[అల్లూరి గౌరీలక్ష్మి గారు రచించిన ‘మలిసంజ కెంజాయ’ అనే నవలపై వ్యాసం అందిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ.]
“ఆరు పదులు దాటిన తర్వాత జీవితం అంటే బంధనాలు వదిలించుకునే వయసు. ఇన్నాళ్లూ చెయ్యని, చెయ్యలేని మంచి పని ఒకటి ఇతరుల కోసం చేస్తూ, ఏదైనా ఒక కీర్తన నేర్చుకుంటూ, అప్పుడప్పుడు నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఒంటరి జీవితాన్ని ప్రశాంతంగా బ్రతుకుతూ, ఈ బతుకు పట్ల మమకారాన్ని మోహాన్ని నెమ్మది నెమ్మదిగా విడిచి పెట్టేయాల్సిన తరుణం..”


విశాల అనే పాత్ర ద్వారా రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి చెప్పిన ఈ మాటలే ‘మలిసంజ కెంజాయ’ నవలకి మూల సూత్రాలు.
ఉగాది రోజున పార్వతమ్మ, వసంత పాత్రలతో మొదలైన ఈ నవలని మళ్లీ ఉగాది నాటికి ఈ రెండు పాత్రలతో ముగించారు రచయిత్రి. ఈ మధ్యలో కెంజాయిలో మెరిసే ఎన్నెన్నో పాత్రలు – రామచంద్రం, ప్రమీల, భార్గవి, స్వరూప, జ్యోతి, నిర్మల, సుగుణ, విశాల, మాధవ. నవలా నేపథ్య వేదిక కోనసీమ అందాలు, తెలుగు లోగిళ్ళ చందాలు అయినా, ఇందులో చర్చించబడిన సమస్యలు భారతదేశంలో – ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్న వృద్ధుల గాథలు. వారి శారీరక మానసిక అనారోగ్యాల, కుటుంబ సంబంధాల వ్యథలు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ జీవితపు గూళ్ళు వాళ్లు నిర్మించుకున్నాక, బోసిపోయిన గూటిలోని నిట్టూర్పుల సెగలు. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఆశలు, ఆశయాలు, అప్పులు, ఆస్తులు వంటి తాపత్రయాలతో కూడిన పరుగులతో జీవితం గడిచిపోయిన తర్వాత.. ఒక్కసారిగా అన్నీ అయిపోయి, అన్నీ ఆగిపోయిన నిశ్శబ్దం. భరించలేని నిరాసక్తత. ఒకరికి ఒకరుగా మిగిలిపోయిన వృద్ధ దంపతుల మౌన సంభాషణం. ఒకవేళ ఇద్దరిలో ఒకరు శాశ్వతంగా దూరమైపోతే, ఒంటరిగా జంటను వీడి మిగిలిపోయిన ప్రాణి ‘సఫకేషన్’. ఊపిరాడనితనం.
ఇలాంటి తరుణంలోనే మాటల కోసం వెతుకులాట. సానుభూతి కోసం వెంపర్లాట. మనసులో పెల్లుబికే ఆవేదనను సావధానంగా వినే ఒక శ్రోత కోసం ఆరాటం. ఓదార్పునిచ్చే ఒక స్నేహ హస్తం కోసం ఎదురుచూపు. అది తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఒకోసారి కన్నబిడ్డలూ కావచ్చు. వయసుతో సహజంగా వచ్చే అనారోగ్యాల కంటే, పిల్లలు దూరప్రాంతాల్లో ఉండటం కంటే, దగ్గరగా ఉన్నా మానసికంగా ఎన్నో మైళ్ళు దూరంగా ఉన్నట్లు అనిపించడమే భరించలేని బాధ.
ఈ నవలలో ప్రధానంగా రచయిత్రి చెప్పింది జీవన సంధ్య లోని ఒంటరి చక్రవాక విషాద రాగం. అసలే భర్త చనిపోయిన బాధలో ఉండి, బిడ్డలు ‘న్యాయం’గా కోరుకునే ‘స్పేస్’ని అర్థం చేసుకోలేక, అనుబంధాలు దూరమై, ఆత్మీయత కోసం ఎదురుచూసే తల్లుల దుఃఖం. ఒక పలకరింపు కోసం, ఒక ఓదార్పు కోసం భారంగా రోజులు వెళ్ళదీయటం, వదిలించుకోలేని పాశంతో అల్లాడటం చదువుతున్నప్పుడు – ఇందులోని పాత్రలతో, సంఘటనలతో ఆరు పదులు దాటిన వయసు వారు ఏదో ఒక సందర్భంలో తమను తాము దర్శించుకుంటారు.
