Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్థానికమూ, సార్వజనీనమూ అయిన కథల సంపుటి ‘గంగమ్మ పూలు’

[డా. వేంపల్లి గంగాధర్ గారి ‘గంగమ్మ పూలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రముఖ రచయిత డా. వేంపల్లి గంగాధర్ వెలువరించిన 6వ కథాసంపుటి ‘గంగమ్మ పూలు’. ఇందులో 15 కథలున్నాయి. ఈ కథలన్నీ ప్రధానంగా రాయలసీమకి సంబంధించిన సమస్యలతో, స్థానిక వస్తువుతో అల్లినవే, అయినప్పటికీ, కథ పాఠకులలో కలిగించే సంవేదన, వారి హృదయలలో నింపే ఆర్తి సార్వజనీనమైనవి. కథల లోని సమస్య స్వరూప స్వభావాలకు స్థానీయమైనా; పాత్రల బాధ, వేదన, జీవితం పట్ల ఆశ, సంఘంలో గౌరవం కోసం తపన వంటి అంశాల ద్వారా ఈ కథలు జాతీయ, అంతర్జాతీయ కథల స్థాయికి తక్కువేమీ కావని పాఠకులు భావిస్తారు.

“ఒక అనుభవాన్ని కథగా మార్చడానికి కావలసింది మూడు సామర్థ్యాలు: ఒకటి, వాస్తవాన్నో అనుభవాన్నో ప్రత్యక్షంగా చూసి ఉండటం లేదా అనుభవించి ఉండటం. రెండు, చూసినదాన్నో, అనుభవించినదాన్నో నమ్మదగ్గట్టుగా చెప్పడం. ఇక మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైంది – ఆ వాస్తవమో, అనుభవమో తన హృదయంలో కలిగించిన స్పందనని పాఠకుడి హృదయంలోకి పంపగలగడం. కథకుడిగా గంగాధర్‍కి ఈ మూడు సామర్థ్యాలు ఉన్నాయని ఈ కథలు ఋజువు చేస్తున్నాయి” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు.

~

పేదవాళ్ళని ఎర్ర చందనం దొంగల కోసం పనిచేసే కూలీలుగా, ఏది మారుస్తోందో ‘తమిళ కూలి’ కథ చెబుతుంది. తమిళనాడు నుంచి వచ్చే కూలీలు ఎర్రచందనం అడవుల్లోకి ఎలా, ఏ మార్గం ద్వారా ప్రవేశిస్తారో చెప్తున్నప్పుడు, అక్కడి డీటెయిలింగ్ ద్వారా, రచయిత ఈ కథ గురించి ఎంత అధ్యయనం చేశారో స్ఫురిస్తుంది. పొట్టకూటి కోసం ఎర్ర చందనం చెట్లు నరకడానికి వచ్చిన కూలీలు పోలీసులకి చిక్కి, జైళ్ళల్లో మగ్గుతుంటే, వీళ్ళని పంపిన ఏజంట్లు, పురమాయించిన స్మగ్లర్లు హాయిగా ఉంటారని ఈ కథ చెబుతుంది. “పెద్ద రావి చెట్టు కింద ఆపి వుంచిన జీపు పైన ఎండుటాకులు రాలి పడ్తున్నాయి. మానుపై వాలిన పక్షులు శబ్దం చేస్తున్నాయి” అంటూ మొదలైన ఈ కథ, “బయట పెద్ద రావి చెట్టు పైన అంతవరకూ శబ్దం చేస్తూ ఉన్న పక్షులు నిశ్శబ్దమయ్యాయి. చెట్టు కింద ఆపి వుంచిన జీపు పైన ఎండుటాకులు రాలి పడ్తున్నాయి” అంటూ ముగుస్తుంది.

“భయపడాల్సిందేమీ లేదు, మీరు సాగు చేసేది కూడా పంటే, కాకుంటే కొంచెం పోలీసులు దృష్టిలో పడకుండా చూస్కోండి..” అని చెప్తాడో వ్యక్తి, పేద రైతులకి. ఆ పంట పండించంలో ప్రమాదం ఉందన్న సూచన అర్థమవుతున్నా, వాళ్ళు ఇస్తామన్న డబ్బుకి ఆశపడి పంట వేసిన మునిరత్నంని భార్య చేసిన పని కలవరపెడ్తుంది, కంపరం కలిగిస్తుంది. ఆమెను తిట్టిపోస్తాడు. కానీ గుర్రమ్మ ముఖంలో మాత్రం నిన్నటి దాకా ఉన్న భయమేదో పోయి, ధైర్యం కనబడుతుంది. తమకు పట్టిన నరకం మబ్బు తొలగిపోయినందుకు సంతోషిస్తుంది. ఆమె తెగింపు ఏమిటో ‘తెల్ల దెయ్యం పూలు’ కథ చెబుతుంది.

