Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గౌరవ వందనం

[డా. సి. భవానీదేవి రచించిన ‘గౌరవ వందనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

దేశమంటే మనుషులనుకుంటే
అది ఏ దేశానికైనా అంతేకదా!
మనుషులంటే మానవత్వం ఉన్నవాళ్లయితే
తోటి మనుషుల రక్తంతో రాక్షసస్నానాలెలా చేస్తారు
అందమైన కాశ్మీరాన్ని ఎన్నాళ్ళు శవాలతో నింపుతారు?
వల్లకాటిలో మీ ఉగ్రజెండాను ప్రతిష్ఠిస్తారా
మతంకంటే ముందే మనిషి జన్మించాడని మర్చిపోయారా
ఎన్నాళ్లీ పాశవిక మానవ హననాలు?
ఒక తుపాకీ గర్జించే తూటాలకు
తల్లులు, అక్కాచెల్లెళ్లు ఎందుకు గుర్తుకురారు?
ఏ దేశమైనా తల్లిలా బిడ్డల్ని కాపాడుకోవాలనుకునిఉంది కదా
పశువులు పక్షుల మాతృరక్షణ ప్రకృతి సహజమైనప్పుడు
భరతమాత మాత్రం వీరపుత్రుల్ని నియోగించదా?
సహనం.. శాంతి.. అహింసలకు కాలం చెల్లిపోయింది
గీతాసారం గ్రహించుకున్న నా దేశం
కర్తవ్య నిష్టారణంలో సింహగర్జన చేస్తున్నది
నాటి మహాభారతం నుండి నేటి నవ్యభారతం దాకా
శత్రువులకు ఎదురు నిలిచిన వ్యూహాత్మక పోరాటంలో
తనవారిని నడిపిస్తున్న దేశమాత సారథులకు
ధీరత్వంతో జీవితాలనర్పిస్తున్న అన్నదమ్ములకు
వాళ్లను మనకిచ్చిన మాతృమూర్తులకు.. వీరపత్నులకు
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
కలకాలం కంటితడిలా దాచుకుంటాం
కోటికోటి గౌరవ వందనాలతో
త్రివర్ణ పతాక రెపరెపలతో జైహింద్ పలుకుతాం

Exit mobile version