Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఘోష

[శ్రీ ఆసూరి హనుమత్ సూరి రచించిన ‘ఘోష’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“మీ మీద ఎవరైనా కసెట్టుకున్నారేటండి? రోజూ మీ కారు మీద మరకలు పడుంటున్నాయ్. ఎంత తుడిచినా పోట్లేదు. ఎక్కడ పెడుతున్నారేంటి కారు?” వాచ్‍మన్ శీను అడిగాడు నేను లిఫ్ట్ లోంచి బయటకు రాగానే.

“మామూలుగానే ఆఫీస్‌లో పార్కింగ్ ఏరియా లోనే పెడ్తా. పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు. అలా ఎలా పడతాయ్ మరకలు?” నేనూ ఓ ప్రశ్న తోనే బదులిచ్చా వాచ్‍మన్ శీనుకి.

నా కారు రోజూ తుడుస్తుంటాడు వాచ్‍మన్ శీను. నెలకు అయిదొందలు ఇస్తుంటా. పరధ్యానంగానే కారు ఎక్కి ఆఫీస్‌కి వెళ్ళిపోయా. వెళ్తూ వెళ్తూ ఆలోచించా.. ఎప్పుడూ లేనిది కొత్తగా ఇలా అడిగాడేంటి శీను? బహుశా ఈ నెల అయిదొందలు ఇంకా ఇవ్వలేదని గుర్తు చేస్తుంటాడు కాబోలు! అని ఏదో ఆలోచిస్తుండగానే ఆఫీస్ వచ్చేసింది. ఎందుకైనా మంచిదని చెట్లకి, ఏసి యూనిట్‌కి దూరంగా పార్క్ చేశా కారును.. పిట్టల రెట్టలు, ఏసి యూనిట్లోనుంచి నీళ్లు పడే అవకాశం లేకుండా.

హడావిడిగా లిఫ్ట్ దగ్గరకి చేరుకొని ఐదో ఫ్లోర్‌కి వెళ్లి పోయా.

***

ఆ రోజు ఆఫీస్‌లో బాగా లేటయింది. బాగా చీకటి కూడా ఉండటంతో కారు మీద మళ్ళీ మరకలు ఏమయినా పడ్డాయా అని చూసే అవకాశం లేకుండా పోయింది. పైగా లేటు కూడా అవడంతో ఓపిక కూడా లేదు. కారు స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరా. బాగా రాత్రి అవడంతో ట్రాఫిక్ కొంచెం తక్కువగానే ఉంది. త్వరగానే ఇల్లు చేరాను. గేట్ దగ్గర వాచ్‍మన్ శీను తచ్చాడుతూ కనిపించాడు. ఇక లాభం లేదనుకుని అడిగేశా శీనుని.

“ఏంటి ఇంకా డబ్బులు ఇవ్వలేదేమని ఉన్నట్టున్నావు. ఇస్తాలే శీను పొద్దున్నే వచ్చి తీసుకో.” అన్నా.

“అది కాదండి బాబుగోరూ. కొంచెం ఊరెళ్ళే పని పడ్డది.. ఇంకో ఎయ్యి ఉంటే సర్దండయ్యా. మీకు పుణ్యముంటది.. ఊర్నుంచి రాగానే ఇచ్చేస్తా!” వినయంగా అడిగాడు శీను.

“ఏంటి ఉన్నట్టుండి ఊరుకి వెళ్ళాలంటున్నావు? మొన్నే కదా సంక్రాంతికి వెళ్ళొచ్చావు. కోడి పందాలకి తగలెట్టింది చాలదా?” కొంచెం చిరాకు గానే అడిగాను.

“అది కాదయ్యా. తమ్ముడికి ఏదైనా ఉద్యోగం చూపించి రావాలి. ఇంట్లో అమ్మకి పనికి వెళ్లే ఓపిక ఉండట్లేదు. సిటీలో నా ఖర్చు లు నాకే సాలట్లేదు.” చెప్పాడు శీను.

“ఇప్పడి దాకా పని చెయ్యకుండా ఖాళీగా ఉన్నాడా మీ వాడు?” అడిగాను ఉండబట్టలేక.

“అదేం కాదండి. మా కులపు వృత్తి చేసుకుంటూ ఉండేవాడు. ఈ మధ్య జరగట్లేదు. వేరే పని ఏదైనా చూడు అన్నా, అని అడుగుతుంటే ఓసారి వెళ్లి చూస్తే గానీ అర్థమయ్యేలా లేదు. పైగా అమ్మని చూసి రావాలనుందయ్యా. అందుకే కొంచెం ఎలాగైనా..” అని నసుగుతుంటే, “ఓ సారి పైకి రా.. మాట్లాడుతా!” అని మా ఇంటికి వెళ్లి పోయా.