ఇంటింటి కథలే ఈ నవలలో రచయిత్రి గౌరీలక్ష్మి చెప్తారు. ఊహాజనిత పాత్రలు, సన్నివేశాలు ఎక్కడా కనపడవు. కోడళ్ళ ప్రవర్తనలోని లోపాల్ని నలుగురికి చెప్పుకోవచ్చు. కానీ కూతుళ్ల ప్రవర్తన, పైకి కనిపించే వేధింపులు, కనిపించని సాధింపులు ఎలా చెప్పుకోగలరు! మనసు చివుక్కునేలా ఉండే వారి ప్రవర్తన, ‘మా అమ్మే కదా’ అని చులకనగా, తీసిపారేసినట్లు, చనువుగా, కొద్దిగా ఎదిరించినట్లు, విసుగ్గా అనే మాటలను బయటి వారికి ఎలా చెప్పుకోగలరు! లో లోపల ఎలా భరించగలరు!
“చిన్నప్పటినుండి నువ్వు చెప్పినట్లే విన్నాం కదా. మా పెళ్లిళ్లు అయి మాకు పిల్లలు పుట్టాక కూడా ఇంకా నీ మాటే చెల్లాలంటే ఎలా” అని విసుక్కునే పిల్లల్ని విస్తుబోయి చూడటం తప్ప ఏమి చేయలేని ‘సీ’నియర్ సిటిజన్స్. కొందరు కొడుకులు ఏదో బాధ్యతగా ‘దగ్గర’ ఉంచుకొంటారు కానీ అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తారు. కోడళ్ళు వంటలు చేసి టేబుల్ మీద పెడతారు కానీ మాట్లాడారు. ఒకవేళ మాట్లాడినా అవి పుల్లవిరుపు విసుర్లు. అలాంటి వాళ్ళ దగ్గర ‘పడి ఉండటం’ కంటే తమదైన సొంత గూటిలో పడి ఉండటం మేలు అనుకుంటారు చాలామంది.
ఎనభై ఏళ్ల పార్వతమ్మ అలాంటి ఆత్మాభిమాన మనస్తత్వం గల మహిళ. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, వాళ్లకి పిల్లలు, వారి పిల్లలు ఉన్నా, వసంత వెంకట్రావుల ఇంటిలో ఒక పోర్షన్లో తన బ్రతుకు తను బ్రతుకుతూ ఉంటుంది. వసంత, వెంకట్రావు లకు ఒక కొడుకు కూతురు ఉన్నా వాళ్లూ తమ ఇంటిలో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటారు. వసంత కూతురు నిర్మలకి అమ్మలో ఎప్పుడూ ఒక ‘టీచర్’ కనబడుతూ ఉంటుంది చిన్నప్పటినుంచి. చదువు, క్రమశిక్షణ అంటూ ఉండే తల్లి పట్ల ఒక నిరసన, విముఖత పెంచుకుంది. దానికి తోడు ఒక కలవారింటికి కోడలుగా వెళ్లడంతో ఈ మధ్యతరగతి తల్లి పై ఏదో పైచేయి సాధించానన్న తృప్తితో ఏది తోస్తే అది విసురుగా మాట్లాడుతుంది. విదిలింపుగా ప్రవర్తిస్తుంది. ఆస్తి కలవారైనా నిర్మల అత్తగారు చాలా మర్యాదగా, సంస్కారవంతంగా వియ్యపురాలితో గౌరవంగా మాట్లాడుతారు. వసంత తన కూతురి ప్రవర్తనతో ఎన్నోసార్లు చిన్నబుచ్చుకొని భర్తకు చెప్పినా, కొడుకుకి చెప్పినా వాళ్లు అర్థం చేసుకున్నట్టు లేదు. అమ్మే కదా అని దబాయించి విదిలింపుగా మాట్లాడటం, ఆమె సేవలు పొందటం తన హక్కు అన్నట్లు ప్రవర్తించడం సహించలేకపోతుంది వసంత. ఈ నిర్మల గురించి చెప్తే కొందరు నమ్మరేమో కానీ అలాంటి కూతుర్లు చాలామంది ఉంటారన్నది సత్యం.
ప్రేమించి, ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న కూతురు చాలా సంవత్సరాలకి పిల్లాడిని ఎత్తుకొని కనిపించినప్పుడు ఆ తండ్రి రామచంద్రం ఆనందించినా, ఆమె పుట్టింటికి రాకపోకలు సాగిస్తూ, ‘చెల్లికి కట్నం ఇచ్చి పెళ్లి చేశారుగా. మరి నాకేం ఇస్తారు’ అని అడిగినప్పుడు అవాక్కవడం నమ్మలేని నిజమే.
మన చేతుల్లో పెరిగిన మన పిల్లే మనల్ని అర్థం చేసుకోకపోతే వేరే ఇంటి నుండి వచ్చిన కోడలేం అర్థం చేసుకుంటుంది!
