[శ్రీ ఆవుల వెంకటరమణ రచించిన ‘గ్లోబల్ వల’ అనే కవితని అందిస్తున్నాము.]
భూత భవిష్యత్తు వర్తమానాలుగా
కాలాన్ని క్షణాల కింద తెగ
నరుక్కుంటూ ముందుకెళ్తున్నాం.
రామాయణాది ఇతిహాసాల నుంచి
మధ్యయుగాల మీదుగా
వర్తమానంలో కడుగుపెట్టాం.
ఆకాశవాణి దూరదర్శన్ల దగ్గర మొదలెట్టి
ఆండ్రాయిడ్, ఏఐ దాకా వచ్చాం.
ఇది నిరంతర పరిణామశీల ప్రక్రియ..
వాడెవడో ఖండాల కవతలివాడు
గోమూత్రానికి పేటెంట్ పొందుతాడు.
వేప, తంగేడు ఆకులను తీసుకెళ్లి
ధన్వంతరి, చరకుల్ని పక్కనపెట్టి
వాడి ఫార్ములాను మన కమ్ముతాడు
భారతీయ సాంస్కృతిక సంప్రదాయాన్ని
చాప చుట్టి కార్పొరేట్ కల్చర్ని రుద్దుతాడు
వాడిసిరిన మాయాజాలానికి చిక్కుకొని
గిలగిలా కొట్టుకుంటున్నాం.
వెనక్కి చూసుకోలేము
ముందుకు సాగలేము.
ఇప్పుడు మన పరిస్థితి
అడకత్తెరలో పోక చెక్క..!
కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు.
సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు.
కం॥
గురువెవ్వరు నా కవితకు
గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్
గురువులు లేకనె నేనిట
ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.