కాస్త ఫ్రెషప్ అయి టీ తాగి కూర్చున్నానో లేదో కాలింగ్ బెల్ మోగింది. పిల్లలేవైనా ఆర్డర్ పెట్టుకున్నారేమో అని..

“చిన్నా, వెళ్లి తలుపు తియ్యి స్విగ్గియో, జొమాటోనో వచుంటుంది” అని మా చిన్నమ్మాయినీ పిలిచానో లేదో..

“నేనేం ఆర్డర్ పెట్టలేదు. నీ కోసమే ఎవరో వచ్చుంటారు!” అని లోపల్నుండీ అరుస్తోంది మా చిన్నది.

చేసేదేం లేక వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా వాచ్‍మన్ శీను.

లోపలికి వచ్చి కూర్చోమన్నాను. భయం భయం గానే వచ్చి నేలమీదనే కూర్చున్నాడు.

“ఇప్పుడు చెప్పు శీనూ! మీ తమ్ముడూ, ఉద్యోగం అని ఏదో చెప్తున్నావ్.?” అని అడిగాను.

“అదేనయ్యా. పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని పోలకంపాడు నుండీ సిటీకి వచ్చానయ్యా.. ఊళ్ళో మా అయ్య ఉన్నంత వరకూ బానే ఉండేదయ్యా. అయ్య పోయాక అమ్మ పనికెళ్లి ఇల్లు జరిపేది. తమ్ముడు పది తప్పాక.. కులపు వృత్తి చేపలు పట్టి తెస్తే ఇల్లు గడిచి పోతుండేది. మా పోలకంపాడు దగ్గర కృష్ణా కాలువలో చేపలు బాగానే పడేవి. మాకు నీచు తెచ్చుకునే పని కూడా లేదు. ఇట్టా హాయిగా కాలం గడిచేది. ఈ మధ్య కృష్ణాకి నీళ్లు బాగా తగ్గిపోయాయి. చేపలు మంచివి పడ్డం లేదు వలకి. కుంకుడు చేపలయితే బొత్తిగా తగ్గిపోయాయి. మారికట్టులో ఆటికయితే మంచి గిరాకీ ఉంటాది. పొంగలి, కల కల ఏమంత రుచిగా ఉండవయ్యా.. అందుకే మా వాడికి పూట గడవట్లేదు..” అని చెపుతుంటే మా ఆవిడ అక్కడే చేపల కంపు వస్తున్నట్టు ముక్కు మూసుకుని వింటోంది.

“అందుకే వేరే ఏదైనా ఉద్యోగం చూడమని ఒకటే పోరు. ఆడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు. అమ్మేమో సిటీ తీసికెళ్ళి ఏదైనా పనిలో పెట్టొచ్చు గదా అని.. నిన్నెవరు చూస్తారు ముసల్దానా అని నా పోరు. ఇట్టా గడుస్తాంది సారూ..”అని గోడంతా వెళ్ళబోసుకున్నాడు శీనూ.

ఇదంతా నాకెందుకు లెమ్మని.. మా శ్రీమతి ని పర్సు తెమ్మని ఓ పదిహేనొందలు ఇచ్చి

“త్వరగా వచ్చేయి.. అపార్టుమెంటు దుమ్ము పట్టి పోతుంది.. నీ భార్యకి చెప్పి వెళ్ళు.. కొంచెం ఇళ్లలో పని మాని కనిపెట్టుకుని ఉండమని చెప్పు.” అని అతన్ని పంపించేశాను.

***

ఆ పూటకి చపాతి తిని మొబైల్ తీసుకుని బెడ్డెక్కాను. శీనూ చెప్పిన మాటలే చెవుల్లో మోగుతున్నాయి. అతను బెస్తవాడని అప్పటి దాకా తెలీదు. నాకు తెలుసుకోవాలని కూడా అనిపించలేదెప్పుడూ. సందర్భం వచ్చిందని తెలుసుకోవడం తప్పితే నాకు అతని మీద, తన పని తీరు మీద సదభిప్రాయమే ఉంది మొదట్నుంచి.

‘పోలకంపాడు’. ఈ పేరు ఎక్కడో బాగా విన్నట్టుగా ఉంది. గూగులమ్మ ఉందిగా, వెంటనే అడిగేశాను.