ఎవరి ఉద్యోగాలు వారివి, ఎవరి సంపాదన వారివి అయిపోయాక, బాల్యంలో అన్నదమ్ములు తమపై చూపిన ప్రేమానురాగాలు ఇప్పుడు లేవేమిటి! ఎక్కడుంది లోపం! అని బాధపడే అక్కాచెల్లెళ్ల ఆవేదనకి జవాబు దొరకదేమో! స్వరూప, జ్యోతి లదే కాదు ఈ బాధ, చాలామంది అక్కచెల్లెళ్లది.
కోడళ్ళ తీరు గురించి చెప్తూ – “ఈ కోడళ్ళకి ‘మనమెప్పుడూ ముసలోళ్ళం అవ్వం. మాకు శక్తి ఉంది’ అని విర్రవీగుతారు. మాలాంటి వయసు ఒకరోజు ఆళ్ళకీ వత్తదండి. అప్పుడు మేము ఉండమనుకోండి” అని ఒక చదువు రాని పనిమనిషి ఆక్రోశం. అవును. అత్తలు మామలు ముసలోళ్లు, బరువుచేటు అనుకొనే కోడళ్ళకీ రేపటి రోజున మనమూ ముసలోళ్ళం అవుతాం అన్న ఇంగిత జ్ఞానం ఉండదేమో!
ఆ మధ్య ఎవరో ఒక పెద్దాయన అన్నారు – “అమ్మా నాన్న నా దగ్గర ఉండటం కాదండీ, నేనే వారి దగ్గర ఉంటాను భార్యా పిల్లలతో!” అర్థం ఒకటే కావచ్చు, కానీ ఎంత బాగుంది అలా చెప్పడం!
విశాల మాధవల కథ కూడా నిజ జీవితానికి దర్పణం వంటిదే. కాలేజీలో కళ్ళతోనే ప్రేమని వ్యక్తం చేసుకుని, గత్యంతరం లేని కుటుంబ ఒత్తిడుల వల్ల వేరే వేరే పెళ్లిళ్లు చేసుకొని, ముప్పై అయిదేళ్ళ తర్వాత కలుసుకున్నారు విశాల మాధవ. ఇద్దరూ జంటను కోల్పోయిన వారే. తన మనసులోని ప్రేమని ఇన్నాళ్ళకైనా వెల్లడించిన మాధవ ‘సహజీవనం’ అన్న ప్రపోజల్ చేస్తే నిదానంగానే అయినా, నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది విశాల – “భర్తనీ పిల్లల్ని చూసుకుంటూ ముప్పై అయిదేళ్లు గడిపేసాను. ఇప్పుడిప్పుడే ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాను. కొత్తగా బంధాలు బాధ్యతలు తగిలించుకోలేను. కొత్త బంధానికి న్యాయం చేయలేను”. ఒక రకంగా ఇది మంచి నిర్ణయం అని చెప్పవచ్చు.
చిన్నప్పుడు నుంచి చురుగ్గా ఉండి తమకు అన్నీ చేసి పెట్టిన అమ్మ ఎప్పటికీ అలానే ‘బానే’ ఉంటుంది అనుకుంటారు కానీ పెద్ద వయసు వచ్చేసిందని, తమ అవసరం కోరుకునే వయసదని ఊహించలేరు. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి, టెస్టులు చేయించి, మందులు కొనేసి, ఇచ్చేసి, ఇక బాధ్యత తీరిపోయినట్టు భావిస్తారు. ఆ మందుల కన్నా కన్నబిడ్డల సామీప్యం, మాటలు, స్పర్శ ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని పెద్దల మనసులోని భావాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. వీరు నోరు విడిచి చెప్పలేరు. ఏదో తెలియని మంచు తెరలు! అనారోగ్యం గురించి చెప్పిందే చెప్తుంటే చాదస్తం అని కొట్టి పారేస్తారు కానీ నిజమని గుర్తించేసరికి ‘అంతా అయిపోతుంది’. అయితే, పరీక్ష ఫెయిల్ అయిన, ప్రేమ ఫెయిల్ అయిన యువత ఆత్మహత్య చేసుకోవడం చూస్తాం కానీ, ఒక మూలన ఉన్న ముసలమ్మ ఆత్మహత్య చేసుకోవడం చూస్తామా! ఎంతో జీవితాన్ని చూసినవారు, జీవిత తత్వాన్ని తెలుసుకున్న వారు.