ఉదయం పనికి వచ్చినప్పటి నుంచి మృగానికి చిక్కినట్టే ఉందని అనుకుంటాడు కోనప్ప ‘మృగత్వం’ కథలో.  ముంగీసల్ని వేటాడి, వాటిని చంపి,  ఆ తర్వాత వాటి శరీరంలో దూది కూరి బొమ్మలుగా మార్చి, రైళ్ళల్లో అమ్ముకునే కోనప్ప జీవితంలో ఎదురైన మానవ మృగాలు అతనికి ఏం పాఠం నేర్పాయి? అడవిలోని జంతువుల కన్నా, ఊర్లోని మనిషే ప్రమాదకరమని కోనప్ప తండ్రి ఎందుకు బావించాడో ఈ కథ చెబుతుంది.

“బయట వసారాలోని అద్దంపైన వాలిన పిచ్చుక అదేపనిగా ముక్కుతో శబ్దం చేస్తోంది. కదిరప్ప దాన్ని అదిలించడం నాల్గోసారి” అంటూ మొదలయ్యే ‘గరుడ పచ్చ’ కథ, “బయట వసారాలోని అద్దంపైన వాలిన పిచ్చుక అదేపనిగా ముక్కుతో చేస్తున్న శబ్దం వింటూ, వేపచెట్టు కొమ్మల నీడల్ని చూస్తున్నాడు కదిరప్ప” అంటూ ముగుస్తుంది. ప్రారంభంలో పిచ్చుకని అదిలించడానికి ప్రయత్నించిన కదిరప్ప, చివరికి వచ్చేసరికి దాన్ని అదిలించడం మానేసి, అది చేసే శబ్దాన్ని వినడం – జీవితంతో రాజీపడడానికి ప్రతీకగా అద్భుతంగా చిత్రించారు రచయిత. రంగురాయి దొరికితే జీవితం మారిపోతుందనుకుంటాడు కానీ ఇలా మారిపోతుందని అనుకోలేదు కదిరప్ప. భార్య చేసిన పనికి మండిపడతాడు. ఆమె మాత్రం తాను చేసిన పని సరైనదేనన్న నిశ్చింతతో పనికివెళ్తుంది.

కాలముఖం’ కథలో రచయిత ప్రస్తావించిన సమస్య గురించి బహుశా ఎక్కువమందికి తెలియకపోవచ్చు. పట్టణాళ్ళో, నగరాళ్లో ఇళ్ళలోని, రోడ్ల మీది డ్రైనేజీ మూతలు ఎత్తుకెళ్ళి అమ్ముకునే వాళ్ళ గురించి విన్నాం కానీ, పల్లెల్లో, పొలాల్లో అమర్చిన ట్రాన్స్‌ఫార్మర్‍లను బద్దలు కొట్టి, అందులోని రాగితీగలను దొంగిలించుకుపోవడం వినలేదు. చెర్లోపల్లి గ్రామంలోని పొలాల్లో రైతలు అమర్చుకున్న ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి, వాటిలోని రాగితీగలను, ఆయిల్‌ను అమ్ముకుంటే ఒక్కరోజులో దాదాపు 70 వేల రూపాయలు దక్కుతాయి. వ్యసనాలకి మరిగిన యువకులు రైతుల బతుకులలో చీకట్లు నింపారు. ముగింపులో మళ్ళీ అప్పుకై చిన్నారెడ్డి దగ్గరకి రైతు శివనాగులు వెళ్ళడాన్ని చెప్తూ, రచయిత రాసిన రెండు వాక్యాలు, అక్కడి దుస్థితిని కళ్ళకు కడతాయి.

