారి ఈ వ్యాసం లో ఉద్యోగుల లో అవినీతి గురించిన ప్రస్తావన ముఖ్యమైన విషయం అని చెప్పాలి. నీతి నిజాయితీ పరు లకు కూడా సరైన సమయం లో గుర్తింపు,బహుమతి దొరుకుతుందని అంతర్లీనంగా చెప్పటం రచయిత ముఖ్య ఉద్దేశం గా కనపడుతోంది. ప్రతీ కార్యాలయం లో పని దొంగలుండటం వారి పని కూడా వేరే వాళ్ళు చేయటం సర్వసాధారణం గా చూస్తూనే ఉంటాం. నిజానికి ఎనభై శాతం పని ఇరవై శాతం ఉద్యోగులు చేస్తూ వుంటారు.
అవినీతి గురించి ఇక చెప్పనవసరం లేదు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అయితే అవినీతే అసలు పనిగా వుంది. ఇక అవినీతిని రూపు మాపాల్సిన చోటే ఇంకా ఎక్కువ అవినీతికి ఆస్కారం ఎక్కువ. లా అండ్ ఆర్డర్ వాళ్ళ గురించి ఎంత తక్కువ గా మాట్లాడితే అంత మానసిక శాంతి.
అవినీతికి పాల్పడిన కోకొల్లలు చరిత్ర లో రూపు మాసి పోతారు కానీ, నీతిపరులు మాత్రం ఎప్పటికీ మనస్సులో మెదులుతూనే వుంటారు. దానికి తార్కాణం రచయిత తన జీవితం లో ఎదురయ్యింది వ్యక్తుల గురించి ప్రస్తావించటమే.
వారంతా ధన్యజీవులు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
మిత్రమా
చాలా బాగా రాసావు
హృదయపూర్వక ధన్యవాదాలు.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి..!!అది కూడా అవసరమే!!
ఈ సంచికలో లంచగొండి తనం వ్యక్తి స్వలాభం కోసం వ్యవస్థను ఉదేశ్యపూర్వకంగా విచ్చిన్నం చేసే ప్రక్రియను బాగా వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారు ఆలూరి హరనాథ్ రావు గారి ఉత్తరానికి స్పందించి అడిగిన ప్లేస్ కు ట్రాన్స్ఫర్ ఇవ్వడం వారి నిజాయితీకి నిదర్శనం. నాగభూషణం గారు మీ సలహా అభిమానించి స్వీకరించడం ముదావహం. మాకు తెలియని వారిని పరిచయం చేస్తూ చాలా మంచి తెలియని విషయాలు వివరించారు సర్.మీకు ధన్యవాదములు డాక్టర్ గారు,
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
డి. వి. శేషాచార్య
హరనాథరావు గారి సుదీర్ఘ న్యాయపోరాటం గురించి అప్పట్లో న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది. అలాగే వారి పరిచయభాగ్యం కూడా మీ వల్ల కలిగింది. అవినీతి రహిత పాలన అనే మాట నాయకుల నోళ్ళలో తిరిగే ఒక అద్భుత పదబంధం.అంతేతప్ప ఆచరణశూన్యం. ఆఫీసు, అవినీతి అనేవి చక్కగా పెనవేసుకొన్న వ్యవస్థలో హరనాథరావుగారి వంటి అధికారులు కళ్లు కాయలు కాసేలా వెతికినా దొరకరు. వారిని గురించి ఈ రోజు మీరు పరిచయం చేయడం ఆనందంగా వుంది.
మీ సలహాను ఆచరణలో పెట్టడం నాగభూషణం గారి అదృష్టం.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలు
మిత్రమా.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Great story sir. Rare personality society needs this type of people
–Dr.D.Sujatha
Vijayawada.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you
Sunianu6688@gmail.com
అవును sir! నిజాయితీగా పని చేస్తే ఆ ఆనందమే వేరు.నేను ఒక ఆర్థికసంభాధమైన సంస్థ లో పని చేస్తున్నా. మహిళనయనా నాకు కూడా చాలా ఒత్తిడులు వచ్చేవి. ఐనా భయపడేదాన్ని కాదు.కొన్నిరోజులు భాధవేసేది. తరవాత నిజాయితీగా ఉన్నందుకు ,మా నాన్నగారు నన్ను పెంచినవిధానానికి గర్వంగా ఉంటుంది. నా విషయం అప్రస్తుతం అయినా చెప్పాలి అనిపించింది. రచయిత గారికి క్షమాపణలు మరియు ధన్యవాదాలు

ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
117 వసంచిక లోకంలోని సహజపరిస్థితులను చెప్పింది.అందుకే అంటుంటారు ఈప్రపంచం ఇటువంటి వాళ్ళుండబట్టే నడుస్తున్నదింకా అని..
—అభినందనలు సర్
రామశాస్త్రి
హన్మకొండ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
శాస్త్రి గారు ధన్యవాదాలండీ
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
పనిదొంగలు, లంచగొండులతో పాటు వృత్తిపట్ల అంకితభావం, నిజాయితీ,పనిచెయ్యటంలో శ్రద్ద లాంటి మంచి గుణాలు ఉన్నవారూ ఉండబట్టే… సామాన్యజనం ఈ కాస్తంతైనా ప్రశాంతంగాబ్రతకగలుగుతున్నా రు…నిజమే తమసుఖము





ఆనందం కోసం కాకపోయినా… తన కుటుంబం కోసమైనా కొంత సమయాన్ని కేటాయించ వలసిందే… బాగుంది
కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
కృతజ్ఞతలు సర్.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
నీతీ నిజాయితీ ఎప్పుడూ నిలిచి ఉంటుంది సర్.వారి జీవితాల్లో అడ్డంకులు ఎదురైనా వారి వ్యక్తిత్వం వాటన్నిటినీ తొలగించుకుంటూ పోతుంది.నీతిపరులు కనుకే శ్రీ హరి గారికి ముఖ్యమంత్రి అంతటి వారి సహకారం లభించింది.నిజాయితీగా కష్టపడే నాగభూషణం గారికి మీ సాహచర్యమ్ లభించింది.అటువంటి వారికి జ్ఞప్తికి తెచ్చుకోవడం సమాజానికో మంచి పాఠాన్ని అందించడమే.సమాజానికి అవసరమైన ఇద్దరు ముఖ్య వ్యక్తుల గూర్చి తెలియచేసినందుకు ధన్యవాదాలు సర్


—నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అమ్మా
ధన్యవాదాలు మీకు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
జ్ఞాపకాల పందిరి 117 లో సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచావతారాల గురించి వారి దర్పం, దర్జా గురించి తెలిపారు. తారక రామారావు గారి హయాంలో ఎన్నో మంచి సంఘటనలు జరిగాయి. నీతిగా కష్టపడే వాళ్ళు సుఖపడాలని కోరుకున్నారు. కథనం బాగుంది.
నేను సింగరేణి సంస్థలో ఆడిట్ అధికారిగా చేస్తున్నప్పుడు, ఒక గని క్యాంటీన్ లో జరుగుతున్న అవకతవకలను పట్టుకున్నాను. జరిగిన అవినీతి విలువ దాదాపు 6 లక్షలు. సంబంధిత క్లర్క్ ను ఎంక్వైరీ తరువాత ఉద్యోగం నుంచి తొలగించారు.
——-జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
చారిగారు
ధన్యవాదాలండీ.