వెంటనే పుంఖాను పుంఖాలుగా సమాచారం వచ్చి పడింది. అదంతా చదువుతూ, మధ్యలో వచ్చే లింకులు క్లిక్ చేస్తూ ఉంటే విషయం బోధపడే లోపు నిద్ర వచ్చేసింది. శ్రీమతి వచ్చి మొబైల్ తీసి దుప్పటి కప్పేసింది.. అని పొద్దున్న కాఫీ ఇస్తూ తాను చెప్పేదాకా నాకే తెలీదు.

***

కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్న నాకు.. ‘పోలకం పాడు’ పేరు కనబడగానే ఆసక్తిగా చదవడం మొదలెట్టాను. ఇది కృష్ణా నది కాలువ గట్టున ఉన్న ఒక ఊరు. అక్కడ ప్రధాన వృత్తి చేపలు పట్టడం. కృష్ణాలో నీరు ఉన్నంత కాలం ఇక్కడ మంచి చేపల రకాలు దొరుకుతాయి. ఈ మధ్య నీరు బాగా తగ్గి పోయింది కృష్ణాలో. వానాకాలంలో ఏదో వరద నీరు వచ్చినా.. అప్పుడు చేపలు కొట్టుకుపోతాయి. తీరా చూస్తే నిలబడే నీరు తక్కువే. అప్పుడు మంచి చేపలు ఉండడం లేదు. తాగడానికి నీరు ఉంటే చాలు అన్న చందంగా తయారయింది.

అందుకే కృష్ణాలో నీరు నిలకడగా పారితే తాగు, సాగు నీటి లభ్యత బాగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రాంతపు కష్టాలు తీరుతాయి. ఇక్కడే కాదు కృష్ణా పరీవాహక ప్రాంతం లోని చాలా ఊళ్లలో ఇదే పరిస్థితి. అందుకే గోదావరి నుండీ వృథాగా సముద్రం లోకి వెళ్లిపోయే నీటిని నిల్వ చేసుకుని అవసరాన్ని బట్టి కృష్ణా నది లోకి ఆ నీటిని కలిపితే నీటి లభ్యత పెరిగి సంవత్సరం పొడుగునా వీళ్ళ నీటి అవసరాలు తీరుతాయి. తద్వారా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన తోనే గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు కట్టాలని ప్రతిపాదించారట. అలా కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో ఈ ప్రాంత ప్రజల జీవనం మెరుగు పరచాలని గొప్ప ప్రణాళిక వేశారు మేధావులు.

ఈ విషయం ముందే తెలిస్తే బావుండేది, పాపం శీనూకి వాళ్ళ కష్టాలు తీరే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి పంపేవాణ్ణి. అయినా వాడికి చెప్పినా ఏం అర్థం అవుతుందిలే అనుకుంటూ, “స్నానం చేసి వస్తా టిఫిన్ రెడీ చెయ్యి” అని శ్రీమతికి పురమాయించి లేచాను.

***

రెండ్రోజుల తర్వాత ఆఫీస్‌లో పని ముగించుకుని ఇంటికి బయల్దేరాను. లిఫ్ట్ దగ్గరకు వచ్చి శీనూ వచ్చాడేమో అని ఆరా తీశాను. ఇంకా రాలేదని తెలిసి ఉసూరుమంటూ ఇల్లు చేరాను. కారణం ఇంట్లో ఇస్త్రీ చెయ్యాల్సిన బట్టలు పేరుకు పోయాయి. అతను బట్టలు ఇస్త్రీ కూడా చేస్తాడు.

ఎప్పట్లాగే కాస్త ప్రెషప్ అయ్యి టీ తాగుతూ టీవీ పెట్టాను. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి విజయవాడ వచ్చారని, పోలవరం కుడి కాలువను కృష్ణ నదిలో కలిపే పనులను ప్రారంభించబోతున్నారని న్యూస్ ఛానెళ్లలో ఊదరగొడుతున్నారు. బహుశా అందుకే మన శీనూ ఊళ్ళోనే ఆగిపోయుంటాడు. మంత్రి గారి ప్రోగ్రామ్‌లో జనాలను తరలించి వాడుకోవడం ఇదేం కొత్త కాదు కదా అనుకుంటూ టీవీ చూస్తున్నాను.

పోలవరం నుండీ తీసిన కాలువకు గేట్లు బిగించారట. అవి చెక్ చేసే పనిలో ఉన్నారు ఇంజినీర్లు. అందుకే కృష్ణ కాలువ వెంబడి ఎవరూ ఉండొద్దు.. చేపలు పట్టడం గానీ బట్టలు ఉతకడం గానీ, ఈతకు గానీ ఎవరూ రావొద్దు అని హెచ్చరికలు చేస్తున్నారు. నీటి ఉధృతి బాగా ఉండే అవకాశం ఉందనీ, అది అదుపులోకి వచ్చేదాకా జాగ్రత్తగా ఉండమని అధికారులు కాలువ వెంబడి గ్రామాల్లో చాటింపు వేస్తున్నారు. ఏ ఛానల్ పెట్టినా ఇదే వార్తలు.

