Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కష్టజీవుల వ్యథలను చాటిన కథలు ‘గీతలు చెడిపి..’

[డా. శాంతి నారాయణ గారు వెలువరించిన ‘గీతలు చెడిపి..’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

డా. శాంతి నారాయణ గారు ప్రసిద్ధ కవి, కథకులు, నవలా రచయిత. ‘గీతలు చెడిపి..’ అనేది వారి 7వ కథాసంపుటి. ఇందులో పది కథలున్నాయి.

~

వ్యవసాయ జీవితం ఛిద్రమవటంతో పల్లె నుంచి పట్నానికి వచ్చిన ఇద్దరు మిత్రులు జీవిక కోసం వేర్వేరు ఉపాధులు ఎంచుకుంటారు. నాగేంద్ర ఆటో డ్రైవర్‍గా మారితే, కేశవరెడ్డి, ఓ కాంట్రాక్టర్ దగ్గర సూపర్‍వైజర్‍గా చిన్న ఉద్యోగంలో చేరతాడు. ఆప్త మిత్రులే అయినప్పటికీ ఇద్దరి ఆలోచనా ధోరణులలో వ్యత్యాసం ఉంటుంది. నాగేంద్ర జీవితాన్ని నిరాడంబరంగా గడిపితే, కేశవరెడ్డి తొందరగా ఎదిగిపోవాలనే ఆత్రుతలో అప్పులు చేస్తాడు. కొత్త పరిచయాలను పెంచుకుంటాడు. అలా పరిచయమైన ఓ వ్యక్తి కేశవరెడ్డి భార్యపై కన్నేసి, ఆమెను పొందాలని ప్రయత్నిస్తే, ఆ దంపతులు నాగేంద్ర సాయంతో కలెక్టర్‍కి ఫిర్యాదు చేద్దామనుకుంటారు. కానీ ఈ లోపే తమపై ఎదురుతిరుగుతున్న కేశవరెడ్డి కుటుంబాన్ని వేధించి, వెంటాడి, తమకి తాము నిప్పంటించుకునేలా చేస్తారు మోతుబరులు. బలహీనుల నిస్సహాయతను వెల్లడిస్తూ, అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేయవచ్చో ‘రాజ్యం’ కథ చెబుతుంది. ‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ వుంది’ అన్న వ్యంగ్యాత్మక వాక్యంతో కథ ముగుస్తుంది. మనసు మొద్దుబారుతుందీ కథ చదివాకా.

అనంతపురం మాండలికంలో రాసిన కథ ‘గత్తెంతరం ల్యాక’. ఎటువంటి నేలయినా ఎంతున్నా, వర్షమే పడనప్పుడు ఏం ప్రయోజనం అని అంటాడో రైతు ఈ కథలో. ఈ సందర్భంగా రచయిత ఈ పరిస్థితిని వివరిస్తూ గొప్ప పోలిక చెప్పారు – ‘ఎండిపోయిన తల్లి, కన్నబిడ్డలకు పాలిస్తుందా?’ అంటూ! ఒక్క వాక్యం అక్కడి దృశ్యమంతా పాఠకుడి కళ్ళకు కట్టేస్తుంది. అగ్రవర్ణాల వారిలోనూ ఉండే పేదరికం, ఆర్థిక ఇబ్బందులను రచయిత ఓ పాత్ర ద్వారా ప్రస్తావిస్తారీ కథలో. ఉపాధి హామీ పనులు ఎలా ఉంటే, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందో ఓ పాత్ర ద్వారా చెప్పిస్తారు రచయిత. ఆచరణయోగ్యమైన సూచన!

నకిలీ మందులు’ చక్కని కథ. చదివాకా, కథకి ఆ పేరు ప్రతీకాత్మకమని గ్రహిస్తారు పాఠకులు. బహుజన కులానికి చెందిన ఓ వ్యక్తి అధికార హోదాలకు మరిగి, తన మూలాలను మరిచి తన వాళ్ళనే అవమానపరుస్తాడు. వర్ణ-వర్గ స్వభావాలను వివరిస్తూ చక్కని నవలని రాసిన నాగరాజనే రచయిత ఓ బహుజన మేధావికి దాన్ని అంకితం ఇస్తాడు. ఆ పుస్తకావిష్కరణకి వచ్చిన ఆ మేధావి ప్రవర్తించిన తీరు, నాగరాజును, ఈ కథ చెప్తున్న అతని మిత్రుడు రమేష్‌ను విస్తుపోయేలా చేస్తుంది. ఆ పుస్తకం లోని అంకితం పేజీ చూసినప్పుడల్లా ఆ ఘటన గుర్తొచ్చి తానే బాధపడుతుంటే, నాగారాజు ఇంకెంత మథనపడి ఉంటాడో అని అనుకుంటాడు రమేశ్. తన దగ్గరున్న పుస్తకంలో అంకితం పేజీని చింపేస్తాడు రమేష్. పేజీ అయితే చించేశాను గానీ, మిత్రుని గుండె గాయన్ని తీసివేయగలనా అని బాధగా అనుకుంటాడు. నాగరాజుతో పాటు చదువరులు కూడా మానసిక అలజడికి లోనవుతారు.

