[ఫిబ్రవరి 11 ఘంటసాల వర్ధంతి సందర్బంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు.]
1930లలో టాకీలు మొదలైన తొలినాళ్ళలో నటులే గాయకులు కూడా. ఎందుకంటే ఎక్కువమంది నటులు రంగస్థలం నుంచి వచ్చినవాళ్ళే కాబట్టి. మలినాళ్ళలో నటులు అంత బాగా పాడలేకపోవడంతో నేపథ్య గాయకుల ప్రవేశం జరిగింది. పీల గొంతుతో అక్కినేని గాయకుడిగా, నటనలో కూడా ప్రయత్నం చేస్తున్న ఘంటసాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నేపథ్య గానం వారికీ అక్కరకు వచ్చింది. నేపథ్య సంగీతం ఆవిర్భావనికి ఇదొక ఉదాహరణ. ఈ ప్రక్రియని ఎందరో నేపథ్యగాయకులు ప్రారంభించారు, అభివృద్ధి పరిచారు, మెరుగులు దిద్దారు.. దిద్దుతున్నారు. బాలంత్రపు రజనీకాంతారావు, చిత్తూరు నాగయ్యల ప్రోత్సాహంతో 1945లో ‘స్వర్గసీమ’ సినిమాలో భానుమతి గారితో కలసి తొలిసారిగా నేపథ్య గాయకుడిగా ఓ సంగీత సామ్రాజ్యనికి శ్రీకారం చుట్టారు. అయితే నేపథ్య గాయకులలో గంధర్వ గాయకులు వేరయా.. అలా గంధర్వ గాయకులుగా ముద్రపడిన గాయకులలో ఘంటసాల మాస్టారు వేరయా.. ఎలాగో చూద్దాం. వేర్లు వేరు కాండము వేరు కదా. ఎవరో వీరాభిమాని అన్నాడట “నా ఆరాధ్యదైవం వెంకటేశ్వరుడు, ఇంటిపేరు ఘంటసాల” అని. ఇది చాలదా ఘంటసాల గురించి చెప్పడానికి..
సిపాయి చిన్నయ్య సినిమాలో ‘నా జన్మభూమి’ పాటని ఎంతోమంది బాగానే పాడగలరు. కానీ దేశం కోసం 18 నెలలు జైలు జీవితం గడిపిన ఘంటసాల పాడటం వేరేగా ఉంటుంది మరి. జయభేరిలో ‘నీ దానన్నది రా’; కంచుకోటలో ‘ఎచటనో గల స్వర్గంబు నిచట దింపి’; పంతాలు పట్టింపులు సినిమాలో ‘ఇనుకోర ఇనుకోర’; బుద్ధిమంతుడు సినిమాలో ‘టాటా వీడుకొలు’ పాటలలో ఆయన వినిపించిన మైకాన్ని, కిక్ని ఏ తాగుబోతు ఓలికించగలడు? మర్మయోగి సినిమాలో ‘నవ్వుల నదిలో’ పాటలోని ‘మగసిరి నవ్వు’ని ఏ మగాడు రువ్వగలడు? దేవదాసులో ‘మరపు రాని బాధ కన్నా సౌఖ్యమే లేదు’; ప్రేమ నగర్లో ‘నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను’; కన్నె మనసులు సినిమాలో ‘రాయి కన్నా రాయివి నీవు కసాయి నీవు’ అంటూ ఓ హృదయం లేని ప్రియురాలి కోసం ఆ చరణాలని ఏ భగ్న ప్రేమికుడు పరితపించగలడు? పునర్జన్మ సినిమాలో ‘ఎవరివో నీ ఎవరివో’ వంటి పాటను ఒకే టేక్లో ఎవరు ఓకే చేయించుకోగలరు? ఇద్దరు మిత్రులు సినిమాలో ‘పాడవేల రాధికా’; కేవలం ‘ప్రణయ సుధా గీతిక’ చరణాన్ని పాడటానికి సంగీత దర్శకుడు అవసరం లేదని చెప్పినా, ఎంత బిజీగా వున్నా పాటలో తన ఒక్క చరణం మిళితమవడం కోసం మొత్తం రికార్డింగ్ చివరి వరకు ఉండి పాట పట్ల నిబద్ధతని ఎవరు చూపిస్తారు? ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు.
