నా శోక తప్త హృదయంలో
ఎన్నెన్నో విషాదాలు..
మరెన్నో వ్యథలు..
నిరంతరం కలవర పెడుతున్నాయి!
నా గుండెకు నువ్వు చేసిన
గాయాల ఆనవాళ్ళన్నీ..
దశాబ్దాల నీ వియోగ విరహానికి
ప్రతిబింబలై వెక్కిరిస్తున్నాయి!
నా అంతరంగంలో
కొడిగడుతున్న జ్ఞాపకాల దివ్వెలు
నీతో పంచుకున్న అనుభూతులకు
మధుర స్మృతులుగా
ఇంకా..
మినుకు మినుకుమంటున్నాయి!
నీ సమ్మోహిత ప్రేమ చూపులతో
జీవితమంతా తోడై నిలుస్తానని..
నీ అధరాలు పలికిన
ప్రేమ ప్రమాణం..
ఇంకా నా చెవుల్లో
ప్రతిధ్వనిస్తూనే వుంది!
భావోద్వేగ హృదయంతో
కడదాకా కలిసి వుంటానటూ..
చూపులతోనే వాగ్దానం చేశావు!
అయినా.. చెలీ..!
జీవితాలు వేరై పోయాయి గానీ..
మన హృదయాలు మాత్రం
ఏకమై వున్నాయి కదా!
ఈ భావన తోనే..
ఒక్కోసారి..
నియమాలను, సంప్రదాయలను
పక్కన పెట్టేసి
బ్రతుకుబాటలో
నీతో కలిసి నడవాలన్న పిచ్చి కోరిక
మదిలో చేరి అలజడి చేస్తూ వుంటుంది!
మరుక్షణమే వివేకం హెచ్చరిస్తోంది ఇలా..!
జీవితం చరమాంకంలో
నీ సౌందర్యంతో నా కలయిక
ఓ తోపి గుర్తుగా మిగిలిపోతుందే గానీ..
ఒకప్పటిలా రసార్ద్రంగా వుండదు కదా!?
అందుకే..
నువ్వు పంచి ఇచ్చిన
ఆనాటి మధురానుభూతుల
ఊయలలో ఊగుర్తూ
ఆనందాన్ని అనుభూతిస్తాను!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.