ద్రౌపది’ చక్కని కథ. మధ్యతరగతి జీవితంలో ఎదగాలని ప్రయత్నించే ద్రౌపదికి ఎదురయిన ఆటంకాలు, వాటిని ఆమె అధిగమించిన తీరుని ఈ కథ చెబుతుంది. అందంగా, కంటికి నదురుగా కనిపించే మహిళలను లోబరుచుకోవాలని చూసే ధూర్తులను నుండి తనని తాను కాపాడుకుంటూ, తన రెక్కల కష్టంతో, కుటుంబానికి ఆర్థికంగా ఊతమిస్తుంది ద్రౌపది. అనుకోకుండా పెన్నకి వరద వచ్చి పొంగితే, ఓ యువకుడిని కాపాడడానికి తన చీర విప్పి అతని వైపు విసురుతుంది. ఆ యువకుడిని కాపాడే క్రమంలో తాను అర్ధనగ్నంగా ఉన్నాననే సంగతి గ్రహించదు, అతడికి ఆపద తప్పిన తరువాతే ఆమెకా విషయం స్ఫురిస్తుంది. అక్కడున్న వ్యక్తుల్లో ఒకరు తన పంచ ఇస్తే, కప్పుకుంటుంది. వరద ఉధృతి పెరిగే ప్రమాదం ఉందంటూ అటొచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ హెచ్చరించడంతో, ద్రౌపది సాహసాన్ని అభినందిస్తూ, అందరూ అక్కడ్నించి బయల్దేరుతారు.

వైద్యరంగం ఎంత ఇష్టమో, వ్యవసాయ జీవితమూ అంతే ఇష్టమంటూ డా, సుబ్బయ్య పాత్రని పరిచయం చేసి ఆయన ఔన్నత్యాన్ని చాటుతారు రచయిత ‘అసలు రూపాలు’ కథలో. పల్మనాలజీలో నిపుణుడైన సుబ్బయ్య తన జీవన శైలి పట్ల స్పష్టత ఉన్నవాడు. కరోనా వ్యాధి చుట్టుముట్టినప్పుడు ఎందరికో వైద్యం చేసి ప్రాణాలు నిలుపుతాడు. చివరికి తానే ఆ వ్యాధికి బలయిపోతే, శవాన్ని కూడా తమ వీధుల్లోకి రానివ్వరు జనాలు. ప్రాణాల మీద తీపి, ఎదుటివారు తమకు చేసిన మంచిని విస్మరించేలా చేస్తుందని, మనుషుల అసలు రూపాలను బహిర్గతం చేస్తుందని ఈ కథ చెబుతుంది.

కరోనా నేపథ్యంలోనే రచించిన మరో కథ ‘ఆత్మ నిర్భర భారతం’. కరోనాని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు, నగరాల్లో పనిచేస్తున్న వలస కార్మికులు తమ సొంత ఊర్లకి వెళ్ళడానికి పడిన అవస్థలు, ఎదుర్కున్న ఇబ్బందులను కళ్ళకు కడుతుందీ కథ. మానవీయ కోణం లోపించిన యజమానుల దౌర్జన్యాలను తట్టుకోలేక ఉన్న పళంగా సొంతూర్లకి బయల్దేరిన వలస కార్మికులు గుండెల్ని పిండేసే విషాదాలను ఎదుర్కుంటారు! మనుషుల్లోని దుర్గార్మాన్నీ, మంచితనాన్ని ఏకకాలంలో వెలికితీసిన మహమ్మారి కరోనా! శ్రామికులను తరిమేసిన యజమానులు – నడక దారిలో ఆదరించిన ఎందరో సామాన్యులు! సొంత ఊర్లకి చేరే లోపే నడుస్తూ నడుస్తూ రాలిపోయిన మనుషులు! కొందరి ప్రవర్తన మానని మచ్చలా మిగిలితే, మరికొందరి ప్రవర్తన చందన లేపనమవుతుంది ఈ కథలో.