భూకంపం ప్రకంపనలను కొలిచే రిచ్చటర్ స్కేల్ మీద ఒక పాయింట్కి పది రెట్ల స్థాయిలో రెండవ పాయింట్ ఉంటుంది. జయభేరిలో ‘నందుని చరితము వినుమా’ పాటలో చివరి నాలుగు చరణాల స్థాయి అలా రెట్టింపవుతూ ఆఖరి చరణం ‘అంతట శివుడే అతడిని బ్రోచి పరంజ్యోతిగా వెలియించే’ వచ్చేసరికి ఘంటసాల గొంతు జీరబోవడాన్ని గమనిస్తే ఆ తారాస్థాయిని అందుకోవటం ఎంత కష్టమో తెలుస్తుంది. అదే సినిమాలో ‘రసిక రాజ తగువారము కాదా’ పాట ఎత్తుగడ ‘హెలికాప్టర్ టేక్ ఆఫ్’లా లేచి అద్భుత రసానికి ప్రతీకలా నిలుస్తుంది. జగదేకవీరుని కథలో ‘శివశంకరి’ పాట మరొక ఆణిముత్యం.
సరే. ఇవన్నీ బాగా ‘పాడగలగటం’, ‘పాడే రీతి’కి చెందినవి.. ఇతరులు కూడా ఇంతగా పాడగలరు అనుకుందాం.. మరి ఘంటసాల ప్రత్యేకత ఏమిటి?
మరొక ప్రత్యేకత.. స్వరకల్పన. అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే సుబ్బరామన్, సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల, సుసర్ల దక్షిణమూర్తి, ఘంటసాల, కె.వి. మహదేవన్, ఎం. ఎస్. విశ్వనాధన్ ఆదినారాయణ రావు, టీవీ రాజు ఇత్యాదులు గుర్తుకొస్తారు. చిత్రంగా గాయకుడు ఘంటసాల పేరు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. పాతాళభైరవి, షావుకారు, గుండమ్మకథ, చిరంజీవులు, లవకుశ, రహస్యం వంటి శతాధిక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఏకైక గాయకుడు ఘంటసాల మాత్రమే. ఆయన పాడిన పాటలు, స్వరపరిచిన చిత్రాలు అన్ని అమోఘ విజయాన్ని సాధించినవే. ఆయన స్వరం అందించి హిట్ కానీ పాటలను వెతకటం కష్టం. అందుకే ఓ సందర్భంలో ఓ నిర్మాత ఇళయరాజాని తన చిత్రానికి నియమించుకొని అన్ని పాటలు హిట్ చేయాలి అంటే నేను ‘ఘంటసాల’ని కాదండి అని సవినయంగా బదులిచ్చారట, తరువాత తరంలో మేటి సంగీత దర్శకుడైన ఇళయరాజా. నిజం చెప్పాలంటే ‘గాయకుడు’ ఘంటసాల – ‘సంగీత దర్శకుడు’ ఘంటసాలను మరుగుపరిచేడు. లవకుశ, రహస్యం చిత్రాల సంగీతం అమోఘం. రహస్యం సినిమాలో తను ఎంతగానో అభిమానించే రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మంగళ హారతి పాటే ఘంటసాల సమకూర్చిన స్వరాలతో నేటికీ ప్రతి శుభకార్యం లోను మారుమోగుతోంది. అదే ‘శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా’ మంగళ హారతి హారతి పాట.