‘వెంకటలక్ష్మి పెద్దల ఆశ్రమం’ని వెంకటేశ్వరరావు గారు నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు 30 మంది అక్కడ ఆనందంగా ఆరోగ్యంగా కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. వచ్చి మీద పడే వృద్ధాప్యం కాదనలేని సత్యం. కానీ తన కన్నకొడుకు భార్య మాటను కాదనలేక “నువ్వు ఈ ఇంట్లోనే ఉండమ్మా. అన్నీ నేను చూసుకుంటాను” అని వెళ్ళిపోతాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న దుర్గమ్మ ఆ ఇంటికి తాళం వేసి, పక్కింట్లో ఇచ్చి వెంకటలక్ష్మి ఆశ్రమానికి వచ్చేస్తుంది. ఓపిగ్గా అన్ని పనులు చేస్తుంది. స్నేహంగా అందరితో మాట్లాడుతుంది. కానీ ఎన్నిసార్లు వచ్చినా కొడుకు మొహం చూడదు. మనసు విరిగిపోయింది, వాడి దగ్గరకు వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని ధీమాగా, కచ్చితంగా చెప్తుంది. ఈ పరిస్థితిని ఎందరో ఎదుర్కొంటారు. కానీ దుర్గమ్మలా ఎందరు గట్టిగా నిలబడగలరు!
ఆశ్రమానికి వచ్చిన ప్రవచనకర్త రామ్మారుతి గారి పలుకులు ‘మలిసంజ కెంజాయ’లో గుర్తుపెట్టుకోవాలి – “నలుగురితో ఉండటం ఆనందం, ఏకాంతంగా ఉండటం బ్రహ్మానందం. ఏకాంతం దొరకటమే అదృష్టం అనుకోవాలి. చాలామంది ఒంటరిగా ఉంటూ నా అని తమ మీద తామే జాలి పడుతూ ఉంటారు. ఒంటరితనాన్ని అందమైన ఏకాంతంగా మలుచుకోవటం మన చేతుల్లోనే ఉంది. మనలోకి మనం వెళ్లడానికి అది మంచి అవకాశం అదొక అభ్యాసం, సాధన. సమస్యలు పూర్తికావడం అంటూ ఉండవు, మళ్లీ కొత్తవి వస్తూ ఉంటాయి వాటిని పరిష్కరించుకుంటూ పోవటమే మనం మార్గం తప్ప కృంగిపోయి ఆరోగ్యం పాడు చేసుకోవటం కాదు. తెలివైన వాళ్లు పరిస్థితి ఎలా ఉన్నా ఆనందంగా ఉంటారు”.
చూడడానికి చిన్న సమస్యగా ఉన్నా, వినడానికి సిల్లీగా అనిపించినా – వైద్యరంగం అభివృద్ధి చెందడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల గతంలో కంటే ఆయుః ప్రమాణం పెరిగింది. వృద్ధుల సంఖ్య పెరిగింది. వారి సమస్యలూ పెరిగాయి. వారు లోలోపల బాధ పడతారే తప్ప బైటకు వెల్లడించరు.
అంతా యువతరం తప్పేనని పిల్లలే దుర్మార్గంగా ఆలోచిస్తారని ప్రవర్తిస్తారని అనుకోకూడదు. పెద్దల చాదస్తం కూడా ఒక్కోసారి భరించలేనిది. అందుకే అరవై ఏళ్లు దాటాక మన ప్రవర్తన పరిణతి చెందిందిగా ఉండాలి. ఊసుపోని కబుర్లు మనం చెప్పకూడదు. మన చుట్టుపక్కల ఎవరూ చెప్పకుండా కూడా చూసుకోవాలి. ఇంకా ముఖ్యమైన సంగతి ఆత్మస్తుతి, పరనిందా మానేయాలి. ‘నేను, నేను’ అన్న అహంకారం తప్పించుకోవాలి. నేను ఇంత, నేను అంతా అన్న వివరాలు మర్చిపోవాలి. అసలు 60 ఏళ్లు దాటాక ఎంతో జీవితాన్ని చూసాం కదా అన్న నిదానం రావాలి. అంటే మనం తగ్గాలి. మనకన్నా చిన్నవాళ్లు కుప్పి గంతులు వేస్తుంటారు. చూడాలి. గింజుకోకూడదు. ఓర్చుకోవాలి. కొన్నాళ్ళు పోయాక, కాస్త వయసు పెరిగాక వాళ్లు తెలుసుకుంటారు. అంతవరకు మన ఓపిక పట్టాలి తప్ప వాళ్లతో తలపెడితే నష్టపోయేది మనమే.
ప్రవచన కర్త రామ్మారుతి చేత చెప్పిస్తారు రచయిత్రి. – ఈ జీవితం అంటే ఒక ఆట. అప్పుడప్పుడు ఎవరో ఒకరు అవుట్ అయ్యి మన మధ్య నుంచి మాయం అవుతూ ఉంటారు. కానీ ఆట ఆగదు. ఆడాల్సిందే. ఆధ్యాత్మిక చింతనలో పడాలి. జగమంతా ప్రేమమయం అని నమ్మాలి. 70 ఏళ్ళు దాటాక మౌనాన్ని ఆశ్రయించి లోపలి వెలుగు కోసం ప్రయత్నించాలి.