పేదరికం నుంచి పుట్టిన నిస్సహాయతని దోచుకునే వారు వేర్వేరు రూపాలలో ఉంటారు. ఆడవాళ్ళూ ఇందుకు మినహాయింపు కాదు. ‘మయూరఖేదం’ కథలో నాగమణి అలాంటి మహిళే! నిరుపేద కుటుంబాలలోని ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని, వారి ఇళ్ళల్లోని ఆడపిల్లలని వ్యభిచార గృహాలకు అమ్మేసే వృత్తి ఆమెది. బెదిరించో బామాలో ఎందరినో తార్చి, ఆమె ధనవంతురాలవుతుంది. కానీ కాలం ఒకేలా ఉండదు. యువతులందరూ తెలివి లేనివారు కాదు. నాగమణిని పోలీసులకు పట్టించి, తనని తాను కాపాడుకోవడమే కాక, మరో ఇద్దరు యువతులను రక్షించిన దమయంతి తెలివైన అమ్మాయని ఈ కథ చెబుతుంది. “చీకటి బూజులో చిక్కుకున్న సాలీడు పెనుగులాట నుంచి బయటపడి, తన కొత్త లోకాన్ని మళ్ళీ నిర్మించుకుంటోంది” అన్న వాక్యంతో కథ ముగుస్తుంది.

ఎవరితో ఎప్పుడు ఏ బంధం ఏర్పడుతుందో ఎవరికీ తెలీదు. సంతలో ఎండు చేపలమ్మే ఆమె కూతురు అఖిలతో, కథకుడికి అటువంటి ఆత్మీయబంధమే ఏర్పడుతుంది. ఆమె తల్లి బాధపడినట్టే, అఖిలకున్న పిల్లికళ్ళను చూసి కథకుడు కూడా బాధపడతాడు. మిత్రుడైన ఓ నేత్రవైద్యుడిని సంప్రదించగా ‘క్యాట్ ఐ సిండ్రోమ్’ జబ్బు కాదనీ, రుగ్మత కాదనీ, అదో వైవిధ్యమనీ చెప్పడంతో అతని మనసు శాంతిస్తుంది. ఓ వారం తర్వాత సంతకెళ్తే, అక్కడ తల్లీ కూతుర్లు కనబడరు. సంత బోసిపోయినట్టుంటుంది. ‘నీలి కళ్ళ పిల్ల’ కథ చదివాకా, పాఠకులనూ కాస్తంత దిగులు ఆవరిస్తుంది.

ఇప్పుడైతే బొగ్గు ఇంజన్ల రైళ్ళు లేవేమో, కానీ ముప్ఫై ఏళ్ళ క్రితం ఉండేవి. అలాంటి ఓ రైలుబండి ప్రయాణాన్ని పాఠకుల కళ్ళకు కడుతుంది ‘బైరాగుల బండి’ కథ. అతిశయోక్తి కాదు, కథ చదువుతున్నంత సేపూ తామూ ఆ బండిలో ప్రయాణిస్తున్నామని పాఠకులకు అనిపిస్తుంది. కొన్ని జీవన సత్యాలను వెల్లడిస్తుందీ కథ.

కొడుకుని బడి మాన్పించి, తనతో పాటు తీసుకెళ్ళి పని చేయిస్తూ, భర్త పిల్లాడి చదువుకి ఆటంకమవుతున్నాడని తెలుసుకున్న తులసమ్మ మొదట మెల్లిగా చెప్పి చూస్తుంది. భర్త మారడు, పిల్లాడ్ని మళ్ళీ మళ్ళీ బడి మాన్పించి తీసుకుపోతూనే ఉంటాడు. వేసారిపోయిన తులసమ్మ, కార్యక్రమం జరుగుతున్న చోటకి వెళ్ళి మొగుడ్ని చెంప మీద కొట్టి, కొడుకుని తీసుకొచ్చి బడిలో వదిలిపెడుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి – ఎవరూ ఊహించని పని చేస్తుంది. ‘గజ్జెల పిల్లోడు’ కథలో కొడుకుని ప్రయోజకుడిని చేయాలన్న తల్లి తపన నిలువెల్లా కనిపిస్తుంది.

ఒక్కప్పుడు ఆమోదనీయమైన కొన్ని వృత్తులు, కొన్నాళ్ళకు ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పు వల్ల మూలబడాల్సి వస్తుంది. ‘బొగ్గుల మనిషి’ కథ అలాంటిదే. వ్యవస్థలలోని అవస్థలను అధిగమించడానికి ప్రయత్నించి, చేతకాక, కొత్త పనిని వెతుక్కోవాలనుకుంటాడతను. కానీ తమ మీద ఆధారపడిన ఇస్త్రీ బండి వెంకటేశు గుర్తొచ్చి బాధపడతాడు. కథలో ‘ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకుంటున్నాయి’ చివరి వాక్యం ద్వారా – బొగ్గు లేక ఉపాధి లేక నలుపు పులుముకుంటున్న బొగ్గుల మనిషి జీవితాన్ని ప్రతీకాత్మకంగా వెల్లడించారు రచయిత.