తెలుగు సినీ కళామతల్లికి నటసామ్రాట్, నటరత్నలు రెండు కళ్ళు అయితే ఘంటసాల వారి కంఠం. గుండె కూడా. వారిద్దరూ గొప్ప నటులే కానీ వారి వెనక భావుకుడు నటుడు సంగీత దర్శకుడు కూడా అయిన ఘంటసాల వారి వారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వారికి ధీటుగా ఎలుగెత్తి పాడితే ఆ పాటకు వారిదైన అభినయం తోడై ప్రేక్షకులను డబల్ ఇంజిన్ ఎఫెక్ట్ కు గురి చేసేది. అందుకే ఘంటసాల లేని లోటు వారి తదుపరి నట జీవితంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగేశ్వరరావు గారే ఒప్పుకున్నారు.
కారణం అక్కినేని, నందమూరి లకు ఘంటసాల గొంతు కలిసినట్లుగా మరి ఏ గాయకుని గొంతు సరి పడేది కాదు.. ఇద్దరికీ తానే పాడుతూ ఎవరికీ వారే పాడుతున్నట్లుగా భ్రమింప చేసేవారు. విడివిడిగా కాకుండా వారు కలిసి నటిస్తున్నప్పుడు కూడా ఆ చిన్న తేడాని ఘంటసాల చూపించేవారు. అనుకరణలో దిట్ట అయిన తరువాతి తరం గాయకుడు కూడా అదే ఫలితాన్ని ఇవ్వలేక పోయాడు.
వీరి మరొక ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది స్వయంగా కచేరిలు చేయగల సమర్థులు. అందుకనే “సినీరంగానికి ఆయన రావటం సినీరంగం చేసుకొన్న అదృష్టం” అని నేదునూరి కృష్ణమూర్తి వంటి సంగీత విద్వాంసులు వ్యాఖ్యనించారు. ఒకవేళ సినీ పరిశ్రమకు రాకపోయి, గాయకుడు కాకపోయుంటే కచేరిలు చేసుకొంటూ ప్రముఖ వాగ్గేయకారుల జాబితాలో చోటు చేసుకోగలిగే సమర్థులు.
వీరికి రాగాల మీద పట్టు అధికం. గాయకుడిగా అగ్రస్థానంలో మూడు దశాబ్దాలు కొనసాగుతూ కూడా వందకు పైగా సినిమాలకు సాలూరి రాజేశ్వరరావు, ఆదినారాయణరావు, పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి వంటి దిగ్గజ దర్శకులతో పోటీ పడుతూ సంగీతాన్ని సమాకూర్చారంటే గాయకుడు కాకపోయుంటే కేవలం సంగీత దర్శకుడిగా కూడా కొనసాగగలిగేవారు.
వీరిలోని సుగుణం ఏమిటంటే ఏనాడూ ఈయన తాను మరి ఒక గాయకుని కన్నా అధికుడినని చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు. తానే స్వయంగా ఎందరినో ప్రోత్సహించేరు.
జీవన ప్రవాహంలో కొత్తనీరు వస్తూనే ఉంటుంది.. ఒకరిని మించిన వారు ఒకరు ఉంటూనే ఉంటారు. కళాకారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుండాలి. మరి అయన చిత్రరంగంలో వున్నప్పుడు కేవలం గాయకుడి కూడా ఆయనను అధిగమించలేని వాళ్ళు వేర్వేరు ప్రక్రియలలో అంటే ఒక సంగీత దర్శకుడిగా, ఒక వాగ్గేయకారుడి కొనసాగగల సామర్థ్యం వున్న ఘంటసాలతో ఎలా పోటీ పడగలరు?
మరొక గుణం.. ఒదిగి ఉండటం. మూలాలు మర్చిపోకపోవడం. “ఏ తల్లి నా జోలెలో తొలుతగా నాకింత ముద్ద వేసిందో..” అంటూ చిన్నతనంలో విజయనగరంలో మధుకర వృత్తి చేసుకొంటూ గడిపిన రోజులు గుర్తు తెచ్చుకోవడం.. తనకు విద్య నేర్పిన గురువు కుమారుడిని తన దగ్గర పెట్టుకోవడం నిదర్శనాలు. కళాకారులు ప్రజా సమస్యలకు దూరంగా ఉండకూడదంటూ యుద్ధం, కరువు వంటి విపత్తులు వచ్చినప్పుడు నిధులు సేకరించడం చేసేవారు.