‘వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్’ అనే మాస పత్రిక వయోవృద్ధుల గుండె చప్పుడు. శ్రీ సుధామ గారు మూడు సంవత్సరాల పాటు ‘సీ’నియర్ కబుర్లు కాలమ్లో వయో పౌరులకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించారు.
“‘సీ’నియర్ అంటే దగ్గరగా చూడమని. ఏదయినా సమీపం నుండి దగ్గర గా పరిణతితో పరిశీలించినప్పుడే ఆ విషయపు లోతుపాతులు బాగా తెలుస్తాయి. జీవితాన్ని అలా దగ్గరగా చూసి అనుభవం గడించినవారు కనుకనే సీనియర్ సిటిజన్స్ అయ్యారు.. ఈ వయసు వచ్చాక మొహమాటం అనేది అనవసరం. స్ట్రెస్ మేనేజ్మెంట్ – ఒత్తిడిని నిర్వహించుకునే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అదనపు బాధ్యతలు వంటి వాటికి ఒప్పుకోకండి ఇంట్లో వారికైనా కాదు కుదరదు అని కచ్చితంగా చెప్పండి. ఆందోళన కలిగించే వాటిని మిమ్మల్ని సతాయించే వాటిని మీలోనే మనుచుకోవడం మంచిది కాదు. మీ మనోభావాలను వెల్లడించడానికి సంకోచించకండి. వృద్ధాప్యం ఒక భిన్నమైన జీవనదశ. ఆ దశలో జీవితాన్ని ఏ బాదరాబందీలు లేకుండా స్థిమితంగా ప్రశాంతంగా గడపాలి. శారీరక ఆరోగ్యం కొంత మీ చేతుల్లో లేకపోవచ్చు కానీ మీ మానసిక ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లో ఉన్నది లేనిపోని మమకారాలు ఆందోళనలను పడకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతత కోసమే ప్రయత్నించాలి. చిరాకుతో కోపంతో కాక సంయమనంగా వ్యవహరించగలగాలి. వృద్ధాప్యం అనేది జీవిత సహజ పరిణామం. క్రమాగత దశకు సంతోషంగా ఆహ్వానించాలే కానీ అదేదో జీవితం లోని ఆపత్తుగా తలవడం తగని పని” అంటారు.
పిల్లల కొరకు పీడియాట్రిక్స్ విభాగం ఎలా ఉందో, ‘రెండో బాల్యం’ లోని వృద్ధులకు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా వైద్య విభాగం ‘జిరియాట్రిక్స్’ ప్రాచుర్యం లోకి వస్తోంది. సెప్టెంబర్ 10న ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో బి. నర్సన్ ‘జేరియాట్రిషియన్స్’ గురించి బాగా వివరించారు. ఒక్కోవ్యాధికి ఒక్కో విభాగపు డాక్టర్ దగ్గరికి వెళ్లే బదులు ఈ కోర్స్ చేసిన డాక్టర్ ఉంటే, అన్ని రుగ్మతలకు ఒకే డాక్టర్ దగ్గరికి వెళితే సరిపోతుంది. ఒక మందుకి ఇంకొక మందుకి పడక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం తక్కువవుతుంది. వృద్ధుల వైద్యం పట్ల, ఆ పేషంట్ పట్ల అతనికి అవగాహన ఉంటుంది న్యూజిలాండ్లో చాలా డిమాండ్, గౌరవం ఉన్న కోర్స్ ఇది. (అక్కడ చదివి వచ్చి హైదరాబాద్లో అపోలో లో ఒక డాక్టర్ చాలా బిజీగా ఉన్నాడు.) ఎంబిబిఎస్లో ఇది ఒక సబ్జెక్టుగా ఉంచాలని సీనియర్ సిటిజన్స్ మన ప్రభుత్వాన్ని కోరితే ఉపయోగకరంగా ఉంటుంది.


చెరగని చిరునవ్వుతో, నిండైన ఆత్మవిశ్వాసంతో, స్నేహ సౌరభాలు వెదజల్లుతూ, సున్నిత మనస్తత్వం గల గౌరీలక్ష్మి వయోవృద్ధుల మనసు పొరల్లోకి తొంగి చూసి ఇలాంటి నవల రాయడం చాలా సహజం. చదివినదీ, చేసిన ఉద్యోగమూ పౌర సంబంధాలు కనుక సున్నితమైన మానవ సంబంధాలు పట్ల ఆమెకు సంపూర్ణ అవగాహన ఉంది. సమాజాన్ని పరిశీలించే నేర్పు ఉంది. ఈ నవలలో తను చెప్పదలుచుకున్న పాయింట్ను దాటి ఎటూ వెళ్ళకుండా, తను ఏకాగ్రతతో ఉండి, పాఠకులనూ ఆలోచింపజేసారు.