మొత్తానికి ఆ రోజు రాత్రికి గేట్లు చెక్ చెయ్యడం అయ్యింది. మంత్రి గారి ప్రోగ్రామ్‌కు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారట అధికారులు.

ఓసారి శీనూకు ఫోన్ చేద్దామనిపించింది.. అక్కడ పరిస్థితి ఎలా ఉందొ కనుక్కోవడానికి.

అనుకున్నదే తడవుగా మొబైల్ తీసుకుని ఫోన్ చేసాను శీనూకి. ఫోన్ తియ్యలేదు. సర్లే ఏదో పనిలో ఉంటాడనుకుని వదిలేశాను. ఓ పావుగంటాగి తానే ఫోన్ చేసాడు.

“అయ్యా, మా కృష్ణా కాలువకు గోదారి నీళ్లొదులుతారంట.. మా కట్టాలు తీరే రోజొస్తుందని పిస్తా ఉండాది. రేపు మంత్రి గారు కాలువకు నీళ్లు ఒదిలే పోగ్రామ్ అయ్యాక.. చేపలు పడతారంట. మంచి కొరమీన్లు పట్టి తొట్టిలో రెడీ చేయమని ఎమ్మెల్యే గారు పురమాయించారు. రేపు కాలువ గేట్లు ఎత్తాక కోరమీన్లని ఒదలాలంట.. మా తమ్ముడు మంత్రి గారితో వలవేయించి పట్టిస్తే ఫోటోలు తీసుకున్నాక మీటింగుకి ఎల్తారంతా. అందుకే అయ్యా.. ఈ పని చూసుకుని రైలెక్కేస్తా.. ఎల్లుండి పొద్దునకల్లా సిటీ లోఉంటా.. కొంచెం దయుంచండి” అని ప్రాధేయపడుతూ చెప్పాడు శీను.

ఇక చేసేదేం లేక “సరే” అని ఫోన్ పెట్టేశాను.

***

చెప్పినట్టు గానే శీను ఆ రోజు ఉదయాన్నే వచ్చేశాడు. కాసేపటికే ఇస్త్రీ బట్టలు తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చాడు.”ప్రోగ్రాం బాగానే జరిగిందా?” అని అడిగాను. “తమ్ముడి సంగతి ఏం చేసావ్?” అని అడిగాను.

“అలవాటయిన పని గదండీ.. కాలువకి నీళ్లు ఒదులుతారుగదా.. ఇక చేపలు బానే పడతాయి అనుకుంటున్నారంతా.. అందుకే జాగ్రత్తలు చెప్పి వచ్చేసాను.. మీరిచ్చిన డబ్బులు ఖర్చులకి ఉంచమని ఇచ్చాను. ఎలాగూ ఇస్త్రీ డబ్బులు ఇస్తారుగదయ్యా.. ఇక కొన్ని రోజులు ఇవ్వొద్దులెండి..” చెప్పాడు శీను.

***

ఇలా రోజులు గడుస్తున్నాయి..!

“గోదాట్లో దొరికే పులస చేపలు ఇప్పుడు మా పోలకంపాడు కాలవలో కూడా దొరుకుతున్నాయి. ఇక మా కట్టాలు తీరినట్లే.. మా వోడు మా సంతోషంగా ఉన్నాడు. ఈసారి ఏరువాక పున్నమికి ఊరికి రమ్మంటున్నాడు అయ్యా. సెక్రటరీకి చెప్పి మీరే ఒప్పించాలి. పండక్కి ఎల్లొస్తా.. సారూ!” అని అడిగితే కాదనలేకపోయాను.

చెప్పినట్లు గానే పండక్కి వెళ్లి వచ్చేసాడు.

***

ఓ రోజు నేను ఆఫీసులో ఉండగా.. మా ఆవిడ ఫోన్ చేసింది.

“కింద వాచ్‍మన్ ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్లుంది.. వీలయితే లంచ్‍కి ఇంటికి రండి. ఓసారి కనుక్కుని వెల్దురు గానీ.” అంటే, సరే అన్నా!

భోజనం అయ్యాక ఆఫీస్‌కి వెళ్తూ శీనును విషయం కనుక్కుందామని వెళ్ళాను. శీను చాలా ఆందోళనలో ఉన్నాడు. వాళ్ళావిడ కోపంతో అరుస్తోంది.

