చాలా కాలం క్రితం అమెరికన్ సినిమా ప్రముఖులొకరు ఉద్యోగవిరమణ మీద SPAN పత్రికలో ఒక హాస్యరచన చేశారు. ఆ రోజుల్లో 65 సంవత్సరాలు వస్తే అమెరికా దేశంలో రిటైర్ అవుతారు. ఆ తేదీ దగ్గర పడుతుంది. మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు సలహాలు – ఉచితసలహాలు కుమ్మరిస్తారు. ముందుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి, నిష్క్రియాశీలత వల్ల ఎందుకూ కొరగాకుండా పోతావని అతన్ని ఊదరగొట్టి చంపుతారు.
అతను ‘ఆన్ రిటైర్మెంట్’ మీద పుస్తకాలన్నీ చదివి, ఒక ప్రణాళిక తయారు చేసుకొంటాడు. తనకు ఆర్థిక భద్రత ఉంది. ఇన్సూరెన్సులున్నాయి. కనుక జీవితంలో తాను ఏయే పనులు చెయ్యాలని చేయలేక పోయాడో ఆ పనులన్నీ చెయ్యాలని, తీరని కోర్కెలను తీర్చుకోవాలని, క్షణం వృథా చెయ్యరాదని తీర్మానించుకుని రిటైర్ అయిన రోజు రాత్రి మరుసటి రోజు ఉదయం నుంచి మినిట్ టు మినిట్ టైంటేబుల్ తయారు చేసుకొంటాడు. ఉదయం వేకువన 5 గంటలకు అలారం పెట్టుకొని పడుకొంటాడు.
అతనికి తెల్లవారి మెలకువ వచ్చేసరికి 8 దాటుతుంది. “అలారం మోగలేదా?” ఇల్లాలిని అడుగుతాడు. “అలారం ఎందుకు? రిటైర్ అయ్యారు కదా, నేనే ఆపాను” అంటుంది.
అయ్యో! ప్రథమకబళంలోనే మక్షికాపాతమే అని చికాకుగా ఆ రోజు పత్రికల కోసం చూస్తాడు. పత్రికలు కనిపించవు.
“ఈ రోజు నుంచీ ఆఫీసువారు పత్రికలు వెయ్యరన్న సంగతి మరచిపోయారా?” ఇల్లాలు గుర్తుచేస్తుంది.
ఆమె అందించిన కాఫీ తాగి పత్రికలు తెచ్చుకోవడం కోసం బయల్దేరుతాడు. ఆమె కూడా అతనివెంట బయల్దేరుతుంది. దారిలో పార్కు గేటువద్ద పది పన్నెండు ఏళ్ల పిల్లలు తారసపడి “అంకుల్ ఒక మనిషి తక్కువ అయ్యారు. అంపైర్ రాలేదు. మ్యాచ్ ఆగిపోతుంది. అంపైర్గా ఉండండి” అని అభ్యర్ధిస్తారు. ఒప్పుకోమని భార్య కళ్ళతో సూచిస్తుంది.
మ్యాచ్ ముగిసేసరికి 11 దాటుతుంది. ఇంటిదారి పడుతూ “సగంరోజు పోయింది ఇట్లాగైతే నేనైమైపోతానో, నా రిటైర్మెంట్ జీవితం ఏమయిపోతుందో” అని వ్యాఖ్యానిస్తూ వ్యాసం ముగిస్తాడు. హస్యప్రధానంగా ఉన్నా ఇందులో చాలా ధ్వని, స్ఫూర్తి ఉంది.
ఈ వ్యాసాన్ని కథ రూపంలో రాశాను. పత్రికలో వేశారు కానీ “జీవితం నది వంటిది. అది తన ఇష్టం వచ్చిన మలుపులు తిరుగుతుంది” అని ముగింపులో సంపాదకులు చేర్చారు.
నా వరకూ కాలేజీలో చివరి వీడ్కోలు ఫంక్షన్లో నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడి సెలవు తీసుకోవాలని అభిలాష పడ్డాను. రిటైర్మెంటుకు నెలరోజుల ముందు మా తెలుగుశాఖ వారు ఏర్పాట్లు చేసిన వీడ్కోలు సభకు నాగభైరవ, వెన్నెలగంటి వచ్చారు. ఆ సభలో ఏదో బిక్కముఖం వేసుకుని కూర్చున్నా. అట్లా ఉండకూడదని నాకు తెలుసు. ఆ రోజే తీర్మానం చేసుకున్నా. అనుకున్నట్లే మా కళాశాల స్టాఫ్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో హుందాగా, నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ పాల్గొన్నా.
పదవీవిరమణ రోజు సహ అధ్యాపకులచే సన్మానం
మా దంపతులం రిటైరైన మొదటి ఏడాది ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగామో! ఈ రోజు వరకు రచనావ్యాసంగం, యాత్రలు, సినిమాలు, ఆప్త మిత్రులు, కుటుంబ బాధ్యతలతో జీవితం సాగుతోంది.
(మళ్ళీ కలుద్దాం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.