అనుకోని పరిస్థితులలో కులవృత్తిని చేపట్టి, మగవారికి పోటీగా, దీటుగా నిల్చిన ఇద్దరు యువతుల జీవనచిత్రం ‘గీతలు చెడిపి..’ కథ. కుల అహంకారానికి ధనమదం తోడైతే, మనుషులు ఎంతా వికారంగా ప్రవర్తిస్తారో ఈ కథ చెబుతుంది. సమాజంలో చెరపాల్సిన ఎన్నో గీతలను ఈ కథ గుర్తు చేస్తుంది. అందుకు నాందిగా శకుంతల, మంగమ్మలు వేసిన ముందడుగు – ఆ సెలూన్‍లో కొత్త కాంతులు నింపినట్లే, నాగన్న కుంటి కాలికీ, కుంటి చేతికి ఏద్దో కొత్త సారం అందించినట్టే – నిజజీవితంలోనూ శ్రమైక జీవుల కుటుంబాలలో ప్రేరణ నింపుతుందీ కథ. బ్రతుకుబాటలో ముందుకు నడవమని ప్రోత్సహిస్తుంది.

ఎవరు హర్షించినా, అంగీకరించకపోయినా బడుగు, బలహీన వర్గాలలో వస్తున్న చైతన్యం, విద్య ద్వారా పొందుతున్న ప్రయోజనం, ఎదగాలన్న వారి తపనకు దోహదపడుతున్నాయి. ఎదుటివారి పిల్లల్ని మీ కులవృత్తిలో పెట్టుకోవచ్చు కదా అని సలహాలిచ్చే పెద్దమనుషులు తమ పిల్లల్ని మాత్రం తమ వృత్తిలోకి రానివ్వరు. ఈ ద్వంద్వ వైఖరిని ఎద్దేవా చేస్తుంది ‘ఉంగటం తెగింది’ కథ. విద్యావంతులు తమ వర్ణ వర్గ స్వభావాలను వదులుకోవాలని సూచిస్తుందీ కథ.

“వొక నిర్దిష్టమైన దృక్పథమున్న గొప్ప సాహిత్యవేత్తలు వేరే ప్రభావాలకి లోనై తమ సహజమయిన ఆలోచనా విధానాలను మార్చుకుంటారా?” అని ప్రశ్నిస్తుంది ‘ఏరుదాటి, తెప్పను’ కథ. ఈ కథలో ఎన్నో ప్రశ్నలు! పేరు మార్చుకున్నంత మాత్రాన కులం మారిపోతుందా? అని ఒకప్పటి తన మిత్రులని ప్రశ్నించిన కథలోని రచయిత – తన కొత్త పుస్తకావిష్కరణకి ముఖ్య అతిథిగా పిలిచేందుకు నిబద్ధత కల్గిన మరొక వ్యక్తిని గుర్తు చేసుకుని ఊరట చెందుతాడు.

ప్రజల అమాయకత్వాన్ని ఆసారగా చేసుకుని దొంగ బాబాలు, నకిలీ స్వామీజీలు చెలరేగిపోయే తీరు, మూఢనమ్మకాలను ప్రజ్వరిల్లజేస్తూ, అమాయకుల ధన, మానప్రాణాలతో ఆడుకునే నీచుల గురించి ‘కాషాయ వైద్యం’ కథ చెబుతుంది. కథ చివర్లో, “సూర్యుడు నిన్న లేని కొత్త వెలుగుల్ని మిట్టపల్లె మీద వెదజల్లుతున్నాడు” అనే వాక్యం – బాధితులలో వచ్చిన చైతన్యానికి సూచిక!

~

ఈ కథలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. బడుగు బలహీన వర్గాల స్థితిగతులను, ఆర్థికంగా, సామాజికంగా ఎదురవుతున్న వివక్షలను, కనబడని గీతలను ప్రస్తావిస్తాయి. అవరోధాలను అధిగమించి, ఎదిగే ప్రయత్నం చేస్తున్న వారి పోరాటాలని కళ్ళకు కడతాయి. సిద్ధాంత చర్చలను నేర్పుగా పాత్రల ఆలోచనలుగా, సంభాషణలుగా మలచి తన దృక్పథాన్ని చదువరుల ముందుంచారు రచయిత.

***

గీతలు చెడిపి.. (కథలు)
రచన: డా. శాంతి నారాయణ
ప్రచురణ: విమలా శాంతి ప్రచురణలు, అనంతపురం
పేజీలు: 200
వెల: 250/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: 8074974547
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/geethalu-chedipi

 

 

~

డా. శాంతి నారాయణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-santhi-narayana/

Exit mobile version