వయోవృద్ధుల శారీరక మానసిక సమస్యలు గురించి పత్రికలు, సమావేశాలు అరాకొరా ఉన్నా, నేటి కాలంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లే – సమాజంలో, కుటుంబంలో వారి పట్ల సరియైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి, మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తన వంతుగా ఈ మంచి సీరియల్ రాసిన శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారిని అభినందించాలి. అక్రమ, సక్రమ ప్రేమలు, సంబంధాలు కథల ప్రవాహంలో కొట్టుకుపోకుండా మేలిమి బంగారం లాంటి సీరియల్స్ని ప్రచురిస్తున్న ‘సంచిక’ సంపాదకులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.

28 Comments
శీలా సుభద్రాదేవి
అల్లూరి గౌరిలక్ష్మి పదవీవిరమణ అనంతరం సీనియర్ సిటిజన్స్ పరిధిలోకి వచ్చాక తనచుట్టూ బంధుమిత్రుల జీవితాలను, పరిశీలనలోకి వచ్చిన అనేకానేక వృద్ధాప్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని నవల రాసిందని భావిస్తున్నాను.నేను నవల చదవలేదు కానీ సున్నితమైన భావనలతో సరళంగా సానుకూల దృక్పథంతో రాసే గౌరిలక్ష్మి రచనావిధానం నాకు తెలుసు. అటువంటి నవలను సుశీలగారూ అంతే భావసంచలనంతో,ఉద్వేగంతో హృదయంలోంచి ఈ వ్యాసాన్ని రాసినట్లుగా ఉంది.సుశీలగారి వ్యాసాలలో చెప్పుకోదగిన మంచి వ్యాసంగా నేను భావిస్తున్నాను.స్నేహితురాళ్ళు గౌరిలక్ష్మికీ,సుశీలగారు మనసారా అభినందనలు
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
G. S. Lakshmi
నవల ఆద్యంతం మనసును ఆకట్టుకుంది. వయసు పెరుగుతున్నకొద్దీ మనసును కూడా ఎంత విశాలం చేసుకోవాలో ఈ నవలలోని పాత్రల చేత చక్కగా చెప్పించారు రచయిత్రి గౌరీలక్ష్మిగారు.
అంతే గొప్పగా నవలలోని ఆయువుపట్టు పట్టుకుని, దానిని సమీక్షించారు ప్రొఫెసర్ సుశీలమ్మ గారు. ఇరువురికీ అభినందనలు.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
అల్లూరి Gouri Lakshmi
Madam Subhadra గారికీ GS Lakshmi గారికీ బహు కృతజ్ఞతలు..ధన్యవాదాలు..Dr.సుశీల గారు నవలంతా చదివి సమీక్ష రాయడం నాకు పరమ సంతోషం గా ఉన్నది..ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం చిన్న మాటవుతుంది.I am really grateful to you సుశీల గారూ.
Lalitha Goteti
గౌరీ దేవి నాకుమంచి స్నేహితురాలు
సుశీల గారూ కూడా.ఇరువురి అభివ్యక్తి
నవలకూ,విమర్శకూ అందం తెచ్చాయి.
హృదయపూర్వక అభినందనలు.
లలితాశేఖర్.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
కొల్లూరి సోమ శంకర్
నా చిన్న ‘నాటి’ సహాధ్యాయి, స్నేహితురాలు, నేటి ఆత్మీయురాలు, శ్రేయోభిలాషి, ప్రభుత్వ సంస్థలో పౌరసంబంధాల ఉన్నతోద్యోగిగా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ చేసిన ప్రముఖ రచయిత్రి ‘అల్లూరి గౌరి లక్ష్మి ‘ సీనియర్ సిటిజన్స్ సాధకబాధకాలు, వారి అసంతృప్తి, శేష జీవితంపై నిరాసక్తత, వారి జీవన శైలి ఇత్యాది కోణాల్ని తనదైన రీతిలో స్పృశిస్తూ, వాటికి పరిష్కార మార్గాల్ని కూడా సూచిస్తూ, జీవితంలోని మలిదశను, మెరుగైన మలుపుతో, ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు సలహాలను, సూచనలను తన ధారావాహిక నవల ‘మలిసంజ కెంజాయ’ ద్వారా విజయవంతంగా వెలిబుచ్చారు.
చాలా మంది సమయాభావం వల్ల కానేమీ, ఈ వయసులో పూర్తి నవల చదవగలగే శక్తి, ఆసక్తి లేక చదవలేక పోవచ్చు. అటులనే, నవల పూర్తి పాఠం ఒక పుస్తకంగా ఇంకా వెలువడని కారణంగా, ఆసక్తి వున్నవారికి కూడా అందుబాటులో లేదు.