ప్రపంచీకరణ ఫలితాలని సూక్ష్మంగా, ఒక్క వాక్యంలో చెప్పారు రచయిత ‘జెయింట్ వీల్’ కథలో. గుర్రపుబళ్ళని రిక్షాలు, రిక్షాలని ఆటోలు, ఆటోలని టాక్సీలు మింగేసినట్టుగా, రంగులరాట్నాన్ని జెయింట్ వీల్ మింగేసింది. అయితే జెయింట్ వీల్ కంటే ఎత్తైన, ఉన్నతమైన మనిషి తారసపడడం, అతడు చేసిన ఆ పని – కథకుడితో పాటు పాఠకులకు సంతోషాన్నిస్తుంది.

జమీందారీ బంగ్లా’, ‘ఒంటికాలి కాకి’ కథలు ఆసక్తిగా చదివిస్తాయి.

పాండవుల పాత్రలతో అల్లిన ‘సహదేవుడి వేణువు’ కథ చక్కని సందేశాన్నిస్తుంది. కళాకారుడి గొప్పతనం అతను ఉపయోగించే వాయిద్యంలో ఉండదు, సాధనలో ఉంటుందన్న నిజాన్ని మరోసారి గుర్తు చేస్తుంది.

పుస్తకానికి శీర్షికగా పెట్టిన పేరున్న ‘గంగమ్మ పూలు’  కథ ఈ పుస్తకానికి కలికితురాయి వంటిది. ఏనుగు నల్లరాతి కొండ, ఆ కొండ మధ్యలో నల్లరాతి బండ, బండ మధ్యలో గవి.. కథాస్థలంలోకి మనల్ని ట్రాన్స్‌పోర్ట్ చేసి- అక్కడి గంగమ్మ జాతరని, నీటి కోసం తపించే పేదల ఆర్తిని, వానలు లేక బోరు వేయించుకుందామంటే ఎంత తవ్వినా నీరు పడకపోవడంలోని వేదనని చూపిస్తారు రచయిత. జాతర జరిగాకా, వాన కురిసి, గవి నిండి నీళ్ళు ప్రవహించడంతో కథ ముగుస్తుంది.

~

చాలా కథలలోనూ ప్రారంభించిన వాక్యాలనే, స్వల్పంగా మార్చి, మార్చిన ఆ వాక్యాలతోనే కథంతా అర్థమయ్యేలా ముగించారు రచయిత. ఇది చాలా గొప్ప టెక్నిక్. ప్రారంభ వాక్యాలకీ, ముగింపు వాక్యాలకి మధ్య వ్యథ, వేదన, వడలిపోయిన ఆశల పూలూ, మసకబారిన జీవితాలూ కనబడతాయి. అంతటి దిగులులోనూ, ఆయా పాత్రలు తమ జీవితాలను మరో రకంగా ముందుకు నడుపుకునే దిశగా సాగడం రచయిత ప్రదర్శించిన ఆశావాదానికి నిదర్శనం.

బడుగులు, బలహీనుల నిస్సహాయ జీవితాలు, నేటి కన్నా రేపు బాగుంటుందేమోనన్న చిన్న ఆశ, పేదలైనా ఆత్మగౌరవంతో జీవించాలన్న కోరిక, లేమిని ఆధారంగా చేసుకుని ప్రలోభపెట్టే దళారులు, బతుకు బాగుపడితే చాలనుకుని చట్టమనే చట్రంలో ఇరుక్కుపోయే సామాన్యులు.. ఈ సంపుటిలోని పాత్రలు. చీకటి నుంచి వెలుగువైపుకి పయనించాలన్న బలమైన కోరిక ఉన్నవారు, కాస్తంత ఆధారమూ, భరోసా వారికి దొరికితే, తాము బాగుపడి తర్వాతి తరాలను బాగుచేసుకుంటారు. మరి సమాజం ఆ భరోసాని ఇవ్వగలదా? ఇవ్వాలని సూచించే కథల సంపుటి ఇది. ఈ పుస్తకాన్ని యూనికోడ్‍లోనే ముద్రించడం విశేషం!

***

గంగమ్మ పూలు (కథలు)
రచన: డా. వేంపల్లి గంగాధర్
పేజీలు: 131
వెల: ₹ 150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000413413
డా. వేంపల్లి గంగాధర్
9440074893
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/gangamma-poolu?

 

~
డా. వేంపల్లి గంగాధర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-dr-vempalli-gangadhar/

Exit mobile version