“ఎన్నాళ్ళు తమ్ముడు, తమ్ముడు అని వెంపర్లాడతావు. వాడికి పెళ్లీడు వచ్చింది. వాడి మానాన వాడ్ని వదిలెయ్యక మనకిదేం ఖర్మ..!” అంటూ నెత్తీ నోరూ బాదుకుంటోంది శీను భార్య.

“ఇంతకీ ఏమైంది శీనూ? ఎందుకంత ఆందోళనగా ఉన్నారు” అని అడిగాను.

“ఏం చెప్పమంటారయ్యా.. గోదారి పులస చేపలు మంచి రేటు పలుకుతున్నాయని మా వోడు అవి పట్టి అమ్ముతుండేవాడు. విజయవాడలో ఎవరో పెద్దోళ్ళు మొన్న మావోడి దగ్గర పట్టుకెళ్లిన పులసలు తిని జ్వరాలొచ్చి ఆస్పత్రి పాలయ్యారంట. కేసు పెట్టి మా వాడ్ని పోలీసులకి పట్టించారంట. అర్జెంటుగా నేను ఊరెళ్ళాలయ్యా. మా వాడిని విడిపించి కొన్నాళ్ళు అమ్మని, తమ్ముడ్ని నా దగ్గర ఉంచుకోవాల! మీకు తెలియనిదేముంది అందరి ఇళ్లలో ఉండే గొడవ ఇదే గదా!” అని చెప్పకనే చెప్పాడు శీను.

“నేను సెక్రటరీకి చెప్తానులే, నువ్వు అర్జెంటుగా వెళ్లి రా” అని రెండు వేలు చేతిలో పెట్టి పంపించాను.

***

రెండు రోజులయ్యాక విషయం కనుక్కుందామని శీనుకి ఫోన్ చేసాను.

ఫోన్ ఎత్తిందగ్గర్నుంచి ఏడుస్తూనే ఉన్నాడు.. శీను. ఇంతకీ ఏమైందని అడిగాను.

“గోదారి పులసలు లావుగా ఉంటాయయ్య. అవి మా కృష్ణా లోకి వచ్చేటప్పటికి ఇంకా లావుగా అవుతున్నాయి. కానీ అవి లావు కావటం కాదు. ఒళ్ళు వాపు జబ్బు అని తెలియక మంచి రేటుకి అమ్మేస్తున్నాం. మా తాత చెప్తానే ఉండేవాడు. ఎక్కడి నీళ్లలో పెరిగిన చేపలు అక్కడే తినాలరా అని. మనకు నీళ్లు పడక జబ్బు చేసినట్టే ఆటికీ మా కాలవ నీళ్లు పడట్లేదంట. గోదాటి నీళ్ల ధాటికి మా కాలవ చేపలు కొట్టుకుపోతా ఉన్నాయి. అక్కడి పెద్ద చేపలు ఇక్కడ బతకలేక చస్తా వుండాయి. ఇదయ్యా.. మా కన్నీటి గోదారి కథ. చెప్తే కట్టం కన్నీటి చెరువవుతాది. ఇట్టా గోదారి మా కన్నీటి కి కారణం అవుతాదని ఊహించనే లేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. మా వాడికి ఏదన్నా బతుకు దెరువు చూపించి గానీ రాలేని పరిస్థితి. ఇంకా మా అమ్మను కూడా కనిపెట్టుకుని ఉండాల. ఇంట్లో మా ఆడోళ్లకి ఇదేం పట్టదు. ఎంత సేపూ మా సంసారం బాగుంటే చాలు అంటాది. వీళ్ళని ఇట్టా వొదిలి ఎట్టా వచ్చేది మీరే చెప్పండయ్యా” అంటుంటే నాకు నోట మాట రాలేదు.

***

ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు..!

నదులూ, నదులూ కలిస్తే దుఃఖం సాగరమవుతుందా..? చేపలు పట్టే వాళ్ళ జీవితమే ఇలా ఉంటే.. మరి ఆ చేపలు ఎవరితో చెప్పుకోవాలి తమ గోడుని..? సముద్ర ఘోష అంటే ఇదేనా..? ఇలా ఆలోచిస్తూనే నిద్ర పట్టేసింది నాకు.

(ఈ కథ లోని పాత్రలు, ఊర్లు, సన్నివేశాలు, అభిప్రాయాలు కేవలం కల్పితాలు. వీటిలో శాస్త్రీయత ఎంత అనేది పాఠకుడి ఆలోచనా పరిధికి వదిలి వేస్తున్నా! – ఆసూరి హనుమత్ సూరి)

Exit mobile version