కానీ ప్రొఫెసర్ . సి.హెచ్.సుశీలమ్మ గారు, మరో రచయిత్రి, ఈ నవలపై రాసిన సమీక్ష ద్వారా, ఖచ్చితంగా నవలలోని పూర్తి సారాన్ని , మొత్తం సారాంశాన్ని మనకు వివరించారు.
ఇది మన సీనియర్ సిటిజన్స్ అందరికీ చాలా ఉపయోగకరంగా వుంటుందని, మార్గదర్శకమవుతుందనే ఒక చిన్న తలంపుతో, ఈ సమీక్షను, ఈ సీనియర్ సిటిజన్ల గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాను.
నేటి సమాజ చిత్రానికి అద్దంపట్టే సమస్యని, ఇతివృత్తంగా తీసుకొని, తన పరిధిలో పరిష్కార మార్గాలు చూపిన ‘మలిసంజ కెంజాయ’ రచయిత్రి, గౌరి లక్ష్మి గారు, నవలకు ఉత్తమ సమీక్ష రాసిన శ్రీమతి సుశీల గారు అభినందనీయులు.
మన సీనియర్ సిటిజన్లందరినీ ఈ సమీక్ష చదవవలసిందిగా, ఈ మాధ్యమం ద్వారా అభ్యర్థిస్తున్నాను.
ముళ్ళపూడి వెంకటరమణ
కొల్లూరి సోమ శంకర్
Suseelamma gari vrasinadhi chadhivanura aavida antha kshunnamga motham pathralanni antho avagahanatho manasulo mudhrinchukoni parisilana chesi vrasinadhi ani avvarikaina ardhamavuthundhi
గాయిత్రి
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
కొల్లూరి సోమ శంకర్
*ఇది శ్రీమతి దాసరి శివకుమారి గారి స్పందన*
మలిసంజె కెంజాయ నవల ఈనాటి వృద్ధుల మనసులను చదివి ఎంతగానో స్పందించి వ్రాసినట్లుగా పాఠకులకు అనిపిస్తుంది. రచయిత్రి ఒక మంచి నవలను సంచిక ద్వారా అందించారు. ఉమ్మడి కుటుంబాలు లేని ఈరోజుల్లో ఒంటరి జీవితాలు పడే ఆవేదననే అక్షరబద్ధం చేసినందుకు రచయిత్రి గారికి చాలా అభినందనలు.
ఈ నవలను మనసుతో చదివి పూర్తిగా ఆస్వాదించి తమ చక్కని వరవడిలో మంచి విశ్లేషణను ప్రొఫెసర్ సుశీలమ్మ గారు సంచిక పాఠకులకు అందించిన అందులకు వారికి కూడా అభినందనలు. మరియు ధన్యవాదములు.
ఇలాంటి మంచి రచనలను అందిస్తూ అటు రచయితలను ప్రోత్సహిస్తూ, ఇటు పాఠకులకు ఎంతో మేలు చేస్తున్న సంచిక వారికి ఎన్నో కృతజ్ఞతాపూర్వక వందనములు.
ఇటీవల లండన్ నుంచి వచ్చినటువంటి ఒక వృద్ధుల డాక్టర్ గారు గుంటూరులోని లక్ష్మణస్వామి గారి హాస్పిటల్ లో పనిచేస్తున్నారు.
గుంటూరులోని లక్ష్మణ స్వామి గారి హాస్పిటల్ పేరు’సంజీవని’. హాస్పిటల్ లో పనిచేసే వృద్ధుల డాక్టర్ గారి పేరు ఏ. సృజన కుమార్ గారు.
ఈ సమాచారం ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమోనని ఇలా వ్రాసి పంపుతున్నాను.
దాసరి శివకుమారి
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
కొల్లూరి సోమ శంకర్
సుశీల గారి సమీక్ష చాలా బావుంది.
Shaameer జానకి
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
Dr Trinadha Rudraraju
‘మలిసంజకెంజాయ’ పై ప్రొ. సీహెచ్ సుశీలమ్మ చక్కగా సమీక్ష చేశారు. అవునుకదా అన్నట్లుగా వుంది. ప్రొ.సుశీలమ్మగారు మరియు శ్రీమతి గౌరీలక్ష్మి గారికి అభినందనలు.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
కొల్లూరి సోమ శంకర్
సుశీలమ్మగారి వ్యాసం నవల గురించి!
పనిలోపనిగా, ఆవిడ ‘గౌరీలక్ష్మి’ అనే సరస్వతిని కూడా సమీక్షించింది.
ఇది పూర్తి వాస్తవం. నిఖార్సయిన నిజం.
ఈ సమీక్ష కూడా నాకు బాగా నచ్చింది.