వీరి ఆధిపత్యాన్ని అంగీకరించలేని వారు వీరి మీద చేసే విమర్శ – వీరి గొంతులో మార్దవం లేదనేది, రఫీ తరహాలో పాడలేరనేది. ఆయన మూడు దశాబ్దల ప్రయాణంలో చివరి అంకంలో ఆ లోపం కనిపిస్తుంది. బరువుగా ఊపిరి తీసుకోవడం చివరి రోజులలో పాడిన పాటలలో వినవచ్చేది కూడా. కారణం ప్రధానంగా అనారోగ్యం. ఆధునిక సాంకేతిక సౌలాభ్యలు లేకపోవటం.. ముప్పై ఏళ్లకే ఈయనకి చక్కెర వ్యాధి వచ్చింది. ఎవరే చిట్కా వైద్యం చెప్పినా పాటించటం, ఫలితం పొందలేకపోవటం జరిగేది. అయితే మార్దవం అన్ని సందర్భాలకీ సరిపడదు కదా. ఈయన గంభీర స్వరంతో వారు పోటీపడలేరుగా. మార్దవ కోణంలో ఆలోచించే సంగీత దర్శకులు నట సామ్రాట్, నటరత్నలకు పి.బి. శ్రీనివాస్ చేత పాడించారు, కానీ ప్రేక్షకులు స్వీకరించలేదు. ఇందులో పి.బి.ఎస్ గారు చిన్నబుచ్చుకోనవసరం లేదు. ప్రేక్షకులు ఆయనతో మమైకం చెందారు. చిన్న నటులతో సినిమా తీసే నిర్మాతలు కూడా తమ చిత్రంలో ఒకటైనా అయన పాట ఉండేలా చూసుకొనే వారు. రాముని నుంచి రజకుడి వరకు ఆయనే పాడాలనుకొనేవారు కొందరు. సాధారణంగా కృష్ణకి బాలు పాడేవారు. శోభన్ ఘంటసాలనే కోరుకొనేవారు. మరి మంచి మిత్రులు సినిమాలో ‘ఎన్నాళ్ళో వేచిన హృదయం’ పాటలో కృష్ణ చరణాలు.. ‘నాగులు తిరిగే కొనలో ఏ న్యాయం పనికి రాదని.. కత్తిని విసిరే వానిని ఆ కత్తి తోనే గెలవాలని’ – ఘంటసాల పాడేరు. కారణం ఆ చరణాలకి గాంభీర్యం కావాలి. మార్దవం సరిపడదు. అలాగే అల్లూరి సీతారామరాజు సినిమాలో ‘తెలుగు వీర లేవరా’ పాట.. జాతిలో సమరోత్సాహం కలిగించాలి కదా. ‘దారుణి రాజ్య సంపద మదంబున’ పద్య పఠనం మార్దవంతో సాగితే ప్రేక్షకులు నిద్రపోయేవారు. నిర్మాతలు లబోదిబోమనేవారు.
‘భక్తి తత్పరత’ వీరి సహజ గుణం, బలం. ‘ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్య’ అంటే అయన ఇక్కడే ఉన్నానంటూ ఈయనని తన సన్నిధికి రప్పించుకొని ‘శేషశైలవాసా శ్రీ వెంకటేశా’ పాడించుకొన్నారు. మరి ఏ చిత్ర గాయకుడికి దొరికింది ఆ గౌరవం? అలనాటి అన్నమయ్య తరవాత ఈయనకే దొరికింది ఆ అవకాశం.