క్రింద ఇవ్వబడిన, వ్యాసకర్త భావాలతో 100% ఏకీభవిస్తూ అభినందిస్తున్నాను!
“చెరగని చిరునవ్వు తో, నిండైన ఆత్మవిశ్వాసం తో, స్నేహ సౌరభాలు వెదజల్లుతూ, సున్నిత మనస్తత్వం గల గౌరీలక్ష్మి”
సత్య
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
Durga pakalapati
శ్రీ సుశీల గారి సమీక్ష చాలా బాగుంది.మలిసంజె కెంజాయ నవల లోని ప్రతి పాత్ర గురించి పునఃపరిశీలన కావించారు.రచయిత్రి గారికి,ఇంత అందంగా సమీక్ష వ్రాసిన సుశీల గారికి ధన్యవాదాలు.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
Shyamkumar Chagal
డాక్టర్ సుశీలమ్మ గారి సమీక్ష చదివిన తర్వాత మలిసంజ కెంజాయ చదువుదామని నిర్ణయించుకున్నా.
కానీ సమీక్ష చదివితే అందులోని మనసును కదిలించే విషయాలు అంత బాధాకరంగా ఉంటే ఇక పూర్తి నవల చదివితే ఇంకా ఎంత బాధగా ఉంటుందో కదా అని అనిపించింది.అద్భుతమైన సమీక్ష. Dr సుశీల గారికి అభినందనలు.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
కొల్లూరి సోమ శంకర్
సూక్ష్మ పరిశీలన తో కచ్చితమైన స్పందనలతో ఎంతో పరిపక్వతతో కత్తి అంచున నడిచినంత జాగ్రత్తగా సీరియల్ లోని పాత్రలను వాటి స్వరూప స్వభావాలను… నేటి సమాజపు తీరుతేన్నులను ప్రభావాత్మకంగా చిత్రించి పాఠకుల్ని ఆకట్టుకుని… మలిసంధ్యలో నడవాల్సిన మంచి మార్గాన్ని చూపించారు గౌరీ లక్షి గారు.. ఈ మహాత్తర కార్యంలో నూరు శాతం కృతకృత్యులూ అయ్యారు.. ఈ వస్తువుని ఇంత గొప్పగా హేండిల్ చెయ్యడం వారికే సరిపోయింది… ఆ రచనలోని ఆంతర్యపు పొరల్ని ఒకటోకటిగా వొలిచి చూపించి రచన యొక్క ఔన్నత్యాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింప జేస్తూ.. అనుకరించ మనే రచన యొక్క ఆత్మని హృద్యంగా విప్పి చెబుతూ రచనోద్దేశ్యాన్ని తేటతేల్లం చేశారు సాహితీ మూర్తి సుశీలమ్మ గారు… వారిద్దరికీ మనఃపూర్వక అభినందనలు… ఇంత మంచి రచన ని ప్రచురించిన సంచిక యాజమాన్యానికి ధన్యవాదములు…క్రమం తప్పకుండా చదవ గలగడం భాగ్యం గా భావిస్తూ…






కాశీం బీ. గుంటూరు.
కొల్లూరి సోమ శంకర్
గౌరీలక్ష్మి గారు ‘మలిసంజ కెంజాయ’ నవలని ఎంత గొప్పగా మనోవిశ్లేషణాత్మకంగా రాశారో.. అంత గొప్పగా మేడమ్ సి. హెచ్. సుశీల గారు విశ్లేషించారు. ముఖ్యమైన పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలను ఉదహరిస్తూ అద్భుతమైన సమీక్షను అందించారు. చాలామంది అంతర్జాల పత్రికలను చదవ లేక పోతున్నారనేది నిజం.కాబట్టి రచయిత్రి వీలు చూసుకుని పుస్తకరూపంలో నవలని అందించగలిగితే ఎక్కువ మందికి చదివే అవకాశం కలుగుతుంది.రచయిత్రికి, సమీక్షకురాలికి,ప్రచురించిన సంచిక వారికి అభినందనలు


P. Nagalakshmi
కొల్లూరి సోమ శంకర్
Professor Ch. Suseelamma gari review and analysis on Alluri Gowri Lakshmi gari Malisanjakenjaaya! is very nice. Oka manchi Novelani anduloni patrala teeruni sambhashanalanu, Katha nadipinchina vidhanam gurinchi, Rachayitri gurinchi chakkaga vishlachinci vivarana / Review ivvadam chala santosham. Please convey my thanks to Professor Ch. Suseelamma garu. Regards. K. Rajendra Prasad, Hyderabad.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
Thank you sir.
కొల్లూరి సోమ శంకర్
Good ..good ..very good..I am very happy to follow the novel మలిసంజ కెంజాయ..equally happy with Dr.సుశీల గారి Excellent review.
మారెళ్ళ సావిత్రి
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.