మహాకవి కాళిదాసు సినిమాలో ‘శ్యామలా దండకం’ అనితర సాధ్యం. పాండవ వనవాసంలో భీముడికి ఆంజనేయుడు సాక్షాత్కారిస్తే సంభ్రమాశ్చర్యలతో పాడిన ‘ఆంజనేయ మహానుభావా’ పాట వింటే ఈయనకే రికార్డింగ్లో ఆ స్వామి కనబడ్డారేమో అనిపిస్తుంది. భక్త జయదేవలో పాడిన జయదేవుని గీత గోవిందం సంస్కృత గీతాలకు అర్థం తెలియకపోయినా ప్రేక్షకులు తలలు ఊపారు. ‘నీ మధు మురళి గాన లీలా’ పాట నిజంగా మేఘ మథనం జరిగిందేమో అనిపిస్తుంది.
‘భగవద్గీత’ అంటే ప్రధానంగా రెండే వున్నాయి. ఒకటి ఆ శ్రీకృష్ణుడు చెప్పినది.. రెండవది ఘంటసాల పాడినది.. ఇంకా చాలామంది చెప్పారట, పాడారట. కానీ ఆ శ్రీకృష్ణుడు చెప్పింది సామాన్యులకు చేర్చింది ఘంటసాల మాత్రమే అంటే అతిశయోక్తి కాదేమో.
‘ప్రైవేట్ ఆల్బమ్’ సంస్కృతిని మొదలుపెట్టిన గాయకుడు ఈయనే. ‘నమో వెంకటేశ’, ‘అత్తలేని కొడలుత్తమురాలు ఓయమ్మా’, ‘పోలీసు వెంకటస్వామి’, ‘తలనిండ పూదండ దాల్చిన రాణి’, ఇంకా ‘పుష్ప విలాపం’ ఇత్యాదులు ప్రసిద్ధాలు.
మూడు స్థాయిలలోను ఎటువంటి ఇబ్బంది లేకుండా అలవోకగా పాడగల మాస్టర్ ‘ఘంటసాల మాస్టారు’. అందుకే అయన మాత్రమే ‘మాస్టారూ’ అని సంబోధించబడ్డారు.. నిజానికి ఆయన కాలంలో తదుపరి కాలంలో వఛ్చినంతగా సంగీత ప్రాధాన్యం గల చిత్రాలు రాలేదు.
అయన చలనచిత్ర జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నప్పడు 1970లో నాటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రాహ్మనందరెడ్డి గారు పూనుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో సన్మానం చేయడం అనేది ఓ అరుదైన ఘట్టం. అది అందరికి జరగదు.
ఆయన ఓ ‘మాస్టారు’. మిగతావారు ‘బాలు’రే. అయన ‘వారసులే’.
అయనని గొప్ప గాయకుల జాబితాలో చేర్చకూడదు. అయన కన్నా బాగా పడేవారు ఉండోచ్చు కాబట్టి.
అయన స్టైలే వేరన్నట్లు..
ఆయనది ఓ త్యాగయ్య, ఓ అన్నమయ్యల స్థాయి.
దాదాపుగా మరణశయ్య మీద రికార్డ్ చేయబడిన భగవద్గీత పఠనం ‘ఘంటసాల భగవద్గీత’గా ఖ్యాతి చెందటం గాన సరస్వతికి ఆయన చేసిన సేవకు లభించిన గండపెండేరం (ఆ రికార్డ్ అయన మరణం తరువాత విడుదల అయ్యింది. అది విధి విలాసం).
‘దొరకునా అటువంటి సేవ’.
పొన్నాడ సత్యప్రకాశరావు కవి, కథకులు. వీరు ఇప్పటి వరకు 69 కథలు, 2 నవలలు, 100కి పైగా కవితలు వ్రాశారు. 2002లో వీరి నవల ‘ఊరు పొమ్మంటోంది’ స్వాతి అనిల్ అవార్డును గెలుచుకుంది. ఈ నవలని 2010లో సాహితీప్రచురణలు వారు ప్రచురించారు. 2010లో చినుకు ప్రచురణల ద్వారా వీరి కథాసంపుటి ‘అడవిలో వెన్నెల’ విడుదలైంది. వివిధ పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు.